దైవ చిత్తాన్వేషణ

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు శిష్యులు
    Download Formats:

అధ్యాయము 0
పరిచయము

వారి జీవితముల కొరకైన దేవుని యొక్క చిత్తమును కనుగొను విషయములో అనేక మంది క్రైస్తవులు కలవరపడుదురు. వారికి సహాయము చేయుటకు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకము. తప్పిపోని నడిపింపునకు ఎటువంటి ఖచ్ఛితమైన సూత్రము (నియమము) ను ఈ పుస్తకము సమర్పించుట లేదు. ఎందుకనగా బైబిలు కూడా అలాంటిదేమీ ఇవ్వటం లేదు. దేవుని యొక్క నడిపింపును ఆత్మీయ మార్గములో కాకుండా యాంత్రికముగా వెదుకకుండునట్లు మనము జాగ్రత్తగా ఉండాలి.

మీకు జవాబులన్నీ ఇచ్చుట ఈ పుస్తక ఉద్దేశ్యము కాదు. మీరు పరిశుద్ధాత్మ మీద ఎక్కువగా ఆధారపడునట్లు ప్రోత్సహించడమే ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

''మానవులమైన మనము 'పరిపూర్ణమైన' పుస్తకములను వ్రాయలేము'' అని వాచ్‌మన్‌ నీ చెప్పారు. ఇటువంటి పరిపూర్ణతలో గల ప్రమాదమేమిటంటే పరిశుద్ధాత్మ లేకుండా కూడా మనిషి అర్ధము చేసుకోగలడు. అయితే ఒక వేళ దేవుడు మనకు పుస్తకములను ఇస్తే, అవి ఎల్లప్పుడూ విరిగిపోయిన ముక్కలవలె, స్పష్టముగా లేని లేక ఒకేవిధముగా లేని లేక తార్కికముగా లేనివిగా మరియు సంపూర్ణ సారాంశము లేని విధముగా ఉంటాయి. అయినప్పటికీ అవి మన యొద్దకు జీవముతో వచ్చి మనకు జీవమునిస్తాయి. మనము దేవుని యొక్క సత్యములను విభజించి ఒక పద్ధతిలో పొందుపరచలేము. పరిణితి లేని క్రైస్తవుడు మాత్రమే ఎల్లప్పుడు తన జ్ఞానమును సంతృప్తి పరచే సారాంశమును కోరుకుంటాడు. దేవుని వాక్యము ఎల్లప్పుడు మరియు ప్రాముఖ్యముగా ''మన ఆత్మతోను మరియు మన జీవముతోను'' మాట్లాడును. ఇది దేవుని యొక్క ప్రాధమికమైన లక్షణము.

ఈ పుస్తకము కేవలము మీ మనస్సుల(మెదడు)కు విషయ పరిజ్ఞానమును మాత్రమే కాక అన్నింటికంటే ఎక్కువగా మీ ఆత్మకు జీవమునిచ్చును గాక.

ఈ పుస్తకములోని విషయమును గురించిన మాట: ఏ భాగమైనా (పేరాగ్రాఫ్‌) గాని, లేక చివరకు ఏ అధ్యాయమైనా గాని ఈ పుస్తకము మొత్తమును దృష్టిలో పెట్టుకొని చదువనట్లయితే అది సరియైన అర్ధమునివ్వదు. కొన్ని సందర్భాలలో, ఈ పుస్తకములోని ఒక్క వచనమును వదలివేసినా లేక నిర్లక్ష్యముగా చదివినా చెప్పాలనుకున్నదానికి విరుద్ధమైన సందేశము అర్ధము కాబడుతుంది. కాబట్టి ఈ పుస్తకము చదివే వారిని నేను కోరుకొనేదేమిటంటే సందేశమును ఖచ్ఛితముగా అర్ధము చేసికొనుటకు ఈ పుస్తకమును నెమ్మదిగాను మరియు జాగ్రత్తగాను (వీలైతే రెండు సార్లు) చదువవలెను.

బహుశా! రెండవ అధ్యాయము ఈ పుస్తకములో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తమును కనుగొనుటకు మనము షరతులను నెరవేర్చినట్లయితే, అప్పుడు నడిపింపు అనేది తప్పనిసరిగా సులువైన విషయముగా అవుతుంది. మనము నడిపింపబడక అక్కడే ఉన్నట్లయితే, సాధారణముగా ఇది మన జీవితములో నడిపింపు కొరకై నెరవేర్చవలసినది నెరవేర్చకపోవుట వలనే. పరలోకమందు జరుగునట్లుగా ఈ భూమి మీద ఆయన చిత్తమును జరిగించి ఆయనను మహిమ పరచుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ సహాయము చేయునుగాక!

కింగ్‌ జేవ్స్‌ు వర్షన్‌ వారి యొక్క అతి ప్రాచీనమైన భాష మనలను లేఖనముల యొక్క నిజమైన అర్ధమును గ్రహించకుండా చేయకుండునట్లు దానిని నేను ఉపయోగించలేదు. దానికి బదులుగా, ఎత్తి చూపబడిన అన్ని వచనముల (రిఫరెన్స్‌) కొరకు నేను ఆధునిక తర్జుమాలను ఉపయోగించాను. అపోస్తలుల కార్యములు 8:30,31 లో వివరించిన సంఘటన నుండి తీసుకొన్న ఒక విషయమును నేను విన్నాను. ఫిలిప్పు ఐతియోపియా మంత్రిని ఈవిధముగా అడుగుతాడు ''నీవు చదువుచున్నది నీకు అర్ధమవుతుందా?'' . ''నాకు ఎవరొకరు ఆధునిక తర్జుమా ఇవ్వకుండా ఎలా అర్ధమవుతుంది?'' అని అతడు ప్రత్యుత్తరమిస్తాడు.

ప్రత్యేకముగా ప్రస్తావిస్తే తప్ప ఎత్తిచూపబడిన వచనములు (రిఫరెన్స్‌) ఆంప్లిఫైడ్‌ బైబిలు నుండి తీసుకొనబడ్డాయి. క్రొత్త నిబంధన యొక్క జె.బి. ఫిలిప్స్‌ తర్జుమా, కెన్నెెత్‌ టేలర్‌ సులభమైన పదాలతో వాక్యమును వివరించిన ది లివింగ్‌ బైబిలు తర్జుమా( టి.ఎల్‌.బి), న్యూ అమెరికన్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ (ఎన్‌.ఎ.ఎస్‌.బి). ఈ తర్జుమాలనుండి వాక్యములను ఎత్తి చూపుటకు వారు అనుమతించి నందుకు నేను కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.

ఈ పుస్తకము యొక్క అసలు లిఖిత ప్రతిని చూచి ప్రయోజనకరమైన సలహాలిచ్చిన అనేక మంది ప్రభువు యొక్క దాసులకు నేను ఋణపడియున్నాను.

- జాక్‌ పూనెన్‌

అధ్యాయము 1
నీ జీవితము పట్ల దేవుని ఉద్దేశ్యము

దేవుని చిత్తమును నెరవేర్చుటే మానవునికి అత్యధిక గౌరవము మరియు ఆధిక్యత. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులకు బోధించినది ఇదే. తన తండ్రి చిత్తమును నెరవేర్చువారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు (మత్తయి 7:21) అని ఒకసారి ఆయన చెప్పారు. దేవుని చిత్తమును నెరవేర్చువారు మాత్రమే తన నిజమైన సహోదరులు, సహోదరీలు (మత్తయి 12:50) అని కూడా ఆయన చెప్పారు.

అపొస్తలులు కూడా తమ తరములో ఈ విషయమును నొక్కి చెప్పారు. మానవులను దేవుడు పాపము నుండి విముక్తులనుగా చేశాడు తద్వారా వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చగలరని పేతురు ప్రకటించాడు (1 పేతురు 4:1,2). తాను అనాదిగా సంకల్పించిన దివ్య పథాన (మార్గమున) నడవాలనే ఉద్దేశ్యముతో క్రీస్తు యేసునందు దేవుడు విశ్వాసులను నూతనముగా సృష్టించాడని పౌలు చెప్పాడు. అందువలనే, అవివేకులుగా నుండక, వారి జీవితాలలో దేవుని చిత్తమేమిటో తెలిసికోవాలని (ఎఫెసీ 2:10,5:17) ఎఫెసీ క్రైస్తవులను పౌలు హెచ్చరించాడు. దేవుని చిత్తమును సంపూర్ణముగా గ్రహించ గలిగిన వారై యుండాలని కొలస్సీ క్రైస్తవుల కొరకు పౌలు ప్రార్ధన చేశాడు. వారు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని తన తోటి జతపనివాడైన ఎపఫ్రా కూడా ప్రార్ధన చేస్తున్నాడని పౌలు వారితో చెప్పాడు(కొలస్సీ 1:9; 4:12). దేవుని చిత్తమును జరిగించు వారు మాత్రమే నిత్యము నిలుచుదురు (1 యోహాను 2:17) అని అపోస్తలుడైన యోహాను చెప్పాడు.

దురదృష్టవశాత్తు , మన తరములో దేవుని చిత్తమును గురించి నొక్కి చెప్పబడటం లేదు. అందుచేతనే, ఈనాడు సామాన్య విశ్వాసి లోతు, శక్తి లేకుండా యున్నాడు. ప్రజలు కేవలం పాప క్షమాపణ పొందుటకు మాత్రమే యేసు ప్రభువు యొద్దకు రావాలని పిలువబడుతున్నారు. అపోస్తలుల కాలములో దేవుని సంపూర్ణ చిత్తము నెరవేర్చుటకు కావలసిన జీవితమునకు పాపక్షమాపణ ఒక నాందిగా మాత్రమే బోధించబడినది.

దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చ కోరిక గలవాడు గనుక ''దేవుని హృదయానుసారుడు'' అని దావీదు పిలువబడ్డాడు అని అపోస్తలుల కార్యములు 13:22 లో ప్రస్తావించడం జరిగింది. దేవుని చిత్తమును చేయుట నాకు సంతోషమని దావీదే మనకు మరొక చోట చెప్పుచున్నాడు (కీర్తన 40:8). అతడు సంపూర్ణుడు కాదు. అతడు చాలా పాపాలు చేశాడు. కొన్ని తీవ్రమైన పాపాలు చేసినందుకు దేవుడు ఎంతో కరిÄనముగా శిక్షించవలసి వచ్చినది. అయినప్పటికీ, దేవుడు అతనిని క్షమించి, దావీదును బట్టి ఆనందించాడు. ఎందుకనగా దావీదు దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును చేయాలని కోరుకున్నాడు. ఇది, మనలో ఎన్ని బలహీనతలు కలిగియున్నప్పటికినీ, ఒకవేళ మన హృదయములు దేవుని చిత్తమును చేయుట మీదనే దృష్టించినట్లయితే మనము కూడా దేవుని హృదయానుసారులము కాగలమని మనలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది.

యేసు నడచుకొన్నట్లుగా వారు కూడా నడచుకోవాలి, ఆయన మాదిరిని అనుసరించవలెనని విశ్వాసులను క్రొత్త నిబంధన గ్రంథము కోరుచున్నది(1 యోహాను 2:6). యేసు తన యొక్క జీవితములోను, పరిచర్యలోను తండ్రియొక్క చిత్తమును నెరవేర్చుటయే ముఖ్య నియమముగా పెట్టుకొన్నాడు. తన తండ్రి చెప్పేంత వరకూ ఎక్కడకూ వెళ్ళలేదు. తన తండ్రి చిత్త ప్రకారము ఆయన ఎక్కడకైనా వెళ్ళుటకు, తన శత్రువుల యొక్క బెదిరింపులు గాని, తన స్నేహితుల యొక్క విజ్ఞప్తులు గాని, తండ్రి తన నుండి ఏమి కోరుకుంటున్నాడో అది చేయలేకుండా ఆయనను ఆపలేకపోయాయి. తన తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయన అనుదిన ఆహారమైయున్నది (యోహాను 4:34). శరీరమును పోషించుకొనుటకు మనుష్యులు ఏవిధముగానైతే ఆరాటపడతారో, అదేవిధముగా తన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట కొరకు ఆయన తృష్ణగొనియున్నాడు.

దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును నెరవేర్చుటకు ప్రతి విశ్వాసి ఇదేవిధమైన ఆకలి కలిగియుండవలెను. కేవలము మనలను మనము సంతోష పరచుకొంటూ, మన అనుదిన జీవితములో దేవుని యొక్క నడిపింపును వెదకకుండా ''నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక'' అని ప్రార్థన చేయడం ఎంత సుళువు!!

దేవుని ప్రణాళిక శ్రేష్టమైనది

దేవుని యొక్క నడిపింపును కోరుకోకుండా చేసేది అహంకారమే. ఒకవేళ నీవు కారు చీకటిలో, దట్టమైన అడవిలో ఎటు వెళ్ళాలో తెలియకున్నప్పుడు, ఆ అడవి గురించి అణువణువునా తెలిసిన వ్యక్తి మరియు నీవు పూర్తిగా నమ్మదగిన వ్యక్తి ఆ సమయములో నీతో ఉంటే నీవు ఎంతగానో సంతోషిస్తావు. ఆయన ఏ మార్గములో వెళ్ళినా నీవు అతనిని ఏమీ ప్రశ్నించ కుండా సంతోషముతో వెంబడిస్తావు. ఆయన సలహాను నీవు తీసుకొనకుండా ఎన్నో కనబడని ప్రమాదాలు దాగియున్న ఆ దట్టమైన అడవిలో, చీకటిలో నీయంతట నీవే వెళ్ళినట్లయితే అది ఎంతో బుద్ధిహీనమైన పనిగా ఉంటుంది. అయినప్పటికీ అనేకమంది విశ్వాసులు కేవలము ఇటువంటి పనినే చేస్తుంటారు.

మనముందున్న భవిష్యత్తు ఈ భూమి మీద సాధ్యమైన మరి దేనికంటెనూ చీకటిగానున్నది. మన ముందు మనమేమీ చూడలేము. అయినా కూడా మనము ముందుకు పోవలసియున్నది.

మనము మన జీవితములలో కొన్నిసార్లు అనేక రోడ్లు కలిసే కూడలిలోకి వస్తాము. అక్కడ మనము పరిణామాలు ఎంతో దీర్ఘకాలం ఉండే కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మన వృత్తిని, జీవిత భాగస్వామిని ఎంచుకొనుటకు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తంతటినీ ప్రభావితం చేస్తాయి. అటువంటి సమయములలో ఎలా నిర్ణయం తీసుకోవాలి? ప్రతి మార్గములో ఉన్న ప్రమాదములు, కనబడని గుంటలు మనకు తెలియవు. మనకోసం సాతాను వేసిన వలలు గూర్చి మనకు తెలియదు. అయినా కూడా ఏ మార్గమున వెళ్ళాలో మనము నిర్ణయించుకోవలసియున్నది.

ఇటువంటి పరిస్థితులలో మనము నమ్మదగిన వ్యక్తి మరియు భవిష్యత్తు మొత్తము తెలిసిన వ్యక్తి మన ప్రక్కన ఉండాలని కోరుకోవడమే కాదు, అటువంటి వ్యక్తి ఉండుట అవసరం కూడా. యేసు క్రీస్తు ప్రభువులో మనకు అటువంటి వ్యక్తి ఉన్నాడు మరియు మనలను శ్రేష్టమైన, భద్రమైన మార్గములో నడిపించుటకు ఆయన ఆసక్తి కలిగియున్నాడు.

మన జీవితములో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగియున్నాడని బైబిలు మనకు బోధిస్తున్నది ( ఎఫెసీ 2:10). మన వృత్తి విషయమంలోను, జీవిత భాగస్వామి విషయంలోను మరియు మనము ఎక్కడ నివసించాలి, ప్రతిరోజు మనము ఏమి చేయవలెనను విషయములోను ఆయన ప్రణాళిక కలిగియున్నాడు. ప్రతి విషయంలోను ఆయన ఎంపికే శ్రేష్టమైనది. ఎందుకనగా, ఆయన మనలను బాగా ఎరుగును మరియు ప్రతి కారణమును ఆయన పరిగణనలోనికి తీసుకుంటాడు. కాబట్టి ప్రతి చిన్న విషయములోను, పెద్ద విషయములోను ఆయన చిత్తమును వెదకుట జ్ఞాననవంతమైన పని.

మన పరిమితిమైన తెలివితేటలను మరియు మన మానసిక ఉద్రేకములను అనుసరించి వెళ్ళుట బుద్ధిహీనమైనది మాత్రమే కాదు మరియు ప్రమాదకరమైయున్నది. దేవుని ప్రణాళిక మాత్రమే శ్రేష్టమైనదని మనకు ఒప్పుదల లేకపోయినట్లయితే, మనము దాని గురించి ఆసక్తితో వెదుకలేము.

అనేకులు వారి యౌవనదశ నుండే దేవుని చిత్తమును వెదుకుటలో తప్పిపోయి వారి జీవితములను పాడుచేసుకొన్నారు. ''యౌవన కాలమున కాడి మోయుట నరునికి మేలు'' (విలాప 3:27). మత్తయి 11:28-30 లో తన కాడిని మనము మోయవలెనని ఆహ్వానిస్తున్నాడు. కాడిని మోయుట అనగా అర్ధమేమిటి? ఒక ఎద్దుల జత పొలమును దున్నుతున్నప్పుడు, ఆ రెండు ఎద్దుల మెడల మీద ఒక కాడిని ఉంచుతారు. ఒక క్రొత్త ఎద్దుకు దున్నుటలో తర్ఫీదు ఇచ్చేటప్పుడు అనుభవం కలిగిన ఎద్దుతో కలిసి కాడిని పెడతారు. ఆ విధముగా ఆ క్రొత్త ఎద్దు, అనుభవం కలిగిన ఎద్దు ఎటు నడిస్తే అటు మరియు అదే వేగముగా నడువవలసి వస్తుంది.

యేసు క్రీస్తు ప్రభువు కాడిని మనము మోయుట అంటే ఇదే అర్ధము. ఆయనను సంతోషపరచే విధముగా ఆయనతో మనము నడువవలసియున్నది. ఆయన నడిపింపు లేకుండా ఎప్పుడు ఆయనకంటే ముందు పరుగెత్తకూడదు మరియు ఆయనకు విధేయత చూపించుటలో క్రొత్త అడుగు వేయుటకు వెనుదీయకూడదు. కొద్దిమంది మాత్రమే ఈ కాడిని గురించి అర్ధం చేసుకుంటారు. అతి కొద్దిమంది మాత్రమే దీనిని అంగీకరిస్తారు. ఆ ఎద్దు తన యజమాని చేత బలవంతముగా మెడమీద కాడి పెట్టబడినది. కాని యేసు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ ఎటువంటి బలవంతమూ లేదు. ఇటువంటి ఆహ్వానమును తిరస్కరించుటకు మనము ఎంత బుద్ధిహీనులమో కదా! నిజమైన విడుదల మరియు విశ్రాంతి నిచ్చు యేసు యొక్క తేలికైన కాడిని మోయుటకు బదులు ఓటములు, చింతలు మరియు ఒత్తిడులతో కూడిన మన స్వంత చిత్తమనే భారమైన కాడిని మోయుదుము.

''ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి నిచ్చెదను. నా కాడిని మోయుడి...... నన్ను మీకు బోధించనియ్యుడి (అనుభవం కలిగిన ఎద్దు క్రొత్త ఎద్దుకు చెప్పినట్లుగా) మరియు మీ ప్రాణములకు విశ్రాంతిని కనుగొనెదరు; నేను తేలికైన వాటినే మీకిచ్చెదను'' (మత్తయి 11:28,30 ది లివింగ్‌ బైబిలు తర్జుమా).

'' దేవునితో నడిచెను '' (ఆది 5:22) అని హనోకు గురించి మనము చదివాము. అంటే దీని అర్ధము అతడు దేవునికంటే ముందు పరుగెత్తలేదు మరియు వెనుక నడువలేదు, ఒకే కాడిక్రింద ఉన్నట్లుగా దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో 300 సంవత్సరములు నడిచాడు. దానికి ఫలితముగా దేవుడు హనోకు జీవితమును బట్టి సంతోషించినట్లు (హెబ్రీ 11:5) దేవుడే సాక్ష్యమిచ్చాడు. ఆయన సంపూర్ణ చిత్తములో ఆయన కాడిక్రింద జీవించి, నడచుట ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి సంతోషపరచగలము. కేవలము ఈ విధముగా ఆయన ఎదుట నిలువబడి, ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా (చింతించకుండా) ఉండగలము.

దేవుని ప్రణాళిక నుండి తప్పిపోవుట

తన జీవితములో దేవుని యొక్క సంపూర్ణ చిత్తమునుండి తప్పిపోవుట విశ్వాసి జీవితములో సాధ్యమే. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సౌలు ఎన్నుకొనబడ్డాడు, అయితే క్రమేపీ అతని అసహనమును బట్టి మరియు అవిధేయతను బట్టి దేవుడు సౌలును నిరాకరించ వలసి వచ్చినది. అయినా కూడా కొన్ని సంవత్సరాలు అతడు సింహాసనం మీద ఉండుట నిజమే, కాని తన జీవితములో దేవుని చిత్తమునుండి అతడు తప్పిపోయాడు. సొలొమోను దీనికి మరొక ఉదాహరణ. తన జీవిత ప్రారంభ దశలో దేవుణ్ణి అతడు సంతోషపరచాడు, కాని తరువాత అన్యులైన స్త్రీలను వివాహం చేసుకొనుటను బట్టి పడిపోయాడు.

అరణ్యములో నశించిన ఇశ్రాయేలీయుల దృష్టాంతమును గురించి జాగ్రత్త పడవలసినదిగా క్రొత్త నిబంధనలో రెండుసార్లు మనము హెచ్చరించబడ్డాము. వారు కనానులోనికి ప్రవేశించాలనేది వారికోసమైన దేవుని పరిపూర్ణ ప్రణాళిక. ఇద్దరు తప్ప మిగిలిన వారందరు వారి అవిశ్వాసము, అవిధేయతను బట్టి దేవుడిచ్చు శ్రేష్టమైన దానిని వారు కోల్పోయారు (1కొరిందీ¸ 10:1-12; హెబ్రీ 3:7-14), అనేక మంది విశ్వాసులు ఇదేవిధముగా వారి జీవితములలో అవిధేయత ద్వారా మరియు వివాహములో, వృత్తిని ఎంచుకొనే విషయములో రాజీపడుట ద్వారా దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును కోల్పోయారు.

జి. క్రిస్టియన్‌ విస్‌ అనే వ్యక్తి ''ది పర్‌ఫెక్ట్‌ విల్‌ ఆఫ్‌ గాడ్‌'' (దేవుని సంపూర్ణ చిత్తము) అను పుస్తకములో ఈవిధముగా చెప్తాడు - ఒక బైబిలు పాఠశాల ఉపాధ్యాయుడు ఒక రోజు తన విద్యార్ధులకు ఈవిధముగా చెప్తాడు '' నా జీవితములో ఎక్కువ భాగము దేవుని యొక్క రెండవ శ్రేష్టమైన ప్రణాళికలో జీవించాను''. అతడు యౌవనస్తుడుగా ఉన్నప్పుడు మిషనరీగా వెళ్ళమని దేవుడు పిలుస్తాడు కాని అతడు వివాహము చేసుకొనుటను బట్టి ఆ పిలుపును తిరస్కరిస్తాడు. ఆ తరువాత అతడు కేవలము డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యముతోనే స్వార్ధపూరితముగా వ్యాపారం చేస్తూ, బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. దేవుడు ఎన్నో సంవత్సరములు అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు కాని అతడు లోబడలేదు. ఒకరోజు అతని కుమారుడు (చాలా చిన్నవాడు) కుర్చీలోనుంచి క్రిందపడి మరణిస్తాడు. ఆ సంఘటన అతడిని మోకాళ్ళ మీదకు నడిపించినది. రాత్రి మొత్తం దేవుని సన్నిధిలో కన్నీటితో గడిపిన తరువాత తన జీవితము పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. ఇప్పుడు అతడు ఆఫ్రికా వెళ్ళుటకు చాలా ఆలస్యమైనది. ఆ ద్వారము మూయబడినది. తన జీవితములో దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళిక ఏమిటో అతనికి తెలుసు, కాని దాని నుండి అతడు తప్పిపోయాడు. ఇప్పుడు అతడు చేయగలిగినది కేవలము తన మిగిలిన జీవితమును దేవుని ఉపయోగించుకొనుమని అడుగుట మాత్రమే. తరువాత అతడు ఒక బైబిలు పాఠశాలలో ఉపాధ్యాయుడయ్యాడు కాని కేవలము అది దేవుని యొక్క రెండవ శ్రేష్టమైన ప్రణాళికని ఎప్పుడూ మరచిపోలేదు.

