సంపూర్ణ సువార్త

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 1
సంపూర్ణ సువార్త

''దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు'' (అపొ.కా 20:27).

అపొస్తలుడైన పౌలు ఎఫెసులో మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు బోధించెను (అపొ.కా. 20:31). ఆయన బోధించినదేమిటి?

మార్పునొందని అన్యజనులకు దేవుని విషయములో మారుమనస్సును మరియు మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమును బోధించెను (అపొ.కా.20:21). కాని విశ్వాసులైన వారికి ''దేవుని యొక్క సంకల్పము అంతయు'' (అపొ.కా.20:27) బోధించెను.

ఈనాడు అనేకమంది బోధకులు కేవలము ''విశ్వాసము'' నే బోధించుచున్నారు. అది కూడా నఖిళీదై యున్నది. దానివలన అనేక సువార్త కూటములలో ఫలితమేదనగా వారి పాపముల నుండి తిరుగకుండా కేవలము ఆశీర్వదింపబడుటకు యేసు నొద్దకు వచ్చు సగము మార్పు చెందిన ''విశ్వాసులు'' తయారు చేయబడుచున్నారు. వారి విశ్వాస జీవితములు ''గర్భస్రావము''ల వలె ముగియుచున్నవి.

అయితే కొంతమంది బోధకులు లేఖనానుసారముగా యుండి విశ్వాసమునకు ముందు మారుమనస్సును పొందవలెనని పౌలు వలె బోధించుచున్నారు. అయితే పౌలు అక్కడితో ఆగిపోలేదు. అతడు దేవుని కృపాసువార్తను గూర్చి బోధించుచుండెను (అపొ.కా.20:24). యేసుక్రీస్తును వారి రక్షకుడుగాను మరియు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చు వాడుగాను యెరుగుట ద్వారా సంపూర్ణ సువార్త అనుభవములో నున్నట్లు అనేకులు అనుకొందురు.

కాని హెబ్రీ 6:1,2 ఇది కేవలము క్రైస్తవ జీవితము యొక్క ప్రారంభమని చెప్పుచున్నది. ''క్రీస్తును గూర్చిన మూలోపదేశములైన మారుమనస్సు పొందుటయు మరియు విశ్వాసము (అనగా పాపములకు క్షమాపణ, యేసుక్రీస్తును రక్షకునిగా ఎరుగుట), బాప్తిస్మములు మరియు హస్త నిక్షేపణము (అనగా నీటిలో బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము మరియు యేసు ప్రభువును ఆత్మవరముల నిచ్చు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చు వానిగా ఎరుగుట) మరియు మృతుల పునరుత్థానము మరియు నిత్య తీర్పు (క్రీస్తు రెండవ రాకడ సమయమందు)'' అనునవి పునాదిగాయున్నవి.

ఇది క్రీస్తునందు క్రొత్తగా జన్మించిన పసిబిడ్డలు మొదట త్రాగవలసిన పాలుగా యున్నవి (హెబ్రీ 5:13). అయితే అనేకమంది విశ్వాసులు వారి జీవిత కాలమంతా పసి పిల్లలవలె నుండుట చేత, వారు సంపూర్ణ సువార్త అను బలమైన ఆహారము తీసుకొను అనుభవమునకు వెళ్ళరు. హెబ్రీ క్రైస్తవులు మరియు కొరిందీ¸ క్రైస్తవులు అట్లుండిరి.

పౌలు కొరింథులో నుండిన క్రైస్తవులకు వ్రాయుచు, ''నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించు కొంటిని'' అనెను (1 కొరిందీ¸ 2:2).

క్రీస్తు మన పాపముల కొరకు మరణించెనని మరియు మృతులలో నుండి లేచెనను వాస్తవమును తప్ప అంతకు మించి దేనిని అతడు వారికి ఎందుకు చెప్పలేకపోయెను? (1 కొరిందీ¸ 15:1-4).

దానికి కారణము అతడు 1 కొరిందీ¸ 3:2 లో వివరించెను. అది వారు పసి బిడ్డలైనందున బలమైన ఆహారము వారు జీర్ణము చేసుకొనలేని స్థితిలో నుండిరి. వారికి బోధింపబడిన ప్రాథమిక సత్యములకే వారు తగిన విధంగా స్పందించ లేక పోయిరి. గనుక పౌలు వారిని అంతకంటె ముందుకు తీసుకు వెళ్లలేక పోయెను. అందుచేత వారు శరీరానుసారులుగా యుండి తగవులు, అసూయలు మరియు వేర్పాటు వాదములు మొదలైన వాటితో ఓడింపబడిరి.

జనులు పసిపిల్లల వలె నుండినప్పుడు యేసుక్రీస్తు గురించి మరియు ఆయన సిలువ వేయబడుట గురించి తప్ప దానికి మించి మనము దేనినీ బోధించలేము.ఆ విధముగా అటువంటి విశ్వాసులు శరీరానుసారులుగా యుండి పోవుదురు.

''పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము (అది ఇతర సంఘములలో నుండిన బలమైన ఆహారము తీసుకొనగలిగిన వారి మధ్య)....దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము'' (1 కొరిందీ¸ 2:6,7) అని పౌలు కొరింథులో నుండిన పసిపిల్లలకు చెప్పెను.

ఎఫెసులో నుండిన సంఘము అటువంటి ఒక సంఘముగా యుండినందున, పౌలు సంపూర్ణ సువార్తను బోధించుటకు వీలు కలిగి యుండెను.

సంపూర్ణ సువార్త అనగా ఏమిటి?

మనము పాత నిబంధనలో గుడారమును చూచి దాని నుండి కొన్ని పాఠములు నేర్చుకొనవచ్చును. గుడారము దేవుని నివాస స్థలమునకు సూచనగా ఇవ్వబడినది. దాని యందు సంపూర్ణ సువార్త అంటే ఏమిటో మరియు దేవునియొక్క సన్నిధిలో నుండిన సంతోషములోనికి మనము ఎలా ప్రవేశింపగలమో మరియు మన జీవితములలో ఆయనయొక్క ఉద్దేశ్యములను చూడవచ్చును.

గుడారము మూడు భాగములుగా యున్నది. ఆవరణము, పరిశుద్ధ స్థలము మరియు అతిపరిశుద్ధ స్థలము. ఇవి సంపూర్ణ సువార్తలో నుండిన మూడు భాగములను సూచిస్తున్నాయి.

గుడారము కొరకు దేవుడిచ్చిన రూపము

తూర్పు

(మ=మందసము - దాని మీద మూతవలే 'కరుణాపీఠము' ఉండును) (ధూ=ధూపవేదిక; స=సముఖపు రొట్టెల బల్ల; దీ= దీపస్తంభము)

ఆవరణము (150 అడుగుల పొడవు మరియు 75 అడుగుల వెడల్పు) ఆకాశమునకు తెరువబడెను. అది ఒక తెల్లని బట్టతో చేయబడిన తెరతో చుట్టబడియుండెను. (7 1/2 అడుగుల ఇత్తడి స్తంభాలచేత స్థిరపరచబడియుండెను. దానికి తూర్పు దిక్కున ఒక ప్రవేశముండెను. అది 30 అడుగుల వెడల్పు. అది రంగుల తెరతో కప్పబడియుండెను. పరిశుద్ధస్థలము (30X15 అడుగులు) మరియు అతిపరిశుద్ధస్థలము (15X15 అడుగులు) ఒక కప్పబడిన గుడారము యొక్క రెండు భాగములు. దీని కొలతలు-45 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు. ఇది ఒక మందపాటి తెర చేత వేరుపరచబడియుండెను. ఈ గుడారము యొక్క మూడు ప్రక్కలు బంగారము చేత పొదిగింపబడిన పలకల చేత చేయబడెను. నాలుగవ ప్రక్క (ప్రవేశ ద్వారము) రంగుల తెరతో కప్పబడెను. అప్పుడు ఇంకా నాలుగు తెరలతో ఆ గుడారము కప్పబడెను. వీటిలో మూడు జంతువుల చర్మములు, ఒకటి చిత్రకారుని పని కలిగిన సన్నని నారతో చేయబడెను.

సువార్తలో మొదటి భాగము - యేసు ప్రభువు మన రక్షకుడు

ఆవరణలో, బలి అర్పించుటకు బలిపీఠము మరియు గంగాళములో నీళ్లు (కడుగుకొనుటకు) ఉండును. ''క్రీస్తు మన పాపముల కొరకు సిలువ వేయబడెను'' అను సందేశమునకు బలిపీఠము సూచనగా యున్నది. గంగాళము నీటి బాప్తిస్మము ద్వారా మనము సాక్ష్యమిచ్చు (అపొ.కా. 22:16) మన జీవితముల యొక్క బాహ్య శుభ్రతను (హెబ్రీ 10:22) మరియు నూతన స్వభావమును (తీతు 3:5) సూచించుచున్నది.

ఇది క్రైస్తవజీవితము యొక్క మొదటిస్థాయి, ఇక్కడ ఒకవ్యక్తి పశ్చాత్తాపము చెంది తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన యేసును తనస్వంత రక్షకునిగా నమ్మి నీటిలో బాప్తిస్మము పొందును.

సువార్తలో రెండవ భాగము - యేసు ప్రభువు మనకు బాప్తిస్మమిచ్చువాడు

ఆవరణము ఇశ్రాయేలీయులందరకు తెరువబడి యుండగా (కాని అన్యులకు కాదు), పరిశుద్ధస్థలము కేవలము యాజకులకు మాత్రమే తెరవబడి యుండును. వారు ప్రభువు యొక్క పరిచర్యలో నిమగ్నమై యుండినవారు.

పాత నిబంధన ప్రవక్తగా కాని, యాజకునిగా కాని లేక రాజుగా కాని దేవుని సేవించుటకు అన్నింటి కంటె ప్రాముఖ్యముగా కావలసినది ''పరిశుద్ధాత్మతో అభిషేకము''. ఈ అభిషేకమునకు ఏ మానవ అర్హత ప్రత్యామ్నాయం కాదు. చివరకు యేసుప్రభువు కూడా మొదట పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ఆయన యొక్క బహిరంగ పరిచర్యకు అడుగు ముందుకు వెయ్యలేదు. దేవుడు తన ప్రజలను ఈ ''ఆవరణ'' నుండి ఆత్మ యొక్క అభిషేకము మరియు ఆయన సేవలో ఆత్మ యొక్క వరములను ప్రయోగించునట్లు చేయు ఈ అనుభవములోనికి తీసుకు రావాలని కోరుచున్నాడు.

పరిశుద్ధ స్థలములో మూడు తయారు చేయబడిన వస్తువులుండును

  1. దీపస్తంభము - క్రీస్తు కొరకు మనము సాక్షులుగా నుండుటకు శక్తినిచ్చే అభిషేకమునకు సూచనగా యున్నది (అపొ.కా. 1:8).
  2. సముఖపు రొట్టెలుంచు బల్ల - అభిషేకము మనకు వాక్యము గూర్చి ఇచ్చు ప్రత్యక్షతకు సూచనయై యున్నది (2 కొరిందీ¸ 3:18).
  3. ధూప వేదిక - అభిషేకము మనకు ప్రార్థనలో శక్తి నిచ్చును అను దానికి సూచనయై యున్నది (రోమా 8:26,27).

మనము అంత వరకు వెళ్లుట క్రైస్తవ జీవితములో రెండవ స్థాయికి వెళ్లుటయై యున్నది. అది పాపక్షమాపణ మరియు నీటి బాప్తిస్మము పొందుట మాత్రమే కాక, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటయై యున్నది.

సువార్తలో మూడవ భాగము - యేసు ప్రభువు మనకు ముందుగా పరిగెత్తిన వాడు

అతి పరిశుద్ధ స్థలములో దేవునియొక్క మహిమ నివాసము చేసెను. సంఘమును సూచించు నూతన యెరూషలేమువలె, ఇది కూడా ఘనాకారముగా ఉన్నది. ''దాని పొడుగు, వెడల్పు మరియు ఎత్తు సమానముగా ఉన్నది''(ప్రకటన 21:16).

ఎవరికైనను - చివరకు ఒక యాజకునికి కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు అనుమతి లేదు. చివరకు ప్రధాన యాజకుడు కూడా సంవత్సరమునకు ఒక మారు మాత్రమే తనప్రజల పాప ప్రాయశ్చిత్తము చెల్లించుటకు లోనికి వెళ్లుటకు అనుమతి కలిగి యుండెను. అది దేవుని సన్నిధికి మానవుడు వెళ్లుటకు మార్గము తెరవబడలేదు అను వాస్తవమును తెలియజేయుచున్నది (హెబ్రీ 9:8).

ఆత్మీయ అనుభవమునకు సంబంధించి, పాత నిబంధనలో ఉండిన ఉత్తమ పరిశుద్ధులు కూడా పరిశుద్ధ స్థలము వరకు మాత్రమే వెళ్లగలరని దీనిని బట్టి నేర్చుకొనుచున్నాము.

యేసుక్రీస్తు జన్మించినంత వరకు, స్త్రీలకు జన్మించిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడు. యేసుప్రభువు మత్తయి 11:11 లో చెప్పిన దానిని బట్టి ఆయన మరియ కంటె కూడా గొప్పవాడు. దేవుని రాజ్యములో ప్రవేశించిన అత్యల్పుడు కూడా బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడని యేసు ప్రభువు చెప్పారు. ఎందుచేత?

పాత నిబంధనలో ఉండిన పరిశుద్ధులు దేవునినుండి ఎన్నో ఆశీర్వాదములు పొందుకొనిరి. వారు పాపములకు క్షమాపణ పొందుకొనిరి (దావీదు పొందుకొనినట్లు-కీర్తన 103:3) మరియు విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడిరి (అబ్రాహాము వలె ఆది 15:6, రోమా 4:2,3). వారు బాహ్యమైన నీతి నెరవేర్చు స్థితికి వచ్చియుండిరి (జెకర్యా మరియు ఎలీసబెతుల వలె- లూకా 1:6) మరియు సేవ కొరకు అభిషేకించబడిరి (గిద్యోను మరియు ఎలీషాల వలె- న్యాయాధి 6:34, 2 రాజులు 2:9-15).

మరొక విధముగా చెప్పవలెనంటే వారు ఆవరణలోనికిని మరియు పరిశుద్ధ స్థలములోనికిని రాగలిగి యుండిరి. వారు అతి పరిశుద్ధ స్థలమును వేరుచేయుచుండిన తెర యొద్దకు రాగలిగి యుండిరి కాని అంతకు మించి ముందుకు రాలేక పోయిరి. వారు దేవుని యొక్క స్వభావములో పాలివారు కాలేకపోయిరి.

అయితే మనకు పాత నిబంధనలో ఉండిన వారి కంటే ముందుకు తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లుటకు క్రొత్త నిబంధనలో ఒక మార్గము తెరవబడినది. మనకు ''నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన అతిపరిశుద్ధస్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది'' అని హెబ్రీ 10:19,20లో చెప్పబడినది.

యెరూషలేములో ఉన్న దేవాలయము (గుడారము యొక్క మాదిరి ప్రకారము కట్టబడినది) లో కూడా అతిపరిశుద్ధ స్థలము మరియు పరిశుద్ధ స్థలమునకు మధ్య ఒక తెర ఉండెను. ఇది యేసు ప్రభువు సిలువపై మరణించినప్పుడు పైనుండి క్రింది వరకు నిలువుగా చినిగి పోయినది (మత్తయి 27:50,51). ఇక్కడ తెర చినుగుట యేసు ప్రభువు తన శరీరమందు పూర్తిచేసిన పనికి సూచనగా యున్నది.

దైవభక్తితో జీవించుటకు గల మర్మము(1 తిమోతి 3:16 లో చెప్పబడినది) యేసు క్రీస్తు మనవంటి శరీరముతో వచ్చి, ఆయన ఆత్మను కల్మషపరచుకొనకుండా పవిత్రముగా ఉంచుకొనెనను విషయమును యెరుగుటలో నున్నది. ఆ విధముగా అతి పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించుటకు మార్గము తెరవబడినది.

మానవుని స్వంత చిత్తము అతనిని దేవుని సన్నిధి నుండి నిరోధించే తెరగా ఉన్నది. ప్రభువైన యేసు తన స్వంత చిత్తమును ఎల్లప్పుడు ఉపేక్షించుకొనెను.

యేసుప్రభువు ఆయన స్వంత చిత్తమును ఆయన ఈలోక జీవితములో నిరంతరము సిలువ వేయుచుండెడి వారు. ఆ విధముగా ఆయన తెరను చింపెను. ఆ విధముగా ఆయన ఆత్మను పవిత్రముగా ఉంచుకొనెను. ఇప్పుడు మనము ''శరీరమును దాని యిచ్ఛలతోను, దురాశలతోను సిలువ'' వేసినట్లయితే (గలతీ 5:24) మనము కూడా అదే మార్గములో నడువవచ్చు మరియు ఆ విధముగా యేసుప్రభువు వలె అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి అక్కడ నివసించవచ్చును.

అపొస్తులుడు హెబ్రీయులకు వ్రాసినప్పుడు పాలు మరియు బలమైన ఆహారము గూర్చి చెప్పుచు (హెబ్రీ 5:13)సత్యమును గూర్చి ''వివరించుట కష్టమైనది'' (11వ) అని వారికి చెప్పెను. ఆ సత్యము (హెబ్రీ 5:7-10 లోని సందర్భము స్పష్టముగా చూపిస్తున్నట్లు) క్రీస్తు శరీరముతో జీవించినప్పుడు, మహారోదనముతోను, కన్నీళ్లతోను, ప్రార్థించుట, శ్రమపడుట మరియు విధేయత ద్వారా పరిపూర్ణుడగుటను గూర్చి చెప్పుచున్నది.

మొదటి శతాబ్దములో అనేక విశ్వాసులకు ఈ సత్యమును అంగీకరించుట ఎట్లు కష్టమైనదో ఇప్పుడు కూడా అనేక విశ్వాసులకు అట్లే కష్టమైనది. దానికి కారణము ఇప్పుడు కూడా ''వారు వినుటకు మందులగుట'' చేత (హెబ్రీ 5:11). వారు ఇట్లు మందులుగా నుండుటకు కారణము వారు తక్కువ ప్రమాణములతో, ఓడిపోవుచున్న స్థితితో సంతృప్తి పడుటయై యున్నది. కాని దైవ భక్తి గలిగిన జీవితము గూర్చి ఆకలి దప్పులు గల వారికి, దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించును. దేవునికి భయపడు వారికి ఆయన గూర్చిన మర్మము తెలియపర్చబడును (కీర్తనలు 25:14). ఆ విధముగా వారు పరిపూర్ణత యొక్క రహస్యమును కనుగొందురు.

ధర్మశాస్త్రము యొక్క నీతి అంతా ''ప్రేమ'' అనే ఒక మాటలో నున్నది. అనగా హృదయమంతటితో దేవుని ప్రేమించుట మరియు మన పొరుగువారిని మనవలె ప్రేమించుటయై యున్నది.

పాత నిబంధనలోని వ్యక్తులకు దైవభక్తిలో లేక దేవుని స్వభావమైన ప్రేమ యందు పాలు పుచ్చుకొనుట అసాధ్యముగా నుండెను. దానికి కారణము అప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రజల హృదయాలలో నివసింపలేకపోవుటయే. కాని అది ఇప్పుడు మనకు సాధ్యమైయున్నది. ఇది గొప్ప విలువ గల ముత్యము మరియు దానిని పొందు కొనుటకు మిగిలిన అన్ని ముత్యములను విడిచి పెట్టవలసి యున్నది.

దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు మరియు మానవుడు ప్రేమలో జీవించనప్పుడు అతడు దేవుని సన్నిధిలో ప్రవేశింపలేడు. ''ప్రేమ మరణమంత బలమైనది'' అని బైబిలు చెప్పుచున్నది (పరమ 8:6). అనగా మరణము ఏ విధముగా ఎవరినీ విడిచి పెట్టకుండా మానవులందరి మీదకు వచ్చునో, అదే విధముగా దేవునియొక్క ప్రేమకూడా ఎవ్వరినీ విడవకుండా మానవులందరి పైకి వచ్చును. క్రొత్త నిబంధనలో, మరణమును యేసు జయించెను గనుక, ''దేవుని ప్రేమ మరణముకంటే బలమైనది'' అని మనము చెప్పవచ్చును.

యేసు ప్రభువు ద్వారా కనుపరచబడిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనపైన కనుపరచబడిన ద్వేషము, విషము మరియు చేదుచేత (ఆత్మీయ మరణము) జయింపబడలేదు. దేవునిప్రేమ యొక్క వెలుగు చీకటిలో ప్రకాశించగా, దానిని చీకటి జయింపలేకపోయినది. శరీర స్వభావమును సిలువ వేయుట వలన, దాని కుండిన శక్తి లోబడి ఉండినది.

మన స్వంత చిత్తము ఉపేక్షింపబడి సిలువ వేయబడినప్పుడు మాత్రమే మనము అతి పరిశుద్ధ స్థలములో నివసింపగలము. అప్పుడు మనము ప్రతి వారిని దేవుని ప్రేమతో ప్రేమించగలము.

ఎక్కువ మంది విశ్వాసుల (పరిశుద్ధతను బోధించేవారితో సహా) ప్రేమ తమ గుంపులో నున్న వారికే పరిమితమైయున్నది. వారు తమ గుంపులో ఉన్న వారిని గురించి చెడు మాట్లాడరు గాని ఇతర గుంపులలో ఉన్న విశ్వాసులను గూర్చి చెడు మాట్లాడుటకు మరియు వినుటకు స్వేచ్ఛను కలిగియుందురు. ప్రియమైన పాఠకుడా, నిన్ను నీవు పరీక్షించుకొని ఇది నీ జీవితములో నిజమో కాదో చూచుకొనుము. అటువంటి 'ప్రేమ' మానవ ప్రేమే కాని దేవునిప్రేమ కాదు. అటువంటి పక్షపాతము కలిగిన మనస్తత్వముతో విశ్వాసులు సంతృప్తి పడినప్పుడు వారు పైకి ఎదగలేరు. తన పట్ల వారి వైఖరి ఎలా ఉన్నా ప్రజలందరి మీద తన సూర్యుని ఉదయింపజేసే తండ్రి వలే మనలను కూడా మంచివారిగా ప్రేమించేవారిగా చేయుటకు యేసు వచ్చెను.

యేసు మన వలెనే అన్ని విషయములలో శోధింపబడెను (హెబ్రీయులు 4:15). వేరే మాటలలో చెప్పాలంటే, ఆయన తన స్వంత చిత్తమును చేయుటకును, తనను తాను సంతోషపరచుటకును అనేక విధములుగా శోధింపబడెను. ఆయన భూమి మీద నున్న 33 1/2 సంవత్సరములలో దేవుడు తన కుమారుని మానవునకు సాధ్యమైన శోధనలన్నిటి ద్వారా తీసుకొని వెళ్లెను. యేసు వాటిలో ప్రతి ఒక్క దానిని జయించెను. ఆయన ఒక్కసారి కూడా తన స్వంత చిత్తమునకు లోబడలేదు. ఆ విధముగా ఆయన ఆలోచనలలో, మాటలలో, క్రియలలో, వైఖరులలో, ఉద్దేశ్యములలో ఒక్కసారి కూడా పాపము చేయలేదు. స్వంత చిత్తమునకు లోబడినప్పుడే అది పాపమగును. యేసు తన భూలోక జీవితములో అభ్యసించిన విద్య ఇదే. విధేయత శ్రమతో కూడినదైనప్పుడు ఆయన విధేయతను నేర్చుకొనెను (హెబ్రీ 5:8). ఇక్కడ చెప్పబడిన శ్రమ ఒకరు తన స్వంత చిత్తమును ఉపేక్షించుకొనుట వలన వచ్చిన శ్రమ.

శ్రమపడుటకు వ్యతిరేకమైనది ఆనందించుట. మనము శోధింపబడినప్పుడు రెండు నిర్ణయములు మనందరి ముందుండును. అది మనకు ఇష్టమైనది చేయుట ద్వారా వచ్చే ఆనందమును అనుభవించుట లేక మన స్వంత చిత్తమును మరణింపజేయుట ద్వారా వచ్చే శ్రమను అనుభవించుట. యేసు నిరంతరము శ్రమపడుచుండే వాడు. ఆయన తన్ను తాను ఎప్పుడు సంతోషపరచుకొనలేదు (రోమా 15:3). అందువలన ఆయన ఎప్పుడు పాపము చేయలేదు. మనముకూడా అదే మార్గము ఎంచుకొనినట్లయితే, మనమును పాపము చేయము.

యేసు ప్రభువు సిలువపై మరణము నొందే లోపే ఆయన మనుష్యులకు సాధ్యపడే శోధనలన్నిటి గుండా వెళ్లి వాటిలో ప్రతి ఒక్కదానిని జయించెను. గనుక ఆయన లోక పాపములకు బలిగా అర్పింపబడుటకు సిద్దముగా నుండెను. సిలువ వేయబడే ముందు రాత్రి ''చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని'' (యోహాను 17:4) అని ఆయన చెప్పగలిగెను. అట్లు ఆయన తన్నుతాను అర్పణగా అర్పించు కొనుట పూర్తయిన తరువాత తెర చినిగెను. అతి పరిశుద్ధ స్థలములోనికి చివరకు మార్గము తెరవబడెను.

''యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము'' అని 2కొరిందీ¸ 4:10 చెప్పుచున్నది. ఇక్కడ ''యేసుయొక్క మరణానుభవము'' అంటే ఏమిటి? లోక పాపముల కొరకు యేసు కల్వరి సిలువపై మరణించిన మరణములో మనకు ఏ భాగము (పాలు) లేదు. అక్కడ ఆయన ఒక్కడే చనిపోయెను. అక్కడ ఆయన తెరను చింపి మన కొరకు నూతనమైనదియు, సజీవమైనదియు అయిన మార్గమును తెరచెను. మనము ఆ తెరను రెండవసారి చింపనక్కరలేదు. దేవుని సన్నిధిలోనికి మార్గము శాశ్వతముగా తెరువబడెను. కాని ఆ చినిగిన తెర యొక్క మార్గమున-అనగా సిలువ మార్గమున-మనము నడువవలెను. మనము ఆయన నిత్య ''మరణము''లో మన స్వంత చిత్తమునకు చనిపోవుటలో పాలుపొందవలెను.

మన ముందు ఈ మార్గములో నడచిన మార్గదర్శకునిగా యేసు ఉన్నాడు. ఆయన తెరచిన ఈ నూతనమైన సజీవమైన మార్గము ద్వారా మన జీవితమంతా మనము అతి పరిశుద్ధ స్థలములో నివసింపవచ్చును. ఇది ఒక ద్వారము ద్వారా ప్రవేశించుట వలే ఒక్కసారి మాత్రమే జరుగు అనుభవము కాదు. ఇది మనము అనుదినము మన సిలువ నెత్తికొని నడువవలసిన మార్గమైయున్నది.

మీరు జాగ్రత్తగా లేనియెడల, మీరు ఒకరోజు అతిపరిశుద్ధ స్థలములో నివసించి, మరుసటి రోజు పరిశుద్ధ స్థలములోనో ఆవరణములోనో ఉండవచ్చు. మీరు శరీరానుసారముగా జీవించినయెడల మీరు దేవుని గుడారము బయటకు కూడా వెళ్లిపోవచ్చును (రోమా 8:13 చూడండి). ఒక వ్యక్తి దిగజారి అతని హృదయము కరిÄనపరచబడుటకు కేవలము 24 గంటలు పట్టును. ఒకప్పుడు మనము క్షమించిన వారి పట్ల మరల కోపగించుకొనుటకు కేవలము 24 గంటలు పట్టును. కావున దిగజారిపోకుండా ఉండుటకు అనుదినము (ప్రతి 24 గంటల కాల వ్యవధిలో) ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడని మనకు చెప్పబడెను (హెబ్రీ 3:13).

''ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను'' అనునదియే సంపూర్ణ సువార్త (రోమా 8:2). వేరే మాటలలో చెప్పాలంటే, పాత నిబంధనలో సాధ్యపడనిది-అనగా మన అంతరంగ జీవితములో పాపము మీద జయము మరియు దేవుని స్వభావములో పాలుపొందుట-ఇప్పుడు సాధ్యము. ప్రేమ అను ఆయన స్వభావములో పాలుపొందుటకు దేవుడు మనకొరకు మార్గము సిద్ధపరచెను.

ఒకడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు, అతడు క్రైస్తవ జీవితములో మూడవ స్థాయికి వచ్చియున్నాడు. అది అత్యున్నత స్థాయి.

ఇక్కడ అతి పరిశుద్ధ స్థలములో దేవుడొక్కడే ఉండును. అక్కడ నివసించువారు దేవునితో పాటు నివసించుదురు మరియు వారు మనుష్యులనుండి చివరకు క్రైస్తవ నాయకుల నుండి కూడా ఘనతను కోరుకొనుట నుండి విడుదల పొందుదురు. అంతేకాక వారు అభ్యంతరపడుట నుండి, ఫిర్యాదు చేయుట నుండి మరియు సణుగుకొనుట నుండి మరియు నిష్టూరము, అసూయ నుండి విడుదలపొందుదురు. వారు ఇప్పుడు ఇతరులను (వారు తిరిగి ప్రేమించినా, ప్రేమించకపోయినా) యేసు ప్రభువు వారిని ప్రేమించునట్లుగా ప్రేమించుటకు స్వేచ్ఛ కలిగియుందురు.

వారిప్పుడు వారు చేయు దానియంతటిలో దేవుని యొక్క ఘనతనే వెదుకుదురు. ఉదాహరణకు వారు కూటములలో ప్రార్థించినా లేక మాట్లాడినా జనులను దృష్టిలో పెట్టుకొనకుండా దేవునినే దృష్టించుదురు. వారు దేవునికి భయపడుదురు కాబట్టి వారి బహిరంగ జీవితము ఎంత పవిత్రముగా ఉండునో వారి అంతరంగ (రహస్య) జీవితమును అంతే పవిత్రముగా యుండును.

ఇక్కడ నివసించువారు మనుష్యుల దృష్టిలో పెద్దవైనవియు మరియు గొప్పవైనవియు దేవుని దృష్టికి అసహ్యమైనవని చూచియుందురు. క్రీస్తులోను దేవుని స్వభావములోను పాలు పొందే అవకాశముతో పోల్చిచూస్తే సమస్తమును చెత్తవంటిది అని వారు ఎంచుదురు. పాపము మీద జయ జీవితములోనికి ప్రవేశించిన తరువాత వారిని, దేవుని శక్తి పడిపోకుండా కాపాడును మరియు వారు ఇంకా ఇంకా దేవుని స్వభావములో పాలుపొందుదురు. వారు అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుదురు మరియు వారు చేయువాటన్నిటిలో దేవుని ముందు జీవించుదురు. అతి పరిశుద్ధ స్థలములో నివసించువారు దేవుని వెలుగులో ఏది ప్రకృతి సంబంధమైనది (మానవ సంబంధమైనది) మరియు ఏది నిజముగా ఆత్మ సంబంధమైనది (దైవికమైనది) అను దానిపై అధికమైన వివేచనను పొందుదురు. యేసును అనుకరించుటకును మరియు ఆయన స్వభావములో పాలుపొందుటకును మధ్య ఎంతో వ్యత్యాసము ఉన్నది. మనము ఆయనను అనుకరించినప్పుడు జీవితము ఎల్లప్పుడు ఒక ప్రయాసగా నుండును కాని మనమాయన స్వభావములో పాలుపొందినప్పుడు మనము విశ్రాంతిలోనికి వచ్చెదము.

ఆదాము యొక్క సంతానముగా మనకు ద్వేషించుట, అబద్ధమాడుట, కోపము తెచ్చుకొనుట, స్త్రీల యెడల మోహము కలిగియుండుట, మనుష్యుల నుండి ఘనతను కోరుకొనుట, ధనాశ, స్వార్థము మరియు గర్వము కలిగియుండుట సులువుగా నుండును. ఎందుకనగా అది మన యొక్క స్వభావము. అయితే మనము దేవుని స్వభావములో పాలు పొందునప్పుడు ప్రేమించుట, సత్యము మాట్లాడుట, సహనము కలిగియుండుట, పవిత్రముగా నుండుట, దేవుని యొక్క మహిమను వెదుకుట, ఉదారముగా నుండుట, నిస్వార్ధము మరియు దీనత్వము కలిగియుండుట అంతే సుళువుగా నుండును.

ఒక పిల్లి తన శరీరమును నాకుకొని అన్ని వేళలందు శుభ్రముగా ఉండుట సుళువే. అది దాని స్వభావము గనుక అది దానికి శ్రమకాదు. కాని ఒక పందికి అలా చేయుటము, పిల్లిని అనుకరించుటము నిత్యము శ్రమగా నుండును. ఒక స్వభావమును అనుకరించుటకును మరియు దానిలో పాలుపొందుటకును మధ్య తేడాను తెలియజేయుటకు ఇది ఒక మంచి ఉదాహరణ. దేవుడు తన స్వంత జీవమును అనగా- ''యేసు యొక్క జీవమును'' (2కొరిందీ¸ 4:10) మనకు ఇచ్చును. ఆ విధముగా ఆయన మహిమ అయిన ఆయన మంచితనములో మనము పాలుపొందవచ్చును. అప్పుడు మనకు చెడుచేసిన వారికి మనము మంచిచేయుట, మనకు వ్యతిరేకముగా పాపము చేసినవారిని క్షమించుట మనకు కష్టముగా ఉండదు. ఒక పిల్లి తన జీవితాంతము తన్నుతాను శుభ్రముగా ఉంచుకొనినట్లే మనము కూడా మన జీవితాంతము ఈ దేవుని మంచితనములో కొనసాగవచ్చును.

ఈ అతి పరిశుద్ధ స్థలములో జనులు ఒక సమాజముగా కాక ఒకరితో ఒకరికి సంబంధము కలిగిన శరీరముగా తయారగుదురు. అతి పరిశుద్ధ స్థలములో ఎవరికి వారు ప్రత్యేకముగా నుండుట యనేది ఉండదు. ఎవరు కూడా తమ కొరకు మాత్రమే జీవించరు. ఇక్కడ జీవించు ప్రతిఒక్కరు నిరంతరమైన బలిగా నుండుట చేత దేవుడు అటువంటి సహోదర సహోదరిలందరిని ఒకస్థలములో అధికారముతో పనిచేయు క్రీస్తుశరీరముగా తయారుచేయును. ఆ విధముగా జీవించు వారి గూర్చియే యేసుప్రభువు ''ఏకీభవించుట'' మరియు తండ్రిని అడిగిన దేనినైనా పొందుకొనుట, సాతాను యొక్క శక్తిని బంధించు విషయములలో చెప్పెను (మత్తయి 18:18-20).

ప్రతి క్రైస్తవ సంఘములో ఎక్కువమంది ఆవరణములో ఉండిన వారుందురు. అనగా సువార్త సందేశము యొక్క మూడువంతులలో ఒక వంతు మాత్రమే విని స్పందించినవారు. పరిశుద్ధ స్థలములోనికి కూడా ప్రవేశించినవారు మరికొంతమంది ఉందురు. వీరు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కూడా పొందిన వారు. అయితే వీరు మూడు వంతులలో రెండు వంతుల సువార్త సందేశమును విని స్పందించినవారు .

కాని ఒక సంఘము యొక్క ఆత్మీయ అధికారము మరియు ప్రయోజకత్వము (దేవునికి సంబంధించినంత మట్టుకు) అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన వారి సంఖ్యను బట్టి యుండును. అనగా వారు సంపూర్ణ సువార్తను విని స్పందించినవారు.

శరీరమను తెరను చింపుట ద్వారా అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్లిన వారికే సాతాను భయపడును. అందుచేత అతడు సంపూర్ణ సువార్త విషయములో విశ్వాసులకు గ్రుడ్డితనము కలుగజేసెను.

ఒక సంఘములో కీలకమైనవారు శాశ్వతముగా అతి పరిశుద్ధ స్థలములో నివసించినప్పుడే, ఆ సంఘము ఆత్మీయమరణపు శక్తులనుండి విడుదల పొంది జీవ మార్గములో సంరక్షించబడును.

క్రీస్తు యొక్క వధువు తన వరునితో ఏక శరీరమగును. ''వారిద్దరును ఏకశరీరమగుదురు; ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను'' (ఎఫెసీ 5:31,32).

నీ జీవితము కొరకు దేవుడు కలిగియున్న అత్యున్నతమైన దానికంటే తక్కువ దానితో సంతృప్తిపడకుము. యేసు నీ కొరకు ప్రారంభించి తెరచిన స్థలములోనికి కొనసాగిపోకుండా నిన్ను ఆటంకపరచే మనుష్యుల అభిప్రాయములకు, ఆచారములకు మరియు నీకు అడ్డుగా ఉన్న పాపమంతటికిని బలత్కారము చేయుము.

అధ్యాయము 2
సత్యము యొక్క సరితూకము

''మీరు దేవుని త్రోవలను విడచి కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను- ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును'' (యెషయా 30:21-లివింగు బైబిలు).

ఇక్కడ చెప్పబడిన శబ్దము, దేవుని సింహాసనము యొద్దకు మనలను తీసుకు వెళ్ళు తిన్నని మరియు ఇరుకైన మార్గము నుండి మనము కొద్దిగా త్రోవ తప్పినా (కుడి తట్టయినను లేక ఎడమ తట్టయినను) మనలను హెచ్చరించేది పరిశుద్ధాత్మ స్వరము అయి యున్నది.

మనము ఈనాడు విశ్వాసుల యొక్క సంఘములను చూచినట్లయితే, వాటిలో చాలా ఒక గాటిలో- అది సత్యము యొక్క తిన్నని గీతకు కుడి వైపునకు గాని లేక ఎడమ వైపునకు గాని పడి నడచుచుండుట గమనించగలము.

ఒక ఉదాహరణను పరిశీలించండి. కొన్ని గుంపులు ఆత్మ యొక్క వరములకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ సమతుల్యత లేకుండా ఉన్నారు. మరి కొందరు ఆత్మ ఫలములకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తు, ఆత్మ వరములను సంపూర్తిగా నిర్లక్ష్యము చేసి వేరొక ప్రక్క సమతుల్యత లేకుండా ఉన్నారు. ఈ రెండు గుంపులలో ఏది కూడా తూకము ముల్లు మధ్యగా నుండునట్లు ఎడమకు లేక కుడికి జరుగమని చెప్పుటకు ప్రయత్నించుచున్న శబ్దమును వినుచుండినట్లు లేదు. ప్రతి గుంపునకు వాటికి యిష్టమైన కొన్ని బైబిలు వచనములుండును. వాటిని వారు మాటమాటికి చెప్పుచుందురు. సరియైన తూకములో వారిని ఉంచే వేరే వాక్య భాగములను వారు చూచినట్లు అనిపించరు. దానికి కారణం వారు ఆ వాక్యములపై ముందుగా ఏర్పర్చుకొనిన కొన్ని దురభిప్రాయములు.

చాలాసార్లు వారు ఆ వాక్యములు చూచుటకు తిరస్కరించుటకు కారణం, కొన్ని గుంపులు ఆ వాక్యములను తప్పుగా ఉపయోగించి త్రోవతప్పి, వ్యతిరేక దిశలో వెళ్లిపోవుటయై యున్నది. గనుక సత్యమును గూర్చి వారి గ్రహింపు, వేరే గుంపులు విపరీత అర్ధాలతో వెళ్లిన దానికి స్పందనయై యున్నది తప్ప, దేవుని వాక్యము అంతా జాగ్రత్తగా చదువుట వలన కలిగినది కాదు.

పాత నిబంధన కాలములో ప్రవక్తల పరిచర్య ఎల్లప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడ త్రోవ తప్పిపోయిరో ఎత్తిచూపుటగా యుండెడిది. వారు, పరిశుద్ధాత్మ యొక్క దిద్దుబాటు మాటలను చెప్పెడివారు. వారు సరియైన తూకముతో నుండిన పరిచర్య కొరకు చూడలేదు. వారెప్పుడు ఏది లోటుగా ఉండెనో దాని గూర్చి ఎక్కువగా నొక్కి చెప్పేవారు. వారెల్లప్పుడు ఇశ్రాయేలులో ఆ సమయములో దేవునికి అంగీకారమైన పద్ధతిలో నుండిన విషయముల గూర్చి చెప్పి సమయమును వ్యర్ధ పుచ్చేవారు కారు.

ఒక విధముగా చెప్పవలెనంటే పాత నిబంధన ప్రవక్తలందరు వారి పరిచర్యలో నిలకడైన తూకము లేని వారుగా నుండిరి.

ఉదాహరణకు యిర్మీయాను చూడండి. ఒకదశలో యిర్మీయా దేవునితో ''నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది. దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను'' (యిర్మీయా 20:8) అని చెప్పెను. దీని బట్టి ఆయనది కృపా సత్యములతో నిండియున్న ''తూకము కలిగిన పరిచర్య''గా లేదు. అది కేవలము తీర్పు, తీర్పు మరియు తీర్పుగా నుండెను! ఆ సందేశము ఒక స్థితిలో యిర్మీయాకే ఎంతో భారముగా నుండెను. అయినను ఆయన దానిని బోధించుట మానలేకపోయెను. దానికి కారణము ఆయన ఆ సందేశమును మార్చవలెనని అనుకొనినప్పుడు, తీర్పును గూర్చిన దేవుని వాక్యము ఆయన హృదయములో పట్టి ఉంచలేనంతగా దహించి వేయుచుండెను (యిర్మీయా 20:9). కనుక ఆయన యూదా దేశమునకు 46 సంవత్సరములుగా తీర్పును ప్రకటించుట కొనసాగించెను.

యిర్మీయా తన స్వంత ఆలోచననుగాని లేక దేవుని మనసు నెరుగని ఇతర బోధకుల స్వరమునుగాని వినినట్లయితే, ఆయన తన యొక్క సందేశమును మార్చియుండెడివారు. అప్పుడు ఆయన ఎక్కువ సమతుల్యత గలవానిగా యుండి యుండేవాడు. కాని ఆయన ఒక దేవుని ప్రవక్తగా ఉండెడి వాడు కాడు! ప్రతిఫలము కోసము పనిచేసే మరియొక కిరాయి బోధకుడుగా మిగిలిపోయేవాడు.

ఇప్పుడు అంతకు ముందుండిన ప్రవక్తయైన హోషేయ గూర్చి చూచెదము.

ఈయన సందేశము యిర్మీయాకు పూర్తిగా వ్యత్యాసమైనది. ఇశ్రాయేలీయులకు హోషేయ ద్వారా దేవుడిచ్చిన సందేశము, ''నీవు నాకు అవిధేయురాలవై త్రోవ తప్పిపోయిన నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను'' అనునది.

అయితే హోషేయకు 180 సంవత్సరముల తరువాత జీవించిన యిర్మీయా ఎప్పుడు హోషేయ పరిచర్యను అనుకరించుటకు ప్రయత్నించ లేదు. ఈ ప్రవక్తలు ఒకరిని ఒకరు అనుకరించుకొనే వారు కారు. వారిరువురు దేవుడు వారికి యిచ్చిన భారము నెరిగిన వారు.

ఒక క్రొత్త నిబంధన ప్రవక్త కూడా ఎల్లప్పుడు సంఘములో ఏది లోటుగా ఉన్నదో దానిని ఎత్తి చూపుచు సమతూకము లేనిదాని గూర్చి మాటలాడును. అతడు ఎవరికైతే పరిచర్య చేయుచున్నాడో ఆ ప్రజల యొక్క అప్పటి అవసరత గూర్చిన వివేచన అతడు దేవుని నుండి పొందుకొనును. ఈనాడు ప్రతి సంఘములో నున్న గొప్ప అవసరత ప్రవచనాత్మకమైన పరిచర్యయై యున్నది. ''కాదు ఆ త్రోవకాదు. ఇది సరియైన త్రోవ'' అని ఆ పరిచర్య ద్వారా ఆత్మ చెప్పును.

ఎక్కువమంది బోధకులు వారి ప్రసంగములను క్రైస్తవ పుస్తకములను చదువుట మరియు ప్రసంగ కేసెట్లు వినుట ద్వారా తయారు చేసికొందురు. విను వారిని ముగ్దులను చేయుట వారి యొక్క గురిగాయున్నది. వినువారి నుండి ఘనతను మరియు బహుమతులను పొందుటకు చూచుట చేత, విను వారికి యిబ్బంది కలిగించేవి ఏమీ మాటలాడకుండా వారు జాగ్రత్త పడుదురు.

అయితే ప్రవక్తలు అలాంటి వారు కాదు. వారు దేవుడు చెప్పేది విని జనులు ఏది వినాలని దేవుడు కోరుకొనుచుండెనో దానినే వారు జనులకు చెప్పుదురు. గనుక సమతూకము లేని ఒక సంఘము సరియగు వరకు ఒక ప్రవక్త ఒకే అంశమును మరల మరల బోధించును. అయితే వృత్తిపరమైన బోధకుడు ఒకే గుంపుకు ఒకే సందేశమును రెండు సార్లు ప్రకటించుటకు కూడా భయపడును. ఊరూరు తిరిగే బోధకులు పలాన సంఘములో వారు ఏ సందేశమును బోధించిరో అనుదానిని వారి మనస్సులలోనో లేక వారి దినచర్య పుస్తకములలోనో వ్రాసికొందురు. ఆ విధముగా వారు ఆ సంఘమును రెండవసారి దర్శించినప్పుడు అదే సందేశమును బోధించుట ద్వారా బోధకులుగా తమకున్న ఘనతను పోగొట్టుకొనకుండా జాగ్రత్త పడుదురు.

మన రోజుల్లో ప్రవక్తల యొక్క అవసరత ఎంతగా ఉన్నదో!

ఉపదేశ పరిచర్య, ప్రవచన పరిచర్యకు వేరైనది. ఉపదేశకుడు లేఖనములలో నున్న బోధను (సిద్ధాంతములను) విపులముగా వివరించును. అతడి బోధ, అతడు పరిచర్య చేయు జనుల యొక్క ప్రస్తుత అవసరతకు సంబంధించక పోయి యుండవచ్చును. పాపులు నీతిమంతులుగా తీర్పు తీర్చబడుట గూర్చి లేక పరిశుద్ధాత్మలో బాప్తిస్మము గూర్చి లేక పరిశుద్ధపర్చబడుట గూర్చి, లేక క్రీస్తు యొక్క రెండవ రాకడ గూర్చిన ఉపదేశము ఏ సంఘమునకైనా ఎప్పుడైనా లాభకరమైనదే! కాని అక్కడ జనులు అటువంటి అద్భుతమైన ఉపదేశములు విని కూడా పాపము చేతను మరియు నిరుత్సాహము చేతను ఓడింపబడుచుండ వచ్చును. అటువంటప్పుడు అటువంటి సంఘమునకు కావలసినది ప్రవచనాత్మక పరిచర్య!

మనము సమతూకములోనికి రావలసిన ఒక విషయము గూర్చి ఆలోచించెదము. అది సువార్త సందేశము విషయములో మన గ్రహింపు గూర్చినది.

ఎఫెసీ పత్రికలో పౌలు బోధించిన మంచి వార్తను మనము తేటగా చూచెదము. పౌలు ఎఫెసు సంఘములో నుండిన పెద్దలకు, మూడు సంవత్సరములు వారి మధ్యనున్న తరువాత, ''దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు'' (అపొ.కా.20:27)అని చెప్పెను.

పౌలు సువార్త సందేశమును, మనము పొందినట్లు ఇతరుల నోటి నుండి కాక సూటిగా ప్రభువు యొద్దనుండే పొందెను (గలతీ 1:11,12). మరియు ఆయన ప్రభువు నుండి పొందిన సువార్త కాక, ఎవడైనను వేరొక సువార్తను బోధించిన యెడల వాడు దేవుని చేత శాపగ్రస్తుడగును అని చెప్పెను (గలతీ 1:8,9). వేరొక సువార్తను ప్రకటించుట లేక సువార్తను ఏ విధముగానైనా పలుచన చేయుట లేక అందులోనిది ఏ భాగమునైనా విడిచి వేయుట అంత తీవ్రమైన విషయము.

ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక రెండు భాగములుగా విభజింపబడినది. మొదటి మూడు అధ్యాయములు సువార్త మొదటి భాగము మరియు తరువాత మూడు అధ్యాయములు రెండవ భాగముగా యున్నవి. మొదటి భాగములో దేవుడు మన కొరకు ఏమి చేసి ముగించి యున్నాడో వ్రాయబడినది. రెండవ భాగములో మనము దేవుని కొరకు ఏమి చెయ్యవలెనో వ్రాయబడిననది.

ఎఫెసీ 4:1 ''కాబట్టి....''అను మాటతో ప్రారంభమైనది. కాబట్టి అను మాట, తరువాత 4 నుండి 6 అధ్యాయములలో ఉన్నవన్నియు మొదటి మూడు అధ్యాయములలో పరిశుద్ధాత్ముడు వేసిన పునాదిపై అధారపడి యున్నవను విషయమును సూచించుచున్నది. పౌలు ఒక మంచి నేర్పరియైన నిర్మాణకుడు అందుచేత పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆయన ఎఫెసీ పత్రికను జాగ్రత్తగా వ్రాసెను.

ఎఫెసీ 4 నుండి 6 అధ్యాయములను, మనము 1 నుండి 3 అధ్యాయముల పునాదిపై కట్టబడిన పై నిర్మాణముగా చెప్పుకొనవచ్చును. ఈనాడు మనము అనేక క్రైస్తవ గుంపులలో చూచుచున్న సమతుల్యలోపము, వాటిలో కొన్ని 1 యుండి 3 అధ్యాయములపై పునాదివేయబడి పైనిర్మాణము లేకుండా యున్నవి. మరి కొన్ని పై నిర్మాణము (ఆఖరి 3 అధ్యాయములు) ఉండి, పునాది లేకుండా యున్నవి. రెండు గుంపులు సమానమైన బుద్ధిహీనతతో నున్నవి.

ఎఫెసీ మొదటి మూడు అధ్యాయములలో దేవుని సంతోషపరచుటకు మనము చేయడానికి ఒక్క ఆజ్ఞ కాని, హెచ్చరిక గాని లేకుండుట గమనించదగ్గ విషయము. అయితే అవి దేవుడు మనకొరకు చేసి ముగించిన వాటిని గూర్చిన వివరణతో నిండియున్నవి. అయితే తరువాత మూడు అధ్యాయములు మనము దేవుని ఎలా సంతోష పరచవలెననే హెచ్చరికలతో నిండి యుండుటను గమనించండి!

మనము పునాదికి సంబంధించిన సత్యములకును మరియు పై నిర్మాణమునకు సంబంధించిన సత్యములకును మధ్యనున్న తేడా తెలుసుకొనవలెనంటే ఆ వ్యత్యాసమును జాగ్రత్తగా గమనించవలెను. మనము పునాదిలో తలుపులు, కిటికీలు అమర్చము. అది పై నిర్మాణమునకు అవసరము, కానీ పై నిర్మాణము అంతా పునాదిపై కట్టబడవలెను. అనగా మనము బోధించే ప్రతి ఆజ్ఞ దేవుడు మొదటగా మన కొరకు మరియు మనలో ఏమి చేసి ముగించెనో అను దానిపై స్థిరముగా ఆధారపడి యుండవలెను.

