దేవుని సేవలో నియమములు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
    Download Formats:

అధ్యాయము 1
దేవుని సేవలో నియమములు

(ఇది సంఘము యొక్క లక్ష్యము మరియు నాయకత్వము యొక్క తర్ఫీదును గూర్చిన ఆల్‌ ఇండియా కాన్ఫెరెన్స్‌లో క్రైస్తవ నాయకులుకు ఇవ్వబడిన సందేశము డిసెంబరు 17,1997).

ప్రకటన 4వ అధ్యాయములో దేవుని వాక్యము చూచెదము. మొదటి అధ్యాయములో దేవుడు తన ప్రత్యక్షతను యోహానుకు ఇచ్చిన తరువాత, ఆయన యోహానుకు 2,3 అధ్యాయాలలో, ఆకాలమందలి, ఆ ప్రదేశములో గల సంఘముల గూర్చిన స్థితిని కూడా తెలియపర్చెను. ఆ సంఘములు ఆత్మీయముగా ఎక్కువ వెనక్కు జారిపోయిన స్థితిలో నుండినవి. అప్పుడు ప్రభువు యోహానుతో ప్రకటన 4:1లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని చెప్పెను. అది ఎంత చక్కని మాట!

మనము మనచుట్టూ ఉన్న పరిస్థితులు చూచినప్పుడు మరియు పరిష్కారము లేని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ''పైకి ఎక్కిరమ్ము! క్రింద నున్న భూలోక స్థానము నుండి నీవు ఈ పరిస్థితులను చూచుటకుకాక పైకి వచ్చి నేనుండిన స్థానమునుండి వీటిని చూడుము'' అని ప్రభువు చెప్పు మాటలు వినుట ఎంత బాగుండును. ''పైకి ఎక్కిరమ్ము'' అను మాట మనము ఎల్లప్పుడును వినవలసిన అవసరమున్నదని నేను నమ్ముచున్నాను.

పౌలు, ''అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను'' (ఫిలిప్పీ 3:13,14) అని చెప్పుచున్నాడు. అతడే పైకి ఎక్కిరమ్ము అని పిలువబడిన పిలుపును వినియుండెను మరియు ఆతడు ఎంత ఎత్తుకు ఎదిగినను అతడు దానితో ఎప్పుడు సంతృప్తి పడలేదు.

క్రైస్తవ నాయకత్వంలో ఉన్న ప్రమాదమేమిటంటే మనము ప్రజల ముందర చాలా ఎక్కువగా నిలబడుచుందుము. మనము అభినందించ బడుదుము. ఇప్పుడు వార్తాసాధనములు కూడా అందుబాటులో ఉన్నవి. మన పేర్లముందు బిరుదులు, మన పేర్ల తరువాత డిగ్రీలున్నవి.

ఇంతకంటే మనకు ఇంకా ఏమి కావాలి? ఏం కావాలో నేను చెబుతాను - మనము దేవుని యొక్క హృదయానికి దగ్గర్లోనికి వెళ్ళాల్సిన అవసరము కలిగియున్నాము! మనము పైకి ఎక్కవలసిన అవసరములో ఉన్నాము.

దేవునికి ఒక సేవకుడు అవసరమై ఆదామును సృష్టించలేదు. ఆయనకు ఒక పండితుడు కావలసి ఆయన ఆదామును సృష్టించలేదు. ఆయనకు సేవకులు లేక పండితులు కావలసి ఆయన నిన్ను నన్ను సృష్టించలేదు. ఆయనకు కావలసినంత మంది సేవకులు కోట్లకొలదిగా నుండిన దేవదూతలలో అప్పటికే నుండిరి. ఆదాము ఆయనతో సహవాసముండుటకు ఆయన మొదట ఆదామును సృష్టించెను. అందుచేతనే ఆదామునకు నియమము నీవు ఆరుదినములు పని చేసి ఏడవదినము విశ్రమించుము అను నియమము లేదు. అది తరువాత మోషే యొక్క ధర్మశాస్త్రము ద్వారా వచ్చినది.

ఆదాము ఆరవదినమున సృష్టించబడెను. కనుక అతడి యొక్క మొదటి దినము అనగా దేవుని యొక్క ఏడవ దినము ఆదాముకు మొదటి దినము. అది విశ్రాంతి దినమును మరియు అతడి యొక్క సృష్టికర్తతో సహవాసము చేయుదినమై యుండెను. దేవునితో సహవాసము చేసిన ఆ దినము నుండి తదుపరి ఆరుదినములు తోటలోనికి వెళ్ళి ఆదాము దేవుని సేవ చేయ్యవలసియుండెను.

ఎప్పుడైతే మనము ఆ వరుసక్రమమును మరచిపోవుదమో, అనగా మనము ఆయన ద్రాక్షతోటలో ఆయనకు సేవచేయుటకు వెళ్ళుట కంటె ముందు, దేవునితో సహవాసము చేయుట ఎప్పుడును చేయవలసినదని మరచిపోయినట్లయితే అప్పుడు మన యొక్క సృష్టిని గూర్చియు మరియు మన పాప విడుదల గూర్చిన ఉద్దేశ్యమును మరచిన వారమగుదుము.

మనము మన చుట్టూ ఉన్న అవసరము గూర్చి ఎక్కువ ఆలోచించువారమై (మరి ముఖ్యముగా భారతదేశము వంటి దేశములో ఉండి) దేవునితో సహవాసము చేయుటకు సమయము లేనివారముగా అగుదుము. మన చుట్టూ ఎంతో అవసరతలుంటుండగా ఆయనతో సహవాసమునకు సమయము వెచ్చించుట సమయాన్ని వ్యర్థపుచ్చునట్లుగా ఆలోచించుకొనవచ్చును. అయితే అవసరమును ఆధారముగా తీసుకొని చేయు పని యొక్క ఫలితమేమైయుండును? బహుశా ఎంతో పని జరుగవచ్చును కాని దానిలో నాణ్యత చాలా తక్కువగా ఉండును. గణాంక వివరాలు మోసపూరితమైనవి. మూడురకాలైన అబద్ధములున్నవనే మాటను నీవు విని యుండవచ్చును. అవి నల్లటి అబద్దములు, తెల్లటి అబద్దములు మరియు గణాంక వివరములు! గణాంక వివరములు మోసపూరితమైనవి. కాని యేసు ఎప్పుడును అటువంటి గణాంక వివరములు గూర్చి లక్ష్యపెట్టలేదు.

నా జీవితములో కొన్ని సంక్షోభాల పరిస్థితులు గుండా వెళ్లిన సమయములున్నవి. ఒకటి నా జీవితములో దేవుని సేవ చెయ్యాలని వెదకుచుండిన ప్రారంభదినాల్లో, నాకు దేవుని వాక్యము తెలిసియుండినా శక్తి లేకుండా యుండెడిది. అప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము కోసం, పై నుండి వచ్చు శక్తితో నింపుదల కోసం దేవునిని వెదికితిని, దీని గూర్చి వేరు వేరు అభిప్రాయాలు ఉన్నవని నాకు తెలియును మరియు నేను ఎవరిని నా అభిప్రాయాలలోకి మార్పు చేయుటకు ప్రయత్నించను. నేను చెప్పేదేమంటే నేను తిరగి జన్మించి నీటిలో బాప్తిస్మము పొందియుంటిని. కాని ''జీవజలనదులు'' నా నుండి ప్రవహించలేదు. అయినప్పటికిని ఎవరైతే యేసునందు విశ్వాసముంచెదరో వారి జీవితాల్లోనుండి జీవజలనదులు ప్రవహిస్తాయనియు వారెప్పుడూ ఎండిపోరని యేసు చేసిన వాగ్దానము నాకు తెలిసియుండెను. కాని అనేకసార్లు నా మట్టుకు నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లు గమనించితిని. నాకు దేవుని వాక్యము తెలిసియుండినా, నేను భోధించుచుండినా నేను ఎండిన స్థితిలోనే ఉంటిని. అనేక మార్లు దేవునికి నేను చేయుచున్న సేవ నీరుతోడుకునే బోరింగుతో నీరు తోడినట్లుండేది. దాని అర్థమేమిటో మీకు తెలియును కొట్టగా కొట్టగా కొంచెము నీరు వస్తుంది. అది ఒక నది కానేకాదు. అయినప్పటికి ''నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజలనదులు పారును'' (యోహాను 7:38) అని యేసుక్రీస్తు చెప్పిన దానిని నేను తేటగా చూచియుంటిని.

నేను చెప్పగలిగినదేమనగా నేను దేవునిని వెదకితిని మరియు ఆయన నా అవసరము తీర్చెను. ఆ అనుభవము నా జీవిత దిశను మార్చినది. నేను పెంతెకొస్తు సంఘములో చేరలేదు. నేను పెంతెకొస్తు వానిగా కాని కరిస్మాటిక్‌ వానిగా అనుకోలేదు కాని దేవుడు ఆయన ఆత్మతో నన్ను నింపుట ద్వారా నా అవసరము తీర్చెను. తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత నా జీవితములో మరొక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాను. ఈ మారు నేనెదుర్కొన్నది నాయొక్క యదార్థతను గూర్చి. అది నేను బోధించునది నా అంతరంగ జీవితములో నిజముగా యదార్థమేనా మరియు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు చూపుతున్న భారమును అదేవిధముగా నా హృదయమందు నిజముగా కలిగియుంటినా అనునది. ఇది సుమారు 28 సంవత్సరములు క్రితము డియోలాలీలో మొట్టమొదటి ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ ఆన్‌ ఇవాంజిలిసవ్‌ు కాన్ఫెరెన్స్‌ జరిగినప్పుడు జరిగినది. అప్పుడు నేనొక పత్రమును సమర్పించినాను. అప్పుడు నేను 30 సంవత్సరముల యౌవనుడను. మనము యౌవనులుగా నుండినప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలియును. ప్రతివారిని మెప్పించాలని కోరుకొంటిని అందువలన నా పత్రము ఎంతో ఆకట్టుకొనే విధంగా ఉండినది. ఎందుకంటే దానికొరకు నేనెంతో కష్టపడ్డాను. నా పరిచర్యలో లోతైన జీవితము గూర్చి (ణవవజూవతీ ూఱటవ జశీఅటవతీవఅషవ) మాట్లాడుటకు ఆస్ట్రేలియా మరియు సింగపూరు మొదలైన చోట్లకు ప్రయాణించు చుంటిని. ప్రతి చోటను నా గురి ప్రజలను మెప్పించుట లేదా ఆకట్టుకొనుటయే.

అప్పుడు ఒకమారు ''నీవు మనుష్యులను మెప్పించాలను కొంటున్నావా? లేక వారికి సహాయము చేయాలనుకుంటున్నావా?'' అని దేవుడు నాతో మాట్లాడెను. ''ప్రభువా నేను వారికి సహాయము చెయ్యాలను కొనుచున్నాను'', అని చెప్పితిని. అప్పుడు ప్రభువు ''అయితే వారిని మెప్పించుటకు ప్రయత్నించుట మానుము'' అని చెప్పెను. అప్పుడు ''ప్రభువా నా అంతరంగ జీవితము నేను బోధించు దానికి సమన్వయం లేకుండా ఉంది'' అని చెప్పుకొను స్థితికి వచ్చితిని. బాహ్యముగా మంచి సాక్ష్యము కలిగియుంటిని. కాని నా ఆలోచనా జీవితము మరియు నా వైఖరి (ధనము యెడల నా వైఖరి) క్రీస్తు కుండిన వైఖరి వలె లేదు. నేను నా నోటితో క్రీస్తును ప్రకటించుచుంటిని కాని నా ఆలోచనలను క్రీస్తు యొక్క ఆత్మ పాలించుట లేదు. ఈ విషయము గూర్చి నేను దేవునితో యదార్థముగా యుంటిని. దేవుని వైపు మన మొదటి అడుగు యదార్థత అని నేను నమ్ముచున్నాను. ఆ సమయానికి నేను బాగుగా పేరుపొంది యుంటిని. నేను పుస్తకములు వ్రాయుచుంటిని మరియు అవి బాగుగానే ప్రాచుర్యమగుచుండెను. నేను ప్రతివారము రేడియోలో కూడా మాట్లాడుచుండెడి వాడను. నేను వేరు వేరు చోట్లకు ఆహ్వానింపబడు చుండెడివాడను. ఒక నాడు ప్రభువు నా హృదయముతో ''నిన్ను గౌరవించే సమూహము ముందు నీవు నిలబడి, నీవు యదార్థతతో లేవనియు, నీవు లోపల, బయట ఒకే విధముగా లేవని చెప్పగలవా'' అని అడిగెను. ''అలాగే ప్రభువా! ప్రజలు నా గూర్చి ఏమనుకొనినా నేను లెక్కచేయను. నీవు నా కొరకు ఏదోకటి చెయ్యాలని కోరుకొనుచున్నాను. నేను నా అంతరంగ జీవితము నేను బోధంచు దానితో సమన్వయం కలిగియుండవలెనని నేను కోరుకొనుచున్నాను'' అని చెప్పితిని.

23 సంవత్సరముల క్రితము నేను ప్రభువును అట్లు అడిగితిని. దేవుడు మరల నా అవసరము తీర్చెను. ఆయనను ఆశతో అడగు వారి కోరికను ఆయన తీర్చును మరియు ఆయన పైకి ఎక్కిరమ్ము అని నాతో చెప్పెను. గత 22 సంవత్సరాలుగా దేవునితో సహవాసము నాకు ఎంతో విలువైనదిగా మారినది. అది నా జీవితాన్ని ఎంతగానో మార్చినది మరియు నా జీవితములో ఉండిన నిరుత్సాహము మరియు వ్యాకులము సంపూర్తిగా తీసివేసినది. దేవునితో నడుచు రహస్యమును నేను కనుగొంటిని. మరియు అది నా సేవను సంతోషభరితము చేసినది! ఇప్పుడు ఇంకెన్నడును ఎండిన స్థితి లేదు. మీ యొక్క సేవ అంతయు దేవునితో మీకు గల వ్యక్తిగత నడకపై ఆధారపడియున్నది. యేసు, మరియ మార్తల ఇంటిలో ఉండినప్పటి విషయము మీకు జ్ఞాపకముండి యుంటుంది. ''నీవు అనేక విషయముల గూర్చి చింతించుచున్నావు'' అని ఆయన మార్తతో చెప్పెను, మార్త దేనిగూర్చి చింతించెను? అక్కడ అవసరముండెను మరియు ఆమె ప్రభువును నిస్వార్థముగా మరియు త్యాగపూరితముగా సేవిస్తూ వంటగదిలో చెమట పడుతూ ఉండినది - ఆమె తన కొరకు ఆహారము వండుకొనలేదు కాని ప్రభువునకు ఆయన శిష్యులకును వండినది. అంతకంటె గొప్ప సేవ ఆమె ఏమి చెయ్యగలదు? అది పూర్తిగా నిస్వార్థమైనది మరియు ఆమె దానిని ధనము కోసముకాని లేక ఈనాటి అనేక క్రైస్తవ పరిచారకులవలె జీతము కొరకుకాని చెయ్యలేదు. లేదు, అది పూర్తిగా నిస్వార్థమైనది! అయినప్పటికి ''నీవు అనేక విషయముల గూర్చి చింతించుచున్నావని'' ప్రభువు ఆమెతో అనెను. మరియ స్వార్థపరురాలని, ప్రభువు పాదాల యొద్ద కూర్చొని ఏ పనీ చేయకుండ వింటూ కూర్చొన్నదని ఆమె అనుకొన్నది. ''అదియే ప్రాముఖ్య విషయమనియు, అది ఒక్కటియే అవసరమైనదనియు'' ఆయన చెప్పెను (లూకా 10:41).