జి. క్రిస్టియన్‌ విస్‌ ఇంకా ఇలా చెప్పాడు

''ఈ విధమైన సాక్ష్యం కలిగిన వారిని ఎంతో మందిని నేను కలిశాను. సాధారణముగా ఈ సాక్ష్యములు బాధతో, కన్నీటితో కూడుకొని ఉంటాయి. పాపము చేసిన వారినైననూ మరియు గతములో దేవుని యొక్క చిత్తమును చేరుటకు ఉన్న ఒకే ఒక్క ప్రవేశమును పోగొట్టుకొన్న వారిని కూడా ఉపయోగించుకొనుటకు ఆయనకు మార్గములు కలవు. దీనిని బట్టి దేవునికి వందనములు. కాని ఆయన మొదటిగా కోరుకొనిన విధముగా జీవితము ఎప్పటికినీ ఉండదు. ఒకరి జీవితములో దేవుని యొక్క చిత్తమును కోల్పోవుట అనేది ఎంతో విచారకరం. ఓ క్రైస్తవుడా, ఈ మాటలను, సాక్ష్యమును గమనించు. దేవుని ప్రథమ ఉద్దేశ్యాన్ని పోగొట్టుకుంటావేమో జాగ్రత్త. తనకు అప్పగించుకొనిన ఎవరి జీవితమునైనా మరియు ఏ సమయములో అప్పగించుకొనినా నిస్సందేహముగా దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు. కాని, జీవితారంభములోనే ఆయన చిత్తమునకు మనము సమర్పించుకొని తరువాత వచ్చే బాధాకరమైన మరియు అవమానములనుండి తప్పించుకొనవచ్చు''.

కేవలము మనము కోరుకొన్న ప్రదేశం (స్థానం) లో ఉండి, మనం జయజీవితమును జీవించలేము. లేక దేవునికి సంపూర్ణముగా ఉపయోగపడలేము. లేక ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండలేము. కొంత మంది వారి వృత్తిని ( ఉద్యోగమును) మరియు నివసించే ప్రదేశమును వారే ఎంచుకొని అక్కడ నుండి దేవునికి సాక్షులుగా ఉందామని అనుకుంటారు. అటువంటి వారిని దేవుడు తన కనికరము చొప్పున చాలా పరిమితముగా (తక్కువగా) వాడుకుంటాడు. కాని వారు ఆసక్తితో దేవుని యొక్క ప్రణాళికను కనుగొని మరియు దేవుని యొక్క సంపూర్ణ చిత్తములోనుండి యుంటే ఆయన ద్రాక్షతోటలో ఎంత ఉపయోగపడి యుండే వారో, అందులో చాలా కొద్ది భాగము మాత్రమే ఈ విధముగా ఉపయోగపడతారు. తక్కువ ఆత్మీయ అభివృద్ధి, పరిమిత ఫలములు దేవుని యొక్క నియమములను నిర్లక్ష్యం చేసినందువల్ల వచ్చే పరిణామములు.

ఏదైనా ఒక విషయములో నీవు దేవునికి అవిధేయత చూపించినట్లయితే, ఇంకా ఆలస్యం కాకమునుపే నీవు ఆయన వైపు తిరుగు. యోనా విషయములో జరిగినట్లుగా, నీ జీవితములో దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికకు తిరిగి వచ్చుటకు నీ విషయములో సాధ్యపడవచ్చును.

మనందరికీ ఉన్నది ఒకే ఒక్క జీవితము. దేవుడు నాకిచ్చిన పనిని కడముట్టించితిని అని తన జీవిత చివరి భాగములో చెప్పిన పౌలు వలె చెప్పగలిగిన మనుష్యుడు ధన్యుడు (2 తిమోతి 4:7).

లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలచును (1 యోహాను 2:17).

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి (ఎఫెసీ 5:15-17).

సారాంశము

  1. మానవుని యొక్క ఆధిక్యత మరియు అత్యంత ఘనత దేవుని చిత్తము చేయుటయైయున్నదని యేసుక్రీస్తు ప్రభువు మరియు అపొస్తలులు బోధించారు.
  2. దేవుడు మనలను నడిపించాలని ఎదురుచూస్తున్నప్పుడు మనంతట మనమే మన భవిష్యత్తులోనికి ప్రవేశించుట బుద్ధిహీనమైయున ్నది. ఆయన ప్రణాళిక శ్రేష్టమైనది. ఆయనకు మనము అప్పగించుకొనినట్లయితే, సాతాను యొక్క ఉరుల నుండి మనలను రక్షించును.
  3. నిర్లక్ష్యమును బట్టి కాని, అవిధేయతను బట్టి కాని దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును మనము కోల్పోవుట సాధ్యమే.

అధ్యాయము 2
దేవుని చిత్తమును కనుగొనుటకు షరతులు

దేవునితో మనకు వ్యక్తిగత సంబంధము లేకుండా కేవలము దేవుని యొక్క నడిపింపు పరిగణనలోనికి తీసుకొనబడదు. అనేకులు తలాంతులను (వరములను) కోరుకొందురు గాని తలాంతులను (వరములను) ఇచ్చు వాడను కోరుకొనరు. ఒకవేళ మనము దేవుని నడిపింపు కొరకు మాత్రమే ఆశ కలిగియుండి, దేవుని కొరకు తృష్ణ కలిగిలేనట్లయితే మనము ఆశించుచున్న నడిపింపును పొందలేము.

ఒక వ్యక్తి తన జీవితము కొరకైన దేవుని నడిపింపును అనుభవించుటకు ముందు దేవునితో సహవాసము కలిగియుండాలి. అంటే, నూతన జన్మ ద్వారా క్రీస్తుతో ముఖ్యమైన సంబంధము అతడు కలిగియుండాలి. కాని ఇదొకటే సరిపోదు. మనము దేవుని యొక్క నడిపింపును తెలుసుకోవాలనుకొంటే కొన్ని ఇతర ప్రాముఖ్యమైన షరతులను నెరవేర్చాలి. ఈ షరతులు లేఖనములలోని రెండు వాక్యభాగములలో, ఒకటి పాత నిబంధనలో మరొకటి క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి (సామెతలు 3:5,6; రోమా 12:1,2).

విశ్వాసము

''నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము... అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును'' (సామెతలు 3:5,6).

దేవుడు వారిని నడిపించునని వారు నమ్మరు గనుక అనేకులు దేవుని యొక్క చిత్తమును అర్ధము చేసికొనలేరు. మనము దేవుని యొక్క నడిపింపు కొరకు చూచేటప్పుడు విశ్వాసము ప్రాధమికమైనది. విశ్వాసమంటే సత్యమును కేవలము మనస్సుతో అంగీకరించడము కాదు గాని దేవునిని వ్యక్తిగతముగా యెరుగుట ద్వారా ఆయనయందు ఉంచు నమ్మకము.

మనకు జ్ఞానము (ఏదైనా ఒక పరిస్థితిలో దేవుని యొక్క మనస్సును యెరుగుట) కొదువుగా ఉన్నయెడల దేవునిని అడుగుటకు మనము పిలువబడ్డాము. ఆయన ధారాళముగా మనకిచ్చునని వాగ్ధానము చేశాడు - అది మనము విశ్వాసముతో అడిగితేనే. విశ్వాసము లేకుండా అడుగువాడు ఏమియూ పొందలేడు (యాకోబు 1:5-7).

అనేక సంవత్సరములు ప్రభువులో ఎదిగిన వారికి మాత్రమే దేవుని యొక్క నడిపింపు తెలుస్తుందని చాలామంది యౌవనస్తులైన విశ్వాసులు అనుకుంటారు. మనము ప్రభువుతో ఎంత ఎక్కువగా నడిస్తే, అంత శ్రేష్టముగా ఆయన మనస్సును వివేచించగలమన్న విషయములో ఎటువంటి సందేహము లేదు. అయితే తన పిల్లలందరినీ నడిపించవలెనని దేవుడు కోరుచున్నాడు. పౌలుతో ఏదైతే చెప్పబడినదో మన విషయములో కూడా అది సత్యమే -

''మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును, నిన్ను నియమించియున్నాడు'' (అపొ||కా 22:14).

ఒక తండ్రి కేవలము పెద్ద బిడ్డలతో మాత్రమే కాకుండా చిన్న బిడ్డలతో కూడా తన యొక్క ప్రణాళికలు మరియు కోరికలు సంతోషముగా పంచుకొనును. మన పరలోకపు తండ్రి విషయములో కూడా ఇదేవిధముగా నుండును. ''చిన్నలు మొదలుకొని పెద్దల వరకు'' తన పిల్లలందరూ ఈ క్రొత్తనిబంధన కాలములో వ్యక్తిగతముగా తనను తెలిసికొందురని దేవుని వాక్యములో దేవుడు చెప్పాడు (హెబ్రీ 8:10,11). కాబట్టి మనలో ప్రతి ఒక్కరము తన చిత్తము కొరకు చూచే ప్రతివారికీ ఆయన ఆనందముతో తెలియజేస్తాడనే ''సంపూర్ణ నిశ్చయత గలిగిన విశ్వాసముతో'' ఆయన యొద్దకు రావలెను.

హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడుగా ఉండుట అసాధ్యం అని మనము చెప్పబడ్డాము. దేవుణ్ణి ఆసక్తితో, పట్టుదలతో వెదకే వారికి ఆయన ప్రతిఫలము దయచేస్తాడని ఆయన యొద్దకు వచ్చేవారు నమ్మవలెనని ఇంకా ఈ వాక్యము చెప్పుచున్నది. ప్రార్ధనలో ఒక వ్యక్తికున్న పట్టుదల ఆ వ్యక్తి యొక్క విశ్వాసమును ఋజువు పరుస్తుంది (లూకా 18:1-8 చూడండి). సందేహించువాడు వెంటనే తన ప్రార్ధనను ఆపివేయును. కాని విశ్వసించువాడు తాను జవాబు పొందు వరకు దేవుణ్ణి పట్టుకొనియుంటాడు. పట్టుదల కలిగి యుండుటను దేవుడు ఘనపరుస్తాడు. ఎందుకనగా గొప్ప విశ్వాసము నుండి ఇది పుడుతుంది. మనమెంతో ఆశ కలిగియుంటేనే తప్ప దేవుని యొద్ద నుండి విలువైనదేదీ మనము పొందలేము. ''(కేవలము) ఆశపడే ప్రాణమును ఆయన తృప్తి పరచును'' (కీర్తన107:9). మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు (యిర్మియా 29:13) అని దేవుడు చెప్పాడు. మనము దేవుని యొక్క నడపింపు కొరకు చూచేటప్పుడు తరచుగా అర్ధ హృదయముతో వెదుకుతున్నామన్నది నిజము కాదా? గెత్సెమనె తోటలో తండ్రి చిత్తము కొరకు ప్రభువు చూచినప్పుడు ''మహా రోదనముతోను, కన్నీళ్ళతోను'' ఆయన మరలా, మరలా ప్రార్ధించాడు (హెబ్రీ 5:7). దానితో పోల్చుకొన్నట్లయితే మనమెంత అలసత్వముతో వెదుకుచున్నాము! మనము పోగొట్టుకొన్న ఐదు పైసల నాణెమును ఎంత ఆసక్తితో వెదుకుతామో, అంతకంటే ఎక్కువ ఆసక్తితో మనము దేవుని చిత్తమును వెదకము కాబట్టి మనము కనుగొనలేక పోవుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తము ఎంతో గొప్ప సంపద అని మనము విలువిచ్చినట్లయితే, మన హృదయమంతటితో దానిని వెదికెదము. తనను ఆసక్తితో వెదకువారికి దేవుడు ప్రతిఫలమిచ్చునని మీరు నమ్ముచున్నారా? అప్పుడు మన అత్యాసక్తితో కూడిన ప్రార్ధనలో మన విశ్వాసము బయల్పరచబడుతుంది. మన జీవితములోని ప్రతి విషయములో దేవుని చిత్తమును నెరవేర్చాలనే తీవ్రమైన ఆశను మనము కలిగియున్నట్లయితే, సందేహము లేకుండా దేవుడు తన మనస్సును మనకు బయల్పరుస్తాడు. దేవుని యొద్ద నుండి జవాబు పొందు వరకు ఆయనను గట్టిగా పట్టుకొని యుండు విశ్వాసమును ఆయన ఘనపరచకుండా ఉండలేడు.

బైబిలులో తరచుగా విశ్వాసము, సహనముతో కలసియుంటుంది. దేవుని యొక్క వాగ్దానములు మనము స్వతంత్రించుకొనవలెనంటె మనకు రెండూ అవసరమే (హెబ్రీ 6:12,15). మన మార్గము యెహోవాకు అప్పగించి, ఆయనను నమ్ముకొని, ఆయన యెదుట మౌనముగా నుండి ఆయన సమయము కొరకు కనిపెట్టినయెడల, ఆయన మనలను తక్కువగా చేయడని (కీర్తనలు 37:5,7) దావీదు (ఎటువంటి సందేహము లేకుండా తన స్వంత అనుభవము నుండి) మనలను ప్రోత్సహించు (హెచ్చరించు) చున్నాడు. దేవుని నడిపింపు కొరకు మనము ఎదురు చూచునప్పుడు మనకు ఎదురైయ్యే గొప్ప శోధనేమిటంటే, మనము నిరాశచెంది అసహనమునకు గురవుతాము. కాని విశ్వసించే హృదయము విశ్రాంతిలో ఉంటుంది.

కొన్ని నిర్ణయాలుంటాయి. వాటికొరకు ఖచ్ఛితముగా, స్పష్టముగా ప్రభువు యొక్క మనస్సు తెలిసికొనుటకు మనము వేచియుండ వలసిన అవసరము లేదు. ఉదాహరణకు, ఒక నెలలో 15 లేక 16వ తేదీలలో ఏ తేదీన మనము ప్రయాణము చేయాలి అను దాని కొరకు సాధారణముగా, అనిశ్చితితో మనము దేవుని యెదుట వేచియుండవలసిన అవసరము లేదు.

మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి. వాటి కొరకు ఖచ్ఛితముగా, స్పష్టముగా దేవుని చిత్తము తెలిసికొనే వరకు మనము వేచియుండవలెను. ఉదాహరణకు, వివాహము కొరకు చూచునప్పుడు, నిశ్చయత లేకుండా ఉండుటను మనము తట్టుకొనలేము. మనము నిర్ణయము తీసుకొనే ముందు దేవుని యొక్క చిత్తమును గురించి నిశ్చయముగా తెలిసుకొనుండాలి - ఇంతకు మునుపు దానికంటే, ఇటువంటి నిర్ణయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా, దీని యొక్క పర్యవసానములు దీర్ఘకాలము ఉంటాయి. నిర్ణయము ఎంత ముఖ్యమైనదైతే, అంత ఎక్కువ సమయము మనము దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి.

మనము దేవుని యందు నమ్మికయుంచినట్లయితే, కనిపెట్టుకొని యుండుటకు మనము భయపడము. వేచియుండుట ద్వారా శ్రేష్టమైన దానిని కోల్పోతామేమోననే భయము చేత దేవుని సమయము కంటే ముందుగా మనంతట మనమే వెళ్ళి లాక్కొనుటకు మనము చూడము. ప్రతిదానిలోను శ్రేష్టమైన దానిని మనకొరకు భద్రపరచుటకు దేవుడు ఎంతో సమర్ధుడు. అసహనము చేత మనము లాక్కొన్నట్లయితే, నిశ్చయముగా దేవుని యొక్క శ్రేష్టమైన దానిని మనము కోల్పోతాము. ''విశ్వసించువాడు కలవరపడడు (తొందర పడడు) (యెషయా 28:16) అని బైబిలు చెప్పుచున్నది''.

ఎంతో గొప్ప నడిపింపు కీర్తనయైన కీర్తన 25లో దావీదు పదే, పదే కనిపెట్టుకొని యుండుటను గురించి చెప్పుచున్నాడు (3,5,21 వచనములు). యెహోవా (సమయము) కొరకు కనిపెట్టుకొను వారెవరు అవమానము నొందరు. ''తనకొరకు ఆసక్తితో కనిపెట్టువాని విషయమై తన కార్యము సఫలము చేయు దేవుడు'' (యెషయా 64:4; యెషయా 49:23).

తరచుగా, మనము కనిపెట్టుకొని యున్నప్పుడే దేవుడు తన మనస్సును మనకు స్పష్టముగా తెలియ పరుస్తాడు. ాానడిపింప్ణ్ణు (స్త్రబఱసaఅషవ) అను తన పుస్తకములో, జేవ్స్‌ు మెక్‌ కాంకీ ఈవిధముగా వ్రాస్తాడు. '' కొన్ని సార్లు మీరు కుళాయి నుండి మురికి మరియు మడ్డితో కూడిన నీళ్ళు ఒక గ్లాసు నిండా పట్టినట్లయితే వాటిని ఏవిధముగా శుభ్రపరుస్తారు? ఒక బల్ల మీద ఆ మురికి నీటితో కూడిన గ్లాసును ఉంచుతారు. క్షణక్షణం సమయం గడిచే కొలదీ ఆ మడ్డి, గ్లాసు అడుగు భాగమునకు చేరుతుంది. నెమ్మదిగా నీరు స్వచ్ఛముగా కనబడుతుంది. కొన్ని క్షణముల తరువాత ఆ నీటిలో నుండి ఏదైనా ఒక వస్తువును చూచునంతటి స్వచ్ఛముగా అవుతుంది. కేవలము వేచియుండుట ద్వారా మాత్రమే ఈవిధముగా జరిగింది. నడిపింపు విషయములో కూడా ఇదే నియమము వర్తిస్తుంది. ఇక్కడ కూడా దేవుని యొక్క గొప్ప ఉత్ప్రేరకము వేచియుండుటే...... ఈవిధముగా మనము చేస్తున్న కొద్దీ ఆ మడ్డి నిదానముగా అడుగుకు వెళ్తుంది....... అల్పమైన విషయములు అవి ఉండవలసిన ప్రదేశములో ఉంటాయి. పెద్ద విషయములు వాటి యొక్క ప్రముఖమైన స్థానమునకు వస్తాయి. అన్నిటికీ పరిష్కారము వేచియండుటయే...... దీనిని నిర్లక్ష్యము చేయుట ద్వారానే మనము చేసే అనేక తప్పులు కలుగుతాయి. తొందరపాటు అనేది నడిపింపుకు అవసరమైనది కాకుండా అనేక సార్లు సాతాను వల వలె ఉంటుంది.......

కొన్నిసార్లు మన కలవరపాటు ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఇక ఎటువంటి నడిపింపు మనకు రాదు అన్నట్లుగా ఉంటుంది. అటువంటి సమయములలో రాత్రి వేళ కనిపెట్టుకొని యుండు వారి కోసము కీర్తనా కారుడు తన వాక్యములో ఎంతో విలువైన సందేశమును కలిగియున్నాడు. ' కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటే ఎక్కువగా నాప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది' (కీర్తనలు 130:6). రాత్రి వేళ సూర్యోదయము కొరకు, ఉదయము కొరకు మనుష్యులు ఎలా వేచియుంటారు? దానికి జవాబు నాలుగంతలుగా ఉంటుంది :-

''చీకటిలో వారు కనిపెట్టుకొని యుంటారు. నెమ్మదిగా వచ్చు దాని కొరకు వారు కనిపెట్టుకొని యుంటారు. తప్ప కుండా వచ్చు దాని కొరకు వారు కనిపెట్టుకొని ఉంటారు. అది వచ్చునప్పుడు వెలుగును తెచ్చు దాని కొరకు కనిపెట్టుకొని యుంటారు''.

''నడిపింపు కొరకు వేచియుండే మన విషయములో కూడా ఇదే జరుగుతుంది. తరచుగా మన కలవరపాటు ఎంత విపరీతముగా ఉంటుందంటే, మనము పూర్తిగా అంధకారములో వేచియున్నట్లుగా ఉంటుంది. తరచుగా, మనము వేచియున్నప్పుడు అరుణోదయము కొరకు వేచియుంటున్న వారి వలె, మిణుకు మిణుకుమనే వెలుతురు వస్తున్నట్లు కనబడినా కూడా అయ్యో, అది ఎంతో నెమ్మదిగా వస్తున్నదనిపిస్తుంది! అయినా కూడా అరుణోదయమైనప్పుడు వెళ్ళిపోని రాత్రి ఎప్పటికీ ఉండదు, కనుక అనిశ్చితి అనే మన రాత్రి దేవుని నడిపింపు అనే అరుణోదయముతో తప్పక వెళ్ళిపోతుంది. చివరిగా నెమ్మదిగా వచ్చు అరుణోదయము, చివరకు అది వచ్చునప్పుడు మనకు కొలత లేని వెలుగును, ఆశీర్వాదమును తెస్తుంది. అదేవిధముగా, దేవుడు మనకిచ్చిన నడిపింపు మనకు లభించినప్పుడు, వేచియున్న ప్రాణములు ఎంతో సంతోషించి, చీకటిగా ఉన్న మన మార్గమును ప్రకాశింప చేసినప్పుడు, చీకటిలో మనము వేచియున్న సుదీర్ఘ కాలమును దాదాపుగా మనము మరచిపోతాము''.

తొందరపాటు పడకుండా జాగ్రత్త కలిగియుండాలి. అసహనము అనేది ఎప్పుడూ అవిశ్వాసము నుండే పుడుతుంది. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయుల గురించి ఈవిధముగా చెప్పబడింది. ''ఆయన ఆలోచన కొరకు వారు (ఆసక్తితో) కనిపెట్టుకొనకపోయిరి'' (కీర్తన 106:13). ఆవిధముగా వారు దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన దానిని కోల్పోయారు. అటువంటి విషాదము నుండి దేవుడు మనలను రక్షించునుగాక.

స్వంతము యందు నమ్మికయుంచక పోవుట

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకము... అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును (సామెతలు 3:5,6).

ఆత్మ సంబంధమైన విషయములలో ఎవరైతే తమ స్వంత జ్ఞానమును ఆధారము చేసికొందురో వారు క్రైస్తవ జీవితమునకు సంబంధించిన ప్రాధమికమైన పాఠమును నేర్చుకొనవలసియున్నది. ఒక వేళ అతడు దేవుని మీద ఆనుకొని యుంటే, కేవలము తనకున్న జ్ఞానము దేవుని యొక్క చిత్తమును తెలిసికోకుండా చేయలేదు. కాని గర్వముతో తన స్వంత జ్ఞానము మీద మరియు ముందు చూపు మీద ఆధారపడినట్లయితే తనకున్న జ్ఞానము దేవుని యొక్క చిత్తమును తెలిసికోకుండా చేయును. శరీరమును ఆస్పదము చేసికొనని వాడే నిజమైన విశ్వాసి అని ఫిలిప్పీ 3:3 లో పౌలు చెప్పుచున్నాడు.

పౌలు ఎంతో మేథస్సుగల వాడు, అయినా కూడా తన మీద తాను నమ్మకముంచక దేవుని మీద ఆనుకొనవలసి వచ్చెను. కొరిందీ¸ క్రైస్తవులకు తన స్వంత అనుభవము నుండి పౌలు ఈవిధముగా వ్రాస్తున్నాడు. ''మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే'' (1కొరిందీ¸ 3:18,19). దేవుని చిత్తమును తెలిసికొనుటకు లోక జ్ఞానము ఆటంకముగా ఉండును. కాబట్టి దీనిని విడిచిపెట్టవలెను.

ఈ పై మాటలు తప్పుగా అర్ధం చేసికొనకుండుటకు, నేను ఇంకొంచెం వివరముగా చెప్తాను. లోక జ్ఞానమును నిరాకరించడమంటే, మనకున్న మేథోపరమైన సామర్ధ్యములను ఉపయోగించుకొనవద్దని కాదు. పౌలు తన సామర్ధ్యములను ఉపయోగించుకొన్నాడు. ఇతరులను వారి సామర్ధ్యములను ఉపయోగించుకొనవద్దని పౌలు అంటాడని మనము ఊహించలేము. లోక జ్ఞానమంటే ఇక్కడ చదువు మరియు ఇతరమైనవి నేర్చుకొనుట గురించి చెప్పలేదు. ప్రజ్ఞావంతుడైన పౌలు గాని, అంత జ్ఞానము లేని కొరిందీ¸యులు గాని (పౌలు ఎవరికైతే వ్రాస్తున్నాడో) వీటిని వదిలివేయవలసిన అవసరం లేదు. మనకు జ్ఞానము ఎక్కువున్నా లేక తక్కువున్నా, మన స్వంత జ్ఞానము మీద మనము ఎంత ఆధారపడుతున్నామన్నదే ఇక్కడ చెప్పబడింది. ఇది జ్ఞానము గల వారిని గాని లేక జ్ఞానము లేని వారిని గాని ఒకే విధముగా బాధించే రోగము వంటిది.

బైబిలు, విశ్వాసులను గొర్రెలతో పోల్చి చెప్పినది. గొర్రె బుద్ధిహీనమైన జంతువు, తన మార్గమును తాను తెలిసికొనలేదు మరియు హ్రస్వ దృష్టి గలది (దూర దృష్టి లేనిది). కాపరి ఎక్కడికి వెళితే గొర్రె అక్కడకు వెళ్ళుటలోనే దాని భద్రత ఉన్నది. ఆత్మవిశ్వాసమున్న వ్యక్తి తెలిసికొనుటకు ఇది ఎంతో చిన్నబుచ్చుకునే సత్యము. ఆత్మీయ విషయములలో తాను ఎంత బుద్ధిహీనుడనోనని తెలిసికొనుటకు తనకు వచ్చే సలహాను అతని గర్వం ఎదిరించును. అయినప్పటికీ, మన జీవితములలో దేవుని చిత్తమును తెలిసికొనుటకు మన స్వంతము యందు ఏ మాత్రము నమ్మిక యుంచక పోవుటనేది తప్పించుకొనలేని ప్రాథమికమైన అవసరము. దావీదు ప్రభువు యెదుట గొర్రె స్థానమును తీసుకొని దేవుని నడిపింపును అనుభవించాడు - ''యెహోవా నా కాపరి ................ ఆయన నన్ను నడిపించును ........... ఆయన నన్ను నడిపించును'' (కీర్తన 23:1-3).