అన్నిటికంటె మొదటగా దేవుడు మన కొరకు మరియు మనలో ఏమి చేసి ముగించియున్నాడో అనునది మనకు ఖచ్చితముగా తెలియక పోయినట్లయితే అప్పుడు మనము ఆయన ఆజ్ఞలను పాటించుటకు సామర్ధ్యము లేని వారమగుదుము. అప్పుడు మనము పాత నిబంధన భక్తులు దేవుని నియమాలను గైకొనుటకు ప్రయత్నించి ఎల్లప్పుడు ఓడిపోవుచు ఉండిపోయిన బంధకములోనే ఉండిపోవుదము. అందువలననే క్రైస్తవులనేకులు ఓటమిలోను, నిరుత్సాహములోను ఎల్లప్పుడు జీవిస్తూ వారికి జయజీవితము అసాధ్యమైనదన్నట్లు భావించుదురు.

మనకు ఎఫెసీ 1 నుండి 3 అధ్యాయముల పునాది అన్నివేళలా మనక్రింద లేక పోయినట్లయితే ఎడతెగని విజయము అసాధ్యమనునది నిజమే. పునాదిని ఒక చోట వేసి మరియొక చోట పై నిర్మాణమును మనము కట్టము. ప్రతి భవనము దాని పునాది మీద కట్టబడుట మాత్రమే కాక, అన్ని వేళలా అదే పునాది మీద నిలిచియుండును. ఆ భవనమునకు క్రొత్తగా అంతస్తులు చేర్చవలెనంటే, ఆ అంతస్తులు కూడా ఆ భవనమునకు సంబంధించి ప్రారంభములో వేసిన పునాదిపైననే నిలిచి యుండునట్లు కట్టవలెను.

విశ్వాసులు పునాది ఒక చోట వేసి, తరువాత పై కట్టడము వేరొక చోట కట్టుటకు ప్రారంభించినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారితో (వారికి వినుటకు చెవులుండినట్లయితే మరియు వారికి ముందు ఏర్పర్చుకొనిన దురభిప్రాయములు లేక పోయినట్లయితే), ''కాదు, అక్కడ కాదు, పునాది ఎక్కడ వేసారొ అక్కడ కట్టుడి'' అని చెప్పును.

మరొక ప్రక్క పునాది వేసి ఏమీ చేయకుండా పునాదిని చూచుకొని మురిసి పోవు వారితో (ప్రతి ఆదివారపు కూడికలో) పరిశుద్ధాత్మ స్వరము.

''ఇప్పుడు ఏమి చేస్తావు? పునాదితో సంతోషపడిపోవుచున్నావా! దానిపై ఇంటిని కట్టవా?''
అని అడుగును.సంవత్సరాల తరబడి ప్రసంగ వేదిక పై నుండి హెచ్చరిక తరువాత హెచ్చరికలు తప్ప మరియొకటి వినని (ఎఫెసీ 4నుండి 6 వరకున్న ఆజ్ఞలను ఆధారము చేసికొని) మనము సమతూకమగుటకు ఎఫెసీ 1 నుండి 3 వరకు నుండిన సత్యములను ఎక్కువగా వినుట అవసరము. ఎఫెసీ 1 నుండి 3 అధ్యాయములను తొందరగా దాటుకు వెళ్లిపోయేవారు తరువాత వారి జీవితాలలో భద్రతా లేమి, నిస్పృహ, భయము, దేవుడు వారిని అంగీకరించాడా లేదా అనే అనిశ్చితి, అసూయ, పోటీతత్వపు ఆత్మ మరియు ఇంకా అనేక ఇతర దుష్ట భావముల సమస్యలు ఎదుర్కొందురు.

మనలను మనము 3 ప్రశ్నలు వేసికొని పరీక్షించు కొందుము:

  1. ఒక రోజున ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆ ఉదయమున వాక్యము చదువుట లేక ప్రార్థించుట చేయలేదు కాబట్టి దేవుడు ఆ సమస్య గూర్చి సహాయపడడు అని ఎప్పుడైనా అనుకొన్నామా?
  2. మనము ఎప్పుడైనా ప్రమాదమునకు గురియైనప్పుడు లేక ఆర్థికమైన నష్టము జరిగినప్పుడు, ఆ రోజు ఉదయము దేవునితో సమయము గడపలేదు కాబట్టి అట్లు జరిగినదని ఎప్పుడైనా
  3. అనుకొన్నామా?
  4. మనము ఎప్పుడైనా ఒక రోజున ఎక్కువ సమయము బైబిలు చదువుతూ మరియు ప్రార్ధనలో గడుపుట వలన, మిగిలిన రోజులు కంటే ఆ రోజు దేవుడు మనలను మరి కొంచెము ఎక్కువ అంగీకరించెనని అనుకొన్నామా?

పై వాటిలో ఏవైనా నీ విషయంలో నిజమైనట్లయితే, అది నీవు ఇంకా ఎఫెసీ 1 నుండి 3 అధ్యాయములలో సరిగా పునాది కలిగి లేవని సూచిస్తుంది. దేవుడు నిన్ను దేనిని బట్టి అంగీకరించెనో నీవు ఇంకా అర్ధము చేసి కొనలేదు.

మనము చేసిన దానిని బట్టికాక, క్రీస్తు మనకొరకు చేసి ముగించిన దానిని బట్టి, దేవుడు మనలను క్రీస్తులో అంగీకరించెను అనే వాస్తవముపై మనము స్థిరముగా కట్టబడి లేక పోయినట్లయితే, మనము జయజీవితమును జీవించుట అసాధ్యము.

మనము కేవలము పునాది మాత్రమే కలిగియుండి క్రొత్త విబంధనలోని ఆజ్ఞలను మరియు హెచ్చరికలను ఎల్లప్పుడు పట్టించుకొనకుండా ఉండినా, మనము విజయులుగా నుండుట అంతే అసాధ్యము. మనము రెంటిలో ఏ పొరపొటు చేయకూడదు.

ఎఫెసీ 1 నుండి 3 అధ్యాయములలో ఉన్న పునాది

''మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన (పరిశుద్ధాత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదము) ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను'' (ఎఫెసీ 1:3).

బైబిలు ''ఆదియందు దేవుడు .....''(ఆది 1:1 ) అను మాటలతో ప్రారంభమగును. సత్యమైన సువార్త అట్లే ప్రారంభమగును. దేవునితోను మరియు ఆయన మనకు ఏమి చేసారను దానితో ప్రారంభమగును. ఒక మానవపరమైన సువార్త అయితే ''ఆది యందు మానవుడు....''అని ప్రారంభమగును. అది దేవుడు మన కొరకు అప్పటికే ఏమి చేసాడను విషయముతో కాక మనము ఏమి చెయ్యవలెననే విషయముతో ప్రారంభమగును.

నిజానికి ప్రతి అసత్య సువార్త నుండి యదార్ధమైన సువార్తను కనిపెట్టుటకు ఇది ఒక మార్గము. మత మౌడ్యులందరు మానవ ప్రయత్నములను గొప్పగా చెప్పుకొనుచు వారు సాధించిన దానిని బట్టి మనుష్యుల మహిమ పొందే మానవపరమైన సువార్తను ప్రకటించుదురు.

అటువంటి చాలా అసత్య సువార్తలు వినుటకు చాలా బాగుండును మరియు చూచుటకు జనులను పరిశుద్ధతలోనికి నడిపించునట్లు కనబడును. అందువలన చాలా మంది నిష్కపటమైన విశ్వాసులు మోసపోవుదురు. కాని అటువంటి సువార్తలన్నియు మరియు అటువంటి వాటిని ప్రకటించు వారందరు గలతీ 1వ అధ్యాయములో పౌలు ప్రకటించిన శాపము క్రిందికి వచ్చెదరు.

నిజమైన సువార్త ఎల్లప్పుడు దేవునితోను మరియు ఆయన మనకు చేసి ముగించిన దానితోను ప్రారంభమగును అంతేకాని మానవుడు దేవునికి చేయవలసిన దానితో కాదు అను విషయమును గుర్తుంచుకొనుడి.

ఎఫెసీ పత్రిక ''...తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను'' అని మొదలగును. అదే సరియైన ప్రారంభము. ఎన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను దీవించెను? సకల ఆశీర్వాదములతో మనలను దీవించెను. ఒక్క ఆశీర్వాదమును కూడా మనకు ఇవ్వకుండా ఆయన విడిచిపెట్టలేదు.

నీవు తిరిగి జన్మించిన వెంటనే పరిశుద్ధాత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదమునకు నీవు వారసుడవు. వాటిని నీవు స్వతంత్రించుకొనుటకు నీకు సమయము పట్టవచ్చును. కాని నీవు ఆ ఆశీర్వాదములన్నిటికి ప్రారంభము నుండే వారసుడవని మరువకుము. ''జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను'' (ఎఫెసీ 1:6).

దేవుడు మనలను పేరు పేరునా లక్షల సంవత్సరముల ముందే ఎరిగియుండెను. ''...ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో...మీరు తెలిసికొనవలెనని...''(ఎఫెసీ 1:18). ఈ నిశ్చయత మన జీవితాలలోనికి గొప్ప భద్రతను తీసుకురాగలదు.

నీవు మరియు నేను దేవునికి దొరికినప్పుడు ఆయనకు ఐశ్వర్యము దొరికినదను నిశ్చయతలో మనము వేరుపారవలెను. పై వచనము యొక్క అర్ధము అది. జెఫన్యా 3:17 లో ''దేవుడు నీయందు బహు ఆనందముతో సంతోషించును'' అని చెప్పబడినది. ఎక్కువ మంది విశ్వాసులు దేవుడు వారి వైపు ఎల్లప్పుడు తీక్షణంగా చూస్తూ ''అది సరిపోలేదు. నీవు ఇంకా బాగా చెయ్యి'' అని చెప్పుచుండే వైఖరిగల వానిగా ఉన్నాడని అనుకొందురు. దేవుడు వారి గూర్చి బహు ఆనందముతో సంతోషించును అని వారు ఎన్నడు ఊహించుకొనలేరు! దేవుడు అట్లు సంతోషించును అని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది.

''మీ మనోనేత్రములు వెలిగింప బడినందున ...ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి...క్రీస్తును మృతులలో నుండి లేపి'' (ఎఫెసీ 1:18-20).

దేవునిశక్తి యొక్క గొప్ప ప్రత్యక్షత సృష్టి యావత్తును సృష్టించుటలో కాక, క్రీస్తు యొక్క పునరుత్థానములో ఉన్నది. ఆ పునరుత్థానశక్తి (శూన్యములో నుండి సమస్తమును సృష్టించిన దాని కంటె గొప్పది) ఇప్పుడు నమ్మిన మనకందరకు అందుబాటులో ఉన్నది.

ప్రతిదీ విశ్వాసముపై ఆధారపడియున్నది. మరియు విశ్వాసము దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడునప్పుడు వినుట వలన వచ్చును. కనుక పై నున్న మాటలను తొందరపడి దాటిపోకుండా ధ్యానించుట ఎంతో ముఖ్యము.

మనము పై భాగము (ఎఫెసీ 1:18-20)లో చదివినదంతయు అయితే పూర్తిగా అబద్ధమై యుండవలెను లేదా సంపూర్తిగా యదార్ధమై యుండవలెను. అది అబద్ధమైనట్లయితే క్రొత్త నిబంధన క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడుట మొదలగు వాటిని గూర్చి బోధించే ప్రతిది అబద్ధము. అలా కాకుండా అవి నిజమేనని వాటిని మనము నమ్మినప్పుడు మన జీవితములలో దేవుని యొక్క మానవాతీత శక్తిని మనము అనుభవించకపోవుటకు కారణము మనము నమ్మక పోవుటయే.

ఈ పునరుత్థాన శక్తి నమ్మిన వారందరికీ అందుబాటులో ఉన్నది.

యేసు ప్రభువు మనకు ''పరలోకమందున్న మా తండ్రీ'' అని మన ప్రార్థనలను ప్రారంభించవలెనని నేర్పించెను. మనము మాటలాడునది ఈ సృష్టి అంతటి అధికారియైన వానితో కాదుగాని మన తండ్రితో, మనలను ప్రేమిస్తూ మన దైనందిక జీవితములలో జరుగు ప్రతి సంఘటన గూర్చి ఆసక్తి కలిగియుండి మరియు సంపూర్ణమైన జ్ఞానము మరియు సర్వశక్తి కలిగిన తండ్రితో మాటలాడు చున్నామను విషయమును మన మనసులలో మొదట స్పష్టముగా ఎరిగియుండవలెను.

దేవునిని సంబోధించు విషయము అంత ప్రాముఖ్యమైనది కాదనుకొని మనము ఈ భాగమును త్వరగా దాటిపోవచ్చును. కాని దేవుని సంబోధించు పద్ధతి మన ప్రార్థన అంతటికి పునాది వంటిది. అది మన అవసరములన్నిటిని ఎరిగియుండిన ప్రేమగల తండ్రిపై విశ్వాసముతో కూడియున్నది.

యేసు ప్రభువు తన శిష్యులను, దేవునిని తండ్రిగా చూచు విశ్వాసములోనికి నడిపించుటకు చూచిరి. ఎఫెసీ మొదటి మూడు అధ్యాయములు మనలను అటువంటి విశ్వాసములోనికి నడిపించుటకు చూచును. అటువంటి విశ్వాసము మాత్రమే మన జీవితములలోనికి సంపూర్ణ భద్రతను తేగలదు. అలాకానట్లయితే మన జీవితము, పరిస్థితులు మరియు సాతాను శక్తుల దాడులచే కొట్టబడి, గాలులకు కొట్టబడు తుఫానులో దిక్కుతోచని ఓడ వలె యుండును. అనేకమంది విశ్వాసులు చాలా భద్రతలేని వారుగా ఉన్నారు. వారి భూలోక యాత్రలో దేవుడు వారిని సగము దూరము మాత్రమే మోసి, ''నేను నిన్నింకా భరించలేను'' అని చెప్పుచు ఆయన వారిని విడిచిపెట్టునేమో అను అనిశ్చితిలో ఉన్నారు. అనేకులు ఎల్లప్పుడు దేవుని సంతోష పరచుటకు ఏదో ఒకటి చేయు ప్రయత్నములో క్రైస్తవ పనికి కొంచెం సొమ్ము ఇచ్చుట లేక ఉపవాసముండి ప్రార్దించుట మొదలైన వాటిని, తండ్రి చేత అంగీకరింపబడుటకు చేయుచుందురు.

ఒక దృష్టాంతము బహుశా ఈ పరిస్థితిని చాలా స్పష్టముగా వర్ణించగలదు. మీకు 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లలున్నారనుకొండి. ఆ తరువాత మీరు ఒక అనాధ శరణాలయము నుండి 8 ఏళ్లున్న ఒక అబ్బాయిని దత్తతకు తీసుకొన్నారు. మీ ముగ్గురు పిల్లలు మీ గృహములో సంపూర్ణమైన స్వేచ్ఛతో నుండి, రాత్రివేళ బాగా నిద్రించుచు అన్నివేళల మీ ప్రేమలో భద్రత కలిగియుందురు. కాని మీ గృహములోకి క్రొత్తగా వచ్చిన ఈ అబ్బాయి ఎల్లప్పుడు భద్రత లేని భావమును కలిగియుండును. ఇతరుల వలే తానుకూడా అంగీకరింపబడుచున్నానా లేదా అని అతడు ఎల్లప్పుడు తలంచుచుండును. అతడు రాత్రి సరిగా నిద్రపోలేడు. మీరు వానికి ఎంత నమ్మకము కలిగించుటకు ప్రయత్నించినా, మీ మిగతా ముగ్గురి పిల్లలతో సమానముగా అతడు అంగీకరింపబడునా అను సందేహములను అతడు కలిగియుండును. ఒక రోజు అతడు అనుకోకుండా పాలు ఒలకపోసినప్పుడు, దాని బట్టి అతడు ఇంటి నుండి బయటకు పంపివేయబడునేమో అని తలంచును. తనను మీరు అంగీకరించుట అతని ప్రవర్తన మీద ఆధారపడియున్నదని అతడు భావించును. కాబట్టి అతడు తన జీవితమంతయు మీ అంగీకారము పొందుటకు ప్రయత్నించుచు ఉండును.

దేవుని పట్ల వారి వైఖరిలో అనేకమంది విశ్వాసుల పరిస్థితికి ఇది సాదృశ్యముగా నున్నది. వారు అంగీకరింపబడుటకు నిత్యము ప్రయాస పడుచుందురు-వారు క్రీస్తులో అప్పటికే అంగీకరింపబడినామన్న నిశ్చయతను ఎప్పుడు కలిగియుండరు!

ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో దేవుడు క్రీస్తును మరణము నుండి లేపినప్పుడు, ఆయన పాదముల క్రింద సమస్తము ఉంచబడినది. (ఎఫెసీ 1:21,22) మరియు క్రీస్తును మనకు అనగా సంఘమునకు తలగా ఇచ్చుట వలన అవి మన పాదముల క్రింద కూడా యున్నట్లే. కాబట్టి ఈ లోకములో మనము మనుష్యుల వలనగాని సాతాను వలనగాని ఏ భయము లేకుండా జీవించగలము.

యేసు కల్వరి సిలువలో జయించని దయ్యము ఈ విశ్వమంతటిలో ఎక్కడా లేదు. దయ్యము పట్టిన వారిని నేను ఎదుర్కొన్నప్పుడు సందేహించుటకు, భయపడుటకు నాకు వచ్చే శోధనలను నేను ఈ సామాన్యమైన ప్రశ్నతో జయించాను. ''ఈ దయ్యము కల్వరిలో యేసు ప్రభువు చేత జయింపబడెనా లేదా?'' ఆ ప్రశ్నకు జవాబు ప్రతిసారి, ''అవును, మినహాయింపు లేకుండా అది జయింపబడెను''. అప్పుడు యేసు నామములో నాకు ఆ దయ్యముపై అధికారమున్నదని నాకు తెలియును. ఇది మన సామర్థ్యాలకు లేక వరాలకు సంబంధించిన విషయము కాదు. ఇది క్రీస్తు సిలువపై చేసినదానికి మరియు ఆయన మన శిరస్సుగా ఉన్నాడన్న వాస్తవమునకు సంబంధించినది. మనము క్రీస్తు యొక్క అధికారము క్రింద ఉన్నప్పుడు సాతాను మనలను ముట్టలేడు.

ఎఫెసీ 2,3 అధ్యాయాలు 1వ అధ్యాయములో చెప్పబడిన వాటిని విశదపరచును. మనము క్లుప్తముగా కొన్ని వచనాలును చూచెదము. కాని మీరు ఆ అధ్యాయాలను తరువాత తీరికగా ధ్యానించవచ్చును.

ఎఫెసీ 2:1-8 లో మనము మన పాపములలో మరణించియుండగా, దేవుడు మనలను క్రీస్తుతో కూడా లేపి మనలను రక్షించెను అని మనకు చెప్పబడియున్నది. రక్షణ మన వలన కలిగినది కాదు, మన క్రియల వలన కలిగినది కాదు. అందువలన ఎవ్వడును అతిశయపడుటకు లేదు (ఎఫెసీ 2:8).

ఒక మృతుడు ఏమియు చేయలేడు. కాబట్టి దాని అర్థము మనము మన కొరకు అసలు ఏమియు చేసుకోలేనప్పుడు(నిస్సహాయులముగా ఉన్నప్పుడు) దేవుడు మనలను సజీవులుగా చేసి రక్షించెను. మీరు దానిని నమ్ముచున్నారా? లేక మృతులలో నుండి మిమ్మును దేవుడు లేపుటకు సహాయపడుటకు మీరు కూడా కొంత చేసిరని భావించుచున్నారా? ఇది హాస్యాస్పదముగా ఉండవచ్చును. కాని దేవుడు తమను రక్షించుటకు తాము దేవునికి కొంత సహాయపడిరని నమ్మే విశ్వాసులు అనేక మంది ఉన్నారు!! అటువంటి విశ్వాసులు పాపములో వారు చచ్చిన స్థితిలో కాక కేవలము రోగులుగా మాత్రమే ఉండిరని భావించుదురు. ఒక రోగి ఏదైనా చేయుటకు అవకాశం ఉన్నది. కాని ఒక మృతుడు ఏమియు చేయలేడు. మీరు రోగులుగా ఉంటిరా లేక మృతులుగా ఉంటిరా?

ఎఫెసీ 2వ అధ్యాయము జాగ్రత్తగా చదవండి, మీకు జవాబు లభించును. మీరు మృతులై యుండిరి-నిశ్చయముగా జీవములేని వారిగాను, చచ్చిన వారిగాను ఉండిరి! అప్పుడు దేవుడు మిమ్మును సజీవులుగా చేసెను.

మన రక్షణ:

  • ''మనము అతిశయించపకుండునట్లు"
  • "మనవలన కలిగినది కాదు"
  • "మన క్రియలవలన కలిగినదికాదు'' (2:8,9).

మన రక్షణ మన క్రియలపై కొంచెమైనను ఆధారపడియుంటే మనము అతిశయపడుటకు కొంత కారణముండేది. కాని అది కేవలము దేవుని వలన కలిగెను గనుక, మనము ఆయననే మహిమపరచుదము. మరియు మనలో ఎవరును ఇతరులపై అతిశయపడలేరు. గర్విష్టులైన వారందరు ఎఫెసీ 2వ అధ్యాయము యొక్క ఉపదేశమును గ్రహింపలేదు.

బైబిలు అంతటిలో క్రీస్తు మరణమునుండి తనకు తానుగా లేచెనని చెప్పే ఒక్క వచనము కూడా లేదని మీకు తెలుసా? ప్రతి చోట దేవుడు ఆయనను లేపెనని చెప్పబడియున్నది. మనలను కూడా దేవుడే లేపెను.

మనము ఈ భూమిపై సంపూర్ణులుగా జీవించు ప్రక్రియలో మనము నిందారహితులుగా జీవించినా, దాని చివర, మనము ప్రభువు యెదుట నిలువ బడినప్పుడు మనము ''ప్రభువా నేను నిత్య నరకమునకు పాత్రుడనైన పాపిని. కాని నీవు నా కొరకు మరణించావు. గనుక నేను నీ ఉచిత కృప చేత రక్షింపబడితిని. నేను అతిశయపడుటకు నాకు ఏమీ లేదు'', అని మాత్రమే చెప్పగలము. ఈ విషయాన్ని అర్ధము చేసి కొనినవారు రక్షణ సిద్ధాంతాన్ని సరిగా అర్ధము చేసికొనియున్నారు.

పౌలు ఎఫెసీ 1:17-18లో ఎఫెసీయులు పరిశుద్ధాత్మనుండి ప్రత్యక్షతను పొందునట్లు ప్రార్ధించాడు. ఎఫెసీ మొదటి భాగము (1-3) చివర 3:16 లో వారు పరిశుద్ధాత్మనుండి శక్తిని పొందునట్లు ప్రార్ధించాడు.

ప్రత్యక్షత మరియు శక్తి రెండు మనకు ఎంతో అవసరమైనవి. పరిశుద్దాత్ముడు మాత్రమే ఈ రెంటినీ మనకు యివ్వగలడు. క్రైస్తవ జీవితమంతా పరిశుద్ధాత్మపై ఆధారపడి యున్నది. మొదటిగా దేవుడు క్రీస్తులో మన కొరకు ఏమి చేసి ముగించెనో అను దానిమీద ప్రత్యక్షతను ఆత్మ ఇచ్చును. తరువాత మన పిలుపుకు తగినట్లు, ప్రభువు బోధించిన వాటన్నిటికి విధేయత చూపుచు నడుచుకొనుటకు శక్తినిచ్చును.

ఆఖరుగా ఎఫెసీ 3:18,19లో నున్న క్రీస్తు ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మరియు లోతులను అనుభవించుట గూర్చి చూచుదుము. అయితే అది పరిశుద్ధులందరితో కలసి అనుభవించవలసియున్నది. ఇక్కడ ప్రేమకు నాలుగు పరిమాణములున్నవి. ఇదే మానవ జ్ఞానమునకు అందనిది.

మనము క్రీస్తు ప్రేమను మనకు మనమే అంతా అర్ధము చేసుకోలేము. మనకు క్రీస్తు శరీరములో ఇతర సభ్యులు కావలెను. మరియు ఇంకా మనకు మన స్వంత గుంపులోని సభ్యులే కాక క్రీస్తు శరీరములోని అందరు సభ్యులు కావలెను.

అందువలననే మన హృదయములు విశ్వాసులందరికీ, చివరకు మనతో అంగీకరించని వారికి, విపరీత పద్థతులతో ఉన్నారని మనము పరిగణించువారికి కూడా తెరచి యుంచవలెను. మనము వారందరితో కలిసి పని చేయలేక పోవచ్చును మరియు ఈ భూమిపై వారందరినీ నిశ్చయముగా కలుసుకొనలేము. కాని మన హృదయములు దేవుని యొక్క బిడ్డలందరికి తెరువబడియుండవలెను. దేవునికి ఎంతమంది పిల్లలున్నారో అంత మంది సహోదరులకు మరియు సహోదరీలకు, వారు నాగరికులైనను లేక అనాగరికులైననూ, మన హృదయాలలో స్థలము ఉండవలెను.

అందువలననే మనము దేవుని బిడ్డలందరు వ్రాసిన వాటిని చదువుటకు యిష్టము కలిగియుండవలెను. అంతేకాని మనకు ఇష్టమైన రచయితలు వ్రాసిన వాటిని మాత్రమే కాదు. అటువంటి పెద్ద హృదయమును కలిగిన విశ్వాసులను నేను నా జీవిత కాలమంతటిలో బహు కొద్ది మందినే చూచానని మిమ్మును ముందుగా హెచ్చరించుచున్నాను. కాని ఆ కొద్దిమంది నిజముగా ఆత్మీయముగా ధనవంతులు. మిగిలిన వారు దేవుడు అంగీకరించిన వారినందరిని అంగీకరించుటకు దీనులుగా లేనందున వారు పొందగలిగే ధనమును పోగొట్టుకొని, బీదరికములోను, విభజన కలుగజేయు వైఖరులతోను కొనసాగి పరిసయ్యుల వలే జీవించిరి, అలాగే మరణించుదురు.

మనము ఎఫెసీ మొదటి మూడు అధ్యాయములు జాగ్రత్తగా ధ్యానించి, పరిశుద్ధాత్ముని ఆ మహిమకరమైన సత్యముల గూర్చిన ప్రత్యక్షత యిమ్మనమని అడుగవలెను. దాని వలన నీవు సంపూర్ణ పవిత్రత, దీనత్వము మరియు ప్రేమతో జయ జీవితము జీవించుటకు ఆయన శక్తిని వెదకుటకు సిద్దముగా యుందువు.

అప్పుడు మన మందరము సమస్తమైన ద్వేషము. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మన హృదయము నుండి మరియు నోటినుండి దుర్భాషను మానగలిగి యుందుము (ఎఫెసీ 4:29,31)
అప్పుడు భార్యలు తమ భర్తలకు సంఘము క్రీస్తుకు లోబడినట్లును, భర్తలు క్రీస్తు సంఘమును ప్రేమించినట్లును తమ భార్యలను ప్రేమించగలిగియుందురు (ఎఫెసీ 5:22,25).
అప్పుడు మనము సాతానును అన్ని వేళలా జయించగలిగియుందుము (ఎఫెసీ 6:11-13).
అప్పుడు మనము ''దేవుని పోలి నడచుటకు'' మనము దేవుని శక్తిని పొందెదము.
దేవుడు మనము అడుగు వాటన్నిటి కంటెను, ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికముగా చేయశక్తి గలవాడు. ఆయనకే సదాకాలము మహిమ కలుగును గాక (ఎఫెసీ 3:21).

అధ్యాయము 3
క్రైస్తవ జీవితముపైన గట్టి పట్టును కలిగియుండుట

దేవుడు మనకు ఒక్కొక్క చేతి మీద అయిదు వేళ్లను ఇచ్చెను. వీటితో మనము వస్తువులను గట్టిగా పట్టుకోగలము. మీరు ఒక గ్లాసును రెండు వేళ్లతో పట్టుకోవచ్చు గాని, దానిని అయిదు వేళ్లతో పట్టుకొన్నప్పుడు ఉన్నంత పట్టు ఉండదు. అదే విధముగా మనము క్రైస్తవ జీవితముపైన గట్టి పట్టును కలిగియుండుటకు దేవుడు మనకు అయిదు వరములనిచ్చెను. ఈ అయిదు విషయాలలో ఏదో ఒక దానిపైన విశ్వాసులు తమ పట్టును సడలించినప్పుడు వారు దిగజారిపోవుదురు. మనము ఇంకా ఎక్కువ ఆత్మీయ అభివృద్ధిని సాధించుటకు నిత్యము ఆశను(ఆసక్తిని) కలిగియుండవలెను-దేవుని మరి ఎక్కువగా తెలిసికొనుటకును, ఆయనతోను మనతోటి విశ్వాసులతోను దగ్గర సహవాసము కలిగియుండుటకును, ఆయన పరిచర్యనిమిత్తమై ఆయనకు ఎక్కువ అందుబాటులో ఉండుటకును ఆశను(ఆసక్తిని) కలిగియుండవలెను.

1. యేసుయొక్క రక్తము

మనము గతములో చేసిన పాపముల యొక్క క్షమాపణ మన మొదటి అవసరత మరియు ఎల్లప్పుడు ఉండే అవసరత. మన పాపములకు పూర్తి జరిమానాను(ప్రాయశ్చిత్తమును) చెల్లించకుండా దేవుడు మన పాపముల యొక్క అపరాధ భావనను తీసివేయలేడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు (హెబ్రీ 9:22). కలువరి సిలువపై క్రీస్తు తన రక్తమును చిందించినప్పుడు అది ఎవరైనను ఎప్పుడైనను చేసిన ప్రతి పాపము యొక్క క్షమాపణకు వెల చెల్లించెను. కాని ఆ క్షమాపణను మనము స్వీకరించినప్పుడే అది మనదగును. మనము యధార్థముగా మన పాపములనుండి వెనుదిరిగి (మారుమనస్సు పొంది), ఆయన యందు విశ్వసించి, ఆయన అందజేయు క్షమాపణను స్వీకరించిన యెడల మనము క్రీస్తు రక్తము ద్వారా మన పాపములన్నిటి యొక్క క్షమాపణను పొందవచ్చును.

క్రీస్తుయొక్క రక్తము మనలను నీతిమంతులుగా కూడా తీర్చును (రోమా 5:9). ఇది క్షమించబడుట కంటే ఎక్కువైనది. ఇది మన జీవితాలంతటిలో పాపము చేయని వారి వలే నీతిమంతులుగా తీర్చబడుట. మన పాపములను ఇంకెన్నడు జ్ఞాపకము చేసికొననని దేవుడు చెప్పెను (హెబ్రీ 8:12). దాని అర్థము మనము ఎన్నడును పాపము చేయనట్లే ఆయన మనలను చూచును. నీతిమంతులుగా తీర్చబడుట అంటే అదే. క్రీస్తుయొక్క రక్తముకున్న శక్తి అటువంటిది. క్రీస్తు రక్తము ద్వారా దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చెనన్న వాస్తవము సాతాను వారినుండి దాచెను గనుక అనేకమంది విశ్వాసులు తమ గత జీవితాలను బట్టి నిత్యము శిక్షావిధిలో జీవించుదురు.

మనము క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి (1పేతురు 1:19). దాని అర్థమేమనగా మనము పాప-బానిసత్వము అను అంగడి నుండి కొనబడినాము. క్రీస్తు సిలువపై కార్చిన రక్తము దేవుని పరిశుద్ధమైన ధర్మశాస్త్రమునకు చెల్లించిన క్రయధనము. ఇది మనము ఇక బానిసలుగా కాక, స్వతంత్రులుగా ఉండుటకు చెల్లించబడినది. మనము స్వేచ్ఛగా ఉండుటకు జన్మించితిమి. మనము సాతానుకు గాని మనుష్యులకు గాని, శిక్షావిధికిగాని, అపరాధ భావమునకు గాని, భయమునకు గాని, పాపమునకు గాని బానిసలుగా ఉండనక్కరలేదు. క్రీస్తు రక్తము ద్వారా మనము దేవునికి సమీపస్థులముగా చేయబడినాము (ఎఫెసీ 2:13). దేవుడు ఏ మనిషి సమీపించరాని తేజస్సులో నివసించును. మన జీవితాల యొక్క చివరి దశ వరకు ఆయనకు సమీపముగా వచ్చుటకు ఏకైక మార్గము క్రీస్తు యొక్క రక్తమే. మనము ఎంత పరిశుధ్ధులమైనప్పటికీ, దేవుని సన్నిధిలోనికి మన ప్రవేశము క్రీస్తు యొక్క రక్తము ద్వారానే జరుగును. వారికి తెలిసిన పాపము మీద జయము పొందిన వెంటనే అనేక మంది విశ్వాసులు దీనిని మరచిపోయి చివరకు పరిసయ్యులుగా మారుదురు.

కలువరి సిలువపై చిందింపబడిన రక్తము ద్వారా క్రీస్తు దేవునితో సంధిచేసెను (కొలస్సీ 1:20). దేవుడు మన శత్రువు కాదుగాని మన స్నేహితుడు. ఈ సత్యము మన మనస్సులలో స్థిరముగా నాటబడవలసిన అవసరమున్నది. దేవుడు వారితో ఎప్పుడు సంతోషముగా లేడని వారి యెడల ఎల్లప్పుడు కోపముతో ఉన్నాడనే భావముతో అనేకమంది విశ్వాసులు జీవించుదురు. ఇది విశ్వాసులను శిక్షావిధికి గురిచేయుటకును మరియు వారి ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరచుటకును తయారు చేయబడిన సాతాను యొక్క అబద్ధమైయున్నది. క్రీస్తు రక్తము ద్వారా మనము దేవుని స్నేహితులుగా మారియున్నాము. మనము దీనిని నమ్మనంతవరకు మనము ఎటువంటి ఆత్మీయమైన అభివృద్ధిని సాధించలేము. మనము వెలుగులో నడచినప్పుడు క్రీస్తుయొక్క రక్తము మనలను అన్ని పాపములనుండి నిత్యము పవిత్రపరచును (1యోహాను 1:7). వెలుగులో నడచుట అనగా తెలిసిన పాపమంతటి మీద జయము కలిగియుండుట. కాని మనము తెలిసిన పాపము మీద జయము కలిగియున్నప్పటికి, మనందరిలో ఎంతో తెలియని పాపము దాగియుండును. ఆ కారణము చేత, ''మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము'' అని యోహాను చెప్పెను (8వ వచనము).

మనము తెలియని పాపము చేయునది శరీరమును కలిగియుండుట వలన కాదు గాని, మనము రక్షణ పొందక మునుపు మరియు దాని తరువాత కూడా అనేక సంవత్సరాలుగా తెలిసిన స్వార్థముతో జీవించుట వలనే. యేసు మనవంటి శరీరమునే కలిగియుండెను. కాని ఆయన ఏ సమయములోను స్వార్థ పూర్వకముగా జీవించలేదు గనుక ఆయన తెలియకుండా ఒక్కసారి కూడా పాపము చేయలేదు. ఆయనయందు పాపము లేకుండెను (1యోహాను 3:5). మన పాపముల సంఖ్యలో మనకు తెలియని పాపములు మొదట్లో దాదాపు 90 శాతము ఉండును. మనము తండ్రితో నిత్యము ఎడతెగని సహవాసమును కలిగియుండగలుగునట్లు ఇవి క్రీస్తు రక్తము చేత నిత్యము పవిత్రపరచబడును. క్రీస్తుయొక్క రక్తము ద్వారా మనము సాతానును అతని నేరారోపణలను జయించవచ్చును (ప్రకటన 12:11). సాతాను నిత్యము మనమీద దేవుని యెదుట, ఇతరుల యెదుట, మన యెదుట నేరారోపణ చేయును. కాని మనము క్షమింపబడి, నీతిమంతులుగా తీర్చబడి, విమోచింపబడి, దేవునికి సమీపస్తులుగా చేయబడి, దేవునితో సమాధానపడి, క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడియున్నామని ఒప్పుకొనుట ద్వారా (సాక్ష్యమిచ్చుట ద్వారా) అతడి నేరారోపణలను జయించవచ్చును. సాతానుకు ఇక మన మీద ఏ అధికారమును లేదు. మనమందరము తెలియక అనుదినము పాపము చేయుదము గనుక మనలను అనుదినము పవిత్రపరచుటకు మనకు క్రీస్తు రక్తము అవసరము. అనేక మంది విశ్వాసులు తెలిసికూడా పాపము చేయుదురు.

2. పరిశుద్ధాత్మ

మనము పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించుట గాని లేక దేవుని సేవను సమర్థవంతముగా చేయుటగాని అసాధ్యము. పాపక్షమాపణ మరియు పరిశుద్ధాత్మ మారుమనస్సు పొందిన పాపులకు దేవుడిచ్చుటకు సిద్ధముగా నున్న రెండు వరములు. ప్రభువు వైపు తిరిగి ఆయననుండి పాపక్షమాపణను పొందిన ఎవరైనను పరిశుద్ధాత్మను పొందుటకు ఒక్కరోజైనను వేచియుండే అవసరము లేదు. క్రైస్తత్వము యొక్క మొదటి దినాలలో అలాగే యుండెను. ఆ దినాలలో ప్రజలు మారుమనస్సు పొంది విశ్వసించిన వెంటనే నీటి బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను ఒకేసారి పొందేవారు. అది వారి ప్రాథమిక అనుభవములో భాగముగా ఉండేది. కాని ఈనాడు విశ్వాసులు నీటి బాప్తిస్మము పొందుటకు ముందు ఏళ్లతరబడి వేచియుండుట పరిశుద్ధాత్మను పొందుటకు అనేక సంవత్సరములు వేచియుండుటను చూచెదము.

ప్రతి విశ్వాసి తెలుసుకొనవలసిన విషయమేమిటంటే పరిశుద్ధాత్మను పొందుటకు, పాప క్షమాపణ పొందుటకు కావలసిన దాని కంటే మరి ఏ ఇతర అర్హత అవసరము లేదని. అవి పాపమునుండి వెనుదిరుగుట (మారుమనస్సు) మరియు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము. ఈ సత్యము తెలియకుండుట వలనే అనేకమంది విశ్వాసులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందరు. వారికి సత్యము తెలిసిన యెడల, వారు ఇక సాతాను చేత మోసగింపబడరు.

పరిశుద్ధాత్మను పొందుటకు యోగ్యముగా ఉండుటకు ప్రయత్నించుట, పాపక్షమాపణ పొందుటకు యోగ్యముగా ఉండుటకు ప్రయత్నించుట వంటి అవివేకమైనది. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ప్రాథమికముగా మన జీవితాలలోనికి ఆత్మ యొక్క సంపూర్ణ ఫలమును తెచ్చును-ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వీకము, ఆశానిగ్రహము అనువాటి యొక్క సంపూర్ణతను మనలోనికి తెచ్చును (గలతీ 5:23). రెండవదిగా అది క్రీస్తు కొరకు మనలను శక్తివంతమైన సాక్షులుగాను మరియు ఆయన భూసంబంధమైన శరీరముయొక్క సమర్థవంతమైన అవయవాలుగాను చేయును.

క్రీస్తు శరీరములో ఒక సమర్థవంతమైన అవయవముగా నుండుటకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ప్రధానమైన అవసరతయైయున్నది. ఇది లేకుండా, మన జీవితములు ఎంత పరిశుద్ధమైనవి అయినప్పటికి భూమి మీద దేవుని పనికి మన ప్రయోజనము పరిమితముగా నుండును. ప్రభువైన యేసు 30 సంవత్సరములు ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము జీవించినప్పటికీ, ఆయన తన పరిచర్యను వెరవేర్చుటకు అవసరమైన మానవాతీతమైన వరములను పొందుటకు ఆయన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము పొందవలసివచ్చెను.

భూమి మీద క్రీస్తు శరీరముగా ఆ పరిచర్యను కొనసాగించుటకు ఈనాడు దేవుడు మనలను అదే విధముగా సిద్ధపరచవలెనని కోరుకొనుచున్నాడు. అయితే ఈ మానవాతీతమైన వరములను తృణీకరించువారు లేక వాటిని నమ్మనివారు వాటిని పొందలేరు. ఆ విధముగా ప్రభువు కొరకు వారి పరిచర్య పరిమితముగా నుండును. మనము పరిశుద్ధాత్మతో అనుదినము నింపబడవలెను. ఎందుకనగా ఇది మన అవసరమంతటిని ఎప్పటికి తీర్చే ఒకే ఒక్కసారి పొందే అనుభవము కాదు.

3. దేవుని వాక్యము

లేఖనముల యొక్క మొదటి వాక్యభాగము నుండే, పరిశుద్ధాత్మ దేవుని వాక్యముతో పాటు పనిచేయుటను మనము చూచెదము. దేవుడు పలికిన మాట మరియు పరిశుద్ధాత్మ అల్లాడుచుండుట మరియు కల్లోల స్థితినుండి క్రమమును మరియు అందమును తెచ్చెను. మన జీవితాలలో కూడా దేవుడు అదే విధముగా క్రమమును మరియు అందమును తీసుకురాగలడు. వ్రాయబడిన వాక్యము యొక్క నడిపింపు లేకుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవ పూర్వకముగా తెలిసికొనుట ఒక వ్యక్తిని పట్టాలు లేని రైలు బండివలే చేయును. దీనికి విరుద్ధముగా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మరియు శక్తి లేకుండా దేవుని వాక్యమును తెలిసికొనుట ఒక వ్యక్తిని పట్టాలమీద నిలిచియున్న రైలు బండి వలే చేయును. అతడు ముందుకు వెళ్లుటకు కావలసిన ఇంధనము లేదు.

దేవుని మనస్సును మనము దేవుని వాక్యము ద్వారా తెలిసికొనెదము. దానికి లోబడుట ద్వారా దేవుడు ఆలోచించినట్లు ఆలోచించుటకును, ''దేవుని ఆలోచనా విధానముతో అన్నిటిని చూచుటకు'' (కొలస్సీ 1:9 వివరణ)ను మన మనస్సులు నూతన పరచబడును. దేవుని వాక్యము మన మనస్సులను నూతనపరచుటకు అనుమతించకుండా మనము ఆత్మీయముగా ఎదుగుట అసాధ్యము. అనేకులకు జీవితము యొక్క వేర్వేరు పరిస్థితులలో దేవుని చిత్తము తెలియదు. దీనికి కారణము వారు దేవుని వాక్యమును తెలుసుకొనకపోవుటయే. దానిని ఎక్కడ కనుగొనవలెనో మనకు తెలిసినట్లయితే దేవుని వాక్యములో మన జీవితములో ఎదుర్కొనబోయే ప్రతి సమస్యకు సమాధానము ఉన్నది.

దేవుని వాక్యమును తెలుసుకొనని విశ్వాసులు ఎంత బీదవారు.

దేవుని వాక్యము మన అంతరంగ ఆత్మీయ పరిస్థితిని కూడా బయలు పరచును (హెబ్రీ 4:12). అది మన హృదయాలలో నుండు సమస్తమును బయటపెట్టే ఒక అన్వేషించు (స్కానింగ్‌) యంత్రము వంటిది. దేవుని వాక్యమును క్రమము తప్పకుండా ధ్యానించనివాడు తన నిజమైన స్థితిని గూర్చి ఏమియు తెలియని వానిగాను, మోసపోయిన వానిగాను నుండును.

ఆత్మీయ పోరాటములో, దేవుని వాక్యమే సాతానుకు వ్యతిరేకముగా మనకున్న ఆయుధము. సాతానుకు దేవుని వాక్యమును వల్లించుట ద్వారా యేసు అతనిని జయించెను (మత్తయి 4:1-10). శత్రువును తరిమివేయు ఖడ్గము ఇదే. దేవుని వాక్యము ఒక వ్యక్తిలో నిలిచియున్నప్పుడు అతడు సాతాను తంత్రములన్నిటిని జయించుటకు బలము పొందును (1యోహాను 2:14). మన మీద మనము వెలుగుపొందగోరిన యెడల, జయించువారిగా ఉండగోరిన యెడల మరియు ఆత్మీయ అభివృద్ధిని చేయగోరిన యెడల మనము దేవుని వాక్యము అనుదినము మనతో మాట్లాడుట వినవలెను.

4. సిలువ మార్గము

మన మార్గదర్శకుడైన యేసు (మనకు ముందు అదే పరుగును పరుగెత్తినవాడు) మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుటకును అక్కడ ఎల్లప్పుడు నివసించుటకును మనకొరకు మార్గమును తెరచెను. ఈ మార్గము నూతనమైన జీవముగలిగిన మార్గమని పిలువబడెను (హెబ్రీ 10:19). యేసును వెంబడించుట అనగా ''ఆయన మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడును వహించుకొనిపోవుట'' యని పౌలు చెప్పెను (2కొరిందీ¸ 4:10). అతడు క్రీస్తుతో కూడా సిలువవేయబడి, ఇక జీవించియుండలేదన్న వ్యక్తిగత సాక్ష్యమును కలిగియుండెను. అతడు కల్వరిలో మరణించినందున అతనిలో జీవించుచున్నవాడు క్రీస్తే. తన అద్భుతమైన జీవితమునకు, దేవునికి ఉపయోగపడుటకును ఇదే రహస్యము.

యేసు ఎల్లప్పుడు సిలువ మార్గములో నడిచెను. ఇది స్వంత చిత్తమునకు మరణముతో కూడిన మార్గము. ఆయన తన్నుతాను ఒక్కసారి కూడా సంతోషపెట్టుకొనలేదు (రోమా 15:3). ఒకడు తన్నుతాను సంతోషపెట్టుకొనుట పాపమంతటికి మూలమైయున్నది. ఒకడు తన్నుతాను ఉపేక్షించుకొనుట పరిశుద్ధతకు మూలమైయున్నది. ఒకడు తన్నుతాను అనుదినము ఉపేక్షించుకొని అనుదినము తన స్వంత చిత్తమునుకు మరణించని యెడల, అతడు తనను వెంబడించలేడని ఒకసారి యేసు చెప్పెను (లూకా 9:23). మనలను మనము అనుదినము ఉపేక్షించుకొనని యెడల యేసును వెంబడించుట అసాధ్యము. మనము క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడి, పరిశుద్ధాత్మను పొంది, దేవుని వాక్యమును బాగుగా అర్థము చేసుకొని యుండవచ్చును గాని అనుదినము మన స్వంత చిత్తమునకు మనము చనిపోని యెడల మనము యేసును వెంబడించలేము.

పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుటకు చూచేవారిని గూర్చి యేసు ఒకసారి మాట్లాడెను. ఇది ఆ వస్త్రమును చింపివేయునని ఆయన చెప్పెను. పాత వస్త్రమును విడిచిపెట్టి (స్వంత జీవమును మరణింపజేసి) క్రొత్త వస్త్రమును పొందవలసిన అవసరమున్నది. మరియొక ఉపమానములో, మనము మంచి ఫలములను కోరుకొనిన యెడల చెట్టును మంచిదిగా చేయవలెనని ఆయన చెప్పెను. కేవలము చెడ్డ ఫలములను నరికివేయుటలో ప్రయోజనము లేదు.

ఈ ఉపమానములన్నిటిలో ప్రధానముగా ఒక పాఠమున్నది: ప్రాచీన పురుషుడు మెరుగుపరచబడలేడు. అతడు దేవుని చేత సిలువవేయబడెను (రోమా 6:6). అతనిపై దేవుని తీర్పును మనము అంగీకరించి, అతనిని విడిచిపెట్టి నూతన పురుషుని ధరించవలెను. సిలువ మార్గమే ఆత్మీయ పురోగతికి మార్గము. కోపము, చికాకు, అసహనము, మోహపు తలంపులు, మోసము, అసూయ, ద్వేషము, పగ, డబ్బును ప్రేమించుట మొదలగు పాపములను మీరు జయించలేకుంటే దానికి సమాధానము ఇక్కడే ఉన్నది: మీరు సిలువ మార్గమును తప్పించుకొనిరి.

ఒక మరణించిన వ్యక్తి తన హక్కుల కొరకు నిలబడడు. అతడు తిరిగి పోరాడడు. అతడు తన పేరు ప్రతిష్టలను లెక్కచేయడు. అతడు ప్రతీకారము తీర్చుకొనడు. అతడు ఎవరిని ద్వేషించడు లేక పగ కలిగియుండడు. మన స్వంత జీవితమునకు (చిత్తమునకు) చనిపోవుట అంటే ఇదే. (మనము ముందు పరిశీలించిన విధముగా) దేవుడు మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఏర్పాటుచేసిన వాటివలే సిలువ మార్గమనేది కూడా మన ఆత్మీయ అభివృద్ధికి మనకు అనుదినము అవసరమైనది.

5. క్రీస్తు యొక్క శరీరము

క్రొత్త నిబంధనలో, మనకు పాపము మీద జయమున్నప్పటికీ మనము ఒంటరి క్రైస్తవులుగా జీవించుట దేవుని ఉద్దేశ్యము కాదు. యేసుయొక్క శిష్యులు ఒక శరీరముగా తన మహిమను ప్రత్యక్షపరచవలెననునది దేవుని చిత్తమై యున్నది.

ఒక శరీరమునకు ఒక సమాజమునకు వ్యత్యాసమున్నది. ఒక సమాజము ఒక లౌకికమైన క్లబ్బు కంటే మెరుగైనది కాదు. ఒక క్లబ్బు, ప్రజలు ఒకరికొకరు సహాయము చేసుకొనెడి మంచి క్లబ్బు కావచ్చును. కాని ఒక శరీరము దాని కంటే ఎక్కువైనది. క్రీస్తు శరీరములో ప్రతి అవయవము మొట్టమొదటిగా శిరస్సుతో అంతరంగముగా సంబంధము కలిగియుండును. ఆ తరువాత ఇతర అవయవములతో అంతరంగముగాను విడదీయబడలేని విధముగా సంబంధము కలిగియుండును. వారి ఐక్యత తండ్రి కుమారుల యొక్క ఐక్యతవలే యగువరకు వారు ఐక్యతలో ఎదుగవలెను (యోహాను 17:21-23).

అటువంటి శరీరము భూమిమీద ఎక్కడైనను కట్టబడుటను సాతాను వ్యతిరేకించును, ఎందుకనగా అటువంటి శరీరము అతనిని ఓడించి, తరిమి వేసి అతని రాజ్యమును నాశనము చేయును. అటువంటి సంఘము యెదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవని యేసు చెప్పెను (మత్తయి 16:18). ఒక ఒంటరి క్రైస్తవుని యెదుట పాతాళలోకపు ద్వారములు నిలువగలవేమో కాని అవి సంఘము యెదుట నిలువలేవు. ఆ కారణము చేతనే సాతాను పవిత్రత మీద చేయు దాడులకంటే విశ్వాసుల మధ్యనున్న ఆత్మీయ ఐక్యత మీద చేయు దాడులు ఎంతో బలమైనవి.

ఎక్కడైతే యేసుయొక్క ఇద్దరు శిష్యులు ఏక మనస్సుతోను ఏక ఆత్మతోను ఐక్యముగా నుందురో, వారు ఏమి అడిగినను అది వారు పొందుదురు, ఎందుకనగా అటువంటి ఇద్దరి శిష్యులలో క్రీస్తు శరీరము యొక్క ప్రత్యక్షత కనబడును (మత్తయి 18:18-20). ఇతర విశ్వాసులతో సహవాసము చేయుట ద్వారా, మనము ఒంటరిగా జీవించిన దానికంటే ఎంతో త్వరితముగాను ఎంతో లోతుగాను మన శరీరము యొక్క భ్రష్టత్వమును మనము కనుగొనెదము. ఇతరులతో మన సహవాసము ద్వారానే మన కరిÄనమైన స్వభావము సున్నితముగా మారును.