1 కొరిందీ¸ 4:2 లివింగు బైబిలు తర్జుమాలో ''ఒక సేవకుని యొక్క ముఖ్యమైన పని అతడి యజమాని చెప్పిన పని ఏదో అది మాత్రమే చేయుటైయున్నది'' అని ఉన్నది. అది నా హృదయమునకు ఎంతో విశ్రాంతి కలిగించింది. అవసరముతో నుండిన ప్రపంచమును చూచినప్పుడు నేనేమి చెయ్యవలెను? అవసరమునకు తగినట్లు నేను పనిలో మునిగిపోవలెనా? అనేకులైన సామర్థ్యము కలిగినవారు క్రైస్తవ ప్రపంచములో నాతో పని చేయించుటకు సిద్ధముగా నుండిరి. కాని ''నీ నుండి వినాలని కోరుకుంటున్నాను'' అని నేను ప్రభువుకు చెప్పాను. అనేక మంది మార్తలు నన్ను విమర్శిస్తూ, ''అవసరతలో నుండిన లోకము పాపముతో నాశనమవుతుండగా, వింటూ అతడి సమయమును వ్యర్థపుచ్చవద్దని చెప్పమని'' చెబుతూ ఉండేవారు. మనము తప్పనిసరిగా లోకము యొక్క అవసరతను చూడాలి. కన్నులెత్తి పంటను చూడుమని (యోహాను 4:35) యేసు చెప్పెను. మనము అవసరమును చూడాలి, ఆ అవసరతను ఇతరులకు చూపాలి కూడా. అవును గాని ఆ పిలుపు దేవుని నుండి రావలెను, మనుష్యుని నుండి కాదు. ఆ విషయమును నేను కనుగొంటిని. లోకము, రక్షకుడులేక నశించుచుఉండగా యేసు 4000 సంవత్సరములు పరలోకములో కూర్చొని యుండెను. తండ్రి నిర్ణయించిన సమయమునకు ముందు పరలోకమును విడిచి వెళ్ళునట్లు ఆయనను ఎవ్వరు ఒత్తిడి చేయలేదు. కాని కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చెను. మరియు ఆయన భూమిపైకి వచ్చినప్పుడు లోకము నశిస్తూ ఉండగా ఆయన 30 సంవత్సరములు కుర్చీలు బల్లలు తయారుచేస్తూ కూర్చొని యుండెను. ఆయన కేవలం అవసరమును బట్టి కదలలేదు. కాని సమయమొచ్చినప్పుడు, తండ్రి ''వెళ్ళు'' అని చెప్పెను.

మరియు ఆయన 3 1/2 సంవత్సరములలో ఇతరులు 3000 సంవత్సరములలో చేసిన దానికంటే ఎక్కువ చేసెను. సేవకుడు ప్రాముఖ్యముగా చేయవలసినది అటూ ఇటూ పరిగెడుతు దేవుని కొరకు ఇది, అది లేక ఇంకొకటి చేయుట కాదు, కాని ఆయన చెప్పునది వినుటయై ఉన్నది. అట్లు వినుట కష్టమైన పని. నా యౌవన దినాల్లో క్రమము తప్పకుండా లేఖనములు ధ్యానిస్తూ, ఉపవాసములు చేసెడి ఒక సంఘములో నుంటిని. ప్రతి ఉదయం దేవునితో కొంత ప్రత్యేక సమయము గడపవలెనని అక్కడ చెప్పిరి - అది ఒక మంచి అలవాటు, అట్లు చేయమని ప్రతి ఒక్కరికి నేను సిఫారసు చేయుదును. అయితే ఎంతో ఖచ్చితముగా ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో గడిపినా, ప్రజలు ఇంకను చిరుబురులాడు నిష్టురతతో, కలిసి మెలగుటకు ఇబ్బంది కరముగా, ప్రతి దానిని తీర్పు తీరుస్తూ, విమర్శలు మరియు అనుమానములు కలిగిన వారిగా ఉండిరి. ఎక్కడో ఏదో సరిగా లేకుండెను. నేనొక దైవజనునితో 10 లేక 15 నిమిషములు మాత్రమే గడిపినట్లయితే నేనెంతగానో దైవికంగా పురికొల్పబడుట లేక ప్రేరేపింపబడిన సమయములు నాకు తెలియును. మరియు 10 లేక 15 నిమిషములు దేవునితోనే గడిపే సమయము ఎటువంటి కార్యము చేయగలదో మీరు ఊహించగలరా? మనమందరము ఆత్మీయముగా సవాలు చేయబడకపోవుటకు కారణమేమి? నేను నా ప్రత్యేక సమయములో దేవునితో గడుపుట లేదని ఆయన నాకు చూపెను. నాతో నేనే సమయాన్ని గడుపుచుండేవాడిని. కేవలం నేనొక పుస్తకాన్ని చదువుచుండేవాడిని. నా ముందున్న పుస్తకము బైబిలు కావచ్చు లేక రసాయన శాస్త్రమవ్వచ్చును, దాని వలన ఏ తేడా లేదు. నేను దేవునితో సమయాన్ని గడుపుట లేదు - ఆయననుండి వినుట లేదు. నేను కేవలం ఒక పుస్తకమును చదువుచుండెడి వాడను.

యేసు, మరియను గూర్చి ''అవసరమైనది ఒక్కటియే - అది వినుట'' అని చెప్పెను. అక్కడ నుండి ప్రతిది ప్రవహిస్తుంది. మరియు అది దేవుని సేవచేయుటకు ఎంతో కార్యసాధకమైన పద్ధతి, ఎందుకనగా నీవేమి చేయవలెనో ఆయన చెప్పును. యేసు, ఏమి చేయవలెనో తండ్రి చెప్పియుండెను. ఒకమారు ఆత్మ యేసును ఇశ్రాయేలు సరిహద్దునకు ఆవల గలిలయకు 50 మైళ్లుండిన సురోఫెనియా ప్రాంతమునకు నడువమని చెప్పెను. ఆయన అక్కడకు చేరుటకు ఎంత సమయమైనదో నాకు తెలియదు. బహుశా ఒక రోజంతా పట్టియుండవచ్చు. అక్కడ అపవిత్రాత్మపట్టిన ఒక చిన్న కుమార్తెగల ఒక అన్యురాలైన స్త్రీని కలుసుకొనెను. ఆయన ఆ దెయ్యమును వెళ్ళగొట్టెను. మరియు ఆమె కేవలం చిన్నపిల్లల బల్లపై నుండి పడే రొట్టెముక్కల గూర్చి అడిగినప్పుడు ఆమె కుండిన గొప్ప విశ్వాసమును ఆయన శిష్యులకు ఎత్తి చూపించెను. తరువాత ఆయన తిరిగి గలిలయకు నడిచి వెళ్ళిపోయెను (మార్కు 7:24-31) యేసు అట్లు జీవించెను. ఆయన కేవలము ఒక్క ఆత్మ కొరకు అంత దూరము నడచివెళ్లెను. గణాంక వివరములు ప్రకారం చూచినట్లయితే అది అంత ఆకర్షణీయంగా ఉండదు! కాని అది దేవుని చిత్తములో ఉండెను.

యేసు ఆవిధముగా 3 1/2 సంవత్సరములు జీవించెను. ఆ సమయమైపోయిన తరువాత తండ్రీ, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని (యోహాను 17:4) అని చెప్పెను. ఆయన ఇండియాలోను, ఆఫ్రికాలోను మరియు ప్రపంచమంతటా నుండిన అవసరతను తీర్చెనా? లేదు, ఆయన తీర్చలేదు. కాని ఆయన తండ్రి ఆయన కప్పగించిన పనిని పూర్తి చేసెను. మరియు ఈ భూమిపై ఒక్కదినము కూడా ఎక్కువగా జీవించుట కోరుకొనలేదు. అపొస్తులుడైన పౌలు కూడ తన జీవితపు ఆఖర్లో ''నా పోరాటము తుద ముట్టించితిని'' అని చెప్పగలిగెను (2 తిమోతి 4:7).

క్రీస్తు శరీరములో మీకొక వేరైన పిలుపు మరియు నాకొక వేరైన పిలుపు యున్నది. కాని మనమందరము దేవుడు మనలను ఏమి చెయ్యమని కోరుతున్నారో అది అర్థము చేసికొనాల్సియున్నది. దేవుని స్వరమునకు మనము చెవిటి వారమగుటకు గల ముఖ్య కారణాలలో ఒకటి మన జీవితాలలో గల అవాస్తవికత - నిజాయితీ లేకపోవుట మరియు నటన అయ్యున్నది. పరిసయ్యులు తమలో లేనిదానిని ఉన్నట్టు చూపించే జీవితాన్ని జీవించేవారు కాబట్టి వారు యేసు చెప్పిన దానిని వినలేకపోయిరి. వారు ఇతరులకు భక్తి గలవారమన్నటువంటి అభిప్రాయము కలుగజేసిరి. వారు ప్రజల ముందు వారి కాలమందలి నాయకులవలెను మరియు వాద పండితులవలెను నిలువబడిరి. మీరొకవేళ పేతురు యోహానులను వారు యేసుక్రీస్తును కలుసుకొనకముందు నాలుగు, ఐదు సంవత్సరముల ముందు కలుసుకొని మీకు తెలిసిన దైవికముగా జీవించే భక్తుని పేరు చెప్పుమని అడిగినట్టయితే, వారు అక్కడున్న సమాజమందిరమునకు పెద్దయిన ఒక పరిసయ్యుని పేరు చెప్పి ఉండెడివారు. ఎందుకనగా వారికి తెలిసినంత మట్టుకు ఎవరైతే లేఖనములను అధ్యయనము చేయుదురో, ఉపవాసము చేయుచు, ప్రార్థించుచు నొసళ్ళపై చిన్ని పెట్టెలలో లేఖనపు వచనములను కట్టుకొని భక్తిగా, పరిశుద్ధముగా కనిపించేవారే దైవికమైన వారని అనుకొనెడివారు. అటువంటప్పుడు యేసు సమాజమందిరములో ఆ పెద్దలను నరకమునకు పాత్రులయిన వేషధారులని దులిపివేయడాన్ని విని వారు ఎటువంటి విభ్రాంతికి గురైయుందురో ఊహించుకొనండి.

యేసు తన శిష్యులను ఏర్పరచుకొన్నప్పుడు, ఆయన ఒక్కరిని కూడా బైబిలు పాఠశాలనుండి ఏర్పరచుకొనలేదు. ఆ దినాలలో యెరూషలేములో గమలీయేలుచే నడిపింపబడిన ఒక బైబిలు పాఠశాల ఉండేది, కాని యేసు తన శిష్యులను ఏర్పరచుకొనుటకు అక్కడకు వెళ్ళలేదు. ఆయన గలిలయలో సముద్రపు ఒడ్డున ఉండిన పామరులను ఎంచుకొని ఆయన శిష్యులనుగా చేసికొనెను. వారు, ఇప్పుడు వేదాంత విద్యలో డాక్టరేటు పొందుటకుగాను ప్రజలు చదువుకొనే బైబిలు సెమినరీలకు కావలసిన పుస్తకములు వ్రాసియున్నారు. అది అద్భుత విషయముకాదా? పేతురు మనకుండిన ఏదైనా సెమినరీలనుండి డిగ్రీ పొందుటకు సమర్థత కలిగియుండిన వాడని నేను అనుకోను. బహుశా శిష్యులందరిలో ఒకేఒక శిష్యుడు అటువంటి సమర్థత కలిగియుండెను - అతడు అందరిలో తెలివైనవాడు మరియు చురుకయినవాడు - అతడు ఇస్కరియోతు యూదా. యేసు ఎందుకు అటువంటి వారిని ఎంచుకొనెను? వారు సామాన్యమైన మనసు కలిగి ఆయన చెప్పు దానిని వినుటకు సిద్ధపడిన వారు. ఇటువంటి సామాన్యమైన మనుష్యులు ఏదైనా సమాజమందిరమునకు వెళ్ళి బోధించునప్పుడు ఎటువంటి కలకలం చెలరేగేది. వారు అక్కడ ప్రజలు అలవాటుగా ఎల్లప్పుడు వినే ప్రసంగములను బోధించేవారుకాదు. వారు ప్రవక్తలు. ప్రజలు ఎల్లప్పుడు ప్రవక్తలను ఇష్టపడేవారుకాదు. ఇశ్రాయేలు యొక్క 1500 సంవత్సరముల చరిత్రలో ''ఏ ప్రవక్తను వారు హింసించకుండా ఉండిరి?'' అని స్తెఫను అనెను (అపొ.కా. 7:52). ఆ అపొస్తలులు లౌక్యముగా మాట్లాడువారుకాదు. వారు ప్రవక్తలు. ఈ కాలములో దేవుడు మనతో ఏమి చెప్పుచుండెనో మనము వినగలుగునట్లు మన దేశమునకు కొద్ది మంది ప్రవక్తల అవసరమున్నదని నేను అనుకొనుచున్నాను. దేవుడు మనుష్యుల దృష్టిలో ఘనమైన దానిని, గొప్పగా నుండిన దానిని లెక్కజేయడు (లూకా 16:15).