మానవుడు తనను తాను తగ్గించుకొని, క్రింది స్థానమును తీసుకోక పోయినట్లయితే, దేవుని మార్గములను తెలుసుకొనలేడు. ''దీనులుగా తన వైపు తిరిగిన వారికి దేవుడు యదార్ధమైన, శ్రేష్టమైన మార్గములను బోధించును'' (ది లివింగ్‌ బైబిలు తర్జుమా) అని కీర్తన 25:9 లో దావీదు చెప్పెను. లోకంలోని మనుష్యునికి ఆత్మవిశ్వాసము ఉంటే సరే గాని దేవుని బిడ్డకు మాత్రము అది తగదు. ఈ కారణమును బట్టే అనేక మంది విశ్వాసులు వారి జీవితముల కొరకైన దేవుని ప్రణాళికను తప్పిపోవుదురు. వారి స్వంత శక్తి సామర్ధ్యాల మీద నమ్మకముంచినందున, దేవుని చిత్తమును ఆసక్తితో వెదుకరు. దేవుని చిత్తమునకు బదులుగా వారి స్వంత జ్ఞానము మీద ఆధారపడుట ద్వారా నాశనమునకు వెళ్ళుదురు.

మనము మన హృదయముల యొక్క భ్రష్టత్వమును మరియు నమ్మదగని, తప్పు చేయుటకు అవకాశము గల తెలివి తేటలను మనము చూచునట్లుగా దేవుడు మన జీవితములలో తరచుగా మనము ఓడిపోవునట్లుగాను మరియు కలవరములో ఉండునట్లుగాను అనుమతిస్తాడు. ఆవిధముగా మనము ఆయనను దగ్గరగా హత్తుకొన వలసిన అవసరమును నేర్చుకొంటాము. తన శిష్యులకు ప్రభువు నేర్పించడానికి చూచిన అతి ప్రాముఖ్యమైన పాఠము ఏమిటంటే ఆయన లేకుండా వారు ఏమి చేయలేరనునది (యోహాను 15:5). వారు దీనిని నేర్చుకొనుటలో ఎంతో నెమ్మదిగా ఉన్నారు: మనము కూడా ఆ విధముగానే ఉన్నాము.

ఒక దీనుడైన వ్యక్తి తన పరిమితులను గుర్తించి, దేవుని మీద ఎంతగానో ఆనుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుని చిత్తమును నిశ్చయించుకొనును. మరొక విధముగా, తన మీద తనకి నమ్మకమున్న వేదాంత పండితుడు, వేదాంత కళాశాల తర్ఫీదు మీద ఆధారపడి, దేవుని చిత్తమును చూడకుండునట్లు చీకటిలో వదలివేయబడును.

ప్రతి విషయములోనూ విధేయత చూపుట

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును (సామెతలు 3:6).

కొన్ని సార్లు మనము మన జీవితములలో ఏదో ఒక విషయములో దేవుని నడిపింపును తెలిసుకొనుటకు ఆతురత పడతాము. ఇతర విషయాలలో ఆయన నడిపింపును మనము తెలిసుకొనుటకు ఆశపడము. ఉదాహరణకు, వివాహ విషయములో దేవుని చిత్తమును ఆసక్తితో మనము వెదుకుచుండవచ్చును గాని ఉద్యోగము విషయములో ఆవిధముగా చూడకపోవచ్చు. లేక ఉద్యోగ విషయములో దేవుని చిత్తమును వెదుకుచూ వివాహ విషయములో వెదుకక పోవచ్చును. లేక బహుశా! మన సంవత్సరాంతపు సెలవులను ఎక్కడ గడపాలని దేవుని నడిపింపు కొరకు చూడవచ్చును కాని మన డబ్బును ఏవిధముగా ఖర్చు పెట్టాలో అడగకపోవచ్చును.

మనకు సౌకర్యముగా నున్నప్పుడే దేవుని చిత్తమును కావాలని మనము కోరుకొనుటను బట్టి ఈ విధముగా జరుగుతుంది. స్వార్ధపూరితమైన ఉద్దేశ్యములు మన హృదయములలో దాగి ఉండి, మనకు తెలియకుండా ఉంటాయి. కొన్ని విషయాలలో మనము దేవుని చిత్తము కొరకు ఎందుకు చూస్తామంటే మనము తప్పు చేయకుండా ఉండాలని; దాని ద్వారా మనకు నష్టము కాని కష్టము కాని కలుగకూడదని చూస్తాము. మనము దేవుణ్ణి సంతోషపరచాలని కాకుండా మనము సౌఖ్యముగా ఉండి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యముతో చేస్తాము. కావున మనము దేవుని నడిపింపును పొందుటలో తప్పిపోతున్నాము. తమ మార్గములన్నింటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొని, వారి జీవితములోని ప్రతి విషయములో ఎవరైతే దేవుని నడిపింపును సంతోషముతో అంగీకరిస్తారో వారిని మాత్రమే ఆయన నడిపిస్తానని వాగ్ధానం చేశాడు.

అనేక విషయములకు సంబంధించి దేవుని చిత్తము ఇప్పటికే లేఖనములలో మనకు బయల్పరచబడినది. ఉదాహరణకు, మనము పరిశుద్ధులుగా ఉండి, కృతజ్ఞులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని బైబిలు చెప్పుచున్నది:

''మీరు ప్రతిష్టించుకొని - ప్రత్యేకపరచుకొని పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము..... ''
ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి - అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, కృతజ్ఞత కలిగియుండుము మరియు కృతజ్ఞత చెల్లించుము; క్రీస్తు యేసులో ఉన్న మీ (ఎవరైతే ఉంటారో) కొరకు ఇది దేవుని చిత్తము (1 థెస్స 4:3; 5:18).

అదే విధముగా, మనవలే మన పొరుగువారిని మనము ప్రేమించవలెనని దేవుడు ఆశిస్తున్నాడని మనము చెప్పబడ్డాము (రోమా 13:9). మనము దేవుని యొక్క క్షమాపణను మరియు రక్షణను పొందినట్లయితే మన పొరుగువారు కూడా అదే విధముగా పొందాలని మనము కోరుకోవాలి. దేవుని యొక్క చిత్తము క్రొత్త నిబంధనలో స్పష్టముగా బయల్పరచబడినది. మనము ఆయనకు సాక్షులుగా ఉండవలెను (అపొ||కా 1:8).

మన పొరుగు వారిని ప్రేమించడమంటే, మొట్టమొదట వారి ఆత్మీయ అవసరతలను పట్టించుకొనుట. అయితే వారి ఇతర అవసరతలను పట్టించుకొనవద్దని కాదు.

నీ ఆహారము ఆకలిగొనిన వారికి....వస్త్ర హీనునికి వస్త్రములిచ్చుటయు..... ఈలాగున నీవు చేసిన యెడల దేవుడు తన మహిమకరమైన వెలుగును నీ మీద ప్రకాశింపజేయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొఱ్ఱపెట్టగా ఆయన - నేనున్నాననును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తి పరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును (యెషయా 58:7-11 - ది లివింగ్‌ బైబిలు తర్జుమా) అని దేవుడు చెప్పెను.

ఎవరైతే నిస్వార్ధముగా నుండి, ఇతరుల అవసరతల గురించి పట్టింపు కలిగియుంటారో వారికి తన మనస్సును తెలియజేయుటలో దేవుడు సంతోషించును.

ఇప్పటికే దేవుడు తన చిత్తమును బయలుపరచిన విషయములలో మనము విధేయత చూపుటకు తప్పిపోయినట్లయితే వేరే విషయములలో దేవుడు మనలను నడిపించునని మనము ఆశించలేము. ఇప్పటికే తనకున్న వెలుగును విస్మరించిన వానికి దేవుడు ఇంకా తన వెలుగును ఇవ్వడు. ఇది దేవుని నడిపింపు యొక్క నియమము. మనము మొదట అడుగు వేయకుండా రెండవ అడుగును దేవుడు మనకు చూపించడు. ''నీవు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్న కొద్దీ, నీ మార్గమును సరాళము చేయుదును'' అని ఆయన వాగ్దానము చేయుచున్నాడు (సామెతలు 4:12 - వివరించబడినది). మన ప్రతి అడుగు పట్ల దేవుడు ఆసక్తి కలిగియున్నాడు.

ఒకని (మంచి వాని) నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును (కీర్తన 37:23).

విధేయత గల వారిని నడిపించుటకు మరొక వాగ్ధానము ఇక్కడున్నది:

నీకు ఉపదేశము చేసెదను (ప్రభువు చెప్పుచున్నాడు). నీవు నడవవలసిన శ్రేష్టమైన మార్గమును నీకు బోధించెదను; నీ మీద దృష్టి యుంచి నీకు ఆలోచన చెప్పెదను (కాని) బుద్ధి జ్ఞానములు లేని గుఱ్ఱము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి (కీర్తన 32:8,9 - ది లివింగ్‌ బైబిలు తర్జుమా).

గుఱ్ఱం ఎప్పుడూ సహనము లేకుండా యుండి ముందుకు పరుగెత్తుటకు ప్రయత్నిస్తుంది. అయితే కంచర గాడిద ఎప్పుడూ మొండిగా ఉండి ముందుకు వెళ్ళుటకు నిరాకరిస్తుంది. ఈ రెండు వైఖరులను మనము తొలగించుకొనాలి.

మనము అవిధేయత చూపినప్పుడు దేవుడు మన మనస్సాక్షి ద్వారా మాట్లాడును. కాబట్టి ఎల్లప్పుడూ మనస్సాక్షి యొక్క స్వరమును వినుటకు జాగ్రత్త పడాలి.

నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును (లూకా 11:34) అని యేసు చెప్పెను.

కన్ను అని దేని గురించి యేసు ప్రభువు చెప్పుచున్నాడు? మత్తయి 5:8 లో దేవుని (ఆత్మ) దర్శనమును హృదయ శుద్ధితో ఆయన కలిపాడు. కాబట్టి ఇక్కడ కన్ను అంటే మనస్సాక్షిని సూచిస్తుంది. మనము దీనికి క్రమము తప్పకుండా విధేయత చూపినట్లయితే, ఇది హృదయ శుద్ధికి దారి తీస్తుంది.

కేవలము మనస్సాక్షి మాత్రమే ప్రభువు యొక్క స్వరము కానేరదు. మనస్సాక్షి అనేది ఒక వ్యక్తి తన జీవితంలో కలిగియున్న నియమములను బట్టి అవగాహన కలిగియుండి, మలచబడుతుంది. కాని బైబిలు యొక్క బోధకు ఎల్లప్పుడూ విధేయత చూపిస్తున్న కొలదీ, దేవుని యొక్క ప్రమాణములను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. మన మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుకొన్నట్లయితే, మన జీవితములలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది - ఆవిధముగా ఆయన చిత్తమును మనము తెలుసుకొనవచ్చును అని లూకా 11:34 లో వాగ్దానమున్నది. మన అనుదిన జీవితములలో, మనస్సాక్షి యొక్క స్వరము వినుటకు తప్పిపోయినట్లయితే, దేవుని యొక్క నడిపింపును వెదికేటప్పుడు ఆత్మ యొక్క స్వరమును వినుటలో మనము తప్పిపోతాము. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో వెంటనే దానికి విధేయత చూపుట అనేది నడిపింపులో గల ఒక రహస్యము.

కొద్ది కాలము క్రితము, 15 సంవత్సరములు వయస్సు గల పుట్టు గ్రుడ్డి వాడైన ఒక బాలుడు విమానములో ఎగిరి దానిని భద్రముగా దించినట్లుగా నేను చదివాను. ఇటువంటి అసాధారణమైన సాహసం, తనకు సూచనలిచ్చు పైలెట్‌ ఇచ్చు ఆజ్ఞలకు వెంటనే విధేయత చూపడం ద్వారానే చేయగలిగాడు. జీవితములో అనేక సమస్యలు మనము ఎదుర్కొంటున్నప్పుడు, ఒక గ్రుడ్డివాడు తనకు తెలియని మరియు కనబడని మార్గములో విమానమును దించుటకు ప్రయత్నించినట్లు మనకు అనిపించవచ్చును. కాని దేవుని యొక్క ఆజ్ఞలకు వెంటనే విధేయత చూపించుట మనము అలవాటు చేసుకొనినట్లయితే, మనము భద్రముగా దిగివచ్చెదము.

షరతులు లేకుండా అప్పగించుకొనుట

పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి....... ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో (మీరు) పరీక్షించి తెలిసికొనెదరు ....... (రోమా 12:1,2).

మనము ప్రభువుకు దాసుల (జీవితకాల బానిసలు) ముగా కావలెనని క్రొత్తనిబంధన మనలను హెచ్చరించుచున్నది. పౌలు తనను యేసు క్రీస్తు ప్రభువుకు దాసునిగా ఇష్టపడి పిలుచుకున్నాడు. పాత నిబంధనలో రెండు రకములైన దాసులు ఉండేవారు. దాసుడు (జీవిత కాలపు బానిస) మరియు జీతమునకు పెట్టుకొన్న సేవకుడు. దాసునికి సేవకుని వలె జీతము ఇవ్వబడదు. అతడు తన యజమాని చేత వెలపెట్టి కొనబడతాడు - కాబట్టి దాని ఫలితముగా, అతడు మరియు అతనికి కలిగినదంతయు తన యజమానుడికి చెందుతుంది. ప్రతి యొక్క విశ్వాసి తనకు తానుగా ఈవిధముగా గుర్తించబడవలెను. మనము సిలువలో విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన సమయము, ధనము, తలాంతులు, కుటుంబములు, ఆస్తులు, మనస్సులు, శరీరములు - సమస్తము - మన ప్రభువు మరియు యజమానుడైన ఆయనకే చెందుతాయి (1 కొరిందీ¸ 6:19,20).

కాబట్టి దేవునికి మన శరీరములను ఒక్కసారే సజీవయాగముగా పాత నిబంధనలోని దహనబలి అర్పించినట్లుగా అర్పించమని మనము హెచ్చరింపబడ్డాము. దహనబలి, పాప పరిహారార్ధబలి వలె కాకుండా సమస్తమును దేవునికి అర్పించును మరియు అర్పించువాని సంపూర్ణ ప్రతిష్టతను అది చూపించును. ఒక వ్యక్తి దహనబలి అర్పించినప్పుడు, తిరిగి అతడు ఏమీ తీసుకోలేడు (పొందలేడు). ఆ అర్పణ యెడల దేవుడు తనకిష్టమొచ్చినట్లు చేయును.

"తండ్రీ, నా చిత్తము కాదు మీ చిత్తమే నెరవేర్చబడును గాక''

అని తన తండ్రితో చెప్పి తనంతట తాను తండ్రికి అప్పగించుకొనిన కలువరి సిలువకు ఇది సాదృశ్యము. మన శరీరములను సజీవయాగముగా అర్పించుట అనగా అర్ధము ఇదే: ఆయన చేత మన శరీరము (దేహము) ఎక్కడ, ఎలా ఉపయోగించబడాలి అనే విషయములో మన స్వంత చిత్తమునకు మరియు ఇష్టములకు చనిపోవాలి. ఆవిధముగా మాత్రమే మనము ఆయన చిత్తమును తెలిసికొనగలము.

సాధారణముగా అటువంటి అప్పగింపు (లోబడుట) తక్కువగా ఉండుటే మనము దేవుని చిత్తమును నిశ్చయపరచుకొనలేక పోవుటకు ముఖ్య కారణము. మనము ప్రభువుకు అప్పగించుకొనే విషయములో అనేకసార్లు రిజర్వేషన్లు (పరిమితులు,షరతులు) కలిగియుంటాము. దేవుడిచ్చు దేనినైనా అంగీకరించుటకు మనము నిజముగా సిద్ధపడియుండము.

పూర్తి కాలపు సేవ తప్ప ఎటువంటి వృత్తి (ఉద్యోగము) నైనా స్వికరించుటకు ఇష్టపడిన ఒక సహోదరుణ్ణి ఒక సారి నేను కలిశాను. ఈ రిజర్వేషనే (షరతే) తన జీవితము పట్ల దేవుని యొక్క ప్రణాళికను స్పష్టముగా తెలుసుకోకుండా చేస్తుందని చెప్పాను. చివరకు ఆయన ప్రభువుకు సంపూర్ణముగా అప్పగించుకొనినప్పుడు, వెంటనే దేవుని యొక్క చిత్తమును గూర్చిన లోతైన నిశ్చయతను పొందాడు. దేవుడు అతనిని పూర్తి కాలపు క్రైస్తవ సేవకు పిలువలేదు గాని అతడు సిద్ధపడి యుండాలని దేవుడు కోరుకున్నాడు.

దేవుని చిత్తము కనుగొనాలనే మాటలతో దేవుని యొద్దకు వచ్చు అనేక మంది వారు ముందే ఏర్పరచుకొన్న తమ మార్గములకు ఆయన ఆమోదం కోసం మాత్రమే వస్తారు. కావున వారు ఆయన యొద్దనుండి ఎటువంటి జవాబును పొందలేరు.

"ప్రభువా నీవు, ఇది నీ చిత్తము అని నాకు నిశ్చయత కలుగజేసినట్లయితే, నేను దేనినైనా అంగీకరించుటకు సిద్ధముగా ఉన్నాను. నా ప్రభువా, నా కొరకు నీవే ఎంపిక చేయి. ఈ విషయములో నాకు ఎటువంటి ఎంపిక లేదు''

అని చెబుతూ ఎటువంటి రిజర్వేషన్‌ (షరతు) లేకుండా మనము ప్రభువుకు అప్పగించుకొనినట్లయితే, ఎంత త్వరగా మన నడిపింపునకు గల సమస్యలు పరిష్కారమవుతాయో కదా! దేవుని కోసం ఏ సమయములోనైనా, ఎక్కడికైనా, ఏదైనా చేయగల అబ్రాహాము సిద్ధపాటే ''దేవుని స్నేహితుడు'' గా అతనిని చేసినది.

బ్రిస్టర్‌ (ఇంగ్లాండు) దేశస్తుడైన జార్జ్‌ముల్లర్‌ ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి మరియు దేవుని చిత్తమును ఎంతో ఖచ్ఛితముగా నిశ్చయపరచుకొనే వాడు. ఆయన ఈవిధముగా చెప్పాడు.

''నేను దేవుని చిత్తము కొరకు చూస్తున్న విషయములో మొట్టమొదటగా నా హృదయమునకు తన స్వంత చిత్తము ఏమియు లేనటువంటి స్థితి వచ్చువరకు నేను చూస్తాను. మనుష్యులతో నూటికి తొంభై శాతం సమస్య ఇక్కడే ఉంటుంది. దేవుని చిత్తమేదైనా చేయుటకు ఎప్పుడైతే మన హృదయములు సిద్ధపడియుంటాయో అప్పుడు నూటికి తొంభై ఇబ్బందులు తొలగించబడతాయి. ఎప్పుడైతే నిజముగా ఇటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఉంటాడో, సామాన్యముగా, ఆయన చిత్తమేదో తెలుసుకొనుటకు ఇది ఒక చిన్న మార్గము''.

విధేయత చూపించాలా? లేదా? అని నిర్ణయించుకొనక మునుపే దేవుని చిత్తమును తెలుసుకొనవలెనని కొందరు కోరుకుంటారు. అయితే, అటువంటి వారికి దేవుడు తన చిత్తమును బయల్పరచడు.

ఎవడైనను ఆయన చిత్తమును చేయ నిర్ణయించుకొనిన యెడల ........ వాడు తెలిసికొనును - (యోహాను 7:17).

దేవుడు ఆజ్ఞాపించునది ఏదైననూ సరే చేయుటకు మనకు కలిగిన సిద్ధపాటు మాత్రమే దేవుని పరిపూర్ణ చిత్తమేదో తెలిసికొనుటకు అర్హతగా ఉండును. ఇది చిన్న విషయములకు మరియు పెద్ద విషయములకు కూడా వర్తించును.

నూతన పరచబడిన మనస్సు

''మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి'' (రోమా 12:2).

లోకత్వము మన ఆత్మ యొక్క చెవులను మూసివేసి మనలను దేవుని స్వరము వినకుండా చేస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈ లోకాత్మ చేత ప్రభావితం చేయబడతాడు. దాని ప్రభావము నుండి ఎవరూ తప్పించుకోలేరు. మనము విన్నదాన్ని బట్టి, చూచిన దాన్ని బట్టి మరియు చదివిన దానిని బట్టి మన చిన్నతనము నుండే మనలో ప్రతి ఒక్కరము ఈ లోకపు ఆత్మను దినదినము ఎంతో ఇముడ్చుకుంటాము. ప్రత్యేకముగా ఇది మన మనస్సుల మీద ప్రభావము చూపుతుంది. మరియు మన ఆలోచనా విధానమును కూడా ప్రభావితము చేస్తుంది. అప్పుడు మనము ప్రాథమికముగా ఈ లోకములోని విషయములను పరిగణనలోనికి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటాము.

''క్రొత్తగా జన్మించినప్పుడు'' మనలో నివసించుటకు వచ్చిన దేవుని ఆత్మ ఈ లోకపు ఆత్మకు విరోధముగా ఉంటాడు. కాబట్టి మన ఆలోచనా విధానమును పూర్తిగా నూతన పరచాలని కోరుకుంటున్నాడు. ఆయన కుమారుని యొక్క స్వారూప్యములోనికి మారడమే మనయెడల దేవునికున్న అంతిమ ఉద్దేశ్యము.

ఇది మనందరి కొరకైన ఆయన చిత్తములోని ప్రాథమిక భాగము. మిగిలినదంతా - అనగా మనము ఎవరిని వివాహము చేసుకోవాలి, మనము ఎక్కడ నివసించాలి మరియు ఎక్కడ పనిచేయాలి అనేది రెండవది. మనము యేసు వలె మారుటకు - దేవుడు మనలను నిర్వహించే విషయములన్నీ దీనికొరకే (రోమా 8:28 మరియు 29 చూడండి). అయితే మన మనస్సులను పరిశుద్ధాత్మ అనుదినము రూపాంతరము చెందించుటకు మనము అనుమతిస్తేనే ఇది నెరవేర్చబడుతుంది. ఈ విధముగా ఎంతైతే మన మనస్సులు రూపాంతరము చెందుతాయో అంత ఖచ్ఛితముగా జీవితము యొక్క కూడలి (క్రాస్‌ రోడ్స్‌) లో దేవుని యొక్క చిత్తమును మనము వివేచించగలము.

లోకత్వము అంటే ఏదో బాహ్యముగా చేసేది కాదు అంటే సినిమాలకు వెళ్ళడం, ఆల్కహాల్‌ త్రాగడం, పొగ త్రాగడం, ఖరీదైన మరియు ఫ్యాషన్‌గా ఉండే దుస్తులు ధరించడం, మరియు బంగారు నగలు ధరించడం లేక దుబారాగా జీవించడం. ఇవి ఒక లోక సంబంధమైన వ్యక్తిని వ్యక్తపరచ వచ్చును గాని, తన లోకపు ఆలోచనా విధానమునకు బాహ్యసంబంధమైన వ్యక్తీకరణ మాత్రమే. ఈ లోక మర్యాదను అనుసరించుటమనేది ముఖ్యముగా ఒక వ్యక్తి యొక్క మనస్సులో ఉంటుంది. ఇది అనేక మార్గాలలో కనబడుతుంది. ముఖ్యముగా తన నిర్ణయాలలో కనబడుతుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగమును గాని లేక వృత్తిని (షaతీవవతీ) గాని చూస్తున్నప్పుడు, ఒక లోక సంబంధమైన వ్యక్తి, జీతము, పదోన్నతికి గల అవకాశాలు, సౌఖ్యం, సులభం, సౌకర్యం వీటన్నింటిని బట్టి నడిపించబడతాడు మరియు ఒక వివాహము కొరకు చూస్తున్నప్పుడు కుటుంబ ప్రతిష్ఠ, కులం, కట్నం, స్థానం, భౌతిక సౌందర్యం, లేక సంపద అను వీటన్నింటిని బట్టి ప్రభావితము చేయబడతాడు.

మరొక విధముగా ఒక విశ్వాసి యొక్క నిర్ణయాలు, వేరే విషయాలు నిర్లక్ష్యం చేయనప్పటికీ, ముఖ్యముగా ఆత్మీయ కారణములను బట్టి నడిపించబడతాయి. దేవుని నామమునకు మహిమ మరియు ఆయన రాజ్య విస్తరణ మనము మొట్ట మొదటిగా పట్టించుకోవాలి. ఇందుకే ప్రభువు మనలను మొట్ట మొదట ఈవిధముగా ప్రార్ధించమని చెప్పాడు. ''నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక'', '' అప్పుడు మాత్రమే నీ చిత్తము నెరవేరును గాక''.