సహవాసము మన పరిచర్యలో కూడా సమతుల్యతను తెచ్చును. మనలో శ్రేష్టులమైన వారము కూడా మనకు మనమే ఉన్నప్పుడు సమతుల్యత లేనివారుగా ఉందుము. క్రీస్తు శరీరములోని ఇతర సభ్యులకు మనము విలువ నిచ్చునట్లు దేవుడు ఆ విధముగా చేసెను. క్రైస్తవ లోకములో సంఘమును గూర్చి కావలసినన్ని సిద్ధాంతమలున్నవి. క్రీస్తు శరీరమును గూర్చి మనము మరియొక సిద్ధాంతమును కలిగియుండవలసిన అవసరము లేదు. మన స్థానిక సంఘములో మన పరస్పర సంబంధముల ద్వారా శరీరము యొక్క వాస్తవికతను మనము కనుపరచవలెను, ఆ విధముగా భూమి మీద క్రీస్తు శరీరము యొక్క వాస్తవికతను లోకమునకును సాతానుకును ప్రదర్శించెదము.

దేవుని వరములన్నిటిని పొందుట

మనము ఒక వేలితో ఎన్నో చేయవచ్చు, రెండు వేళ్లతో ఇంకా ఎక్కువ చేయవచ్చు. మూడింటితో మరియెక్కువ, నాలుగింటితో చాలా ఎక్కువ చేయవచ్చు. కాని దేవుడు తన జ్ఞానమును బట్టి మనలను అయిదు వేళ్లతో సృష్టించెను. ఒక ఉద్దేశ్యముతో సృష్టించెను. మన చేతులమీద వేళ్లను గూర్చి మనము ఆలోచించినప్పుడు, మనము కేవలము రెండు వేళ్లతో ఎప్పుడు సంతృప్తి చెందము. అయితే క్రైస్తవ జీవితములో మనము తక్కువ వాటితో ఎందుకు సంతృప్తి పడవలెను? క్రైస్తవ జీవితముపైన గట్టి పట్టును కలిగియుండునట్లు మనము, దేవుడు మనకు అనుగ్రహించిన వరములన్నిటిని పొంది వాటిని ఉపయోగించుదము.

అధ్యాయము 4
సిలువ యొద్ద జరిగిన మూడు మార్పిడిలు

సిలువ యొద్ద జరిగిన మూడు మార్పిడిలు

దేవుడు మన కొరకు చేయు ప్రతి కార్యము విశ్వాసము ద్వారా కృపచేతనే చేయును (ఎఫెసీ 2:8). పరలోకము నుండి దేవునియొక్క చెయ్యి క్రీస్తునందు ప్రతివిధమైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనకు ఇచ్చుటకు దిగివచ్చుట కృప (ఎఫెసీ 1:3). దేవుని చేతి నుండి ఆ ఆశీర్వాదములను అందిపుచ్చుకొనుటకు పైకి మన చెయ్యి చాపుటయే విశ్వాసము.

విశ్వాసులను ఆత్మీయమైన ధనికులుగా మరియు జయించు వారిగా ఉండాలని దేవుడు ఉద్దేశించినా వారు ఓడిపోయి బీదలుగా నుండుటకు కనీసము నాలుగు కారణాలు ఉన్నవి.

  1. దేవుడు క్రీస్తునందు వారికి ఇచ్చిన ఆశీర్వాదముల గూర్చి తెలియనివారుగా ఉన్నారు.
  2. వాటిని గూర్చి వారికి తెలిసి యుండినా, వాటి కొరకు వారు దేవుని అడుగక యున్నారు.
  3. వారు వాటిని గూర్చి అడుగుచుండినా, వారు అవిశ్వాసముతో అడుగుచున్నారు.
  4. వారు విశ్వాసముతో అడిగినా, వారు స్వార్ధపూరిత ఉద్దేశ్యములతో అడుగుచున్నారు. (యోహాను 8:32; రోమా 10:14; యాకోబు 4:2; యోహాను 16:24; మత్తయి 13:58; యాకోబు 1:7; 4:3)

......''ఆదియందు దేవుడు'' ...అను మాటలతో బైబిలు ప్రారంభమగును (ఆది 1:1) దైవికమైన ఏ పనికైనా ఇది ముఖ్య లక్షణముగా ఉండును. దానియొక్క ప్రారంభము దేవునిలో ఉండును. దానికి వేరుగా, మానవ పని, అది ''క్రైస్తవ పని'' గా పిలువబడినా సరే దాని యొక్క ప్రారంభము మానవుని మనస్సులో ఉండును.

''నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును'' (మత్తయి 15:13) అని యేసు చెప్పారు. ఆ మొక్క (ఆలోచన, పని, పరిచర్య మొదలైనవి) మంచిదే కావచ్చు, కాని అది దేవుని చేత నాటబడక పోయినట్లయితే, అది పెరికి వేయబడి ఒక రోజున దహించి వేయబడును.

ఈ రోజున క్రైస్తవ లోకములో దేవునిలో ప్రారంభముకాని అనేకమైన మంచి విషయములున్నవి. కాని దేవుడు భూమ్యాకాశములను చలింపజేయు దినమున అవన్నియు దేవునిచేతనే నాశనము చేయబడును. నిశ్చలమైనదే, అనగా దేవునిలో ప్రారంభమైనదే ఆ రోజున నిలిచియుండును (హెబ్రీ 12:26-28).

దేవుని కొరకు పనులు చేయాలన్న బలమైన కోరిక మనుష్యుని శరీరములో ఉన్నది. ఈ కోరికను తీర్చుట ద్వారా అబద్ధ మతాలన్నియు వర్ధిల్లును. దేవుని కొరకు ఏదో చేసానన్న భావన మనిషి కలిగియున్నప్పుడు అది అతనికి ప్రాముఖ్యత కలుగజేయును. అది ఒక గుడినో లేక మసీదునో కట్టుట ద్వారా కావచ్చును లేక బీదవారికి డబ్బులిచ్చుట ద్వారా లేక నీతిని అభ్యసించుట ద్వారా లేక బోధించుట లేక మంచి చేయుట ద్వారా కావచ్చును.

అయితే నిజమైన క్రైస్తవ్యములో, ప్రతి కార్యము దేవునితో ప్రారంభమగును.

''క్రీస్తులో''

మన రక్షణ దేవుని మనస్సులో ప్రారంభమైనది. ''జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ఏర్పాటు చేసికొనెను'' (ఎఫెసీ 1:4-6). ఆయన మనలను ముందు ప్రేమించెను కాబట్టి మనము ఆయనను ప్రేమించితిమి ( 1 యోహాను 4:19).

ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో దేవుడు మన కొరకు ఏమి చేసెనో మొదట మనకు చెప్పబడెను (1-3 అధ్యాయములు). దాని తరువాత మాత్రమే మనము దేవుని కొరకు ఏమి చేయవలెనో చెప్పబడెను (4-6 అధ్యాయములు). ఇవాంజిలికల్‌ గుంపులలో ''క్రీస్తును అంగీకరించుట'' అనే మాట చాలా సాధారణముగా వాడబడును.

క్రొత్త నిబంధన ''క్రీస్తు మనలో'' (కొలస్సీ 1:27; ఎఫెసీ 3:17)ఉండుట అనుదాని గూర్చి చెప్పుచుండినా, ''మనము క్రీస్తులో'' ఉండుట అనునది ఎక్కువగా వాడబడుచున్నది. క్రీస్తును అంగీకరించుట మనము చేసేది, అయితే మనలను క్రీస్తులో ఉంచుట దేవుడు చేసేది. కాబట్టి మనుష్యుని కేంద్రముగా కలిగియున్న వేదాంతము దేవుడు చేయుదానికంటే మనము చేయుదానికి ప్రాముఖ్యతనిచ్చుట ఆశ్చర్యకరము కాదు. మన క్రైస్తవ జీవితము బలముగా ఉండాలంటే, దేవుడు మనకొరకు క్రీస్తులో చేసిన దానియందు మనము మొట్టమొదటిగా వేరుపారి స్థిరపడియుండవలెను. ''క్రీస్తులో'' ఉండుట అంటే ఏమిటో తెలుసుకొనుటకు, మనము ఒక కవరులో పెట్టి తపాలాలో వేయు ఒక ఉత్తరము గూర్చి ఆలోచించండి. ఆ కవరు ఎక్కడికి వెళ్లినను దానిలో ఉన్న ఉత్తరము అక్కడికి వెళ్లును. అదే విధముగా మనము క్రీస్తులో జగత్పునాది వేయబడకముందే ఉండినట్లయితే, క్రీస్తు కల్వరిపై సిలువ వేయబడినప్పుడు, మనము కూడా ఆయనతో సిలువ వేయబడితిమి. ఆయన పాతి పెట్టబడినప్పుడు మనమును ఆయనతో పాతి పెట్టబడితిమి. మరియు ఆయన లేపబడినప్పుడు మనము కూడా ఆయనతో లేపబడితిమి. ఆయన ఆరోహణమైనప్పుడు మనమును ఆయనతో ఆరోహణమైతిమి. మరియు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటే మనము అక్కడ ఉన్నాము. అనగా ఆయనలో ఉన్నాము.

మనము కేవలము, దేవుని యొక్క వాక్యమందలి ఈ సత్యమును నమ్మినట్లయితేనే దానిని మనము అనుభవించగలము, అలా నమ్మలేకపోయినట్లయితే, దానిని మనము అనుభవిచలేము. ''నీ నమ్మికను బట్టి నీకు జరుగును గాక'' అనునది దేవుని యొక్క నియమము. మన యొక్క బ్యాంకు ఖాతాలో దేవుడు లక్షలాది రూపాయలు వేసి, యేసు నామము కలిగియున్న ఖాళీ చెక్కులను మనకిచ్చునట్లు ఇది ఉన్నది (2కొరిందీ¸ 1:20). మనమిప్పుడు చేయవలసినదల్లా ఆ చెక్కులలో మొత్తాన్ని నింపి బ్యాంకుకు వెళ్లి యేసు నామములో మన స్వాస్థ్యమును పొందుకొనుటయే.

సువార్త యొక్క శుభవార్త ముఖ్యముగా ప్రభువైన యేసుక్రీస్తులో దేవుడు మనకొరకు ఏమి చేసెననుదాని చుట్టూ కేంద్రీకృతమై ఉన్నది. క్రీస్తు మనకొరకు ఏమి చేసెనను దానిని బట్టి, మన హృదయములలో పరలోకము యొక్క ముందు రుచిని ఇప్పుడే అనుభవించగలము.

పరలోకము సంపూర్ణ సమాధానము మరియు సంపూర్ణ ఆనందము గల ప్రదేశము. పరలోకములో ఎవరు దిగులుగా లేక నిరుత్సాహముతో, ద్వేషముతో లేక నిష్టూరముతో ఉండరు. పరలోకములో ఎవరు భయముతో నుండరు ఎందుకనగా దేవుడు పరిష్కరించలేని ఏ సమస్యా అక్కడ లేదు. సువార్త యొక్క సందేశము ఏమిటంటే ఆ పరలోకపు జీవితము యొక్క ముందు రుచిని మనము భూమిమీద కలిగియుండవచ్చును. ఒక పాతకాలపు రచయిత చెప్పినట్లు, ప్రజలు రెండు పరలోకములను అనుభవించగలుగునట్లు మనము సువార్తను ప్రకటించుదుము. ఒకటి ఇప్పుడు భూమి మీద మరియొకటి మనము ఈ భూమిని విడిచి వెళ్లిన తరువాత-అది పరలోకములోనే(నూతన యెరూషలేము).

కాని పరలోకము ఎందుకు అంత అద్భుతమైన ప్రదేశముగా నున్నది? ఎందుకనగా పరలోకములో ఎవరు తన స్వంత చిత్తమును చేయరు. ప్రతి ఒక్కరు దేవుని చిత్తమును చేయుదురు.

అందువలననే యేసుప్రభువు మనకు ''పరలోకమందున్న మా తండ్రీ, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక'' అని ప్రార్దించుట నేర్పించెను. అది మన యొక్క నిష్కపటమైన ప్రార్దన కూడా అయితే, పరలోకపు వాతావరణము మన హృదయాలలో ప్రతి మూల నిండుకొనును. ఆ ప్రార్థన చేయువారందరు తమ జీవితాల యొక్క ప్రతి విషయములో ఆసక్తితో దేవుని చిత్తమును వెదకుదురు. వారు దేవుని చిత్తమును పూర్తిగా చేయుటకు కోరుకొందురు. అటువంటి విశ్వాసులకు, దేవుని చిత్తము భారముగా కాక, ఆనందముగా సంతోషముగా నుండును. దేవుడు పరిష్కరించలేని ఏ సమస్యను వారు ఎప్పుడు ఎదుర్కొనరని వారికి తెలియును గనుక వారు ఎప్పుడు దిగులుగా లేక నిరుత్సాహముతో లేక భయముతో నుండరు.

''నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని'' అని యేసు చెప్పినప్పుడు (యోహాను 6:38), పరలోకపు వాతావరణమును భూమి మీదకు తెచ్చుటకు భూమి మీదకు వచ్చితినని ఆయన చెప్పుచుండెను. భూమి మీద ఆయన ఉన్న కాలమంతటిలో పరలోకపు వాతావరణము తన జీవితమును ఏలుచూ జీవించుట అంటే ఏమిటో ఆయన ప్రదర్శించెను. యేసు ఎక్కడికి వెళ్లినను ఇతరులకు ఆయన దీవెనకరముగా నుండెను. ఇటువంటి జీవితమును(జీవమును) ఆయన మనకు ఇవ్వాలని చూచుచున్నాడు.

అయితే ఈ జీవితములోనికి ప్రవేశించే ముందు సిలువపై దేవుడు యేసుక్రీస్తులో మనకొరకు ఏమి చేసి ముగించి యున్నాడో మనము గ్రహించవలెను. మన జీవితము ఒక కట్టడము వంటిది. దేవుడు మన కొరకు చేసి ముగించినదంతయు పునాది మరియు మనము దేవుని కొరకు చేయునది పై నిర్మాణము. బలమైన పునాది లేకుండా ఏ కట్టడము బలముగా ఉండదు. ఇక్కడనే అనేక క్రైస్తవుల జీవితములలో ఓటమికి కారణమున్నది. అది దేవుడు క్రీస్తులో వారికొరకు ఏమి చేసి ముగించాడను విషయము పట్టించు కొనకుండా దేవుని కొరకు ఏవేవో చేయుటకు వారు అడుగు ముందుకు వేయుదురు. దాని యొక్క చివరి ఫలితము ఎప్పుడు నిరాశ మరియు నిస్పృహగా యుండును.

యేసుప్రభువు సిలువపై మన స్థానమును తీసుకొనెనని బైబిలు చెప్పుచున్నది. ఆయన మనతో స్థానమును మార్చుకొనెను. మూడు విషయములలో ఈ మార్పిడి జరిగినది. ఈ విధమైన మార్పిడిని మనము విశ్వాసముతో అంగీకరించినప్పుడు, మనము ఈ మూడు విషయములలో దేవుడు మన గూర్చి కోరుకొనినట్లు మారగలము.

1. మనలను నీతిమంతులుగా చేయుటకు యేసు పాపముగా మారెను

''ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతిఅగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను'' (2 కొరిందీ¸ 5:21).

మనమాయన యందు దేవుని నీతియగునట్లు క్రీస్తు మనకొరకు పాపముగా మారెను. ఇదే నీతిమంతులుగా తీర్చబడుట మరియు దేవుని పరిశుద్ధమైన ప్రమాణాలను అందుకొనే అంతగా తాము నీతిమంతులు కాలేమని గుర్తించిన వారికి ఇది దేవుని ఉచిత వరము. మనము కృప చేత మాత్రమే నీతిమంతులుగా తీర్చబడితిమి మరియు బైబిలు చెప్పునట్లు, ''అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును'' (రోమా 11:6).

దేవుని యెదుట వారి యొక్క మంచి క్రియలను బట్టి (శరీరమును మరణమునకు గురి చేయుట మొదలగునవి) నీతిమంతులు కాగోరువారు ఇశ్రాయేలీయులు తప్పిపోయినట్లు తప్పిపోవుదురు (రోమా 9:31,32,మరియు 10:3 జాగ్రత్తగా చదవండి). విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటకు చూచువారు మాత్రమే దేవుని యొక్క నీతిని పొందుకొనెదురు (రోమా 9:30).

అనేకమంది పాపము మీద జయము పొందాలని ఆతృతలో రోమా 3:23 (''అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు'') నుండి రోమా 6:14 (''పాపము మీ మీద ప్రభుత్వము చేయదు'') వరకు దూకుదురు. ఆ విధముగా వారు రోమా 3:24 నుండి 5:21 వరకు వివరింపబడిన నీతిమంతులుగా చేయు ప్రక్రియను దాటవేయుదురు. దాని ఫలితముగా వారు పరిసయ్యులుగా మారుదురు. వారి పరిసయ్యతత్వమునకు రెండు స్పష్టమైన ఆధారములు వారి ''పరిశుద్ధత''లో వారి గర్వము మరియు వారంత పరిశుద్ధులు కారు అని వారు భావించిన వారిని తృణీకరించుట!

యేసు మన పాపములకు శిక్షను భరించుటే కాదు. ఆయన పాపముగా మారెను. దురదృష్టవశాత్తు ఒక పంది మానవ మలము తినునట్లు మనము పాపము విషయములో అంతగా అలవాటు పడిపోవుట చేత అది ప్రభువుకు ఎటువంటి భయంకరమైన అనుభవమో ఎప్పుడూ పూర్తిగా అర్దం చేసికొనలేము.

మానవ మలముతో నిండియున్న ఒక గుంటలోకి దూకి దానితో శాశ్వతముగా కలసిపోవుటను గూర్చి ఆలోచించండి లేక మీ శరీరమంతటిని తలనుండి పాదముల వరకు కురుపులతో నింపే భయంకరమైన నయము కాని రోగమును స్వచ్ఛందముగా పొందుటను గూర్చి ఆలోచించండి. ఈ ఉదాహరణలు కూడా పరిపూర్ణమైనవి కావు. మరియు ఇవి మన కొరకు క్రీస్తు కున్న ప్రేమ యొక్క చిత్రాన్ని మాత్రమే ఇవ్వగలవు. ఈ ప్రేమ వలన ఆయన యందు మనము దేవుని నీతియగునట్లు ఆయన ద్వేషించినదాని (పాపము)గా మారుటకు ఆయన స్వచ్ఛందముగా అంగీకరించెను. మనము యేసును ముఖాముఖిగా చూచినప్పుడు మాత్రమే మనలను రక్షించుటకు ఆయన ఎంతటి వెలను చెల్లించవలసి వచ్చెనో మనము పూర్తిగా గ్రహించగలము. కాని ఇప్పుడు కూడా మనము పాపము యొక్క భయంకరత్వమును చూచి దానిని ద్వేషించుట నేర్చుకోవలెను. మన పాపమే క్రీస్తును సిలువవేసెను అని మనము చూచినప్పుడు ఇది జరుగును.

సాతాను ప్రధానముగా రెండు విధాలుగా మనపై నిరంతరము నేరారోపణ చేయును. 1.మన గత పాపములు 2. మన ప్రస్థుత పరిస్థితి. ఆ విధముగా అతడు దేవుని యెదుట మనకుండిన ధైర్యమును దొంగిలించును. కాని దేవుడు ఈ రెండు సమస్యలకు సువార్తలో మనకు ఒక పరిష్కారము నిచ్చెను.

మన గత పాపముల సమస్యను పరిష్కరించుటకు దేవుడు, ''క్రీస్తుయొక్క రక్తములో మనలను నీతిమంతులుగా తీర్చెను'' (రోమా 5:9). క్రీస్తుయొక్క రక్తము మన గత పాపముల నుండి మనలను ఎంతగా కడిగినదనగా, మన గత పాపములను ఆయన ఎన్నడు జ్ఞాపకము కూడా చేసికొననని వాగ్దానము చేసెను (హెబ్రీ 8:12). దేవుడు మనలో ఎవరి పాపములు జ్ఞాపకము చేసికొననియెడల, ఆయన మనలను మన జీవితమంతటిలో పాపమేమి చేయని వారుగా చూచుచుండెనని మనము నిజముగా చెప్పవచ్చును. ఈ సత్యమును నీవు నమ్మకుండా చేయుటకు సాతాను చేయగలిగినదంతా చేయును. నీవు సాతాను చెప్పు అబద్దమును నమ్మినట్లయితే నీవు ఎప్పుడు శిక్షావిధిలో ఉందువు మరియు దేవుని ఎదుటకు వచ్చుటకు నీకు ఎప్పుడు ధైర్యముండదు. కాని నీవు సాతానును, గొఱ్ఱెపిల్ల రక్తముతో మరియు నీ మాటల యొక్క సాక్ష్యముతో యేసుయొక్క రక్తములో నీవు కడుగబడినావని, చెప్పి ఎదురించినట్లయితే నీవొక జయించువాడవుగా యుండవచ్చును (ప్రకటన 12:11).

మన ప్రస్తుత స్థితి యొక్క సమస్యను పరిష్కరించుటకు దేవుడు మనలను క్రీస్తులో ఉంచును. మన శరీరమందు మంచిది ఏదియు లేదు. మనము ఒక వంద సంవత్సరాల పాటు శరీరమును మరణింపజేసినను దేవుని యెదుట నిలబడుటకు మనము యోగ్యులము కాము. ఈ కారణముచేత ఆయన నివసించిన గుడారము యొక్క అతిపరిశుద్ధస్థలము లోనికి తెర ద్వారా ప్రవేశించుటకు దేవుడు ఇశ్రాయేలీయులను నిరోధించెను. దేవుని ఎదుటకు వచ్చుటకు మనుష్యుని ఆటంకపరచు శరీరమునకు ఆ తెర సాదృశ్యముగా నున్నది (హెబ్రీ 10:20).

దేవుని యొక్క నీతిని ఈ భూమిపై అతి పరిశుద్ధుడుగా నివసించిన వాని నీతితో పోల్చినట్లయితే భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా నుండునో అట్లుండును (యెషయా 55:8,9). చివరకు పాపము లేని దేవదూతలు కూడా దేవుని ముఖమును చూడలేరు, కాని వారి ముఖములు ఆయన యెదుట కప్పు కొనవలెను (యెషయా 6:2,3). కేవలము క్రీస్తు మాత్రమే తండ్రి ముఖములోనికి సూటిగా చూడగలడు. దేవుడు ఇప్పుడు మనలను క్రీస్తులో ఉంచియున్నాడు. గనుక మనము ఇప్పుడు క్రీస్తులో ఉండుటను బట్టి ఆయన ఎదుటికి ఏ భయము లేకుండా రాగలము. దేవుడు మనలను క్రీస్తులో ఉంచుట ద్వారా నీతిమంతులుగా చేయును మరియు క్రీస్తు అంత నీతిమంతులమని మనలను అంగీకరించును.

మనము క్రీస్తు యందు దేవుని నీతిగా మారితిమి గనుక దేవుని యెదుట మన పరిపూర్ణ అంగీకారమును బట్టి మనము ఆనందించవచ్చును. ధర్మశాస్త్రము యొక్క క్రియలను బట్టి దేవుని యెదుట అంగీకారమును బోధించే ''వేరొక సువార్త'' ను ప్రకటించుట దానిని ప్రకటించువాని మీద దేవుని యొక్క శాపమును తెచ్చును (గలతీ 1:8).

మొదట మనలను పరిపూర్ణముగా నీతిమంతులుగా తీర్చిన తరువాతే, దేవుడు మనలను పరిశుద్దపరచుట లోనికి తీసుకు వెళ్ళును. అది పాపముపై విజయము మరియు ఆయన యొక్క స్వభావములో పాలివారై యుండుటయై యుండును.

2. మనలను ధనికులుగా చేయుటకు యేసు బీదవాడాయెను

''ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను'' (2 కొరిందీ¸ 8:9).

మనము ఆయనలో ధనికులగునట్లు క్రీస్తు మన కొరకు బీదవాడాయెను. ఈ వచనములో నున్న పేదరికమును మరియు ధనమును మనము ఆత్మసంబంధమైనదిగా తీసుకొనవలెను. కాని ఈ వచనము చెప్పబడిన సందర్భము, పరిశుద్ధాత్మ వస్తురూపమైన బీదతనము మరియు వస్తురూపమైన ఐశ్వర్యము గురించి కూడా చెప్పుచున్నదని సూచిస్తున్నది.

''ధనికుడగుట'' అనగా ఏమిటి? దాని అర్ధము ఎంతో డబ్బు మరియు ఆస్తి ఉండుట కాదు. కాని మన అవసరములకు చాలినంత కలిగి ఇతరులకు సహాయపడుటకు మరియు దీవించుటకు మరి కొంచెము కలిగి ఉండుటయై యున్నది.

ధనవంతుడు అనుమాట ప్రకటన 3:17లో ''ఏమియు కొదువ లేకుండుట'' అని వర్ణించబడినది. దేవుడు ఆ విధమైన ఐశ్వర్యవంతుడు. దేవునికి వెండి లేక బంగారము లేక బ్యాంకు ఎకౌంట్‌ లేక చివరకు డబ్బు ఉంచుకొనే సంచి కాని లేదు. కాని ఆయనకు కొదువ ఏమీ లేదు.

యేసు ప్రభువు ఈ లోకములో ఉండినప్పుడు ఆయన బీదవాడు కాడు, ఎందుకనగా ఆయన కొదువేమీ లేకుండా ఉండెను. ఆయన ఒకసారి సుమారు 10,000 మందికి (5000 మంది పురుషులు మరియు స్త్రీలు పిల్లలకు) భోజనము పెట్టెను (మత్తయి 14:21). కేవలము ధనికుడైన వాడు మాత్రమే అట్లు చేయగలడు. ఆయన పన్ను చెల్లించుటకు కావలసిన సొమ్ము ఆయన యొద్ద ఉండినది (మత్తయి 17:27). ఆయనకు ఎప్పుడు ఎవరి యొద్ద సొమ్ము అప్పుచెయ్యవలసిన అవసరము రాలేదు. అంతేకాకుండా బీదలకు ఇచ్చుటకు కావలసిన డబ్బు ఆయన యొద్ద ఉండేది (యోహాను 13:29).

యేసుప్రభువు ఒకమారు ''బీదలెల్లప్పుడు మీతో కూడ ఉన్నారు. గాని నే నెల్లప్పుడు మీతో కూడా ఉండను'' (మత్తయి 26:11) అని చెప్పెను. అక్కడ బీదలతో తనను వేరుగా చూపించుకొనెను. వేరొక సందర్భములో యేసు ఒక యౌవనుడైన ధనిక అధికారితో అతడి సొమ్మునంతా బీదలకు ఇవ్వమని చెప్పినప్పుడు, యేసు బీదలతో తనను కూడా చేర్చుకొనలేదు. యేసు ప్రభువు ఈ భూమిపై జీవించినప్పుడు ఆయనకు కొదువేమీ లేకుండెను. ఈ విధముగా చూచినట్లయితే ఆయన ధనికుడే.

ఆది అపొస్తలులు కూడా బీదవారు కాదు. బీదలను జ్ఞాపకము చేసికొనుమని వారు విశ్వాసులకు చెప్పినప్పుడు (గలతీ 2:10), తమను జ్ఞాపకము చేసికొనమని వారు విశ్వాసులకు చెప్పలేదు. ఆ అపొస్తలులకు వెండి బంగారములు లేక పోవచ్చు (అపొ.కా. 3:6). కాని వారికి కావలసినదంతా వారికి ఉండెను. ఆ విధముగా వారి యజమాని వలె వారు కూడా ఐశ్వర్యవంతులు. మనము కూడా అదే విధముగా ధనికులముగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు.

కాని యేసు సిలువలో వ్రేలాడినప్పుడు పేదవాడాయెనని మనము చూచెదము. క్రొత్త నిబంధనలో పేదవాడు ''మురికి బట్టలు'' కట్టుకొనిన వానిగా వర్ణింపబడెను (యాకోబు 2:2). మనము భారతదేశములో చూచే అతి పెద్దవాడైన బిక్షకుడు తన శరీరము చుట్టూ కనీసము చినిగిపోయిన ఒక గుడ్డను కలిగియుండును. కాని యేసు సిలువ వేయబడినప్పుడు దానిని కూడా కలిగియుండలేదు. ఆయన దిగంబరుడిగా చేయబడి సిలువవేయబడెను. ఆయన సిలువవేయబడినప్పుడు మన నిమిత్తము నిజముగా పేదవాడాయెను.

మనము ధనికులగునట్లు అనగా మనము ఏ కొదువా లేకుండునట్లు యేసు సిలువపై దరిద్రుడాయెను.

మనము కోరుకొనినవన్ని ఇచ్చెదనని దేవుడు ఎప్పుడు వాగ్దానము చేయలేదు, కాని మనకు అవసరమైనవన్నీ యిచ్చెదనని వాగ్దానము చేసాడు (ఫిలిప్పీ 4:19). జ్ఞానము గల తల్లిదండ్రులు వారి పిల్లలు కోరినవన్ని లేక అడిగినవన్ని ఇవ్వరు, కాని వారికి అవసరమైనవి మాత్రము యిచ్చెదరు. దేవుడు కూడా అంతే.

పాత నిబంధనలో ధర్మశాస్త్రమునకు విధేయత చూపిన వారికి ఇహలోక సంబంధమైన సంపద వాగ్దానము చేయబడినది. కాని క్రొత్త నిబంధనలో, మనము దేవుని నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకినట్లయితే, ఆయన అంతకంటే శ్రేష్టమైన దానిని వాగ్దానము చేసాడు. ఈ లోకములో జీవించుటకు అవసరమైన ప్రతిదానిని వాగ్దానము చేసాడు (మత్తయి 6:33; 2 పేతురు 1:4). ఐశ్వర్యము మోసకరమైనది మరియు అస్థిరమైనది అని బైబిలు తేటగా చెప్పుచున్నది (మత్తయి 13:22; 1 తిమోతి 6:17). గనుక ఐశ్వర్యమును గురించి లేక మరి ఎక్కువ ధనమును ఆశపడుట ప్రమాదకరము (1 తిమోతి 6:10). అయితే దేవుని వాగ్దానము మరి ఎంతో మహిమకరమైనది. ఆయన ఎల్లప్పుడు మనకు అవసరమైన వాటన్నిటిని ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మనకు యిచ్చును అనునది (ఫిలిప్పీ 4:19).

నీ కొచ్చిన జీతముతో నీ అవసరములు తీరుటలేదా? దేవుడు ప్రతివారికి వారి ఆర్ధిక హద్దులను నియమించి యుండగా, ఆయన బిడ్డలకు ఇహలోక సంబంధమైన అవసరములు తీరునట్లు ఇవ్వకపోవుట అసాధ్యము. నీకుండిన లోటు బహుశా దేవుని యొక్క దీవెన నీపై లేకపోవుటను బట్టి కావచ్చు. నీవు బద్దకస్థుడవై యుండవచ్చు లేక ధనమును వృథా చేయువాడవై యుండవచ్చును లేక దేవుని నియమములను మీరి స్వార్థపూరితముగా జీవిస్తూ యుండవచ్చును. నీవు దేవుని యెడల ధనికుడుగా యుండినట్లయితే, దేవుడు కూడా నీ యెడల ధనికునిగా యుండును.

సువార్త యొక్క మంచి వార్తను చెప్పుదును. దేవుని బిడ్డలు వారి భూలోక జీవితములో నిరంతరము ఆర్ధిక యిబ్బందులలో నుండుట ఆయన చిత్తము కాదు. జీవనవ్యయము ఎంత ఎక్కువైనా సరే, దేవుని రాజ్యమును ఆయన నీతిని వారి జీవితములలో మొదట వెదకు వారికి ఎల్లప్పుడు వారి అవసరములు తీరును. అలా జరుగక పోయినట్లయితే, యేసు ప్రభువు ఒక అబద్ధికుడని మనము చెప్పవచ్చును, ఎందుకనగా ఆయన తేటగా అట్లు వాగ్దానము చేసెను (మత్తయి 6:33).

మనము ధనికులమగునట్లు యేసు బీదవాడాయెను. గనుక మనము మన జీవితాలలో ఎల్లప్పుడు లోటుతో జీవించవలసిన పనిలేదు. మన గూర్చి కాని మన బిడ్డల గూర్చిగాని, భవిష్యత్తు గూర్చి భయపడవలసిన అవసరము లేదు. ప్రభువైన యేసు మనకొరకు మరియు మన కుటుంబసభ్యుల యొక్క ప్రతి భూలోక సంబంధమైన అవసరముల కొరకు సిలువపై మన కొరకు ఏర్పాటు చేసారు.

దురదృష్టవశాత్తు ధనాపేక్ష కలిగిన బోధకులు ''ప్రత్యేకముగా గత 30 సంవత్సరాలుగా'' ఈ సత్యమును పెద్దదిగా చేసి దానిని అపార్థము చేసికొని ''ఐశ్వర్యమునకు సంబంధించిన సువార్త'' ను ప్రకటించుటకు ఒక సాకుగా వాడుకొనిరి. యేసు మనలను ధనికులైన లక్షాధికారులుగా చేయుటకు వచ్చెనని వారు బోధించుదురు. ఇది అబద్ధము మరియు సత్యము యొక్క వక్రీకరణ. క్రొత్త నిబంధనలో దేవుడు మనకు ఐశ్వర్యమును వాగ్దానము చేయలేదు గాని ఇంకా చాలా మెరుగైన దానిని అనగా మనకు అవసరమైన వాటినన్నింటిని వాగ్దానము చేసెను.

కాబట్టి ప్రియమైన సహోదర, సహోదరీ నీ భయములన్నింటి నుండి విడుదల పొందుము. యేసు నీ కొరకు సిలువపై ఇప్పటికే పేదవాడాయెను. మీ జీవితములలో నిరంతరము ఆర్థిక అవసరతతో జీవించవలసిన అవసరము లేదు. మీకు అవసరమైనవన్నియు మీరు ఎల్లప్పుడు కలిగియుండవచ్చును. సువార్తలో నీ జన్మ హక్కును అడిగి పొందుము.

3. మనమొక ఆశీర్వాదము అగుటకు యేసు ఒక శాపమాయెను

''ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను'' (గలతీ 3:13,14).

అబ్రాహాము యొక్క ఆశీర్వాదము మనము పొందునట్లు క్రీస్తు మన కొరకు శాపమాయెను - ఆ వాగ్దానము పరిశుద్ధాత్మయైయున్నది.

ధర్మశాస్త్రమును పాటించని వారికి వచ్చు శాపములు ద్వితీయో 28:15-68 లో చెప్పబడినవి. ఇవి అయోమయము, నయంకాని రోగము, తెగులు, నిరంతర వైఫల్యము, గ్రుడ్డితనము, వెఱ్ఱితనము, విశ్రాంతి లేకపోవుట, మనశ్శాంతి లేకపోవుట, ఇతరుల చేత పీడింపబడుట, పిల్లలు శత్రువైన సాతాను చేత బంధింపబడుట, కడు పేదరికము మొదలగునవి.

సువార్త యొక్క మంచి వార్త ఏమనగా యేసు మన కొరకు శాపమాయెను కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన శాపము లేమియు మనలను ఇక మీదట తాకవు. అదే ఒక మంచి వార్తగా ఉండవచ్చును. అయితే ఇంకా ఉన్నది. మనము ఇంకా దేవుడు అబ్రాహామును దీవించిన దీవెనను కూడా పొందుకొనవచ్చును. ఆ వచనములో వాగ్దానము చేయబడిన దీవెన భౌతిక పరమైన ఐశ్వర్యము మరియు అనేకమంది పిల్లలతో కూడిన ధర్మశాస్త్రమునకు సంబంధించన ఆశీర్వాదము (ద్వితీయో 28:1-14) కాదని గమనించండి. అలాకాదు. మనకు ఇంకా మెరుగైనది వాగ్దానము చేయబడెను, అది అబ్రాహాము యొక్క ఆశీర్వాదము.

దేవుడు అబ్రాహామును దీవించిన ఆశీర్వాదము ఆదికాండము 12:2,3లో ''నిన్ను ఆశీర్వదించి...నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను ...భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడుదురు'' అని వర్ణించబడెను. ఈ ఆశీర్వాదమును క్రీస్తు సిలువపై మన కొరకు శాపమగుట ద్వారా మన కొరకు కొనెను. మనలను ఆశీర్వదించాలని మన జీవితమంతటిలో మనకు తటస్థపడిన ప్రతి వారికి మన మొక ఆశీర్వాదకరముగా యుండాలని ఆయన కోరుచున్నాడు.

గలతీ 3:12,13 చెప్పినట్లు ఈ ఆశీర్వాదము పరిశుద్ధాత్మను పొందుట ద్వారా కలుగును. యేసుప్రభువు, పరిశుద్ధాత్మ మన లోపల నుండి ఊరెడు నీటి బుగ్గ అనియు మరియు ఆయన మనలను దీవించుననియు చెప్పెను (యోహాను 4:14) మరియు జీవజల నదులు మనలో నుండి ప్రవహించి ఇతరులను దీవించునని చెప్పెను (యోహాను 7:37-39).

పరిశుద్ధాత్మను పొందుకొనుటకు నీకు నీవు అర్హుడుగా కావలెనని నీవు ప్రయత్నించినట్లయితే నీ వెన్నటికిని పొందుకొనలేవు. దానికిని, మాంత్రికుడైన సీమోను ఆత్మ యొక్క శక్తి పొందుటకు పేతురుకు డబ్బు ఇచ్చుటకును తేడా లేదు (అపొస్తలుల కార్యములు 8:18-23). పేతురు సీమోనును మారుమనస్సు పొందవలెనని చెప్పెను. నీవును మారుమనస్సు పొందవలెను. ఎందుకనగా పరిశుద్ధాత్మను నీ యొక్క మంచి క్రియలతో కొనాలని అనుకొనుచున్నావు.

నీవు ఉన్న స్థితిలో యేసునొద్దకు వచ్చి నీ యొక్క అయోగ్యతను ఒప్పుకొని విశ్వాసముతో పరిశుద్ధాత్మను పొందుకొనుము. అది కేవలము యేసు నీ కొరకు శాపమైనందున, అంతే కాని నీవు యోగ్యుడవైనందువలన కాదు.

గతములో నీ స్వంత జీవితము ఎలా ఉండెనో నీవు ఎక్కడ చేయి పెట్టినా అది ఓటమేనని నీవు కనుగొన్నావా? నీవు ఇతరులతో మాట్లాడిన మాటలు కేవలము గలిబిలిని, గందర గోళమును కలుగజేసెనా? నీవు ఎక్కడికి వెళ్లినా ఆశాభంగమును, నిరుత్సాహమును, దిగులును, నష్టమును కనుగొంటివా? ప్రియమైన సహోదరుడా, సహోదరి సువార్త యొక్క శుభవార్త ఇక్కడున్నది. నీవు వాటన్నింటినుండి శాశ్వతముగా విడుదల పొందవచ్చును. నీవు దానిని ఎప్పుడు పొందకుండునట్లు క్రీస్తు ధర్మశాస్త్రము యొక్క శాపమును తనపై తీసుకొనెను. ఆ శాపములన్నింటినుండి నీవు విడుదల పొందుటయే కాక ఇప్పుడు నీవు ఇతరులకు దీవెనకరముగా ఉండవచ్చును.

పాపములో జీవిస్తూ ఓడిపోతున్న ఘోరమైన పాపికి కూడా ఈనాడు ప్రభువు యొక్క వాగ్దానమేమంటే ''మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును'' (జెకర్యా 8:13). నీవు కలిసిన వారినందరిని నీ విమర్శలచేత, నీ కొండెముల చేత, నీ పుకారులచేత కలుషిత పరచుచు గతములో బహుశా నీవు ఇతరులకు శాపముగా ఉన్నావేమో? నీవు వెళ్లిన ప్రతిచోట ఆత్మీయ తెగులును వ్యాపింపజేయు వానిగా ఉంటివా? ఇక నుండి విషయాలు వేరుగా ఉండవచ్చును. ఇప్పుడు నీవు ఆత్మీయ స్వస్థతను, ఆశీర్వాదమును వ్యాపింపజేయువానిగా ఉండగలవు. నీవు ఎక్కడికి వెళ్లినను నీ ద్వారా ఇతరులు స్వస్థత పొంది, పరిశుద్ధాత్మ వలన ఆశీర్వదింపబడునట్లు దేవుడు నీ నుండి జీవ జలనదులు ప్రవహించునట్లు చేయగలడు.

ఈ విధముగా ఈ భూమిపై మనము కలుసుకొనిన ప్రతి కుటుంబమునకు మనమొక దీవెన కావాలని దేవుని చిత్తము. కాని నీవు దేవుని వాక్యమును నమ్మి అది క్రీస్తులో నీ జన్మహక్కుగా అడుగవలెను. సాతాను దీనిని నీ నుండి చాలా కాలము దొంగిలించాడు. యేసు ప్రభువు నీ కొరకు శాపమాయెను కాబట్టి, ఇక నుండి ఏ శాపము నిన్ను తాకదని నీవు నమ్మవలెను. నీవు నీ కుటుంబమునకు, నీ పొరుగువారికి మరియు నీ సంఘమునకు ఆశీర్వాదకరముగా యుందువు.

రాజైన దావీదు ఒక దినమంతయు తీరికలేకుండా దేవుని సేవించిన తరువాత ''తన కుటుంబమును దీవించుటకు'' ఇంటికి తిరిగి వచ్చెనని మనము 2సమూయేలు 6లో చదివెదము (20వ వచనము). ఇవి ఎంత చక్కటి మాటలు, మందసము యెరూషలేమునకు తేబడుచుండగా అతడు దానిముందు దినమంతయు నాట్యము చేసెను. అతడు సందేహము లేకుండా అలసిపోయెను (14వ వచనము). అతడు ప్రజలను దీవించుటలో తీరిక లేకుండెను (18,19 వచనాలు). కాని ఇంటి యొద్దనున్న అతని భార్యను అతడు మరువలేదు. ఆమె ఒక చెడ్డదైన సాధింపులు చేసే భార్య అయినప్పటికి అతడు ఇంటికి వెళ్లి ఆమెను కూడా దీవించెను (20-22 వచనాలు). కుటుంబము యొక్క ప్రతి శిరస్సు (భర్త) అనుసరించుటకు ఎంత అద్భుతమైన మాదిరి! నీవు దినమంతయు పని చేయుచోట నీ యజమాని చెప్పినట్లు చేయవలసి వచ్చినప్పటికీ, ఒక చెడ్డ మానసిక స్థితిలో ఇంటికి వచ్చి నీ గృహములోనికి ఒక చెడు ఆత్మను తెచ్చే బదులు, సాయంకాలము నీ కుటుంబమును దీవించుటకు నీవు ఇంటికి తిరిగి రాగలవు. యేసు సిలువపై సాతానుని కూడా ఓడించి అతని కవచమును పూర్తిగా తీసివేసెను గనుక, మన జీవితాల యొక్క ఏ భాగము మీద కూడా అతనికి హక్కు లేదు. సాతాను ఇప్పుడు తన ఆయుధాలన్నిటిని కోల్పోయిన ఒక నిస్సహాయుడైన దొంగవలే ఉన్నాడు. అయితే మనము అతనికి వ్యతిరేకముగా ప్రతి పరలోకపు ఆయుధముతో సిద్ధముగా నున్నాము. కాబట్టి మనమెప్పుడు అతనికి భయపడనక్కరలేదు. యేసు నామములో మనము సాతానును ఎదిరించవలెనని మనము ఆజ్ఞాపింప బడితిమి. అతడు మన యొద్ద నుండి పారిపోవునని దేవుడు వాగ్దానము చేసాడు (యాకోబు 4:7).

మనకు వ్యతిరేకముగా ఎవరైనా చేయు చెడుపు, చిల్లంగి(చేతబడి) లేక ఏదైనా చెడు మనకు తగులదు. మనము క్రీస్తు నందు దేవుని యొక్క దీవెన క్రింద ఉన్నాము. అందువలన మనము క్రీస్తులో నిలిచియున్నంత కాలము ఏ చెడు మనలను తాకదు. ఇశ్రాయేలీయులకు ''శాపమును ఆశీర్వాదకరముగా మార్చిన'' దేవుడు, మనకు కూడా ప్రతి శాపమును ఆశీర్వాదకరముగా చేయును (ద్వితీయో 23:5).

నీ తల్లిదండ్రులు జీవించిన విధానము వలన లేక వారి విగ్రహారాధన వలన లేక వారు క్షుద్రశక్తులను ఆకర్షించుట వలన నీ కుటుంబము మీద శాపమున్న యెడల, నీవు యేసు నామములో ఆ శాపమును విరుగగొట్టి దానిని నీ జీవితమునుండి శాశ్వతముగా పారద్రోలవచ్చును. ఈ దినము నుండి దానికి నీ మీద ఏ అధికారము లేదు. యేసు నీ కొరకు ఒక శాపముగా మారెను. ఆయన నీకిచ్చుచున్న ఆశీర్వాదమును ఇప్పుడే తీసుకొనుము.

జనులు మనలను శపించునప్పుడు తిరిగి వారిని దీవించుమని యేసు మనకు చెప్పెను (లూకా 6:28). మన యెడల చెడుగా నుండువారికి కూడా మనము దీవెనకరముగా ఉండవలెననునది మన పిలుపైయున్నది (1 పేతురు 3:9 చూడండి). దీని కొరకే మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడియున్నాము. దానివలన ఎలాగైతే ''యేసు మేలు చేయుచు సంచరించుచుండెనో'' (అపొ.కా. 10:38), మనము కూడా అలాగుననే ప్రతిచోట నుండిన జనులకు మేలు చేయుచు వారిని ఆశీర్వదించుచు సంచరించ వచ్చును. భవిష్యత్తులో మిమ్మును కలుసుకున్న వారెవరును, గతంలో వలే, మీ మాటలచేత కలుషిత పరచబడరు లేక భాధింపబడరు. దానికి బదులు వారు సమృద్ధిగా ఆశీర్వదింపబడుదురు.

పరలోకమందుండిన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనదై యున్నది. దానిని మొదట మనము మన హృదయాలలో నమ్మవలసియున్నది. తరువాత దానిని మన నోళ్లతో ఒప్పుకొనవలసియున్నది. ''మనుష్యుడు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనినప్పుడు రక్షణ (మరియు విడుదల) కలుగును'' (రోమా 10:10) అని బైబిలు చెప్పుచున్నది.

ఈ సత్యములన్నిటిని నీ హృదయములో విశ్వసించినట్లయితే సరిపోదు. నీ నోటితో సాతానుకు చెప్పుము, అప్పుడు ఎల్లప్పుడు నీవు జయించు వాడవుగా యుందువు. ఆ విధముగా నీ సాక్ష్యమును బట్టి, నీవు సాతాను పారిపోయేలా చేయగలవు మరియు నీ చుట్టూ ఉన్నవారికి నీవొక ఆశీర్వాదకరముగా యుందువు (ప్రకటన 12:11). అవును, నీవు కూడా నీవు కలుసుకొను ప్రతివారికి ఒక దీవెనగా యుందువు, అది నీవు ఏమైయున్నావో లేక ఏమిచేసావను దానిని బట్టి కాదు కాని యేసు నీకు చేసిన దానినిబట్టి అట్లుందువు. పౌలు రోమునకు వెళ్లుచున్నప్పుడు, అతడు అక్కడున్న క్రైస్తవులతో, ''నేను మీ యొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును'' అని చెప్పెను (రోమా 15:29). యేసు నామములో అతడు రోములో వారికి పొంగిపొరలే ఆశీర్వాదముగా నుందునని అతడు నిశ్చయముగా నమ్మెను. యేసుయొక్క ప్రతి శిష్యుడు ఆ ఒప్పుదల చేసి తాను కలుసుకున్న వారందరికీ దేవుడు తనను దీవెనకరముగా చేయునని నమ్మగలడు.

నేను అనేక సంవత్సరాలుగా దానిని క్రీస్తులో నా జన్మహక్కుగా అడిగి పొందితిని. నేను ఎక్కడికి వెళ్లినను క్రీస్తుయొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో వెళ్లుదునని నమ్మితిని. అది నేనేమైయున్నానో అను దాని బట్టి కాదు గాని, సిలువపై యేసు నా కొరకు ఒక శాపముగా మారిన దాని బట్టియై యున్నది.

మనమిప్పుడు దేవుని యొద్దకు యేసు నామములో, యేసుయొక్క అర్హతను బట్టి దేవుని యొద్దకు వెళ్ళుచున్నాము, అంతేకాని మన స్వంత అర్హతనుబట్టి కాదు. మన కొరకు పాపముగా మారిన ఆయన నామములో మనము దేవుని నీతిగా మారితిమి. మనకొరకు పేదవాడైన ఆయన నామములో మనము ఎప్పటికి ధనికులమైతిమి. మన కొరకు శాపముగా మారిన ఆయన నామములో మనము ఎప్పటికి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉందుము.

అధ్యాయము 5
ఆది నుండి ఉండినది

''జీవ వాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది'' (1 యోహాను 1:1-3).

క్రొత్త నిబంధనలో నున్న అపొస్తలుల పత్రికలన్ని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో వ్రాయబడినా, ఒక పత్రిక వ్రాసిన సమయము ఆ సమయమందు అపొస్తులుని యొక్క పరిపక్వతను చూపించుచున్నది. దీని ప్రకారము చూస్తే యోహాను తన జీవితపు చివరి భాగములో ఆయనకు 90 సంవత్సరముల వయసప్పుడు, 60 సంవత్సరముల పాటు జాగ్రత్తగా క్రైస్తవత్వమును, సంఘము యొక్క అభివృద్దిని చూచి దీనిని వ్రాసెను గనుక 1యోహాను అత్యంత పరిపక్వతను ప్రదర్శించునని మనము చెప్పవచ్చును.

యోహాను చెప్పేదేమిటి? వేరు వేరు సంఘములలో నుండిన క్రైస్తవుల గూర్చి ఆయన భారమేమిటి?

ఆయన పత్రిక అంతటిలో ఒక్కసారి కూడా భాషల వరము గూర్చి కాని లేక స్వస్థత గూర్చి కాని లేక ఏ ఆత్మవరము గూర్చి కాని లేక చివరకు సువార్తీకరణ గూర్చి కాని ఎక్కడా మాట్లాడలేదు. ఇవన్నీ కూడా మంచివి మరియు అవసరమైనవి కాని వాటిలో ఏదీ కూడా ప్రధానమైనది కాదు.

యోహాను ప్రారంభమునుండి యుండిన విషయములు కాలము ప్రారంభము కాక మునుపు దేవుని యొద్ద ఉండిన జీవము మరియు సహవాసము గూర్చి మాట్లాడుచుండెను. దేవుని యొద్ద నిత్యత్వము నుండి ప్రేమతో కూడిన దైవజీవము మరియు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముని మధ్య దీవెనకరమైన మరియు పరిపూర్ణమైన ప్రేమతో కూడిన సహవాసముండెను. ఇది యోహాను యొక్క ముఖ్య నేపధ్యము మరియు భారమైయున్నది. ఇది ఆయన ఇంకా ఎక్కువగా అనుభవించాలని మరియు విశ్వాసులందరు ఈ అనుభవములో ఇంకా ఇంకా ఎక్కువగా పాలు పొందవలెనని ఆయన ఆశగా యున్నది.