నేను ఇటువంటి కూటములకు వ్యతిరేకిని కాను. కాని ఇటువంటి కూటములకు 20 సంవత్సరముల క్రితం నుండి వెళ్ళుట మానివేసాను. అటువంటి ఆహ్వానములను ఇప్పుడు నేను అంగీకరించుట లేదు. ఇటువంటి సమావేశములు నాకు ప్రఖ్యాతిని తెస్తాయని నాకు తెలియును. మీకు వార్తాసాధనముల గుర్తింపు కూడా ఉంటుంది. అయితే నేను ఎక్కువగా వెళ్తున్న మన దేశమందలి గ్రామాలలో (ప్రస్తుతము నా పరిచర్య ఎక్కువగా అక్కడనే ఉన్నది) నిజముగా పనిచేయువారు ఇటువంటి సమావేశములో ఉండరు. వారు ఇంగ్లీషు మాట్లాడలేనివారు మరియు ఒక పత్రమును సమర్పించుట అనగా ఏమిటో తెలియని వారునై యున్నారు. కాని వారు ఆత్మతో నింపబడినవారు, వారు ప్రభువును ప్రేమించినవారు. మరియు వారు వెళ్ళి క్రీస్తు నొద్దకు తప్పిపోయిన ఆత్మలను తీసుకువచ్చువారునై యున్నారు. అటువంటి వారి కొరకు దేవునిని స్తుతించుదము. ఇతరులు వారి సంస్థలను నడుపుతు సంస్థనాయకులుగా ఘనతనొందెదరు. కాబట్టి ఇప్పుడు మొదట నుండిన వారు యేసు తిరిగి వచ్చినప్పుడు కడపటి వారగుదురు. కనుక మనలను మనము తగ్గించుకొనుట మంచిది. మన గూర్చి మనకు తక్కువ ఆలోచనలుండుట మంచిది. మనకుండిన డిగ్రీలు బిరుదులను బట్టి ఇతర క్రైస్తవులు అనుకొన్నంత గొప్పగా మనము దేవుని దృష్టిలో లేమేమో. ఇవన్నియు మనుష్యులను ఆకట్టుకొనును గాని దేవుణ్ణి ఆకట్టు కొనవు. నిజానికి అవి సాతానుకు కూడా గొప్ప అభిప్రాయమును కలుగజేయవు. ఏ మనుష్యుడైతే ఖచ్చితముగా నుండునో, ఏ మనుష్యుడైతే బయటకు ఉన్నట్లే లోపలనుండునో మరియు ఏ మనుష్యుడైతే అతడు అభ్యాసము చేయని దానిని బోధించడో అటువంటి పరిశుద్ధుడైన మనుష్యుని చూచి సాతాను భయపడును.

ప్రజలు నన్ను ఇలా అడుగుతారు, సహో. జాక్‌, ఉత్తర భారతదేశమునకు వెళ్లమని నీవు ప్రజలనెందుకు ప్రేరేపించవు? దానికి నా సమాధానము యేసు మొదట ఆయన చేసిన దానినే బోధించెను (అపొ.కా. 1:1). నేను ఉత్తర భారతదేశములో ఇంతవరకు నివసించలేదు. గనుక నేను ఇతరులకు చేయమని చెప్పలేను. అది చేయకూడనిదని నేను చెప్పుటలేదు. నేను చెప్పునదేమంటే నేను చేయని దానిని నేను బోధించలేనని మాత్రమే చెప్పుచున్నాను.

కాని నేనే క్రీస్తు శరీరమంతా కాదు. నేను అందులో ఒక భాగమును మాత్రమే. నేను క్రీస్తు శరీరములో సమతుల్యములేని ఒక అవయవమును. నేనెప్పుడును సమతుల్యము లేనివాడనుగా ఉందును. ఈ భూమిపై నడిచిన వారిలో సమతుల్యము కలిగినది యేసు ఒక్కడే.

నీవెలాగు సమతుల్యము లేనివాడవో, నేనును అట్లే సమతుల్యము లేనివాడను. అందుచేత మనలో ఎవ్వరము ఒక భాగముకంటే ఎక్కువైన వారమని అనుకోవద్దు. ప్రతి భాగము అవసరమైనదే- సువార్తికుడు, బోధకుడు, కాపరి, ప్రవక్త మరియు అపొస్తులుడు అందరును ప్రజలను క్రీస్తు శరీరములో అవయవములుగా చేయుటకును మరియు ఆ శరీరము కట్టబడుటకును అవసరమై ఉన్నారు (ఎఫెసీ 4:11,12,13).

మన యొక్క పిలుపు ఏమై యున్నది? క్రీస్తు శరీరములో అవయవముగా లేని ఒకనిని ఆ శరీరములో ఒక అవయవముగా చేయుటయే. ప్రాథమికముగా మన పిలుపు అది కాదా? మన మందరమును దానిని అంగీకరిస్తామని అనుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడు ''శరీరము'' అనుమాటను ఉపయోగించెను. కావున, భౌతిక శరీరము నుండి ఒక ఉదాహరణను ఉపయోగిస్తాను. ఇక్కడ ఒక ప్లేటులో ఒక బంగాళదుంప (అవిశ్వాసిని సూచించుచున్నది) ఉన్నదనుకొందము. అది నా శరీరములో ఒక భాóగముగా అవ్వవలసియున్నది. ఏ విధముగా అది జరుగును? సువార్త ద్వారా - చెయ్యి చాపబడి బంగాళదుంపను తీసుకొనుట ద్వారా అది మొదటగా జరుగును. ఈ పనిలో సువార్త ఎల్లప్పుడును మొదట పరిచర్య అయ్యున్నది. అందుచేతనే నేనెప్పుడైనను సువార్తను తక్కువగా చూడను. నేను దానికి ఎంతో విలువ ఇస్తాను. మరియు ప్రత్యేకముగా ఈ పరిచర్య నిమిత్తము ఉత్తరభారతదేశములో వేడి మరియు ధూళితో కూడిన స్థితిలో సువార్త ప్రకటిస్తున్న వారికి ఎంతో ఎక్కువగా విలువను ఇస్తాను. వారి యొక్క పత్రికలను చదువుటకు ఆసక్తి చూపుతాను, ఇటువంటి ఎంతో ప్రియమైన సహోదరుల పరిచర్య, అక్కడ వారి ప్రయాస గూర్చి చదువుటకు కొన్ని పత్రికలను నా ఇంటికి తెప్పించుకుంటాను. అప్పుడప్పుడు వారిలో కొందరిని కలుసుకొనుటకు అక్కడకు వెళ్ళుట కూడా జరిగినది. ఇక్కడ నా చెయ్యి ప్లేటునుండి బంగాణదుంపను తీసుకొనెను. ఆ బంగాళదుంప, సువార్తికుడు (చేయి) బయటకు వెళ్లి సువార్తను (బంగాళదుంపను నా నోటిలో పెట్టుట) ప్రకటించక పోయినట్లయితే అది ఎప్పటికిని నా శరీరములో ఒక భాగముగా అయి ఉండేది కాదు. కాని అంతేనా జరిగేది? బంగాళదుంపను నా నోటిలో పెట్టుకొన్నంత మాత్రమున అది నా శరీరములో ఒక భాగముగా అగునా? కాదు. అలా జరుగదు. కొంత సమయమైన తరువాత అది నా నోటిలో క్రుళ్లిపోయి నా నోటినుండి ఉమ్మివేయవలసియుండును. అదే విధముగా కొంతమంది క్రైస్తవ్యంలోనికి మారిన వారు మన యొక్క కొన్ని సంఘములలో క్రుళ్ళిపోవుచున్నారు. వీరు లోపలకు తీసుకొనబడి నోటిలోనే ఉంచబడుచున్నారు.

కాని అంతకంటే ఎక్కువ ఆ బంగాళదుంపకు జరగాల్సియున్నది. అది నా పండ్లచేత నమలబడి నలగ గొట్టబడవలసియున్నది. ఆ బంగాళదుంప అప్పటితో ఇక అంతా అయిపోయిందని ఊహించుకొనును కాని అంతా ఇంకా పూర్తి కాలేదు. ఆ బంగాళదుంప నా కడుపులోనికి వెళ్ళును. అక్కడ కనికరమేమిలేకుండా తనపై ఆమ్లములు పోయబడుటను కనుగొనును. అది సంఘములోనున్న ప్రవచన పరిచర్యయైయున్నది. ఆమ్లము మనపై పోయబడినప్పుడు అది సుఖముగా నుండదను విషయము మీకు తెలియును. ప్లేటునుండి అందుకోబడిన సున్నితమైన పరిచర్య చాలా చక్కగా నుండును. కాని ఆసిడ్‌ మనపై పోయబడినప్పుడు అది సంతోషముగా కనపడదు. ఇప్పుడు ఆ బంగాళదుంప పూర్తిగా విరుగగొట్టబడి అది ఒక బంగాళదుంప వలె కనపడదు. కాని కొన్ని వారముల తరువాత మనము చూచినట్లయితే, అది రక్తమాంసములు మరియు ఎముకలుగా మారును - అది నా శరీరములో ఒక భాగము అగును.

ఇప్పుడు ఈ కార్యమంతటిలో ఎవరి పని ప్రాముఖ్యమైనది? మనము పొందవలసిన పరిచర్య ఏమైయున్నది? మనము దీనులమైనట్లయితే, మనము సరియైన సమతుల్యము లేనివారమని ఒప్పుకొందుము. చెయ్యి కడుపు కంటె ఎక్కువ ప్రాముఖ్యమైనది కాదు. అవి ఒకదానిని బట్టి వేరొకటి పూర్తయినవి. దురదృష్టవశాత్తు క్రైస్తవ్యంలో అవయవముల మధ్య నిరంతరమైన పోటీ ఉన్నది. చెయ్యి తనయొక్క స్వంత రాజ్యమును నిర్మించుకొనుచున్నది. కడుపు తన స్వంత రాజ్యమును నిర్మించుకొనుచున్నది. అటువంటప్పుడు మనకు ఉండినదేమిటి? ఒక శరీరము కాదు, కాని ఒక నోరు అక్కడ, ఒక కడుపు ఇంకొక దగ్గర, ఒక చెయ్యి ఇక్కడ ఒక కాలు వేరొక చోట ఉండిన ఒక శరీర అవయవములను కోసి పరీక్షించు ప్రయోగశాలవలె నుండును. అది ఒక శరీరము కాదు. వీటన్నిటిలో మనకు ఏది ఎక్కువ అవసరమైయున్నది? మనకు ఉపదేశము కావలెను. కాని మనకు అన్నిటికంటే దీనత్వము ఎక్కువగా అవసరమైయున్నది. క్రీస్తు శరీరములో నున్న ప్రతి అవయవము - మనందరము సమానమైన ప్రాముఖ్యత కలవారమని మనము గ్రహించవలెను. మరియు సంస్థయొక్క గొప్ప నాయకుడు, ఇంగ్లీషు మాట్లాడలేకపోయినా, క్రీస్తునొద్దకు ఆత్మలను తెచ్చే బీదవాడైన సహోదరునికంటె ఈ పరిచర్యలో ఎక్కువ విలువైన వాడుకాదు. వారందరు ఒకే శరీరములో భాగములైయున్నారు.

''పైకి ఎక్కి వచ్చి నేనుండిన స్థానము నుండి విషయములను చూడు'' అని ప్రభువు చెప్పుచున్నాడు. భూమిపై నుండి చూచిన దానికంటె దేవుని స్థానమునుండి చూచినట్లయితే వేరుగా కనబడును. చాలామంది క్రైస్తవ పరిచారకులకు తమను గూర్చి ఎక్కువైన అభిప్రాయము ఎందుకుంటుంది? నిజముగా చెప్పండి, మీరు ఒంటరిగా నున్నప్పుడు మీ గూర్చి మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నవి? అవి, నీవు ఏ విలువాలేని వాడవని నిన్ను గుర్తింపచేసే దీనత్వపు ఆలోచనలా? ఆరుబయట కూర్చొని నక్షత్రాల వైపు చూచే సమయాలు నాకున్నవి. అక్కడ కోట్లాది నక్షత్రములున్నవనియు మరియు ఈ భూమి, విశ్వంలో ఒక చిన్ని నలుసు వంటిదనియు నేనెరుగుదును. ''ఓ దేవా! నీవెంత గొప్పవాడివి!ఈ విశ్వమెంత గొప్పది! ఈ నలుసు వంటి భూమిపై నేనొక ధూళి రేణువు వంటి వాడను. నేనిక్కడ నీకు ప్రాతినిద్యం వహిస్తున్నానని చెప్పుకుంటు గొప్ప గొప్ప విషయములు బోధిస్తున్నాను. నా గూర్చి నాకు సరైన అంచనా ఉండునట్లు దయచేసి సహాయము చేయుము''. మీరందరు దేవునితో అట్లు చెప్పవలెనని సిఫారసు చేస్తున్నాను.

దేవుడు దీనులకు కృపనిచ్చును. ఎవరికైనా తెలివితేటలుండవచ్చును. కాని దీనులు మాత్రమే కృపను పొందుకోగలరు. మనకు తెలివితేటలకంటె కృప ఎంతో ఎక్కువగా అవసరమైయున్నది. యౌవనస్థులై, వారి కుటుంబాలచేత వారి విశ్వాసము గూర్చి హింసింపబడిన, హిందూ మరియు ముస్లిము కుటుంబాలనుండి ప్రభువునొద్దకు వచ్చిన వారి గూర్చి ఆలోచిస్తాను. అటువంటి వారు మన సంఘములలో ఒక సంఘమునకు వచ్చినట్లయితే వారు ఏమి చూచెదరు? వారు అక్కడ యేసు ఆత్మను చూచెదరా? మన చుట్టూ ఉండిన ప్రజలకు మనలను గూర్చి ఎంతో తప్పు అభిప్రాయమున్నది.

సమర్థవంతమగు పరిచర్యకు అది సువార్త ప్రకటనైనా లేక ఇంకేదైనా మొట్టమొదట కావలసినది హెబ్రీ 2:17లో వ్రాయబడినట్లు యేసు ''అన్ని విషయములలో తన సహోదరుని వంటివాడాయెను'' అనునది నేనెప్పటి నుండియో నమ్ముచుంటిని. ప్రతి విషయములోను ఆయన తన సహోదరులవలె కావలసివచ్చెను -అనుదానిని నేను ధ్యానించాలని కోరుకొనుచున్నాను. నేను ఏ విధముగా ఇతరులకు సేవచేయగలను? అన్ని విషయములలోనూ నేను వారివలె కావలసియున్నది. నేను వారుండిన స్థానమునకు దిగవలసి యున్నది. నేలపై ప్రాకు ఒక చీమతో నేనెందుకు సంభాషించలేను? ఎందుకంటే నేను పెద్దపరిమాణములో నున్నాను. నేను మానవరూపములో వెళ్ళినట్లయితే అది ఎంతో భీతి చెందును. ఆ చీమతో నేను సంభాషించుటకున్న ఒకే ఒక మార్గము మొదట దానివలె మారుటైయున్నది.

దేవుడు మనతో సంభాషించుటకు ఒకే ఒక మార్గము, ఆయన మనవలె మారుట ద్వారా, మనమందరము ఆ విషయమును అర్థము చేసికొనగలము. కాని మనము ఇతరులకు చేయు పరిచర్యలో కూడా - అది మన స్థానిక సంఘములో కావచ్చును లేక ఎవ్వరు వెళ్ళని ప్రదేశములో కావచ్చును, మొదట అన్ని విషయములలో వారివలెనగుట, యెహెజ్కేలు చెప్పినట్లు ''వారు కూర్చుండుచోట కూర్చుండుట'' (యెహెజ్కేలు 3:15) అనునది మనము జ్ఞాపకముంచుకొనవలెను. దాని అర్థము, ఉదాహరణకు, ఏవిధముగా కూడా మనము ఇతరులకంటె ఎక్కువగా హెచ్చించి కొనుటకు కోరుకొనకూడదు. అందుచేత యేసు ప్రభువు తన శిష్యులకు ఎల్లప్పుడు ''బోధకుడు'', ''తండ్రి'' లేక ఇంకా ఏ బిరుదులు తీసుకొనవద్దని చెప్పెను. ఎందుకనగా బిరుదు నీవు ఎవరికైతే సేవ చేస్తున్నావో వారి కంటె నిన్ను హెచ్చిస్తుంది. వారిలో ఒకరిగా నుండుటకు బదులు నీవు నీ గొప్పతనము చేత వారికి గొప్ప భయమును కలుగ చేయుదువు.