మనము దేవుని చిత్తమును కనుగొనాలంటే లోక సంబంధమైన ఉద్దేశ్యములను గ్రహించి, తొలగించుకోవడం ఎంతో ప్రాముఖ్యం. మన ఉద్దేశ్యములు స్వార్ధపూరితముగా ఉండి 'దేవుడు నన్ను నడిపించాడు' అని చెప్పడం దేవ దూషణే. దేవుని నామమును వ్యర్ధముగా వాడుకొనకుండా మరియు మన లోకత్వమునకు ఆత్మీయత అనే వస్త్రమును కప్పకుండా దానికి బదులు ఆ నిర్ణయము నేనే తీసుకున్నాను అని చెప్పడం మంచిది. మనము దేవుని చిత్తమును చేస్తున్నామని ఇతరులను (లేక మనలను మనమే) ఒప్పించుట వలన మనకేమీ రాదు. దేవుడు మోసగించబడడు.

ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్ధోషములుగా కనబడును గాని యెహోవా ఆత్మలను పరిశోధించును (ప్రభువు దృష్టిలో సరియైనదా?) .... ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను (ఉద్దేశ్యములను) పరిశీలన చేయువాడు (సామెతలు 16:2; 21:2 ది లివింగ్‌ బైబిలు తర్జుమా).

మన మనస్సులు నూతనమగుట ద్వారా మనము ప్రభువు వలె ఆలోచించి, మరియు ప్రభువు, పరిస్థితులను మరియు ప్రజలను ఏవిధముగా చూస్తాడో ఆవిధముగా చూచుట ప్రారంభిస్తాము. పౌలు యొక్క మనస్సు ఎంతగానో నూతనమగుటను బట్టి తాను క్రీస్తు యొక్క మనస్సును కలిగియున్నాడని మరియు శరీరరీతిగా ఏ మనుష్యుని కూడా చూడను (1కొరిందీ¸ 2:16; 2 కొరిందీ¸ 5:16) అని చెప్పుచున్నాడు. కొలస్సీ విశ్వాసులు కూడా ఈ విధముగానే మార్పు చెందాలని పౌలు ప్రార్ధన చేశాడు.

మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గల వారునై అన్ని విషయములను దేవుని దృష్టితో చూడగలుగు వారును కావలెనని దేవుని బతిమాలుచున్నాను ( కొలస్సీ 1:9 -జెబిపి తర్జుమా).

మన మనస్సులు ఇటువంటి రూపాంతరము పొందుట ద్వారా ప్రభువును ఏది సంతోష పెడుతుందో, ఏది సంతోష పెట్టదో మనకు తెలుస్తుంది.ఈ విధముగా మనము ఎదుర్కొంటున్న వివిధ పరిస్థితులలో దేవుని చిత్తమును సులభముగా గ్రహించగలము. క్రొత్త నిబంధన యుగములో దేవుడు మనకిచ్చిన వాగ్దానము:

ఇదే క్రొత్త నిబంధన (ఒడంబడిక) .......... వారి మనస్సులలో నా థర్మ విధులను వ్రాసెదను తద్వారా నేను వారికి చెప్పకుండానే వారిని నేనేమి చేయమని కోరుచున్నానో దానిని తెలుసుకొందురు. ........... వారెల్లప్పుడు నా చిత్తము తెలుసుకొను లాగున నా థర్మ విధులను వారి హృదయములలో వ్రాసెదను (హెబ్రీ 8:10; 10:16 - ది లివింగ్‌ బైబిలు తర్జుమా).

ఆ విధముగా నూతన పరచబడుట అనేది దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానమును మాత్రమే కాక ఆయన యొక్క ఉద్దేశ్యము మరియు ఆయన పద్ధతులను కూడా తెలియ జేస్తుంది - అంటే దేవుడు మనల్ని ఏమి చేయమని కోరుతున్నాడో అది మాత్రమే కాక దానిని ఏవిధముగా చేయమని కోరుతున్నాడు మరియు ఎందుకు చేయమంటున్నాడో కూడా మనము తెలుసుకుంటాము. దేవుని యొక్క ఉద్దేశ్యములకు మనము విలువ ఇవ్వనట్లయితే దేవుని చిత్తము చేయుట ఎంతో కష్టముగా (వెట్టి చాకిరిగా) ఉంటుంది. ఎప్పుడైతే మనము విలువ ఇస్తామో అప్పుడు దేవుని చిత్తము యేసుకు ఎలా అయితే సంతోషముగా ఉందో మనకు కూడా అలానే ఉంటుంది. దేవుని స్వభావమును గూర్చి మనకు తెలియక పోవుట వలనే మనము ఆయన చిత్తమునకు భయపడతాము. మనము ఆయనను యెక్కువగా తెలుసుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞాపించిన ప్రతి దానిని చేయుటకు ఎంతో సంతోషిస్తాము.

మన మనస్సులు ఎలా నూతనపరచబడతాయి? తన భర్త హృదయానికి దగ్గరగా జీవించే ఒక భార్యకు ఆయన మనస్సు గురించి మరియు మార్గములను గురించి సంవత్సరములు జరుగుచున్న కొలదీ ఎక్కువగా తెలుస్తుంది. ఒక విశ్వాసికి మరియు అతని దేవునికి మధ్య కూడా ఇది వర్తిస్తుంది. క్రొత్తగా జన్మించడం అనేది యేసు ప్రభువుతో జరిగిన వివాహము లాంటిది. అక్కడ నుండి అనుదినము ఆయనతో మాట్లాడుచూ, సన్నిహిత సహవాసముతో నడవాలి.

ఆయన వాక్యము ద్వారా మరియు మన జీవితములో ఆయన ఆనుమతించు పరిస్థితులను బట్టి చేయు క్రమ శిక్షణ ద్వారా మనము ఆయనను మన హృదయములతో మాట్లాడనివ్వాలి. ఆవిధముగా మనము మన ప్రభువు యొక్క స్వారూప్యములోనికి మార్చబడుచున్నట్లు కనుగొంటాము (2 కొరిందీ¸ 3:18). దేవుని వాక్యమును అనుదినము ధ్యానించుటను మరియు ప్రభువుతో ప్రార్ధనా సహవాసమును, నిర్లక్ష్యము చేసినట్లయితే దేవుని మనస్సును తెలుసుకోవడం ఎంతో కష్టమౌతుంది. దేవుని వాక్యము మన మూర్ఖపు, వంకర ఆలోచనా విధానమును సరిచేసి మనలను ఆత్మ సంబంధమైన మనస్సు గల వారు గాను మరియు దేవుని యొక్క స్వరమునకు సున్నితత్వం గలిగి ఉండే వారి గాను చేస్తుంది.

దేవుని యొక్క స్వరమును వినుటకు అలవాటు పడినప్పుడు మాత్రమే దేవుని స్వరమును మనము గుర్తు పట్టగలము. పరిణితి చెందిన ఒక దైవ సేవకుణ్ణి నూతనముగా మారు మనస్సు పొందిన ఒక యౌవనస్తుడు '' నా గొర్రెలు నా స్వరము వినును'' అని క్రీస్తు చెప్పినప్పటికీ, నేను ఎందుకు ప్రభువు స్వరము వినలేకపోవుచున్నానని అడిగాడు.

''అవును, ఆయన గొర్రెలు ఆయన స్వరమును వినునను మాట నిజమే. అయితే గొర్రె పిల్లలు (చిన్న పిల్లలు) దానిని గుర్తించుట నేర్చుకోవలసిన అవసరత కూడా నిజమే''.

ఒక కుమారుడు తన తండ్రి యొక్క స్వరమును సుళువుగా గుర్తు పడతాడు. ఎందుకంటే తరచుగా ఆ స్వరమును అతడు విన్నాడు. అదేవిధముగా, ప్రభువు యొక్క స్వరమును ఎల్లప్పుడూ వింటూ ఉంటే, మనము దేవుని చిత్తము కొరకు చూచేటప్పుడు మన మనస్సులలో అలజడి కలిగించే ఇతర స్వరముల కంటే పైగా దేవుని స్వరమును వివేచించగలము. దేవుని స్వరమును వినుటకు మనము అలవాటు పడినట్లయితే, అప్పుడు మనము అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన వాగ్ధానము :

'' మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను - ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్ధము నీ చెవులకు వినబడును'' (యెషయా 30:21).

దీనికి బదులు, అత్యవసర పరిస్థితులలోనే మనము దేవుని వైపు తిరిగినట్లయితే, మనము ఆయన స్వరమును వినలేము. కొంత మంది దేవుని పిల్లలకు వారి అనుదిన జీవితాలలో దేవుని స్వరమును వినుటకు సమయము లేనంత తీరిక లేకుండా ఉంటారు. అయినా కూడా వారు ఇబ్బందులలో వెళ్ళుచున్నప్పుడు ఆయన చిత్తమును వెంటనే తెలుసుకోవాలను కుంటారు. అటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతూ, జి. క్రిస్టియన్‌ విస్‌ అనే వ్యక్తి అత్యవసర పరిస్థితులలో ఆ విశ్వాసుల ప్రార్ధన యొక్క ఉద్దేశ్యము ఈ విధముగా ఉంటుందని చెప్పారు: -

''ప్రభువైన యేసూ, నేను ఎంతో తీరిక లేకుండా ఉన్నాను మరియు నీతో మాట్లాడుటకు నాకు ఎక్కువ సమయము లేదు, నన్ను క్షమించండి. అయితే ప్రభువా, ఇప్పుడు నేను ఇబ్బందులలో ఉన్నాను. ఈ ముఖ్యమైన విషయములో నేను మీ చిత్తమును రేపు ఉదయం 10 గం||ల కల్లా తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాబట్టి ప్రభువా, తొందరగా నాకు బయల్పరచండి. ఆమేన్‌''. దేవుని చిత్తము ఈ విధముగా మనకు బయల్పరచబడదు, ఖచ్చితముగా అటువంటి వ్యక్తులకు అసలు బయలుపరచబడదు.

మన జీవితములలో దేవుని నడిపింపును మనము కోరుకున్నట్లయితే అనుదినము ధ్యానించునపుడు మరియు ప్రార్ధించునపుడు ఆయనతో సహవాసము ఎంతో ప్రాముఖ్యమైనది.

సారాంశము

మనము దేవుని చిత్తమును కనుగొనాలంటే, మొట్ట మొదట మనము ఈ క్రింది షరతులను నెరవేర్చాలి.

  1. దేవుడు తన చిత్తమును మనకు బయల్పరుస్తాడని మనము విశ్వసించాలి. అటువంటి విశ్వాసము తీవ్రమైన ఆశ మరియు సహనమును కలిగియుంటుంది.
  2. మన స్వంత జ్ఞానమందు మనము నమ్మికయుంచక దీనులుగా దేవుని మీద ఆనుకొనాలి. మన మేథోపరమైన సామర్ధ్యములను వదిలిపెట్టవలెనని కాదు గాని మన నమ్మకము దేవుని పైన ఉండాలి గాని మనపైన కాదు.
  3. మనము ఏవో కొన్ని విషయాలలో మాత్రమే కాక ప్రతి విషయములోను దేవుని చిత్తమును చేయుటకు ఇష్టపడాలి. మనకు ఇప్పటికే ఇచ్చియున్న వెలుగు ప్రకారము దానికి విధేయత చూపాలి. మన మనస్సాక్షిని ఎల్లప్పుడు నిర్మలముగా ఉంచుకోవాలి.
  4. మనము ఏదీ వెనుదీయక సంపూర్ణముగా దేవునికి అప్పగించుకోవాలి మరియు ఆయన మనకోసం ఏది ఏర్పాటు చేసినప్పటికీ దానిని అంగీకరించుటకు ఇష్టపడియుండాలి.
  5. అనుదినము మనము దేవునితో నడచి, ఆయన ఏమి చెప్పాలనుకొనుచున్నాడో దానిని వినాలి. ఈ విధముగా మన మనస్సులు రూపాంతరము పొందుటకు మరియు లోక సంబంధమైన ఆలోచనా విధానము నుండి విడిపించుటకు ఆయనను అనుమతించాలి.

అధ్యాయము 3
అంతరాత్మ ప్రబోధం వలన నడిపింపు

దేవుడు మనలను ఎలా నడిపిస్తాడు అనే విషయానికొస్తే, దైవజనులు మరియు దైవజనురాళ్ళ అనుభవముల కంటే బైబిలు యొక్క నియమములే ప్రాముఖ్యమైనవని మనము జ్ఞాపకముంచుకొనవలెను. మనము ఏర్పరచిన పద్ధతులలోనే పనిచేయుటకు దేవుడు పరిమితి గలవాడు కాదు. ఆయన సార్వభౌముడు మరియు కొన్నిసార్లు సామాన్యమైన పద్ధతులకు బదులు అద్భుతముగా నడిపించుటను ఆయన ఎన్నుకొనును. ఇశ్రాయేలీయులను అరణ్యములో అగ్ని స్తంభముతోను మరియు మేఘ స్తంభముతోను ఆయన నడిపించెను, కాని వారు కనానులోనికి ప్రవేశించిన తరువాత ఆ పద్ధతి లేకుండెను.

అపొస్తలుల కార్యములలోని కొన్ని సందర్భములలో అసాధారణమైన నడిపింపుయున్నది. ఒక దేవదూత ఫిలిప్పుతో నీవు సమరయ వదలి అరణ్యమునకు వెళ్ళమని చెప్పినది (8:26). అననీయ, దర్శనములో ప్రభువు చేత సౌలు యొద్దకు వెళ్ళమని చెప్పబడ్డాడు (9:10-16). పేతురు సువార్తను అన్యజనుల యొద్దకు తీసుకువెళ్ళాలని దర్శనమును చూశాడు (10:9-16). మాసిదోనియ వెళ్ళాలని పౌలు దర్శనమును చూశాడు (16:9). పౌలుకి యెరూషలేములో ప్రభువు దర్శనమిచ్చి తెలిపిన మాటలను ఆయన చెప్తున్నాడు (22:17-21). కాని ఇవన్నీ అరుదుగా జరిగిన సంఘటనలే గాని ఒక నియమము కాదు.

ఈనాడు కూడా దేవుడు తన పిల్లలకు ఇదే విధముగా నడిపింపును బయలుపరచే అవకాశమును మనము త్రోసిపుచ్చలేము. కాని అపోస్తలుల కార్యములలో ఉన్నట్టి విధానములు నేడు చాలా అరుదు.

ఈ పుస్తకములో, సాధారణ పద్ధతులలో దేవుని చిత్తమును తెలిసికొనడం గురించి మాత్రమే వ్రాయబడినది.

పాత నిబంధన కాలంలో దేవుని చిత్తమును తెలిసికొనడం చాలా సులభమైన పనిగా కనబడుచున్నది. అనేక విషయాలలో మోషే ధర్మశాస్త్రం వివరముగా, విపులముగా ఉంది. ఇశ్రాయేలీయులు అరణ్యములో పగలు మేఘ స్తంభమును, రాత్రి అగ్ని స్తంభమును వెంబడిస్తే సరిపోతుంది. ఎప్పుడు, ఎక్కడకి వెళ్ళాలో తెలిసికొనుటకు, వారు ఆత్మీయులు కానవసరము లేదు. వారికి మంచి కనుదృష్టి ఉంటే సరిపోతుంది! ప్రధానయాజకుడు దేవుని చిత్తమును తెలిసికోవడానికి, ఆయన చేయవలసినదల్లా ''ఊరీము మరియు తుమ్మీము'' ను దేవుని సన్నిధిలో వేసేవాడు. అవి 'అవునని' కాని, 'కాదని' కాని సూచించేవి. ఇది కూడా చాలా సులభమే, ఎందుకంటే ఇది బాహ్యమునకు కనబడి, మానవుని జ్ఞానేంద్రియాలకు అర్ధమగుచున్నది.

పరిశుద్ధాత్ముని మీద ఆధారపడుట

వీటన్నిటిని బట్టి చూస్తే, ఈ తరములో, ఈనాడు దేవుని చిత్తమును కనుగొనడం ఎంత కష్టముగా అనిపిస్తుంది. దీనికి కారణమేమిటంటే మనము ఆయన సంపూర్ణ చిత్తమును పరీక్షించి తెలుసుకోవాలని దేవుడు కోరుచున్నాడు (రోమా 12:2). పరిశుద్ధాత్ముడు ఒక మార్గదర్శిగా విశ్వాసి యొక్క హృదయములో జీవిస్తూ, పాత నిబంధన కాలములో ఉన్న బాహ్య సంబంధమైన పద్ధతులన్నింటిని మార్చివేశాడు. బాహ్య సంబంధమైన పద్ధతుల ద్వారా కలిగే నడిపింపు పరిణితి లేని వారి కొరకు ఉన్నది. అంతరంగ సంబంధమైన నడిపింపు పరిణితి కలిగిన వారి కొరకు ఉన్నది - ఈనాడు దేవుడు తన పిల్లలందరినీ ఈ విధముగానే నడిపించాలనుకుంటున్నాడు.

దేవుని చిత్తము కొరకు చూచేటప్పుడు, మన ఆత్మలతో పరిశుద్ధాత్మ ఏమి చెప్పుచున్నాడో గ్రహించవలెను. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనము చూచుట ఎంతో అవసరం.

మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమును గ్రహించుకొనుడి........ అయితే (ఎల్లప్పుడూ) ఆత్మ పూర్ణులై యుండుడి (ఎఫెసీ 5:17,18) అని బైబిలు చెప్పుచున్నది.

''యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై.....ఆత్మ చేత అరణ్యములోనికి నడిపింపబడెను'' అని లూకా 4:1 లో చెప్పబడినది. యేసు క్రీస్తు ప్రభువు తాను భూమి మీద జీవించిన జీవితమంతయు తన అంతరాత్మ ప్రభోదం వలనే నడిపించబడ్డాడు. మనుష్యులు బలవంతం వల్ల గాని సలహాల వల్ల గాని లేక మనుష్యులు బ్రతిమిలాడుట వల్లగాని నడువలేదు.

ఆది క్రైస్తవులలో కూడా ఆత్మ యొక్క స్వరమునకు స్పర్శ కలిగియుండుటను మనము కనుగొంటాము. ఫిలిప్పు కూడా ఆత్మ ప్రేరేపణ వలన ఐతియోపీయుడైన మంత్రి దగ్గరకు వెళ్ళి కలుసుకొన్నట్లుగా మనము చూస్తాము (అపొ||కా 8:29); కొర్నేలీ ఇంటికి వెళ్ళమని తనతో చెప్పుచున్న ఆత్మ స్వరమునకు పేతురు విధేయత చూపించాడు (అపొ||కా 10:19,20); అంతియొకయ సంఘములో ఉన్న నాయకులు కూడా నేను, నా పని కొరకు పిలిచిన పౌలు మరియు బర్నబాను ప్రత్యేకపరచాడని చెప్పిన ఆత్మ యొక్క స్వరమును గుర్తించారు (అపొ||కా 13:2). ఈనాడు కూడా అదే ఆత్మ ప్రతి యొక్క నిర్ణయములో మనందరును నడిపించాలని కోరుకుంటున్నాడు.

ఆత్మ యొక్క స్వరమును గుర్తించుట

పరిశుద్ధాత్ముడు మనలో బయటకు వినబడే శబ్ధము ద్వారా కాకుండా మన ఆత్మలో ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. ఫలానా పని చేయమని కాని లేక వద్దని కాని ఆయన మన అంతరంగములో చెప్తాడు. సాధారణముగా ఇది, మనము చేయబోయే పని గురించిన లాభ నష్టాలను గురించి ఆలోచించి, ఎక్కువ సమయం ప్రార్ధనలో గడిపిన తరువాత జరుగుతుంది. అయినప్పటికీ, కొన్నిసార్లు ఒక ప్రదేశమునకు వెళ్ళమని కాని లేక ఒక పని చేయమని కాని పరిశుద్ధాత్ముడు మనలను అకస్మాత్తుగా అడగవచ్చును. కాని ఏదైనా ఒక హాస్యాస్పదమైనది చేయమని అకస్మాత్తుగా అనిపించే ఆలోచనలు సైతాను యొద్ద నుండి కాని లేక మన యొద్ద నుండి కాని వస్తాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. బైబిలు యొక్క బోధకు విరుద్ధముగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మనలను నడిపించడు.

ఒక విషయమును గురించి మనము ప్రార్ధన చేస్తున్నప్పుడు మన ఆత్మలో ఆయన కలుగజేసే అత్యధికమైన ప్రేరేపణను బట్టి మరియు ఆయన మన మనస్సులో కలుగజేసే అత్యధికమైన సమాధానమును బట్టి పరిశుద్ధాత్మ యొక్క స్వరమును మనము వివేచించగలము. ''ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది'' (రోమా 8:6). సైతాను స్వరము సాధారణముగా మనలను హింసించేదిగాను మరియు మనము వెంటనే లోబడనట్లయితే తీర్పు వస్తుందని భయముతో కూడి ఉంటుంది. ఆయన చిత్తమును గ్రహించుటకును మరియు నిశ్చయ పరచుకొనుటకును దేవుడు ఎప్పుడూ చాలినంత సమయమును మనకు ఇచ్చును.

కొన్ని సందర్భాలలో మన మనస్సుకు పూర్తిగా అర్ధం కాని విధముగా కూడా ఆత్మ మనలను నడిపించవచ్చును. స్టీఫెన్‌ గ్రెల్లెట్‌ అనే ఒక అమెరికా బోధకుడు, ఒక క్యాంపు యొద్దకు ఆత్మచేత నడిపింపబడ్డాడు. కాని అక్కడ ఎవరూ లేనట్లు ఆయన కనుగొన్నాడు. అయితే తన నడిపింపును ఎంతో నిశ్చయముగా నమ్మి, ఖాళీగా ఉన్న భోజన శాలలోనికి వెళ్ళి ప్రసంగము చేశాడు. ఎన్నో సంవత్సరముల తరువాత, లండనులో ఒక వ్యక్తి గ్రెల్లెట్‌ను కలిశాడు. ఆరోజున ఆ క్యాంపులో నేను వంట మనిషిని మరియు అక్కడున్న ఒకే ఒక్క వ్యక్తిని నేను అని అతడు గుర్తు చేశాడు. కిటికీకి వెలుపల దాగుకొని అతడు గ్రెల్లెట్‌ యొక్క వర్తమానమును విన్నాడు. అతడు మారు మనస్సు పొంది ప్రభువు యొక్క పని నిమిత్తము వెళ్ళాడు. ఇటువంటి నడిపింపు చాలా అరుదుగా ఉంటుంది.

మన హృదయము యొక్క స్వరము మరియు ఆత్మ యొక్క స్వరము మధ్య వ్యత్యాసమును కనుగొనుట అంత సులభము కాదు. ఎందుకనగా మన హృదయములు మోసకరమైనవి. ఉదాహరణకు, మన జీవిత భాగస్వామి కోసం మనము చూస్తున్నప్పుడు, మన భావోద్వేగముల ఒత్తిడి మరియు ''మనము అనుకొన్న ప్రతి అడుగును తలచుకొన్న కొలదీ మనలో పెరుగుతున్న సంతోషము, సమాధానము'' నే పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం అని ఎంతో సులభముగా మనము పొరపాటు పడతాము. కాని మన ఉద్దేశ్యములను మనము పరీక్షించుకొని, మనము దేవుని యొక్క మహిమను మాత్రమే కోరుకొని, ఆయన మనకు ఏదైతే చూపిస్తాడో దానిని అంగీకరించుటకు సిద్ధపడినట్లయితే మనము మోసపోయే అవకాశములు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణముగా ఎక్కడైతే ఇటువంటి లోబడే తత్వము తక్కువగా ఉంటుందో లేక ఉద్దేశ్యాలు ఎక్కడైతే స్వార్ధపూరితంగా ఉంటాయో అక్కడ మనము దారి తప్పి పోతాము.

దేవుని చిత్తము కొన్ని సార్లు మనకేదైతే ఇష్టమో అదే అయ్యుంటుంది. కాని కొన్ని సార్లు మనకు అసలు ఏదైతే ఇష్టముండదో అది కూడా అయ్యుండొచ్చు. దేవుని చిత్తమంటే ఎప్పుడూ ఎంతో కష్టముగా ఉండునని మనము అనుకోకూడదు. లేక ఎప్పుడూ చాలా సులభముగా ఉండునని కూడా అనుకోకూడదు. మనము కష్టమైన పరిస్థితులలోను లేక కష్టమైన ఉద్యోగములో ఉన్నప్పుడు, ఆ స్థలం నుండి పారిపోవాలని మనము శోధింపబడతాము. ఇది ఆత్మ నడిపింపు అని ఎంతో సులభముగా మనము పొరపాటు పడవచ్చు. అటువంటి పరిస్థితులలో, మనకు సందేహముగా ఉన్నట్లయితే, మనము ఉన్నచోటనే ఉండి, దేవుడు మనకు కృప అనుగ్రహించి, క్రీస్తు యొక్క విజయమును మన పరిస్థితిలో ప్రత్యక్షపరచునట్లు మనము ఆయన యందు విశ్వాసముంచడం ఎంతో శ్రేష్టము.