మనము ఆయన యొక్క స్వభావములో పాలివారమై తండ్రి మరియు యేసుక్రీస్తు ఒక్కటిగా నుండినట్లు (యోహాను 17:3,21) మనమును ఉండవలెననునది దేవుని యొక్క చివరి గురి.

ఆదియందు బోధించుట లేదు, పాటల పుస్తకములు లేవు, క్రొత్త నిబంధన క్రమము కలిగిన సంఘములు లేవు మరియు ఏ విధమైన సిద్ధాంతములు లేవు. ఇవన్నీ తరువాత ఒక ఉద్దేశ్యముతో వచ్చియున్నవి.ఆదియందు కేవలము జీవము మరియు సహవాసము మాత్రమే యుండినవి.

అదే విధముగా, భవిష్యత్తులో, నిత్యత్వములో మరల బోధలు లేక పాటల పుస్తకములు లేక స్వస్థతలు ఉండవు కాని కేవలము జీవము మరియు సహవాసము మాత్రమే యుండును.

గనుక కాలము ప్రారంభమైనప్పుడు మరియు కాలము అంతమైనప్పుడు జీవము యున్నది మరియు సహవాసము మాత్రమే ఉండి మరియు ఉండబోవుచున్నది అని మనము చూచెదము. మిగిలిన విషయాలన్ని మనము ఇప్పుడు నివసించుచున్న ఈ మధ్యకాలానికి మాత్రమే వర్తించును.

ఉదాహరణకు భాషలలో మాట్లాడుట క్షేమాభివృద్ది కలిగించే అనుభవము అయితే ఆ వరము పరలోకమందు నిత్యత్వములో మనకు అవసరముండదు ఎందుకనగా అక్కడ మనము దేవునితో సంభాషించుటకు మనకు ఏ విధమైన పరిమితులు ఉండవు. బోధించుట ఈ భూమిపై ఎంతో అవసరమైన విషయం. అయితే అది నిత్యత్వములో అవసరముండదు. పాపము మీద జయము కూడా కేవలము ఒక కాల వ్యవధికి మాత్రమే. అది మనము ఈ శరీరములో ఉండి శోధింపబడగలిగినప్పుడే అవసరము.

దీనిని బట్టి జీవము మరియు సహవాసము అనునవి రెండు సంఘమునకు ఈనాడు కావలసిన ఎంతో ముఖ్యమైన విషయాలని మనము స్పష్టముగా చూడవలెను. ఇవి మనకు లేనట్లయితే, సంఘములో మనకు ఇంకేముండినా మనము దేవునికి సంతృప్తికలిగించనట్లే.

జీవము

ప్రాథమికముగా దేవుని జీవము మనలో వ్యక్తపరచబడవలెను- అనగా ఎల్లప్పుడు ఇతరులను సేవించి, ఆశీర్వదించి మరియు వారి మేలును కోరే ప్రేమించే జీవము. దేవుని ప్రతిపని ఇతరులకు ఆశీర్వదించుటకే రూపించబడినది. దైవ జీవమునకు ఇది ఒక ప్రధానమైన గుర్తు. పరలోకములో ఎవరు ఏది చెప్పినా లేక మనకు ఏది చేసినా, వారి ఉద్దేశ్యము గూర్చి మన మనస్సులో అనుమానము ఉండదు. వారి ఉద్దేశ్యము కేవలము మన మేలు మాత్రమే, భూమి మీద మన సహవాసము కూడా అదే విధముగా ఉన్నట్లయితే, ఎంత మధురముగా ఉండును.

క్రీస్తులోనికి మారనివారిలో ''వారి పెదవుల క్రింద సర్ప విషముండును'' (రోమా 3:13). మరియు వారి మాటలు ఇతరులను బాధించుటకు మరియు నొప్పి కలిగించుటకు ఉద్దేశించి యుండును. కాని అటువంటి విషము సంఘములో ఎవరి నోటిలో కనబడకూడదు. సంఘములో ప్రతివారి మాటలు కేవలము దీవించుట కొరకే ఉండవలెను.

పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి పరలోకపు వాతావరణమును తీసుకువచ్చుటకు వచ్చియున్నాడు. పాత నిబంధనలో వారికి మిగిలిన మానవజాతి కంటె నీతిగా జీవించగలుగునట్లు చేయుటకు కావలసిన చట్టములు ఉండినవి. కాని ఇప్పుడు మనలను నడిపించుటకు దైవిక చట్టముల కంటె ఎక్కువైనది ఉన్నది.ఇప్పుడు మన క్రియలను నడిపించుటకు మనకు దేవుని జీవమున్నది.

దేవుని యొక్క సన్నిహితమైన సన్నిధి ఉండుట చేత పరలోకము పరలోకముగా నున్నది. దేవుడు పూర్తిగా ఎక్కడ ఉండునో అక్కడ పరలోకముండును. దేవుడు ఎక్కడ ఉండడో అది నరకము. ఈ భూమిపై దేవుని యొక్క సన్నిధి ప్రతిచోట కొద్దిగా నున్నది. అందువలననే అన్యులలో మార్పు చెందనటువంటి ప్రజలలో కూడా కొంతమంచిని చూచుచుందుము. అయితే నరకములో, అదే జనులు వ్యత్యాసముగా నుందురు. అక్కడ దేవుని యొక్క మంచితనము యొక్క ప్రభావము ఆటంకపరచక పోయినందున వారి యొక్క యదార్ధస్థితి ఉన్నది ఉన్నట్లుగా తెలియును. మరియు వారి స్వార్థమునకు, గర్వమునకు అడ్డులేకుండా ఉండును.

పరలోకములో దీవెనకరమైన సహవాసముండును. అక్కడ ఒకరిపై ఒకరు పెత్తనము చేయుట ఉండదు. ప్రతి ఒక్కరు ఇతరులకు సేవకులుగా యుందురు. లూసిఫరు వలె ఇతరులను తన అధికారము క్రింద ఉంచవలెనని కోరుకొను వారెవరు పరలోకములో కనబడరు, ఎందుకనగా అతడి వైఖరి పరలోకములో సేవచేయుట కంటె నరకములో అధికారము చలాయించుట మంచిది అన్నట్లుగా నుండెను. ఇతరులపై అధికారము చూపు కోరిక సాతానుఆత్మయొక్క స్వభావము.

అందువలన నిరంకుశముగా తమ భార్యలపై అధికారము చూపు భర్తలు మరియు తమ భర్తలకు లోబడని భార్యలు వారి గృహములలో వారి కొరకు వారు నరకమును సృష్టించుకొందురు.

సంఘములలో ఇతరులపై ప్రభుత్వము చేయు సహోదరులు వారి సంఘములలోనికి నరకమును తెచ్చుదురు మరియు దాని ద్వారా బబులోనును నిర్మించెదరు.

పరలోకము పూర్తిగా వ్యత్యాసమైన ఆత్మతో నుండును, ఎందుకనగా అక్కడ దేవుడు తండ్రిగా నుండును. ఆయన జనులపై పెత్తనం చేయక, ప్రేమతో వారిని కాచి వారికి సేవ చేయును. ఆ స్వభావములో మనము పాలు పొందాలి.

మనమిప్పుడు నమ్మకముగా ఉన్నయెడల, పరలోకములో కిరీటములు వాగ్దానము చేయబడెను. దాని అర్థమేమిటి? అప్పుడు మనము ప్రజలను పరిపాలించుదమనా? అలా కాదు. దాని అర్థము, భూమి మీద మన సహోదరులకు సేవ చేయుటకు ఆశపడిన మనము, అనేక పరిమితుల వలన, పరిపూర్ణముగా వారికి సేవచేయలేకపోతిమి, కాని పరలోకములో ఆ పరిమితులు ఏమి ఉండవు గనుక వారికి పరిపూర్ణముగా సేవ చేయగలము. ఆ విధముగా మన హృదయ వాంఛ నెరవేర్చబడును.

పరలోకములో అందరికంటె గొప్పవాడు యేసుప్రభువు మరియు ఆయన అందరికంటె గొప్ప సేవకుడు. ఆయనఆత్మ ఎప్పుడును సేవచేయు ఆత్మగా నుండును. పరలోకపు మాదిరిని ఇతరులు కొద్దిగా రుచిచూచుట కొరకు ఈ భూమిపై సంఘము ఉంచబడినది. ఇది ఒక బిస్కెట్లు తయారు చేయు కంపెనీ మీరు రుచి చూచుట కొరకు వారి బిస్కెట్ల యొక్క చిన్న నమూనాను మీకు పంపించినట్లుండును. దానిని బట్టి మీరు ఇంకా కావలెనో లేదో తెలుసుకొనగలరు.

దేవుని రాజ్యము యొక్క విలువలు ఇతరులు చూచుట ద్వారా వారు ఆయన వైపు ఆకర్షితులగునట్లు దేవుడు మనలను ఈ లోకమునకు పంపెను. మననుండి ఇతరులు ఎటువంటి రుచిని పొందుచున్నారు?

యేసు ప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు, జనులు పరలోకపు జీవితము యొక్క నమూనాను కొద్దిగా రుచి చూచారు. వారు ఆయన యొక్క జాలిని, ఇతరుల గూర్చిన ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క పవిత్రతను, ఆయన యొక్క నిస్వార్ధప్రేమను మరియు ఆయన యొక్క మానవత్వమును చూచిరి. పరలోకము అట్లుండును. దేవుడు అట్లు పాపుల యెడల మరియు జీవితములో విఫలము చెందినవారి యెడల పూర్తిజాలి కలిగి యుండును.

అదే సమయములో మతపరమైన వేషదారుల యెడల మరియు దేవునిపేరిట సొమ్ము చేసికొను వారి యెడల తండ్రి కరిÄనముగా నుండి, వారిని నరకమునకు పంపివేయునని యేసు ప్రభువు బయలు పరచెను. ఉదాహరణకు, పరలోకములో పరిశుద్ధునిగా నటించుచు, ఇతరుల యెడల కనికరము లేని వ్యక్తి ఒక్కడు కూడా ఉండడు.

మన సంఘములలోనికి పరలోకము దిగి వచ్చినప్పుడు మన సంఘములు ఇటువంటి జీవమును చూపించవలెను. యేసుప్రభువు (త్రిత్వములో రెండవ వ్యక్తి) ఈ భూమిపైకి వచ్చినప్పుడు దేవుని యొక్క జీవమును చూపుట కొరకు ఒక శరీరము కావలసి వచ్చెను.

ఇప్పుడు పరిశుద్ధాత్ముడు (త్రిత్వములో మూడవ వ్యక్తి) దిగి వచ్చెను. పరలోకపు జీవితమును ప్రత్యక్షపరచుటకు ఆయనకు కూడా శరీరములు కావలెను. యేసు భూమి మీద శరీరము లేకుండా ఉండిన యెడల, అది ఆయన భూలోక జీవితమునకు ఎంతటి పరిమితిని కలుగజేసి యుండేదో ఆలోచించండి. దేవుడు ఎలాంటివాడో అప్పుడు ఎవరు తెలుసుకోకుండా యుండెడివారు. యేసు ఒక శరీరమును కలిగియున్నందుకు దేవునికి వందనాలు. అందువలన మన శరీరముల ద్వారా ఇతరులకు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క జీవితమును కనపరుచును కావున మనకు శరీరములుండుట ఎంతో విలువైనదిగా యున్నది.

ఇతరులు సంఘములో ఈ దేవుని జీవమును చూడవలసి యున్నది. వారు మనలను కొన్ని సిద్ధాంతములను బోధించువారుగా లేక బోధించుటకు ఆసక్తి కలిగియుండిన ప్రజలుగా చూడకూడదు. అలాకాదు. వారు అంతకు మించి చూడవలసియున్నది. వారు దేవుని రాజ్యము యొక్క జీవమును చూడవలసియున్నది. అలా కానట్లయితే మనము సంఘముగా దేవుని యెదుట విఫలమైనట్లే.

మన క్రియలు పరిపూర్ణముగా లేక పోవచ్చును కాని మన ఉద్దేశ్యములు పరిపూర్ణముగా నుండవలెను. మనము ఇతరులను పరిపూర్ణముగా సేవించి దీవించలేకపోవచ్చును. కాని మన ఉద్దేశ్యములు ఎల్లప్పుడు దేవుని మహిమ పరచుటకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు ఉండవలెను.

అనేకులు కేవలము మతాసక్తి కలిగియుందురు కాని ఆత్మానుసారముగా నుండరు. వారికి మతపరమైన ప్రజల గుర్తులైన బైబిలు చదువుట, ప్రార్ధించుట, కూటములకు వెళ్లుట, మతపరమైన కార్యక్రమములో పాల్గొనుట మొదలైనవి ఉండును. కాని నిజమైన ఆత్మానుసారత దేవుని జీవములో పాలు పంపులు పొందుటయై యున్నది.

ఇటువంటి జీవితము మనలను పవిత్రులనుగా చేయును. ఇది మనలో లేకపోయినట్లయితే మనము కేవలము మతపరమైన వారముగా మాత్రమే యుందుము. మనము కేవలము మతపరమైన వారముగా మాత్రమే యున్నామా లేక నిజమైన ఆత్మానుసారులుగా నున్నామా అనునది ఎప్పటికప్పుడు మనలను మనము పరీక్ష చేసికొనుట మనకు మంచిది. మనమందరము మనలను మనము పరీక్షించుకొనే ఒక విషయమును పరిశీలించండి: మనలో పెళ్లయిన వారిలో ఎంత మంది యధార్థముగా ఈ ప్రార్థన చేయగలరు: ''ప్రభువా నా వివాహ భాగస్వామికి తప్ప నన్ను ఇంకెవరికి ఆకర్షణీయముగా చేయకుము. అది శారీరకముగా, మానసికముగా లేక ఇంకేదైనా విధముగా కావచ్చును''. పూర్తి అంతరంగ పవిత్రత కోరుకొనే ప్రతి క్రైస్తవ స్త్రీ పురుషునికి అది ఒక యధార్థమైన హృదయ మొరగా నుండవలెను. పెళ్లయిన క్రైస్తవ స్త్రీ పురుషులు ఇంకను ఇతరులకు ఆకర్షణీయముగా ఉండాలని కోరుకొనుట ఎంత అవమానకరము. అటువంటి సహోదరులు సహోదరీలు మన మధ్యకు వచ్చినప్పుడు, వారు కూటమునకు వచ్చిన ప్రతిసారి అసౌకర్యమునకు గురిచేయబడవలెను.

అర్దమనస్సుతో రాజీపడే విశ్వాసులు వచ్చిన ప్రతి కూటములో అసౌకర్యము పొందేలా చేయుట సంఘముగా మన పిలుపై యున్నది. ఎవరైనా బహిరంగ పాపము చేయుచు ఉంటే తప్ప మనము ఎవ్వరినీ బయటకు పంపివేయము. కాని సంఘములో ఉన్న అగ్ని ప్రతి మతపరమైన వేషధారిని పశ్చాత్తాపపడుటకు లేక అభ్యంతర పడి సంఘమును విడిచివెళ్ళుటకు అతనికి అసౌకర్యము కలుగజేయవలెను. ఈ మతపరమైన వేషధారులు సంఘములో ఎక్కువ మందిని మోసగించవచ్చును గాని పెద్దలు మోసగింపబడకూడదు.

సంఘములోని ప్రవచన పరిచర్య ఎవరైతే తమ జీవితాలలో పరలోకపు వాతావరణమును గూర్చి ఆశపడరో వారిని అసౌకర్యమునకు గురి చేయును. అటువంటి పరిచర్య మన సంఘములలో ప్రతి కూటములో ఉండునట్లు మనము ప్రార్థించాలి.

లోకములో వ్యభిచార ఆత్మయున్నది. అపవిత్రాత్మల సమూహము లోకము పైకి వరద వలె వచ్చియున్నది. గత ఏభై ఏళ్ళుగా, ఐగుప్తు దేశముపైకి కప్పలు వెల్లువ వలె వచ్చినట్లు ఇవి వచ్చియున్నవి (ప్రకటన 16:13; నిర్గమ 8:3-6 తో పోల్చి చూడండి). పడక గదులలో కప్పలున్నవి. వార్తా పత్రికలలో కప్పలున్నవి, వీధులలో కప్పలున్నవి ప్రతి చోట కప్పలున్నవి.

మనము సంఘమునకు వచ్చినప్పుడు అక్కడ కప్పలు ఏమీ ఉండవని నిరీక్షించుదుము. కాని సాతాను అక్కడకు కూడా వాటిని పంపును. అయితే ఈ అపవిత్రాత్మలన్నిటిని తరిమి వేయుట మన పిలుపుగా ఉన్నది, ఆ విధముగా సంఘములో పవిత్రమైన ఆత్మ ఉండును. యౌవనస్థులలో మరియు పెండ్లి అయిన వయసు మళ్ళిన వారిలో కూడా ఈ కప్పల ఆత్మ ఉన్నది. వీరిలో చాలా మంది మతపరమైన కార్యక్రమములలో ఆసక్తి కలిగి యుందురు. కాని వారు అపవిత్రముగా యుందురు.

సంఘములో నుండిన సహోదరిలలో కొందరు వారి పాత రోజులలో సినిమాలలో చూచిన నటీమణుల పద్దతులను ఇప్పటికీ కొనసాగిస్తూ యుందురు. అటువంటి వారు సంఘము యొక్క సాక్ష్యమునకు ఆటంకముగా యుందురు. ఈ పద్ధతులు నీవు క్రీస్తులోనికి మారిన వెంటనే మాయమైపోవు. నీవు వాటిని ద్వేషించి, వాటి నుండి రక్షణ పొందునట్లు నీ రక్షణను కొనసాగిస్తేనే అవి మరుగైపోవును.

మనమందరము జాగ్రత్తగా ఉండవలెను. సహోదరులుగా మీరు ఒక స్త్రీతో కాని లేక ఒక సహోదరితో కాని మాటలాడునప్పుడు, అక్కడ ఒక అపవిత్రాత్మ (ఒక కప్ప) ఉండినట్లు గమనించినట్లయితే జాగ్రత్త. ఒక అంటు రోగము నుండి దూరముగా పోయినట్లు ఆమె నుండి దూరముగా పో, లేనట్లయితే చివరకు నిన్ను నీవు నాశనము చేసుకొందువు.

అదే విధముగా, సహోదరీలుగా మీరు, ఏ మనుష్యుని కన్నులలోనైనా అపవిత్రత చూచినట్లయితే లేక చివరకు సహోదరుడు అని పిలుచుకొనిన వాడైనా, ఆ కన్నులలో ఒక కప్ప ఉండినట్లయితే నీవు పవిత్రముగా ఉండాలనుకుంటే ఎలాగైనా అతడిని తప్పించుకొనుము.

పురాతన కాలపు ఐగుప్తులో, గోషెను దేశములో (ఇశ్రాయేలీయులు అక్కడ నివసించేవారు ) కప్పలు లేవు. మన సంఘములు అలా ఉండవలెను. అపవిత్రత లేకుండా పరలోకపు వాతావరణముతో నిండి యుండవలెను.

నీవు నీ సంఘములోనికి ఎంత పరిమాణములో పరలోకమును తీసుకు వచ్చెదవో అంత నీవు సంఘమునకు ఉపయోగముగా నుందువు. మరియు పరలోకఆత్మ కాక వేరొకఆత్మను ఎంత పరిమాణములో సంఘములోనికి తీసుకు వచ్చెదవో అంత పరిమాణములో నీవు సాతాను యొక్క పరిచారకునిగా యుండి, నీ స్థలములో ఉండిన సంఘములో దేవుడు చేయు పనికి ఆటంకముగా యుందువు.

సహవాసము

మనము దేవునియొక్క జీవము కలిగి యుండినట్లయితే అది సహవాసములోనికి నడిపించును.

తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ మధ్య మహిమకరమైన సహవాసము నిత్యముగా ఉండేది. వారి మధ్య పోటికాని లేక అసూయకాని ఎప్పుడూ ఉండేది కాదు. దైవత్వములో నుండిన ముగ్గురు వ్యక్తులకు మానవుని విషయములో వారి వారి పరిచర్యలేమిటో నిత్యత్వపు ప్రారంభము నుండి తెలియును.

దేవత్వములో నుండిన ముగ్గురు వ్యక్తులు ఆదాము పడిపోయిన తరువాత ఏమి చెయ్యాలని ఆలోచించలేదు. వారికి అంతము ప్రారంభము నుండి తెలియును. గనుక క్రీస్తు యొక్క సిలువ మరణము వారి మనసుల్లో నిత్యత్వము నుండి ఉండెను. జగదుత్పత్తి మొదలుకొని గొఱ్ఱెప్లిల వధింపబడెను (ప్రకటన 13:8).

పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు వచ్చువిషయము గూర్చి కూడా నిత్యత్వము నుండి వారికి తెలియును. కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు తండ్రికి లోబడవలెననునది కూడా నిత్యత్వము నుండి వారికి తెలియును. అయినప్పటికి వారి యొక్క వేరు విధములైన పరిచర్యలు వారి మధ్య ఏ విధమైన యిబ్బంది కలిగించలేదు. తండ్రికి ఎప్పటికిని (నిత్యత్వమంతా) లోబడి ఉండాలనే విషయము కుమారునికి ఎప్పుడు కలవరమును కలిగించలేదు (1 కొరిందీ¸ 15:28).

అనేకమంది భార్యలు తమ భర్తలకు కొద్దికాలము ఈ భూమిపై లోబడుట కష్టమైనదిగా అనుకొందురు. అనేకమంది సహోదరులు తమకంటె పెద్దవారు మరియు జ్ఞానము గల సహోదరులకు లోబడుట గొప్ప సమస్యగా చూచుదురు అయినప్పటికి దేవుని యొక్క కుమారుడు నిత్యత్వమంతా తక్కువ స్థానము తీసుకొనుట సమస్యగా అనుకొనలేదు.

అది సహవాసము యొక్క ఒక ఫలితము.

ఎక్కడ సహవాసముండునో, అక్కడ పోటీ ఉండదు లేక అసూయ ఉండదు. ఎక్కడైతే సహవాసముండదో, అక్కడ సహోదరులు ఎల్లప్పుడు పెద్దలుగా మరియు నాయకులుగా కావాలనే ఎడతెగని కోర్కె కలిగియుందురు. కొందరు లోబడుటకు ఇష్టపడుదురు కాని తాము పెద్దలుగా నియమింపబడే దినముకొరకు వారు వేచియుందురు. అది లూసిఫరు యొక్క ఆత్మయై యున్నది.

పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య గూర్చి ఆలోచించండి. ఆయన పరిచర్య దైవత్వము యొక్క పరిచర్యలన్నిటిలో ఎక్కువ మరుగైనదిగా యుండును. ఆయన తాను చేసిన పనికి గుర్తింపు లేక ఘనతను కోరుకొనకుండా నిశ్శబ్దముగా, కనబడకుండా మనలను ప్రోత్సహించి మనకు సహాయపడును. జనులు తండ్రిని మరియు యేసుప్రభువును మాత్రము స్తుతించుటను బట్టి సంతృప్తి పడి ఆయన సంపూర్తిగా ఆ విషయములో కనబడకుండా ఉండుటకు తృప్తిపడును. ఎంత చక్కని పరిచర్య.

అటువంటి ఆత్మతో నింపబడుట అనగానేమి? దాని అర్ధము మనము ఆయన వలెనుండుట, ఆయన వంటి పరిచర్య కలిగి యుండుట. అది నిశ్శబ్దముగా, అదృశ్యముగా, ఏ గుర్తింపు పొందకుండా, ఇతరులకు గుర్తింపు వెళ్లుట యందు సంతోషించుటయై యున్నది.

మనము నిజముగా అటువంటి ఆత్మతో నింపబడి యున్నామా? ''పరిశుద్ధాత్మతో నింపబడి యున్నాము'' అని చెప్పుకొనే అనేకులు ఈ రోజున క్రైస్తవ వేదికలమీద తమ వరములను ప్రదర్శించుట ద్వారా తమ కొరకు ప్రాముఖ్యత, డబ్బు, ప్రాచుర్యమును మొదలగువాటిని వెదకుచుందురు. ఇదంతయు ఖచ్చితముగా పరిశుద్ధాత్మ యొక్క కార్యము కాదు. ఇదంతయు వేరొక ఆత్మ పరిశుద్ధాత్మను నకలు చేయుచు చేసిన కార్యమైయున్నది మరియు సంఘములో అటువంటి మోసమును, అబద్ధమును బహిరంగపరచుట మన కర్తవ్యమైయున్నది.

యేసు ప్రభువు మరియు పరిశుద్ధాత్ముని యొక్క జీవము, తండ్రి యొక్క జీవము కంటె ఏ విధముగానైనా తక్కువగుట చేత వారు అట్లు లోబడిరా? కాదు. వారి జీవము అన్ని విషయములలో ఒకే విధముగా నున్నది. దైవత్వములో నుండిన ఒక్కొక్కరు ఒకొరికొకరు లోబడుట ఆనందకర విషయము కాబట్టి వారు అట్లు ఒకరికొకరు లోబడుచున్నారు. అది దేవుని యొక్క జీవములో ఒక భాగము.

అదే విధముగా ఒక సహోదరి యొక్క జీవము తన భర్తకంటె తక్కువగా నుండినందున దేవుడు ఆమెను తన భర్తకు లోబడమని చెప్పెనా? కాదు. ఆమె పరిచర్య వ్యత్యాసమైనది కాబట్టి అట్లు చెప్పెను. సహోదరీలందరు యేసు ప్రభువు యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క మహిమను చూచినట్లయితే ఎంత అద్భుతముగా నుండును. కాని, అయ్యో, చాలా కొద్ది మంది సహోదరీలు మాత్రమే ఈ మహిమను చూచిరి.

సంఘములో పురుషుని అధికారమునకు లోబడుటకు తమకున్న పిలుపును ఒక సహోదరి చూడని యెడల ఆమె, సంఘములో ఒక యెజెబెలుగా మారే ప్రమాదమున్నది (ప్రకటన 2:20). అప్పుడు ప్రభువు తుయతైరలోని పెద్దను గద్దించినట్లు అటువంటి సంఘములోని పెద్దలనే ఆయన ఎల్లప్పుడు గద్దించెను. ఎందుకనగా ఒక సంఘములో ఒక యెజెబెలు యొక్క ఆత్మ వర్ధిల్లుటకు అనుమతించబడినప్పుడు, ఆ పొరపాటు ఎల్లప్పుడు ఆ సంఘ పెద్దలదే. యెజెబెలులు సంఘములోనికి లూసిఫరు యొక్క ఆత్మను తెచ్చుదురు మరియు అది ప్రత్యక్షమైన వెంటనే దానిని బయటకు తరిమివేయుటకు పెద్దలు బలమైన వారిగా ఉండవలెను. ఆ స్త్రీని బయటకు తరిమివేయనక్కరలేదు. కాని ఆమె యొక్క ఆత్మ సంఘములో దేవుడు నియమించిన నాయకత్వమునకు లోబడునట్లు చర్యలు తీసుకోవలెను. మనకు పెద్దలుగా నియంతలు అక్కరలేదు గాని మనకు ధృఢమైన తండ్రులు అవసరము. ఒక సంఘములో పరలోక వాతావరణము కనబడాలంటే, ప్రతి నరకపు ఆత్మను ఎదిరించుటకు మనము స్థిరముగా నుండవలెను.

ఎక్కడైతే నిజమైన దేవుని జీవము ఉండునో, అక్కడ సహోదరులు మరియు సహోదరీలలో నాణ్యమైన సహవాసముండును. ఎక్కడైతే అటువంటి నాణ్యమైన సహవాసము లేదో, అక్కడ నిజమైన దేవుని యొక్క జీవము లేదని ఖచ్చితముగా చెప్పవచ్చును. అటువంటి సహోదరులు, సహోదరిలకు మతము మాత్రమే యుండును.

దైవత్వములో నుండిన సహవాసమును ప్రభువు ప్రతి చోట ప్రతి సంఘములో ఏర్పర్చవలెనని కోరుచున్నాడు.

యేసు ప్రభువు తండ్రితో సహవాసమును అన్నింటి కంటె ఎక్కువ విలువైనదిగా చూచెను. సిలువపై ఆ సహవాసము మూడు గంటల పాటు తెగిపోవునని ఆయనకు తెలిసినప్పుడు ఆయన మానవ జాతిని రక్షించుటకు అటువంటి గొప్ప ధరను (వెలను) చెల్లించకుండా వేరే ఏదైనా మార్గము కలదేమో అని అడుగుచు గెత్సెమనె వనములో మొఱ పెట్టెను. ఆయన వలె తండ్రితో సహవాసమునకు మనము విలువ ఇవ్వకపోవుట చేత, యేసు ప్రభువుకు అది ఎటువంటి ధర అనునది మనము పూర్తిగా అర్ధము చేసికొనలేము.

ఆ సుదీర్ఘమైన ప్రార్థనను గెత్సెమెనేలో చేసిన తరువాత, మన ఆత్మలను రక్షించుట కొరకు యేసు తనకున్న అత్యంత విలువైన దానిని (తండ్రితో సహవాసమును) పోగొట్టుకొనుటకు సిద్ధముగా నుండెను. మన కొరకు ఆయనకున్న ప్రేమ యొక్క గొప్పతనమును మనము దానిలో చూడవచ్చును.

అనేకులు యేసుప్రభువు శారీరకముగా సిలువపై శ్రమలు భరించి మరణించు విషయములోనే ఆయన యొక్క ప్రేమను చూచుదురు. కాని ఆ శారీరక శ్రమ మన పాపముల కొరకు సిలువపై మూడు కష్టమైన గంటల పాటు చీకటిలో తన తండ్రితో సహవాసము కోల్పోయినప్పుడు ఆయన పడిన బాధలో పదిలక్షవ వంతు కూడా కాదు. ఒక రోజున మనము ఆయనను ముఖాముఖి కలుసు కొన్నప్పుడు అది ఆయన మనకొరకు చూపిన ప్రేమయొక్క గొప్ప ప్రత్యక్షతగా మనము తెలిసికొనెదము.

తండ్రితో తనకున్న సహవాసమునకు యేసు ఎంతో విలువనిచ్చినందున ''మహారోధనముతోను కన్నీళ్లతోను'' తన్ను మరణమునుండి (ఆత్మీయ మరణమునుండి) రక్షింపమని తండ్రిని వేడుకొనెను. యేసు రక్షింపబడదలచిన ఒకే ఒక్క విషయము తండ్రితో తనకున్న సహవాసము పోగొట్టుకొనుట నుండియే. ఆయన మిగిలినవన్నియు పోగొట్టుకొనుటకు ఇష్టపడెను. మిగిలినవన్నియు ఆయనకు చెత్తగా నుండెను. దేవుని సహవాసముతో పోల్చిచూచినప్పుడు సమస్తమును చెత్తగా (మానవ మలముగా) మనము పరిగణించినప్పుడే యోహాను తన మొదటి పత్రికలో వ్రాసిన తండ్రితో సహవాసమును మనము కనుగొనగలము. తండ్రితో అటువంటి సహవాసమే సంఘములో సభ్యుల మధ్య నిజమైన సహవాసమును తీసుకువచ్చును.

పరలోకము యొక్క మరియొక కోణమును ప్రకటన 4:10లో చూచెదము. అక్కడ పెద్దలు ''తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి'' పరలోకములో కిరీటము ఎవరి తలలపై లేకుండా యేసు ప్రభువు తలపై మాత్రమే యుండును. అక్కడ మిగిలిన వారందరు సామాన్యమైన సహోదరులు మరియు సహోదరీలుగా యుందురు. సంఘములో ప్రత్యేకమైన సహోదరులుగా మరియు సహోదరీలుగా నుండవలెనని చూచువారందరు సంఘములోనికి నరకపు వాతావరణమును తీసుకు వచ్చెదరు.

మనము తండ్రి యెదుట నిలబడినప్పుడు దేనిని బట్టి అతిశయపడము. మనము కలిగియున్నవన్నిటిని ఆయన యెదుట వేయుదుము. పరలోకములో ఎవరు కూడా తాను కలిగియున్నదానిని బట్టి అది అతడు పొందిన కిరీటమైనా సరే, ''ఇది నాది'' అనడు. పరలోకపు వాతావరణము మన గృహాలలో, మన సంఘాలలో విస్తరించుట మొదలు పెట్టినప్పుడు, మనము కూడా మనము కలిగియున్న దేని గురించి కూడా ''ఇది నాది'' అనము. సమస్తమును దేవునివిగా ఎంచబడును. తద్వారా భూమి మీద దేవుని రాజ్యమును వ్యాపింపజేయుటకు ఉచితముగా అందుబాటులో నుండును. ప్రతి పిసినారి మరియు స్వార్థపరుడు తన కొరకు తన స్వంత లాభము కొరకు జీవించుచు సాతాను యొక్క నియంత్రణలో ఉన్నాడు.

ఈ భూమిపై అనేకులైన తన బిడ్డల మధ్య సహవాసము లేకుండుట దేవుని హృదయమునకు ఎంతో బాధ కల్గించును. అనేకులు ఇతరులయెడల హృదయములో చేదుభావము కలిగి యుందురు. మరికొందరు దేవుడు వారిని మాత్రమే ఎంచుకొనెనని ఇతరులను ఎంచుకొన లేదనే భావముతో స్వనీతిపరులైన పరిసయ్యులుగా నుందురు. దేవుడు ఈ రెండు గుంపుల విషయములో బాధ కలిగి యుండును. ఎందుకనగా వారందరు సంఘము కొరకు దేవుని యొక్క ఉద్దేశ్యమును భంగము చేయుచున్నారు.

ఏ సంఘములోనైనా పరలోకపు వాతావరణమును దానిలోనికి తీసుకొని వచ్చి దానిలో సహవాసమును కట్టగలలిగిన వాడే ఆ సంఘములో అతి విలువైన సహోదరుడు. సహోదరీల విషయములో కూడా ఇది సత్యము. ఆ వ్యక్తి పెద్దలలో ఒకడై యుండవలసిన అవసరము లేదు. అటువంటి విలువైన సహోదరులుగా సహోదరీలుగా అగుటకు మనందరికి అవకాశమున్నది.

ఒక సహోదరుడు కాని ఒక సహోదరి కాని ఎల్లప్పుడు మీ యింటికి లేక కూటమునకు వచ్చినప్పుడు ఆ గదిలోనికి పరలోకము నుండి ఒక చక్కని స్వచ్ఛమైన గాలి వీచినట్లుండుట గూర్చి ఆలోచించండి. అటువంటి వారు ఎంత విలువైన వారు. అటువంటి వారు అయిదు నిమిషాలపాటు మీ ఇంటికి వచ్చి మిమ్మును దర్శించినా, మీరు విశ్రాంతి నొందెదరు. అటువంటివారు ఒక ప్రసంగము చేయక పోవచ్చును లేక వాక్యము నుండి ఏదీ ఎత్తి చూపకపోవచ్చును. కాని అటువంటి వారు స్వచ్చముగా నుండి, ఎప్పుడు చిటపటలాడకుండా ముఖము వ్రేలాడదీసికొని ఉండకుండా ఎవ్వరిపై ఫిర్యాదులు సణుగులు లేకుండా యుందురు. అటువంటి వారు అనేకుల వలే కూటములో మొదట మాట్లాడవలెనన్న కోరకను కలిగియుండరు. అటువంటి వారు ప్రతికూటములో చివరిలో కేవలము మూడు నిమిషములు మాట్లాడవచ్చును. కాని ఆ మూడు నిమిషములు కూటములో పరలోకము వలే ఉండును- అవి వేచియుండుటకు, వినుటకు తగినవిగా ఉండును.

లోకమంతయు ఫిర్యాదులు చేయువారితోను గొనుగుకొను వారితో నిండియున్నందున అటువంటి సహోదరునిగాని సహోదరిని గాని కలుసుకొనుట విశ్రాంతిని కలుగజేయును. అది ఒక వెచ్చని దినమున చల్లని నీళ్లతో స్నానం చేసినట్లుండును. అటువంటి వ్యక్తి వలే ఉండుటకు మనమందరము కోరుకోవలెను. యేసు అలా ఉండెను మరియు మనలను కూడా అలా చేయాలని ఆయన కోరుకొనుచున్నాడు. అలా ఉండుటకు బదులు, అనేకమంది సహోదర సహోదరీలు ఎక్కడకు వెళ్లినను సమస్యలను సృష్టించుట ఎంత విషాదకరము. వారు వదురుబోతులుగా ఉండి సహోదరులను సహోదరీలను విడదీయుదురు. వారు సాతానుకు దాసులుగాను ప్రతినిధులుగాను ఉన్నారు. మనము తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్ముడు ఎలా కలిసి జీవించారో అలా కలిసి జీవించుటకు పిలువబడితిమి. వారు నిత్యత్వమునుండి ఒకరికొరకు బోధించుకొనలేదు కాని సహవాసము కలిగి యుండిరి.

మనము కూడా ఒకరికొకరు బోధించుకొనుటకు పిలువబడలేదు కాని సహవాసము కలిగియుండుటకు పిలువబడితిమి. అదే పరలోకము. మనలను అక్కడికి నడిపించుటయే నూతనమైన సజీవమైన మార్గము యొక్క ఉద్దేశ్యము. మనలో అనేకమంది ఈ మార్గమునకు ఎంతగా ప్రాముఖ్యతనిచ్చామంటే దాని గమ్యమునకు, అనగా తండ్రితో సహవాసమునకు, మనము చేరుకోలేదని నేను భయపడుచున్నాను. మీరు బెంగుళూరులో ఒక సమావేశముకు వచ్చేదారిలో ఉన్న రహదారులను మెచ్చుకొనుచు ఉంటే, మీరు బెంగుళూరుకు చేరకపోయే ప్రమాదమున్నది. మీలో కొందరు బెంగళూరుకు వచ్చే దారిలో కూర్చుండి, దాని మీద ప్రయాణము చేసి బెంగళూరుకు వచ్చుటకు బదులు.,ఇతరులతో ఆ రహదారి యొక్క గుణ లక్షణములను పంచుకొనుచు ఉన్నారనుకొనుడి. ఇది కూడా అలాగే ఉన్నది. మనము దేవునితో సహవాసమైన గమ్యమునకు చేరుకోవలెను. తండ్రితో సహవాసము కలిగియుండుటకు తెరలోపలికి మనలను నడిపించుట చేత శరీరమును మరణింపజేయుటకును, యేసుయొక్క మరణానుభవమును మన శరీరములో వహించుకొనుటకును విలువ ఉన్నది (హెబ్రీయులు 10:20).

యేసు తన అనుదిన జీవితములో సిలువకు మాత్రమే ప్రాధాన్యతనివ్వలేదు. ఆయన సిలువను బట్టి ఆనందించలేదు. ఆయన సిలువను సహించెనని మనకు చెప్పబడినది (హెబ్రీ 12:2). ''ఆయన యెదుట ఆనందము ఉంచబడినది'' అనగా తండ్రితో సహవాసమే యేసుకు ఆనందమయమై యుండెను. మనము కూడా ఈ ఆనందమునకే ప్రాముఖ్యత నివ్వవలెను.

ఆదియందు దేవుడు మాత్రమే ఉన్నప్పుడు, మరణింపజేయుటకు శరీరము లేదు. అందుచేత దానిని యోహాను తన పత్రికలో పేర్కొనలేదు. అది ముఖ్యమైనది కాదు అని కాదు గాని అది అతడి అంశము కాదు.

యోహాను ప్రత్యేకముగా చెప్పినది ప్రారంభములో నుండినదాని గూర్చి. అది జీవము మరియు సహవాసము. మనము కూడా మన సంఘములలో ఎల్లప్పుడు వీటినే ప్రత్యేకించి చెప్పుదుము గాక.

అధ్యాయము 6
క్రీస్తుతో వివాహ బంధము

''......మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును'' (యోహాను 8:31 32).

మన జీవితములలో ప్రతి బంధకము ఎంతో కొంత సత్యము మనకు తెలియక పోవుటను బట్టి వచ్చును. ఇది మనము సత్యమును అసలు వినకపోవుటను బట్టి కావచ్చును లేక దానిని జాగ్రత్తగా పట్టించుకొనక పోవుటను బట్టి కావచ్చును.మనము సత్యమును వినినను, దానిని తప్పుగా అర్ధము చేసికొనుట వలన కూడా కావచ్చును. మనలను మనము దోషులుగా ఖండించుకొనుట కూడా సత్యము తెలియక పోవుటవలననే జరుగును.

ముఖ్యముగా అనేక మంది యౌవనస్థులు వారు చివరివరకు కొనసాగలేమనే (సహించలేమనే) ఆలోచనతో యేసుకు శిష్యులగుటకు వెనకాడుదురు. అందువలన వారు యేసు శిష్యులుగా బహిరంగముగా ఒప్పుకొని, తరువాత వారి ఉద్రేకమును కోల్పోవుట వలననో, మోహములో పడుటవలననో ఏదొక విధముగా పడిపోయినట్లయితే ఇతరులచేత హేళన చేయబడుదుమని, అందువలన ప్రభువు గూర్చి బహిరంగముగా ఒప్పుకొనుటను బట్టి విచారించవలసి వచ్చునని అనుకొందురు. ఆ విధముగా సాతాను వారు ఎప్పటికి క్రీస్తులోనికి మార్పు చెందకుండునట్లు చేయును.

అయితే ఏ విశ్వాసి కూడా పరిపూర్ణుడుకాడు. ఈ భూమిపై ఏ విశ్వాసి కూడా అన్ని సమయములలో యేసు నడచినట్లు నడుచుచున్నానని చెప్పలేడు. ''ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయనవలె నడచుకొన బద్దుడై యున్నాడు'' (1 యోహాను 2:6). అది తప్పనిసరిగా మన గమ్యస్థానమై యుండాలి. కాని మనమందరము ఆ గమ్యము వైపునకు సాగునప్పుడు అప్పుడప్పుడు పడిపోవుదుము. యెరూషలేము సంఘమునకు ప్రధాన పెద్ద అయిన యాకోబు, తను కూడా అప్పుడప్పుడు తొట్రిల్లెనని ఒప్పుకొనెను (''మన మందరము తొట్రిల్లుచున్నాము'' -యాకోబు 3:2).

అయితే మనము తొట్రిల్లినప్పుడు మనమేమి చేయవలెను? లేచి పరుగును కొనసాగించవలెను. ఒకడు రసాయన శాస్త్ర పరీక్షను తప్పినంత మాత్రాన బడికి వెళ్లుట మానివేయడు. లేదు. అతడు ప్రత్యేకమైన శిక్షణను పొంది తరువాత పరీక్షలో ఉత్తీర్ణుడగుటకు ప్రయత్నించును. మనము పడిపోయినప్పుడు నిజాయితీగా ఉండి మనము తప్పిన విషయమును దేవునియొద్ద ఒప్పుకొని దానిగూర్చి దు:ఖపడవలెను. దేవుడు పరలోకమును పరిపూర్ణులైన వారితో నింపుటలేదు. కాని యధార్థులైన వారితో నింపుచున్నాడు.

నా స్వంత జీవితములో యేసు యోహాను 6:37లో చేసిన వాగ్దానము (''నా యొద్దకు వచ్చు వానిని నేనెంతమాత్రమును త్రోసివేయను'') గత 36 సంవత్సరాలుగా ఒక లంగరు వలె ఉన్నది. దానికి ముందు4 అనేక సంవత్సరాలు, యేసు నన్ను అంగీకరించెనా లేదా అని తలంచుచు ఇటు అటు కొట్టుకొని పోవుచు యుండెడి వాడును. నా బాల్య దశలో యేసును నా హృదయములోనికి రమ్మనమని ఒక వందసార్లు అడిగియుండవచ్చును. కాని ఆయన నిజానికి నా హృదయములోనికి వచ్చెనా లేదా అని నాకు అనుమానము ఉండేది. ఒక దినమున ప్రభువు యొక్క ఈ వాగ్దానములో సరళమైన విశ్వాసము ద్వారా ''ప్రభువా, నీవు నన్ను అంగీకరించావని నేను నమ్ముచున్నాను'' అని ప్రభువుతో చెప్పాను. ఆ రోజునుండి నా నిశ్చయత కదిలింపబడలేదు.

కాని ఆ వాగ్దానము మనము ప్రభువు యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మాత్రమే వర్తించదు. అది మనము ఈ భూమి మీద నివసించినంత కాలము వర్తించును. నేను తిరిగి జన్మించినప్పుడు నాకు ఈ వచనము ఎంత అవసరమైయ్యెనో ఈ రోజున కూడా అది అంతే అవసరము.

బహుశా మీరు ఈ ఉదయము బైబిలు చదువుటకు సమయము దొరకలేదేమో? బహుశా వేరొక రీతిగా మీరు తప్పిపోయారేమో? యేసు నొద్దకు మీరు తిరిగిరావలసిన అవసరమున్నదని మీ కనిపించదా? ఆయన మిమ్మును తిరస్కరించునా? లేదు. మీరు ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మును అంగీకరించుటయే కాక మీరు ఇప్పటి వరకు అనుభవించిన దానికంటే ఎక్కువ మహిమలోనికి మిమ్మును నడిపించును.

అయితే మనయొక్క విశ్వాస పరిమాణమును బట్టి మనము ప్రభువు నొద్దనుండి పొందుదుమను విషయమును మనము మరువకూడదు. విశ్వాసము మనందరిని ఒకే స్థాయిలో నిలువబెట్టును. ఒకవేళ ప్రభువు మనయొక్క తెలివితేటలు లేక మనసంపద, లేక మంచితనముయొక్క పరిమాణమును బట్టి మనము పొందుదుమని చెప్పినట్లయితే జ్ఞానవంతులకు మరియు ఆస్తి పరులకు ఇతరులకంటె ఎక్కువ అవకాశములుండును. మానవపరంగా స్వభావ సిద్ధముగా మంచివాళ్లయిన వారికి చెడు స్వభావాన్ని కలిగియున్నవారికంటే ఎక్కువ అవకాశములుండును. అందుచేతనే దేవుడు విశ్వాసమును మార్గముగా చేసెను. ఎందువలననగా అది మనలనందరిని ఒకే స్థాయిలో ఉంచును.

విశ్వాసము కలిగియుండుట అంటే ఏమిటో నేను మీకు ఉదాహరణతో చెప్పెదను. ఒక నది మీద రెండు వంతెనల గూర్చి ఆలోచించండి. ఒకటి బలహీనమైన కర్రలతో చేయబడిన చెక్క వంతెన మరియొకటి అనేక స్థంభాల మీద కట్టబడిన కాంక్రీటు వంతెన. నీవు ఆ కాంక్రీటు వంతెనపై ఎందుకు ధైర్యముగా నడువగలవు కాని ఆ చెక్క వంతెనపైన అడుగువేయుటకు ఎందుకు భయపడుదువు? అది నీవు నమ్మగలిగిన దానిపై ఆధారపడిలేదు. అది నీవు ఏ రకమైన వంతెనపై నడచుచున్నావు అన్నదానిపై ఆధారపడియున్నది. అదే విధముగా మన నమ్మకము యేసుక్రీస్తు (ఆయన కాంక్రీటు వంతెనవలె ఉన్నాడు) మీదనేకాని మన విశ్వాస సామర్థ్యము మీద కాదు. మనలో చాలా మందితో సమస్య ఏమిటంటే మన నమ్మకము మన స్వంత విశ్వాసము మీద ఆధారపడియున్నది. మన విశ్వాసము ఒక చెక్క వంతెన అంత నమ్మతగనిది!

అటువంటి విశ్వాసము మనలో మనము నమ్మకాన్ని కలుగజేసికొని ఆ తరువాత ఆ చెక్క వంతెన మీద నది దాటుటకు ప్రయత్నించినట్లుండును. ఆ వంతెన మీద సగం దూరం నడచిన తరువాత, అది పడిపోవును మరియు మనము మునిగిపోవుదుము. మన విశ్వాసముపైన మనకు నమ్మకమున్నప్పుడు అలాగే జరుగును. కాని ఆ బలమైన కాంక్రీటు వంతెన మీద విశ్వాసముంచుటలో కష్టమైన విషయమేమిటి? నదిలోని నీరు ఎంత అలలతో కూడినదిగా ఉన్నను పరవాలేదు. మనము ఏ భయము లేకుండా ఆ బలమైన వంతెనపైన ఆ నదిని దాటవచ్చును.

మరియొక ఉదాహరణను పరిశీలించండి. మీరు ఒక రైలు వంతెన క్రింద ఉన్న ఒక రోడ్డు మీద నడచినప్పుడు, ఆ వంతెన పడిపోయి, రైలు మీ మీద పడి మిమ్మును చంపివేయునని మీరు భయపడుదురా? అటువంటి రైలు వంతెన క్రింద వెళ్లుటకు మీకు గొప్ప విశ్వాసము అవసరమా? లేదు. అనుదినము దాని క్రింద వందలకొలది ప్రజలు నడచుచుందురు. వారి నమ్మకము వారిలో కాదు గాని ఆ వంతెన యొక్క బలముపై యున్నది.

విశ్వాసమనునది అంత సుళువైన విషయం. నీ విశ్వాసము యేసుక్రీస్తు నందున్నట్లయితే, నీవు నీస్వంత విశ్వాసమువైపు చూడవు. నీవు యేసువైపు చూచెదవు.

అపవాది వారికి ఏదోఒక విధముగా హాని చేయును అని భయపడుట ద్వారా దేవున్ని అవమానపరచు వారు ఎంతమందో ఉన్నారు. కాబట్టి భయము వారిని పక్షపాతం గలవారిగా చేయును గనుక దేవుడు వారిని నెరవేర్చమన్నావాటిని వారు ఎప్పటికి నెరవేర్చలేరు. తాను నదిలో పడిపోవునేమో అని భయపడుచు ఆ కాంక్రీటు వంతెన ప్రక్కన నిలబడిన వానితో వారిని పోల్చవచ్చును. అతని కంటే ఎక్కువ విశ్వాసము లేని వేలమంది ఆ నదిని భయములేకుండా దాటుదురు. కాని అతడు ఆ వంతెన వైపు కాక తన స్వంత విశ్వాసము వైపు చూచును గనుక అతడు కదలలేకుండా ఉండును. అతడు ఎప్పటికి అవతలకు చేరుకోలేడు. విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో మరియు ఎంతసుళువైనదో నీవు ఇప్పుడు చూచావా? ''నీవు నన్ను నమ్ముచున్నావా? నమ్మినట్లయితే, నేను నీ యొక్క ప్రతి బంధకము నుండి విడుదల చేయుదును'' అని ప్రభువు చెప్పుచున్నారు.

క్రైస్తవ జీవితము ఎంతో ఎంతో సామాన్యమైనది. మనలో చాలామంది దేవుడు మన యొద్దనుండి ఏది ఆశించుచున్నాడన్న విషయము అపార్థము చేసికొనియున్నాము. ఆరంభములో మనము యేసు యొద్దకు ఉచితముగా రావచ్చని మనము ఎరుగుదుము. కాని మనము రక్షింపబడిన తరువాత, ఆయన యొద్దకు వచ్చేముందు ప్రభువు మనము పరిపూర్ణముగా ఉండాలని ఆశించుచున్నాడని భావించుచున్నాము. కాని, ''నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను'' అని ఆయన మనకు ఇప్పుడు కూడా హామీ ఇచ్చుచున్నాడు. నీవు ఎక్కడికి వెళ్లినను దానిని గుర్తుపెట్టుకొనుము. నీవు ఎక్కడైనా ఎటువంటి సమస్యను గాని కష్టమును గాని ఎదుర్కొనుచున్నప్పుడు, ''ప్రభువా, నీవు నన్ను ఎప్పుడు త్రోసివేయవని నేను నమ్ముచున్నాను. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను'' అని ప్రభువుతో చెప్పుము. ఆయనయందు నమ్మిక యుంచుము మరియు దేవుడు నీ కొరకు చేయు అద్భుతములను చూడుము.