అటువంటి హెచ్చరికలుండినా ఈనాడు క్రైస్తవ ప్రపంచములో ఎందరో బిరుదులు కలిగియున్నారు. లోకములో నున్న పద్ధతులు తెచ్చుకొనుట ద్వారా మనము దేవునికి గొప్పగా సేవ చేయవచ్చునని అనుకొందుము. కాని అది ఏమాత్రము సత్యము కాదు.

పాత నిబంధనలో, ఫిలిష్తీయులు ఒకమారు దేవుని మందసమును పట్టుకొనినట్లు మనము చదువుదుము. అయితే దానిని బట్టి వారికి సమస్యవచ్చుట చేత దానిని వారు ఒక ఎడ్ల బండిపై వెనక్కు పంపివేసిరి. కొన్ని సంవత్సరముల తర్వాత రాజైన దావీదు మందసమును తీసుకువచ్చుటకు ముందు, ఫిలిష్తీయులు మందసమును తీసుకు వచ్చిన పద్ధతి బాగుందని అనుకొనిరి. ''ఇది మంచి ఆలోచన, ధర్మశాస్త్రములో చెప్పినట్లు లేవీయుల భుజములపై మందసమును మోయుట తక్కువ దూరమునకు సరిగా నుండును. కాని దూరపు ప్రయాణములకు ఫిలిష్తీయుల పద్దతి తప్పనిసరిగా బాగుండెను'' అని అతడు అనుకొనెను. ఆవిధముగా అతడు కూడా మందసమును ఎడ్ల బండిపై నుంచెను. అయితే ఏమి జరిగెనో మీకు తెలియును. ఎద్దుల కాలుజారుట వలన తడబడగా ఉజ్జా చేయిజాపి మందసము జారిపోకుండునట్లు దానిని పట్టుకొనెను.

అప్పుడు యెహోవా కోపము రగులుకొనుట చేత ఉజ్జాను మొత్తగా ఆ స్థలమందే అతడు మరణించెను. ఎందుకనగా ఉజ్జా లేవీయుడు కాదు. దేవుడు ఆయన పద్ధతులను మార్చడు. అప్పుడు దావీదు ఎంతగానో కలత చెందెను. అయితే ఇదంతయు ఎక్కడ ప్రారంభమయ్యింది? అది దావీదు ఫిలిష్తీయులు చేసినట్లు చేయుటతో ఇది ప్రారంభమాయెను. మరియు దాని ద్వారా మరణము వచ్చినది.

క్రైస్తవ పనిలో ధనము ప్రథమ కారణమైనప్పుడు, క్రైస్తవ సంఘములు వ్యాపార సంస్థలు నడుచు రీతిని నడుచునప్పుడు, మనము లోకపు పద్ధతులను అనుసరించినప్పుడు ఎల్లప్పుడు మరణము వచ్చును.

మనలను మనము అడుగు కొనవలసిన ఒక మంచి ప్రశ్న ఏమనగా మనకు వచ్చు ధనము ఆగిపోయినట్లయితే మనము నడుపు సంఘము లేక సంస్థ కొనసాగునా లేక సమస్తము కూలిపడిపోవునా అనునది? నిజమైన దేవుని కార్యము ధనమును ఉపయోగించవచ్చును కాని ఎప్పుడును ధనముపై ఆధారపడి యుండదు. అది పరిశుద్ధాత్మునిపై మాత్రమే ఆధారపడియుండును.

''ఆత్మ మత్సరపడెను'' (యాకోబు 4:5) అని బైబిలు చెబుతుంది. తనకు సంఘములో చెందవలసిన స్థానమును వేరొకటి కాని, లేక వేరొకరు కాని తీసుకొనినప్పుడు ఆత్మ మత్సరపడెను. అది సంగీతము కావచ్చును. నేను సంగీతమునకు వ్యతిరేకిని కాను ప్రపంచమును అనుకరించకుండా మనకు అందుబాటులోనుండిన శ్రేష్టమైన సంగీతము మన సంఘములో నుండవలెనని నేను నమ్ముదును కాని మనము సంగీతముపై ఆధారపడకూడదు.

ఉదాహరణకు, ఒక కూటమి చివర్లో, ఒక సంగీత వాయిద్యమును మెల్లగా వాయించుటద్వారా, ప్రజలను వారు నిర్ణయములు తీసుకొనులాగు చేయుదమనుకొంటే ఏమిటి? అది మానసికమైన ఉద్రేకమును ప్రేరేపించుటయే తప్ప పరిశుద్ధాత్మ యొక్క శక్తికాదు. దేవుని యొక్క

మాట ఆత్మయొక్క శక్తితో యేసు బోధించునట్లుగా మరియు పేతురు బోధించునట్లు బోధించినట్లయితే, చివరన ఏదొక సంగీత వాయిద్యము మెల్లగా వాయించవలసిన అవసరముండదు. నీకు కావలయునంటె నీవు అటువంటివి ఉంచుకొనవచ్చును, కాని అది నీకేమి ఉపయోగపడదు. కాని నీవు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందనట్లయితే, అప్పుడు ప్రజలు నిర్ణయము తీసుకొనునట్లు వారిని మానసికముగా ప్రేరేపించవలసియుండును. అయితే కాలము గడిచిన తరువాత, అటువంటి నిర్ణయములు ఉద్రేకభరితమైనవనియు పైపైనుండినవనియు నీవు తెలిసికొందువు.

పరిశుద్ధాత్ముడు ఆయనకు సంఘములో నుండవలసిన స్థానము గూర్చి అత్యాశక్తితో అపేక్షించుచున్నాడు. నీవు ఆయన స్థానమును వేదాంతముతో పూరించలేవు. నీవు ధనముతో భర్తిచేయలేవు, నీవు ఆయన స్థానమును సంగీతముతో భర్తీచేయలేవు. వీటన్నిటినీ బట్టి దేవునికి కృతజ్ఞతలు. వాటన్నిటిని ఉపయోగించుకొందుము. యేసు ధనమును ఉపయోగించెను. గనుక ఏ విధముగా మనము దానిని వ్యతిరేకించగలము? యేసు కీర్తన పాడెను అని వ్రాయబడియున్నది. హెబ్రీ 2:12 లో తండ్రిని స్తుతించుటలో యేసు సంఘమును నడిపించును, అని మనము చదువుదుము. గనుక మనము దేవునిని స్తుతించునప్పుడు మనము మన నాయకునినే అనుసరిస్తున్నాము. ఏవిధముగా మనము సంగీతమునకు వ్యతిరేకముగా నుండగలము? మనము వీటిలో దేనికి వ్యతిరేకులముకాము. కాని ఇక్కడ ప్రశ్న ఏమిటనగా మనము దేనిమీద ఆధారపడుతున్నామనేది.

మనము గొప్ప వ్యక్తులపైనను లేక గొప్ప వక్తలపైనను ఆధారపడుచున్నామా? లేదు పరిశుద్ధాత్ముడు మత్సరపడుచున్నాడు.

యేసు ఒక సేవకునిగా మారెను.ప్రతి క్రైస్తవ నాయకుడు సేవకుని జీవిత విధానముగూర్చి మరియు సేవకునిగా యుండుట గూర్చి మాట్లాడును మరియు దాని గూర్చి అనేక పుస్తకములు కూడా వ్రాయబడెను. కాని అభ్యాసాత్మకముగా దాని అర్థమేమిటి? నీ తోటి పనివానిని ఎలాచూచుచున్నావు? నీ గుంపులో నిన్ననే చేరిన నీ తోటిపని వానిని ఎలా చూచుచున్నావు? అతడు నిజముగా నీకొక సహోదరునిగా ఉన్నాడా? లేక నీయందు భయముతో జీవిస్తున్నాడా? ఒకవేళ అలా అయినట్లయితే నీవు తీర్పుదినము వరకు సేవకత్వము గూర్చి బోధించినా దాని గూర్చి నీవేమి అర్థము చేసికొనలేదని నేను చెప్పగలను. నీవు యేసును చూడలేదు.

ప్రభువైన యేసు చాలా సామాన్యముగా నుండెడివారు. ఆయనెప్పుడు ప్రజలను అతిగా భయపడేటట్టు చేయలేదు. నేను మనుష్య కుమారుడనని ఆయన చెప్పెను. దాని అర్థము నేనొక సామాన్య మానవుడిని అని. ఆయన శాశ్వత కాలమునుండి తండ్రితో జీవించిన పవిత్రమైన మరియు పరిశుద్ధుడైన దేవుని కుమారుడై యుండెను. కాని ఆయన ఈ భూమిపైకి వచ్చి ఒక సామాన్యమైన మనుష్యుడుగా జీవించెను. ఆయన అన్నిటిలో ఆయన సహోదరులవలెనాయెను.

మనము అన్ని విషయములలో మన సహోదరులవలెనగుటకు మనలో ఉన్నది కొంత మరణించాల్సియున్నది. ఆయన మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను (ఫిలిప్పీ 2:8) అని యేసును గూర్చి చెప్పబడెను. మన యొక్క దీనత్వమునకు మరణము సరియైన ఋజువుగానుండును.

భూమిలో పడి మరణించిన గోధుమగింజ తప్పనిసరిగా ఫలించునన్న నమ్మకమున్నది. 22 సంవత్సరముల క్రితము నా జీవితములో యధార్థత గూర్చిన సంకటస్థితి వచ్చినప్పుడు నేను భారతదేశములో ప్రభువు కొరకు చేయగలిగిన గొప్పపని, నేను భూమిలో పడి మరణించుట - అది నా స్వంత యిష్టమునకు ప్రజలు నా గూర్చి ఏమనుకొనుచున్నారను దానికి నా యొక్క అభిలాషలకు, నా యొక్క ఆశయాలకు, నా యొక్క ధనాశకు, ప్రతి విషయమునకు - మరియు ముఖ్యముగా నా స్వజీవమునకు, ఆ విధముగా అప్పటినుండి నాకు యేసు మాత్రమే అన్నియు అయ్యెను. గనుక ప్రతిదినము నిజాయితీతో ఆయనవైపు చూస్తూ ''ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు'' (కీర్తనలు 73:25) అని చెప్పగలిగియుంటిని.

నా పడకపై పరుండి ప్రభువుతో, ''ప్రభువా, నా పరిచర్య నా దేవుడు కాదు, నీవు మాత్రమే నా దేవుడవు. ఎవ్వరుకూడ నీ యొక్క స్థానమును తీసుకొనలేరు. నీవు నాకు సమస్తమైయున్నావు. నీవు నా స్వరమును తీసుకొనవచ్చును. పక్షవాతము వచ్చిన వానిగా చేయవచ్చును లేక నీ కిష్టమైనట్టు నన్ను చేయవచ్చును. అప్పుడుకూడా నేను నా హృదయమంతటితో నిన్ను ప్రేమింతును'' అని చెప్పిన సమయములు నాకున్నవి. దేవుని సన్నిధిలో పరిపూర్ణ సంతోషము ఉన్నది కావున ఎవ్వరు కూడా నానుండి నా యొక్క సంతోషమును తీసివేయలేరు. ఆ ఊటనుండియే మన ద్వారా జీవజలనదులు ప్రవహించును.

ఆఖరుగా మరొక విషయం అనేక సంవత్సరాల క్రితము, నేను యౌవన క్రైస్తవునిగా నుండినప్పుడు ప్రభువు 2సమూయేలు 24:24 నుండి నాతో మాట్లాడెను. అక్కడ దావీదు వెల ఇయ్యక తీసుకొనిన దానిని నేను యెహోవాకు బలిగా ఇయ్యను అని అనెను. ఆరోజు ప్రభువు నా హృదయముతో మాట్లాడిన మాట, ఆయన ఈ లోకమునకు వచ్చినపుడు, ఆయన తన సమస్తమును వెలగా అర్పించివచ్చెను. మరియు నేను ఆయనను సేవించవలయుననినయెడల నేను కూడా అట్టి ఆత్మతోనే సేవించవలెను. నా యొక్క సేవ ఏదైనప్పటికిని అది కొంత వెల యివ్వవలసినదైయున్నది.

ప్రభువునకు నీసేవ ఎలా ఉన్నది? అది నీవు ఏదొక వెల చెల్లించేదిగానున్నదా? ఈనాడు భారతదేశములో అనేకులు వారొక లౌకిక ఉద్యోగములో ఉండి సంపాదించిన దానికంటె ఐదు లేక పదిరెట్లు ఎక్కువ క్రైస్తవ పరిచర్యలో సంపాదించు చున్నారు. అదొక త్యాగమా? 31 సంవత్సరములు క్రితము నేను భారత నౌకాదళములో ఉద్యోగము విడచినప్పుడు ఒక నిర్ణయమును తీసుకొన్నాను. అది నాయొక్క లౌకిక ఉద్యోగములో ఉండి సంపాదించగలిగే నెల జీతము కంటె ఎక్కువైన సొమ్మును నేనెప్పుడు తీసుకొనకూడదని అనుకొంటిని. ఆ నిర్ణయము 31 సంవత్సరములుగా నన్ను కాపాడినది.

మనము ఇతరులను తీర్పు తీర్చకూడదు. మరియు నేను ఇక్కడ మిమ్మును తీర్పు తీర్చుటకు లేను. మీలో చాలామందిని నేను ఎరుగను గనుక, ''నేనొకవేళ ఈనాడు లౌకికమైన ఉద్యోగములో ఉండినట్లయితే ఏ మాత్రము రాబడి కలిగియుందును'' అని మీకు మీరు అడుగుకొనుడి అని చెప్పుట నాకు సులువు.

జాన్‌ వెస్లీ, తన తోటి పనివారితో నీవు సువార్త ప్రకటించుట ద్వారా ధనికుడు వైతివని ఎప్పుడును చెప్పబడకూడదని చెప్పుచుండెడివారు. క్రైస్తవ పని ఎక్కువగా ఎక్కడ వెనుకబడివుందో నీకు తెలియునా? ఇక్కడనే, ఈ విషయములోనే. నీవు సిరిని దేవునిగా సేవించలేవు.

మనము అన్నిటికంటే ముందుగా నిర్ణయించుకోవలసిన అంశము అదియే. ఇక్కడ మనము సూర్యుని క్రిందనుండిన ప్రతి విషయము గూర్చి చర్చించుకొనుచు సమయమును వెచ్చించ వచ్చును. కాని, ధనాశ అనేటటువంటి సమస్య గూర్చి మనము నిర్ణయము తీసుకోనట్లయితే మన పరిచర్య అంతయు వ్యర్థమే.