ఒక అనుసరించదగిన విధానమేమిటంటే,మనము ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయము తీసుకొనవలసి వచ్చినప్పుడు, ఒక 'బ్యాలెన్స్‌ షీట్‌' ను మనము తయారుచేసుకొనవచ్చును. అందులో ఒక నిలువు గీత గీసుకొని ఒక ప్రక్క నీవు ఆ పనిని ఎందుకు చేయాలనుకొంటున్నావో దానికి గల కారణాలను వ్రాసుకొనవలెను. మరొక ప్రక్క దానికి ప్రతికూలమైన కారణాలను వ్రాసుకొనవలెను. ప్రతి దినము ఈ కారణముల కొరకు ప్రార్ధించాలి. అవసరమైతే ఆ కారణములలో మార్పు చేసుకొనవచ్చు. ఏ మార్గమైనా సరే మనసార అంగీకరించుటకు సిద్ధముగా ఉండాలి. ఆవిధముగా నీవు ప్రార్ధన చేస్తున్న కొలదీ, నీవు ఏమి చేయవలెనో పరిశుద్ధాత్మ నీ ఆత్మలో సాక్ష్యమిస్తాడు. ఒక విషయమై నీవు పెరుగుచున్న సమాధానమును అనుభవించుచున్నట్లయితే, నీవు దానిని చేయవలెనని దేవుడు కోరుకుంటున్నాడనుటకు స్పష్టమైన గుర్తు.

క్రీస్తు (పరిశుద్ధాత్మ ద్వారా) అనుగ్రహించు సమాధానము మీ హృదయుములలో (అంపైరు వలె ఎల్లప్పుడూ) ఏలుచుండనియ్యుడి - మీ మనస్సులో కలుగు ప్రతి ప్రశ్నకు పరిష్కారము కలుగజేయును (కొలస్సీ 3:15- ఆంప్లిఫైడ్‌ బైబిలు తర్జుమా).

ఫుట్‌ బాల్‌ ఆటలో, రిఫరీ విజిల్‌ వేయగానే (తప్పు ఆడారని చూపుటకు) ఆట మొత్తం ఆగిపోతుంది; అదేవిధముగా మన సమాధానమును కోల్పోయినప్పుడు మనలను మనము పరీక్షించుకోవాలి. మన ఆత్మలో మనకు సంపూర్ణ సమాధానము ఉన్నప్పుడు మాత్రమే మనము ముందుకు సాగిపోవాలి.

పరిశుద్ధాత్మ ఆవశ్యకతను తెలిసికొనుట

ఈ అధ్యాయంలో చెప్పినట్లుగా, మనం మనలోని పరిశుద్ధాత్మ స్వరం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ముఖ్యం. ఎందుకంటే, దీనినే ముఖ్య సాధనముగా ఈనాడు దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నాడు. మనము ఎల్లప్పుడు ఆత్మ యొక్క అంతరంగ ప్రేరేపణలకు, అంతరంగ పరిశీలనలకు విధేయత చూపించాలి. కేవలం తప్పు-ఒప్పు అనే నియమం మీద మాత్రమే ఒక విశ్వాసి నడిపించబడితే అది సరిపోదు. అది పాత నిబంధన క్రిందకు వస్తుంది. మనము ఉన్నతమైన స్థితిలో జీవించుటకు దేవుని క్రొత్త నిబంధన క్రిందకు పిలువబడ్డాము - అదేమిటంటే, దేవుని జీవములో పాలిభాగస్థులమై, ఆ జీవము చేత నడిపించబడుట కొరకైనది. ఈ రెండు స్థితులలో జీవించుట అనేది ఏదేను తోటలో ఉన్న రెండు వృక్షములకు సాదృశ్యముగానున్నది. అవి మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షము, జీవ వృక్షము. ఏది మంచో, ఏది చెడో తెలియజేసే నైతిక నియమావళి ఉండుట మరియు దాని ప్రమాణంలో జీవించుట మంచిదే. కాని ఇది ''ధర్మశాస్త్రము'' క్రింద జీవించుటకు తీసుకు వెళ్తుంది. క్రైస్తవుని ప్రమాణము ఉన్నతమైనది (మత్తయి 5:17-48).

'ప్రవర్తనకు రెండు నియమములు'(ుషశీ ూతీఱఅషఱజూశ్రీవర శీట షశీఅసబష్‌ ) అను తన పుస్తకములో వాచ్‌మన్‌ నీ ఈవిధముగా చెప్తారు - దేవుడు మనకిచ్చిన నూతన జన్మ అనునది ఎన్నో క్రొత్త విధులు, శాసనాలు అనుసరించనవసరం లేకపోయినప్పటికీ, ఎంతో మంది క్రైస్తవులు బాహ్య ప్రమాణాలనే వారి ఆశయముగా పెట్టుకొనుట ఎంతో ఆశ్చర్యకరం. దేవుడు మనలను క్రొత్త సీనాయి పర్వతము యొద్దకు తీసుకొని రాలేదు. అక్కడ ''నీవు ఇది చేయవలెను'' ''నీవు ఇది చేయకూడదు'' అను క్రొత్త ఆజ్ఞలను మనకివ్వలేదు. ఒక క్రైస్తవునిగా ఇప్పుడు నీవు క్రీస్తు యొక్క జీవమును కలిగియున్నావు. ఆయన జీవము యొక్క ప్రతిస్పందనలను నీవు గమనించాలి. ఒకవేళ మనము ఏదైనా ఒక పని చేయాలని భావించినట్లయితే, అది చేయుటకు నీలో ఉన్న జీవము ప్రేరేపించినట్లయితే, నీ అంతరంగ జీవము నుండి సానుకూల స్పందన లభించినట్లయితే, ఒక వేళ 'అభిషేకము' కలిగియుండుంటే (1 యోహాను 2:20,27), అప్పుడు అనుకున్న దానిని నీవు చేయవచ్చును. అంతరంగ జీవము దానిని సూచించును. కాని ఒకవేళ నీవు ఒక పని చేయవలెనని భావించినప్పుడు, అంతరంగ జీవము వెనుకాడుచున్నప్పుడు, నీవు భావించినది చూచుటకు ఎంత యోగ్యమైనదనిపించినా దానిని చేయకూడదు.

క్రైస్తవేతరులలో అనేక మంది ప్రవర్తన తప్పు ఒప్పు అనే నియమం మీద ఆధారపడి ఉంటుందని మనము తెలుసుకోవాలి. ఒకే నియమము ఇద్దరినీ నడిపించుచున్నట్లయితే, క్రైస్తవునికి, క్రైస్తవేతరునికి మధ్య గల తేడా ఏమిటి? క్రైస్తవుడు క్రీస్తు జీవమును బట్టి నడిపించబడుతున్నాడు కాని బాహ్యసంబంధమైన నీతినియమావళిని బట్టి కాదని దేవుని వాక్యము స్పష్టముగా చూపిస్తుంది. దేవుని యొద్ద నుండి వచ్చిన దానికి స్పందించుటకు, దేవుని యొద్ద నుండి కాని దానికి వ్యతిరేకముగా ప్రతిస్పందించుటకు క్రైస్తవునిలో ఎంతో ప్రాముఖ్యమైన నియమము ఉన్నది; మన అంతరంగ ప్రతిస్పందనలను జాగ్రత్తగా చూచుకొనవలెను. ....బాహ్యసంబంధమైన వాటిని బట్టి కాని, లేక మన స్వంత జ్ఞానమును బట్టి గాని లేక ఇతరుల జ్ఞానమును బట్టి గాని మనము నడిపించబడే ధైర్యము చేయకూడదు. వేరేవారు ఒక విషయమును ధృవీకరించవచ్చు, దానిని గూర్చిన అనుకూలతలు, ప్రతికూలతలను మనము కూడా ఆలోచించినప్పుడు అది మంచిదని మనము కూడా అనుకొనవచ్చును. కాని దాని గురించి మన అంతరంగ జీవము ఏమి చెప్పుచున్నది?
''క్రైస్తవ ప్రవర్తనంతటికీ ముఖ్య కారణం 'జీవము' అని మనము తెలుసుకున్నట్లయితే, ఆ తరువాత కేవలం చెడును మాత్రమే విసర్జించుట కాదు, బయటకు మంచిగా కనబడే దానిని కూడా వదలి వేయాలని తెలుసుకుంటావు. కేవలము క్రైస్తవ జీవితము (క్రీస్తు జీవము) నుండి వచ్చినది మాత్రమే క్రైస్తవ ప్రవర్తన; కాబట్టి జీవము నుండి రాని ఏ పనికైననూ మనము సమ్మతించకూడదు....... మనుష్యుల ప్రమాణాల ప్రకారము చాలా విషయాలు మంచిగానే కనబడతాయి, కాని దేవుని ప్రమాణాలు వాటిని తప్పుగా చూపిస్తాయి. ఎందుకంటే, వాటిలో దేవుని జీవము లేదు. దేవుని మార్గాలు బాహ్యమైన సూచనలను బట్టి కాదు గాని అంతరంగ గురుతులను బట్టి మనకు తెలుస్తాయి. క్రైస్తవుని యొక్క మార్గమును సూచించేవి ఆత్మలోని సంతోషము మరియు సమాధానము. విశ్వాసిలో యేసుప్రభువు జీవిస్తున్నాడనేది సత్యము మరియు ఆయన మనలో తనకు తానే ఎల్లప్పుడూ వ్యక్తపరచుకుంటున్నాడు. కనుక ఆయన జీవమునకు మనము స్పర్శ కలిగి యుండి, ఆ జీవము ఏమి చెప్పుచున్నదో వివేచించుటకు మనము నేర్చుకోవాలి''.

ఈ పాఠము నేర్చుకొనుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక.

సారాంశము

  1. వింతైన మార్గములలో దేవుడు మనలను అరుదుగా నడిపించును. ఈ క్రొత్త నిబంధన యుగంలో దేవుడు మనలను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించును. కనుక పరిశుద్ధాత్మతో నింపబడుటకు మనము చూడవలెను.
  2. మన ఆత్మలలో అంతరంగ ఒత్తిడి ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ప్రార్ధనలో దేవుని కొరకు ఎదురు చూచే కొలదీ ఆ ఒత్తిడి పెరుగుతుంది మరియు దానితో పాటు అంతరంగములో సమాధానము పెరుగుతూ ఉంటుంది.
  3. ఆత్మ స్వరము, ఇతర స్వరముల మధ్య గల బేధమును గమనించుటకు, మన ఉద్దేశ్యములను పరీక్షించుకొని అవి పవిత్రముగా ఉన్నాయో లేవో చూచుకోవాలి.
  4. ఒక కార్యమును చేయాలని మనము అనుకున్నప్పుడు దాని గూర్చిన లాభ, నష్టాల 'బ్యాలెన్స్‌ షీట్‌' ను మనము తయారు చేసుకోవాలి. మనము దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఇది సహాయపడుతుంది.
  5. పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ సాక్ష్యమునకు మనము ఎంతో ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకనగా, ఈనాడు మనలను నడిపించుటకు దేవుని యొక్క ముఖ్య సాధనం ఇదే. కేవలం నైతిక నియమావళిని బట్టి కాక పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ సాక్ష్యమును బట్టి మనము నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.

అధ్యాయము 4
బాహ్య సాధనముల ద్వారా నడిపింపు

మనము ఆయన నడిపింపు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన ఆత్మలతో ఈ క్రింది సాధనముల ద్వారా కూడా మాట్లాడతాడు.

  1. బైబిలు యొక్క ఉపదేశము
  2. పరిస్థితుల ద్వారా సూచన
  3. ఇతర విశ్వాసుల సలహాలు

మనము దైవ చిత్తమును నిర్ధిష్టముగా గ్రహించినట్లయితే, ఈ బాహ్య సాధనాల ద్వారా మన అంతరాత్మతో పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తాడు.

బైబిలు యొక్క ఉపదేశము

ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును బైబిలు మనకివ్వబడినది (2 తిమోతి 3:16,17). అనేక విషయములలో, దేవుని చిత్తము ఇప్పటికే అందులో తెలియబడినది.

ఉదాహరణకు, నీవు ఒక అవిశ్వాసిని (నామకార్ధపు క్రైస్తవులైనా మరియు క్రమముగా సంఘమునకు వెళ్ళుచున్నప్పటికీ) వివాహము కొరకు చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఉన్నది.

మీరు అవిశ్వాసులతో జోడుగా (వివాహమునకు సాదృశ్యము) ఉండకుడి - వారితో పొత్తు పెట్టుకొనకుడి (2 కొరిందీ¸ 6:14).

అదేవిధముగా, లేమి కలిగియున్న ఒక సహోదరుని మనము చూచినట్లయితే, మనము అతనికి సహాయము చేయవలెనని బైబిలు స్పష్టముగా బోధిస్తున్నది (యాకోబు 2:15,16; 1యోహాను 3:17). లేక ఒకవేళ నీతోటి విశ్వాసితో నీకు వ్యాజ్యమున్నట్లయితే మరియు దానిని బట్టి నీవు కోర్టుకు వెళ్ళాలా, వద్దా అని నీవు తెలుసుకోవాలనుకుంటే, బైబిలు ''వెళ్ళకూడదు'' అని సూత్రప్రాయముగా చెప్పుచున్నది (1 కొరిందీ¸ 6:1-8). అబద్ధము మరియు దొంగతనము ఎప్పుడూ తప్పే అని కూడా బైబిలు బోధిస్తున్నది (ఎఫెసీ 4:25,28). నీవు నీ సహోదరుని బాధించినందువలన నీకు, నీ సహోదరునికి మధ్య విరోధమున్నట్లయితే, మరలా ఇక్కడ మనము ఏమి చేయాలో అనే సందేహానికి బైబిలు తావివ్వడం లేదు. నీవే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము (మత్తయి 5:21-24).

మనము ఒక సంస్థతో ఒప్పంద పత్రము మీద సంతకం చేసినట్లయితే, మరొక చోట మెరుగైన ఉద్యోగము మనకు వచ్చినప్పుడు మనము ఆ ఒప్పందమును రద్దు చేసుకొనుటకు దేవుని చిత్తము కొరకు చూడనవసరం లేదు. దేవునితో నివసించువాడు ''అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు'' (కీర్తన15:4) మరియు అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు(మాట నిలబెట్టుకొనువారు) ఆయనకిష్టులు (సామెతలు 12:22) అని బైబిలు మనకు చెప్పుచున్నది. ఒక విశ్వాసి తన మాటను నిలబెట్టుకోనట్లయితే అది అవమానము మరియు సిగ్గుచేటు.

అదేవిధముగా, మనము ఎవరికీ ఏమీ అచ్చియుండకూడదని కూడా బైబిలు బోధించుచున్నది (రోమా 13:8).

దేవుని వాక్యము మనకు ఖచ్చితమైన ఆజ్ఞలే కాక, మనలను నడిపించుటకు కావలసిన నియమములను కూడా ఇస్తున్నది. ఉదాహరణకు, ఒక యౌవనస్తుడు వివాహము కొరకు చూస్తున్నప్పుడు సమాజంలోని ఇతరుల వలె అతడు కూడా కట్నం అడగాలా? లేదా అనే సందిగ్ధతలో ఉండవచ్చును. దురాశను గూర్చి, ధనాశను గూర్చి జాగ్రత్త పడమని దేవుని వాక్యము స్పష్టముగా హెచ్చరించుచున్నది. లేఖనాల సారాంశమేదనగా, మనము పుచ్చుకొనుట కంటే ఇచ్చుట నేర్చుకొనవలెను అనునదియే (అపొ||కా 20:33-35). కట్నం అడిగే (కేవలం ఆశపడినా కూడా) ఎవరినీ కూడా దేవుడు ఆమోదించడు అని ఎంతో స్పష్టముగా తెలుపబడింది.

జూదము ఆడుట వలన సంపదను పోగుచేసుకొనుటను గురించి ఏమిటి?

చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు అని సామెతలు 28:22లో చెప్పబడినది (సామెతలు 13:11; 28:20; మరియు 1తిమోతి 6:9-11).

ఈ వాక్య భాగాల నుండి మనకు స్పష్టముగా తెలియబడినదేమిటంటే ఒక విశ్వాసి లాటరీలో కాని, పందెములో కాని, జూదములో కాని పాలు పంచుకొనుటకు దేవుడు ఆమోదించడు.

దేవుని వాక్యము

(మన) త్రోవకు వెలుగును మరియు పడిపోకుండా (మన) పాదములకు దీపమునైయున్నది (కీర్తన 119:105 - ది లివింగ్‌ బైబిలు తర్జుమా).

ఏదో కొన్ని సార్లు మాత్రము, మన అనుదిన బైబిలు పఠనములో ఏదో ఒక వాక్య భాగము ద్వారా దేవుడు తన నడిపింపును నిశ్చయపరచవచ్చును. కాని ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. సాధారణముగా మనము ఆ వాక్య భాగములో లేని దానిని చదువుతూ ఉంటాము. సాధారణముగా మనము అటువంటి వాక్య భాగాల కొరకు చూడకుండానే అవి మన గమనమునకు వస్తాయి. మన అనుదిన పఠనములో సలహాల కొరకు వచనములను చూచుట తెలివి తక్కువ పని. మౌన ధ్యాన సమయము (ుబఱవ్‌ ుఱఎవ) యొక్క ఉద్దేశ్యము అది కాదు. ఈవిధముగా చేస్తే మనము సులభముగా తప్పు దారిలో నడిపించబడతాము.

ఒక యౌవనస్తుడు, దేవుడు తనను భారత దేశములో ఉండమని చెప్పినప్పటికీ అమెరికా (ఖ.ూ.ా) వెళ్ళుటకు ఎంతో ఆసక్తిగా ఉండవచ్చును. పశ్చిమ దేశాల యొక్క ఆకర్షణీయమైన సంపద అతని మీద గట్టి పట్టు కలిగియుండుటను బట్టి ''పడమటి వైపుకు...... పరుగెత్తి (ఎగిరి) పోవుదురు'' (యెషయా 11:4) అను ఇటువంటి వాక్యమును అతడు చూసినప్పుడు, దేవుడు నన్ను అక్కడకు వెళ్ళమని ప్రోత్సహించుచున్నాడని వెంటనే అతడు చెప్పును. మన హృదయములు మోసకరమైనవి మరియు అపవాది నిగూఢ (నర్మగర్భమైన) శత్రువు. ఈ రెండింటిని గూర్చి మనము జాగ్రత్తగా ఉండాలి.

దేవుడు తన మానవాతీతమైన జ్ఞానమును బట్టి, సందర్భానుసారము కాని వాక్యము ద్వారా నడిపించవచ్చును. అయితే, ఇది అసాధారణమే కాని ఒక నియమము కాదు. దేవుడు ఈ పద్ధతిని ఉపయోగించుకొన్నట్లయితే, మనము ఇంతకు మునుపే సామాన్యమైన మార్గముల ద్వారా మనము పొందిన నడిపింపును ధృఢపరచుటకే చేయును. ప్రాముఖ్యమైన విషయములలో కేవలం అటువంటి వాక్యములను ఆధారము చేసికొనకూడదు.

పరిస్థితుల ద్వారా సూచన

దేవుడు చూచుకొనే దేవుడు. ఆయన మన పరిస్థితులను అదుపు చేసి దాని ద్వారా తన చిత్తమును చూపించును. ఆయన కొన్ని విషయములు మన ముందు ఉండేటట్లు చేసి, ఆత్మ యొక్క సాక్ష్యము ద్వారా మనము పొందిన నడిపింపును నిశ్చయపరచుట గాని లేక మనము తప్పటడుగు వేయకుండా మనలను ఆపును. జార్జి ముల్లర్‌ చెప్పినట్లుగా

''ఒక మంచి మనిషి యొక్క విరామములు, అదేవిధముగా అతని అడుగులు యెహోవా చేతనే స్థిరపరచబడును'' (కీర్తన 37:23).

కొంత వరకు సాతాను కూడా మనలను తప్పు త్రోవలో నడిపించుటకు కొన్ని పరిస్థితులను కల్పించవచ్చునని మనకు అర్ధమవ్వ వలసియున్నది. వారిని మోసపుచ్చుటకు అపవాది కల్పించిన కొన్ని పరిస్థితుల ద్వారా నడిపించబడి జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయములో అనేకులు మోసపోయారు. మోసము నుండి తప్పించుకోవాలంటే రెండవ అధ్యాయములో చెప్పబడిన నడిపింపునకు కావలసిన షరతులను నెరవేర్చడమే.

దేవుడు అనుమతించిన పరిస్థితులను మనము అంగీకరించాలి మరియు వాటికి లోబడాలి. కాని సాతాను కల్పించిన పరిస్థితులను మనము ఎదిరించాలి. మనకు నిశ్చయత లేనట్లయితే మనము ఈ విధముగా ప్రార్ధించవచ్చు.

''ప్రభువా, ఈ పరిస్థితి మీ యొద్ద నుండి వచ్చినదో లేక సాతాను యొద్ద నుండి వచ్చినదో నాకు తెలియదు. అయితే ఏది ఏమైనా మీ సంపూర్ణ చిత్తమును నేను చేయాలనుకొంటున్నాను. నేను మోసగించబడి మీరిచ్చు శ్రేష్టమైన దానిని కోల్పోకుండా నన్ను కాపాడండి. ఒకవేళ ఇది మీ యొద్ద నుండి అయితే నేను సంతోషముగా అంగీకరిస్తాను. ఒకవేళ ఇది సాతాను నుండి అయితే, నేను అతనిని మీ నామములో బంధిస్తాను మరియు ఎదిరిస్తాను''.

దేవుని యెదుట మనము యదార్ధముగా నుండి మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నట్లయితే, ప్రభువు మన మార్గముల యందు మనలను కాపాడి, సమస్తము మన మేలు కొరకు జరిగించును (సామెతలు 2:8; రోమా 8:28). థెస్సలోనిక వెళ్ళకుండా పౌలును సాతాను అడ్డగించినది. కాని దానికి బదులు అక్కడకు తిమోతి వెళ్ళినా కూడా దేవుని యొక్క ఉద్దేశ్యము నెరవేరినది (1 థెస్సలోనిక 2:18; 3:1,2).

పరిస్థితుల ద్వారా నడిపించబడిన అనేక సందర్భములను మనము అపొస్తలుల కార్యములలో చూచెదము. సువార్తను వ్యాపింపజేయు నిమిత్తము సంఘమును యెరూషలేము నుండి చెదరగొట్టుటకు దేవుడు హింసను వాడుకొనెను (అపొ||కా 8:1). ఒక చోట ఉండలేనంత హింస ఎప్పుడైతే ఎక్కువైనదో అప్పుడు పౌలు, బర్నబాలు ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు వెళ్ళారు (అపొ||కా 13:50,51; 14:5,6,19,20). ఇది ప్రభువు యొక్క స్వంత అనుభవము మరియు మాదిరి ప్రకారముగా నున్నది (మత్తయి 10:23; యోహాను 7:1). సౌలును మరియు బర్నబాను యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దేవుడు కరువును వాడుకున్నాడు (అపొ||కా 11:28-30), అక్కడ వారు అత్యాసక్తితో చేయు ప్రార్ధనలోని శక్తిని కనుగొన్నారు (అపొ||కా 12:5). అంతియొకయకు తిరిగి వచ్చి, ఈ ప్రార్ధన ఆత్మను వారి సహ పని వారికి అనుగ్రహించారు. దీని ద్వారా దేవుని పని దూర ప్రదేశములకు కూడా వ్యాపించినది (అపొ||కా 12:25 - 13:3).

ఫిలిప్పీలో ఉన్న ప్రతికూల పరిస్థితులను దేవుడు వాడుకొని పౌలును, సీలను అవసరంలో ఉన్న జైలు అధికారికి సువార్త ప్రకటించుటకు నడిపించాడు (అపొ||కా 16:19-34). అనేక మందికి సువార్తను ప్రకటించుటకు పౌలును దేవుడు ఏ విధముగా పరిస్థితులను వాడుకొని నడిపించాడో అపొస్తలుల కార్యములు చివరి 8 అధ్యాయములలో మనకు తెలియజేయబడింది. లేనట్లయితే సాధారణముగా పౌలు వారందరినీ కలుసుకుని ఉండేవాడు కాదు (ఫిలిప్పీ 1:12).

కొంత మంది గొప్ప ప్రపంచ మిషనరీలు కూడా పరిస్థితులద్వారానే వారు పనిచేయవలసిన స్థలములకు నడిపించబడ్డారు. డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ మొదటిగా చైనాకు వెళ్ళి అక్కడ సేవ చేయుటకు వైద్య తర్ఫీదు పొందాలని అనుకున్నాడు. అతడు వెళ్ళుటకు బయలుదేరినప్పుడు ఓపియం యుద్ధం కారణముగా చైనా ''మూసివేయబడినది''. లండన్‌ మిషనరీ సొసైటీ వారు వెస్టిండీస్‌ వెళ్ళమని సలహా ఇచ్చారు. కాని అప్పటికే అక్కడ ఎంతో మంది వైద్యులు ఉన్నారని ఆయన నిరాకరించాడు. చివరకు రాబర్ట్‌ మొప్ఫాట్‌ అనే శ్రేష్టమైన మిషనరీ పరిచయం ద్వారా లివింగ్‌స్టన్‌ ఆఫ్రికాకు వెళ్ళాడు.