మీరు చివరి వరకు కొనసాగలేరేమోనన్న భయముతో ఎంతో కాలముగా ప్రభువుకు నిజమైన సమర్పణను చేసుకొనుటకు వెనుకాడు వారికి నేను చెప్పునదేమనగా:

నేను నీకు శిష్యుడుగా ఉండవలెనను కొనుచున్నానని ప్రభువుతో చెప్పుము. నీవు తప్పి పోవచ్చును. నీవు తప్పిపోయినట్లయితే, తిరిగి లేచి పరిగెత్తుట కొనసాగించుము. నీవు ఒకపరీక్షలో తప్పినట్లయితే, రెండవసారి ప్రయత్నించుము. నీవు మరల పడిపోయినట్లయితే మూడవసారి ప్రయత్నించుము లేక ఇరవైయోసారి లేక పదివేలవసారి ప్రయత్నించుము. అంతేకాని సాతాను నిన్ను బడిని విడిచి పోయేలా చెయ్యనివ్వకుము. ఉత్తీర్ణుడగుటకు నిశ్చయించుకో. నీవు తప్పక ఉత్తీర్ణుడవవుదువని నేను ఖచ్చితముగా చెప్పుచున్నాను.

ఒక రోజులో 490 సార్లు ఇతరులను క్షమించమని యేసు మనకు చెప్పారు (మత్తయి 18:21,22 ను లూకా 17:4 తో కలిపి చూడండి). ఒకరోజులో ఆయన మనలను అట్లు క్షమించడని నీవనుకొనుచున్నావా? ఆయన మనలను అన్ని సార్లు క్షమించకుండా ఇతరులను మనము ప్రతిరోజు 490 సార్లు క్షమించమని అడుగుట యేసుప్రభువు చేయలేని పని. అటువంటప్పుడు మనము ఆయనను పూర్తిగా నమ్ముదుము.

రెండు రకములైన బంధకములు

లాజరు మరణము నుండి లేచిన కథలో అనేకమంది విశ్వాసులు ఉండే రెండు రకములైన బంధకములను చూచెదము.

మొదటిగా లాజరు మరణపు బంధకములో ఉండెను. అతడి శరీరమునుండి కంపు వచ్చేటంతగా అతడు మరణించాడు. అందుచేతనే వారు సమాధిని తెరచుటకు యిష్టపడలేదు (యోహాను 11:39). కాని యేసు అతడిని ఆ బంధకమునుండి విడుదల చేసెను.

రెండవదిగా, లాజరు సమాధినుండి బయటకు వచ్చిన తరువాత, అతడు తన ప్రేత వస్త్రముల చేత బంధింపబడి యుండెను. యేసు ఆ యొక్క బంధకమును కూడా అతడిని విడుదల చేసెను.

ఇక్కడ మనము లాజరు యొక్క విడుదలలో మూడు దశలను చూచుచున్నాము.

మొదటిది: మరణించి కంపుకొట్టుట.
రెండవది: సజీవముగా ప్రేత వస్త్రములతో కట్టబడి యుండుట.
మూడవది: సంపూర్ణమైన స్వేచ్ఛ.

మన మందరము ఈ మూడింటిలో ఏదొక స్థితిలో ఉన్నాము. నీవు ఇంకా ముందుకు చదువునప్పుడు రాయిని పొర్లించుటకు మరియు నీ నిజమైన స్థితిని దేవుని యొద్ద ఒప్పుకొనుటకు వెనుకాడవద్దు. నీ పాపములను మనుష్యులతో ఒప్పుకోనక్కరలేదు. కాని దేవుని ముందు యధార్థముగా నుండుము. ఆ రోజున వారు బెతనియలో కంపును బయట పెట్టినందున, ''ఇల్లు అత్తరు వాసనతో నిండెను'' (యోహాను 12:3) అని చదువుదుము.

మన జీవితములలో కూడా ప్రభువు చేయగలడను దానికి అది ఒక అద్భుతమైన దృశ్యముగా ఉన్నది. పరిస్థితులు కప్పిపుచ్చునంతగా ఎంతో చెడుగా ఉండినా ప్రభువు వాటిని మార్చగలడు. బేతనియలో దానికి చాలా కాలము పట్టలేదు. నీ జీవితములో కూడా ఎక్కువ కాలము పట్టవలసిన అవసరము లేదు.

యోహాను 11:3 లో లాజరు జబ్బు పడెనని తెలిసిన తరువాత యేసు మరి రెండురోజులు అక్కడే ఉండెనని చదువుదుము. యేసు దేనికొరకు ఎదురు చూచుచుండెను. లాజరు పెనుగులాట మానువరకు చూచుచుండెను. లాజరు తన చిటికిన వేలును కూడా కదల్చలేని సమయము వచ్చే వరకు ఆయన వేచియుండెను. మరణము పూర్తిగా వచ్చువరకు ఆయన ఎదురు చూచుచుండెను.

ఇదే దేవుని విధానము. మనుష్యులకు దేవుడు చేయు పనులన్నింటిలో ఇదే సూత్రమని బైబిలు అంతటిలో ఆదికాండము నుండి ప్రకటన వరకు చూచుదుము. ప్రయత్నించు వారికి దేవుడు సహాయము చేయును అని లోకము చెప్పును. కాని అనేకమైన లోకోక్తులు సత్యముకానట్లే ఇది కూడా సత్యము కాదు. తమకు తాము సహాయముచేసికొనలేని వారికి దేవుడు సహాయపడును అనునది సత్యము.

లాజరు పూర్తిగా నిస్సహాయుడై మరణించిన స్థితిలో నున్నప్పుడు యేసు వచ్చెను. మన పరిస్థితి పూర్తిగా నిస్సహాయమైనదని భావించినప్పుడు, ప్రభువు మన జీవితాలలోనికి అడుగుపెట్టి మనకు సహాయపడును.

బైబిలులో చెప్పబడిన జీవిత ప్రమాణములను అనుసరించి జీవించుట అసాధ్యము అనే స్థితికి నీవు వచ్చావా? అలా అయినట్లయితే, నీవు విడుదలకు చాలా సమీపముగా ఉన్నావు.

ప్రత్యక్షముగా వినక పోవుటవలన చాలా మంది మేము బోధించే దానిని తప్పుగా అర్ధము చేసికొందురు. మేము ముఖ్యముగా బోధించేది ఇంటిలో టి. వి. ఉండకపోవుట, నగలు ధరించక పోవుట, సహోదరీలు ఇంటి బయటకు పనికి వెళ్లకపోవుట మొదలైనవి అని అనుకొందురు. కాని వారు పూర్తిగా పొరబడుచున్నారు. అటువంటి విషయములు నాకు సంబంధించినంత వరకు ఏ మాత్రము ప్రాముఖ్యత లేనటువంటివి. నా విషయములో పరిశుద్ధముగా జీవించుటకు దేవుడు ఉద్దేశించిన ప్రమాణములలో ఈ విషయములు నా యొక్క జాబితాలో అట్టఅడుగున కూడా లేవు. దేవుని యొక్క ప్రమాణము యేసుయొక్క జీవమైయున్నది. అది అంతరంగమునకు సంబంధించినది మరియు ఇప్పుడు అనుకొనిన విషయములలో దేనికీ సంబంధించనిది కాదు.

నీ యొక్క జీవితము పరిపూర్ణత వైపు ఎందుకు అభివృద్ది చెందుట లేదు? దానికి జవాబు నీవు ఇంకను పెనుగులాడుచుండుటయే. నీవు పెనుగులాడుట మాని మరణించుట కొరకు దేవుడు ఎదురుచూచుచున్నాడు.

మూడు వివాహముల కథ

లాజరును ప్రభువు ఏ విధముగా విడుదల చేసెనో అట్లే ఈనాడు ప్రభువు మనలను విడుదల చేయు దానిని పరిశుద్ధాత్ముడు రోమా 6,7 అధ్యాయములలో మనకు చూపుచుండెను. ఇక్కడ మనకు మూడు దశలు ఉన్నవి.

మొదటి దశ : మరణించి ఏమీ చేయలేక పోవుట.
రెండవ దశ : తిరిగి జన్మించి యున్నప్పటికీ కాని ధర్మశాస్త్రము యొక్క సమాధి బట్టల చేత చుట్టబడి యుండుట.
మూడవ దశ : సంపూర్ణమైన విడుదల.

ఈ లోకములోనికి జన్మించినప్పుడు మనమందరము పుట్టుకతోనే వివాహితులము. ''ప్రాచీన పురుషుడు'' అని బైబిలు చెప్పువానికి వివాహము చేయబడినాము.

''ప్రాచీన పురుషుడు'' ''శరీర స్వభావము'' కు వ్యత్యాసమైనవాడు.

శరీరస్వభావములో అనేకమైన దురాశలున్నవి. అది మనయింటిని దోచుకొనుటకు వచ్చిన దొంగలముఠా వంటిది. అవి మనయింటి (మన హృదయము)లో నివసించవు. అవి బయటనుండి వచ్చును.

మనము శరీర స్వభావమునకు కాక ప్రాచీనపురుషునికి వివాహము చేయబడితిమి.

''ప్రాచీన పురుషుడు'' భయంకరమైన భర్త, అతడు మనలను చెడుగా చూస్తూ ప్రతి రోజూ కొట్టువాడుగా ఉండెను. దానికి తోడు, దొంగల గుంపు (మన శరీర స్వభావములో నుండిన దురాశలు) వచ్చిన ప్రతిసారి, ప్రాచీన పురుషుడు తలుపు తీసి మనలను కొట్టుటకు మరియు అవమానించుటకు వారిని ఆహ్వానించుచుండెను. ఇక్కడ తాను మాత్రమే కాక ఇతరులు కూడా భార్యను కొట్టి అవమానించుటకు అనుమతించే భర్త ఉన్నాడు.

అటువంటి మనుష్యుని ఏ స్త్రీ వివాహము చేసికొనియుండుటకు యిష్టపడును? అటువంటి భర్త నుండి విడుదలగుట ఏ స్త్రీ కైనా ఎంతో సంతోషముగా ఉండును.

అయితే అతడిని ఆమె ఎట్లు దూరము చేయగలదు? ఆమె క్రీస్తును వివాహము చేసికొనవలెనని అనుకొనుచున్నది కాని మొదటి భర్త జీవించి యుండగా, ఆమె మరియొకని వివాహము చేసికొనకూడదని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. ''ప్రాచీన పురుషుడు'' జీవించియుండగా, క్రీస్తును కూడా వివాహము చేసికొనవలెనని కోరుకొనినట్లయితే ''ఆమె వ్యభిచారియగును'' (రోమా 7:3). బబులోను సంఘము అట్లే ''విశ్వాసులు'' వారి పాత భర్తయైన ''ప్రాచీన పురుషుని''తో జీవించుట ద్వారా కట్టబడినది.

అటువంటి పరిస్థితిలో మనము ఐగుప్తులో ఇశ్రాయేలీయుల వలె మనలను మనము విడుదల చేసుకోలేని స్థితిలో ఉన్నాము. మనము కేవలము దేవునికి మొఱ్ఱ పెట్టగలము. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు మొఱపెట్టినప్పుడు దేవుడు వారి మొఱను విని వారిని విడిపించెను. దేవుడు మనలను కూడా విడుదల చేయును.

ప్రాచీన పురుషునితో జరిగిన వివాహమునుండి విడుదల చేయుటకు దేవునికి ఉన్న ఒకే ఒక మార్గము అతడిని చంపుటై యున్నది. దానినే దేవుడు సిలువపై చేసెను.

రోమా 6:6 లో ''మన ప్రాచీన పురుషుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడెను'' అని చదువుదుము. మనము బాప్తిస్మములో దీనినే సాక్ష్యము ఇచ్చుదుము (రోమా 6:4).

యేసుక్రీస్తు సిలువపై మరణించినప్పుడు మన పాపములను మాత్రమే ఆయనపై వేసికొనుట కాక మన ప్రాచీన పురుషుని కూడా ఆ సిలువపై మరణింపజేసెను. అందువలన మనము యిప్పుడు క్రీస్తును వివాహము చేసికొనుటకు స్వేచ్ఛ కలిగి యున్నాము.

ఇప్పటితో మన సమస్యలన్ని పరిష్కరించబడినవని అనుకోవచ్చును, కాని కాదు. చాలా ఎక్కువ మంది విశ్వాసులు (99% కంటె ఎక్కువ మంది) ప్రాచీన పురుషునితో వివాహము నుండి విడుదలైన తరువాత వారు క్రీస్తును వివాహము చేసికొనుచున్నామనుకొని, వెళ్ళి ధర్మశాస్త్రమును వివాహము చేసికొందురు. దీనినే రోమా 7వ అధ్యాయము మొదటి భాగము చెప్పుచున్నది.

ధర్మశాస్త్రము మరియు ప్రాచీన పురుషునికి వ్యత్యాసమున్నది. ధర్మశాస్త్రము మంచిది, నీతి విషయములో యదార్ధమైన భర్త. అందువలననే మనము అతడిని క్రీస్తు అనుకొని పొరపడుదుము.

కాని ధర్మశాస్త్రము అన్నిటిని ఖచ్చితముగా అడిగే భర్త. అతడు ప్రతి విషయములో పరిపూర్ణతను కోరుచుండును. అతడు, భార్య ఇంటిని ఎంతో పరిశుభ్రముగా ఉంచవలెనని కోరును. పుస్తకములు, వస్త్రములు, చెప్పులు వాటివాటి స్థలములలో ఉంచబడవలెను. ఇంటిలో ఎక్కడా దుమ్ము కనబడకూడదు. ఆహారము సమయానికి సిద్ధముగా నుండవలెను. అల్పాహారము 8:00 గంటలకు, ఒక నిమిషము కూడా ఆలస్యము కాకూడదు. మధ్యహ్న భోజనము 1:01టికి కాక 1:00 కి సిద్ధముగా ఉండవలెను. ఆహారములో సరియైన మోతాదులో ఉప్పు ఇతర మసాలాలు ఉండవలెను. అదే సమయములో ఆయన నీకు నీ పనిలో సహాయము చేయుటకు ఒక వ్రేలిని కూడా ఎత్తడు. ఆయన ఇంటిలోనికి వచ్చునప్పటికి ప్రతిది సిద్ధముగా సరియైన విధముగా ఉండాలని కోరును.

ఈ భర్త (ధర్మశాస్త్రము) నిన్నెప్పుడు కొట్టడు లేక నీకు హాని చేయడు. అలాగే నీవు అతడు అడుగుచున్న వాటిలో ఏమీ తప్పు పట్టలేవు,ఎందుకనగా అవన్ని న్యాయమైనవే. దేవుని యొక్క ధర్మశాస్త్రము అటువంటిది. కాని ఎంతమంది స్త్రీలు అటువంటి పురుషుని వివాహము చేసుకోవాలనుకొందురు?

అటువంటి మనుష్యుని వివాహము చేసికొనిన స్త్రీ పరిస్థితి ఆలోచించండి. ఆమె అతడికి విడాకులు ఇవ్వలేదు. స్త్రీకి ఇద్దరు భర్తలు ఉండకూడదు కాబట్టి యేసుక్రీస్తుని వివాహమాడలేదు. ధర్మశాస్త్రమును వివాహము చేసుకొను వారికి దారుణమైన విషయమేమిటంటే ''ధర్మశాస్త్రము'' ''ప్రాచీన పురుషుని'' వంటి వాడుకాడు, ఈ భర్త పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు. అతడు పదివేల సంవత్సరాలైనా ఎన్నడు మరణించని వ్యక్తిగా కనబడును.

దేవుడు ''ధర్మశాస్త్రమును'' చంపలేడు, ఎందుకనగా అది సంపూర్తిగా పరిపూర్ణమైనది. ప్రాచీన పురుషుడు దుష్టుడు కాబట్టి అతడిని న్యాయముగా చంపుటకు వీలయినది. ''ధర్మశాస్త్రము'' ఎప్పుడు ఏ విషయములో తప్పుచేయనటువంటిది.

ఈ క్రొత్త సమస్యకు ఏమైనా పరిష్కారమున్నదా?

అవును, దేవునికి స్తోత్రము, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి, పరిష్కారమున్నది. దేవుడు ఏమి చేయును? భార్యను చంపును. ధర్మశాస్త్రము మరణించదు కాబట్టి ''నీవు (భార్య) ధర్మశాస్త్రమునకు మృతుడవైతివి'' అని రోమా 7:4 చెప్పుచున్నది.

ఈ రెండవ వివాహము నుండి మనలను విడుదల చేయుటకు ఇది దేవుని మార్గమై యున్నది.

మనము ''క్రీస్తులో'' ఉంచబడుట వలన, ఆయన సిలువపై మరణించినప్పుడు మనము కూడా ఆయనతో మరణించితిమి.

2000 సంవత్సరముల క్రితము నీవు క్రీస్తులో ఎలా ఉండగలిగావనేది అర్ధము చేసికొనుట నీకు కష్టము, అప్పుడు హెబ్రీ 7:9,10 చూడుము. లేవి అబ్రాహాములో ఉండెను. కావున మెల్కీసెదెకుకు అబ్రాహాము దశమభాగము అర్పించినప్పుడు లేవి దానిని అర్పించెనని పరిశుద్ధాత్మ మనకు చెప్పుచుండెను. పరిశుద్ధాత్మయొక్క వివరణ ఇలాగున్నది. లేవి, యాకోబు కుమారుడు కాబట్టి లేవికి సంబంధించిన కొంత యాకోబులో కూడా ఉండెను. యాకోబు, ఇస్సాకు కుమారుడు కాబట్టి లేవికి సంబంధించిన కొంత ఇస్సాకులో కూడా ఉన్నది. ఇస్సాకు, అబ్రాహాము కుమారుడు కాబట్టి లేవికి సంబంధించిన కొంత అబ్రాహాములో కూడా తప్పక ఉండెను!

అదే విధముగా, నీవు నేను జన్మించుటకు ఎంతో కాలము ముందే, మనము దేవుని మనస్సులో ఉంటిమి. మరియు దేవుడు మనలను క్రీస్తులో ఉంచెను, గనుక ఆయన మనందరి యెడల కనికరము చూపుటకు వీలగును. గనుక క్రీస్తు సిలువపై ఎంతో కాలము క్రితము మరణించినప్పుడు మనము ఆయనతో పాటు మరణించితిమి.

వివాహములన్నిటిలో ''మరణము వరకు మేము ఒకరి నొకరు ఎడబాయము'' అని ఉండును. గనుక ఒకమారు మనము మరణించినట్లయితే ఆ వివాహము కొట్టివేయబడును మరియు ముగియును. ఆ విధముగా మనము ఎప్పుడు అన్నిటియందు పరిపూర్ణతను కోరుటే తప్ప దానిని చేయుటకు ఏ మాత్రము సహాjయ అయయా ుపడని భర్త నుండి విడుదల పొందియున్నాము. ఈ వివాహ బంధము నుండి తప్పించుకొనుటకు దేవుడు మనకు ఎంత అద్భుతమైన మార్గమును సిద్ధపరచెను.

మనము ఇప్పుడు ''మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై'' ధర్మశాస్త్ర విషయములో మనము మృతులమైతిమి అని రోమా 7:4 చెప్పుచున్నది. ప్రభువు మనలను యిప్పుడు మృతులలో నుండి లేపెను. గనుక మనము ఎట్టకేలకు క్రీస్తును వివాహము చేసికొనవచ్చును. సువార్తలో ఎంత మహిమకరమైన సందేశమున్నది.

(ఇప్పటికి కూడా ప్రాచీన పురుషునితో లేక ధర్మశాస్త్రముతో వివాహబంధమును కలిగియుండాలని కోరుకొనే ప్రజల మూర్ఖత్వము ఎటువంటిదో ఆలోచించండి.)

ఇప్పుడు యేసుయొక్క ప్రమాణములు ఎటువంటివి? అవి ధర్మశాస్త్రము కంటె తక్కువైనవా? ఆయన మన యింటిని (హృదయమును) అశుభ్రముగా మరియు మురికిగా ఉంచుకొనుటకు ఒప్పుకొనునా? లేదు. ఆయన ప్రమాణములు నిజానికి మరి యెక్కువ ఉన్నతమైనవి.

ధర్మశాస్త్రము మనలను నరహత్య చేయకూడదని చెప్పుచుండగా యేసు చివరకు కోపపడకూడదని చెప్పుచుండెను. ధర్మశాస్త్రము వ్యభిచరించ వద్దని చెప్పుచుండగా, యేసు మనము మన హృదయములలో మొహించ కూడదని చెప్పుచుండెను.

దీని అర్థము మనము పెనములో నుండి మండే పొయ్యిలో పడ్డామనా? ధర్మశాస్త్రము కంటె మరి ఎక్కువైన పరిపూర్ణతను కోరే వానిని ఇప్పుడు వివాహము చేసికొన్నామా? లేదు. ధర్మశాస్త్రమునకు యేసుకు మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. యేసుయొక్క ప్రమాణములు ధర్మశాస్త్రము కంటె ఎంతో ఉన్నతమైనవి, కాని మనము చెయ్యవలసిన పనులన్నిటిలో ఆయన మనలోనికి వచ్చి మనకు సహాయము చేయును. ''మనము కలసి యిల్లు శుభ్రము చేయుదుము, మనము కలసి దుస్తులు ఉతుకుదుము'' అని ఆయన చెప్పును.

అయితే మనము సంపూర్తిగా తప్పిన వారము. మనము ఉదయపు ఫలహారమును 8 గంటలకు చేయవలసి యుండి, సాయంత్రం 4 గంటలకు కూడా తయారు చేయలేక పోయినట్లయితే ఎలా? ప్రభువు అప్పుడు ఏమిచేయును? అప్పటికీ ఆయన మనలను నిందించడు. ''సరే, మనము ఇప్పుడు ప్రారంభించి రేపటికి సాయంత్రం 3:45 గంటలలోపు తయారు చేద్దాం. అటు తరువాత కొంత అభివృద్ధి సాధించుదాం. అలా మరుసటి రోజు మరికొంత. అలా ఒక నాటికి ఉదయం 8 గంటల దగ్గరకు చేరుకొందాం'' అని ఆయన చెప్పును. సంపూర్ణులమగులకు సాగిపోవుట అంటే ఇదే.

ఈ రోజు ప్రభువు మనలను ''ప్రయాసపడి భారము మోయువారలారా నా యొద్దకు రండి'' (అది నీవు ప్రాచీన పురుషుని వివాహము చేసి కొనుటవలన లేక ధర్మశాస్త్రమును వివాహము చేసికొనుటవలన కావచ్చును ). నా కాడి మీ మీద వేసికొనండి(నన్ను వివాహము చేసికొనుము, అన్నియు మనిద్దరము కలసి చేయుదుము) (మత్తయి 11:28-30) అని ఆహ్వానించుచున్నాడు.

అది అంతటితోనే అయిపోలేదు. ఈ మంచి వార్తలో నుండిన శ్రేష్టమైన విషయము మనము ప్రభువుతో కలసి పనిచేయుచున్నప్పుడు 99% పని ఆయన చేయును మరియు 1% పని మాత్రమే మనలను చేయమనును.

యోహాను సువార్తనుండి కొన్ని ఉదాహరణలను పరిశీలించండి:

కానా వివాహములో యేసు చేసిన మొదటి అద్భుతములో, ద్రాక్షారసము అయిపోయినప్పుడు, వివాహమునకు వచ్చిన అతిథులందరు మిగిలిన సమయమంతా ఉపవాస ప్రార్థనలో గడపవలెనని యేసు సూచించలేదు. లేదు. పరిసయ్యులలో అనేకులు అటువంటి సలహాను ఇచ్చియుండెడివారు. ప్రజల జీవితాలనుండి యేసు వారి ఆనందమును ఎప్పటికి తీసివేయునని కొందరు విశ్వాసులు తలంచుదురు. కాని ఆయన కానాలో ఏమి చేసెనో చూడండి (యోహాను 2). ఆ ఆరు రాతి బానలు కలిపి 700 లీటర్ల నీటిని పట్టగలవని మనము యోహాను 2:6లో చదివెదము. 700 లీటర్లు 3000 గ్లాసులతో సమానము. గనుక ఆ వివాహ వేడుకలో 300 మంది అతిథులు ఉన్నట్లయితే, యేసు అక్కడున్న వారందరికి 10 అదనపు గ్లాసుల ద్రాక్షారసము చేసెను!! ఆ వివాహముకు వచ్చిన అతిథులందరు ఆనందించుటకు ఆయన నిశ్చయముగా సహాయపడెను. మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాని యేసు ఆ అద్భుతమును ఎలా చేసెనో గమనించండి. ఆయన శూన్యము నుండి ఆ ద్రాక్షారసమును చేయగలిగియుండెను-కాని అది ఇతరులతో కలిసి చేసిన పనిగా కాక, ఆయన ఒక్కడే చేసిన పనిగా ఉండేది. గనుక ఆయన పరిచారకులను ఆ బానలను నీటితో నింపమని అడిగెను. అప్పుడు వాటిని ఆయన ద్రాక్షారసముగా మార్చెను. ఆయన ఆ పరిచారకులను సుళువైన భాగమును (1%) చేయమని అడిగెను ఆయన మాత్రము కష్టమైన భాగమును (99%) చేసెను.

యేసు 5000 మందికి ఆహారము ఇవ్వదలచినప్పుడు ఆయన శూన్యమునుండి రొట్టెలను సృష్టించగలిగి యుండేవాడు (యోహాను 6) అట్లయితే దానిని ఒక్కడే చేసియుండెడివాడు. గనుక ఆయన ఆ పిల్లవాడిని తన దగ్గరున్న వాటిని ఇవ్వమని అడిగెను. అవి ఐదు రొట్టెలు, రెండు చేపలు. అప్పుడు ప్రభువు జన సమూహమునకు భోజనము సిద్ధపరచెను. ఆ పిల్లవాడు 1% చేసాడు. యేసు 99% చేసారు.

ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి యేసు మరియు తాను కలిసి పది వేల మందికి ఆహారము సిద్ధపరచామని తన అమ్మతో చెప్పియుండవచ్చు. అతడు క్రమము మార్చి ''నేను మరియు యేసు'' పదివేల మందికి ఆహారము పెట్టితిమని కూడా చెప్పియుండవచ్చును! (ఎక్కువ మంది విశ్వాసులు అలాగే ఉందురు. ప్రభువు వారిని ఎక్కడైనా, ఎప్పుడైనా వాడుకొన్నప్పుడు వారు ప్రభువు కొరకు ఏమి చేసిరో వారు ప్రభువు కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించిరో, ఎంతగా సువార్తను ప్రకటించి సాక్ష్యమిచ్చితిరో అను విషయమును ఇతరులకు చెప్పకుండా ఉండలేరు).

యేసు ఆ గ్రుడ్డి వానిని స్వస్థపరచినప్పుడు (యోహాను 9) ఆయన మరల ఆ గ్రుడ్డి వానిని సుళువైన పనిని చేయమనెను. అది ''సిలోము''అను కోనేటికి వెళ్లి తన ముఖమును కడుగుకొనుట. అతని గ్రుడ్డి కన్నులను తెరచే కష్టమైన పనిని అప్పుడు యేసు చేసెను. యేసు లాజరును మృతులలోనుండి లేపినప్పుడు అక్కడున్న వారిని సుళువైన పనిని చేయమని అడిగెను. అది రాతిని దొర్లించుట. అప్పుడు ఆయన లాజరును మృతులలోనుండి లేపే కష్టమైన పనిని చేసెను (యోహాను 11).

రాత్రంతయు శ్రమపడి చేపలను పట్టలేని తన శిష్యుల యొద్దకు ప్రభువు వచ్చినప్పుడు వారు ఏమి చేయకుండానే ఆయన వారి పడవలను చేపలతో నింపగలిగియుండేవాడు. కాని ఆయన అలా చేయలేదు. ఆయన వారిని సుళువైన దానిని చేయుమని (వారి వలను సముద్రములోనికి విసరమని) చెప్పెను. అప్పుడు ఆయన వారి వలను చేపలతో నింపెను (యోహాను 21).

సంతోషకరమైన వివాహము యొక్క గొప్ప రహస్యము ''కలసి పని చేయుట'' అది క్రీస్తుతో మన వివాహ విషయములో యధార్థమైయున్నది. మనము క్రీస్తును వివాహము చేసికొనినప్పుడు, ఆయన ఎల్లప్పుడు మనతో ఉండును. కాబట్టి మనము ఎల్లప్పుడు ప్రతిది కలసి చేయుదుము. మనము వివాహ భాగస్వామితో ప్రతిపని కలసి చెయ్యలేము ఎందుకనగా, భర్త ప్రతి రోజు పనికొరకు బయటకు వెళ్లవలసి యుండును. కాని ప్రభువు విషయములో అటువంటి సమస్యలేదు. మనము ప్రతిపని అన్ని వేళలా ఆయనతో కలసి చేయగలము.

అటువంటి అద్భుతమైన భర్తను వివాహము చేసికొనుటకు యిష్టపడని వారెవరు? ఇది నిజమైన క్రైస్తవత్వము మరియు నిజమైన సువార్త.

నీవు ప్రాచీనపురుషుని విడిచిపెట్టుటకు యిష్టపడుచున్నావా? ధర్మశాస్త్రానుసారముగా జీవించు విషయములో కూడా మరణించుటకు యిష్టపడుచున్నావా? యేసును మాత్రమే వివాహమాడుటకు యిష్టపడుచున్నావా?

నీవు ఒంటరిగా జీవించలేవు. నీవు అవిశ్వాసివైనట్లయితే నీకు ప్రాచీనపురుషునితో వివాహమైయున్నది మరియు ఒకనాడు నిత్యత్వంలో కొనసాగకుండునట్లు నీవు సాతానును వివాహం చేసికొందువు.

లేక నీవు ఒక ''విశ్వాసి'' నని చెప్పుకోవచ్చు, కాని ఆత్మీయమైన వ్యభిచారముతో జీవిస్తూ నీలో నుండిన ప్రాచీనపురుషునితో వ్యభిచరిస్తూ, నీ దురాశలను మరియు లోకమును ప్రేమిస్తూ వాటికి లోబడిపోయి యుండవచ్చును (యాకోబు 4:4 ).

లేక నీవొక విశ్వాసిగా ధర్మశాస్త్రమును వివాహము చేసికొని యుండవచ్చును. దీనికి ఒక రుజువు, నీవు నీ యొక్క కొద్ది మంచి చెడు ప్రమాణములతో ఇతరులను తీర్పు తీర్చుట కావచ్చును. నీ జీవితము ''పట్టుకొనవద్ద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు'' (కొలొస్స 2:21)మొదలైన నియమ నిబంధనలతో నిండి యుండవచ్చును. మరియు ఇతరులు నీవు పెట్టిన ఈ నియమాలను పాటించలేదని వారిని నీవు విమర్శించవచ్చును. నీవు బంధకాలలో నుండి ఇతరులను కూడా బంధకాల లోనికి తెచ్చుచున్నావు.

నీ ప్రాచీన పురుషుని విడిచిపెట్టి నీ యొక్క అక్షరానుసారమైన మత పోకడలను తీసివేసుకొనుము, యేసును వివాహము చేసికొని ప్రతిది ఆయనతో కలసిచేయుము. ఈ రోజు సత్యము నిన్ను విడుదల చేయనిమ్ము. ''ధర్మశాస్త్రము అంతటి గొప్ప మహిమతో మొదలైనయెడల, మనకు పరిశుద్ధాత్మ జీవము నిచ్చునప్పుడు, ఇంకా ఎంతో గొప్ప మహిమను ఆశించమా?'' (2కొరిందీ¸ 3:7,8-లివింగు బైబిలు).

అధ్యాయము 7
దేవుడు సంఘములో పరిసయ్యులను బహిరంగపరుచు పద్ధతులు

''యేసు-వారి హృదయ కారిÄన్యమునకు దు:ఖపడి, కోపముతో వారిని కలయచూచెను'' (మార్కు 3:5).

యేసుప్రభువు ఒక సమాజ మందిరములో ప్రవేశించి ఒక ఊచ చెయ్యి (పోలియో) గల వానిని చూచినప్పుడు అతడిని స్వస్థపరచినట్లయితే ఆయనను తప్పుపట్టుటకు సమాజ మందిరపు నాయకులు ఎదురు చూచుచున్నప్పుడు ఈ సంఘటన జరిగెను.

యేసుప్రభువు ముఖముపై జనులు ఉమ్మివేసినప్పుడు లేక ఆయనను 'పిచ్చివాడు', 'సమరయుడు', 'సాతాను' మొదలైన పేర్లతో పిలిచినప్పుడు ఆయనెప్పుడు కోపించలేదు. కాని జనులు తోటి మానవునియొక్క అవసరతను పట్టించు కొనకుండా యుండినప్పుడు మరియు ఇతరులను వారి మోడుబారినస్థితి నుండి బాగుపడుటకు ఆటంక పరచినప్పుడు ఆయన కోపించెను.

మనము ''కోపపడవచ్చు కాని పాపము చేయకూడదు'' (ఎఫెసీ 4:26) అని ఆజ్ఞాపింపబడితిమి. పాపము చేయకుండా కోపపడుట అనగా యేసు ప్రభువు ఈ భూమిపై ఉన్నప్పుడు ఏ విషయాలకై కోపపడెనో వాటి విషయం మాత్రమే కోపపడుట. వేరే ఎటువంటి కోపమైనా పాపమే. ఇతరులు మనలను గాని మన కుటుంబములను గాని చూచు పద్ధతి గూర్చి మనము ఎప్పుడు కోపించకూడదు. కాని సంఘములోని పరిసయ్యులు ఇతరులను చెడుగా చూచునప్పుడు కోపపడవలెను. ''నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము''. తమను తాము సమర్థించుకోలేని వారిని సమర్థించుము అని బైబిలు చెప్పుచున్నది (సామెతలు 31:8,9).

బీదలయెడల, నిస్సహాయుల యెడల జనులు కరిÄన హృదయముతో ప్రవర్తించినప్పుడు కోపించుట క్రీస్తును పోలిన పద్దతి. నీ యెడల మరియు నీ కుటుంబము యెడల జనులు కరిÄన హృదయము చూపినప్పుడు కోపించుట సాతానుకు సంబంధించిన పద్ధతి. మనము క్రీస్తును పోలిన కోపమునకును సాతానును పోలిన కోపమునకును మధ్యనున్న తేడాను తేటగా గ్రహించవలెను.

పరిసయ్యుల యొక్క మతము ప్రధానముగా ఎక్కువ కూటములకు వెళ్లుట, ప్రార్ధించుట, పాటలు పాడుట, గొంతెత్తి ప్రసంగములు చేయుట మరియు చప్పట్లు కొట్టుట, చేతులు పైకెత్తుట వంటి మనుష్యులను ఆకట్టుకొను వాటితో నిండియున్నది (మత్తయి 6:5,6). ఈనాడు కూడా క్రైస్తవులు అనేకులు అలాగే ఉన్నారు.

కాని మన ఆత్మానుసారత మనము బహిరంగముగా పాడు పాటల లేక ప్రార్థనల యొక్క శబ్దస్ధాయిని బట్టి కొలవబడదు. దానికి బదులు దేవుని యెడల మనకున్న భక్తి యొక్క లోతును బట్టి మరియు మన చుట్టూ ఉండిన వారి అవసరముల గూర్చి మనము ఎంతగా ఆలోచన కలిగి యుంటిమో అను దానిని బట్టి అది కొలవబడును.

దేవుని స్వభావము ప్రేమయై యున్నది. మనలో ఎంత ఎక్కువ షరతులు లేని ప్రేమ యుండునో, అంత నిజమైన భక్తి యుండును. మన చుట్టూ యున్న వారిలో ఎందరో వారి జీవితములలో ఒక విధముగానో లేక మరొక విధముగానో ఎండిపోయి (బలహీనపడి)న వారుందురు. యేసు ప్రభువు వారి యెడల మన కున్న వైఖరి గమనించుట ద్వారా మనలను పరీక్షించును.

విశ్వాసుల యొక్క శ్రమలను వారిని తీర్పు తీర్చువారి యొక్క దుష్టత్వమును బహిరంగ పరచుటకు దేవుడు ఉపయోగించుకొనును.

ఒకసారి యేసు ప్రభువు యొక్క శిష్యులు, ఒకడు పుట్టుకతో గ్రుడ్డివాడుగా నుండుట చూచి, అతడి యొక్క గ్రుడ్డితనము అతడి పాపముల వలన కలిగినదా లేక అతడి తల్లిదండ్రుల పాపముల వలన కలిగినదా అని అడిగిరి. దానికి యేసు ప్రభువు ఆ రెండింటి వలనా కాదు అని జవాబిచ్చెను (యోహాను 9:2,3). రోగము ఒకని పాప ఫలితముగా గాని లేక అతడి తల్లిదండ్రుల పాప ఫలితముగా గాని కలుగును అని పరిసయ్యులు బోధించిన బోధ యొక్క ప్రభావములో శిష్యులు ఉండిరి. జనులు ఇతరులను అటువంటి తీర్పులు తీర్చునప్పుడు ఈనాడు కూడా యేసు ప్రభువు కోపించుచున్నారు. సమాజమందిరములోని పరిసయ్యులు ఈ ఊచచెయ్యి గల వ్యక్తి పాపము చేసెనని భావించియుందురు. వారు పరిశుద్ధులు మరియు ఉపవసించి ప్రార్థించినందున వారికి ఊచచేతులు లేవని వారు భావించియుందురు! ఆ వ్యక్తి తన దశమ భాగము క్రమం తప్పకుండా చెల్లించనందున రోగము కలిగియుండెనని భావించియుందురు! బహుశా పాపము చేసినది అతని తల్లిదండ్రులేమో!

తండ్రుల పాపములను బట్టి బిడ్డలు శిక్షింపబడరు

తల్లిదండ్రుల పాపములను బట్టి దేవుడు వారి పిల్లలను శిక్షంచును అనే తప్పుడు భావన అనేకులలో ఉన్నది. అనేకమంది విశ్వాసులు కూడా ఇటువంటి అన్యుల యొక్క అభిప్రాయము కలిగియున్నారు మరియు వారి నమ్మకమునకు వాక్యానుసారమైన అధారమున్నదని అనుకొందురు. ఎందుకనగా ''మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుదును'' (నిర్గమ 20:5; ద్వితీయో.5:9) అని దేవుడు చెప్పలేదా అని వారందురు.

అవును, దేవుడు అలా చెప్పెను. కాని నీవు జాగ్రత్తగా చదివినట్లయితే, దేవుడు తనను ద్వేషించు వారి పిల్లలను శిక్షిస్తానని చెప్పెను కాని జారి పడిపోయిన యధార్థవంతులైన విశ్వాసుల పిల్లలను కాదు.

కాని అక్కడ దేవుడు చెప్పిన వాక్యము ఇశ్రాయేలులో అక్షరాను సారముగా ఆజ్ఞను పాటించు వారిచేత తప్పుగా వాడబడెను. పైనచెప్పిన ఆ వాక్యమును వారు ఇతరులను కొట్టుటకు మరియు శిక్షించుటకు సుత్తివలె వాడుచుండెడి వారు. గనుక దేవుడు సీనాయి కొండపై ఆ మాటలు చెప్పిన 1000 సంవత్సరముల తరువాత అపార్ధము చేసికొనబడిన ఆ మాటల యొక్క అర్థమును ప్రవక్తయైన యెహెజ్కేలు ద్వారా సరిచెయ్యవలసి వచ్చెను.

యెహెజ్కేలు 18:2లో దేవుడు ''తండ్రులు ద్రాక్షాకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు?'' అని చెప్పెను. ఇంకా ప్రజల కుండిన తప్పుడు భావన సరిచేయుట కొరకు దేవుడు ఇంకా వారితో, ''పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును'' అని చెప్పెను (యెహెజ్కేలు 18:20).

అది స్పష్టముగా చెప్పబడిన మాట. కాని 500 సంవత్సరముల తరువాత, యేసు ప్రభువు భూమి పైకి వచ్చిన తరువాత కూడా ఆయన శిష్యులు ఆయనతో ఎంతో సమయము గడిపి ఆయన బోధలు ఎంతగానో గ్రహించియుండియు, ఆ గ్రుడ్డివాడు అతడి పాపముల వలననా లేక అతడి తల్లిదండ్రుల పాపము వలన శ్రమ అనుభవించుచుండెనా అని అడిగేటంతగా జనుల ఆలోచనలను ఇశ్రాయేలు దేశములో నుండిన పరిసయ్యులు ప్రభావితము చేసియుండిరి.

పరిసయ్యతత్వము అంత తేలికగా చనిపోదు. మనము ఇతరులను తీర్పు తీర్చునట్లు మరియు వారిపై ఘోరమైన పర్యవసానములను ఊహించుకునే నైజముతో జన్మించిన వారము.

యోబు యొక్క శ్రమలు అతడి స్నేహితులను పరీక్షించెను

యోబుయొక్క కథను చూడండి. యోబుయొక్క బోధకులైన ముగ్గురు స్నేహితులు ఎలీఫజు, బిల్దదు మరియు జోఫరు పై దేవుని యొక్క కోపము ఎందుకు రగులు కొనెను (యోబు 42:7)? ఎందుకనగా వారు దేవుని గూర్చి చెప్పిన అన్ని విషయములలో ఏ ఒక్కటి కూడా నిజానికి నీవు తప్పు పట్టలేవు. ప్రతి విషయము సరిగానుండినట్లు కనబడును.

మరొక ప్రక్క వారికి యోబు యిచ్చిన జవాబు చదివినట్లయితే, అది అనేక విషయములను గూర్చి దేవున్ని యోబు తన యొక్క నిష్టూరతతో మరియు తన స్థితికి తనను నిందించుకొంటూ దేవునిపై నిందారోపణచేసినట్లు మనము చదివెదము. అప్పుడప్పుడు మాత్రమే విశ్వాస పూరితమైన మాటలు అతడు పలికెను. అతడు దేవుని గూర్చి పలికిన మాటలలో ఎక్కువ పూర్తిగా తప్పైనవిగా మరియు దుష్టమైనవిగా ఉండెను.

అయినప్పటికి అదంతా అయిన తరువాత, యోబు ఆయన గూర్చి సరిగా మాటలాడెననియు మరియు ముగ్గురు బోధకులు తప్పు విషయములు చెప్పెననియు దేవుడు చెప్పారు. ఆ బోధకులు ఎక్కడ తప్పు చేసారు?

యోబు తన ఆస్తిని, బిడ్డలను మరియు ఆరోగ్యమును పోగొట్టుకొనుటకు కారణము అతడి జీవితములో ఉండిన ఏదో ఒక రహస్యపాపమును బట్టి దేవుని తీర్పు అతడిపై వచ్చెనని వారు తీర్పు తీర్చుట వారి తప్పైయున్నది. వారి కుండిన ''వివేచన'' అనునది పూర్తిగా తప్పైయుండెను. వారు ఒక దైవజనుని బయటకు కనబడిన దానిని బట్టి అక్రమముగా తీర్పు తీర్చిరి. దేవుని కోపము వారిపై ఎంతగా రగులు కొనెనంటే, వారు క్షమింపబడవలెనంటే, వారు వెళ్లి యోబును (వారు ఎవరి యెడల తప్పు చేసారో వానిని) తమ కొరకు ప్రార్ధించమని అడుగమని దేవుడు వారితో చెప్పెను. ఈ ముగ్గురు బోధకులు చేసినది మీరెప్పుడైనా చేసారా? అలా అయితే, దేవుని కోపము మీకు వ్యతిరేకముగా కూడా నిశ్చయముగా మండుచున్నది. ఇతరులను ఎప్పుడు తీర్పు తీర్చకుండుటయే సురక్షితమైన మార్గము. ''రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును'' (ద్వితీయో. 29:29). వాటిని తీర్చుతీర్చుటను మనము ఆయనకే విడిచిపెట్టవలెను.

మరియు దేవుడు యోబుయొక్క అనేకమైన చెడు మాటలను పట్టించుకొనకుండా విననట్లు ఎందుకు ఉండిపోయెను? అన్నింటికంటే మొదటగా దేవుడు యోబు యొక్క హృదయములో యధార్ధతను చూచెను మరియు యోబు పలికిన ఎన్నో కరిÄనమైన మాటలు అతడు అనుభవించుచున్న రోగము మరియు విచారము యొక్క ఫలితము వలనని దేవుడు చూచెను. ఆ మాటలు నిజముగా తన హృదయములో అనుకొనినవి కాదు. అయినప్పటికి యోబు చెప్పినది తప్పే.

అయితే చివరగా దేవుడు ఒక న్యాయమైన కారణమును బట్టి యోబుయొక్క మాటలను పట్టించు కొనకుండా యుండెను. యోబు తనయొక్క బుద్ధిహీనతను గ్రహించిన వెంటనే, తన మాటలను ''వెనుకకు'' (పశ్చాత్తాపపడెను) తీసుకొనెను (యోబు 42:6) అందువలన అవి దేవుని సన్నిధి నుండి వెంటనే తుడిచి వేయబడెను. గనుక అతడు మాటలాడిన మంచిమాటలు మాత్రమే మిగిలి యుండెను.

దేవుని యొక్క క్షమాపణ మరియు పాపవిముక్తి యొక్క శక్తి అంతగా మానవుని గతమును తుడిచి వేయును. సువార్త యొక్క శుభవార్త ఏమనగా మనము దేవునికి మరియు మనుష్యులకు వ్యతిరేకముగా పలికిన మాటలను వెనుకకు తీసుకొని ఉపసంహరించు కొనవచ్చును. మరియు అవి మన జీవితపు అధ్యాయముల నుండి తుడిచి వేయబడును. కాని అది మనము ఇప్పుడే బ్రతికి యుండగానే-చనిపోకముందే చేయవలెను. మనము ఎంత యధార్ధవంతులమైతే అంత త్వరగా మనము దానిని చేయుటకు తొందర పడుదుము. యోబుయొక్క నమోదు చేయబడిన మాటలలో ఒకరు కేవలము ఇటువంటి మాటలనే ఇప్పుడు చదువగలరు: ''నాకున్నదంతయు ప్రభువే ఇచ్చెను, తీసుకొనుటకు అవి ఆయనవే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక......మనము దేవుని నుండి మేలును మాత్రమే పొందుదుమా; కీడును అనుభవింపతగదా?.....ఆయన నన్ను చంపినను, ఆయన యందు నేను విశ్వాసముంచెదను....నా విమోచకుడు సజీవుడు....నాకు జరుగుచున్నదంతయు ఆయనకు తెలియును....నేను ఏమి కానివాడను. నా నోటి మీద నా చేతినుంచి మౌనముగా నుండెదను....నన్ను నేను అసహ్యించునొని బూడిదెలోను ధూళిలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను'' (యోబు 1:21; 2:10; 13:15; 19:25; 23:10; 40:4; 42:6-లివింగు బైబిలు). ఇవన్నియు మంచి మాటలు. మరియు ఇవి మాత్రమే నమోదు చేయబడెను. కాని యోబు ఇంకా అనేకమైన మాటలు చెప్పెనని మీరనవచ్చును.అవి బైబిలులోని యోబు గ్రంథములో ఉన్నవి. కాని ''పరలోకములో యోబు జీవితమును గూర్చి నేను వ్రాసిన గ్రంథములో దానిని నాకు చూపించుము'' అని దేవుడు అడుగును. మీరు దానిని చూచినప్పుడు, యోబు మాట్లాడిన చెడు మాటలలో ఒక్కటి కూడా దానిలో వ్రాయబడియుండుటను మీరు కనుగొనలేరు. అవన్నియు తుడిచిపెట్టబడెను. నిజమైన మారుమనస్సు మరియు కడుగబడుట యొక్క ఫలితము ఇదే.

నీవు దేవునికి వ్యతిరేకముగా మాటలు మాట్లాడితివా? వాటిని దేవునితో ఒప్పుకొని ఆయన క్షమాపణ కొరకు ఇప్పుడే అడుగుము. ఆయన నిన్ను వెంటనే నీతిమంతునిగా తీర్చును. దేవుడు ఎంత మంచివాడు మరియు ఆయన మనలను నిర్దోషులుగా తీర్పు తీర్చు పద్దతి ఎంత ఆశ్చర్యకరమైనది.

నీవు ఇతరుల గూర్చి చెడుగా మాట్లాడావా, అవి చివరకు అనుకోకుండా లేక ఒత్తిడికి గురియైకావచ్చును. అవి ఎవరికి సంబంధించినవి అయితే వారి యొద్ద వెంటనే ఒప్పుకో మరియు వారిని క్షమాపణ అడుగుము. నీవు మనుష్యులను క్షమాపణ అడుగక పోయినట్లయితే నీవు నిర్దోషిగా తీర్పు తీర్చబడవు. వారు నిన్ను క్షమించారా లేదా అనేది అప్రస్తుతం. వారు నిన్ను క్షమించక పోయినట్లయితే, వారికి అటువంటి కనికరము లేక పోవుటను బట్టి, చివరి దినాన దేవుడు వారి తలలపైకి అటువంటి కనికరము లేని తీర్పును తీసుకు వచ్చును (యాకోబు 2:13). కాని నీవు క్షమాపణ అడుగుట ద్వారా నీకు వ్యతిరేకముగా గ్రంధములో నమోదు చేయబడిన వాటిని తుడిచి వేసుకొనగలవు.

నీవు ఒక పరిసయ్యుని లాంటి వానితో సమాధానపడ కోరినప్పుడు, అతడు దానికి యిష్టపడకపోయిన యెడల నీ బాధ్యత తీరిపోయినది. అతడు నిన్ను క్షమించునట్లు చేయుటకు నీవు ఎల్లప్పుడు అతడి తలుపు నొద్దపడి పొర్లాడనక్కర్లేదు. అతడి మట్టుకు అతడిని విడిచిపెట్టుము, దేవుడు అతడి విషయం చూచుకొనును. నీవు అతడి విషయం మరచిపోవచ్చును.

యోబు తాను అనుభవించిన శ్రమలను బట్టి పవిత్రుడైనాడని మనకు తెలియును. అతడి శ్రమలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశ్యము అది. అయితే దానితో పాటుగా ఇంకొకటి కూడా జరిగినది. దానికొక ఉపఫలము కూడా ఉండెను. నీతిమంతుడైన యోబు శ్రమల ద్వారా దేవుడు అతడిని దర్శించిన మతానుసారమైన వారి యొక్క దుష్టత్వము బయట పెట్టెను. ఈ రోజున అనేకులు నీతిమంతులపై నేరారోపణ చేయునట్లే వారు నిజము తెలుసుకోకుండా యోబు మీద నేరారోపణ చేసారు. ఎక్కువగా జనులు చేయు నిందారోపణలు వదంతులపై ఆధారపడినవి మరియు ప్రత్యక్షముగా తెలిసినవాటి మీద ఆధారపడునవి చాలా అరుదుగా నుండును.

యేసు ప్రభువు ఎప్పుడైనను వదంతి (ఆయన వినిన దానిని బట్టి) విని తీర్పు తీర్చేవారు కాదు. అంతే కాక ఆయన ఇంకా తీవ్రముగా ఉండేవారు. ఆయన ఎప్పుడు ఎవ్వరినీ ఆయనకు స్వయముగా తెలిసిన (ఆయన కన్నులు చూచిన వాటిని- యెషయా 11:3) దానిని బట్టి కూడా తీర్పు తీర్చేవారు కాదు. ఈ విషయములో లోకములో చాలా చాలా తక్కువ మంది విశ్వాసులు యేసు ప్రభువువలె వేరైన వారుగా యుందురు.