ప్రజలు వారి నివాసమును ఒక స్థలము నుండి వేరొక స్థలమునకు మార్చుచుందురు. దానిలో తప్పేమి లేదు. యేసు కూడా ఆయన నివాసమును పరలోకము నుండి భూమికి మార్చెను. కాని, ఆయన మార్చినప్పుడు ఒక మెట్టు దిగువకుండెను - ఆయనకు ప్రజలగూర్చి నిజమైన భారము కలిగియుండుటచేత అట్లు చేసెను, నీవెందు చేత మార్చితివి?

మరల నేను నిన్ను తీర్పు తీర్చుట లేదు. కేవలము అడుగుచున్నాను. నీకు గొప్ప భారము కలదని చెప్పి, ఈ దేశమును గూర్చి నీవు క్రొత్తగా మార్చిన ప్రదేశము నుండి ప్రభువునకు ఇంకా ఫలభరితముగా ఈ భారతదేశములో సేవ చేయవచ్చునని నీవు నీ నివాసమును మార్చితివా, నీకు నిజమైన భారమున్నదా?

మనము దక్షిణ భారతదేశపు సౌఖ్యములలో జీవిస్తూ, ఉత్తర భారతదేశపు పల్లెల గూర్చి భారము కలిగియుంద

అధ్యాయము 2
దేవునికి కావలసిన వారు

ఈనాడు దేవునికి కావలసిన వారు

  • ఎవరైతే ప్రతి దినము ఆయన ముఖము ఎదుట నిలువబడి ఆయన స్వరము విందురో,
  • ఎవరికైతే వారి హృదయములో దేవునిపై కాక దేనిపైన కాని ఎవరిపైన కాని కోర్కె ఉండదో,
  • ఎవరైతే ఏ రూపముననున్న పాపమునైనా ద్వేషించి వారి మార్గాలన్నిటిలో సత్యమును, నీతిని ప్రేమించునట్లు దేవుని యెడల గొప్ప భయము కటిగియుందురో,
  • ఎవరైతే కోపాన్ని మరియు కామపూరిత పాపము ఆలోచనలను జయించి, వారి ఆలోచనల్లో లేక వైఖరిలో పాపము చేయుట కంటే చనిపోవుట మేలు అని తలంతురో,
  • ఎవరి జీవన శైలి ప్రతిదినము వారి సిలువ నెత్తికొని పరిపూర్ణులగుటకు సాగిపోవునట్లుండునో మరియు ఎవరైతే వారి స్వంత రక్షణను ఎల్లప్పుడూ భయముతో వణకుతో కొనసాగించుకొందురో,
  • పరిశుద్ధాత్మతో పూర్తిగా నింపబడి, ఇంకొకరు వారి నెంతగా కవ్వించినా వారి యెడల చూపు ప్రేమ నుండి కదలనకుండునట్లు ఎవరైతే ప్రేమలో వేరుపారి యుందురో,
  • ఎవరైతే మనుష్యుల యొక్క పొగడ్తలు లేక ఆత్మీయ ఎదుగుదల లేక దైవికముగా ఇవ్వబడిన పరిచర్య కాని లేక మరి ఏ ఆధిక్యతనైనా వారు పరిశుద్ధులలో కడమ వాని కంటే కూడా తక్కువ వానిననే ఆలోచన నుండి తప్పించనంతటి దీనత్వములో వేరుపారి యుందురో,
  • ఎవరైతే దేవుని కార్యము ద్వారా ఆయన యొక్క స్వభావమును మరియు ఉద్దేశ్యములను అర్థము చేసికొనుచు మరియు దేవుని వాక్యములో అతి చిన్న ఆజ్ఞకు కూడా అవిధేయత చూపకుండా లేక ఇతరులకు దానిని బోధించుటలో అలక్ష్యము చేయకుండా ఉండునట్లు ఆ వాక్యమును బట్టి వణుకుచుందురో,
  • ఎవరైతే మానవుల యెడల దేవుని సంపూర్ణ ఉద్దేశ్యమును ప్రకటించుచూ ఆత్మీయ జారత్వమును మరియు వాక్యానుసారము కాని మానవ ఆచారములను బహిరంగపరచుదురో,
  • ఎవరికైతే దైవభక్తి గూర్చిన మర్మము గూర్చియు, క్రీస్తు మానవ శరీరముతో వచ్చి ఆయన శరీరము ద్వారా ఒక నూతనమైనదియు మరియు జీవముగలదియునైన మార్గము తెరచెనను విషయము గూర్చి పరిశుద్ధాత్మ యొక్క బయల్పాటు కలిగియుందురో,
  • ఎవరైతే ఆసక్తితో కష్టపడి పనిచేయువారై యుండి హాస్యానికి తావిచ్చువారును మరియు తీరికచేసికొని పిల్లలతో ఆడుట ఎలాగో తెలిసిన వారును మరియు దేవుడు ప్రకృతిలో ఇచ్చిన మంచి విషయములను బట్టి సంతోషింపగలిగిన వారైయుందురో,
  • ఎవరైతే సన్యాసులుగా నుండక, అదే సమయములో క్రమశిక్షణ జీవితాన్ని జీవిస్తూ కష్టమైన పరిస్థితులను గూర్చి భయపడరో, ఎవరికైతే ఖరీదైన దుస్తులపై లేక క్రొత్త ప్రదేశాలను చూచుటయందు ఆసక్తి యుండదో మరియు ఎవరైతే వారి సమయాన్ని ఆత్మీయముగా లాభకరముకాని కార్యక్రమములపై వ్యర్థ పుచ్చరో మరియు వారి యొక్క ధనాన్ని అనవసరము కాని వాటిని కొనుటకు ఖర్చుచేయరో,
  • ఎవరైతే రకరకాల రుచుల భోజనపదార్థాల విషయములో జయము పొందుదురో మరియు ఎవరైతే సంగీతానికి లేక ఆటలకు లేక చట్టబద్దమైన ఏ కార్యక్రమమునకైనా బానిసకారో,
  • ఎవరైతే ఇబ్బందులు దూషణలు, శ్రమలు, అపనిందలు, శారీరక అస్వస్థతలు, ఆర్థిక ఇబ్బందులు మరియు బంధువుల నుండి మత పెద్దల నుండి వ్యతిరేకతల కొలిమిలో దేవుని చేత క్రమశిక్షణ పొందియుండిరో,
  • ఎవరైతే, వారిని వారు పాపులలో అధములుగా చూచుకొనుట వలన పాపులలో ఘోరమైన పాపుల యెడలను, విశ్వాసులలో చెడ్డవారి యెడలను సానుభూతి కలిగియుండి, వారిని గూర్చి నిరీక్షణ కలిగియుండి, కనికరముతో నిండియుండుదురో,
  • ఎవరైతే తమ పరలోకపు తండ్రి ప్రేమ యందు లోతుగా వేరుకలిగి యుండుట చేత, దేని గూర్చియు ఎప్పుడు ఆతురత పడకయుండి సాతాను గూర్చి కాని, దుష్టులైన మనుష్యుల గూర్చి కాని లేక క్లిష్ట పరిస్థితులు లేక దేని గూర్చి భయపడకుందురో,
  • ఎవరైతే అన్ని విషయములు వారి మేలు కొరకై సర్వాధికారియైన దేవుడు సమకూర్చి జరిగించునని నమ్ముట చేత ఎల్లప్పుడు మనుష్యులందరి కొరకు, అన్ని సంగతుల గూర్చి మరియు అన్ని సమయములందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింతురో,
  • ఎవరైతే వారి ఆనందాన్ని దేవుని యందు మాత్రమే కనుగొనుట చేత దేవుని యొక్క సంతోషాన్ని పొందిన వారై, చెడు మనో భావాలను జయించుదురో,
  • ఎవరైతే వారి కున్న సహజసిద్ధమైన సామర్థ్యమునందు నమ్మికయుంచక, అన్ని పరిస్థితులలో దేవుడే వారిని సిగ్గుపడనివ్వడని నమ్మి జీవము గల విశ్వాసము కలిగియుందురో,
  • ఎవరైతే వారి స్వంత గ్రహణ శక్తి చెప్పు మాటలను బట్టి కాక పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి జీవించుదురో,
  • ఎవరైతే నిజముగా క్రీస్తు చేత పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము పొందుదురో (అంతేకాని ఏదో ఉద్వేగపూరితమైన నఖిళీ అనుభవము లేక వేదాంత పరమైన వాదనతో ఒప్పింపబడుట కాదు),
  • ఎవరైతే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఉండి, వారికి ఆయన ఇచ్చే మానవాతీత వరములతో యుందురో,
  • ఎవరికైతే సంఘము, క్రీస్తుయొక్క శరీరమని (ఒక సమాజము లేక మత సంస్థ కాదు) బయల్పడునో మరియు ఎవరైతే వారి శక్తి యుక్తులు, వారి వస్తు వాహనాలు మరియు ఆత్మీయవరాలు ఆ సంఘమును కట్టుటకు వెచ్చింతురో,
  • ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా వారి నాలుకలకు కళ్లెము వేయుట నేర్చుకుందురో మరియు ఎవరి నాలుకయితే ఎప్పుడూ దైవికమైన వాక్యముతో మండుచుండునో- ఎవరైతే అన్నిటిని విడిచిపెట్టి, ధనానికి కాని వస్తు వాహనాలకు కాని అతుక్కుని ఉండరో మరియు
  • ఎవరైతే ఇతరుల నుండి ఏ బహుమతులను ఆశించరో,
  • ఎవరైతే వారి ఇహలోక అవసరాలన్నిటిని గూర్చి దేవునియందే నమ్మిక యుంచెదరో మరియు ఎవరైతే వారి భౌతిక అవసరాల గూర్చి ఎప్పుడూ ఎవరికీ తెలియునట్లు ప్రవర్తించరో లేక వారు పడిన శ్రమల గూర్చి వారి మాటలలో కాని లేక ఉత్తరాల నివేదికల ద్వారా తెలియపర్చరో,
  • ఎవరైతే మొండిగా నుండక మర్యాదగాను, విమర్శకు తావిచ్చువారిగాను మరియు తమకంటే పెద్దవారి నుండి మరియు జ్ఞానముగల సహోదరులనుండి దిద్దుబాటు తీసుకొనుటకు ఆశ కలిగియుందురో,
  • ఎవరైతే ఇతరులను అధిగమించాలని లేక ఇతరులకు సలహా ఇవ్వాలని (అయితే అడిగినప్పుడు సలహా ఇచ్చుటకు సిద్ధముగా ఉండవలెను) మరియు నాయకులుగా పెద్దలుగా అనిపించుకొనుటకు ఆసక్తి లేని వారును, ఎవరైతే కేవలము సామాన్యమైన సహోదరులుగా మరియు అందరికి సేవకులుగా ఉండుటకు ఆశ కలిగియుందురో,
  • ఎవరితోనైతే సులువుగా కలిసిపోగలమో మరియు ఎవరైతే యిబ్బంది పర్చబడుటకు ఇష్టపడుదురో మరియు ఇతరుల వారిని ఉపయోగించుకొనుటకు యిష్టపడుదురో,
  • ఎవరైతే లక్షాధికారికిని, భిక్షమెత్తుకొనువానికిని, తెలుపు రంగు చర్మమునకును నలుపు రంగు చర్మమునకును, తెలివితేటలు కలవారికిని తెలివిలేని వానికిని మరియు నాగరికునికి మరియు అనాగరికుల మధ్య తేడా చూపక అందరిని ఒకేలా చూచునో,
  • ఎవరైతే తన భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు లేక ఇతర విశ్వాసుల చేత క్రీస్తు యెడల తనకున్న అంకిత భావమునుండి లేక దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట నుండి ఏ మాత్రము తగ్గకుండా చూచుకుందురో,
  • ఎవరైతే దేవుని నియమముల విషయములో రాజీపడుటకు సాతాను ఎటువంటి ఆశను చూపినా అటువంటి లంచమునకు (అది ఘనత లేక ధనము లేక ఇంకేదైనా కావచ్చు) లొంగరో, ఎవరైతే మన నాయకులకు కాని, ప్రభుత్వ అధినేతలకు కాని భయపడక క్రీస్తు కొరకు భయము నెఱుగని సాక్షులుగా నుందురో,
  • ఎవరైతే దేవునిని కాదని ఈ భూమిపై నుండిన ఏ మానవుని సంతోషపర్చుటకు ఆశ చూపరో మరియు దేవునిని సంతోష పర్చుటకు అవసరమైతే మనుష్యులందరినీ అభ్యంతరపర్చుటకు (కోపము తెప్పించుటకు) ఇష్టపడుదురో,
  • ఎవరికైతే దేవుని మహిమ, దేవునిచిత్తము మరియు దేవునిరాజ్యము మానవఅవసరము కంటే మరియు వారి స్వంత సౌఖ్యము కంటే ముందుగా నుండునో,
  • ఎవరైతే దేవుని కొరకు ''నిర్జీవ క్రియలు'' చేయుటకు ఇతరుల చేత కాని లేక వారి స్వంత ఆలోచన చేతకాని బలవంత పెట్టబడకుండా యుండి, వారి జీవితాల్లో దేవుని చేత బయల్పర్చబడినవి మాత్రమే చేయుటకు ఆసక్తి మరియు సంతృప్తి కలిగియుందురో,
  • ఎవరైతే క్రైస్తవ పనిలో ఆత్మీయమైన దానిని మరియు మనసుకు సంబంధించిన దానిని వేరు చేసి చూడగలిగియుందురో,
  • ఎవరైతే విషయాలను భూసంబంధ దృష్టితో కాక పరలోకసంబంధ దృష్టితో చూచుదురో,
  • ఎవరైతే దేవుని కొరకు వారు పడిన శ్రమకు వారికివ్వజూపే ఇహలోక సంబంధమైన బిరుదులన్నిటిని మరియు ఘనతలన్నిటిని తిరస్కరింతురో,
  • ఎవరైతే మానక ప్రార్థింతురో మరియు అవసరమైనప్పుడు ఉపవాసముండి ప్రార్థింతురో,
  • ఎవరైతే ధారాళముగా, సంతోషముగా, రహస్యముగా మరియు జ్ఞానముతో ఇచ్చుటను నేర్చుకుందురో,
  • ఎవరైతే మనుష్యులందరి కొరకు వారిలో కొందరినైనా రక్షించుటకు అన్ని విషయములలో వారివలె అగుటకు యిష్టపడుదురో,
  • ఎవరైతే ఇతరులు రక్షింపబడవలెనను కోర్కె మాత్రము కాక, వారిని క్రీస్తు యొక్క శిష్యులుగా చేయవలెననియు, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికి విదేయత చూపునట్లు వారిని సత్యము యొక్క గ్రహింపులోనికి తేవలెనని ఆశ కలిగియుందురో,
  • ఎవరైతే ప్రతి స్థలములో దేవుని కొరకు స్వచ్ఛమైన సాక్ష్యము స్థిరపర్చబడుటకు చూచుటకు ఆశ కలిగియుందురో,
  • ఎవరికైతే సంఘములో క్రీస్తు మహిమ పర్చబడవలెననే ఆశ మండుచుండునో,
  • ఎవరైతే ఏ విషయములోనూ తన స్వప్రయోజనమును వెదకుకొనరో,
  • ఎవరైతే ఆత్మీయమైన అధికారము మరియు ఆత్మీయమైన గౌరవము కలిగియుందురో,
  • ఎవరైతే అవసరమయితే దేవుని కొరకు లోకములో ఒంటరిగా నిలువబడుదురో,
  • ఎవరైతే పాతకాలపు ప్రవక్తలు మరియు అపొస్తలుల వలె ఏ మాత్రము రాజీపడని వారుగా యుందురో, అటువంటి వారు కావలసియున్నది.

అటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉండుట చేత ఈనాడు లోకములో దేవుని పని ఇబ్బంది పడుచున్నది. పాపముతోను మరియు అవినీతితోను నిండిపోయిన జనాంగము మధ్యన మరియు రాజీపడుచున్న క్రైస్తవ్యము మధ్య అటువంటి దైవజనునిగా యుండుటకు నీ హృదయమంతటితో నిశ్చయించుకొనుము. దేవునికి పక్షపాతము ఉండదు కావున, నీవు కూడా అటువంటి వానిగా నుండుట సాధ్యమే, అయితే, నీ మట్టుకు నీవు అటువంటి వానిగా నుండుటకు ఆసక్తి కలిగియుండవలెను. దేవుడు ఒకని జీవితములో అతడికి తెలిసినంత వరకే చేయుట కొరకు కాని విధేయతను కాని అడుగుచున్నాడు. కనుక నీ జీవితములో దైవిక జీవితము గూర్చిన అవగాహన నీకు కొద్దిగా యుండినా, (నీవు దేవుడిచ్చు వెలుగలో నడుస్తూ సంపూర్ణతలోనికి సాగిపోవుచున్నప్పుడు నీలో ఆ అవగాహన పెరుగుచుండును) నీవు అటువంటి వానిగా కావచ్చును. అటువంటప్పుడు నీవు అటువంటి వానిగా నుండకుండుటకు కారణమేమి లేదు. శరీరములో మంచిది ఏదీ నివసించదు కాబట్టి, పైన చెప్పబడిన లక్షణముల కొరకు మనము దేవుని కృపను కోరుకొనవలసియున్నది.

కాలము సమాప్తమగుచున్న ఈ రోజులలో అటువంటి వానిగా నుండుటకు ప్రతిదినము దేవునికి మొఱ్ఱపెట్టుము, అప్పుడు ఆయన నీకు కృప నిచ్చును. ఆమేన్‌.

అధ్యాయము 3
నేను నేర్చుకొనిన కొన్ని ముఖ్యమైన సత్యములు

ఒక క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా నేనుండిన 40 సంవత్సరాలలో, నన్ను ప్రోత్సహించి నా జీవితమునకు ఉద్దేశ్యమును దిశను ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సత్యములను నేను నేర్చుకొంటిని. అవి మీకు కూడా ప్రోత్సాహకరముగా నుండునట్లు నేను వాటిని ఇక్కడ మీతో పంచుకొనుచున్నాను.

దేవుడు యేసును ప్రేమించినట్టే మనలను ప్రేమించుచున్నాడు

''నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడా ప్రేమించితివి'' (యోహాను 17:23).

ఇది నేను బైబిలులో కనుగొన్న అతి గొప్ప సత్యము. ఇది నన్ను ఒక భద్రతలేని, నిస్పృహ కలిగిన విశ్వాసినుండి దేవునిలో పూర్తి భద్రతను కలిగి, ఎల్లప్పుడు ప్రభువు యొక్క ఆనందముతో నిండిన విశ్వాసిగా మార్చివేసెను. దేవుడు మనలను ప్రేమించుచున్నాడని చెప్పే వచనములు బైబిలులో అనేకమైనవి కలవుగాని ఇది ఒక్కటే ఆ ప్రేమ యొక్క విశాలతను గూర్చి చెప్పుచున్నది-దేవుడు యేసును ప్రేమించినంతగా మనలను కూడా ప్రేమించెను. మన పరలోకపు తండ్రి తన కుమారులలో ఎవరినైనను ప్రేమించు విధానములో పక్షపాతము లేదు గనుక, ఆయన కుమారులమైన మనకు, ఆయన తన జ్యేష్ఠ కుమారునికి చేసినవాటినన్నిటిని చేయుటకు ఆయన నిశ్చయముగా సిద్ధముగా నున్నాడు. ఆయన యేసుకు సహాయపడినట్టే మనకు సహాయపడును. ఆయన యేసును చూచుకొన్నట్టే మనలను చూచుకొనును. ఆయన యేసు యొక్క

జీవితమును యోచించుటలో కలిగియున్న ఆసక్తిని, మన అనుదిన జీవితము యొక్క వివరములను యోచించుటలో ఆసక్తి కలిగియుండును. మనకు జరుగునది ఏదియుకూడా దేవునిని ఆశ్చర్యపరచదు. ఆయన ప్రతి పరిస్థితి కొరకు ఎప్పుడో ప్రణాళిక వేసెను. కాబట్టి మనము భద్రతలేనివారిగా ఉండవలసిన అవసరము లేదు. యేసు పంపించబడినట్టే మనము కూడా, భూమికి ఒక ఖచ్చితమైన ఉద్దేశ్యముతో పంపబడితిమి.

ఇదంతయు మీ విషయములో కూడా నిజమే-కాని మీరు దానిని నమ్మినప్పుడు మాత్రమే. దేవుని వాక్యమును విశ్వసింపని వానిలో వాక్యము పనిచేయదు.

దేవుడు నిజాయితీ గలవారియందు ఆనందించును

''ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము'' (1యోహాను 1:7). వెలుగులో నడచుట అనగా మొట్టమొదటిగా మనము దేవుని యెదుట ఏదియు దాచిపెట్టకుండా ఉండుట. మనము ఆయనకు సమస్తమును ఉన్నదిఉన్నట్టు చెప్పుదుము. దేవుని యొద్దకు వెళ్ళుటకు మొదటి మెట్టు నిజాయితీ అని నేను ఒప్పించబడియున్నాను. యదార్థముగా లేనివారిని దేవుడు అసహ్యించుకొనును. యేసు వేషధారులకు వ్యతిరేకముగా మాట్లాడిన దానికంటే వ్యతిరేకముగా ఎవరి గురించి మాట్లాడలేదు. దేవుడు మనలను మొదటిగా పరిశుద్ధులుగా లేక పరిపూర్ణులుగా ఉండమని అడుగడు కాని యధార్థముగా ఉండమని అడుగును. నిజమైన పరిశుద్ధతకు ఇదే ఆరంభము. ఈ ఊటనుండియే తక్కినవన్నియు ప్రవహించును. మనలో ఎవరైనను చేయుటకు సులువైనదేదైనా ఉన్నదంటే అది యదార్థముగా ఉండుటయే. కాబట్టి, పాపమును వెంటనే దేవునితో ఒప్పుకొనుడి. పాపపు తలంపులను ''యుక్తమైన'' పేర్లతో పిలువకుడి. మీరు నిజానికి మీ కళ్లతో వ్యభిచరించు విధముగా మోహించి, ''నేను కేవలము దేవుని సృష్టి యొక్క అందమును మెచ్చుకొనుచున్నాను'' అని చెప్పవద్దు. కోపమును ''న్యాయమైన ఆగ్రహము'' అని పిలువవద్దు. మీరు యదార్థముగా లేనియెడల మీరు పాపముపైన ఎప్పటికీ విజయము పొందలేరు. ''పాపము''ను ఎన్నడు ''పొరపాటు'' అని పిలువకుడి, ఎందుకనగా యేసు రక్తము మిమ్ములను సమస్త పాపములనుండి పవిత్రపరచును కాని, మీ పొరపాట్లనుండి పవిత్రపరచదు. ఆయన యదార్థవంతులు కానివారిని (నిజాయితీ లేనివారిని) పవిత్రపరచడు. యదార్థవంతులైన వారికి మాత్రమే నిరీక్షణ కలదు. ''అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు'' (సామెతలు 28:13). దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మత నాయకులకంటే వేశ్యలకు దొంగలకు ఎక్కువ నిరీక్షణ ఉన్నదని యేసు ఎందుకు చెప్పెను? (మత్తయి 21:31). ఎందుకనగా వేశ్యలు దొంగలు పరిశుద్ధులైనట్లు నటించరు. అనేకమంది యౌవనస్తులు సంఘాలనుండి వెళ్లిపోవుదురు ఎందుకనగా తమకు ఎటువంటి ఇబ్బందులు లేవన్న భావనను సంఘస్తులు వారికి కలుగజేయుదురు. కాబట్టి ''ఈ పరిశుద్ధులైన గుంపు మన సమస్యలను ఎప్పుడు అర్థము చేసుకోరు'' అని ఆ యౌవనస్తులు అనుకొందురు. ఇది మన విషయములో నిజమైతే, తన యొద్దకు పాపులను ఆకట్టుకొన్న క్రీస్తును పోలిన వారిగా మనములేము.

దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానియందు ఆనందించును

''దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును'' (2కొరిందీ¸ 9:7). ఈ కారణము చేతనే దేవుడు మానవునికి, రక్షణకు ముందు దాని తరువాత కూడా, పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత కూడా పూర్తి స్వేచ్ఛను ఇచ్చును. మనము దేవునివలే యున్నయెడల, మనము కూడా ఇతరులను నియంత్రించుటకు లేక వత్తిడి చేయుటకు ఆశించము. వారు మనకు వేరుగా ఉండుటకు భిన్నమైన అభిప్రాయములు కలిగియుండుటకు, వారికి తగిన విధముగా ఆత్మీయముగా ఎదుగుటకు వారికి స్వేచ్ఛ నిచ్చెదము. ఎటువంటి బలవంతమైనా అపవాది యొద్దనుండి వచ్చును. పరిశుద్ధాత్మ ప్రజలను నింపును, అయితే దయ్యములు ప్రజలను పట్టుకొనును. తేడా ఇదే: పరిశుద్ధాత్మ ఎవరినైనా నింపినప్పుడు, ఆ వ్యక్తి చేయాలనుకున్నది చేయుటకు అతనికి ఇంకా స్వేచ్ఛనిచ్చును. కాని దయ్యములు ప్రజలను పట్టినప్పుడు, అవి వారి స్వేచ్ఛను దొంగిలించి వారిని నియంత్రించును. ఆత్మతో నిండియుండుట యొక్క ఫలము ఆశానిగ్రహము (గలతీ 5:22,23). అయితే దయ్యము పట్టుటకు ఫలితము నిగ్రహమును కోల్పోవుట. మనము దేవుని కొరకు చేయు ఏ కార్యమైనను ఉత్సాహముగా, ఆనందముగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందముగా చేయని యెడల అది నిర్జీవ క్రియయని మనము గుర్తుంచుకోవలెను. ప్రతిఫలము పొందుటకు లేక జీతము పొందుటకు దేవుని కొరకు చేసిన ఏ కార్యమైనను నిర్జీవ క్రియయే. దేవుని దృష్టిలో ఇతరులనుండి వత్తిడివలన దేవునికిచ్చిన ఎంత డబ్బయినను విలువలేనిది. బలవంతమువలనో లేక మనస్సాక్షిని తృప్తి పరచుటకో చేసిన గొప్పకార్యములకంటే, ఆయన కొరకు ఉత్సాహముగా చేసిన చిన్న కార్యములకు దేవుడు విలువనిచ్చును.

పరిశుద్ధత యేసువైపు చూచుట ద్వారా వచ్చును

''యేసువైపు చూచుచు.....మనము పందెము పరుగెత్తుదము'' (హెబ్రీ 12:2). దైవభక్తిని గూర్చిన మర్మము మన వంటి శరీరములో వచ్చిన క్రీస్తు అను వ్యక్తిలో ఉన్నది (1తిమోతి 3:16 దీనిని స్పష్టము చేసెను)-అంతేకాని క్రీస్తు మన వంటి శరీరములో వచ్చాడన్న సిద్ధాంతములో లేదు. ఆయన శరీరమును సిద్ధాంతపరముగా విశ్లేషించుట ద్వారా కాక ఆయన (అనగా క్రీస్తుయేసు) ద్వారా మనము పరిశుద్ధులమగుదుము. స్వయంకృషి ఎంతైనను ఒక పాపపు హృదయాన్ని పరిశుద్ధముగా చేయలేదు అది జరగాలంటే దేవుడే మనలో కార్యము చేయవలెను. పరిశుద్ధత (నిత్యజీవము) దేవుని వరము -దానిని క్రియల ద్వారా ఎప్పుడు సాధించలేము (రోమా 6:22). దేవుడు మాత్రమే మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచగలడని బైబిలు చెప్పుచున్నది. (ఎవరు పొరబడకుండునట్లు 1థెస్సలొ 5:23 దీనిని చాలా తేటగా చెప్తుంది). అయినప్పటికీ అనేకమంది విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండుటకు తమను తాము ఉపేక్షించుకొనుటకు ప్రయాసపడుచున్నారు. కాబట్టి వారు పరిశుద్ధులగుటకు బదులు వారు పరిసయ్యులగుదురు. ''భ్రమకాని పరిశుద్ధత'' (ఎఫెసీ 4:24-ఫిలిప్స్‌ తర్జుమా)ను యేసుయందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే పొందవచ్చును-వేరేమాటలలో చెప్పాలంటే ''యేసువైపు చూచుట'' ద్వారా పొందవచ్చును. మనము ఒక సిద్ధాంతమును మాత్రమే చూచినయెడల మనము పరిసయ్యులుగా మారుదుము. మన సిద్ధాంతము ఎంత పవిత్రమైనదైతే అంత గొప్ప పరిసయ్యులుగా మనము మారెదము. నేను భూమి మీద కలుసుకొన్న అతి గొప్ప పరిసయ్యులు స్వయంకృషి ద్వారా పరిశుద్ధతయొక్క అత్యున్నతమైన ప్రమాణాలను బోధించు వారి మధ్య ఉన్నారు. వారిలో ఒకరివలే మనము కాకుండునట్లు మనము జాగ్రత్తగా ఉండవలెను!