అదోనిరావ్‌ు జడ్సన్‌ భారతదేశములో సేవ చేయుటకు సవాలు చేయబడినట్లుగా అనిపించి అమెరికా నుండి బయలుదేరాడు. భారత దేశమునకు వచ్చేసరికి అక్కడ ఉండుటకు అధికారులు అనుమతించలేదు. ఆయన మద్రాసులో ఉండగా, ఫలానా తేదీ లోపల నీవు భారతదేశము వదలి వెళ్ళాలని చెప్పారు. కాబట్టి ఆ తేదీ లోపల మద్రాసు నుండి బయలు దేరే ఓడలో అతడు వెళ్ళటానికి బలవంతపెట్ట బడ్డాడు. ఆ ఓడ బర్మా దాకా వెళ్ళినది. జడ్సన్‌ తన మిగిలిన జీవితమంతా బర్మాలోనే గడిపాడు.

ఆ స్థలములలో దేవుని కోసం వారు సాధించిన ఆపనే, వారిని అక్కడికి నడిపించుటకు దేవుడే అటువంటి పరిస్థితులను కల్పించాడని స్పష్టముగా ఋజువు చేస్తుంది.

దేవుడు మనకోసం ఏర్పరచని మార్గముల ద్వారా మనము వెళ్ళకుండునట్లు దేవుడే మనలను రోగగస్తులుగా చేయుట ద్వారా లేక మనము రైలును అందుకోలేకపోవుట ద్వారా, ముందుగా నిర్ణయించుకొనిన దానికి వెళ్ళలేక పోవుట ద్వారా, లేక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోవుట ద్వారా ఆటంకపరుస్తాడు. ఆయన ప్రభుత్వం క్రింద మనము జీవిస్తున్నట్లయితే, నిరాశలు కూడా మన కొరకు ఆయనిచ్చు అవకాశములుగా మారును. మనము ఎంతగానో ప్రార్ధించి మరియు కోరుకొంటున్నది ఏమైనా మనము పొందలేదంటే దేవుడు మనకొరకు ఇంకా శ్రేష్టమైనదేదో దాచి యుంచాడనేది ఎంతో నిశ్చయం.

రైలును అందుకోలేక మరియు ఆలస్యంగా వచ్చిన పడవ కారణముగా అవసరములో ఉన్న ఒక ఆత్మ యొద్దకు నేను నడిపించబడ్డాను. ఆ రాత్రే అతడు ప్రభువు కొరకు తన హృదయమును తెరిచాడు. నాకు ఇష్టములేని ఒక ఓడకు నన్ను బదిలీ చేయుటను దేవుడు తన సాధనముగా వాడుకొని ఒక యౌవనస్తుడైన నావికుని యొద్దకు నన్ను నడిపించాడు. అతడు ప్రభువుకు తన జీవితమును సమర్పించుకొని బాప్తిస్మము పొందాడు. దేవుడు ఎటువంటి తప్పులు చేయడు. దేవుడు చూచుకొనే దేవుడు. ఆయన మహిమ కొరకు మరియు మన మేలు కొరకు మన పరిస్థితులను ఆయన ఆజ్ఞాపించుటకు మనము ఆయనను నమ్మవచ్చును.

మన మార్గములో ఏదైనా ఆటంకమును మనము కనుగొన్నప్పుడు మన పరిస్థితులను మార్చి ఆయన చిత్తమును ప్రత్యక్షపరచమని ఆ సమయములలో మనము దేవుణ్ణి అడుగవచ్చు. 1964 మే నెలలో భారత నావికా దళములో అధికారిగా ఉద్యోగము చేస్తున్న నన్ను రాజీనామా చేయమని దేవుడు నన్ను అడిగినప్పుడు, రాజీనామాకు నేను దరఖాస్తు చేశాను. నా దరఖాస్తు భారత నావికాదళ ప్రధాన కార్యాలయము నుండి తిరస్కరించబడింది. ఆవిధముగా నాలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ సాక్ష్యమునకు పరిస్థితులు విరోధముగా ఉన్నాయి. ప్రభువు నా పరిస్థితులను మార్చి, నావికాదళము నుండి విడుదల చేసి ఆయన పిలుపును నిశ్చయపరచమని ఆయనకు ప్రార్ధించాను. నా ఉద్యోగమునకు రాజీనామా చేయుటకు అనుమతి కోసం మూడు సార్లు దరఖాస్తు చేశాను. చివరకు రెండు సంవత్సరముల తరువాత నేను విడుదల పొందాను. మొదటిగా ఆటంకములను కల్పించినది సాతానే అని దీని ద్వారా నాకు ఋజువు అయినది. అయినప్పటికీ, ప్రభుత్వముల మీద మరియు భూసంబంధమైన అధికారుల మీద దేవునికి ఉన్న సంపూర్ణ అధికారము మీద నా విశ్వాసమును బలపరచుటకు మరియు ఆయన మార్గములను ఇంకా ఎక్కువగా బోధించుటకు దేవుడు దానిని అధిగమించెను.

నిశ్చయముగా ప్రతి ద్వారమునకు తాళపు చెవి ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ద్వారమును తెరువగా ఎవరూ మూయలేరు మరియు ఆయన ద్వారమును మూయగా ఎవరూ తెరువలేరు (ప్రకటన 3:7). రాజు యొక్క హృదయము కూడా మన దేవుని చిత్త ప్రవృత్తి చొప్పున తిరుగును (సామెతలు 21:1, ఎజ్రా 6:22).

కొన్నిసార్లు పరిస్థితులకు వ్యతిరేఖముగా కూడా దేవుడు మనలను నడిపించవచ్చును. యెరూషలేమునకు మొట్ట మొదటిసారి హింస వచ్చినప్పుడు, అపొస్తలులు పారిపోలేదు గాని ధైర్యం కోసం ప్రార్ధించారు. దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నింపి, యెరూషలేమును కంపింపచేశాడు. ఆయన శక్తి ప్రత్యక్ష పరచబడుచున్నందున, శిష్యులు చెదిరిపోవుటకు ఆయన సమయమింకను రాలేదు (అపొ||కా 4:29-33; 5:11-14).

ఫిలిప్పు సమరయను వదలి అరణ్య మార్గమున వెళ్ళినప్పుడు, అది పరిస్థితులకు వ్యతిరేఖముగానున్నది. సమరయలో ఫిలిప్పు ఎంతగానో వాడబడుచున్నందున సమరయలోనే ఉండవలసిన పరిస్థితి అది.

కాబట్టి పరిస్థితులు అనేవి అన్నిసార్లు దేవుని చిత్తమునకు సూచన కాదు. మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ సాక్ష్యమునకు, బైబిలు ద్వారా ఆయన సాక్ష్యము ఏకీభవించినప్పుడు, లోబడినప్పుడు మాత్రమే పరిస్థితులను మనము పరిగణనలోనికి తీసుకొనవలెను. తన పిల్లలు పరిస్థితులకు బందీలుగా మారాలని దేవుడు ఆశించుట లేదు. ఆయన, పరిస్థితులకు ప్రభువు మరియు తన పిల్లలు వాటి మీద తన యాజమాన్యాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాడు.

ఒక సూచన ద్వారా తన చిత్తమును తెలుపమని దేవుణ్ణి అడుగుట సరియైనదా? దేవుణ్ణి తన చిత్తమును తెలుపమని సూచనలను అడిగిన మనుష్యుల గూర్చిన కొన్ని సంఘటనలను పాత నిబంధన గ్రంధము పొందుపరచింది. అబ్రాహాము యొక్క దాసుడు ఒక సూచనను అడిగి ఇస్సాకుకు దేవుడు ఏర్పరచిన పెండ్లి కుమార్తెను కనుగొన్నాడు (ఆదికాండము 24:10-27). ఒక సూచన ద్వారా తన చిత్తమును నిశ్చయపరచమని గిద్యోను దేవుణ్ణి అడిగాడు. ఆ తరువాత రాత్రి ఆ సూచనను వ్యతిరేకము చేసి అడిగాడు. రెండు సందర్భాలలోను దేవుడు జవాబిచ్చి తన చిత్తమును నిశ్చయపరచాడు (న్యాయాధిపతులు 6:36-40). యోనాను తీసుకు వెళ్ళే ఓడ యొక్క నావికులు తుఫానుకు కారణమైన వారు తెలుసుకోవాలని చీట్లు వేశారు. దేవుడు జవాబిచ్చాడు (యోనా 1:7). వేరే ఇతర సందర్భాలలో కూడా కొన్నిసార్లు చీట్లు వేయడం ఉపయోగించారు (యెహోషువ 7:14; 1 సమూయేలు 10:20; 14:41-44; సామెతలు 16:33). క్రొత్త నిబంధనలో, మనుష్యులు దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఒక సూచన ఇమ్మని అడిగినది ఒకే ఒక్క సందర్భము. అది కూడా పెంతెకోస్తు దినమునకు ముందు మాత్రమే (అపొ||కా 1:23-26). పరిశుద్ధాత్మ దిగివచ్చిన తరువాత, విశ్వాసులు ఒక సూచన ద్వారా దేవుని చిత్తమును కనుగొన్నట్లు, క్రొత్త నిబంధనలో ఎక్కడా ప్రస్తావించలేదని మనము గమనించాలి. ఇది మనకు ఏమి సూచిస్తుందంటే, నడిపింపుకు దేవుడు సాధారణముగా ఉపయోగించు పద్ధతి ఇది కాదు అని. మనుష్యునిలో పరిశుద్ధాత్మ నివసించని రోజులలో, పాత నిబంధన కాలంలో ఇది ఉపయోగించబడినది.

అయినప్పటికీ నిరాశ చెందిన మన ఆత్మలను ప్రోత్సహించుటకు అరుదుగా ఏదైనా సూచన ద్వారా దేవుడు తన చిత్తమును నిశ్చయపరచును. ఇతర పద్ధతుల ద్వారా మనము ఏమీ తేల్చుకోలేనప్పుడు మాత్రమే దేవుణ్ణి సూచన అడిగే ధైర్యము చేయవచ్చును. అయితే మనము ఎటువంటి సూచన అడుగుతున్నామో దాని గురించి ప్రార్ధన చేయాలి. మన స్వంత మార్గములలో మనము వెళ్ళునట్లుగా సూచనలను మాద్యమములుగా వాడుకొనకూడదు. ఉదాహరణకు, దేవుడు మనలను తీసుకువెళ్ళాలనుకుంటున్న మార్గమునకు ఒంటరిగా వెళ్ళుట మనకు ఇష్టం లేక ఏదో ఒక సాకు కొరకు ఒక అద్భుతమును సూచనగా మనము అడుగకూడదు. అదేవిధముగా మనము కోరుకున్న మార్గములో వెళ్ళుటకు సాకుగా ఏదో ఒక సామాన్యమైన దానిని అసలు సూచనే కాని దానిని సూచనగా మనము అడుగకూడదు.

దేవుణ్ణి ఒక వచనమును సూచనగా అడిగి తరువాత కళ్ళు మూసుకొని బైబిలు తెరచి, ఏ పేజీ అయితే తెరువబడుతుందో దాని మీద వ్రేలు పెట్టి చూసి దేవుని చిత్తమును కనుగొనే పద్ధతిని కొంత మంది క్రైస్తవులు పాటిస్తుంటారు. దీనిని గూర్చి కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ పద్ధతి మనలను తప్పు త్రోవ పట్టిస్తుంది మరియు ఎప్పుడైనా ఇది చాలా బుద్ధిహీనమైనది. బైబిలు అనేది మంత్రాల పుస్తకం కాదు! అదేదో మంత్రాల పుస్తకంలాగా దానిని చూడవద్దు. కొన్నిసార్లు ఈ పద్ధతిని, మనలను ప్రోత్సహించే విషయములో దేవుడు ఉపయోగించుకొనవచ్చును. కాని ప్రాముఖ్యమైన విషయములలో నడిపింపునకు కేవలం ఇదే పద్ధతి కాకూడదు.

ఒక సూచనను ముఖ్యముగా చేసుకొనుట లేదా నడిపింపునకు ఒకే ఒక్క సాధనముగా చేసికొనుట పూర్తిగా వాక్యమునకు వ్యతిరేకము. ఎప్పుడూ సూచనల కొరకు చూచుట కూడా ఆత్మీయ పరిణితి లేదనుటకు గుర్తు అని మనము గుర్తుంచుకోవాలి.

ఇతర విశ్వాసుల సలహాలు

విశ్వాసులు ఒక శరీరంలోని అవయవముల వలె కలసి పని చేయవలసిన అవసరమును క్రొత్త నిబంధన ఎంతో ఎక్కువగా చెప్పుచున్నది. ఏ అవయవము కూడా తనంతట తానే పని చేయలేదు. మనుగడకు మరియు చలించుటకు ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఆధారపడాలి. కాబట్టి నడిపింపులో కూడా ఇతరుల మీద ఆధారపడడం సరియైనదే. విశ్వాసుల సహవాసమునకు దేవుడు ఎంతో విలువనిస్తున్నాడు. ఆయన సంపూర్ణ చిత్తమును మనము తప్పిపోకుండా భద్రత కోసం ఈ సదుపాయమును దేవుడు మనకు కల్పించాడు.

ఒక అడుగు వేసే ముందు, మనంతట మనమే దాని యొక్క ఉపయోగములు మరియు నిరుపయోగముల గురించి చూడలేక పోవచ్చును. మనము తీసుకొంటున్న నిర్ణయములోని అనేక ఇతర కారణములు చూడగలుగుటకు ఇతర దైవజనుల నుండి తీసుకొనే సలహాలు సహాయము చేస్తాయి. ఆ సలహాలు వెలకట్టలేనివి. ఒక ప్రాముఖ్యమైన నిర్ణయము తీసుకొనేటప్పుడు ఇది ఎంతో అవసరము. ఒకవేళ మనము, గర్విష్ఠిగా స్వయం సమృద్ధి కలిగియుండిి, దేవుని నడిపింపు కొరకు దేవుడు ఏర్పరచిన సాధనములను మనము పట్టించుకోనట్లయితే మనము దేవుని చిత్తమును తెలుసుకోలేము మరియు నష్టపోతాము.

''ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము........ ఇతరుల సలహాలు తీసుకోకుండా నీ ప్రణాళికలతో ముందుకు వెళ్ళవద్దు...... జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును........ మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది. జ్ఞానము గల వాడు ఆలోచన నంగీకరించును...... నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును. భక్తి హీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును'' (సామెతలు 24:6; 20:18; 13:14; 12:15,26 - ది లివింగ్‌ బైబిలు తర్జుమా).

అయినా కూడా, మనము ఈ రెండు విపరీత ధోరణులను విడిచిపెట్టాలి. ఒకటేమిటంటే, దైవ జనుల సలహాల మీద అసలు ఆధారపడకుండా ఉండటం. రెండవది, దేవుని సంపూర్ణ చిత్తము వలె ఎదురు ప్రశ్న వేయక వారి సలహాలనే అంగీకరించటం. ఈ రెండింటిలో దేనిని మనము హత్తుకొని ఉన్నా, మనము నాశనమునకు అయినా నడిపించబడతాం లేక జీవితాంతం ఆత్మీయముగా కుంటి వారి వలె ఉంటాం. మన తోటి విశ్వాసుల యొద్ద నుండి మనము సలహాలు తీసుకోవాలని దేవుడు ఏవిధముగా కోరుకుంటున్నాడో, అదేవిధముగా వారు పరిశుద్ధులైనా కూడా వారి సలహాలను మనము దాసుల వలె అంగీకరించాలని కూడా దేవుడు ఆశించుట లేదు.

బైబిలు సత్యమును పరిపూర్ణ సమతుల్యముగా తెలియజేస్తున్నది. దురదృష్ట వశాత్తు, మనిషి ఏదో ఒక విపరీత ధోరణి వైపు వెళ్ళే గుణం కలిగియున్నాడు. ఈ కారణము చేతనే, ఎన్నో మత భ్రష్టత్వ బోధలు (తప్పుడు బోధలు) క్రైస్తవ్యములో జన్మించాయి.

పాతనిబంధనలో, ఈ సమతుల్యమైన దృష్టి 1రాజులు 12,13 అధ్యాయములలో స్పష్టముగా తెలియజేయబడినది. 12వ అధ్యాయములో, యౌవనస్తుడైన రెహబాము రాజు తనవంటి యౌవనస్తుల యొద్ద నుండి కాక దైవజనులైన పెద్దల యొద్ద నుండి సలహా తీసుకొనవలసినది. కాని అతడు ఆవిధముగా చేయలేదు గనుక, తన రాజ్య విభజనకు కారకుడయ్యాడు. 13వ అధ్యాయములో, వృద్ధుడైన ప్రవక్త చెప్పినది యౌవనస్తుడైన ప్రవక్త వినకుండా ఉండవలసినది. (''వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు'') యోబు 32:9. అతడు ఆవిధముగా చేసినందున, తన ప్రాణమును కోల్పోయాడు.

క్రొత్త నిబంధనలో, అపొస్తలుడైన పౌలులో మనము ఈ సమతుల్యతను చూడగలము. అపొస్తలుల కార్యములు 13:1-3లో, ఇతర ప్రదేశములలో సేవ చేయుటకు పౌలును దేవుడు పిలిచినట్లుగా మనము చూస్తాము. అయితే, పౌలుకు మరియు అదే సమయములో తన తోటి పనివారికి కూడా దేవుడు తన చిత్తమును బయల్పరచాడు. పౌలుకు వ్యక్తిగతముగా దేవుడు ఏమి చెప్పాడో దానిని ఇతరుల ద్వారా నిశ్చయపరచాడు. మరొక విధముగా అపొస్తలుల కార్యములు 21:1-15లో, తన తోటి విశ్వాసులలో ప్రతి ఒక్కరి సలహాను (వాటిలో కొన్ని ప్రవచనములు ఉన్నప్పటికీ) నిరాకరించినట్లుగా మనము చూస్తాము. తనకు అనిపించిన మార్గములో వెళ్ళుటయే దేవుని చిత్తము. పౌలు యెరూషలేముకు వెళ్ళుట సరియైనదేనని తరువాత దేవుడు నిశ్చయపరచాడు (అపొ||కా 23:11).

మరొక సందర్భములో, పౌలు తన యొక్క క్రైస్తవ జీవిత ప్రారంభ దినములలో అరేబియాకు వెళ్ళాడు. అక్కడ ఎవ్వరినీ సంప్రదించకుండా దేవుని చిత్తమును తనంతట తానే కనుగొన్నాడు (గలతీ 1:5-17).

దేవుని వాక్యములోని ఈ ఉదాహరణలన్నీ మనకు చెప్పేదేమిటంటే, కొన్నిసార్లు దైవజనుల యొక్క సలహాలను మనము వినాలి. కొన్నిసార్లు అదే మనుష్యుల సలహాలకు వ్యతిరేకముగా వెళ్ళవలసి వస్తుంది. మరికొన్నిసార్లు మనము ఎవరినీ సంప్రదించ వలసిన అవసరము లేదు. మనము ఇతరుల సలహాలను స్వీకరించినా, నిరాకరించినా లేక అసలు ఇతరుల సలహా కొరకు సంప్రదించకపోయినా ఏ సందర్భములోనైనా సరే, అంతిమముగా తీసుకొన్న నిర్ణయము మన స్వంతదై ఉండాలి. మన నిర్ణయాలకు వ్యక్తిగతముగా మనమే దేవునికి లెక్క అప్పగించాలి. ఒక దైవజనుని యొక్క సలహా వెలకట్ట లేనిదే కాని తప్పక చేయాల్సిందే అన్నట్లు ఎప్పుడూ ఉండదు.

ూతీశీజూష్ట్రవరవ - ా స్త్రఱట్‌ టశీతీ ్‌ష్ట్రవ దీశీసవ శీట జష్ట్రతీఱర్‌ (ప్రవచనమము క్రీస్తు యొక్క శరీరమునకు వరము) అను తన పుస్తకములో మైఖేల్‌ హార్పర్‌ అనే వ్యక్తి ఈవిధముగా వ్రాస్తాడు.

''ఇతరులకు వారు ఏమి చేయవలెనో అని చెప్పే ప్రవచనములు ఎంతో అనుమానాస్పదములు. ప్రవచనము యొక్క ప్రయోజనములలో ''నడిపింపు'' అనేది ఎప్పటికీ ఒకటి కాదు. యెరూషలేముకు వెళితే ఏమి జరుగుతుందో పౌలుకు తెలియజేయబడింది కాని అక్కడకు వెళ్ళాలా, వద్దా అనేది మాత్రం చెప్పబడలేదు. దీనిని గురించి అతని స్నేహితులు సలహాలు ఇచ్చి ఉండవచ్చు గాని ప్రవచనము నుండి నడిపింపు రాలేదు. అగబు రానున్న కరువు గురించి ముందే చెప్పాడు కాని దాని గురించి ఏమి చేయవలెనో చెప్పలేదు. మొత్తానికి క్రొత్త నిబంధన నడిపింపు అనేది ఆ వ్యక్తికే తెలియజేయబడుతుంది. పాత నిబంధనలో వలె వేరే వ్యక్తి ద్వారా తెలియజేయబడదు. ఉదాహరణకు, పేతురును పిలువనంపమని దేవదూత ద్వారా కొర్నేలీకి తెలియజేయబడినది (అపొ||కా 10:5), వారితో వెళ్ళమని పేతురుకే ప్రత్యేకముగా తెలియజేయబడినది''.

జేవ్స్‌ు మెక్‌ కాంకీ ''నడిపింపు'' (.బఱసaఅషవ) అను తన పుస్తకములో ఈవిధముగా వ్రాస్తాడు.

''రక్త మాంసములు సీమోను పేతురుకు క్రీస్తును బయల్పరచలేదు'' (మత్తయి 16:17). క్రీస్తు యొక్క సంగతులను మనకు కూడా రక్త మాంసములు బయల్పరచలేవు. అవి మన రక్తమాంసములైనా, వేరే వారి రక్తమాంసములైనా ఒక్కటే. వేరే వ్యక్తి రక్త మాంసములు కూడా మన రక్తమాంసముల వలె బలహీనతలు కలిగి ఉండి మన రక్తమాంసములు ఎటువంటి తప్పులు చేయుటకు దోహదపడతాయో వారివి కూడా అదేవిధముగా ఉంటాయి. అంతేగాక, తన నడిపింపు కొరకు తన స్నేహితుల మీద ఆధారపడే వ్యక్తి, వారిచ్చిన వేర్వేరు సలహాలను బట్టి తనకున్న సందిగ్ధత ఇంకా ఎక్కువ అయినట్లు కనుగొంటాడు. నీ జీవితము కొరకై తనకున్న ప్రణాళికలు దేవుడు వేరే వారికి తెలియజేయడు. ఇది దైవ నియమము. దీని గురించి మనము చూడగలిగిన ఋజువు ఏమిటంటే యోహాను గురించి దేవుని చిత్తమును తెలుసుకోవాలనుకున్న పేతురును ప్రభువు గద్ధించాడు (యోహాను 21:22). చిన్న బాలునికి తన ప్రారంభములో మనము నడక నేర్పుటకు సహాయము చేయవచ్చును. కాని తనంతట తానే నడవవలసిన సమయం వచ్చినప్పుడు, నీ చేతిని పూర్తిగా వదిలివేసి నీ మీద ఆధారపడడం మానివేయవలెను. దేవునితో నడచుట నేర్చుకోవాలి. మరియు ఒక చిన్న బాలుడు కొన్నిసార్లు తొట్రిల్లినా (పడిపోయినా) సరే ఏవిధముగానైతే నడక నేర్చుకుంటాడో అదేవిధముగా క్రైస్తవుడు కూడా కొన్ని తప్పులు చేసినా కూడా నేర్చుకోవాలి. దేవుడు తానే మనకిచ్చిన నడిపింపులో మనము ఒంటరిగా ఆయనతో నడచుట అనే ధన నిధితో పోల్చి చూచుకున్నట్లయితే మనము చేసే కొన్ని తప్పుల ఖరీదు అంత విలువైనది కాదు. మరి అయితే ఈ నడిపింపు అనే విషయములో నీ క్రైస్తవ స్నేహితులకు దేవునిలో ఎటువంటి స్థానము లేదా? ఉంది; సహాయమంతా తీసుకో; దేవుని వాక్యము మీద వెలుగు పొందుకో; నీకు వీలైనంత వరకు ఇతరుల అనుభవములను తెలుసుకో; అంటే, ఇతరుల నుండి వాస్తవములను తెలుసుకొనవచ్చు. అయితే నీ నిర్ణయములు నీయంతట నీవే తీసుకొనవలెను. మనము నిర్ణయము తీసుకొనే సమయము వచ్చినప్పుడు వ్యక్తిగతముగా, సహనముతో దేవుని యెదుట కనిపెట్టుటను తప్పించకూడదు. దాని ద్వారానే ఆయన నడిపింపు యొక్క అనేక పాఠములను మనము నేర్చుకొగలము''.