పరిసయ్యులు ఇతరులను తీర్పు తీర్చుటకు వారిని చాలా దగ్గరగా పరిశీలించుదురు

మార్కు 3:2లో, యేసు ప్రభువు సమాజమందిరములో ఆరోజు ప్రవేశించినప్పుడు, ఆయన శత్రువులు ''ఆయనను కనిపెట్టుచుండిరి'' అని చెప్పబడినది. పరిసయ్యులు ఎప్పుడు అంతే, వారు ఇతర విశ్వాసుల జీవితములను ఏదొక తప్పు పట్టుటకు చాలా చాలా దగ్గరగా పరీక్షించుదురు.

వారు సహోదరీల చీరెలు విశ్వాసులు ధరించు ''సామాన్య ప్రమాణము''లకు తగినట్లుగా ఉన్నవో లేదో తెలుసుకొనుట కొరకు, వారు ఏమి ధరించుకొన్నారో జాగ్రత్తగా గమనించుదురు. వారి శరీరములపై ఏమైనా నగలు ఉన్నవా లేక వారి ముఖములపై పెదవులకు రంగుయుండెనా మరియు వారి తల వెంట్రుకలు పొడవుగా ఉన్నవా అనునవి చూచుటకు పరిశీలించుదురు. వారు విశ్వాసుల ఇళ్లలో టి.వి.లు గాని లేక ఏమైనా లోకసంబంధమైన వస్తువులు గాని ఉన్నవేమో అని గమనించుదురు. వారు ఇతరుల యొక్క పిల్లలను వారిలో తప్పు పట్టుటకు జాగ్రత్తగా గమనించుదురు. వారు పైకి ఏమీ అనక పోయినా, వారి మనసులలోని అభిప్రాయములతో వారు తీర్పు తీర్చుదురు. వారు ఏదొక తప్పును పట్టుకొనుట కొరకు విశ్వాసులు చెప్పు వాటిని జాగ్రత్తగా వినుదురు.

నీకు ఎంతగా ఎవరిపైనైనా కోపము లేక అసూయ ఉంటే, అంతగా వారి జీవితమును ఏదైనా తప్పు పట్టుట కొరకు గమనించుటకు నీవు యిష్టపడుదువు. వారి జీవితములో లేక వారి భార్యల వస్త్రధారణలో లేక వారి ఇళ్లలో లేక వారి కుటుంబాలలో ఎదో ఒక చిన్న తప్పే ఉండవచ్చును. కాని నీ హృదయము యొక్క దుష్టత్వమును బయటపెట్టుటకు దేవుడు దానిని వాడుకొనును.

దేవుడు విశ్వాసుల యొక్క వైఫల్యాలను మరియు బలహీనతలను వారిని తీర్పు తీర్చువారి దుష్టత్వమును బయట పెట్టుటకు ఉపయోగించును.

''నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులును అగుదురు.... అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా?'' (యిర్మీయా 5:26,29) అని యెహోవా చెప్పుచుండెను.

పరిసయ్యులు, ''ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచియుండిరి'' (లూకా 11:54). వేరొక మారు ''వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి'' (మార్కు 12:13). ''ఇతరులను కనిపెట్టు'' ఆ పరిసయ్యుల యొక్క వారసులు ఈ రోజున క్రైస్తవలోకములో సమృద్ధిగా ఉన్నారు. మనము తోడేళ్ల మధ్య గొఱ్ఱెపిల్లల వలే వారి మధ్య మెదులునప్పుడు ''పాములవలే వివేకులుగా'' ఉండవలెను (మత్తయి 10:16).

పరిసయ్యునిగా త్వరితగతిని మారుటకుండిన మార్గములలో ఒకటి ''ఇతర విశ్వాసులను జాగ్రత్తతతో దగ్గరగా గమనించుట'' నీవు పరిసయ్యునిగా మారకూడదనుకొంటే, ఇతరులను దగ్గరగా గమనించుట మానుము ఎందుకనగా అది ఎప్పుడు వారికి సహాయము చేయాలనే ఉద్దేశ్యముతో జరుగదు, కాని ఎల్లప్పుడు వారిని తీర్పు తీర్చుట కొరకే అట్లు జరుగును.

ఏమైనప్పటికి ఇక్కడ చెప్పిన ఏవో కొన్ని పరిసయ్య లక్షణములను మన జీవితము నుండి తీసివేసికొనినంత మాత్రమున పరిసయ్యతత్వము తీసివేసికొనలేము. దాని గూర్చిన చిట్టా ముగింపు లేనిది. పరిశుద్ధాత్ముడు మనలో విప్లవాత్మకమైన మార్పు చేయునట్లు మనము ఒప్పుకొంటే తప్ప, మనము దీనినుండి విడుదల కాలేము. మనము మన జీవితాలలో నుండి పరిసయ్యతత్వము యొక్క ఒక లక్షణమును తీసివేయవచ్చు కాని ఇంకను ఆ రోగము మనలోనే ఉండిపోయే అవకాశమున్నది. నీవు వేరొక సహోదరుని పరిచర్యనుండి వినని, పరిసయ్యుల యొక్క ఒక లక్షణమును నీ జీవితములో పరిశుద్ధాత్మ నీకు చూపించిన అనుభవము నీకు ఒక్కసారైన కలిగినదా? అలా కాని యెడల నీవు నూతనమైనదియు, సజీవమైనదియుయైన మార్గములో నడుచుట లేదు. నీవు మంచి చెడ్డల జ్ఞానమునిచ్చు చెట్టుపై ఆధారపడి జీవించుచున్నావు- అది వేరొకరు బయలు పరచిన మంచి చెడు. ఒక సహోదరుడు తనపై తనకు వెలుగుకలిగి దానిని కూటములో పంచుకొనుట వలన నీకు వెలుగు కలిగెను. సందేహము లేదు, నీవు యధార్థమైన వానివి గనుక చెప్పబడిన దానిని తొలగించుకొందువు. కాని నీవు వేరొకరి మంచి చెడ్డల జ్ఞానము బట్టి జీవించుచున్నావు మరియు అది ఎప్పుడు మరణమును తెచ్చును. నీవు జీవవృక్షము (పరిశుద్ధాత్మ) వలన జీవించుట నేర్చుకోవలెను.

గాయపడిన వ్యక్తి త్రోవను పోవువారికి పరీక్ష

కనికరము పరిసయ్య తత్వమునకు చాలా ముఖ్యమైన విరుగుడు. ఇతరుల యెడల జాలి చూపుట మనకు హాని చేసిన వారిని లేక మనకు చెడు చేసిన వారిని క్షమించుట కంటె ఎక్కువైనది. దాని అర్ధము అవసరములో నున్నవారికి మంచి చేయుట.

మంచి సమరయుని ఉపమానములో యేసు ప్రభువు ''జాలి'' అనగా ఏమిటో వివరించారు (లూకా 10:25-42 భాగములో 36 వ వచనములో ''జాలి'' అను మాటను ఉపయోగించుట చూడండి).

అక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు (బైబిలు బోధించువాడు) నిత్య జీవమునకు వారసుడనగుటకు ఏమి చేయవలెనని అడుగుట చదువుదుము. పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించుట ద్వారా మరియు ఒకని పొరుగు వానిని తనవలె ప్రేమించుట ద్వారా అట్లగునని యేసు జవాబిచ్చెను. కాని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు (ఈనాటి అనేక బైబిలు పండితులవలె) తాను నీతిమంతుడైనట్టు కనపరచు కొనగోరి (కొన్ని రకములైన ప్రజల యెడల తన ప్రేమహీనతను సమర్థించుకొనుటకు) (29వ) పొరుగువాడు అనగా ఎవరు అని అడిగెను. అతడు తనను తాను నీతిమంతునిగా చూపించుకొనుట, అతడు పరిసయ్యుడని సూటిగా తెలియజేస్తుంది. అతడి ప్రశ్నకు యేసు ప్రభువు ఒక ఉపమానముతో బదులిచ్చారు.

ఆ ఉపమానములో మనము మొదట, ఒక యాజకుడు (దేవుని సంఘములో ఒక పెద్ద) త్రోవ ప్రక్కన దెబ్బలతో పడియుండిన వానిని పట్టించుకొనక పోవుట చదువుదుము. అతడు అక్కడ ఒకడు మానవ అవసరతలో ఉండుట చూచి కూడా పట్టించుకొనలేదు. దేవుడు ఆ మనుష్యుని జీవితములో నుండిన ఏదో ఒక రహస్య పాపము గూర్చి శిక్షించుచుండెనని బహుశా అతడు అనుకొనియుండవచ్చును లేక ఆ మనుష్యుడు రాత్రి వేళ తోడు లేకుండా ప్రయాణించుట వలన అలాగున జరిగియుండవచ్చునని తప్పు పట్టియుండ వచ్చును. అతడు సరిగ్గా యోబుకు బోధ చేసిన ముగ్గురు బోధకులవలె యుండెను. జనులు శ్రమపడినప్పుడు వారికి సహాయపడుటకు బదులు, వారు ఏవేవో తప్పులు చేసియుందురని ఊహించుకొని వారికి వాటిని ఎంత తొందరగా ఆపాదిస్తాము. మానవ అవసరతకు మనము ఎంత విముఖముగా ఉన్నాము. ''నేను ఆకలిగొని యుంటిని మీరు తినుటకు నాకేమి ఇవ్వలేదు, నేను దప్పిక గొనియుంటిని మీరు నాకు దాహము తీరుటకు ఏమీ ఇవ్వలేదు, నేను దిగంబరినై యుంటిని మీరు నాకు వస్త్రమివ్వలేదు. నేను రోగినైయుంటిని మీరు నన్నెప్పుడూ దర్శించలేదు. మీరు నాకు పాటలు పాడారు. నా కొరకు ప్రసంగములు బోధించారు, కాని నా అవసరతలో ఎప్పుడూ సహాయపడలేదు'' అని ప్రభువు మనతో అనును.

ఆ యాజకుడు బాధలో నుండిన ఒక మానవునికి సహాయపడుట కంటె యెరూషలేములో ప్రార్ధన కూటమునకు సమయమునకు వెళ్లుటలో ఎక్కువ ఆసక్తిని చూపాడు. చాలామంది సంఘ కూటములన్నిటికి సమయమునకు వెళ్ళినను చివరకు నరకమునకు వెళ్లుదురని మరచి పోవద్దు.

అటు తరువాత ఒక లేవీయుడు (దేవుని సంఘములో ఒక సహోదరుడు ) అటు వచ్చాడు. అతడు కూడా దేవుని చేత పరీక్షింపబడ్డాడు. అతడు కూడా పరీక్ష తప్పాడు. అతడు కూడా మానవుని అవసరత విషయము పట్టించుకొనకుండా యుండి, కూటమును సమయమునకు అందుకొవాలను కొన్నాడు.

ఈ ఇరువురు మతాసక్తిగల మనుష్యులు కూటమునకు వెళ్ళి దేవుడు వారితో మాటలాడునది వినాలనుకొన్నారు. దేవుడు వారితో కూటమునకు వచ్చే త్రోవలోను మాటలాడెనను విషయము వారు తెలుసుకొనలేదు. అందువలన వారు ఆయన మాటలకుచెవి యొగ్గలేదు. మార్గములో వారికి ఎదురైన అవసరతలో నుండిన మానవుని యిబ్బందుల విషయములో వారు పట్టించుకొనకుండా యుండినందున, వారి పాటలు, ప్రార్ధనలు మరియు వారి మతము అంతా విలువ లేనివైనవని దేవుడు చెప్పుట వారెప్పుడు వినలేదు.

విశ్వాసుల యొక్క శ్రమలను, వారు శ్రమపడుటను చూచు వారి యొక్క వైఖరులను పరీక్షించుటకు దేవుడు ఉపయోగించును.

మనలో ఎవరును ఈ మతానుసారులైన ఇద్దరి వ్యక్తులపై రాళ్లు వేయలేము ఎందుకనగా ఏదో ఒక సమయములో మనము వారివలెనే ప్రవర్తించితిమి. ఈ ఉపమానములోని లేవీయుడిలో లేక యాజకుడిలో మనలను మనము చూచుకొన్నయెడల మనము మారుమనస్సు పొంది, రాబోవు రోజులలో ఎంతో వేరుగా ఉండుటకు చూడవలెను. ఈ లేవీయుడు మరియు యాజకుడి వలెనే మనము కూడా ఆయనకు ప్రతినిధులుగా ఉండుటకు దేవుడు మనలను ఈ భూమిపై ఉంచెనని మనము గుర్తించవలెను. మనము ఆయనకు సరిగా ప్రాతినిధ్యము వహించలేదను విషయమును బట్టి మనము పశ్చాత్తాపపడవలెను.

చివరకు ఒక తృణీకరింపబడిన సమరయుడను (వేరొక సంఘ శాఖకు చెందియుండి, యాజకునికి లేవీయునికి ఉన్న స్వచ్ఛమైన సిద్ధాంతములు లేనివాడు) ఆ దెబ్బలు తిన్నవ్యక్తికి సహాయపడుటకు దేవుడు ఉపయోగించుకొనెను.

ఆ సమరయుడు ఒక పెద్ద లేక బోధకుడు కాదు. ఇతరులకు మంచి చేయుచు, అవసరతలో ఉన్న వారికి సహాయపడుచు, దానిని ఎవరికి తెలియజేయకుండా ఉండే నెమ్మదిగల ప్రజలలో అతడు కూడా ఒకడు. అతడు ఆ దెబ్బలు తిన్న వ్యక్తిని తీర్పు తీర్చలేదు. అటువంటి ఆపత్తు తనకుకూడా కలిగియుండవచ్చని అతడు గ్రహించెను. కాబట్టి అతడు కనికరము కలిగియుండెను. అతడు తన్నుతాను ఉపేక్షించుకొని, అవసరతలోనున్న ఒక సహోదరునికి సహాయపడుటకు తన డబ్బును తన సమయాన్ని వెచ్చించెను.

క్రీస్తు శరీరములో ప్రత్యక్షమాయెను అనగా ప్రేమ, కనికరము, మంచితనము అనునవి శరీరరూపమున ప్రత్యక్షమాయెను.

తప్పిపోయిన కుమారుని యొక్క వైఫల్యము, అతడి అన్నను పరీక్ష చేసినది

తప్పిపోయిన కుమారుని యొక్క కథలో, అవసరతలో ఉన్న తన సహోదరుని అస్సలు పట్టించుకోకుండా ఉన్న ఒక పెద్ద సహోదరుని మరియొక ఉదాహరణను మనము చూచెదము(లూకా 15:11-32) అతడు చేసినదంతా వెనుకకు జారిపోయిన తన తమ్ముడిని తీర్పు తీర్చడమే.

నీవు ఒక సంఘమునకు పెద్దవైనట్లయితే, ఒక సహోదరుడు నీ సహవాసము నుండి పడిపోయినట్లయితే, అతడు పూర్తిగా పడిపోవు వరకు అతడు జారిపోతున్న స్థితిని నీవు తెలుసు కొనుటలో ఎందుకు విఫలం చెందావో నిన్ను నీవు ప్రశ్నించుకొనవలెను. అతడు పడిపోయిన పరిస్థితి బహిరంగముగా సంఘములో అందరికి తెలిసేంత వరకు నీవు ఎందుకు తెలుసుకొలేకపోయావు? అతడిని నీవు ముందే ఎందుకు హెచ్చరించలేదు? అటువంటప్పుడు అతడి అవసరత గూర్చి తెలుసుకొనలేని నీవు ముందు నీ కరిÄనమైన హృదయమును బట్టి పశ్చాత్తాపపడవలెను. అలా నీవు తెలుసుకొనలేక పోవుటకు కారణము, నీకు నీ స్వంతకార్యములు మరియు నీ కుటుంబ అవసరతలు మరియు పెద్దలైన సహోదరులు మరియు ఇతరులయొక్క మంచిఅభిప్రాయములను గూర్చి నీవు ఎక్కువగా చూచుకొనుట కావచ్చును. దాని ఫలితముగా నీ గుంపులో ఇతరుల అవసరములు పట్టించుకొనుటకు నీకు సమయము లేకపోయినది.

ఒక సహోదరుడు పాపములో పడిపోయి, ఒక పంది వంటి స్థితికి వెళ్లిపోతే, నీవు ఏమందువు? ''అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అతడు సంఘమును విడిచి వెళ్లినప్పుడే అలా అవుతుందని చెప్పాను. ఇప్పుడేమయిందో చూడండి'' అని అంటున్నావా.ఆత్మీయ స్థితినందు ఆ జారిపోయిన సహోదరుడు ఘోరమైన స్థితిలో ఉన్నాడని, నీవు చెప్పినట్లే జరిగినదని నీవు సంతోషిస్తున్నావా!!

మనలో మనకు తెలిసిన దానికంటే ఎక్కువైన పరిసయ్యతత్వమున్నది. మనము ఇతరులకు సహాయము చేయుటకంటె మనము చెప్పినట్లు జరుగుతుంది అని చెప్పుకొనుటలో ఎక్కువ ఆసక్తి చూపుదుము. యేసు ప్రభువు ఈ భూమిపైకి ఆయనదే సరియైన మార్గము అని ఋజువు చేసికొనుటకు రాలేదు. ఆయన తప్పిపోయిన వారిని వెదకి రక్షించుట కొరకు వచ్చారు. మనము ఆయనకు ఎంత వేరుగా నున్నామో చూసారా?

మనలో ఎంతటి సాతాను ఆత్మయున్నదో చూసారా? ఒక సహోదరుడు పందుల మధ్య యుండుటను చూచుట వలన నీవు సంతోషిస్తున్నట్లయితే దేవుని యొక్క తండ్రి హృదయమునకు ఎంత వ్యత్యాసముగా నున్నావో చూచావా? తన కుమారుడు పందుల మధ్య ఉన్నప్పుడు తండ్రి సంతోషించలేదు. ఆయన దు:ఖించాడు. దేవుడు జారిపోయిన వారి గూర్చి అలాగే భావించును. అలానే సంఘములో ప్రతి నిజమైన తండ్రి అట్లే బాధపడును. కాని పౌలు కాలములో వలె, ఇప్పుడు కూడా, సంఘములో ఎందరో బోధకులు ఉన్నారు కాని, నిజమైన తండ్రులుగా లేరు (1 కొరిందీ¸ 4:15).

నీ సహోదరుని యొక్క జారిన స్థితిని, నీ హృదయములో నుండిన దుష్టత్వమును బయట పెట్టుటకు దేవుడు ఉపయోగించుచున్నాడను విషయం నీవు గ్రహించుట లేదు. నీ సహోదరుడు పడిపోయినప్పుడు దేవుడు పరీక్షించేది నిన్నే. నేను అటువంటి కాపరులకు విరోధిని అని దేవుడు చెప్పుచున్నాడు (యెహెజ్కేలు 34:10). ఇదే విషయం అత్మీయమైన భౌతికమైన మరియు ఉద్రేక సంబంధమైన అవసరములను పట్టించుకొనని భర్త లేక భార్యకు కూడా వర్తించును.

లాజరు యొక్క పరిస్థితి ధనవంతుని పరీక్షించెను

బీద బిక్షకుడైన లాజరు ఎవరి వాకిటముందు కూర్చుండెనో ఆ ధనవంతుడు నరకమునకు ఎందుకు వెళ్లెను? ఎందుకనగా అతడు మానవ అవసరతను పట్టించుకొనలేదు. అతడు నరకములో ఎదుర్కొన్న అగ్ని దేవుని ఉగ్రత యొక్క అగ్నియైయుండెను. అదే దేవుని ఉగ్రత యొక్క అగ్ని ఎలీఫజు, బిల్దాదు, జోఫరుకును యేసు సమాజమందిరమునకు వెళ్లినప్పుడు అక్కడున్న పరిసయ్యులకును వ్యతిరేకముగా నుండెను (లూకా 16:19-31). జీవితములో అంత నిస్సహాయముగా, గతిలేని వానిగా నుండుటకు లాజరు జీవితములో ఏదో రహస్య పాపముండి యుండవచ్చునని ఆ ధనికుడు పేదవాడైన లాజరును తీర్పు తీర్చి ఉండవచ్చును. దేవుడు తనను నమ్మకస్తునిగా ఎంచినందున తాను భౌతికపరమైన ధనముతోను మంచి ఆరోగ్యముతోను దీవించబడెనని అతడు భావించియుండవచ్చును. లాజరుయొక్క స్థితి తనకు ఒక పరీక్షయని అతడు గ్రహించలేకపోయెను. ఒకానొక దినమున అతడు నరకములో మేల్కొన్న వరకు అతడు తన్నుతాను మోసగించుకొనుచుండెను. దైవికమైన ప్రేమ లేకుండా కేవలము ఆచారాలతో కూడియున్న అబద్ధపు మతముతో తనను మోసగించిన బిషప్పులతో సహా తనను తాను నరకములో కనుగొనుట అతనికి ఎంతటి దిగ్భ్రాంతిని కలుగజేసియుండును. తాను తన జీవితమంతా తృణీకరించిన లాజరు పరదైసులో కూర్చుండెనని అతడు చూచినప్పుడు అతడు ఇంకా ఎక్కువ దిగ్భ్రాంతి చెందియుండును. కాని అలా తలంచినది ఆ ఒక్క ధనవంతుడే కాదు. ఖచ్చితంగా ఆ విధముగా ఆలోచించే ధనికులైన విశ్వాసులు ఈ రోజున ఎంతో మంది ఉన్నారు. వారి ధనము, వారి ఆరోగ్యము, వారి పెద్ద రాబడి మొదలగునవి వారి మీద దేవుని దీవెనకు సూచనలని వారు తలంచుదురు. మరియు వారి చుట్టూ బాధలలో నున్న వారి యొక్క అవసరతలను వారు పట్టించుకొనరు. వారి చుట్టూ ఉన్న బాధలలో నున్న విశ్వాసుల ద్వారా దేవుడు వారిని పరీక్షించుచున్నాడని వారు గ్రహించరు. మతానుసారులైన పరిసయ్యులు నిత్యత్వములోనికి వెళ్లునప్పుడు ఎన్నో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు చూచెదరు.

మనము దేవుని సత్యాన్ని ఎంత ఎక్కువగా గ్రహించుదుమో, మనము పరిసయ్యులుగా మారే ప్రమాదము అంత ఎక్కువగా నున్నది. లేఖనానుసారముగా నున్న సిద్ధాంతములను విను ఆధిక్యత కలిగిన వారు ఇతర సంఘ శాఖలలోనున్న పరిసయ్యులకంటే గొప్ప పరిసయ్యులుగా మారే ప్రమాదమున్నది.

దేవుడు దిగజారిపోయిన వారి శ్రమలను కూడా వారి శ్రమలను పట్టించకొనని వారి యొక్క దుష్టత్వమును బయటపెట్టుటకు ఉపయోగించును.

వ్యభిచారములో పట్టబడిన స్త్రీ ఆమెపై నేరారోపణ చేసిన వారిని పరీక్షించెను

వ్యభిచారములో పట్టబడిన స్త్రీపై రాళ్లు వేయుటకు పరిసయ్యులు ఆమెను యేసు యొద్దకు తీసుకొనివచ్చినప్పుడు, ఆ పరిసయ్యుల హృదయాలలో ఉన్న దుష్టత్వమును బయటపెట్టుటకు దేవుడు ఆమె పాపమును ఉపయోగించెను (యోహాను 8:1-12).

వారిపై నేరారోపణ చేయు వారియొక్క దుష్టత్వమును బయటపెట్టుటకు దేవుడు పడిపోయిన పాపుల యొక్క పాపములను కూడా వాడుకొనును.

''తీర్పు తీర్చకుడి. పాపము లేనివాడు మొదట రాయి వేయవలెను'' అను యేసు యొక్క మాటలు మన హృదయాలతో మాట్లాడుట మనము ఎల్లప్పుడు వినుచుండని యెడల, మనము చివరకు ఆ పరిసయ్యుల గుంపులో చేరి, యేసు ప్రభువు యొక్క సన్నిధి నుండి నిత్యత్వమంతయు వెలివేయబడుదుము.

యేసు పాపులకు వ్యతిరేకముగా ఎప్పుడు లేడని గుర్తుంచుకొనుడి. ఆయన కేవలము పరిసయ్యులకు వ్యతిరేకముగా నుండెను.

అధ్యాయము 8
విశ్వాసము, విరగగొట్టబడుట మరియు విజయము

''.....మనము పోరాడునది రక్తమాంసములతోకాదు-, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము'' (ఎఫెసీ 6:12)

ఆత్మీయముగా బ్రతికియుండిన ప్రతి విశ్వాసి తాను దురాత్మల శక్తుల పోరాటముల మధ్యలో ఉండుటను కనుగొనును. అయితే ఆత్మీయముగా చనిపోయిన స్థితిలో ఉన్నవారు, ఈ పోరాటము గూర్చి ఎరుగరు, ఎందుకనగా వారు యుద్ధభూమిలో శత్రుసైనికులు పట్టించుకొనని మృత సైనికులవలె యుందురు. అట్లే రక్తమాంసములు గల శరీరులతో పోరాడే వారి గురించి కూడా సాతాను పట్టించుకొనడు, ఎందుకనగా అట్టివారు తోటి మానవులతో పోట్లాటలు మరియు గొడవలతో తలమునకలైయుందురు. ఎవరైతే దేవుని గూర్చి పూర్ణ హృదయముతో మండుచుందురో, ఎవరైతే సైతానుకు ప్రమాదకరముగా యుందురో, మరియు ఎవరైతే దేవుని పక్షమున యుద్ధము చేయగలరో అటువంటి వారినే సాతాను పట్టించుకొనును. ఎఫెసీ 6:18,19 వచనాలు మనము ఎప్పుడు మెళకువగా నుండవలెననియు, ఓర్పుతో విశ్వాసులందరి కొరకు, ప్రత్యేకముగా శతృవు యొక్క ఉగ్రతకు ప్రధాన గురియైన నమ్మకముగా దేవుని వాక్యమును ప్రకటించే వారికొరకు ప్రార్థించమని మనలను కోరుచున్నవి.

ఒక పాత నిబంధన ఉదాహరణ

2 దినవృత్తాంతములు 20వ అధ్యాయములో, మనము ఎలాగు సాతానును ఎదురించి యుద్ధము చేయగలమో అనుదాని గూర్చి ఒక దృశ్యమును చూచుదుము. అక్కడ గొప్ప సైన్యము రాజైన యెహోషాపాతు మీదకు వచ్చుట గూర్చి చదువుదుము. అయితే యెహోషాపాతు గొప్ప శతృసైన్యముతో చుట్టబడినప్పుడు సరియైనపని చేశాడు. అతడు యూదాదేశమంతటిని ఉపవాసముతో దేవునికి ప్రార్థించునట్లు చేశాడు. అప్పుడు అతడు వారి బలహీనతను, వారి బుద్ధిహీనతను మరియు వారి విశ్వాసమును ఒప్పుకొనుచు దేవుని ప్రార్థించెను.

అతడు ''మాదేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తిచాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్ధన చేసెను'' (12వ).

ఇది బలమైన ప్రతి ప్రార్ధన యొక్క రహస్యము- మన యొక్క బలహీనతను, మన బుద్దిహీనతను గుర్తించుట మరియు మనతరపున దేవుడు పోరాడును అనే పూర్తి నమ్మకము కలిగియుండుట.

దేవుడు ఏర్పరచుకొనిన వారి యొక్క బలహీనత

యేసు ప్రభువు ''ఎన్నుకొనబడిన వారిని'' (సంఘమును) ఒక బీదయై, ఏ సహాయము లేక ఒక బలమైన శతృవుకు వ్యతిరేకముగా మానవ సహాయము మరియు ఏ ఇతర ఆధారములు లేకుండా పోరాడవలసిన ఒక వృద్ధురాలైన విధవరాలుతో పోల్చెను(లూకా 18:1-7). అలాగుననే మనము మన బలహీనతను ఎప్పుడు గుర్తించుదుమో, అప్పుడు మనము దేవునిపై ఆధారపడుదుము. అప్పుడు మాత్రమే మన విశ్వాసమును అభ్యాసము చేయుదుము.

మానవ సహాయముపై ఆధారపడువారిని దేవుడు మోడుబారిపోవునట్లు శపించును. ''నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించు కొనువాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలోని అరుహా వృక్షమువలె ఉండును'' (యిర్మీయా 17:5,6) అని ఆయన చెప్పారు.

అనేకులు వారిలో వారు బలముగా నుండుట వలన పాపము చేత ఎప్పుడు ఓడింపబడుచుండి, సాతాను చేత జయింపబడుచుందురు. వారికి ప్రతివారి గూర్చి ప్రతిదాని గూర్చి బలమైన అభిప్రాయములుండి గ్రుచ్చుకొనే మాటలు మాట్లాడుదురు మరియు ఇతరులను తీర్పు తీర్చుటకు వేగిరపడుచుందురు. అటువంటి విశ్వాసులను దేవుడు విడిచిపెట్టును మరియు వారు ఎప్పటికి జయించువారు కాలేరు.

వాదించు వారు మరియు తగువులు పెట్టుకొనువారు ఏవిధముగను బలహీనులు మరియు శక్తిహీనులు కాదు. వారు బలవంతులు మరియు అందును బట్టి సాతానుకు సుళువైన గురిగా యుందురు, ఎందుకనగా వాదించువారితో సాతాను ఎప్పుడు యుద్ధములో గెలుచుచుండును. అతడు అదే విధముగా ఏదేను వనములో హవ్వతో యుద్ధములో గెలిచెను. అందువలన ఎప్పుడు నీ భర్తతో గాని నీ భార్యతోగాని లేక మరెవరితోగాని వాదులాటకు దిగవద్దు ఎందుకనగా నీవు ఎప్పుడు గెలవలేవు అటువంటి సందర్భములలో గెలిచేది ఎప్పుడు అపవాదియే.

అదేవిధముగా ఇతరులపై పగతీర్చుకొనువారు కూడా వారి సమస్యలను వారే పరిష్కరించుకొనగలిగిన సామర్ద్యము గల బలవంతులమని రుజువు చేసికొనుచున్నారు. ఆ బలహీనురాలైన విధవరాలు న్యాయాధిపతిని బ్రతిమిలాడు కొనవలసియున్నది (లూకా 18:2), కాని బలవుంతులైన వారు అట్లు బ్రతిమాలు కొనరు, వారికి వారే పోరాడుదురు.

మరి కొందరు వారి బ్యాంకు ఖాతాలలో ఎక్కువ సొమ్ము నిల్వయుండట చేత లేక వారి యజమానులు వారికి ప్రతినెల జీతము ఇవ్వవలిసిన మొదటి తేదీన తప్పక ఇచ్చుదరని నమ్మకము గలవారగుటచేత బలవంతులు. వారి నమ్మకము దేవునియందు కాక మానవునిపై యున్నది. అందుచేత వారు మోడు బారిపోయిన వారుగా యుందురు. మన వనరులు ఎప్పుడైతే ఖాళీ అగునో అప్పుడే మనకు దేవుడు అద్భుతముగా సహాయము చేయును. యేసుప్రభువు లాజరు చనిపోవు వరకు అనగా అతడు తన శక్తినంతటిని కోల్పోవువరకు వేచియుండి, ఆ తరువాత తనకు సహాయపడుటకు వచ్చెను. ఆయన ఈనాడు కూడా, మనము అటువంటి స్థితికి వచ్చు వరకు ఆయన ఎదురు చూచుచున్నాడు.

నేనేమి చేయుటకు నాకుతోచుటలేదు అని యెహోషాపాతు ఒప్పుకొనెను, అది మంచి ఒప్పుకోలు, ఎందుకనగా ఎవరైతే కొదువ ఉన్నదని ఒప్పుకొందురో వారికి జ్ఞానమును ఇచ్చెదనని దేవుడు వాగ్దానము చేశారు. అయితే మనము జ్ఞానము గూర్చి విశ్వాసముతో అడుగవలెను (యాకోబు 1:5,6). యెహోషాపాతు అదే చేశాడు. అతడు కేవలము తన అసమర్థతను మరియు జ్ఞానము గూర్చిన లోటును ఒప్పుకొనుట మాత్రమేకాక, దేవునిపై సంపూర్ణమైన నమ్మకమును వెలిబుచ్చుతూ ప్రార్దన ముగించెను. ''మా కన్నులు నీవైపు చూచుచున్నవి'' (మాకు దిక్కు ఎవరు లేరు) అని చెప్పెను. వేరొక మాటలో, ''నీవు మా తరుపున యుద్ధము చేయుదువని ఆశించు చున్నాము'' అని దేవునితో చెప్పెను. దేవుడు అట్లే చేసెను.

మూడు రకములైన విశ్వాసులు

లోకములో మూడు రకములైన 'విశ్వాసులు' కలరు.

  1. వారి మీద వారికి నమ్మకమున్న విశ్వాసులు: అటువంటి విశ్వాసులు చాలా తక్కువ ప్రార్థన చేయువారిగానో లేక అసలు ప్రార్థన చేయని వారిగానో గుర్తింపబడుదురు. వారు సాధారణముగా ఎప్పుడూ ఉపవాసముండి ప్రార్థించరు. వారు మాటలలో చెప్పకపోయినా, ప్రతి పరిస్థితిని తమకు తాము చక్కబర్చగలమని వారి యొక్క ప్రార్థన లేమి ద్వారా సాక్ష్యమిచ్చెదరు. అటువంటి విశ్వాసులు దేవునికొరకు ఒక నిత్యమైన పనిని ఎప్పటికిని చేయలేరు.
  2. వారి మీద వారికి నమ్మకముండదు మరియు దేవుని మీద కూడా నమ్మకము ఉండదు: వారు తమకు శక్తిగాని జ్ఞానము గాని లేదని ఒప్పుకొందురు. అయితే దేవుడు వారి తరపున పనిచేయునని కూడా వారు నమ్మరు. అటువంటి వారు సాధారణముగా ప్రార్ధించని వారుగా కూడా యుందురు. వారు ప్రార్ధించినా వారి ప్రార్ధన విశ్వాసము లేకుండా యుండును.అటువంటి వారు కూడా దేవునికి పనికిరానివారు.
  3. వారిపై వారికి నమ్మకము లేనివారు, కాని దేవునిపై నమ్మకము గలవారు:

వారికి శక్తి మరియు జ్ఞానము కొదువుగా నుండిన విషయం వారికి తెలియును, కాని దేవుడు వారికి బలముగా సహాయము చేయునని మరియు వారిలోను, వారి ద్వారాను పని చేయునని కూడా వారు నమ్ముదురు. అటువంటి విశ్వాసులు మాత్రమే నిజమైన ఆత్మీయతగలవారు మరియు అటువంటి వారే దేవుని కొరకు నిత్యమైన పనిని చేయగలరు.

రెండవరకము వారు దేవునికి మొదటి రకము వారి వలెనే నిరుపయోగమని మనము గ్రహించుట మంచిది. రెండవ రకము వారు ఎక్కువగా విరుగగొట్టబడిన వారుగా కన్పించవచ్చును, కాని కాదు. ఎందుకనగా అపనమ్మకము ఎప్పుడు కూడా యధార్ధమైన క్రైస్తవ దీనత్వముతో కలిసియుండదు. మనమెంతగా విరుగగొట్టబడినట్లుండినా, విశ్వాసము లేకుండా దేవుని సంతోషపరచుట అసాధ్యము. కేవలము మన అసమర్ధతను ఒప్పుకొనుట కూడ చాలదు. మనము దేవుని కూడా నమ్మవలసియున్నది. మనము కుళ్లిపోయిన వారమని, పనికిరాని వారమని, బుద్ధిహీనులమని ఒప్పుకొనుట మాత్రమే దీనత్వము కాదు. మనము దానిని ఒప్పుకొంటూ ఉంటే, మనము ఎప్పటికి పనికిరాని వారిగా యుందుము. అవివేకులైన విశ్వాసులు నకిలీ దీనత్వమును నిజమైన దీనత్వముగా పొరబడుచుందురు! ఆయన యొద్ద నుండి దీనత్వమును నేర్చుకోమని యేసు మనతో చెప్పెను (మత్తయి 11:29). తాను దేనికి పనికి రానివాడినని యేసు ఒప్పుకొనుటను మనము ఎక్కడ కనుగొనగలము? ఎక్కడా కనుగొనలేము.

దేవుడే అన్నియు(సర్వము) అగునట్లు, మనము దేవుని యెదుట ఏమీలేనివారుగా అగుట నిజమైన దీనత్వము. మానవుడుగా యేసు అటువంటి స్థానమును తీసుకొనెను. మనము కూడా అదే చేయవలసి యున్నది. మనము అటువంటి తగ్గింపు స్థానములో నుండినప్పుడు దేవుడు మనలోను మరియు మన ద్వారా గొప్ప కార్యము చేయుననియు మరియు సాతానును మన కాళ్ళ క్రింద త్రొక్కించుననియు నమ్మవలసి యున్నది.

యుద్ధము యెహోవాది

యెహోషాపాతు ప్రార్ధించుట ముగించగానే దేవుడు ''మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ...ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు'' (2 దిన 20:15,17) అని జవాబు పంపిచాడు.

అటువంటి మాటలు ఈ రోజు దేవుడు ఎవరితో చెప్పుచున్నాడు? మనము పైన చూచిన మూడవ రకము వారితో మాత్రమే ఈ మాటలు చెప్పుచున్నాడు. విశ్వాసముతో ప్రార్ధించుము, విశ్వాస పూరితమైన మాటలు మాట్లాడుము, అప్పుడు అన్నివేళలా నీ విడుదల కొరకు దేవుడు పనిచేయుటను నీవు కనుగొందువు. దేవుని యందు విశ్వాసముంచిన వారు ఎప్పుడును నిరుత్సాహము చెందరు లేక సిగ్గుపర్చబడరు (రోమా 9:33). కాని కేవలము తమ నిస్సహాయతను ఒప్పుకొనువారు ఎల్లప్పుడు శతృవు చేత సిగ్గుపరచబడుదురని వారు కనుగొందురు. కరిÄనమైన నేలను దున్నుట (మారుమనస్సు పొంది విరుగగొట్టబడుట) మాత్రమే సరిపోదు. మనము పంటను పొందాలంటే మనము విత్తనమును (విశ్వాసమునిచ్చు దేవుని మాటను) దానిలో విత్తవలెను. విత్తనమును విత్తకుండా కేవలము కరిÄనమైన నేలను దున్నేవారు ఏమియు పొందలేరు. మనము కరిÄనమైన నేలను అస్సలు దున్నకుండా చేయుటకు లేక మన జీవితాంతము వరకు దానిని దున్నునట్లు చేయుటకు సాతాను ఇష్టపడును. ఈ రెండింటిలో ఏ విధముగానైనను అతడు తన ఉద్దేశ్యములను నెరవేర్చును.

దేవుడు సాతానును మన కాళ్లక్రింద చితుక త్రొక్కునని మనము ఒప్పుకొనెదము (రోమా 16:20). మనము నిగ్రహము కోల్పోవునట్లు చేయుటకు లేక ఇతరులకు వ్యతిరేకముగా కొండెములాడునట్లు చేయుటకు లేక స్త్రీలను మోహించునట్లు చేయుటకు సాతానుకు మన హృదయాలలో ఎటువంటి స్థానము లేదు. అతని స్థానము ఎల్లప్పుడు మన పాదముల క్రిందనే!

దేవుని యొద్ద నుండి ఆ మాటలు వినిన వెంటనే యెహోషాపాతు దేవుని ఆరాధించెను. ఆ మరుసటి ఉదయము అతడు పరిశుద్ధాలంకారములు ధరించి దేవుని స్తుతించుటకు గాయకులను సైన్యము ముందర నడచుటకు ఏర్పరిచెను. వారు పాడుటను దేవుని స్తుతించుటను ప్రారంభించగానే దేవుడు వారి యొక్క శత్రువులను ఓడించెను (21,22వ).

పరిశుద్ధాలంకారములతో దేవుని స్తుతించుట

దేవునియందు మన విశ్వాసమును ఒప్పుకొను స్తుతులతో కూడిన ఆత్మ శత్రువు పారిపోవునట్లు చేయును. యెహోషాపాతు యొక్క సైన్యము పరిశుద్ధాలంకారముతో ప్రభువును స్తుతించెనని కూడా మనము చూచితిమి. సంఘములో మనకు కావలసిన సమతుల్యత ఇదే- పరిశుద్ధమైన ఆత్మతో స్తుతించు ఆత్మ కలసి యుండవలెను.

దురదృష్టవశాత్తూ క్రైస్తవత్వంలో, ఈ విషయములో విశ్వాసులు రెంటిలో ఏదో ఒక విపరీత పోకడలకు పోవుట మనము చూచుచుందుము. ఒక ప్రక్క పరిశుద్ధమైన జీవితము జీవించకుండానే, దేవుని గొప్ప స్వరముతో మరియు బావోద్రేకములతో స్తుతించువారున్నారు. వారు కూటములలో వేరే భాషలతో దేవుని స్తుతించుచుందురు. తరువాత యింటికి వెళ్లి వారి మాతృభాషలో తమ భార్యలపై కేకలు వేయుదురు. ఇది మోసపూరితమైన ఒక విపరీత పోకడ. వివేచనలేని మానసిక అనుభూతులకు కదలిపోయే వ్యక్తికి అటువంటి గొప్ప శబ్దము మరియు భావోద్రేకములు పరలోక అనుభవము వలె ఉండును. ఎంత భావోద్రేకముతో వారు భాషలలో పాడినా లేక ఎంత గట్టిగా వారు దేవుని స్తుతించినా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు (రోమా 8:8) అని వివేచన గలవారు గుర్తించుదురు.

మరియొక ప్రక్క అనేకులు నిష్కపటముగా వారిని వారు తీర్పు తీర్చుకొనుచు భక్తిగల జీవితము జీవించుటకు చూచుదురు, కాని వారి జీవితములలో ఎప్పుడు స్తుతించు ఆత్మ ఉన్నట్లు కనబడరు. వారెప్పుడూ ఒకరి నొకరు హెచ్చరించుకొనుటను మాత్రమే నమ్ముచున్నట్లు కనబడుదురు మరియు అట్లు చేసినప్పుడు ఎంతో ముభావముగా మరియు సంతోషము లేకుండా కనబడుదురు.

హెబ్రీ 2:12లో యేసుప్రభువు సంఘములో రెండు పనులు చేయునని వ్రాయబడియున్నది.

  1. తండ్రి యొక్క నామమును ప్రచురపరచుట.
  2. తండ్రికి స్తుతిపాడుట.

యేసు ప్రభువు తండ్రి మాటను మనకు తీసుకువచ్చు వర్తమానికుడు మాత్రమే కాక స్తుతులను గీతములను సంఘములో నడిపించు నాయకుడై యున్నారు. యేసు ప్రభువును మన మార్గదర్శకునిగా మరియు మన యొక్క అన్నగారిగా మనము సంఘకూడికలలో ఈ రెండు విషయములలో వెంబడించవలసియున్నది. మనము సంఘములో వాక్యమును పంచుకొనుటకు నిలబడినప్పుడు, మనము మన నామములను కాక ప్రభువు యొక్క నామమును ప్రకటించవలెను. మనము ఎంత బాగా బోధించగలమో లేక ఎంత నమ్మకముగా ఉన్నామో ఇతరులకు చూపించుటకు అక్కడ లేము. అలాగే వారి అవసరత కొరకు మనము లేఖనములలో కనుగొన్న ఒక మాటను వారికి బోధించుట తగదు. అలా బోధించుట భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది మరియు దయ్యములకు సంబంధించినది. అది ప్రభువు నామమునకు అవమాన కరమైనది. యేసుని గూర్చిన సాక్ష్యమే అభిషేకింపబడిన ప్రవచనమంతటికి సారము (ప్రకటన 19:10).

మనము సంఘములో తండ్రిని బిగ్గరగా స్తుతించుట విషయములో కూడా యేసు ప్రభువును అనుసరించవలసియున్నది. మనము ప్రార్ధించుట చాలదు. మనము దేవుని స్తుతించవలెను కూడా. పది మంది కూష్ఠురోగులు స్వస్థత కొరకు యేసు ప్రభువును ప్రార్థించిరి. ఒకే ఒక్కడు ఆయనను స్తుతించెను. దురదృష్టవశాత్తు సంఘములో కూడా అలాగే ఉండును.

సంపూర్ణమైన విజయము

యుద్ధములో యెహోషాపాతు విజయము ''ఎవ్వరు (శత్రువులు) తప్పించుకొననటువంటిది'' (24వ). మన విషయములో మనము సైతాను మీదికి యుద్ధమునకు అదే విధముగా విశ్వాసముతో మరియు స్తుతులతో వెళ్లినట్లయితే, మన సమస్యలలో ఏ ఒక్కటి కూడా పరిష్కరింపబడకుండా ఉండదు. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము ''గొప్ప సైన్యసమూహము'' (సమస్యలు) తో ప్రారంభమైనది, కాని ఏ ఒక్క శత్రువు (సమస్య) విడిచిపెట్టబడకుండుటతో ముగిసినది. మన జీవితాలలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుటకు దేవుడు గొప్ప సమర్ధుడు.

యూదా ప్రజలు కొల్ల సోమ్ముతో ధనవంతులైరి (25వ) ఆత్మీయ సంపదను పొందుకొనుటకు మనకు కూడా ఇదే మార్గము. అటు తరువాత ''ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్న వారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను'' (2 దిన 20:29,30). ఈనాడు కూడా దేవుని ప్రజలకు శత్రుశక్తులన్నిటిపైన అటువంటి విశ్రాంతి కలదు.

స్తుతుల యందు చివరి వరకు కొనసాగుట

విషాదకరమైన విషయమేమిటంటే యెహోషాపాతు ఆ రోజు నేర్చుకొన్న విషయమును మరచిపోయి, అతడి జీవితము యొక్క చివరిలో వెనుకకు జారిపోయెను. అతడు ''దుర్మార్గముగా ప్రవర్తించి'' విగ్రహారాధకులైన ఇశ్రాయేలీయులతో మరల స్నేహము చేసెను అని మనము 2 దిన 20:35 లో చదివెదము. ఈసారి ఆహాబు యొక్క దుర్మార్గుడైన కుమారుడు అహజ్యాతో స్నేహము చేసెను. అక్కడ యెహోషాపాతు బుద్ధితక్కువగా కాకుండా దుర్మార్గముగా ప్రవర్తించెను అను విషయమును గమనించాలి. మొదటిసారి యెహోషాపాతు రాజీపడెను, అప్పుడు అతడు బుద్ధితక్కువగా ప్రవర్తించెను. రెండవసారి అతడు దుర్మార్గముగా ప్రవర్తించెను. ''తన మూఢతను మరల కనుబరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు'' (సామెతలు 26:11).

దేవుని ''పరిశుద్ధాలంకారముతో స్తుతించుట'' నేర్చుకొనిన అనేకులు, అదే ఆసక్తితో చివరివరకు కనిపెట్టుకొని యుండలేరు. త్రోవలో ఎక్కడో వారు తిరిగి రాజీపడిపోవుదురు. కానీ మనకు అలా జరుగనక్కర్లేదు. మనము చివరి వరకు కొనసాగునట్లు దేవుడు గొప్పగా సహాయము చేయును.

విశ్వాసముతో దేవుని స్తుతించుట

మనము ప్రభువుని అన్ని వేళలయందును అన్నిటి కొరకును స్తుతించెదము. దానికి కారణము మానసిక నిపుణులు తమ రోగులకు చెప్పినట్లు ''అది ఇంకా ఘోరముగా యుండియుండవచ్చు'' అని కాదు గాని ''అది ఇంకా మెరుగుగా ఉండలేదు'' అనునదియే. ఎందుకనగా దేవుడు సమస్తమును మనకు ఎంతో మేలు కలుగుటకై చేయును (రోమా 8:28). అది విశ్వాసముతో కూడిన స్తుతి. మనము మన గత జీవితములను చూచినట్లయితే, మనము కీడు అనుకొన్న అనేకమైన వాటిని, దేవుడు మనకు మేలుకరముగా మార్చుటను చూడగలము. మన భవిష్యత్తులో కూడా దేవుడు అట్లే చేయును. దానిని మనము నమ్మినట్లయితే మనము అన్ని వేళలా దేవుని స్తుతించెదము.

కీర్తనలు 106:12లో ''అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి'' అని చదువుదుము. అక్కడ ఐగుప్తును విడచిన ఇశ్రాయేలీయులు, వారి శత్రువులు ఎఱ్ఱ సముద్రములో మునుగుట చూచిన తరువాతనే దేవుని స్తుతించిరి (11వ). అది చూచిన దాని బట్టి జీవించుట-అనగా దేవుడు మన సమస్యలన్నిటిని పరిష్కరించిన తరువాత దేవుని స్తుతించుటయై యున్నది. పాత నిబంధనలో వారు విశ్వాసముచే జీవించలేక పోయిరి కాబట్టి అప్పుడు అంతవరకే వారికి సాధ్యపడెను.

కాని ఇప్పుడు నూతన నిబంధనలో మన తలలు పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకింపబడి యుండినందున ''మన ప్రభువు మన కాపరియై యుండి మనలను శాంతికరమైన జలముల చెంతకు నడిపించును'' (కీర్తనలు 23:5,1,2) కాబట్టి మనము ''మన శత్రువుల యెదుట'' దేవుని స్తుతించగలము. ఐగుప్తీయులు మనలను తరుము చుండినను, మనము ఎటూ వెళ్ళుటకు వీలులేకుండా చుట్టూ పర్వతములు ఆవరించి యున్నను ఎదుట ఎర్ర సముద్రము తెరవబడక పోయినను మనము ఇప్పుడు విశ్వాసముతో దేవుని స్తుతించగలము. ఆ స్తుతి మహోన్నతుడైన దేవునిలో గల సజీవమైన విశ్వాసము నుండి ఉబికి వచ్చును.

మరణపు లోయలో గుండా వెళ్ళుచుండినా, మనము ఏ కీడు గూర్చి భయపడము, దానికి కారణము మన పరలోకపు తండ్రి అనుమతి లేకుండా మన తలపై ఒక వెంట్రుకను కూడా శత్రువు తాకలేడను నమ్మకము. యేసు ప్రభువు వలె మనము ''పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు'' (యోహాను 19:11), అని మన శత్రువులతో చెప్పగలము. అందుచేత మనమెప్పుడు మన గురించి గాని మన పరిస్థితుల గురించి గాని ఇంకా ఎవరి గురించి గాని ఫిర్యాదు చేస్తూ లేక సణుగుకుంటూ లేక మన గురించి మనము చింతిచుచు ఉండవలసిన కారణములేదు. మనము లేక ఇతరులు ఎవరైనా చేసిన తప్పిదములను కూడా మనకు ఎంతో మేలగునట్లు దేవుడు చేయును.

విఫలమైన వారిని దేవుడు ఉపయోగించును

పేతురు ఘోరమైన తప్పిదము చేసి, ప్రభువును ఎరుగనని ముమ్మారు చెప్పిన పాపములో పడిన తరువాతనే ఒక కనికరము గల అపొస్తలుడుగా మారెను. పేతురు ఆ విధముగా పాపము చేయుట తప్పనిసరిగా దేవుని పరిపూర్ణ చిత్తము కాదు. కాని పేతురులో ఒక కార్యము చేయుటకు దేవుడు అట్లు అనుమతించుటను చూడగలము. అది అతడు జీవితములో విఫలమైన వారి యెడల సానుభూతితో మరియు మృదువుగా నుండునట్లు చేసినది.