యేసువైపు చూచుట అంటే ఏమిటో హెబ్రీయులు 12:2లో చాలా స్పష్టముగా వివరించబడెను. మొట్టమొదటిగా అనుదినము ''తన సిలువను సహించుచు'' భూమి మీద జీవించిన వానిగా ఉన్న ఆయన వైపు- ''సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, పాపము లేనివాడుగా'' (హెబ్రీ 4:15) ఉన్న ఆయన వైపు మనము చూడవలెను. ఆయన మన అగ్రగామి (హెబ్రీ 6:20); ఆయన అడుగుజాడలలో మనము పరుగెత్తవలెను. రెండవదిగా ఇప్పుడు ''తండ్రి కుడిపార్శమున'' ఉన్నవానిగాను, మనకొరకు విజ్ఞాపన చేయుచు ప్రతి కష్టములోను శోధనలోను సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నవానిగాను మనము ఆయనను చూడవలెను.

మనము ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడవలెను

''ఆత్మతో నింపబడుతూ ఉండుట'' (ఎఫెసీ 5:18- అక్షరానుసారమైన తర్జుమా).

మనము పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడు నింపబడియుండని యెడల దేవుడు ఆశించినట్టుగా క్రైస్తవ జీవితమును జీవించుట మనకు అసాధ్యము. ఆత్మ అభిషేకము లేకుండా మానవాతీతమైన కృపావరములను ఆయన యొద్దనుండి పొందకుండా దేవునిని మనము సేవించవలసినరీతిగా సేవించుట అసాధ్యము. యేసు తానే అభిషేకింపబడవలసి వచ్చెను. మన వ్యక్తిగత జీవితాలలోను మన పరిచర్యలో కూడా మనలను యేసువలే చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను (2కొరిందీ¸ 3:18). మన స్వభావములో మనలను యేసును పోలినవారిగా చేయుటకును, యేసు సేవించినట్లు మనము సేవించుటకు మనలను సిద్ధపరచుటకును దేవుడు మనలను ఆత్మతో నింపును. యేసు కలిగియుండిన పరిచర్యను మనము కలిగిలేము. కాబట్టి యేసు తన పరిచర్యలో చేసినది మనము చేయలేము. కాని దేవుని సేవించుటకు యేసు సన్నద్ధుడైయున్నట్లే మనము పూర్తిగా సన్నద్ధులైయుండగలము-అలా మన స్వంత పరిచర్యను నెరవేర్చగలము.

జీవజలనదులు మనలోనుండి ప్రవహించుటకు మననుండి కావలసినదల్లా తగినంత దప్పిక మరియు విశ్వాసము (యోహాను 7:37-39).

మనము కృపావరములను కలిగియుండుటకు మనము వాటిని ఆసక్తితో అపేక్షించవలెను (1కొరిందీ¸ 14:1). లేనియెడల వాటిని ఎప్పటికీ కలిగియుండలేము. పరిశుద్ధాత్మ వరములను కలిగియుండని సంఘము, జీవించుచున్నప్పటికీ చెవిటివాడైన, మూగవాడైన, గ్రుడ్డివాడైన అవిటివాడైన వ్యక్తిగా ఉండును -కాబట్టి అది పనికిరానిది (నిష్ఫలమైనది).

సిలువ మార్గమే జీవ మార్గము

''మనమాయనతోకూడా చనిపోయినవారమైతే ఆయనతో కూడా బ్రదుకుదుము'' (2తిమోతి 2:11). దేవుడు మన కొరకు యోచించి ఏర్పరచిన పరిస్థితులన్నిటిలోను మన స్వజీవమునకు మరణమును అంగీకరించుట ద్వారా తప్ప యేసుయొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు మరి ఏ మార్గము లేదు (2కొరిందీ¸ 4:10,11). మనము పాపము మీద జయము పొందాలంటే, అన్ని పరిస్థితులలోను, మనలను మనము ''పాపము విషయములో మృతులుగా యెంచుకొనవలెను'' (రోమా 6:11). మనము జీవించాలంటే ''ఆత్మచేత శరీర క్రియలను చంపవలెను'' (రోమా 8:13). మన అనుదిన జీవితములో పరిశుద్ధాత్మ మనలను ఎల్లప్పుడు సిలువ యొద్దకు నడిపించును. దేవుడు మనలను ''దినమెల్ల వధింపబడు'' పరిస్థితులలోనికి (రోమా 8:36) మరియు ''యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడు'' పరిస్థితులలోనికి పంపించును (2కొరిందీ¸ 4:11). అటువంటి పరిస్థితులలో యేసుయొక్క జీవము మనలో ప్రత్యక్షపరచబడునట్లు మనము ''యేసుయొక్క మరణానుభవము''ను అంగీకరింపవలెను (2కొరిందీ¸ 4:10).

నరుని అభిప్రాయములు చెత్తకుండీకే తగును

''తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును'' (యెషయా 2:22).

నరుని ప్రాణము తన నాసికారంధ్రములను విడిచి పెట్టినప్పుడు, మనము నడిచే దుమ్ము కంటే అతడు శ్రేష్టమైనవాడు కాదు. కాబట్టి మనము ఎందుకు నరుని అభిప్రాయమునకు విలువ ఇవ్వవలెను? మనుష్యులందరి అభిప్రాయములన్నియు కలిపి చెత్తకుండీకే తగును అన్న వాస్తవములో మనము వేరుపారి స్థిరపడనియెడల, మనము ఎప్పుడు ప్రభువును సమర్థవంతముగా సేవించలేము. మనము ఒక్క నరునినైనను సంతోషపెట్టగోరిన యెడల, మనము క్రీస్తు దాసులము కాలేము (గలతీ 1:10).

దేవుని అభిప్రాయముతో పోల్చినప్పుడు ప్రతి నరుని అభిప్రాయము విలువలేనిది. దీనిని ఒప్పుకొన్నవాడు తన జీవితము మీద మరియు తన పరిచర్య మీద దేవుని ఆమోదమునే కోరుకొనును. అతడు ప్రజల మెప్పు పొందుటకు లేక వారి ముందు తన్నుతాను సమర్థించు కొనుటకు ఎప్పుడు ప్రయత్నించడు.

లోకము ఘనముగా ఎంచునదంతయు దేవుడు అసహ్యించుకొనును

''మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము'' (లూకా 16:15).

లోకములో ఘనముగా ఎంచబడేవి దేవుని దృష్టికి విలువలేనివేకాక, నిజానికి ఆయనకు అసహ్యము. ఈ లోక ఘనత అంతయు దేవునికి అసహ్యము గనుక అది మన దృష్టికి కూడా అసహ్యముగా ఉండవలెను. డబ్బును భూమి మీద ఉన్నవారందరు విలువైనదిగా ఎంచుదురు. కాని డబ్బును ప్రేమించువారు, ధనవంతులగుటకు అపేక్షించువారు ఈ క్రింది ఎనిమిది పరిణామాలను ఎప్పుడోకప్పుడు అనుభవింతురు (1తిమోతి 6:9,10).

  1. వారు శోధనలో పడుదురు
  2. వారు ఉరిలో పడుదురు
  3. వారు అవివేక యుక్తములైన దురాశలో పడుదురు
  4. వారు హానికరమైన దురాశలలో పడుదురు
  5. వారు నష్టములో మునిగిపోవుదురు
  6. వారు నాశనములో మునిగిపోవుదురు
  7. వారు విశ్వాసమునుండి తొలగిపోవుదురు
  8. వారు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొందురు. ప్రతి చోట విశ్వాసులకు ఇది మరల మరల జరుగుట నేను చూచితిని.

ఈ రోజులలో మన దేశములో ప్రభువు యొద్దనుండి ఒక ప్రవచనాత్మకమైన సందేశము అరుదుగా వినబడుటకు కారణము ఎక్కువమంది బోధకులు డబ్బును ప్రేమించువారిగా ఉండుటయే. సత్యమైన ధనము (ప్రవచనవాక్యము అందులో ఒకటి) డబ్బు విషయములో

అపనమ్మకముగా ఉన్న వారికి దేవుడు ఇవ్వడని యేసు చెప్పెను (లూకా 16:11). ఈ కారణముగానే సంఘకూడికలలో సమావేశములలో మనము ఎన్నో విసుగు పుట్టించే ప్రసంగాలను సాక్ష్యములను వినెదము.

మనకు మనమే తప్ప వేరెవ్వరు మనకు హానిచేయలేరు

''మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?'' (1పేతురు 3:13).

దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయనను ప్రేమించువారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లు చేయును-అనగా తమ జీవితాలలో ఆయన చిత్తము కాక భూమి మీద ఇంకా ఏ ఆశయము లేని వారికి (రోమా 8:28). స్వార్థపరమైన ఆశయాలు గలవాడు ఈ వాగ్దానమును తనదిగా భావించలేడు. కాని మనము దేవుని చిత్తమును పూర్తిగా అంగీకరించిన యెడల, భూమి మీద మన జీవితము యొక్క ప్రతి నిమిషములోను ఈ వాగ్ధానము మనదిగా భావించవచ్చును. మనలను ఏదియు హానిచేయలేదు. మనకు ఇతరులు చేయునవన్నియు,మంచైనా, చెడైనా, అనుకోకుండా చేసినా, ఉద్దేశ్యపూర్వకముగా చేసినా, అవి రోమా 8:28 చేత వడియ కట్టబడి మన మేలు కొరకే పనిచేయును-అవి ప్రతిసారి మనలను మరికొంచెము క్రీస్తు సారూప్యములోనికి మార్చును (రోమా 8:29), ఇది దేవుడు మనకొరకు యోచించిన మేలు. ఈ వచనములోని షరతులను నెరవేర్చు వారికి ఈ వచనము ప్రతిసారి పరిపూర్ణముగా వడియగట్టును.

ఇంకా చూస్తే, మనము ''మంచి విషయములో ఆసక్తిగలవారమైతే'' మనకు ఎవరు హాని చేయలేరని 1పేతురు 3:13 చెప్పుచున్నది. దురదృష్టవశాత్తు ఇది రోమా 8:28 వలె ఎక్కువగా ప్రాచుర్యము పొందిన వచనము కాదు. కాని దీనిని మనము ఇప్పుడు ప్రాచుర్యము పొందునట్లు చేయవలెను. అయితే ఈ వాగ్దానము కూడా ప్రజలందరి యెడల తమ హృదయాలను మంచిగా ఉంచుకొనుటకు ఆసక్తి గలవారికి మాత్రమే వర్తించును. అటువంటి విశ్వాసికి ఏ దయ్యమైనాగాని నరుడైనాగాని హాని చేయుట అసాధ్యము. కాబట్టి ఏ క్రైస్తవుడైనా ఇతరులు తనకు హాని చేస్తారని ఫిర్యాదు చేసినప్పుడు, అతడు దేవున్ని ప్రేమించుటలేదనియు, దేవుని సంకల్పము చొప్పున పిలువబడలేదనియు, మంచి విషయములో ఆసక్తి కలిగిలేదనియు పరోక్షముగా ఒప్పుకొనుచున్నాడు. లేనియెడల, ఇతరులు చేసినదేదైనను తన మేలు కొరకే జరిగియుండేది, అప్పుడు అతడు ఎటువంటి ఫిర్యాదులు కలిగియుండే వాడు కాదు. నిజానికి, మిమ్ములను హానిచేయగలిగినది మీకు మీరు మాత్రమే-అది మీ అపనమ్మకమును బట్టి లేక ఇతరుల పట్ల మీ చెడు వైఖరుల వలన జరుగును.

నా వయస్సు ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు మరియు నా జీవితమంతటిలో నన్ను ఎవరు హానిచేయలేకపోయారని నేను యధార్థముగా చెప్పగలను. అనేకులు చేయుటకు ప్రయత్నించిరిగాని, వారు చేసిన సమస్తమును కేవలము నా మేలుకొరకు నా పరిచర్య యొక్క మేలు కొరకు జరిగినవి. కాబట్టి వారి కొరకు కూడా నేను దేవునిని స్తుతించగలను. నన్ను వ్యతిరేకించిన వారు ఎక్కువగా దేవుని మార్గములను అర్థము చేసుకొనని ''విశ్వాసులు''గా పిలువబడువారే. ఇది ఎల్లప్పుడు మీ సాక్ష్యము కూడా కాగలదని మీరు నమ్మునట్లు ప్రోత్సహించుటకే నేను నా సాక్ష్యమునిచ్చుచున్నాను.

మనలో ప్రతి ఒక్కరి జీవితము కొరకు దేవుడు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను కలిగియున్నాడు

''వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై యున్నాము'' (ఎఫెసీ 2:10) చాలా కాలం క్రిందట, దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకొన్నప్పుడు, మన భూలోక జీవితాలతో మనము ఏమి చేయవలెనో కూడా ఆయన యోచించెను. ఆ ప్రణాళికను మనము ప్రతిరోజు కనుగొని, దానిని అనుసరించుట మన కర్తవ్యము. దేవుని ప్రణాళిక కంటే మెరుగైన ప్రణాళికను మనము యోచించలేము. ఇతరులు చేయుదానిని మనము అనుకరించకూడదు, ఎందుకనగా ఆయన పిల్లలలో ప్రతి ఒక్కరికి దేవుని ప్రణాళిక భిన్నముగా నుండును. ఉదాహరణకు, యోసేపు విషయములో దేవుని ప్రణాళిక, అతడు ఐగుప్తు యొక్క రాజభవనములో ఉండి తన జీవితము యొక్క చివరి 80 సంవత్సరములు, ఎంతో సుఖంగా జీవించుట. మరోప్రక్క మోషే విషయములో దేవుని ప్రణాళిక, అతడు ఐగుప్తులో ఉన్న రాజభవనమును విడచిపెట్టి తన జీవితము యొక్క చివరి 80 సంవత్సరములు, అరణ్యములో, ఎంతో అసౌకర్యముగా జీవించుట. సుఖమును, సౌఖ్యమును ప్రేమించుట వలన మోషే, యోసేపు మాదిరిని అనుసరించిన యెడల, తన స్వంత జీవితములో అతడు దేవుని చిత్తమును తప్పిపోయేవాడు. ఖచ్చితముగా అదే విధముగా, దేవుడు ఒక సహోదరుని తన జీవితమంతా సుఖంగా అమెరికాలో జీవించాలని కోరుకోవచ్చును మరియొక సహోదరుని తన జీవితమంతా ఉత్తర భారతదేశము యొక్క వేడిలోను దుమ్ములోను కష్టపడాలని కోరుకోవచ్చును. వేరొక సహోదరుని పరిస్థితితో తన పరిస్థితిని పోల్చుకొని అతనియందు అసూయపడి, అతనిని విమర్శించుటకు బదులు, ప్రతివాడు తన స్వంత జీవితము విషయములో దేవుని ప్రణాళికను గూర్చి ఒప్పింపబడవలెను.

దేవుడు నన్ను భారతదేశములో ఆయనను సేవించుటకు పిలచెనని నాకు తెలుసు. కాని వేరెవ్వరికీ నాకున్న పిలుపే ఉండవలెనని నేను కోరుకోలేదు. అయితే మనము మన స్వంత ఘనతను ఆశించినయెడల లేక డబ్బును గాని సుఖమునుగాని మనుష్యుల యొక్క ఆమోదమును గాని ప్రేమించినయెడల మనము దేవుని చిత్తమును ఎన్నటికీ కనుగొనలేము.