అయితే, పరిణితి చెందిన విశ్వాసుల యొక్క సలహాకు వ్యతిరేకముగా వెళ్ళుచున్నట్లయితే, దేవుడే మనలను నడిపిస్తున్నాడా లేదా అని మన నడిపింపును పదే పదే పరీక్షించుకోవాలి. ప్రాముఖ్యమైన (పెద్ద) నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దీనిని తప్పక జ్ఞాపకముంచుకోవాలి.

ప్రభువు యొక్క స్వరము

రూపాంతరపు కొండ మీద, పేతురు యేసు ప్రభువును మోషే, ఏలియాలతో సమానమైన స్థాయిలో ఉంచుటకు ప్రయత్నించినప్పుడు దేవుని చేత గద్దించబడ్డాడు. ఈ మనుష్యులు పాత నిబంధనలో దేవుని తరపున మాట్లాడువారు అన్న మాట నిజమే. ఒక క్రొత్త యుగము ప్రారంభమగుచున్నది, పేతురు దానిని అర్ధము చేసుకొనాలి. ఈ క్రొత్త నిబంధనలో దేవుని ప్రతినిధి (దేవుని తరపున మాట్లాడువారు) ఒక్కడే. '' ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి'' (మార్కు 9:7). వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు, ''తమ యొద్ద నున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు''. మనతో మాట్లాడుటకు దేవుడు ఎటువంటి

బాహ్యసాధనములను వాడుకొన్నా, చివరకు మనము దేవుని యొక్క స్వరమునే వినవలెను.

ఔష్ట్రa్‌ రష్ట్రaశ్రీశ్రీ ్‌ష్ట్రఱర ఎaఅ సశీ? (ఈ మనుష్యుడు ఏమి చేయవలెను?) అను పుస్తకములో వాచ్‌మెన్‌ నీ ఈవిధముగా చెప్తాడు.

క్రైస్తవ్యము ఎప్పుడూ ఆత్మ ద్వారా దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవమును కలిగియుంటుంది. కాని కేవలము దేవుని చిత్తమును ఏదో ఒక మాద్యమము ద్వారా కాని, మనిషి ద్వారా కాని లేక పుస్తకము ద్వారా కాని కాదు. కావున ఈనాడు మనము మనకు అర్ధమయ్యే విధముగా చెప్పాలంటే, వ్రాయబడిన లేఖనములు మోషేకు సాదృశ్యముగా మనకున్నాయి. సజీవుడైన మానవ వర్తమానికుడు, మరణము చూడని ఏలియాకు సాదృశ్యముగానున్నాడు. దేవుని చేత ఇవ్వబడిన ఈ రెండు ప్రాముఖ్యమైన వరములు మన క్రైస్తవ జీవితములో పాలు పంచుకొనుటకు ఎంతో ప్రాముఖ్యమైనవి: మన చేతిలో ఉన్న దేవుని గ్రంథము మనకు సూచనలిస్తుంది మరియు ప్రభువుకు దగ్గరగా జీవించే వ్యక్తి తనకు దేవుడు ఏమి చూపించాడో దానిని మనకు తెలియజేస్తాడు. దేవుని గ్రంథము ఎప్పుడూ సరియైనదే; అనేక సార్లు స్నేహితుని యొక్క సలహా కూడా మంచిదే. మనకు దేవుని గ్రంథము కావాలి మరియు దేవుని ప్రవక్తలు కావాలి. వాటిలో దేనిని ఆయన నిరాకరించియుండేవాడు కాదు. కాని రూపాంతరపు కొండ మీద జరిగిన సంఘటన నుండి నేర్చుకొనవలసిన పాఠమేమిటంటే వీటిలో ఏదీ మన హృదయములలో దేవుని యొక్క సజీవ స్వరము యొక్క స్థానమును తీసుకొనలేవు.

మనము దేవుని యొక్క వర్తమానికులను తృణీకరించే ధైర్యము చేయలేము. యదార్ధమైన ప్రవచనాత్మకమైన మాటల యొక్క బలమైన సవాలు లేక పరిణితి చెందిన ఆత్మీయ సలహా యొక్క నెమ్మది మనకు మరలా, మరలా అవసరమే. అయితే సంపూర్ణముగా మరియు ప్రత్యేకముగా దేవుని పరిశుద్ధులనుండి వచ్చే ప్రత్యక్షతకు, అది ఎంత గొప్పగా నున్నా సరే మనలను మనము అప్పగించుకొనలేము. మనము దేవుని యొక్క స్వరమును విని ఆయనను మాత్రమే వెంబడించుటకు బద్ధులమైయున్నాము.

వ్రాయబడిన దేవుని వాక్యమును తృణీకరించుటకు మనమింకా తక్కువ ధైర్యము కలిగియుండాలి. దైవావేశము వలన కలిగిన లేఖనముల యొక్క సత్యము మన జీవమునకు మరియు ఎదుగుదలకు ఎంతో ప్రాముఖ్యమైనవి. అవి లేకుండా మనము ఉండలేము ఉండే ధైర్యము చేయలేము. అయితే, మనలో కొంత మంది యేసు ప్రభువునే మనకు అంతిమ అధికారముగా నుండుట కంటే వాక్యములోని అక్షరమునే ఎక్కువగా చూసే ప్రమాదములో ఉంటాము. బైబిలు ఏమి చెప్పుచున్నదో, దానిని మనము తీసుకొని విపులముగా మరియు భక్తిగా ఉండుటను బట్టి దేవుడు గౌరవించును. అయినా కూడా, ఆవిధముగా మనము చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క ప్రభువు స్థానమునే సవాలు చేసే విధముగా మనము బైబిలు స్థానమును హెచ్చించునంతగా మనము ముందుకు వెళ్ళి, విచారకరముగా మనము ఆయనతో సహవాసము లేని స్థితిలోనికి వెళ్ళే ప్రమాదమున్నది........

''దేవుని యొక్క చిత్తమును వ్యక్తిగతముగా, అనుభవపూర్వకముగా తెలుసుకోవాలని (క్రైస్తవ్యము) కోరుకుంటున్నది. దాని కొరకు దేవుడిచ్చిన ఇతర సాధనములను హత్తుకొనవచ్చును గాని అవే చివరిగా కాకూడదు''.

నడిపింపు యొక్క రహస్యము దేవుని యొక్క స్వరము వినుటలో ఉన్నది.

సారాంశము

  1. మనము ఆయన నడిపింపు కొరకు చూచునప్పుడు, పరిశుద్ధాత్మ బైబిలు యొక్క బోధ ద్వారా మనలను నడిపించును.
    1. అనేక విషయాలలో బైబిలు దేవుని చిత్తమును బయల్పరచియున్నది.
    2. మన అనుదిన బైబిలు పఠనములోని ఏదైనా ఒక వాక్య భాగము ద్వారా దేవుడు తన నడిపింపును మనకు నిశ్చయపరచవచ్చును. కాని ఏవిషయములోనైనా మన నడిపింపునకు ఇదొక్కటే ఆధారము కాకూడదు.
  2. పరిశుద్ధాత్మ తరచుగా పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడును.
    1. మనమ పొందిన నడిపింపును నిశ్చయపరచుటకు గాని, లేక మనము తప్పటడుగు వేయకుండా నిరోధించుటకు గాని దేవుడు పరిస్థితులను ఉపయోగించుకొనును.
    2. కాని కొంతమేరకు సాతాను కూడా పరిస్థితులను కల్పించవచ్చు. కాబట్టి అవి దేవుని చిత్తమునకు ప్రతిసారీ సూచనలు కావు.
    3. కొన్నిసార్లు పరిస్థితులకు విరుద్ధముగా దేవుడు మనలను నడిపించవచ్చును. పరిస్థితులను మార్చి తన చిత్తమును తెలుపమని కూడా దేవుణ్ణి అడుగవచ్చును.
    4. సూచన ద్వారా ఎప్పుడో ఒకొక్కసారి మాత్రము దేవుడు తన నడిపింపును నిశ్చయపరచవచ్చును. అయినా కూడా, సూచనల కోసం చూడటం అనేది ఎప్పుడూ ఆత్మీయ అపరిపక్వతను చూపిస్తుంది.
  3. ఇతర విశ్వాసుల సలహాల ద్వారా కూడా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడవచ్చును.
    1. మనము తన చిత్తమును తప్పి పోకుండా దేవుడు మన భద్రత కొరకు ఈ సదుపాయమును కలుగజేసెను.
    2. దైవజనుల యొక్క సలహాలు, ఒక విషయములో మనము పరిగణనలోనికి తీసుకోని విషయములను మనము చూచునట్లు చేయును.
    3. కొన్ని సమయములలో మనము దైవజనుల యొక్క సలహాలను తప్పక వినాలి. మరియు కొన్నిసార్లు వారి సలహాలకు విరోధముగా వెళ్ళవలసి రావచ్చును.

అధ్యాయము 5
వృత్తి(ఉద్యోగ) ఆహ్వానము

యౌవనస్తులు, నడిపింపు కోసం కనిపెట్టుచున్నప్పుడు వారు ఎదుర్కొనే పెద్ద సమస్య ఏమిటంటే, దేవుడు వారిని ఏ ఉద్యోగము చేయాలని కోరుచున్నాడో, ఎక్కడ చేయాలని కోరుచున్నాడో అనే విషయమే.

తమ వృత్తి కొరకు దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును కేవలము పూర్తికాలపు సేవ చేయగోరువారు మాత్రమే కాదు, ప్రతి యొక్క విశ్వాసి కూడా వెదకాలి. ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు తన పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తిని నిర్ణయించాడు. కనుక ఆ వృత్తి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది. ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉండాలని దేవుడు నిన్ను పిలిస్తే నీవు సంఘకాపరి అయినట్లయితే దేవునికి అవిధేయత చూపినవాడవవుతావు. నీవు వైద్యుడవు కావాలని దేవుడు కోరితే ఒక సువార్తికునిగా కావద్దు. అదేవిధముగా, దేవుడు నిన్ను ప్రత్యేకముగా క్రైస్తవ సేవకు పిలచినట్లయితే ఇతర వృత్తిని నీవు ఎంచుకొనవద్దు.

దైవ నిర్ణయమైన వృత్తి

సంపూర్ణ క్రైస్తవ సేవలో ఉన్నా, లేకపోయినా ప్రతీ క్రైస్తవుడు సంపూర్ణముగా యేసు క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉండాలి. నీ ఉద్యోగమేమిటని ఒకప్పుడొక క్రైస్తవ వైద్యుని అడిగితే ఆయన ఈ విధముగా చెప్పాడు :

''యేసు క్రీస్తు ప్రభువుకు సాక్షిగానుండి ఆత్మలను ప్రభువు సన్నిధికి నడిపించుటయే నా వృత్తి. నా ఖర్చుల కొరకే ఈ వైద్య వృత్తి చేస్తున్నాను''.

నిజముగా అతడు సరియైన దృష్టి కలిగియున్నాడు.

ఈ దృష్టితో మనం ఉద్యోగాన్ని అన్వేషించినప్పుడు దేవుని చిత్తము నుండి తొలగిపోతామని భయపడనవసరం లేదు. వ్యక్తిగత అభివృద్ధి మరియు పేరు ప్రతిష్టలు, ఉద్యోగ విషయములో మన ఎంపికను ప్రభావము చేసినట్లయితే మనము దారి తప్పిపోతాము.

తన వృత్తిని ఎన్నుకొనుటకు అవకాశములు ఎదుట ఉన్నప్పుడు, ఈ విషయములో ఒక యౌవనస్తుడైన విశ్వాసి దేవుని చిత్తమును ఎలా కనుగొనాలి? తన తెలివితేటలను, సామర్ధ్యమును పరిగణనలోనికి తీసుకొని తనకు ఏది సరిపోతుందో దాని కోసం చదువవలెను. అయినప్పటికీ ఎంతో ప్రార్ధన తరువాత మాత్రమే తన వృత్తిని ఎంచుకోవాలి. ప్రార్ధన తరువాత ఆత్మలో ఎటువంటి ఆటంకము కలుగనట్లయితే తనకు ఏదైతే సరిపోతుందో ఆ వృత్తిని ఎంచుకొనవచ్చును. ఎట్టి పరిస్ధితులలోను వేరే వారు మన వృత్తిని నిర్ణయించుటకు అనుమతించకూడదు.

అప్పటికే కళాశాల విద్యనభ్యసిస్తున్న వారు ఎన్నుకోడానికి ఎన్నో రకాల వృత్తులు కన్పించవు. అలాగని, దైవచిత్తానుసారమైన వృత్తిని ఎన్నుకోలేమేమోనని వారేమీ భయపడనవసరం లేదు. దేవుడు సార్వభౌముడు. మనము ఆయన మార్గములను ఎరుగనప్పుడు కూడా దేవుడు తన సార్వభౌమత్వముతో మనలను నడిపిస్తాడు. ఆయనకు మన జీవితాలు పూర్తిగా సమర్పించుకొనక మునుపే మనకు తెలియని మన జీవితమును మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన మనతో మాట్లాడిన తర్వాత మాత్రమే మనలను బాధ్యులనుగా చేస్తాడు.

దైవ నిర్ణయమైన స్థలం

విద్యార్ధి దశలో నుండగానే ఉద్యోగవకాశాల గురించి తనకు సరియైన సమాచారం లభించేటట్లు, తన విద్య ముగించిన తరువాత దేవుడు నిర్ణయించిన స్థలానికి తాను వెళ్ళగలిగేలాగున సరియైన ప్రజలతో, సంస్థలతో పరిచయం కలిగేటట్లు చేయమని ఒక విశ్వాసి దేవుణ్ణి ఎక్కువగా ప్రార్ధించాలి. ''కోత విస్తారముగానున్నది పనివారు కొద్దిమంది'' అని మత్తయి 9:37లో ప్రభువు చెప్పిన మాట ఎల్లప్పుడు మనసులో ఉంచుకోవాలి. యోహాను 4:35లో ఉన్న ఆజ్ఞకు విధేయుడగునట్లు ప్రపంచములోను, తన దేశంలోను, ఎక్కడెక్కడ దైవ సేవ ఏవిధంగా జరుగుతుందో తెలిసికోవాలి. దేవుడు తనను ఏ వృత్తి చేయాలని కోరుతున్నాడో, ఉపాధ్యాయుడుగానో, నర్సుగానో, ఇంజనీరుగానో లేక మరి ఏ వృత్తి చేయాలని కోరితే ఆ వృత్తిని స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉండాలి. చాలా మంది తమ వ్యక్తిగత సుఖాన్ని వెదుక్కుంటూ, సువార్త వ్యాప్తి పట్ల లేక ఆత్మల రక్షణ కోసం ఎటువంటి భారము లేకుండాయుండుట సిగ్గుచేటు.

ఆ తర్వాత తాను ఎక్కడైతే ఉద్యోగం చేయాలనుకొంటున్నాడో అక్కడ బాగా పరిచయం ఉన్న, అనుభవజ్ఞులైన (తమ ప్రాంతాలలో లేక ఇతర ప్రాంతాలలో) మరియు తన మీద ఆసక్తి కలిగినటువంటి విశ్వాసుల ప్రార్ధనా సహాయాన్ని, సలహాలను అడుగవలెను. తన పరిస్థితులను బట్టి దేవుడు తనకు ఏమి బోధిస్తున్నాడో తాను అర్ధం చేసికోవడానికి ప్రయత్నించాలి. ఇలా సమాచారమంతా సేకరించి నిర్ణయించుకోవలసిన సమయము ఆసన్నమైనప్పుడు, తన అంతరాత్మతో పరిశుద్ధాత్మ ఏమి చెప్తున్నాడో నిశ్చయంగా తెలిసికోవాలి. కాని, తనొక వేళ పొరపాటు పడినట్లయితే దేవుడు తనను వెనుకకు మరల్చుతాడని కూడా నమ్మి చిట్టచివరకు తనలో ఉన్న ఆత్మ నడిపింపు ప్రకారము తాను తన వృత్తిని నిర్ణయించుకోవాలి.

సంపూర్ణ క్రైస్తవ సేవ

సంపూర్ణ క్రైస్తవ సేవ గురించి, అనగా మిషనరీగా గాని సువార్త ప్రచారకునిగా గాని, వాక్యోపదేశకునిగా గాని, సంఘనాయకుడుగా గాని చేసే సేవ గురించి కొన్ని సంగతులిక్కడ చెప్పవలసియున్నది.

దేవాలయ సేవకు ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలలో ఒక్క గోత్రమునే దేవుడు ఏర్పరచుకొన్నట్లు, సంపూర్ణ క్రైస్తవ సేవకు కూడా కొంత మంది విశ్వాసులనే దేవుడు పిలుస్తాడు. అయితే, ఒకవేళ సంపూర్ణ సేవకు దేవుడు పిలచినప్పుడు ప్రతి ఒక్కరు సిద్ధముగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఈ పిలుపును గమనించి దేవుడతనిని ఇటువంటి సేవకు పిలుస్తున్నాడా లేదా అని తెలిసికోడానికి హృదయ పూర్వకముగా ప్రయత్నించాలి. పూర్తికాలపు క్రైస్తవ సేవలోనికి ప్రవేసించిన వ్యక్తి దేవుడే అతనిని ఆ సేవకు పిలిచాడనే ధృఢ నిశ్చయత కలిగియుండాలి. ఒక లౌకిక ఉద్యోగంలో ఉన్న వ్యక్తి కూడా ఇదేవిధముగా దేవుడు తనను అక్కడ ఉంచాడనే ధృఢ నిశ్చయత కలిగియుండాలి. ఒక సువార్తికునిగా లేక ఒక మిషనరీగా ఉన్న పిలుపు, ఒక అకౌంటెంటు లేక ఇంజనీరుగా ఉన్న పిలుపు కంటే ఎక్కువ ఆత్మీయమైనది కాదు. నీవు ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడన్నదే ముఖ్య విషయము.

సంపూర్ణ క్రైస్తవ సేవకు రావాలనే నిర్ణయమును, ఏదో ఒక గొప్ప ఉజ్జీవ సభలో ఉద్రేకం వలన గాని, లేక ఎవరో ఒత్తిడి చేసినందువలన గాని తీసుకొనక ప్రశాంతముగా తీసుకొనవలసియున్నది. సాధారణముగా తొందరపాటు నిర్ణయాల వలన చివరకు పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మనం నిర్ణయం తీసుకొనక మునపు తన చిత్తమును ఖచ్ఛితముగా తెలిసికొనుటకు దేవుడు ఎల్లప్పుడు తగిన సమయమును మనకు అనుగ్రహిస్తాడు.

సంపూర్ణ క్రైస్తవ సేవకు పిలుపు ఎట్లుంటుందో మనము నిర్వచించలేము. అనేక ఇతర విషయములలో ఉండు నడిపింపు వలె ఈ విషయములో కూడా వేర్వేరు వ్యక్తులకు వేరు వేరు విధములుగా ఉంటుంది. ఎక్కడో కొన్ని సందర్భాల్లో మాత్రం దర్శనం వల్ల గాని పైకి వినబడే స్వరం వల్ల గాని దేవుని చిత్తం తెలుస్తుంది. ఈ శతాబ్ద ప్రారంభములో శ్రేష్టమైన మిషనరీగా చైనాకు వెళ్ళిన ఎస్తేర్‌ బట్లర్‌ అనే ఆమె, దేవుడు ఆమెను పిలచినప్పుడు ''ఒక దర్శనంలో చైనా దేశంలో ఒక జనసమూహముతో నిండియున్న ఒక వీధిని చూశాను'' అని చెప్పినది. ఆ తరువాత ఆ దేశం వెళ్ళి 'నాన్‌ కింగ్‌' పట్టణంలో దిగినప్పుడు తన దర్శనంలో చూచిన ముఖాలను, ప్రదేశాలను స్పష్టముగా గుర్తించ గలిగింది.

మరి కొంత మందికి, పవిత్ర ఉద్దేశ్యముతో కూడిన అంతరాత్మ ప్రోత్సాహం వల్ల ఈ నిర్ణయం తెలుస్తుంది. జాన్‌ జి.పేటన్‌ అనే వ్యక్తి స్కాట్లాండు నుండి దక్షిణ పసిఫిక్‌ దీవులకు మిషనరీగా వెళ్ళాడు. ఎందుకంటే అక్కడి ప్రజలకు సువార్త వినుటకు స్కాట్లాండులో నున్నన్ని అవకాశాలు లేవని అతడు గ్రహించాడు. జేవ్స్‌ు గిల్మోర్‌ దేవుడు తనను స్వదేశములో ఉండమని పిలువలేదని చెప్పి మంగోలియా దేశం వెళ్ళాడు. వారు దేవుని యొక్క సంపూర్ణ చిత్తములోనే జీవించారన్న విషయము వారు ఆయా ప్రాంతములలో దేవుని కొరకు సాధించిన ఫలితములే చెప్పుచున్నవి.

ఏ విధముగా పిలుపును పొందామన్నది అంత ప్రాముఖ్యం కాదు. అయితే సంపూర్ణ క్రైస్తవ సేవకు సమర్పించుకొనే వ్యక్తి మాత్రం అతని నిర్ణయం దేవుని చిత్తమని దృఢంగా తెలియక పోయినట్లయితే అతడు ఏమీ చేయలేడు. ఈ పరిచర్యకు తనంతట తానుగా గాని లేక వేరే వారి ద్వారా గాని అతడు నియమింపబడలేడు. ఆ సర్వాధికారం ఎల్లప్పుడూ దేవుని చేతిలోనే ఉంటుంది.

చాలా సందర్భాలలో సంపూర్ణ క్రైస్తవ సేవకు పిలువబడిన వ్యక్తి తన పిలుపును పరిస్థితుల ద్వారా మరియు ఆత్మచేత నింపబడిన విశ్వాసుల ద్వారా కనుగొంటాడు. అయినప్పటికినీ, దేవుడు ఇదే నియమము ప్రకారము చేయాలనేమీ లేదు. దేవుడు ఏదో ఒక పద్ధతికే కట్టుబడి ఉండడు. అయినా కొన్ని మార్గదర్శకములను మనము చూడవచ్చు. వారి లౌకిక ఉద్యోగములలో ఉండి కూడా దేవుని పనిలో క్రియాశీలకముగా ఉన్న వారినే దేవుడు తన సేవకు పిలుస్తాడు. ప్రస్తుతమున్న పరిస్థితులలో దేవుని కొరకు సాక్షులుగా ఉండుటకు చూచువారితోనే దేవుడు మాట్లాడుతాడు. తనను ఆసక్తితో వెదకే వారికి దేవుడు ప్రతిఫలమిస్తాడు.

దేవుని యొక్క పిలుపు ఎప్పుడూ ఒకే విధముగా ఉండేది కాదు అని మనము ఎప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. దేవుడు కొంత సమయము నిన్ను పూర్తికాలపు సేవకు నడిపించి తరువాత ఏదైనా ఒక లౌకిక వృత్తిలోనికి నిన్ను నడిపించవచ్చును. మనుష్యుల అభిప్రాయములు మరియు ఆచారములలో మనము బంధించబడకుండా, సందర్భాలు మరియు పరిస్థితులు మారే కొలదీ దేవునితో కూడా మనము వెళ్ళుటకు ఇష్టపడాలి.

మనము లౌకిక వృత్తిలో ఉన్నా లేక పూర్తికాలపు క్రైస్తవ పనిలో ఉన్నా దేవునికి దాసులగుటయే మన పిలుపు. మన పని స్వభావము లేక ప్రదేశము వేరై యుండవచ్చును గాని, మనందరము ఇతరుల యెదుట ప్రభువును యోగ్యముగా చూపించుటకును మరియు ఆయనను గూర్చిన రక్షణ జ్ఞానములోనికి వారిని నడిపించుటకును పిలువబడ్డాము. నీ కొరకు దేవుని యొక్క ద్రాక్షా తోటలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఒక కీర్తనలో చెప్పినట్లు ''యేసు కొరకు నీవు మాత్రమే చేయగలిగిన పని ఒకటి ఉన్నది'' . ఆ పనేమిటో తెలిసికొని దాన్ని తప్పక చేయవలసిన బాధ్యత నీకు ఉంది.

''ప్రభువు నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్తపడుము'' (కొలస్సీ 4:17).

సారాంశము

  1. దేవుడు నీకొక ప్రత్యేకమైన వృత్తిని నియమించాడు. నీ బాధ్యత దానిని నెరవేర్చడమే.
  2. ప్రతి విశ్వాసి తన వృత్తితో నిమిత్తం లేకుండా యేసుక్రీస్తు ప్రభువుకు పూర్తికాలపు సాక్షిగా పిలువబడ్డాడు.
  3. తన వృత్తి నిర్ణయం కొరకు దేవుని చిత్తమును అన్వేషిస్తున్న యౌవనస్తుడు దేవుడు వ్యతిరేకించని పక్షంలో తనకు బాగా సరిపోయిన ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి.
  4. ఒక ఉద్యోగము కొరకు చూస్తున్నప్పుడు, వివిధ ప్రదేశములలో దేవుని పని కొరకు కలిగియున్న అవసరతలను గూర్చి సమాచారం సేకరించాలి. అతడు ఎంతో ప్రార్థనలో గడిపి, అనుభవజ్ఞులైన విశ్వాసుల సలహాలను తీసికొని, తన పరిస్థితులను చూసుకొని, చివరకు తన అంతరాత్మలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రకారము వెళ్ళవలెను.
  5. దేవుని యొద్ద నుండి స్పష్టమైన పిలుపు లేకుండా ఏ వ్యక్తి కూడా సంపూర్ణ క్రైస్తవ సేవలో ప్రవేశించకూడదు.
  6. దేవుని యొక్క పిలుపు అనేది సమయానుగుణంగా ఉంటుంది. ఆయన మనలను పిలచినప్పుడు ఆయనతో మనము ఎటువంటి విధమైన పనికైననూ వెళ్ళుటకు ఇష్ట పడియుండాలి.