యేసు ప్రభువు ఒక్కమారు కూడా పాపము చేయలేదు, అయినప్పటికి ఆయన పాపుల యెడల అపారమైన దయ మరియు కనికరము కలిగి యుండెడివారు. కాని మిగిలిన ఆదాము సంతతి విషయములో అలా లేదు. సాధారణముగా ఎప్పుడు పెద్ద పాపములో పడనివారు పాపుల యెడల కరిÄనముగా నుండి కనికరము లేకుండా గర్వముతో యుందురు.

పేతురు అటువంటి పెద్ద పాపములో పడిన పరిస్థితులను మనము చూచినప్పుడు, అతడు అసలు ప్రభువును ఎరుగనని చెప్పు శోధనలో పడకుండా దేవుడు సుళువుగా తప్పించగలడని మనము చూడవచ్చును. అయినప్పటికిని దేవుడు ఆ శోధన సమయముల నుండి అతనిని కాపాడకుండుటకు నిర్ణయించెను.

యోహాను 18:15-18లో పేతురు యోహానులు ప్రధాన యాజకుని యింటివరకు యేసు ప్రభువును వెంబడించి వెళ్లుటను మనము చూచుదుము. ప్రధాన యాజకునికి యోహాను తెలియుట చేత ద్వారపాలకురాలు అతడిని లోపలకు రానిచ్చెను. కాని పేతురు లోపలకు వెళ్ళలేకపోయెను. గనుక యోహాను వచ్చి ఆ ద్వారపాలకురాలితో మాటలాడగా ఆమె పేతురును కూడా లోపలకు పంపెను. చూచుటకు అది ఆ సమయములో ఒక మంచి పనిగా కనబడెను. అయితే గమనించండి, యోహాను వచ్చి పేతురును లోపలకు తీసుకు వెళ్ళక పోయినట్లయితే పేతురు ఆ రాత్రి ప్రభువును ఎరుగనని అనేవాడు కాదు ఎందుకనగా పేతురు ప్రశ్నింపబడినది మరియు ప్రభువును ఎరుగనని ముమ్మారు చెప్పినది లోపలనే (యోహాను 18:17,25,27).

అటువంటప్పుడు దేవుడు అట్లు జరుగుటకు ఎందుకు అనుమతించెను? పేతురు లోపలకు వెళ్ళకుండా ఆయన ఎందుకు అడ్డుకొనలేదు? అది దేవుని యొక్క పొరపాటా? కాదు . దేవుడు ఆయన సర్వాధికారమును బట్టి యోహాను పేతురును లోపలకు తీసుకు వెళ్ళునట్లు అనుమతించెను. తద్వారా పేతురు తన వైఫల్యము నుండి ఒక పాఠమును నేర్చుకొనునట్లు చేశాడు. అతడి విద్యలో ఈ భాగము పూర్తవకపోయినట్లయితే అతడు అపొస్తులులకు నాయకుడు కాకపోయి యుండును.

పేతురును శోధించుటకు సాతాను యొక్క దూతలు సిద్ధముగా నుండిరి, కాని దానికి దేవుని అనుమతి కావలసి యుండెను. కాని యేసుప్రభువు పేతురు యొక్క విశ్వాసము ఆ పడిపోయిన సమయములో సడలి పోకుండవలెనని ప్రార్ధించు చుండెను (లూకా 22:31,32). యేసుప్రభువు యొక్క ప్రార్ధనకు జవాబివ్వబడెను. పేతురు ఆ అనుభవము నుండి ఒక విరిగిన, కనికరము కలిగిన వానిగా బయటకు వచ్చెను. అతడు తన జీవితములో ఇంక ఎప్పుడు పాపులను దురుసుగా తిరస్కరింపజాలడు. అతడు అట్లు చేయుటకు శోధింపబడినప్పుడు, అతడు తన స్వంత వైఫల్యమును గుర్తుతెచ్చుకొని ఇతరులను తిరస్కరించు మాటలను మరియు స్వరమును తగ్గించుకొనును.

నీకు విశ్వాసముండినట్లయితే నీ జీవితములో జరిగిన ఘోరమైన పరిస్థితులను దేవుడు నీకు మేలుకరముగా మార్చును. పెంతెకొస్తు దినమునకు ఏడు వారములు ముందు వరకు పేతరు ఆ భయంకరమైన రాత్రి యోహాను అతడిని లోపలకు తీసుకువెళ్లుటకు అనుమతి పొందకుంటే బాగుండునని, ఆ విధముగా అతడు ముమ్మారు ప్రభువును ఎరుగనని చెప్పకుండా యుండేవాడనని అనేకమార్లు అనుకొని యుండవచ్చును. కాని అప్పుడు అతడు విరుగగొట్టబడి యుండేవాడు కాదు మరియు పెంతెకొస్తు దినమున సువార్త ప్రకటించుటకు అనర్హుడై యుండేవాడు.

పేతురు యింకను పాపమునకు వ్యతిరేకముగా బోధించెనని మనకు తెలియును. అతడు తన పత్రికలో ''పాపము చేయని'' యేసు యొక్క అడుగు జాడలలో వెళ్ళుట గురించి మరియు పాపముతో జోలి లేకుండుట గురించి వ్రాసెను (1 పేతురు 2:2,22, 4:1,2). కాని ఇప్పుడు అతడు కరుణతో బోధించెను. అందువలనే పెంతెకొస్తు దినమున యూదులకును మరియు అన్యజనులకును కూడా కొర్నేలీ యింటిలో సువార్త ద్వారమును తెరచు అవకాశము అతనికి యివ్వబడెను. దేవుడు ఆ సంఘటనలో యోహానును గాని యాకోబును గాని వాడుకొనియుండవచ్చును. కాని ఆయన అలా చేయలేదు. ఆయన ఘోరముగా విఫలమైన పేతురును ఉపయోగించుకొనెను. దానికి కారణం పేతురు త్రోవ తప్పిన పాపులతో ఎక్కువ కనికరముతో మాటలాడగలడు.

దావీదు పేతురువంటి మరియొకడు. ఒకసారి బద్ధకముతో యుధ్ధభూమికి వెళ్ళుటను తప్పించుకొనుట వలన, అతడు ఘోరమైన పాపములో పడ్డాడు. ఆ పాపము అతడి మిగిలిన జీవితములో మరియు అటు తరువాత శతాబ్దాల తరబడి అతడికి వ్యతిరేకముగా నల్లని మచ్చవలె ఉండిపోయినది (2 సమూయేలు 11:1-5). ''దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యధార్ధముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను'' (1 రాజులు 15:4) అని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు.

అయినప్పటికి దేవుడు దావీదు యొక్క వైఫల్యాన్ని అతడు విరుగ గొట్టబడుటకు మరియు దావీదు వ్రాసిన మిగిలిన వాటన్నిటికంటె లక్షలమంది జనులకు దీవెనకరముగా నుండునట్లు ప్రేరేపణ కలిగిన లేఖన భాగముగా 51వ కీర్తన వ్రాయునట్లు చేశారు. దావీదు అంతకంటె చిన్న పాపములో పడినట్లయితే అటువంటి కీర్తనను ఎప్పటికిని వ్రాసి యుండేవాడు కాదు. దావీదు పూర్తిగా విరుగగొట్టబడి దీనుడిగా చేయబడునట్లు అతడి వైఫల్యము చాలా తీవ్రమైనది, లోతైనది మరియు అందరికి బహిరంగమైనదిగా యుండవలసి యుండెను. ఆ విధముగా అతడు తన మిగిలిన జీవిత కాలమంతా విరిగిన వానిగా యుండెను.

యేసు ప్రభువు తన్నుతాను దావీదు కుమారునిగా పిలుచుకొనెను!

వైఫల్యము ద్వారా విరుగగొట్టబడుట

మనము అపొస్తలులుగా ప్రవక్తలుగా అగుటకు మనము వెళ్ళి పాపము చెయ్యవలెనని నేను చెప్పుటలేదు! అలాగు ఎప్పటికీ కాదు. అయితే నీవు ఇప్పటికే ఘోరముగా పడిపోయినట్లయితే, ఇంక నీకు ఏ నిరీక్షణా లేదని అనుకొనక్కరలేదు. నీవు ఇప్పటికిని ఒక నమ్మకమైన దేవుని సేవకుడివి కాగలవు.

మనము అన్ని సమయములలో విజయముతో జీవించునట్లు దేవుడు మనకు కృపనిచ్చుటకు ఆశ పడుచున్నాడు. కాని ఆయన దీనులకు మాత్రమే కృపనిచ్చును మరియు తరచు మనలను ఘోరమైన పాపములో పడుటకు అనుమతించుట ద్వారా మాత్రమే ఆయన మనలను దీనులుగా చేయగలుగుటను ఆయన కనుగొనెను. అది శ్రేష్టమైన పద్ధతి కాదు. యేసు ప్రభువు ఎప్పుడు పాపములో పడకుండగానే దీనుడుగా నుండెను. కాని పేతురు, దావీదు మరియు అనేక ఇతర దైవభక్తులు యేసువలె ఉండలేకపోయిరి. అయితే అద్భుతమైన విషయమేమనగా ఘోరముగా పడిపోయిన పేతురులను మరియు దావీదులను కూడా దేవుడు ఉపయోగించుకొన్నాడు. అయితే అది వారి వైఫల్యము గురించి పశ్చాత్తాపపడి ఏడ్చినప్పుడే తప్ప వేరొక విధముగా కాదు. ''బర్నబా వ్రాసిన పత్రిక'' యొక్క మొదటి శతాబ్దపు రచయిత ఇలా చెప్పాడు, ''తన సువార్తను ప్రకటించుటకు ప్రభువు తన అపొస్తలులను ఏర్పరచుకొన్నప్పుడు, ఆయన నీతిమంతులను కాక పాపులను మారుమనస్సు పొందుటకు పిలచెనని చూపించుటకు ఆయన పాపులలో ఘోరమైన వారిని ఏర్పరచుకొనెను''.

దేవుడు పేతురుకు మరియు దావీదుకు ఏమిచేసెనో నీకును అట్లే చేయును. హవ్వ పండును తినుటకు యిచ్చినందువలన లేక లోపలకు వెళ్ళుటకు అనుమతిమ్మని ద్వారపాలకురాలిని యోహాను అడుగుట వలన నీవు పాపము చేశావని ఫిర్యాదులు చేయుట మానుము. నింద నీపై వేసుకో. నీవు పడిపోవుటకాని పాపము చేయుటకాని దేవుని చిత్తము కాదు. కాని నీవు ఇప్పుడు తప్పిపోయావు కాబట్టి నీ జీవితంలో ఇంకెప్పుడూ ఇతరులపై కరిÄనముగా నుండకుండునట్లు నిన్ను విరిగిన వానిగా చేసి, నీ వైఫల్యమును కూడా ఆయన మహిమకొరకు మరియు నీ మేలు కొరకు సమకూడి జరుగునట్లుగా దేవుడు చేయును. గనుక దేవుని స్తుతించుము. గొఱ్ఱెపిల్ల రక్తముచేత మరియు నీ సాక్ష్యపు మాటలచేత సైతానును జయించుము. విశ్వాసముతో మాటలాడుము, ఒక విరిగిన వానిగా నుండుము, నీ మిగిలిన జీవితకాలమంతా పేతురు మరియు దావీదు వలె నుండుము.

మనము పుట్టకముందే దేవుడు మన జీవితముల గూర్చి ప్రణాళిక వేసెను. ''నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంధములలో లిఖితము లాయెను. దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి. వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి. నేను మేల్కొంటినా యింకను నీ యొద్దనే యుందును'' (కీర్తనలు 139:16-18) అని దావీదు అన్నాడు.

పై అట్టపై నీ పేరు వ్రాయబడిన ఒక దినచర్య పుస్తకము దేవుని యొద్ద నుండెనని దాని అర్ధము. అందులో నీ జీవితములో ప్రతిదినముయొక్క దేవుని ప్రణాళిక వ్రాయబడి యుండును. నీవు పుట్టుటకు శతాబ్దాల ముందే, నీ తల్లిదండ్రులు ఎవరు, నీవు ఏ దేశములో పుట్టుదువు మరియు నిన్ను క్రీస్తు వద్దకు తెచ్చుటకు ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితులు ఆయన వ్రాసి యుండెను. ఆ దినచర్య పుస్తకములో నీకు ఆత్మీయ విద్య నిచ్చుటకు ఆయన నిన్ను ఎటువంటి శ్రమలగుండా తీసుకు వెళ్ళుననునది కూడా వ్రాయబడెను. మరియు నీవు చేయు తప్పిదములను ఆయన మహిమ కొరకుఎట్లు వాడుకొనునో కూడా వ్రాయబడి యుండును. ఇప్పుడు నీవు చేయవలసినదల్లా నీ దినచర్య పుస్తకములో ఒక్కొక్కదినము గూర్చి వ్రాయబడినది చూపించుమని దేవుని అడుగుటయే. దేవుడు నీ కొరకు తయారు చేసిన ప్రణాళిక కంటె శ్రేష్ఠమైన ప్రణాళికను నీవు ఎప్పటికీ తయారు చేసికొనలేవు. కావున, ఆయన చిత్తము పరలోకమందు ఎలాగు నెరవేర్చబడునో అలాగునే ఈ భూమిపై నెరవేర్చుదునని ఆయనకు చెప్పుము.

అటువంటి తండ్రి మనకు పరలోకములో నున్నందుకు మరియు సాతానును మన కాళ్ళక్రింద తొక్కించుటకు మరియు మనకు వ్యతిరేకముగా అతడు చేయు ఆరోపణలన్ని సంపూర్తిగా లయపరచు అద్భుతమైన సువార్తను బట్టి దేవునికి స్తోత్రము.

అధ్యాయము 9
నీవు సేవించేది దేవునినా లేక ధనాన్నా

''ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను'' (లూకా 16:13).

మనము దేవునిని మరియు సాతానును ఇద్దరిని కలసి సేవింపలేమని ప్రతి ఒక్కరికి తెలియును. కాని అదే విధముగా దేవునిని మరియు సిరిని(ధనము మరియు వస్తు సముదాయము) రెంటిని కలిసి సేవింపలేమని చాలా కొద్దిమందికే తెలియును.

యేసు ప్రభువు చెప్పిన నాలుగు విషయాలను ఇక్కడ జాగ్రత్తగా గమనించండి:

  1. నీవు నిజముగా దేవునిని ప్రేమించి నట్లయితే, నీవు ధనమును ద్వేషించుదువు.
  2. నీవు నిజముగా దేవునిని హత్తుకొని యుంటే, నీవు ధనమును తృణీకరించెదవు.
  3. నీవు ధనమును ప్రేమించినట్లయితే, నీవు దేవునిని ద్వేషిస్తున్నావని అది రుజువు చేస్తుంది.
  4. నీవు ధనమును హత్తుకొనియుంటే, నీవు దేవునిని తృణీకరిస్తున్నావని అది రుజువు చేస్తుంది.

చాలా మంది ''విశ్వాసులు'' అని పిలువబడే వారు దీనిని గ్రహించరు కాని వారు ధనమును మరియు వస్తు వాహనాలను ఎంతగానో ప్రేమించుట చేత వారు దేవునిని ద్వేషించి ఆయనను తృణీకరించుచున్నారు.

ఒక విశ్వాసి వేరొక విశ్వాసి కంటె సిధ్దాంతముల విషయములో తాను ఎంతో పవిత్రముగా ఉన్నానని అనుకొనవచ్చును. అయితే ఆ ఇరువురు ధనమును ప్రేమించినట్లయితే, అప్పుడు ఆ ఇరువురు దేవునిని ద్వేషించుచున్నారు. పరిసయ్యులకు సిద్ధాంత పరమైన పవిత్రత ఉండేది (మత్తయి 23:3) మరియు వారు బాహ్యముగా మతాసక్తితో ఉండేవారు కాని వారు దేవునిని ప్రేమించే వారు కాదు. వారు ధనమును ప్రేమించేవారు (లూకా 16:14).

నీకు సాతాను విషయములో తటస్థ వైఖరి ఉండనట్లే, ధనము విషయములో కూడా తటస్థ వైఖరి ఉండకూడదు. నీవు సాతానును ప్రేమించడంగాని లేక ద్వేషించడంగాని చెయ్యవలెను. అదే విధముగా, నీవు ధనమును ప్రేమించడం గాని లేక ద్వేషించడం గాని చెయ్యవలెను. నీవు ధనమును హత్తుకొని ఉండుట కాని లేక తృణీకరించుటకాని చేయుదువు.

దేవుడు మరియు సిరి ఒక అయస్కాంతమునకుండు రెండు ధృవములవలె ఈ రెండు విరుద్దమైనవి. నీవు ఒక ధృవమునకు ఆకర్షితుడవైతే రెండవ దాని చేత త్రోసి వేయబడుదువు (వికర్షించబడుదువు).

అటువంటప్పుడు మనము ధనమును ఎట్లు ద్వేషించగలము? అట్లా చేయుటకొరకు మత వైరాగ్యము తోను మరియు కరిÄనమైన క్రమశిక్షణతోను మనముండవలెనా? మనము ధనమును ద్వేషించుట నేర్చుకొనుట కొరకు సన్యాసాశ్రమమునకు లేక ''విశ్వాసముతో నడిపింపబడు చోటునకు'' వెళ్లవలెనా?

మనలను వైరాగ్యం గలవానిగానో లేక సాధువులుగానో లేక పాదిర్లుగానో చేయుటకు యేసు ప్రభువు రాలేదు! ఆయన ఈ లోకములో తన తల్లిని తమ్ముళ్ళను చెల్లెళ్ళను పోషించుట కొరకు చాలా సంవత్సరములు వడ్రంగిగా మామూలు జీవితమును జీవించెను. ఆయన అందరి వలె డబ్బు సంపాదించి దానిని ఉపయోగించెను. అయినప్పటికిని ఆయన తండ్రిని ప్రేమించి ధనమును ద్వేషించెను. మనము డబ్బును ఎలా ద్వేషించవలెనో గ్రహించుటకు బహుశా ఒక దృష్టాంతము సహాయపడును. ఒక యువతి ఒక యువకుడిని గాఢంగా ప్రేమించి అతడు లేకుండా జీవించలేనని భావించినది అనుకొండి. ఒక రోజున ఆమె ఇంకా చాలా అందగాడైన మరో యువకుని కలుసుకొనెను. ఇతడు ఆ మొదటి యువకుని కంటే ఆమెకు ఎంతో బాగా నచ్చెను. ఆమె ఈ రెండవ యువకుని ఇష్టపడిన తరువాత ఆ మొదటి యువకుడిని ఇంకెప్పుడు చూచుటకు ఇష్టపడదు. ఆమె ఆ మొదటి యువకుని కొరకు కలిగియున్న ప్రేమను ఎలా పోగొట్టుకొనెను? ఈ క్రొత్త ప్రేమ దానిని తొలగించుట ద్వారానే. మనము కూడా ధనాపేక్షనుండి విడిపించబడుటకు అదే మార్గము.

యేసు ప్రభువు యెడల ప్రేమ మన హృదయములో నిండినప్పుడు,మన హృదయములో అప్పటివరకు ధనముపైనుండిన ప్రేమకు స్థానముండదు. ఒక గదిలోనికి వెలుగు వచ్చినప్పుడు అందులోని చీకటి ఒక్కమారుగా పారిపోవును.

గనుక నీవు దేవున్ని ప్రేమించుటకు గాను ధనమును ద్వేషించుమని మేము బోధించుటలేదు. అలాకాదు. అది మేము ధనమును ద్వేషించుచున్నాము మిగిలిన విశ్వాసులంతా దానిని ప్రేమించుచున్నారు అని భావించు పరిసయ్యులను తయారుచేయు వ్యతిరేక ఫలితమిచ్చు సందేశముగా యుండును.

మేము క్రీస్తును పైకెత్తుట చేత జనులు ఆయన యొద్దకు ఆకర్షింపబడి, వారి హృదయాలంతటితో ఆయనను ప్రేమించుదురు. వారు ఎప్పుడైతే(దేవుని ప్రేమతో నింపబడి) వారి హృదయమంతటితో ప్రభువును ప్రేమింతురో అప్పుడు వారు అప్రయత్నముగా వారికి వారే ధనమును ద్వేషింతురు. ఎవరైనా అప్పటికిని ధనమును ప్రేమించుచుండినట్లయితే అది అతడు తన హృదయమంతటితో యేసు ప్రభువును ప్రేమించుటలేదని తెలియజేస్తుంది.

మేము ధనము వెనుక పరిగెత్తుటలేదని లేక దాని కొరకు ఆశపడుట లేదని కేవలం చెప్పుటతో సరిపోదు. అది ఒక బలహీనమైన మరియు ప్రతికూలమైన వ్యాఖ్య. మనము ధనమును ద్వేషించి దానిని తృణీకరించుచున్నామని మనము ఒక సానుకూలమైన ఒప్పుదలను కలిగియుండవలెను. అది మన జీవితాలలో నిజముకాని యెడల, మన అవసరతను ఒప్పుకొని ప్రభువును ధనాపేక్ష నుండి విడుదల కొరకు వేడుకొనుట శ్రేష్టమైన విషయము. ఈ విషయములో మన విషయములో మనము ఎంతో యధార్థముగా ఉండవలెను. ఆ విధముగా మాత్రమే ఈ విషయములో మనలను మనము మోసపరచుకోకుండా ఉండగలము. మన ధనము పెరుగుట మనకు ఉత్తేజము కలిగేలా చేస్తుందా? ఇంకా ఇంకా ధనము సంపాదించాలని మనకు ఆశగాయున్నదా? ఈ రెంటిలో దేనికైనా మన జవాబు అవును అని వచ్చినట్లయితే, అది మనము ధనమును ప్రేమిస్తున్నామనియు మరియు సిరిని సేవించుచున్నామను దానికి తేటయైన గుర్తు.

అనేకమంది విశ్వాసులు ధనము అధికమగుట వారి జీవితాలపై దేవుని యొక్క ఆశీర్వాదమనుకొనే బుద్దిహీనులుగా యుందురు. కొందరు విశ్వాసులు వారు ఒక రోజున లాటరీలో గెల్చుటకు దేవుడు సహాయము చేయునని కూడా ఆశించుచుందురు!! జనులను సిరిని ఆరాధించేలా చేయుటకు సాతాను ఏర్పర్చిన ఒక పద్దతి లాటరీలు. ఒకడు ఒక లక్షరూపాయలను ఒక రూపాయి టిక్కెట్టు కొనుట ద్వారా పొందును. అతడు పొందిన లక్షరూపాయలు నిరాశ చెందిన లక్షమంది యొక్క సొమ్ము. అది తప్పనిసరిగా దుష్టత్వము.

''ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు'' అని బైబిలు చెప్పుచున్నది (1 తిమోతి 6:9).

లోతు ధనికుడు కావలెనని కోరుకొని ఆ ప్రయత్నంలో తన కుటుంబమును నాశనము చేసికొనెను. బిలాము ధనికుడు కాగోరి ప్రవక్తగా తన యొక్క పిలుపును పోగొట్టుకొని నరకమునకు వెళ్లెను. గెహాజీ ధనికుడు కాగోరి ప్రవక్తగా తన యొక్క పిలుపును పోగొట్టుకొనుటయే కాకుండా తన పైకి మరియు తన బిడ్డలపైకి కుష్ఠురోగమును తెచ్చుకొనెను.

విశ్వాసులు ధనికులగుటకు వారి అవసరము కంటె ఎక్కువగా ఆస్తులను కూర్చుకొనుట మొదలుపెట్టుట చేత బాగుగా ఆత్మానుసారముగా ఎదుగుచూఉన్న దశలో అకస్మాత్తుగా వెనుకకు జారిపోయిన విషాదకరమైన ఉదాహరణలు మరల మరల చూచుచున్నాము.

అటువంటి విశ్వాసులకు ధనము వారికివ్వగలిగిన సంతోషము యొక్క రుచిని కొద్దిగా ఇచ్చుట ద్వారా సాతాను వారికి ఎరవేసెను. (ఇది మాదకద్రవ్యములు అమ్మేవారు యౌవనస్తులకు ఆ మాదక ద్రవ్యాల యొక్క రుచిని చూపించినట్లుండును). ఆ విధముగా సాతాను సిరి కొరకు వారికి ఆకలి కలుగజేసెను. అతడు వారిని కొద్ది కొద్దిగా నడిపించెను, చివరకు వారు సిరిని వదలలేక పోవుట చేత తమను తమ కుటుంబాలను నష్టములోను, నాశనములోను పడవేసుకొనిరి. సంఘమును కట్టవలసిన జీవితములు ఇప్పుడు ధనము కొరకు ప్రయాసపడుటలో వ్యర్థ మగుచున్నవి. అటువంటి విశ్వాసులు తమ జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట కూటి కొరకు అమ్మివేసిరి! నిత్యత్వములో వారెంత పశ్చాత్తాపపడుదురో ఆలోచించండి!

కాబట్టి వివేకులైన విశ్వాసులందరు ఒక కట్టడము యొక్క పదియవ అంతస్తు నుండి దూకకుండునట్లే, ధనము కొరకు ప్రయాసపడరు. ఈ రెండు చర్యలలో ఏదైనను వారిని నాశనము చేయునని వారికి తెలియును. లేఖనముల యొక్క హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా దేవుడు తమను కాపాడునని తాము ఆశించలేమని వారు గ్రహించుదురు.

ఒకడు పడిపోవుటకు అతడు నిజముగా ధనము వెనుక పరిగెత్తనక్కర్లేదు. ఒకడు తన హృదయములో ధనమును ప్రేమించి కూడా పడిపోవచ్చును. ''ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి'' (1 తిమోతి 6:10).

ఒక యువకుడు ఒక యువతి వెనుక పరుగెత్తకుండానే తన హృదయములో ఆమెను ఎలా ప్రేమించగలడో, ఒకడు డబ్బు వెనుక పరుగెత్తకుండానే తన హృదయములో రహస్యముగా దానిని ప్రేమించగలడు. ఒక విశ్వాసి పడిపోవుటకు అది చాలును. ప్రభువైన యేసును తన హృదయమంతటితో ప్రేమించుటకు నిశ్చయించుకొనని వాడెవడును సంఘమును కట్టలేడు. మనము డబ్బును ద్వేషించుట మరియు దానిని తృణీకరించుట మొదలుపెట్టినప్పుడు మనము మన హృదయాలంతటితో ప్రభువును ప్రేమించుచున్నామని తెలుసుకోగలము. ప్రభువు యెడల తమ ప్రేమ యొక్క పరీక్షగా దీనిని తీసుకొనుటకు ఎంతమంది ఇష్టపడుచున్నారు? మనము డబ్బును ఇంకా ప్రేమించిన యెడల మనము అతిశయపడే మన ఆత్మీయత ఏమి విలువలేనిది.

ధనమునకు సంబంధించి మనకున్న రెండు బాధ్యతలను గూర్చి యేసుప్రభువు మాట్లాడారు. ''కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను'' (మత్తయి 22:21).

  1. కైసరువి కైసరుకు చెల్లించుడి అనునది ధనము విషయములో నీతిగా ఉండుట గూర్చి చెప్పుచున్నది.
  2. దేవునివి దేవునికి చెల్లించుడి అనునది ధనమును ఉపయోగించుటలో నమ్మకత్వము కలిగియుండుట గూర్చి చెప్పుచున్నది.

ధనమునకు సంబంధించిన విషయములలో నీతిగా యుండుట

ధనమునకు సంబంధించిన విషయములలో నీతిగా యుండుట అను చిన్న తరగతి గుండా మొదట వెళ్లకపోయినట్లయితే, మనము ధనమును ద్వేషించి తృణీకరించలేము. దీని అర్ధము కైసరుకు సంబంధించినవి మనము అతడికి ఇచ్చివేయవలెను. వేరొక విధముగా చెప్పవలెనంటె, ఇంకొకరికి సంబంధించినవి ఏవీ మన యొద్ద ఉండకూడదు.

ప్రభుత్వానికి (కైసరుకు) చెల్లించవలసిన పన్నులు మోసగించుట ద్వారా మనము దానికి ఋణపడియుండకూడదు. అట్లే ఇతరులనుండి దేనినైనా తీసుకొని తిరిగి వారికి ఇవ్వకుండా లేక ఇతరులనుండి (లేక ఆఫీసునుండి) మోసగించి తీసుకొన్నవి లేక నీతి తప్పి సంపాదించిన సొమ్ము ఎంతైనా మనయొద్ద ఉంచుకొనకూడదు. మనము అవినీతితో సంపాదించిన దేనిపైనైనా శాపముండును. నీవు ఎవరికైనా బాకీ ఉండినట్లయితే, నీ తలపైనా నీ బిడ్డల తలపైనా శాపము వ్రేలాడుటకు బదులు, నీవు పస్తులుండి నీ బాకీ తీర్చుకొనుట మేలు.

మనము గతములో తప్పుగా తీసుకొనిన డబ్బు మరియు ఇతర వస్తువులను తప్పక తిరిగి ఇచ్చి వేయవలెను. ఆ విధముగా ఇచ్చుటకు కొన్ని సంవత్సరాలు పట్టినా అట్లు చేయవలెను. జక్కయ్య అట్లు తిరిగి యిచ్చుటకు నిర్ణయించుకొనిన వెంటనే అతడి గృహము ఆశీర్వదింపబడినది (లూకా 19:9). నీవు అటువంటి నిర్ణయము తీసుకొనిన వెంటనే నీ యిల్లు కూడా దీవింపబడును. నీ అప్పు ఎంతో ఎక్కువైనా, నీవు నిరుత్సాహ పడకు. నీవు ఎంత ఇవ్వగలిగితే అంత తిరిగి చెల్లించుట మొదలుపెట్టు. చివరకు అది నెలకు పది రూపాయిలైనా కావచ్చును. ''ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును'' (2కొరిందీ¸ 8:12) అని బైబిలు చెప్పుచున్నది. నీకు హృదయములో ఆశ ఉన్నట్లయితే, నీవు ఇవ్వవలసినదంతా ఇచ్చావా లేదా అనుదానికంటె, తిరిగి ఇచ్చుటకు నీకుండిన సామర్ద్యమును బట్టి దేవుడు నిన్ను అంగీకరించును.

నీ యింటిలో అవినీతితో కూడబెట్టిన వస్తువులు కాని, డబ్బు కాని ఉండినట్లయితే నీ యింటిలో ''దేవుడు ఈ గృహమును ఆశీర్వదించును'' అని వ్రాసియుంచిన వాక్యము గోడకు వ్రేలాడదీసి యుండుటలో ఉపయోగమేమీ లేదు. దేవుడు అటువంటి గృహమును ఎప్పుడు దీవించలేడు.

నీ జీవితములో అటువంటి ఆర్దిక పరమైన అవకతవకలను నీవు సరిచేసికొనక పోయినట్లయితే నీవు నీ వెనుక ఒక గొలుసును కట్టుకొని, వెళ్లిన ప్రతి చోటుకు దానిని ఈడ్చుకు వెళ్లుదువు. ప్రభువు అకస్మాత్తుగా తిరిగి వచ్చినట్లయితే, ఎత్తబడుటకు నీవు అనర్హుడుగా యుందువు. చాలామంది విశ్వాసులు అనబడేవారు ప్రభువు తిరిగి వచ్చునప్పుడు ఈ ఒక్క కారణము వలన విడిచి పెట్టబడుదురు.

''ఎవనికిని ఏమియు అచ్చియుండవద్దు'' (రొమా 13:8) అని బైబిలు మనకు ఆజ్ఞాపించుచున్నది. మనము అన్నివిధములైన అప్పులు మరియు వస్తువులను అరువుపై కొనుటను తప్పించుకొనవలెనని దాని అర్థము. లోకము మనకు చెప్పునట్లు ''ఇప్పుడు కొని తరువాత చెల్లించుట'' కంటె ''ఇప్పుడు కూడబెట్టి తరువాత కొనుట'' మంచిది.

అత్యవసర పరిస్థితులలో, నీవు ఎవరో ఒకరి నుండి అప్పుతీసికొని యుండవచ్చును. అయితే దానిని నీకు అవకాశము వచ్చిన వెంటనే తీర్చివేయుటకు సిద్దపడుము. అట్లు అప్పుతీర్చుటకు అవసరమైతే నీ యింటిలో నున్న బంగారమును అమ్మివేయుము. నీవు ఫలానా రోజున నీ బాకీ తీర్చుదునని చెప్పి అట్లు చేయలేక పోయినట్లయితే నీవు బాకీ ఉండిన వాని యొద్దకు వెళ్లి, నిన్ను నీవు తగ్గించుకొని, క్షమించమని అడిగి బాకీ తీర్చుటకు మరి కొంత సమయము అడుగుము. దాని గూర్చి మౌనముగా నుండి, నీకు తోచినప్పుడు అది తీర్చినట్లయితే అది దుర్నీతి.

నీవు బాకీ ఉన్నవారు ఇప్పుడు ఎక్కడున్నారో నీకు తెలియనట్లయితే, ఆ సొమ్మును సంఘమునకు ఇవ్వవచ్చును. ఎందుకనగా ప్రాయశ్చిత్తమునకు సంబంధించినదంతయు (ధనమంతయు చివరకు) దేవునిది (సంఖ్యా 5:8). కాని అటువంటి సొమ్మును మనము ఉంచుకొనకూడదు. న్యాయముగా మనదికాని ధనము మన యొద్దనుండినట్లయితే దానిపై శాపముండును.

సిరికి దాసులైన విశ్వాసులను చాలా తేటగా వివాహములలో చూచుదుము. అక్కడ దురాశ మరియు లోభత్వము సిగ్గులేని విధముగా కనుపరచబడుటను మనము చూచుదుము. ప్రతి సంఘశాఖలో విశ్వాసులు అనుసరించుచున్న వరకట్న విషయము ఆలోచించండి, వరకట్నము అడుగువారు క్రీస్తునామమునకు అవమానమును తెచ్చుచున్నారు మరియు వారు ఎట్టి పరిస్థితులలో కూడా ఆయన శిష్యులుకారు. వరకట్నము (డౌరీ) పొందాలని ఎదురు చూచేవారు కూడా అంతకంటే వేరైన వారేమీ కాదు.

అనేక వివాహ విందులలో ఎంతగానో వ్యర్థమగుచుండిన సొమ్మును గూర్చి కూడా ఆలోచించండి. నీవు ఖర్చు పెట్టగలిగినట్లయితే మంచి వివాహవిందు చేయుటలో తప్పులేదు. వివాహవిందులో యేసుప్రభువే మరి ఎక్కువ ద్రాక్షారసమును చేసారు. కాని అనేక విశ్వాసులు గొప్ప విందు చేయుటకు అప్పుచేయుదురు. అది చెడ్డపని. ''అప్పుచేసి'' గొప్ప విందుచేయుట కంటే, సామాన్యముగా నుండే విందుచేయుట ఎంతో మంచిది. అయ్యో అటువంటి సమయములలో అనేకుల మనసులో అప్పుడుండిన ఆలోచన ''ఇతరులు ఏమనుకొందురు?'' అనే కాని ''దేవుడు ఏమనుకొనును?'' అని కాదు. వారు దేవుని అభిప్రాయమునకు భయపడుటకంటే మనుష్యుల అభిప్రాయమునకు ఎక్కువ భయపడుదురు.

మనము ఈ సందేశమును సంఘములో ఎటువంటి పరిస్థితిలోను కల్తీచేయకూడదు. మన ప్రదేశములో రాజీపడిన అనేకమందితో కంటె హృదయపూర్వకముగా అనుసరించే కొద్దిమందితో సంఘమును కట్టుట మంచిది.

ధనము విషయములో నమ్మకముగా ఉండుట

ఒక మారు మనము ధనము విషయములో నీతిగా యుండుట నేర్చుకొనియుంటే, మనము ధనము విషయములో నమ్మకముగా యుండుట అనే పెద్ద తరగతికి వెళ్లవలెను.

మనము దేవునివి దేవునికి ఇవ్వవలెనని యేసు ప్రభువు అనిన దానిలో అర్థమేమిటి? దాని అర్థము మనము దశమ భాగము (మన ఆదాయములో 10 శాతము) ఇవ్వవలెననా? పాత నిబంధన క్రింద ఇశ్రాయేలీయులు దేవునికి ఇవ్వవలసినదంతా అదే. అది దేవుని యొక్క భాగము. ఒకసారి అలా యిచ్చివేసినట్లయితే మిగిలిన దంతా వారి స్వంతము. కాని క్రొత్త నిబంధన క్రింద అది వేరుగా నున్నది.

యేసు ప్రభువు ఆయన యొక్క జీవితము ద్వారా మనము100% ఇవ్వవలెనని చూపించెను. యేసు ప్రభువు తన తండ్రితో ''నావన్నియు నీవి'' (యోహాను 17:10) అన్నారు. ఆయన వచ్చి మనలను ధర్మశాస్త్రము యొక్క దాసత్వము నుండి విడదల చేసి (దశమ భాగము యిచ్చు దాసత్వము) కృప యొక్క మహిమకరమైన స్వాతంత్య్రము (దేవునికి 100% సంతోషముగా ఇచ్చు స్వాతంత్య్రము) లోనికి తీసుకు వచ్చారు.

దేవునికి మనము సమస్తమును ఇవ్వవలసియన్నది. అది ఏదో అటువంటి ఆజ్ఞ ఉన్నదని కాదు, కాని మనకుండిన సమస్తమును న్యాయంగా ఆయనవే అని గుర్తించుట చేత అట్లు చేయవలెను. ''భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి'' (అవి ఇండ్లు, పొలములు, బంగారము, వెండి లేక ఏవైనా) (1 కొరిందీ¸ 10:26).

మనము ఎక్కువ సంపాదించినట్లయితే, ''మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే'' (ద్వితీయో. 8:18) అను విషయమును ఎప్పుడు మరచిపోకూడదు. గనుక మన ఇష్టము వచ్చినట్లు ఖర్చుపెట్టుటకు మన యొద్దనున్న ద్రవ్యము మనదికాదు. ఇప్పుడు సంపద అంతా ఆయనదే కాబట్టి ప్రతి సందర్భములో ఆయన నడిపింపు కొరకు ఆయనను అడుగకుండా మనము ఖర్చుచేయుట లేక అప్పుఇచ్చుట లేక మన సొమ్మును ఇంకొకరికి యిచ్చుట మనము చేయలేము.

రెండవదిగా, మనము మన హృదయమంతటితో ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి మనము ప్రభువుకు సమస్తమును ఇచ్చుదుము. మన ద్రవ్యము ఇప్పుడు మన పరలోక పెండ్లికుమారునితో జాయింటు ఎకౌంటుగా యున్నది. మనము మనకు ప్రత్యేకముగా ఒక ఖాతా ఉంచుకొని అందులోనిది తీసి ప్రతినెల 10% ఇచ్చుట లేదు! ఇప్పుడు మనము ''ప్రభువా నావన్నియు నీవి'' అని చెప్పుదుము. అటువంటివాడు మాత్రమే దేవునిని ప్రేమిస్తున్నానని మరియు సిరిని ద్వేషిస్తున్నానని చెప్పగలడు.

ధనము విషయములో నమ్మకముగా ఉండుట అనగా మనము దేవునిని ఎంతగానో ప్రేమిస్తున్నాము కాబట్టి మనపై మనము అనగా ఆహారము, దుస్తులు మరియు ఇంటి అలంకరణలు మొదలైన వాటిపై అవసరమైన దానికంటె ఎక్కువ ఖర్చుపెట్టము. ''మనకు కలిగిన దంతయు విడిచిపెట్టుట'' (లూకా 14:33) అనుదానికి అర్థము అది. మనకు ఈ లోకమునకు సంబంధించినవి ఎన్నో ఉండవచ్చును, అయినను వాటిలో దేనిని మన స్వంతమైనట్టుగా అనుకొనము. వస్తువాహనాలన్నిటి నుండి మనము సంబంధమును త్రెంపివేసుకొనెదము, ఆవిధముగా మనము మన జీవితాలలో సిరిని ఆరాధించుట నుండి విడుదలపొందుదుము.

మనకు కలిగియున్న భూసంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టుట అనగా పవిత్రమైన హృదయము కలిగి యుండుట. పవిత్ర హృదయము స్వచ్ఛమైన మనస్సాక్షికి వ్యత్యాసమైనది. దేవునికి మాత్రమే స్థానముండి, సిరికి గాని మరి దేనికి గాని స్థానమివ్వనిది పవిత్ర హృదయము(శుద్ధ హృదయము).

ఒకనికి ఆత్మీయ బాధ్యతలు అప్పచెప్పవలెనా లేదా అనునది దేవుడు పరీక్షించేది ధనము మరియు భూసంబంధమైన విషయముల ద్వారానే. ''మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?'' అని యేసుప్రభువు చెప్పెను (లూకా 16:11).

దేవుడు మొదట సిరి విషయములో పరీక్షించకుండా ఎవనిని తన పరిచర్యలో వాడుకొనలేడు. ఈనాడు అనేక సంఘములలో ప్రవచన వాక్కు లోటుగా నుండుటకు కారణము వారి నాయకులు సిరిని గూర్చిన పరీక్షలో తప్పి పోవుటయే. అనేకమంది బోధకులు మరియు విశ్వాసులు సంవత్సరము తరువాత సంవత్సరము క్రొత్త ప్రత్యక్షతను పొందక పోవుటకు కారణము, వారి యొక్క ద్రవ్యమును వారు ఉపయోగించుటలో నమ్మకముగా ఉండకపోవుటయే. వారు వారిపై వారి ఆహారము, దుస్తులు మరియు ఇండ్లపై చివరకు విహారయాత్రలు క్రొత్త ప్రదేశములు చూచుట కొరకు ధనమును దుబారాగా ఖర్చుచేయుదురు.

సిరి విషయములో నమ్మకముగా ఉండుట అనగా అన్ని విధముల వ్యర్థపుచ్చుటను మానివేయుట కూడా అయియున్నది. యేసు ప్రభువు 5000 మందికి ఆహారమును పెట్టిన తరువాత, ఆయన ''ఏమియు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను'' (యోహాను 6:12). యేసుప్రభువు ఎటువంటి వృథానైనను యిష్టపడరు. అది రొట్టెముక్కలు చేపలకు మాత్రమే కాకుండా సమయమునకు మరియు ధనమునకు కూడా వర్తించును. దైవభక్తి అనేది ఖర్చులో పొదుపు మరియు దేవుడు మనకిచ్చిన దేనినైనను వృథాచేయకుండా జాగ్రత్తపడుటతో కూడినది.

మనము ధనమును ఉపయోగించుటలో నమ్మకముగా ఉండకపోయినట్లయితే, మనము దేవుని గూర్చి మరియు ఆయన వాక్యముగూర్చి పొందే గ్రహింపు సూటిగా మనము పొందేదికాక, నమ్మకముగా యుండిన ఇతరుల యొక్క ఒక ప్రసంగములనుండి పొందినదై యుండును. దేవుని వాక్యము గూర్చిన అటువంటి జ్ఞానము ఒక ప్రత్యక్షత కాదు గాని కేవలము లేఖనములు గూర్చిన వాస్తవాల యొక్క పై పై జ్ఞానమైయున్నది. అది ఖచ్చితమైన జ్ఞానము కావచ్చు కాని అందులో పరిశుద్దాత్ముని యొక్క అభిషేకము లేకుండాయుండును. ఈనాడు అన్ని గుంపులలో ఉండిన అనేక విశ్వాసుల యొక్క స్థితి ఇదే.

పూర్తికాల క్రైస్తవ పరిచారకులు మరియు ధనము

మనము ఇప్పుడు పూర్తికాల క్రైస్తవ పరిచారకుల సంగతి పరిశీలించెదము. సువార్తలలో ప్రభువు తనకు అపొస్తలులుగా నుండుటకు నిరుద్యోగి నెవరినీ పిలువలేదనే విషయాన్ని మొదట గమనించండి. పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను మరియు మత్తయిలను (వీరిని పిలుచుట గూర్చి మాత్రమే సువార్తలలో వివరించబడియున్నది) ప్రభువు పిలిచినప్పుడు వారు వారి యొక్క లోక సంబంధమైన వృత్తులలో నిమగ్నమైయుండిరి. ప్రభువు తనను వెంబడించమని వారిని పిలిచినప్పుడు వారికి లాభసాటిగా నుండిన లోకపు ఉద్యోగములను వారు విడిచి పెట్టిరి.

లౌకికమైన వృత్తిలో ఉన్నవారిని మాత్రమే ప్రభువు పిలచుటకు మూడు కారణములున్నవి.

  1. దేవుడు ఆత్మీయమైన పరిచర్య మనకు ఇచ్చుటకు ముందు, మనము ధనమును లౌకిక ప్రపంచములో ఉపయోగించు విషయములలో మన నమ్మకత్వమును ఋజావు చేసికొనవలసి యున్నది. మరియు ధనము విషయములో నమ్మకత్వమును దానిని మనకు మనము సంపాదించినప్పుడే ఋజువు చేసికొనగలము. మనము బహుమానముగా పొందిన సొమ్మును, ఇతరులకు గాని లేక దేవుని పనికిగాని సుళువుగా ఇవ్వగలము. అందులో మనకు పెద్దగా బాధ ఉండకపోవచ్చును. మనకు మనము కష్టపడి సంపాదించినది ఇచ్చినప్పుడే మన దాతృత్వమును ఋజువు చేసికొనగలము.
  2. మనము కల్వరి సిలువపై చూచిన విధముగా దేవుడు లోకమును త్యాగము అనే నియమమును బట్టి నడిపించుచున్నాడు. గనుక మనము ప్రభువును సేవించుటకు వెళ్లినప్పుడు ఎప్పుడు త్యాగము ఉండవలెను. అలా కానట్లయితే మనము ప్రభువుకు సేవకులుగా ఉండము. ప్రభువును సేవించునప్పుడు మనము ఆర్థికముగా లాభపడుటకు లేక మనము ఎవరికైతే సేవ చేయుచున్నామో, వారిచ్చే కానుకల ద్వారా వారికంటే మనము ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే లేక వారికంటే మనము ఎక్కువైన స్థాయిలో జీవించుచుండినట్లయితే, అప్పుడు మనము ''దైవభక్తి'' అని చెప్పుకొనునది మనకు నష్టము కలిగించనిదిగాను మరియు త్యాగము లేనిదిగాను ఉండి అది మనకు లాభముగానుండును. అప్పుడు మనము యేసుప్రభువు పారద్రోలిన దేవాలయములో రూకలు మార్చు వారివలెనుందుము. యేసు ప్రభువు మనలను కూడా బయటకు పారద్రోలును.
  3. మనము సంఘములో ఎవరికైతే దేవుని యొక్క వాక్య పరిచర్య చేయుచున్నామో వారందరు లౌకిక వృత్తులలో నుండువారు. మనకు అటువంటి ఉద్యోగములలోనుండిన కష్టములు మరియు పోరాటముల గూర్చి అనుభవము లేకపోయినట్లయితే మనము మన మందకు ఆచరణాత్మకమైన సత్యాలు కాక సిద్ధాంతములు మాత్రమే బోధించిన వారమగుదుము. మన మనోజ్ఞానమునుండి కాక మన అనుభవమునుండి మనము బోధించవలెను.

ఈ మూడు కారణములను బట్టి యేసు ప్రభువు అప్పటికే వారి లౌకిక ఉద్యోగములను నమ్మకముగా చేయువారిని తనయొక్క అపొస్తలులుగా ఎంచుకొనెను. ఆయన ఈ 20వ శతాబ్దములో మనసు మార్చుకొనలేదు. ఈనాడు కూడా ఆయనను సేవించుటకు అటువంటి వారినే ఆయన ఎంచుకొనును.

భారతదేశములో ఎంతోమంది ''పూర్తికాల క్రైస్తవపనివారు'' వారి జీవిత కాలమంతటిలో ఎప్పుడు ఒక్కరోజైనా నిజాయితీగా లౌకిక వృత్తిలో పనిచేసి యుండరు. వారిలో చాలా మంది ఇతర కాలేజీలలో స్థానము దొరకక లేక నిరుద్యోగులైనందున బైబిలు కళాశాలకు వెళ్లియుందురు. అటువంటి వారిలో చాలామంది ఈనాడు వారి యొక్క పాశ్చాత్య సంబంధముల ద్వారా వారు లౌకిక ఉద్యోగములలో నుండినప్పుడు ఎప్పటికీ కొనలేని ఇళ్లను, స్థలములను కొనగలిగి ఎంతో సంపద పోగుచేసికొనియుండిరి. వారి యొక్క క్రైస్తవత్వము వారికి ఊహించని లాభములుతెచ్చిపెట్టినది. కాని బైబిలు వారిని ''చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులైనవారు'' (1తిమోతి 6:5) అని పిలుచుచున్నది.

క్రైస్తవత్వమనగా పాశ్చాత్య మతమని, అది పాశ్చాత్య ధనముతో మరియు పాశ్చాత్య బోధకులతో ప్రోత్సాహింపబడుచున్నదిగా మన దేశవాసులకు భావమును కలుగజేసే అటువంటి వారి ద్వారా మన దేశములో క్రీస్తు సాక్ష్యమునకు గొప్ప ఆటంకము కలుగుచున్నది.

పాశ్చాత్య బోధకులు భారతదేశములోని వారి ప్రతినిధులకు పెద్ద మొత్తపు సొమ్ములను లేక పాశ్చాత్య దేశములకు ఉచితమైన పర్యటనలను ఇచ్చుట ద్వారా దేవుని పనిని ఆటంకపరచుదురు. భారతదేశములోని విశ్వాసులు ఆత్మీయ సహాయము కొరకు తమ పాశ్చాత్య నాయకులపై ఎంతగా ఆధారపడి యున్నారంటే, భారతదేశములో అపొస్తలులు ప్రవక్తలు ఎప్పటికీ లేవనెత్తబడరు మరియు ఇక్కడి సంఘములు ఆత్మీయముగా కాని ఆర్థికముగా కాని తమ స్వంత కాళ్ల మీద నిలబడుట నేర్చుకొనవు.

మన భారతదేశములో అనేకమంది ''పూర్తికాలపు పనివారు'' అపొస్తులుడైన పౌలు వలె ప్రభువును సేవించు సమయము వచ్చియున్నది. ఆయన తన జీవనోపాధి కొరకు డేరాలు కుట్టెను (అపొ.కా.18:3; 20:33-35)మనము కూడా ఈనాడు మన పోషణ కొరకు ఇతర విశ్వాసులపై మరియు సంఘములపై ఆధారపడకుండా మనలను మనము పోషించుకొనుట నేర్చుకొనవలెను.

''సువార్త ప్రకటించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు'' (1కొరిందీ¸ 9:14) అనునది నిజము, కాని అనేక ''పూర్తికాలపు పనివారు'' ఆ వాక్యమును తప్పుగాఉపయోగించుకొని ఏ విధమైన తేడాలు చూపకుండా ఇతరుల యొద్దనుండి ద్రవ్యమును తీసుకొని, చివరకు దేవునిని సేవించకుండా సిరిని సేవించువారై పోయారు.

పౌలు 1కొరిందీ¸ 9:15-18 వచనములలో, క్రీస్తుయొక్క అపొస్తలులుగా సేవ చేస్తూ తనను తాను పోషించుకొనుట ఏ విధముగా ఆధిక్యతయో మరియు ఘనతయో మనకు చెప్పుచున్నాడు. ఆయన దినములలో నుండిన బోధకులను బహిరంగపరచుటకును పౌలు చేసినట్లే తాము కూడా దేవుని పనిని చేయుచున్నామని వారు అతిశయపడుటకు వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు (2 కొరిందీ¸ 11:12) పరిశుద్ధాత్ముడు అట్లు సేవించుటకు పౌలును నడిపించెను.