దేవునిని సన్నిహితముగా యెరుగుటయే బలముగా ఉండుటకు రహస్యము

''తమ దేవుని నెరుగువారు బలముకలిగి యుందురు'' (దానియేలు 11:32).

ఈ రోజు, ఇతరుల ద్వారా పరోక్షముగా మనమాయనను నెరుగవలెనని దేవుడు కోరుకొనుట లేదు. ఆయన అతి పిన్న విశ్వాసిని కూడా ఆయనను వ్యక్తిగతముగా ఎరుగుటకు ఆహ్వానించుచున్నాడు (హెబ్రీ 8:11). దేవుణ్ణి మరియు యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరుగుటయే నిత్యజీవమని యేసు నిర్వచించెను (యోహాను 17:3). ఇది పౌలు జీవితము యొక్క అతి గొప్ప వాంఛగా నుండెను. మరియు ఇది మన గొప్ప వాంఛగా కూడా ఉండవలెను (ఫిలిప్పీ 3:10). దేవున్ని సన్నిహితముగా తెలుసుకొనగోరినవాడు ఆయనను ఎల్లప్పుడు ఆలకించుచుండవలెను. దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటను వినుట ద్వారానే మనుష్యుడు తన్నుతాను ఆత్మీయముగా సజీవముగా ఉంచుకోగలడని యేసు చెప్పెను (మత్తయి 4:4). ఆయన పాదముల చెంత కూర్చొని ఆయనను ఆలకించుట క్రైస్తవ జీవితములో అతిముఖ్యమైన విషయమని కూడా ఆయన చెప్పెను (లూకా 10:42). యేసు తండ్రిని ప్రతిరోజు తెల్లవారు జామునుండి రోజంతయు ఆలకించే అలవాటును (యెషయా 50:4) మనము కూడా అవలంభించుకోవలెను; ఆ ఆలకించే వైఖరితో రాత్రి గడియలలో మనము నిద్రించునప్పుడు కూడా ఉండవలెను. అలా ఉన్నచో మన నిద్రనుండి రాత్రివేళ ఎప్పుడైన మేల్కొన్నప్పుడు, ''ప్రభువా, మాట్లాడుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు'' అని మనము చెప్పవచ్చును (1సమూయేలు 3:10). దేవుని ఎరిగియుండుట అన్ని పరిస్థితులలోను మనలను జయించువారిగా చేయును-ఎందుకనగా మనము ఎదుర్కొనే ప్రతి సమస్యకు దేవుని యొద్ద పరిష్కారమున్నది-మరియు మనమాయనను ఆలకించినప్పుడు, ఆ పరిష్కారమేమిటో ఆయన మనకు తెలియజేయును.

క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే ఎంతో ఉన్నతమైనది

''యేసు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు'' (హెబ్రీ 8:6).

పాత నిబంధన క్రొత్త నిబంధనల మధ్య ఒక ప్రాథమికమైన వ్యత్యాసమున్నదని అనేక మంది క్రైస్తవులకు తెలియదు (హెబ్రీ 8:8-12). యేసు మోషే కంటే ఎంత శ్రేష్టుడో, క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే అంత శ్రేష్టమైనది (2కొరిందీ¸ 3 మరియు హెబ్రీయులు 3). తీర్పు యొక్క భయము వలనను ప్రతిఫలము యొక్క వాగ్దానము వలనను పాత నిబంధన ఒక వ్యక్తి యొక్క బాహ్యజీవితమును మాత్రమే పవిత్రపరచగలిగెను; అయితే క్రొత్త నిబంధన బెదిరింపులతో వాగ్దానములతో కాక, పరిశుద్ధాత్మ మనకు క్రీస్తు యొక్క స్వభావమును-పవిత్రమైన ప్రేమించే స్వభావమును- ఇచ్చుట ద్వారా మన అంతరంగమును మార్చును. ఒక పంది సంకెళ్లతో బంధింపబడుట ద్వారా (ధర్మశాస్త్రము క్రింద శిక్ష యొక్క భయము వలన) శుభ్రముగా ఉంచబడుటకును ఒక పిల్లి తన అంతరంగ స్వభావము వలన తనను తాను శుభ్రముగా ఉంచుకొనుటకును ఎంతో వ్యత్యాసమున్నది. ఈ ఉదాహరణ ఈ రెండు నిబంధనల మధ్య వ్యత్యాసమును వివరించును.

మనము మనుష్యుల చేత తృణీకరింపబడుటకు హింసింపబడుటకు పిలువబడితిమి

''క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించినవారందరు హింసపొందుదురు'' (2తిమోతి 3:12).

లోకములో వారికి శ్రమ కలుగునని యేసు తన శిష్యులతో చెప్పెను (యోహాను 16:33). మరియు తన శిష్యులను లోకమునుండి తీసికొని పోవద్దని ఆయన తండ్రికి ప్రార్థన చేసెను (యోహాను 17:15). అనేక శ్రమలను అనుభవించుట ద్వారానే విశ్వాసులు దేవుని రాజ్యములోనికి వ్రపేశింపగలరని అపొస్తలులు వారికి బోధించిరి (అపొ. కా. 14:22). ప్రజలు ఇంటి యజమానిని బయెల్జెబూలని పిలచిన యెడల ఆయన ఇంటి వారు ఇంకా ఘోరమైన పేర్లతో పిలువబడుదురని యేసు చెప్పెను (మత్తయి 10:25). ఈ విధముగా మనమాయన ఇంటి యొక్క నమ్మకస్తులైన సభ్యులమని మనము యెరుగుదుము. ఇతర ''విశ్వాసులు'' నన్ను పిలచిన కొన్ని పేర్లు: ''అపవాది'', ''అపవాది యొక్క కుమారుడు'', ''దురాత్మ'', ''క్రీస్తువిరోధి'', ''మోసగాడు'', ''తీవ్రవాది'', ''నరహంతకుడు'', మరియు ''దియొత్రేఫె''. ఈ విధంగా యేసు ఇంటివానిగా గుర్తింపబడుట ఒక గొప్ప భాగ్యముగానున్నది. ప్రభువును నమ్మకముగా సేవించువారందరు దీనిని అనుభవింతురు. ఒక నిజమైన ప్రవక్త తన ''స్వంత బంధువుల'' చేత సన్మానింపబడడని కూడా యేసు చెప్పెను (మార్కు 6:4). యేసు తానే తన కుటుంబ సభ్యుల చేత అంగీకరింపబడలేదు. ఈ రోజున కూడా దేవుని ప్రతి నిజమైన ప్రవక్త తన బంధువుల చేత అవమానింపబడి తృణీకరింపబడును. అదే విధముగా, ఒక నిజమైన అపొస్తులుడు ''దూషింపబడి, లోకమునకు మురికిగాను, అందరికి పెంటగాను ఎంచబడును'' (1కొరిందీ¸ 4:13). శ్రమలు తిరస్కారము దేవుని అతి గొప్ప దాసులకు ఎప్పుడు నియమింపబడి యుండెను. ''మహాశ్రమల'' ముందు సంఘము కొనిపోబడును అనే బోధ ఎక్కువమంది విశ్వాసులకు ఇష్టమైనది ఎందుకనగా దానిని వినుట వారి శరీరమును ఆదరించును. కాని మత్తయి 24:29-31లో మహాశ్రమల తరువాత మాత్రమే తన సంఘమును కొనిపోవుటకు ఆయన తిరిగివచ్చునని యేసు చాలా స్పష్టము చేసెను. సంఘము కొనిపోబడుట ద్వారా మహా శ్రమలను తప్పించుకొనునని బోధించే ఒక్క వచనము కూడా క్రొత్త నిబంధనలో లేదు. ఈ సిద్ధాంతము ఇంగ్లాండు దేశములో 19వ శతాబ్దము మధ్యలో మనుష్యులు కనిపెట్టినది. మన దేశములోనున్న సంఘమును మనమిప్పుడు హింసల కొరకు సిద్ధపరచవలెను.

దేవుడు అంగీకరించిన వారినందరిని మనము అంగీకరించవలెను

''దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను-శరీరములో వివాదము లేకుండునట్లు అలా చేసెను'' (1కొరిందీ¸ 12:18,25).

దేవుడు వేర్వేరు దేశాలలో వేర్వేరు కాలాలలో తన కొరకు ఒక పవిత్రమైన సాక్ష్యమును పునరుద్ధరించుటకు మనుష్యులను లేవనెత్తెను. కాని ఆ దైవజనులు చనిపోయిన తరువాత, వారి అనుచరులు వారి గుంపులను వ్యతిరిక్తమైనవాటిగాను, తెగలగాను చేసిరి. కాని క్రీస్తు శరీరము గుంపులన్నిటి కంటెను పెద్దది. మనము దానిని ఎప్పుడు మరువకూడదు. ఈ రోజున క్రీస్తు వధువు చాలా చాలా గుంపులలో ఉన్నది. కాబట్టి, దేవుని వాక్యమును వివరించుటలో (అర్థము చేసుకొనుటలో) వ్యత్యాసములు ఉండుట వలన మనము వారిలో అనేకమందితో కలిసి పనిచేయలేకపోయినను, ప్రభువు అంగీకరించిన వారందరితో మనము సహవాసము చేయుటకు కోరుకొనవలెను.

మనము ప్రతి మనుష్యుని గౌరవముతో చూడవలెను

''మన నాలుకతో దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము, నా సహోదరులారా, యీలాగుండకూడదు'' (యాకోబు 3:9,10).

ఒక మనుష్యుని కించపరచే (దిగజార్చే) ఏ మాటయైనా కార్యమైనా ఎప్పుడు దేవునినుండి రాదు. అది ప్రజలను ఎల్లప్పుడు కించపరచుటకును దిగజార్చుటకును చూచే సాతాను నుండే ఎల్లప్పుడు వచ్చును. మనము ప్రజలందరితో ''సాత్వీకముతోను గౌరవముతోను'' మాట్లాడవలెనని ఆజ్ఞాపింపబడినాము (1పేతురు 3:15)-వారు మన భార్యలైనా, పిల్లలైనా, యౌవనస్తులైనా, బిచ్చగాళ్లయినా లేక శత్రువులైనా అలా మాట్లాడవలెను. మనుష్యులందరు గౌరవింపబడవలెను. ఉదాహరణకు, ఒక బీదవాడైన సహోదరునికి ఒక కానుకనిచ్చినప్పుడు, మనుష్యునిగా అతనికున్న గౌరవమును కాపాడుచు దానిని చేయవలెను. మనము అతని ఉపకారిగా కాక సహోదరునిగా ఉండవలెను.

మన ఆర్థిక అవసరతలను మనము దేవునికే తెలియజేయవలెను

''దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' (ఫిలిప్పీ 4:19).

పూర్తికాల క్రైస్తవ పరిచారకులు తమ ఆర్థిక అవసరతలన్నిటి కొరకు దేవుని విశ్వసించి వాటిని ఆయనకు మాత్రమే తెలియజేయవలెను. అప్పుడు దేవుడు వారి అవసరతలను తీర్చుటకు తన బిడ్డలను ప్రేరేపించును. ఈ రోజున అనేకులు జీవించినట్లు వారు ''దేవుని యందు విశ్వాసముతోను ఇతర విశ్వాసులయొక్క సూచనలతోను'' జీవింపకూడదు. కనుక దేవుణ్ణి పూర్తికాలము (వేరే జీవనోపాది లేకుండా) సేవించువారు ఇతర విశ్వాసులనుండి కానుకలను పొందుటకు అనుమతింపబడిరి. కాని వారు జీతమును ఎల్లప్పుడు తీసుకొనకూడదు. కానుకలకు జీతమునకు ఎంతో వ్యత్యాసమున్నది. కానుకలను హక్కుగా అడుగలేము కాని జీతమును హక్కుగా అడగవచ్చును. ఈ రోజున ఎక్కువ క్రైస్తవ సంఘాల యొక్క మరియు సంస్థల యొక్క దిగజారిన స్థితికి కారణము ఇదే. అయితే, మన వ్యక్తిగత లేక కుటుంబ అవసరతలకు మనకంటే పేదవారైన వారి యొద్దనుండి ఎటువంటి కానుకలను తీసుకోకూడదు. అటువంటి వారు మనకు కానుకలు ఇచ్చినప్పుడు, మనము వారికంటే పేద వారైన వారికి ఆ డబ్బును ఇవ్వవలెను లేదా ఆ డబ్బును ప్రభువు పరిచర్య నిమిత్తము కానుక పెట్టెలో వేయవలెను. పూర్తికాల సేవకులందరు జాగ్రత్త వహించుటకు ఇక్కడ డబ్బును గూర్చి ''పది ఆజ్ఞలు'' ఉన్నవి:

  1. ఎల్లప్పుడు మీ ఆర్థిక అవసరతలను దేవునికి తప్ప వేరెవ్వరికి తెలియజేయకుడి (ఫిలిప్పీ 4:19).
  2. ఎల్లప్పుడు అవిశ్వాసుల యొద్దనుండి డబ్బును తీసుకొనకుడి (3యోహాను 7).
  3. ఎల్లప్పుడు ఎవరి యొద్దనుండి కానుకలను ఆశింపకుడి (కీర్తనలు 62:5).
  4. ఎల్లప్పుడు ఎవరినీ మీకు డబ్బు ఇచ్చుట ద్వారా మిమ్ములను నియంత్రించుటకు గాని మీ పరిచర్యను ప్రభావితము చేయుటకు గాని అనుమతించకుడి.
  5. ఎల్లప్పుడు మీ పరిచర్యను పొందని వారి యొద్దనుండి డబ్బును తీసుకొనకుడి.
  6. ఎల్లప్పుడు మీకంటే పేదవారి నుండి మీ వ్యక్తిగత లేక కుటుంబ అవసరాల కొరకు డబ్బును తీసుకొనకుడి.
  7. ఎల్లప్పుడు మీ ఆర్థిక అవసరతల కొరకు ఏ మనుష్యుని మీద ఆధారపడకుడి.
  8. ఎల్లప్పుడు దేవుని డబ్బును ఇతరులు అనుమానించే విధముగా నిర్వహించకుడి (2కొరిందీ¸ 8:20,21).
  9. ఎల్లప్పుడు డబ్బును పొందినప్పుడు ఉత్సాహపడకుడి.
  10. ఎల్లప్పుడు డబ్బును పోగొట్టుకున్నప్పుడు నిరాశపడకుడి.

ముగింపు: ఈ సత్యములు మిమ్ములను ప్రోత్సహించటమే కాకుండా మిమ్ములను విడుదల చేయునని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రభువుతో మీరు నడచుట గురించి మీ పరిచర్య గురించి మీరు తీవ్రముగా ఉన్నయెడల, మీ అనుదిన జీవితములో ఈ సత్యములను మీరు తీవ్రముగా తీసుకోవలెను.