అధ్యాయము 6
చిట్టచివరి పరిగణనలు

ఖచ్ఛితమైన నడిపింపును (దేవుని చిత్తమును) కనుగొనడానికి నిర్ధిష్టమైన సూత్రం ఏమీ లేదని పాఠకుడు ఇప్పటికే గ్రహించియుంటాడు. దేవుని చిత్తమును తెలుసుకోడానికి మనము చూస్తున్నప్పుడు అనేకసార్లు మనము సందిగ్ధంలో ఉంటాము. ఆయనకు మరింత సన్నిహితముగా రావాలని, ఆయన మనస్సును మరింత ఎక్కువగా అర్ధం చేసుకోవాలని మరియు ఆయన యొద్దనుండి మరింత జీవమును మనము పొందాలని దేవుడు ఇటువంటి పరిస్థితులను మనకు అనుమతిస్తాడు.

మన ఉద్దేశ్యములను జల్లెడ పట్టుటకు కూడా దేవుడు ఆ అనిశ్చిత పరిస్థితులను ఉపయోగించుకుంటాడు. దేవుని చిత్తము సరిగా తెలుసుకో లేకపోయినట్లయితే, ఆయన చిత్తమును తెలుసుకొనుటకు నెరవేర్చవలసిన షరతులు (రెండవ అధ్యాయములో చెప్పబడ్డాయి) నెరవేర్చామో లేదో మనలను మనము పరీక్షించుకోవాలి.

అటువంటి సందిగ్ధ పరిస్థితిని, మన విశ్వాసమును అభ్యాసము చేసికొనుటకు, బలపరచుటకు దేవుడు ఉపయోగించుకుంటాడు.

మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని (ప్రభువైన యేసు) మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను(యెషయా 50:10).

కాబట్టి అటువంటి సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనము ఆశ్చర్యపోకూడదు లేక నిరుత్సాహపడకూడదు. చివరకు అపోస్తలుడైన పౌలు కూడా ఈవిధమైన పరిస్థితులలో వెళ్ళాడు గాని, ఆయన ఎప్పుడూ నిరాశ పడలేదు మరియు వదిలిపెట్టలేదు (2కొరిందీ¸ 4:8). దేవుడు కొన్నిసార్లు తన చిత్తమును, మనము నిర్ణయము తీసుకోవలసి వచ్చినప్పుడు మాత్రమే తెలియజేస్తాడు. దానికంటే ముందు ఎంతో సమయము మనము వేచియుండేటట్లు ఆయన చేస్తాడు.

ఏదేమైనా, ప్రతి దశలో మనము తరువాత చేయవలసిన మెట్టు మాత్రమే ఆయన మనకు చూపిస్తాడు. మనము అనుదినము ఆయన మీద ఆధారపడవలెనని, వెలిచూపును బట్టికాక విశ్వాసము ద్వారా నడచుకోవాలని ఆయన మనలను ఒక్కొక్కడుగు నడిపిస్తాడు. ఆయన మనకు ఒక్క అడుగు మాత్రమే చూపించినప్పుడు మనము ఆయన మీద తప్పక ఆనుకొనవలసి వస్తుంది. అంతేగాక, ఒకవేళ దేవుడు మన భవిష్యత్తు అంతా ఒకేసారి చూపించినట్లయితే, సాధారణముగా మనము ఆయనకు పూర్తిగా విధేయత చూపించకుండా ఉంటాము. కాబట్టి, ఆయన ఒక్కసారి ఒకే అడుగు మనకు చూపించి నెమ్మదిగా మనము ఆయన సంపూర్ణ చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడునట్లు చేస్తాడు. మన జీవితమునకు సంబంధించి, దేవుని చిత్తమును కనుగొనుటకు ఎప్పుడైనా మనము చేయవలసినదేమిటంటే ఆయన మనకు తరువాత చూపించే అడుగు వేయటమే. ఆవిధముగా మనము చేస్తున్నకొలదీ, నెమ్మదిగా దేవుని యొక్క ప్రణాళికను కనుగొనగలము.

''వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమౌతుంది''

అనే ప్రాచీన చైనా సామెత ఒకటున్నది.

అబ్రాహాము తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో కూడా తెలియకుండా తన స్వదేశమును విడిచిపెట్టాడు. దేవుడు తనను నడిపిస్తున్నాడని మాత్రమే ఆయనకు తెలుసు (హెబ్రీ 11:8). ప్రతి అడుగులోను అతడు దేవునికి విధేయత చూపించాడు. దేవుడు అతనిని నిరాశపరచలేదు. అబ్రాహాము వలె దేవునిని వెంబడించే ఎవరైనా సరే, దేవుడు వారిని నిరాశపరుస్తాడేమోనని భయపడనవసరం లేదు.

నిర్ణయము తీసుకొనలేక పోవుటనుండి విడుదల

అనేకసార్లు మనకు దేవుని చిత్తము స్పష్టముగా తెలియకపోయినప్పటికీ మనము ముందంజ వేయవలసి ఉంటుంది. మనము విశ్వాసమును బట్టి నడచుటకు కావలసిన క్రమశిక్షణలో ఇది కూడా ఒక భాగమే. నిశ్చయత అనేది కొన్నిసార్లు వెలిచూపును బట్టి నడచుటకు సమానముగా ఉంటుంది. మనము నిరాశ చెందకుండా ప్రోత్సహించుటకు దేవుడు కొన్నిసార్లు స్పష్టమైన నిశ్చయతనిస్తాడు. కాని అనేకసార్లు మనకు ఆయన ఆమోదము అంత స్పష్టముగా తెలియకపోయినా మనము ముందుకు సాగిపోవాలని ఆయన ఆశిస్తాడు. మనకు తెలిసినంతవరకు, పరిశుద్ధాత్ముని యొక్క మనస్సుని అర్ధం చేసుకొని, అనిశ్చితముగా ఎదురుచూడకుండా మనము ముందుకు సాగిపోవాలి. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. ''దేవుడు మనలను నడిపించునని మనము ప్రణాళికలు వేసుకోవాలి (సామెతలు 16:9 - ది లివింగ్‌ బైబిలు తర్జుమా)''. తరువాత, ఆ నిర్ణయములను మనము వెనుకకు తిరిగి చూచుకొన్నట్లయితే, మనకు అంత స్పష్టముగా తెలియకపోయినప్పటికీ దేవుడు మనలను నాశనమునకు పోనీయలేదని కనుగొంటాము. మరొక విధముగా చెప్పాలంటే నేననుకొనుచున్న అంశములో ఎంతో అనిశ్చితి ఉన్నప్పటికీ, మరలా నేను పునర్విమర్శ చేసుకొన్నప్పుడు ఎంతో నిశ్చయత మరియు సంతోషము కలుగుతుంది.

మసకగానున్న నా కనుదృష్టియే నాకు భద్రత కలుగజేసెను. మంచుతో కూడియున్న నా మార్గములో ఆయన హస్తమును నేను చూచితిని, ''నా సహాయము నీకు నిశ్చయము'' అని ఆయన చెప్పుట నేను వింటిని.

'ఆత్మీయ నాయకత్వం' అనే పుస్తకంలో జె. ఓస్వాల్డ్‌ సాండర్స్‌ ఈ విధముగా చెప్తారు.

దేవునితో ఎక్కువ కాలం నడచి మరియు ఎక్కువ అనుభవం ఉన్న వారికి, అయోమయ పరిస్థితులలో దేవుని చిత్తము గ్రహించుట సులభమని నాయకత్వ స్థానములో లేని వారు అనుకుంటూ ఉంటారు. కాని తరచుగా దీనికి వ్యతిరేకముగా జరుగుతూ ఉంటుంది. దేవుడు నాయకుణ్ణి ఒక ఎదిగిన వ్యక్తిగా భావించి, ఆత్మీయమైన గ్రహింపును అతనికే వదిలివేసి, ఆ నాయకుని ప్రారంభ దినముల కంటే ఇప్పుడు దేవుని చిత్తమును కనుగొనుటకు బాహ్యముగా అర్ధమయ్యే ఋజువులను చాలా తక్కువగా ఇచ్చును.

చైనా ఇన్‌లాండ్‌ మిషన్‌ వ్యవస్థాపకుడైన హడ్సన్‌ టేలర్‌ ఒకసారి ఈ విధముగా చెప్పాడు.

''తన యౌవనములోనే దేవుని నడిపింపు ఎంతో త్వరగా, స్పష్టముగా తెలిసేది'' ''కాని'' ''ఇప్పుడైతే నేను ఎదిగే కొలదీ మరియు దేవుడు నన్ను ఇంకా ఎక్కువగా వాడుకొనే కొద్దీ ఒక మంచులో నడుస్తున్న వ్యక్తి వలె నా పరిస్థితి ఉంది'' అని ఆయన చెప్పాడు (ఫిల్లిస్‌ థామ్సన్‌ చే వ్రాయబడిన 'డి.ఇ. హాస్టే' అనే పుస్తకంలో ఈ మాట ఉంది).

అయినా కూడా హడ్సన్‌ టేలర్‌ ఏ నిర్ణయము తీసుకున్నా కూడా దేవుడు ఆయన విశ్వాసమును ఘనపరచాడు.

అనిశ్చిత పరిస్థితిలో మనం ఒక నిర్ణయం తీసుకొనేటప్పుడు దేవుని సంపూర్ణ చిత్తము నుండి మనము తొలగిపోయినట్లయితే, మనలను విడిపించుటకు ఆయన నమ్మదగినవాడు.

దేవుని మార్గమును విడచి మరియు నాశనమునకు వెళ్ళినట్లయితే, నీ వెనుక ఒక స్వరము విందువు.''అది కాదు. ఇది మార్గము; దీనిలో నడువుము''

అని యెషయా గ్రంథములో మనకొక వాగ్ధానమున్నది యెషయా 30:21 (ది లివింగ్‌ బైబిలు తర్జుమా).

మనము మార్గము తప్పిపోయినప్పుడు దేవుడు మన ప్రణాళికను మార్చుటకు పరిస్థితులను ఆదేశిస్తాడు. కాని ప్రతిదానికి ఏదో ఒక వింతైన నడిపింపు కలిగియుండాలని మనము అనిశ్చితంగా కాళ్ళూచేతులు చాచుకొని కూర్చొనకూడదు. నడుస్తున్న ఓడ దిశ మార్చడం సులభం గాని నిలబడియున్న దాని దిశను మార్చడం అతి కష్టం. మన విషయంలో కూడా అంతే.

అపొ||కా 16:6,10లో ప్రభువు యొద్ద నుండి స్పష్టమైన నడిపింపు రావడం వల్ల కాదు గాని ఆయన చిత్తమును చేద్దామనే ఉద్దేశ్యముతో పౌలు మరియు సీలలు ఆసియాకు వెళ్ళుటకు ప్రయత్నించారు. బహుశా దేవుడనుమతించిన పరిస్థితులను బట్టి వారు ఆటంకపరచబడ్డారు. తరువాత వారు బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించారు. మరలా వారి మార్గము మూసివేయబడినది. కాని వారు దేవుని చిత్తము కొరకు క్రియాపూర్వకముగా చూస్తూ మరియు ఆయన నడిపింపు కొరకు ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి ఎదురు చూచుట లేదు గనుక చివరకు తన చిత్తములో ఉన్న ప్రదేశమైన మాసిదోనియకు దేవుడు వారిని నడిపించాడు.

జీవితములోని చిన్నచిన్న విషయములలో, నడిపింపు అనేది ఎల్లప్పుడు గ్రహింపు కలిగి విచారణ చేయవలసిన విషయము కాదు. ఇది ఆత్మలో నడకకు సంబంధించిన విషయము. దేవునితో ఉన్న సరియైన సంబంధం, సరియైన పనులు చేయుటకు దారితీస్తుంది. ఇటువంటి చిన్న విషయములలో, దేవుని నడిపింపు అనేది మనము ఎల్లప్పుడు గ్రహింపు కలిగియుండవలసిన విషయము కాదు. మనము దీని గురించి గ్రహింపు కలిగియుండకపోవచ్చు. నడిపింపు కొరకు మనకు దేవునితో ఉన్న ప్రాధమిక సంబంధమే ప్రాముఖ్యమైనది. నడిపింపు అనేది ఒక ఆత్మీయమైన సంగతే కాని యాంత్రికమైనది కాదు.

విచారము నుండి విడుదల

గతంలోని ఓటములు మనలో కొందరి మనస్సులను ఎంతో బాధపెడతాయి. మనము ఏదో ఒక విషయములో దేవుని చిత్తము తప్పిపోయి, దాని సరిచేసుకోలేని పరిస్థితిలో ఉండవచ్చును. కాని విచారమనేది వ్యర్ధమైనది. ఇది మన ఆత్మీయ బలమును హరించి, దేవుని యొక్క సేవకు పూర్తిగా అనర్హులుగా చేస్తుంది. మనలను నమ్మకముగా క్షమించి, మన పాపములను కడిగివేసే దేవునితో మన ఓటములను వెంటనే ఒప్పుకోవాలి (1యోహాను 1:7,9). మీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను (హెబ్రీ 8:12) అని కూడా ఆయన వాగ్ధానం చేశాడు. కాబట్టి మన ఓటములన్నింటి వైపు మనము మన వీపును చూపించాలి. దోషములను సరిచేసుకొనుట సాధ్యం కాకపోవచ్చు, కాని మన మిగిలిన జీవితమును ఆయన మహిమ కొరకు వాడుకొనుమని ఆయనను అడుగవచ్చు.

దావీదు బత్షెబతో పాపము చేసి, తరువాత ఆమె భర్తయైన ఊరియాను చంపించినపుడు ఎంతో లోతుగా పడిపోయాడు. అయినప్పటికీ, తన మిగిలిన జీవితమంతా విచారపడుతూ జీవించకుండా, ఆయన మరలా దేవుని యొద్దకు నలిగిన హృదయముతో మరియు పశ్చాత్తాపంతో వెళ్ళాడు. దేవుని క్షమాపణను అంగీకరించి, ఆ తరువాత దేవుని మహిమ కొరకు జీవించాడు. ఊరియా విషయములో తప్ప, దావీదు తన జీవితమంతయు ప్రభువును సంతోషపెట్టెనని పరిశుద్ధాత్ముడు వ్రాసిపెట్టెను (1 రాజులు 15:4). ఒకవేళ దావీదు తన మనస్సును బాధపెట్టునట్లుగా అనుమతించియుండినట్లయితే, ప్రభువును మరి యెక్కువగా దు:ఖ పెట్టియుండేవాడు. ఓటమి యొక్క భారముతో తమ మనస్సులలో ఎల్లప్పుడూ చింతిస్తూ జీవించేవారు కేవలము ఓటమి నుండి ఓటమిలోనికి మాత్రమే వెళ్ళగలరు. మనము గతంలోని ఓటములను మరచి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు ముందుకు సాగిపోవలెను (పిలిఫ్పీ 3:13,14). మనము గత సంవత్సరములలో కోల్పోయిన దానిని దేవుడు సమకూర్చును (యోవేలు 2:25).

మరియొక శోధనేమిటంటే, మనము గతంలో ఒక నిర్ణయము తీసుకున్నప్పుడు అది దేవుని చిత్తమేనని మనము అప్పుడు ఒప్పుదల కలిగియుంటాము. కాని ఇప్పుడు దానిని సందేహించి, దానిని గురించి బాధపడుతూ ఉంటాము. బహుశా ఆ నిర్ణయము మనలను ఇబ్బందులలోనికి తీసుకొని వెళ్ళవచ్చును లేక మనకు ఇప్పుడు సమాచారమంతా తెలిసి యుండవచ్చు. ఒకవేళ అప్పుడే ఇవన్నియూ తెలిసియుండినట్లయితే, వేరే నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళము. మన మనస్సులలో ఎప్పుడూ గుర్తుంచుకొనవలసిన ఒక నియమము: దేవుడు నీకు వెలుగులో చూపించినది చీకటిలో ఎప్పుడూ అనుమానించకూడదు. ఒకవేళ మనము యదార్ధముగా దేవుని చిత్తము కొరకు కనిపెట్టి మరియు మనకున్నంత వెలుగులో మనము నిర్ణయము తీసుకున్నట్లయితే, మనము వెనుకకు తిరిగి చూచుకొని దానిని గూర్చి చింతించవలసిన అవసరం లేదు. దేవుడు మనలను ఆటపట్టించి ఆనందించే క్రూర నియంత కాదు. ఆయన ప్రేమ గలిగిన తండ్రి. మనము రొట్టెనడిగితే రాతినిచ్చేవాడు కాదు. ఆయన చిత్తమును మనము యదార్ధముగా వెదకినట్లయితే, మనము సరిగా నిర్ణయము తీసుకొనేటట్లుగా అన్నిటిని ఆయన సమకూర్చును. ఒకవేళ మనకు ఆ సమయములో కొన్ని వాస్తవములు తెలియకపోయినా, అవి దేవుడు ఒక ఉద్దేశ్యముతో తెలియనివ్వకుండా చేయును.

త్రోయలో పౌలు మరియు సీలలకు దేవుడు మాసిదోనియకు వెళ్ళమని స్పష్టముగా చెప్పాడు. వారు వెంటనే వెళ్ళారు. అయినా కూడా, వారు అక్కడికి వెళ్ళిన వెంటనే వారు కాళ్ళకు బొండలు వేయబడి, చెఱసాలలో బంధించబడ్డారు. ఒకవేళ మన నడిపింపు తప్పేమోనని వారు ఆశ్చర్యపడి యుండవచ్చును. ఒకవేళ ఇలా జరుగుతుందని ముందే వారికి తెలిసినట్లయితే, వారు త్రోయను విడిచి వచ్చేవారు కాదు. కాని దేవుడు వారికి ఎటువంటి హెచ్చరికను ఇవ్వలేదు. వారు చెఱసాలలో వేయబడినా పౌలు సీలలు దేవుణ్ణి నమ్మారు. వారికి దేవుడు వెలుగులో ఏదైతే చెప్పెనో, చీకటిలో దానిని సందేహించలేదు మరియు ఆయనను స్తుతించుచున్నారు (అపొ||కా 16:8-26). తరువాత జరిగిన సంగతులు వారు ఖచ్ఛితముగా దేవుని చిత్తములోనే ఉన్నారని తెలియపరుస్తున్నాయి. మనము ఇబ్బందులలో చిక్కుకున్నంత మాత్రమున, మనము దేవుని చిత్తములో లేమని చెప్పలేము. ఒకవేళ దేవుణ్ణి మనము నమ్మినట్లయితే, కారు చీకట్లో కూడా ఎటువంటి చింత లేకుండా ఆయనను మనము స్తుతించెదము.

భయమునుండి విడుదల

మనుష్యుల వలన భయము మరియు పరిస్థితుల వలన భయము మనలను దేవుని చిత్తమును పోగొట్టుకునే విధముగా చేస్తాయి. దేవుని యొక్క నడిపింపు కొరకై ఎదురు చూసే అనేక మంది విశ్వాసులు భద్రతను, స్థిరత్వమును పరిగణనలోనికి తీసుకొని ఆలోచిస్తారు. కొన్ని స్థలాలు, వృత్తులు అస్థిరమైనవి మరియు ప్రమాదకరమని వారు అనుకొని వారి మనస్సులలో నుండి పూర్తిగా వాటిని తొలగించుకుంటారు. కాని ఈ లోకంలో అసలు ప్రమాదం లేని స్థలం కాని, వృత్తి గాని లేనే లేవు. ఈ లోకమంతటిలో భద్రత కలిగిన ప్రదేశం ఎల్లప్పుడూ దేవుని యొక్క సంపూర్ణ చిత్తము మాత్రమే. దేవుని యొక్క ప్రణాళికలోనుండి తొలగిపోయినప్పుడు మాత్రమే మనము ప్రమాదములో పడతాము. దేవుని నడిపింపు లేకుండా నిర్ణయాలు తీసుకొనే వ్యక్తి సాతాను యొక్క దాడులకు ఆస్పదముగా ఉంటాడు. కాని

ఎవరైతే మహోన్నతుడు నియమించిన ప్రదేశములో నివసిస్తూ, పనిచేస్తారో సర్వశక్తుని నీడలో వారు కాపాడబడతారు (కీర్తన 91:1 నుండి తీసుకొనబడినది).

తప్పులు చేస్తామేమోనన్న భయమునుండి కూడా మనము విడుదల పొందవలసియున్నది. ఏమీ చేయని వ్యక్తి మాత్రమే ఎప్పుడూ తప్పు చేయడు. దేవుని యొక్క పాఠశాలలో మనమందరము విద్యార్ధులము, నిస్సందేహముగా మనము అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటాము. కాని ప్రభువు మనకు ఎల్లప్పుడూ సమీపముగా నుండి, సంగతులను సరిచేస్తాడు. ఎటువంటి తప్పు చేయకుండా దేవుని యొక్క సంపూర్ణ చిత్తములో నడచుట నేర్చుకొనినది యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరెవ్వరూ లేరు. ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకునేటప్పుడు అనేక సార్లు ఏ విధముగా పడి లేస్తాడో అదేవిధముగా ఎంతో గొప్ప పరిశుద్ధులు కూడా దేవుని యొక్క చిత్తములో నడచుట నేర్చుకున్నారు. ఒకవేళ పడిపోతానేమో అని భయపడే పిల్లవాడు ఎప్పటికీ నడక నేర్చుకొనలేడు! మనము ముందుకు సాగిపోకుండా ఇటువంటి భయము మనలను ఆపివేయుటకు అనుమతించకూడదు. దేవుని చిత్తములో నడవడం అంత సులభం కాదు కాని, ఆయనతో మనము కలిసి చేసే గొప్ప సాహసం మరియు మనము పడిపోయినప్పుడు మనలను పట్టుకుంటానని ఆయన వాగ్ధానం చేశాడు.

''ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు'' (కీర్తన 37:23-24).

చివరిగా, నడిపింపు అనేది దేవునికి నీకు మధ్య గల వ్యక్తిగతమైన విషయమని గుర్తుంచుకొనవలెను. దేవుడు ఇతరులను నడిపించిన మార్గములోనే నిన్ను కూడా నడిపించాలని అనుకొనకపోవచ్చు. ప్రధానమైన నియమములన్నీ విశ్వాసులందరికీ ఒకే విధముగా ఉంటాయి కానీ, వ్యక్తికీ వ్యక్తికీ మధ్య పద్ధతిలో తేడా ఉంటుంది. వేరే వాళ్ళు, వాళ్ళ సాక్ష్యంలో చెప్పిన నడిపింపు కోసమే నీవు కూడా చూస్తున్నట్లయితే నీవు తికమక పడతావు. దేవుడు నిన్ను ఏవిధముగా నడిపించాలనేది ఆయనకే వదిలి వెయ్యి. ఆయన ఏమి కోరుకుంటున్నాడో, దానిని చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే నీ బాధ్యతగా ఉండాలి. నీవు ఆయన చిత్తమును తెలిసికొనియుండేటట్లు మరియు దానిని నెరవేర్చుటకు కావలసిన బలము కలిగియుండేటట్లు ఆయనే బాధ్యత కలిగి యుండును.

సారాంశము

  1. ఆయనను మనము ఇంకా ఎక్కువగా తెలుసుకునేటట్లు ఆయనే సందిగ్ధమైన పరిస్థితులను అనుమతిస్తాడు. మన ఉద్దేశ్యములను పరీక్షించి, మన విశ్వాసమును బలపరుస్తాడు.
  2. చాలా విషయములలో, మనకు తెలిసినంత వరకూ ఆత్మ యొక్క మనస్సును తెలుసుకొని, దేవుని యొక్క చిత్తము సంపూర్ణముగా తెలియనప్పటికినీ మనము ముందుకు సాగిపోవాలి. మనము అనిశ్చితితో వేచియుండకూడదు.
  3. గతంలో మనము తీసుకొన్న నిర్ణయాలను బట్టి లేక ఓటములను బట్టి మనము వెనుకకు తిరిగి చూచుకొని చింతించకూడదు.
  4. మనము ఏమీ చేయకుండా ఉండేటట్లు, అపాయము కలుగుతుందేమోనన్న భయము లేక తప్పు చేస్తామేమోనన్న భయములను మనము అనుమతించకూడదు.
  5. దేవుడు మనలను ఎలా నడిపించాలి అనేది ఆయనకే విడిచి పెట్టాలి.