పరిశుద్ధాత్ముడు భారతదేశములోని మా సంఘములన్నిటిలోను పెద్దలందరిని అదే విధముగా నడిపించెను. మేము బోధించే వారి యొద్దనుండి కానుకలు తీసుకోకుండా, మేము స్వయం పోషణ చేసుకొనుచు, సువార్తను ప్రకటించి, మందకు కాపరులుగా ఉన్నాము. ఆ విధముగా భారతదేశములో సిరిని సేవించుచున్న బోధకులను మేము బయటపెట్టుచున్నాము. వారి కాలములో యేసు ప్రభువుతోను పౌలుతోను ప్రజలు కోపపడినట్లే, ఇది అనేకమంది ధనాపేక్ష కలిగిన బోధకులను మాతో కోపపడునట్లు చేసినది. ప్రభువు ఇస్కరియోతు యూదాను మరియు దేమాను బయటపెట్టినట్లే, మాతో చేరి, తన పరిచర్య నిమిత్తము మంద నుండి ఆర్థికపరమైన లాభమును పొందాలని చూచిన వారెవరైనను ప్రభువు చేత కరిÄనముగా బయటపెట్టబడి మా మధ్య నుండి తొలగించబడిరి. ఈనాడు భారతదేశములో అపొస్తలులమని చెప్పుకొనే వారు అనేకమంది ఉన్నారు. కాని వారిలో ఎంత మంది ప్రభువును పౌలు వలే సేవించుచున్నారు? నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు! అనేకమంది మా పుస్తకములు చదివి, మా టేపులు విని, మా సందేశములు తమ స్వంతమైనట్టుగా బోధించుదురు. కాని వారు సిరిని ఆరాధిస్తూనే సేవించుచున్నారు. కాని మమ్మును మేము పోషించుకొని సువార్తను ఉచితముగా ప్రకటించే విధానములో వారు మమ్ములను అనుకరించరు.

కాబట్టి లేఖనములో నున్న సత్యములను గూర్చి వారికి దేవుని యొద్దనుండి ప్రత్యక్షత ఉండదు. వారు వారి సందేశములను నేరుగా దేవుని నుండి కాక మా పుస్తకముల నుండి టేపులనుండి పొందుదురు. డబ్బు మరియు భౌతికపరమైన వస్తువుల విషయములో వారు నమ్మకముగా లేరని దైవికమైన ప్రత్యక్షత లేకపోవుటయే ఋజువు చేస్తుంది.

పేతురు, యోహానులు దేవాలయములో కుంటివానితో అతడికిచ్చుటకు వారి యొద్ద వెండి బంగారములు లేవని చెప్పిరి(అపొ.కా. 3:6). ఆ రోజులలో విశ్వాసులు ఈ అపొస్తలులకు వారి సొమ్మునెంతటినో ఇచ్చినా సరే వారట్లనిరి (అపొ.కా. 4:35). ఆ సొమ్ము బీదలకు పంచుటకు ఇవ్వబడినదని వారికి తెలియును. గనుక వారి చేతులలో నుండి ఎంతో సొమ్ము వెళ్లినా ఏదీ ఆ చేతులను అంటుకొనలేదు.

ఆ అపొస్తలులు వారు చేసిన పరిచర్యకు డబ్బును తీసుకొనుటకు నిరాకరించిరి! ఈ రోజులలో ఉన్న అనేకులు చాలా బాగా ప్రారంభించి చివరకు ఇస్కరియోతు యూదా వలె తయారగుదురు. ఆ అపొస్తలులు వారి వలే కాక, డబ్బు విషయములో నమ్మకముగా ఉండుటచేత చివరి వరకు తమ జీవితాల మీద దేవుని యొక్క అభిషేకమును నిలుపుకొనిరి.

క్రొత్త నిబంధన బిలాము తప్పుగూర్చి, బిలాము మార్గము గూర్చి మరియు బిలాము బోధ గూర్చి మనకు హెచ్చరిక చెయుచున్నది (యూదా 11; 2పేతురు 2:15; ప్రకటన 2:14).

ధనమును ప్రేమించి, ధనికుల నుండి ధనమును పొందుటకు బోధించిన బిలాము ఉదాహరణ అటువంటి పొరపాటులో మనము పడకుండునట్లు మనలను హెచ్చరించునట్లు మరల మరల క్రొత్త నిబంధనలో ఎత్తి చూపబడినది.

దైవభక్తి మనలో ఎవరికీ ధనమును, ఘనతను, లాభము చేకూర్చే సంబంధములు లేక ఏ ఇతరమైన వస్తు సంబంధమైన లాభము తెచ్చేదిగా యుండకూడదు. నిజమైన దైవభక్తి మన ఘనతకు మరియు ధనమునకు నష్టమును తెచ్చును. ఆ విధముగా మనము నమ్ముదాని కొరకు మనము ఒక వెల చెల్లించుదుము.

యేసుప్రభువు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన సంపదను మరియు ఘనతను పోగొట్టుకొనెను. మనమాయనను వెంబడించిన యెడల మనము కూడా వాటిని పోగొట్టుకొందుము. ఇస్కరియోతు యూదా వంటి వారే వారికి ఆత్మీయముగా పరిచయమైనవారి ద్వారా లాభము పొందుదురు. నీ యొక్క దైవభక్తి గూర్చిన వివరణ నీకు ఘనతను, సంపదను లేక ఆర్థిక లాభమును తెచ్చినట్లయితే నీవు ఇస్కరియోతు యూదాను అనుసరించుచున్నావు కాని యేసుక్రీస్తును కాదు.

దైవభక్తి తీసుకువచ్చే లాభము ఎప్పుడు ఆత్మీయపరమైనదే. దేవుడు మనదేశములో ఎవరైతే ఈలోకమునకు దాని యొక్క విలువల పద్దతి పూర్తిగా తప్పని మరియు ప్రేమయొక్క నియమమునుబట్టి సేవింపకపోయినట్లయితే ఈ లోకమునకు సంబంధించినదంతా విలువలేనిదని చూపే ఆశకలిగిన తీవ్రమైన స్త్రీ పురుషుల కొరకు చూచుచున్నాడు. అటువంటి వారు తాము జీవించు విధానము ద్వారా డబ్బే సమస్తము కాదని, విద్యే సమస్తము కాదని, సుఖవంతమైన జీవితమే సమస్తము కాదని, లోక ఘనతే సమస్తము కాదని చూపించుదురు. దానికి బదులు వారు తలక్రిందులైన లోకములో సత్యము కొరకు నిటారుగా నిలబడి ''దేవుడే సమస్తము'' అని చూపించుదురు. నీవు అటువంటి ఒక వ్యక్తిగా నుందువా? అటువంటి స్త్రీ పురుషులను ప్రభువు ఈనాడు మన దేశములో లేవనెత్తును గాక!

అధ్యాయము 10
బ్రద్దలైన ప్రాకారపు సందులో దేవుని యెదుట నిలుచుట

''నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు'' అని యెహోవా సెలవిచ్చెను (యెహెజ్కేలు 22:30).

ఈ అధ్యాయములో దేవుడు యెహెజ్కేలుతో ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి ఎందుకు వెళ్లిరో చెప్పుచుండెను (15వ). యెరూషలేము నరహత్య చేయు పట్టణమై, కొండెములు చెప్పి నరహత్య చేయువారు అందులో నివసించుచుండిరి (3,9వ) అని చెప్పుచుండెను.

ఈనాడు అనేక సంఘములు కూడా ఇటువంటి స్థితికి వచ్చియుండుట మనము చూడగలము. యెహెజ్కేలు 22వ అధ్యాయములో వరుసగా చెప్పబడిన పాపములను ఇప్పటి పాపములతో పోల్చిచూడండి. విశ్వాసులు వారి తోటి విశ్వాసులను వారి నాలుకలతో సంహరించుచున్నారు (6వ). అనేక క్రైస్తవ గుంపులు వారిదే యధార్ధమైన సంఘమని చెప్పి, వారితో ఏకీభవించని ఇతర విశ్వాసులను ఖండించుచున్నారు. అనేక మంది విశ్వాసులు వారి తల్లిదండ్రులను మరియు వారి ఆత్మీయ తండ్రులను అగౌరవ పరచుచున్నారు (10వ). అటువంటి విశ్వాసులుండిన సంఘములు తప్పక హత్య చేయు పట్టణములని చెప్పవచ్చును. గనుక వారు ఇశ్రాయేలీయుల వలె బంధింపబడి కొనిపోబడిరి మరియు వారుండిన స్థలములలో క్రీస్తుకు ప్రభావవమంతమైన సాక్షులుగా ఉండుటలో తప్పిపోయిరి.

ఇశ్రాయేలు దేశములో, ఆ దేశము గూర్చి దేవుని యెదుట నిలువబడి ప్రార్థించు ఒక వ్యక్తి కొరకు దేవుడు వెదకాడు (30వ). కాని ఆయన ఒక్కని కూడా కనుగొనలేదు. సుమారు 8 శతాబ్దాల క్రితము, ఇశ్రాయేలు పాపము చేసినప్పుడు మోషే సందులో నిలిచెను. గనుక దేవుడు ఇశ్రాయేలీయులను నాశనము చేయలేదు. కాని ఇప్పుడు ప్రార్థించుటకు ఏ ఒక్కరూ లేరు. అందరు వారి స్వప్రయోజనములనే వెదకుకొనిరి. వారు ఒకవేళ ప్రార్థించినా కేవలము వారి కొరకు, వారి కుటుంబముల కొరకు మాత్రమే ప్రార్దించుకొనేవారు. అందువలన వారు చెరలోనికి పోయిరి.

ఒక వ్యక్తిని కనుగొనెను

దేవుడు చివరకు కనుగొనిన వ్యక్తి, చివరకు డెబ్బై సంవత్సరముల తరువాత దేవుడు గోడ సందులో నిలబడుటకు ఒక వ్యక్తిని కనుగొనెను. అతడు దానియేలు. ఇశ్రాయేలీయులు బబులోనుకు కొనిపోబడిన డెబ్బది సంవత్సరముల తరువాత వారు తిరిగి యెరూషలేముకు వచ్చుదురని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా వాగ్దానము చేసాడు (యిర్మీయా 25:12,13). దానియేలు 87 సంవత్సరములు దాటిన వాడైనప్పుడు (బబులోనులో చెర కాలమంతా జీవించెను) ఆయన యిర్మీయా యొక్క ప్రచనము చదివెను.

దానియేలు అతడు జీవించిన నాటికి జీవించిన మనుష్యులందరిలో జ్ఞానవంతుడు- చివరకు సొలొమోను కంటె కూడా జ్ఞానవంతుడు. (దేవుడు సాతాను యొక్క వివేకమును దానియేలు యొక్క వివేకముతో పోల్చెను కాని సొలొమోనుతో కాదు మరియు దేవుడు ఈ విషయమును చెప్పినప్పుడు దానియేలు ఒక యౌవనస్థుడుగా బబులోనులో ఉండెను (యెహెజ్కేలు 28:3,14).

అయితే దానియేలు యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన వాగ్దానమును చదివినప్పుడు, అతడి యొక్క తర్కమును ఉపయోగించి దేవుని వాగ్దానము దానికదే నెరవేరునని, తాను ఏమీ చేయనక్కర్లేదని అనుకొనలేదు. అటువంటి వైఖరి క్రైస్తవత్వము కాదు, అది కర్మ వాదము (విధివాదము).

దానియేలు తన స్వంత జ్ఞానము ననుసరించి నడువక దేవుని మాట నెరవేరునట్లు ఉపవాసముండి ప్రార్థించాడు (దానియేలు 9:2-3). ఆ విధముగా దేవుని మాట నెరవేరింది. జీవించిన వారిలో అత్యంత జ్ఞానవంతుడైనవాడు, ఏ విధముగా దేవుని వాక్యము చదువుటలో మరియు ప్రార్థించుటలో తన స్వంత జ్ఞానము లేక తర్కము ఉపయోగించకుండా యుండునో అక్కడ చూచుదుము. మానవుడు సందులో నిలుచొని ప్రార్దించకుండా దేవుడు పనిచేయడు. దానియేలు నీతిమంతుడు కూడా. దేవుడు అప్పటివరకు జీవించిన వారిలో ముగ్గురు గొప్ప నీతిమంతులను ఎత్తి చూపదలచుకొనినప్పుడు, ఆయన నోవహు, దానియేలు మరియు యోబుల పేర్లను చెప్పెను. మరియు దేవుడు అట్లు చెప్పినప్పుడు దానియేలు ఒక యౌవనస్థుడు (యెహెజ్కేలు 14:14,20). యేసేపు ఐగుప్తులో తన్ను తాను పవిత్రునిగా కాపాడుకొనినట్లు, బబులోనులో దానియేలు కూడా తన్ను తాను పవిత్రునిగా కాపాడుకొనెను (దానియేలు 1:8). అయినప్పటికీ ఈ నీతిమంతుడైన దానియేలు దేవుని ముందు మోకరించినప్పుడు తాను కేవలము ఒక పాపినని ఒప్పుకొనెను! (దానియేలు 9:4-11).

ఇతరుల పాపములకంటె తన పాపములను ఎక్కువగా ఎఱిగియుండుట ఒక నిజమైన దైవజనుని యొక్క ఒక గుర్తు. పౌలువలె, నిజమైన దైవజనులందరు వారిని వారు లోకములో పాపులందరికంటె ప్రధాన పాపులుగా చూచుకొందురు. వారి మనస్సాక్షులను కలవరపరిచే పాపములు, సాధారణముగా పాపులు చేసేటంత మురికివి (చెడ్డవి) కాదు. అటువంటివి కాదు. ప్రార్దన చేయకుండట కూడా ఒక పాపమువలె ఆలోచించేటంత సున్నితముగా వారి మనస్సాక్షి యుండును (1సమూయేలు 12:23). దేవుడు వారితోనుంచిన ప్రజల పాపములకు వారే బాధ్యత వహించుటలో వారు త్వరపడి యుందురు. అటువంటి నీతిమంతులైన వారి ప్రార్ధనలు దేవుని యెదుట బలముగలవై యుండును (యాకోబు 5:16).

దానియేలు యొక్క ప్రార్ధనలే దేవుని యొక్క ఆలయ పునర్నిర్మాణ సమయములోను చివరకు యెరూషలేము పట్టణ నిర్మాణములో జనులను (రాజులను కూడా) కదిలించినవి. ఆ విషయములు మనము హగ్గయి, జెకర్యా, ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథములలో చదువుదుము.

దానియేలు అప్పటికి తనకు తానుగా యెరూషలేము వెళ్ళి పనిచేయుటకు బహువృద్ధుడైయుండెను. కాని దేవునికి యౌవనస్థులైన జెరుబ్బాబెలు, జెకర్యా మరియు యెహోషువ ఆ పని చేయుటకు ఉండిరి. కాని వారియొక్క పని నెరవేర్చుటకు, గత కాలములో యెహోషువ మరియు అతడి సైనికులు అమాలేకీయులను జయించుటకు మోషే యొక్క ప్రార్ధన సహకారము ఎట్లు అవసరమైనదో (నిర్గమ 17:8-13) అట్లే దానియేలు యొక్క ప్రార్ధన సహకారము అవసరమైయుండెను.

స్వార్థము నుండి విడుదల

దేవుడు ఈనాడు కూడా మన దేశములో సంఘము కొరకు సందులో నిలిచి, వారి స్వంత అవసరాలు మాత్రమే చూచుకొనకుండా దేవుని కార్యము గూర్చి ఆలోచించే నిస్వార్థపరులైన స్త్రీ పురుషుల కొరకు చూచుచున్నాడు.

చాలామంది విశ్వాసులు ప్రత్యేకపరచబడుట (పరిశుద్దపరచబడుట) అనగా వారియొక్క వ్యక్తిగత ప్రవర్తన మరియు లక్షణములను మరి ఎక్కువ మంచిగా చేసుకొనుట అనుకొందురు. కాని నిజమైన పరిశుద్ధపరచబడుట ఒక వ్యకిని దేవునివలె నిస్వార్థపరునిగా చేయును. మరొక విధముగా చెప్పవలెనంటె యేసుప్రభువువలె చేయును.

యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చి వివరించే వరకు ఎవరికీ దేవుడు ఎలా ఉంటాడనేది తెలియదు (యోహాను 1:18). మరి మనము యేసు ప్రభువుని చూచునప్పుడు దేవుని స్వభావమును గూర్చి తెలుసుకొనునది ఏమిటి? దేవుని స్వభావము పాపులు వారి పాపము నుండి రక్షింపబడి దేవుని యొద్దకు తీసుకు రాబడుట కొరకు సమస్తమును ఇచ్చివేయుటకు మరియు ఎటువంటి అసౌకర్యమునకైనా ఎదుర్కొనుటకు యిష్టపడునదిగా మనము చూచుదుము.

యేసుప్రభువు పరలోకము నుండి భూమిపైకి ఆయన కొరకు ఏదో సంపాదించుకొనుటకు రాలేదు. ఆయన భూమిపైకి వచ్చినది పూర్తిగా ఇతరుల మేలు కొరకు. ఆయన ఇతరుల కొరకు జీవించెను. ఆయన ఉపవాసముండి ప్రార్థించినది మరియు తన్ను తాను యిచ్చుకొనినది అంతా ఇతరులు దేవుని మొక్క రక్షణలో పాలు పొందవలెనని. ఈనాడు సంఘ నాయకులలో కూడా ఈ ఆత్మ చాలా అరుదుగా ఉన్నది. చాలామంది దేవుని స్వభావములో పాలు పొందుట గూర్చి మాటలాడినా, నిజానికి చాలా తక్కువమంది ఇతరులపై యిటువంటి నిస్వార్థమైన ప్రేమలో పాలుపొందుదురు.

చాలామంది వారికి ఏదో ఒక మేలు జరుతుందంటే తమను తాము ఉపేక్షంచుకొని సిలువనెత్తికొనుటకు యిష్టపడుదురు. బహుశా అది చివరకు క్రీస్తు పెండ్లికుమార్తెలో స్థానము కావచ్చు, అయిననూ అది వారి కొరకైనదే. కాని ఇతరుల మేలు కొరకు మనము పూర్తిగా వదులుకొనినది ఏమిటని మనలను మనము ప్రశ్నించుకొనినట్లయితే, దానికి జవాబు 'దాదాపు ఏమీ లేదు' అని మనము కనుగొనగలము.

పూర్తికాలపు క్రైస్తవ పనివారు ఎక్కడో తప్పిపోవుటను చూచి వారిని విమర్శించుట చాలా సుళువైనది. కాని వారిని విమర్శించుటకు ముందు, వారివలె అన్యులకు సువార్త ప్రకటించుట కొరకు, నీ ఉద్యోగము రాజీనామా చేయుటకు నీవెంత వరకు యిష్టపడుచున్నావో నిన్ను నీవు అడుగుకొనుట మంచిది. అలా కానట్లయితే, వారిని విమర్శించుటకు నీవు అర్హుడవు కావు.

మనకున్నటువంటి వెలుగు లేనటువంటి వారిని తృణీకరించుట సుళువు. అయితే మనము అంత వెలుగు పొందుకొని యుండి కూడా, మనము మనయొక్క సౌకర్యములను ప్రేమిస్తూ దేవుని కొరకు విలువైనది ఏదీ వదులుకొనుటకు యిష్టపడకుండా యుండవచ్చును.

కేవలము ఇతరులు సువార్త విని రక్షణ పొందవలెననే ఉద్దేశ్యముతో యేసుప్రభువు పరలోకములో తన స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూమిపైకి వచ్చి 33 1/2 సంవత్సరములు నవీనకాలపు సౌకర్యములు ఏమీ లేకుండా జీవించారు. ఆయన తన సమయమంతా ఇతరులకు సువార్త ప్రకటించుట కొరకు ఉపయోగించుటకు వడ్రంగిగా ఆయన పనిని విడిచిపెట్టి ''పూర్తికాలపు పనివాని''గా నుండెను.

క్రీస్తు యొక్క ఈ ఆత్మ సంవత్సరాల తరబడి మిషెనెరీలను యేసు యొక్క నామము ఎప్పుడు వినబడని చోట్లకు సువార్త తీసుకువెళ్లి ఇతరులను క్రీస్తు వద్దకు తీసుకొనివచ్చుటకు కష్టములను, నష్టములను అనుభవించునట్లు చేసినది. అయితే మరియొక ప్రక్క ప్రయాణాలు చేసి విలాసవంతమైన హోటళ్ళ సౌకర్యములలో బసచేసి సువార్త ప్రకటించే ఇప్పటి వారితో వారిని పోలిస్తే ఈ రోజుల్లోని వారు విలాసయాత్రికులుగా ఉన్నారు.

ప్రభువు కొరకు సమస్తమును విడిచిపెట్టిన పరిశుద్ధులైన మిషనెరీల యొక్క జీవిత చరిత్రలను చదువుట మనకు మంచిది. వాటి ద్వారా వారి త్యాగము మరియు ప్రభువు యెడల వారికుండిన భక్తిని బట్టి మనము కూడా సవాలు చేయబడుదుము. త్యాగపూరిత జీవితమునకు నడిపించని పరిశుద్ధత మోసపూరితమైనది. ఎందుకనగా నిజమైన పరిశుద్ధత కేవలము పాపము నుండి విడుదలగుట మాత్రమే కాదు గాని మన యెడల మనకున్న ప్రేమ నుండి విడుదలగుట కూడా.

దేవుని అగ్ని ఈనాడు అనేకులపై పడకపోవుటకు కారణము, వారు బలిలపీఠముపై సమస్తమును ఉంచుట లేదు. వారు వారి ఉద్యోగములను మరియు వారి సౌకర్యములను తప్ప, దేవుని కొరకు ఏదైనా యిచ్చుటకు యిష్టపడుచున్నారు. ఈ భూమిపై నీకు ఏదైనా విలువైనదిగా మరియు అమూల్యమైనదిగా ఇప్పటికీ యుండినట్లయితే, నీవు యేసుప్రభువుకు శిష్యుడవు కావు.

అంతరంగ మరియు బహిరంగ త్యాగములు

క్రైస్తవత్వములో అనేకులు క్రొత్త నిబంధన మనలను చేయుమని చెబుతున్న అంతరంగ త్యాగమైన సిలువ నెత్తుకొనుటకంటె, బహిరంగ త్యాగములకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చుట నిజమే. అయితే, ఆ పొరపాటుకు వ్యతిరేకముగా, మన త్యాగములన్నీ కేవలము అంతరంగమైనవిగా నుండే జీవితమును జీవించు వేరొక విపరీత ధోరణిని మనము అవలంభించవచ్చును. అవి కొన్నిసార్లు మన ఊహలలోనే ఉండవచ్చును!!

యేసుప్రభువు కేవలము అంతరంగ త్యాగములనే చేసినట్లయితే ఆయన పరలోకమును విడిచి ఈ భూమిపైకి వచ్చియుండేవాడు కాదు. మరియు ఆయన అపొస్తలులు కేవలము అంతరంగ త్యాగములనే చేసినట్లయితే, సువార్త యెరూషలేము దాటి ఎక్కడికీ వెళ్లియుండేది కాదు!! యేసుప్రభువు మరియు అపొస్తలులు సమతూకము కలవారు మరియు దేవుడు వారిని సువార్త కొరకు అంతరంగ మరియు బహిరంగ త్యాగములు చేయకోరుచుండెనని వారికి తెలియును.

యేసుప్రభువు మరియు అపొస్తలులవలె ఇతరులు దీవింపబడుట కొరకు ఎవరైతే కష్టములు మరియు అసౌకర్యముల గుండా వెళ్ళుదురో, వారు ఇతరుల భారములను ప్రార్థనలలో మోయగలుగుదురు మరియు వారు సంఘములో ఈనాడు సందులో నిలువబడగలుగుదురు.

మనము కేవలము మన అవసరములలోనే తలమునకలై, మనలను లేక మన సమయమును ఇతరుల కొరకు ఏ విధముగాను త్యాగము చేయక పోయినట్లయితే, మనము యేసు యొక్క అడుగులలో నడుచుచున్నామని లేక మనము పరిశుద్ధులమై ఆత్మానుసారముగా ఉన్నామని ఊహించుకొనుట గొప్ప మోసమై యున్నది.

ఇతరులు ఆశీర్వదింపబడి దేవునికి దగ్గరగా తీసుకొని రాబడు విధముగా యేసుప్రభువు జీవించెను. ఇది మన కొరకు ఆయన ప్రారంభించిన ''నూతనమైనదియు మరియు జీవము గలదియునైన మార్గము'' (హెబ్రీ 10:19).

మన జీవితములలో మనము దేనికి ప్రాధాన్యత యిచ్చెదమో అది మనము దేనిని ఆరాధించుచున్నామో అనుదానికి సాధారణముగా సూచనగా యుండును.

ఉదాహరణకు, మనము ఎప్పుడు తినుట లేక నిద్రించుట లేక పనికి వెళ్ళుట మరచిపోకుండా యుండి, దేవుడు మనతో ఏమి మాట్లాడుచుండెనో వినుటకు మనము అనేక దినములు సమయము తీసుకొనుట మరచిపోయినట్లయితే, అప్పుడు భోజనము మరియు నిద్ర మరియు ధనము తప్పనిసరిగా మన యొక్క దేవుళ్ళుగా నున్నవి.

మనము దేవుని కొరకు ఎంత సమయమును, శక్తిని మరియు ధనమును అర్పించుటకు యిష్టపడుచున్నాము? మనము క్రొత్త నిబంధన క్రిందనుండుట చేత, మనము వారములో ఒకరోజు ఇమ్మనమని కాని, మన సంపాదనలో 10వ వంతు ఇమ్మని గాని మనకు ఆజ్ఞలేదని తప్పుడు ఆదరణ పొందుచుండవచ్చును. ఇతర క్రైస్తవ శాఖలలో నుండినప్పుడు వారి సంపాదనలలో 10వ వంతు దేవునికి నమ్మకముగా యిచ్చిన అనేకులు, ఇప్పుడు దేవునికి అసలు ఏమీ యివ్వనంతగా వెనుకకు జారిపోయిరి. ఇది నిశ్చయముగా యేసుప్రభువు నడచిన మార్గము కాదు. వారి సుఖము మరియు అభివృద్ది వారికి దేవుళ్ళుగా అయినందున వారికి అటువంటి స్థితి కలిగినది.

బహుశా యిప్పుడు మనము మన కోపమును అదుపులో ఉంచుకొనుచు ఉండవచ్చును లేక స్త్రీలపై మోహము లేక యుండవచ్చును. అది మంచిదే. కాని మనము ప్రభువును వెంబడించ వలెనంటె మన జీవితములలో తప్పక అర్పించవలసిన మన బహిరంగ అర్పణములకు అవి ప్రత్యామ్నాయములు కావు.

మనలో చాలామంది ఇప్పుడు ''పాపముపై విజయము''ను గూర్చిన బోధను అపొస్తలుల కంటె బాగుగా వివరించగలిగియున్నాము!! కాని మనకు మన జీవన శైలిని రూపుదిద్దుచుండిన స్వార్థము గూర్చి మరికొంత వెలుగు పొందవలసిన అవసరమున్నది.

ఆత్మీయమైన అనిశ్చిత స్థితి తరచు ఒక వ్యక్తియొక్క వివేకమనే కాలు 3 అడుగులు ఉండగా జీవమనే యొక్క కాలు 1 లేక 2 అంగుళములు ఉండుట వలన వచ్చుచున్నది. మరియు అతడు తన వివేకము అనే కాలును ఇంకను పెంచుకొనుటకు చూచుచున్నాడు. దేవుని సత్యము యొక్క స్వచ్ఛమైన బయల్పాటు కలిగియుండి కూడా, అతడి యొక్క స్వార్థము ఇంకను సిలువ వేయబడకుండా యున్నది.

ఒక భారము మరియు ఒక పట్టింపు కలిగిన మనుష్యులు

ఇశ్రాయేలీయులు బబులోను నుండి యెరూషలేము యొక్క ప్రయాణము దేవుని కార్యము ముందుకు వెళ్ళవలెనని పట్టింపు కలిగిన నిస్వార్థపరులైన మనుష్యులలో పుట్టి కొనసాగింపబడినది. దానికొరకు వారు ఉపవాసముండి ప్రార్థించిరి.

మనమున్న ఈ రోజుల్లో కూడా సంఘములో అట్లే జరుగును. దేవుని యొక్క నామమును ఘనపరుచుటకు చూచువారు, ఆయన రాజ్యము వచ్చుట కొరకు చూచువారు మరియు పరలోకములోవలె భూమిపై ఆయన చిత్తము నెరవేరవలెనని చూచువారు ఉపవాసముండి ప్రార్థించి దురాత్మల క్రియలను బంధించుదురు మరియు ఆ విధముగా దేవుని యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చుదురు.

దానియేలు తరచు ఉపవాసముండి ప్రార్థించేవాడు.

ఎజ్రా కూడా ఇశ్రాయేలీయులను కొందరిని బబులోను నుండి యెరూషలేముకు నడిపించినప్పుడు ఎట్లు ఉపవాసముండి ప్రార్థించవలెనో తెలిసినవాడు (ఎజ్రా 8:21).

నెహెమ్యా యెరూషలేము కూల్చబడి దాని గోడలు కూల్చబడినవని వినినప్పుడు దు:ఖించి, ఉపవాసముండి ప్రార్థించెను (నెహెమ్యా 1:4). అతడు యెరూషలేములో నుండిన ఇశ్రాయేలీయులు బద్దకస్ధులుగా లేక స్వార్థపరులుగా నుండినందుకు వారిని విమర్శించలేదు. అతడు ఉపవాసముండి వారి గూర్చి ప్రార్థించెను. అతని యొక్క యజమాని (రాజు) అతడి విచారమును గుర్తించగలిగినంతగా అతడు కృంగిపోయెను. చివరకు, నెహెమ్యా యెరూషలేము గోడలు తిరిగి కట్టుటకు అతడి ఉద్యోగ స్థానమును మరియు రాజభవనములో నుండిన సౌకర్యములను విడిచిపెట్టెను.

దేవుని పని ముందుకు వెళ్లుట లేదని మనమెప్పుడైనా నెహెమ్యా వలె బాధపడినామా? సంఘములో విషయములు సరిగా లేకుండుట చూచి మనమెప్పుడైనా అతనివలె ఉపవాసముండి ప్రార్థించినామా? మనమెప్పుడైనా మనకు దేవుని వాక్యమును బోధించువారి కొరకు ప్రార్థించామా?

దేవుని సేవించుచు మరియు ఆయన వాక్యమును నమ్మకముగా బోధించు వారు (మరియు వారి కుటుంబములు) సాతాను యొక్క ఉగ్రతకు గురిగా యుందురని మనము గ్రహించవలెను. వారు సాతాను యొక్క హిట్‌లిస్టులో పైన ఉందురు. వారిని విమర్శించుట మానమని మీకు సలహా యిస్తున్నాను. ఆ పని సాతాను నీ సహాయము అవసరం లేకుండా బాగుగా చేయగలడు. దానికి బదులు వారు శతృవు యొక్క దాడుల నుండి కాపాడబడునట్లు మరి కొంచెము వారి కొరకు రాబోవు దినములలో ప్రార్థించండి.

2000 సంవత్సరముల క్రితం ఇశ్రాయేలులో నుండినట్లే ఈనాడు భారతదేశములో కూడా దేవుని యొక్క గొఱ్ఱెలు వారిని పట్టించుకొనే కాపరులు లేక ఇక్కడా అక్కడా చెదిరిపోయియున్నవి. మన దేశములో అనేకమంది జీతగాళ్ళుగా ఉండి జీతము కొరకు పనిచేయువారుగా నున్నారు. తమ మంద కొరకు తమ ప్రాణములు పెట్టుటకు యిష్టపడు కాపరులు కొద్దిమందేనున్నారు. గొఱ్ఱెల కొరకు భారము లేనివాడు మరియు వారి కొరకు క్రమముగా ప్రార్థించనివానికి దేవుని మందకు దేవుని యొక్క వాక్యమును బోధించు హక్కు లేదు.

కోత యజమాని తన హృదయానుసారులైన కాపరులను ఈ కాలపు కోతకు వచ్చి పంట కోయుటకు పంపునట్లు దేవునికి ప్రార్థించుదుము (మత్తయి 9:36-38 యిర్మీయా 3:15).

ఉపవాసము మరియు ప్రార్ధన

ఈ కాలపు విశ్వాసుల మధ్య ఉపవాసము అంత ప్రజాదరణ పొందినది కాదు. కాని యేసుప్రభువు ఒకసారి, ఆయన (పెండ్లికుమారుడు) ఈ లోకము విడిచిపెట్టి వెళ్లిన తరువాత, ఆయన శిష్యులు ఉపవాసము చేయుదురని చెప్పెను. ఆయన శిష్యులు ఉపవాసము చేయవచ్చును అని చెప్పలేదు. లేదు. ఆయన ఆ దినములలో వారు ఉపవాసము చేతురని చెప్పెను (లూకా 5:35). ఉపవాసముండి ప్రార్ధించు వారందరు యేసుప్రభువు యొక్క శిష్యులు కానక్కర్లేదు. కాని యేసుప్రభువు యొక్క నిజమైన శిష్యులందరు తప్పక ఉపవాసముందురు.

అపొస్తలులు ఉపవాసముండి ప్రభువును ఆరాధించుచుండగా, పౌలు బర్నబాలను అన్యులకు సువార్త ప్రకటించుటకు పంపమని పరిశుద్ధాత్ముడు వారితో మాటలాడెను. ఆ విధముగా ఆది సంఘములో అన్యజనుల దేశములకు మొదటి గొప్ప మిషనరీ ఉద్యమము ప్రారంభమైనది (అపొ.కా. 13:2,3). పౌలు బర్నబాలు అట్లు బయటకు వెళ్లి సంఘములను స్థాపించిరి మరియు తిరిగి ఆ సంఘములను స్థానిక పెద్దలకు అప్పగించుటకు ముందు ఉపవాసముండి ప్రార్ధించిరి (అపొ.కా. 14:23).

చివరకు భర్తలను మరియు భార్యలను ప్రార్ధించుట కొరకు లైంగిక సంబంధముల నుండి కొన్ని సమయములలో ఉపవాసముండమని పరిశుద్ధాత్ముడు హెచ్చరించెను (1కొరిందీ¸ 7:5).

ఇశ్రాయేలీయులు సొదొమవలె గర్వించి, బద్దకస్థులై మరియు స్వార్ధపరులై మరియు భోజనాసక్తులై (యెహెజ్కేలు 16:49) నుండుట వలన దేవుడు సొదొమను ఇశ్రాయేలు యొక్క సోదరిగా పిలిచెను. దీనిని బట్టి లైంగిక పాపములు అనునవి (సొదొమ పేరుపొందిన పాపము) తిండిపోతు తనమునకు మరియు రుచిగల ఆహారముపై వారికుండిన ప్రేమకు దగ్గర సంబంధము కలిగియున్నవి. లైంగిక విషయములలో ఆత్మ నిగ్రహమునకును మరియు బద్దకము, తిండిపోతుతనముతో నుండిన జీవిత విధానమునకును దగ్గర సంబంధమున్నది.

సాతాను శక్తుల కార్యములను బంధించుట

దానియేలు ఒకమారు 21 రోజులు ఉపవాసముండి ప్రార్ధించినపుడు అతడి ప్రార్ధనల వలన పర్షియాను పరిపాలించు దురాత్మలు ఓడింపబడినవని దేవుడు బయలుపర్చెను (దానియేలు 10:2,3,13).

అదేవిధముగా మన రోజుల్లో ప్రపంచములో అనేక భాగములలో నున్న దేవుని ప్రజలు సుమారు 75 సంవత్సరములుగా కమ్యూనిస్టు దేశములపై నుండిన దురాత్మల శక్తుల పట్టుకు వ్యతిరేకముగా ఉపవాసముండి ప్రార్ధించి పోరాడుటను బట్టి అది విరిగిపోయెను. దానియొక్క ఫలితముగా ఈనాడు ఆయా దేశములు సువార్తకు తెరవబడినవి.

కొన్ని రకములైన దురాత్మలు ఉపవాసము మరియు ప్రార్ధన ద్వారా మాత్రమే పోవునని యేసుప్రభువు చెప్పెను (మత్తయి 17:21).

భారతదేశములో నివసించుచున్న మనము మన దేశములో నున్న అనేకమంది విశ్వాసులు మరియు అవిశ్వాసులపై బలమైన పట్టు యున్న దురాత్మల శక్తుల అధికారాలకు వ్యతిరేకముగా పోరాడుటకు ఉపవాసముండి ప్రార్ధించు గొప్ప బాధ్యత మనకు యున్నది. భారతదేశములోని క్రైస్తవత్వములో ఎంతో సర్దుబాటు (సయోధ్య) ఉన్నది మరియు ప్రపంచములో మరి ఏ ఇతర దేశములో కూడా ఇక్కడ ఉండినన్ని అన్య దేవాలయములు ఉండవు లేక భారతదేశపు ప్రజలకంటె విగ్రహారాధనకు బంధింపబడిన వారు ఉండరు.

భారతదేశములో నున్న దేవుని ప్రజలు లేచి నిలువబడి కలసి ఈ సాతాను శక్తుల క్రియలను బంధించవలసిన సమయము ఇప్పుడు వచ్చియున్నది. తమ స్వంత అభిప్రాయముల నుండి మరియు కక్షల నుండి మరియు బద్ధకము, స్వార్ధముల నుండి విడుదల పొంది ఎప్పుడు దరాత్మల శక్తులతోను మరియు అంధకార సంబంధమైన అధికారులతోను మాత్రమే తప్ప మానవులతో ఎప్పుడు పోరాడకుండుటకు నిర్ణయించుకొనువారిని కొందరిని దేవుడు కనుగొనినట్లయితే, అప్పుడు భారతదేశములో కోట్లాదిమందిని ప్రభావితము చేయుచున్న దురాత్మలు వణకుట ప్రారంభించును.

సంఘముగా మనయొక్క పిలుపు భారతదేశముపై ఎగురుచుండిన సాతాను శక్తులన్నిటిపైన క్రీస్తు కల్వరి సిలువపై జయించిన విజయమును అమలు జరుపుటయై యున్నది.

మన దేశములో చాలా సంవత్సరముల నుండి అనేకులను గ్రుడ్డివారిని చేసి తప్పుత్రోవలో నడిపించుచుండిన మతపరమైన ఈ దురాత్మల క్రియలను బంధించుటకై సంఘములో సందులో నిలిచి ప్రార్ధించే (ఉపవాసముండి ప్రార్ధించే) స్త్రీ పురుషుల కొరకు దేవుడు ఈనాడు చూచుచున్నాడు. ఆ విధముగా యేసుప్రభువు యొక్క నామము భారతదేశములో మహిమ పర్చబడి ఘనపరచబడును.

నీకు ఆ విధముగా ప్రార్ధించుటకు భారము లేకపోయినట్లయితే, నీవు తప్పు చేయుచున్నట్లు భావించవద్దు, ఎందుకనగా దేవుడు తన ప్రజలందరకు ఒకే విధమైన భారములనివ్వడు. కాని భారతదేశములో ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యము ఉండవలెననేది నీ భారమైనట్లయితే అప్పుడు మనము కలసి నిలువబడి ఈ రోజుల్లో ఉపవాసముతో ప్రార్ధించుదుము. ఆ విధముగా మన దేశములో దేవుని యొక్క ఉద్దేశ్యము నెరవేరును.

నీ హృదయము ఈ పిలుపునకు స్పందించినట్లయితే, అప్పుడు భారతదేశములో దురాత్మల అధికారుల యొక్క పనులు బంధింపబడి ఆటంకపర్చబడాలని ప్రతిదినము ప్రార్ధించుట మొదలుపెట్టుము. తరువాత ఉపవాసముతో ప్రార్ధించుట కొనసాగించుము. అటు తరువాత అటువంటి భారము కలిగియున్న వారితో కలసి ప్రార్ధించుము. నీ ప్రార్ధనలకు జవాబు పొందవలెనని కోరుకొనినట్లయితే, అన్నివేళలా నిన్ను నీవు పవిత్రముగా నుంచుకొనుటకు జాగ్రత్త వహించుము మరియు నీ చుట్టూ ఉండిన ఇతరులను తీర్పు తీర్చుట మరియు ఇతరుల విషయములలో జోక్యము కలుగజేసుకొనుట అనువాటి నుండి దూరముగా నుండుము. దేవుని కొరకు పదునుగల పనిముట్టుగా నుండునట్లు ఎటువంటి ధర చెల్లించియైనా నిన్ను నీవు కాపాడుకో మరియు నీయొక్క సామర్థ్యము ఏ విధమైన పాపము చేతనైనా నిరుపయోగము కాకుండా చూచుకొనుము.

అధ్యాయము 11
రెండు రకములైన వెనుకకు జారి పోయినవారు మరియు రెండు రకములైన నాయకులు

లూకా సువార్త 15వ అధ్యాయములో యేసు ప్రభువు రెండు రకములైన వెనుకకు జారిపోయిన వారి గూర్చి బోధించెను. మొదటిది తప్పిపోయిన గొఱ్ఱెతో పోల్చబడినది. రెండవది తప్పిపోయిన కుమారునిగా ఆయన చూపించెను.

తప్పిపోయిన గొఱ్ఱె

''మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును'' (లూకా 15:4,7).

కాపరి వెదకుతు వెళ్లినది ఒక మేకను (ఒక అవిశ్వాసిని) కాదు. ఒకప్పుడు మందలో నుండిన గొఱ్ఱెను (ఒక విశ్వాసిని) వెదకుతు వెళ్లెను. తిరిగి జన్మించి వెనుకకు జారిపోయిన ఒక క్రైస్తవుని గూర్చి ఈ ఉపమానములో చెప్పబడినది. అయితే అతడు సంఘమునుండి తిరుగుబాటు ఆత్మతో వెళ్లిపోలేదు. ఒక గొఱ్ఱె వలె, అతడు అజాగ్రత్త వలన త్రోవ తప్పిపోయెను. బహుశా అతడు మోసగింపబడి యుండవచ్చును. బహుశా అతడి బలహీనతల వలన అతడు ఎదుర్కొనిన లోక ఆకర్షణలు ఎదురించి నిలచుటకు ఎక్కువై నందున అతడు వాటి చేత జయింపబడియుండవచ్చును.

మంచి కాపరి అటువంటి తప్పిపోయిన గొఱ్ణె దొరకు వరకు దాని వెనుక వెళ్ళును. ఆయన క్రింద కాపరులుగా ఉన్న మనమందరము అదే చేయవలెను. ఎవరైతే అజాగ్రత్త వలన, సాతాను యొక్క మోసము మరియు వారి శరీరాశల వలన వెనుకకు జారిపోయిరో వారి వెనుక మనము వెళ్లవలసి యున్నది.

క్రీస్తు పుట్టుకకు 600 సంవత్సరాలముందు, ఆనాటి ఇశ్రాయేలీయుల కాపరులపై దేవుడు మోపిన తప్పులలో ఇది ఒకటి. ''బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమే గాక మీరు కరిÄనమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱెలు...చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు,....నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని....నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును...నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరి పోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించుదును'' (యెహెజ్కేలు 34:4-12).

అనేక గొఱ్ఱెలు చీకటి గల మబ్బుదినమున తప్పి పోయినవి- అది వారికి భరించలేనిదిగా ఉండిన ఏదో పరీక్ష లేక విచారము చేత వారు నిరుత్సాహము చెంది మరియు నిస్పృహతో కృంగి పోయిన రోజు. అటువంటి వారిని వెదకి వారిని వెనుకకు తీసుకువచ్చెదనని ప్రభువు చెప్పుచున్నాడు. అటువంటి వారి కొరకు ''ఆయన హృదయానుసారులైన కాపరుల'' ద్వారా ఆయన వెతుకుచుండెను (యిర్మీయా 3:15). సంఘములో అందరికీ (సహోదరులు మరియు సహోదరీలు) ఈనాడు మన చుట్టూ ఉన్న తప్పిపోయిన అనేక గొఱ్ఱెలను వెదకువారుగా నుండి దేవుని హృదయానుసారులైన కాపరులుగా నుండుట ఆశగా యుండవలెను. అటువంటి వెనుకకు జారిపోయిన గొఱ్ఱెలను, పర్వత శిఖరపు అంచునకు వెళ్లునట్లు అజాగ్రత్తగా యుండిరని లేక మందకు మధ్యలో యుండవలసినదని మరియు వారికి వారు పచ్చని బీళ్ళు వెదకుచూ వెళ్ళారని లేక దొంగ కాపరుల స్వరము వినకుండా యుండవలసినదని విమర్శించుటకు మరియు తప్పు మోపుటకు చాలా మంది సిద్ధముగానుందురు. గొఱ్ఱెలు వెనుకకు జారిపోవుటకు గల కారణములను ఖచ్చితముగా వివరించి చెప్పగలిగే నిపుణులకు లోటులేదు. ఆ తప్పిపోయిన గొఱ్ఱెల వెనుక వెళ్లి తిరిగి మందలోనికి తీసుకువచ్చే దేవుని హృదయానుసారమైన కాపరుల లోటు విచారించవలసినంతగా ఉన్నది. ఈనాడు సంఘమునకున్న గొప్ప అవసరత యిదే.

దేవునియొక్క యధార్థమైన మంద

ప్రభువు ఈ ఉపమానములో ఆయన మందను ''మారుమనస్సు అక్కరలేని నీతిమంతులు'' (లూకా 15:7) గా వర్ణించెను.

ఇవి అద్భుతమైన మాటలు. ఈ భూమిపై వారి జీవితాల్లో వారికి తెలిసిన పాపములన్నింటి మీద జయము పొంది, వారికి మారుమనస్సు అక్కరలేదని ప్రభువే ధృవ పత్రాన్నిచ్చే మానవ మాత్రులు ఉండుట సాధ్యమా?

అవును, అటువంటి భక్తులు ఈనాటికీ ఈ భూమిపై యున్నారు. వారు దేవుని యొక్క నిజమైన మంద. ఈ లోకములో ఏ సంఘము కూడా అటువంటి వారితోనే నిండినదిగా లేదు. ఎందుకనగా ప్రతి క్రైస్తవ గుంపు కూడా సంఘము యొక్క సాక్ష్యమును చెరపుటకు సైతాను చేత పంపబడిన బయటవారితోను మరియు చొరబడిన వారితోను కలిసియున్నది.యేసు ప్రభువు యొక్క ''సంఘము''లో కూడా ''ఇస్కరియోతుయూదా'' ఉండెను. అపొస్తలుల సంఘములో ''అననీయ మరియు సప్పీరా'' మరియు ''దేమా''లు కూడా ఉన్నారు. కాని వారిలో ఎవ్వరికీ ఆ రోజుల్లో సంఘములో అధికారము ఇవ్వబడలేదు. ఆ విధముగా యేసు ప్రభువు మరియు అపొస్తలులు వారి సహవాసముల యొక్క పవిత్రతను కాపాడిరి.

ప్రభువు చెప్పిన మారుమనస్సు అక్కరలేని నీతిమంతులే యేసుక్రీస్తు యొక్క నిజమైన సంఘము. వారిని వారు ఎప్పుడు తీర్పు తీర్చుకొనుచుందురు కాబట్టి వారికి మారుమనస్సు అక్కరలేదు. వారెప్పుడు వారి మనస్సాక్షిని దేవునికి గాని మరియు మనుష్యులకు గాని విరోధముగా నుండకుండునట్లు ప్రయాసపడుట చేత వారు దేవునికి అప్పజెప్పవలసిన లెక్కలలో ఋణపడియుండరు. వారు దేవునికి విరోధముగా నుండిన ఏ పాపపు ఆలోచనను లేక వైఖరిని వెంటనే ఒప్పుకొందురు, అదే విధముగా మనుష్యుల యెడల మాట్లాడిన ఏ చిన్న పాపపు మాట లేక చేసిన పని గూర్చి వెంటనే పశ్చాత్తాప పడుదురు. వారు మానక ఎల్లప్పుడు పశ్చాత్తాపముతో జీవించుదురు, ఆ విధముగా వారు ప్రతిరోజు జీవించుదురు కాబట్టి వారు పశ్చాత్తాపము అక్కరలేని విధముగా యుందురు. కేవలము అటువంటి వారు మాత్రమే ప్రభువు యొక్క నిజమైన మందగా యుందురు.

ఈనాడు ప్రభువు కట్టుచున్న ప్రతి సంఘము, ఈ కడవరి దినములలో ప్రభువు కొరకు పవిత్రమైన మరియు శక్తిగల సాక్ష్యముగా ఉండవలెనంటె ''మారుమనస్సు అక్కరలేని నీతిమంతులు'' దానికి వెన్నెముకగా ఉండవలెను, ప్రతి వెనుకకు జారిపోయిన వాడు (తప్పిపోయిన గొఱ్ఱె) అటువంటి భక్తిగల వారు ఉండిన మందలో చేరి సహవాసము చేయుటకు చూడవలెను, అంతేకాని 'సంఘము' అని పిలిపించుకొనే ప్రతి గుంపుతో కాదు.

రోగములతో ఉండి, ఒకరి నొకరు కరచు కొనుచు మరియు ఒకరినొకరు చీల్చుకొనుచు ఉండిన నీతిలేని మరియు మారుమనస్సు పొందవలసిన తొంభై తొమ్మిది మంది గొఱ్ఱెలుండిన మందలోనికి తప్పిపోయిన గొఱ్ఱెలను తెచ్చుట కొరకు సువార్త సేవ చేయుటలో ఉపయోగము లేదు. అటువంటి సహవాసములోనికి ఒక తప్పిపోయిన గొఱ్ఱె చేరితే అది ఇంకా తప్పిపోవును. అటువంటి గొఱ్ఱెలు వెనుకకు జారిపోయిన అటువంటి సంఘములలో కంటె బయట అరణ్యములో యుండుటయే వాటికి ఎంతో భద్రతగా యుండును. ఈ రోజుల్లో అటువంటి కొన్ని సంఘములలోనికి తప్పిపోయిన గొఱ్ఱెలను తెచ్చుట రోగగ్రస్థులను మురికిగా ఉన్న ఆసుపత్రులలో చేర్పించుట లాంటిది. అక్కడ వారికి ఇంతకు ముందు లేని రోగములు వచ్చును. సువార్త సేవలో మునిగిపోవుటకు ముందు, మొదటిగా కావలసినది, సంఘములోపల సంపూర్తిగా శుభ్రపరచు ప్రక్రియ.

తప్పిపోయిన కుమారుడు

''ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి....చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను....అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు...నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి తండ్రీ,నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని, ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును ....''(లూకా 15:11-24).

ఇక్కడ వెనుకకు జారిపోయిన వాడు తప్పిపోయిన గొఱ్ఱెకు భిన్నంగా ఉన్నాడు. అతడు తన స్వంత యిష్టమును బట్టి తన తండ్రిపై తిరుగుబాటు చేసి తన తండ్రిని మరియు తన ఇంటిని మరియు తన యొక్క కుటుంబ సభ్యులను విమర్శించి దూరము వెళ్లిపోయిన వాడు. అతడు సంఘములో నున్న పెద్దలను మరియు సహోదర సహోదరీలను విమర్శించి వారిని కించపరుస్తూ తనను తాను హెచ్చించు కొనుటకు చూచును.

దీనికి ముందు చూచిన ఉపమానమువలె దీనిలో తప్పిపోయిన కుమారుని వెనుక తండ్రి వెళ్లుటను మనము చూడము. తప్పిపోయిన కుమారుడు విత్తిన దానిని కోయునట్లును మరియు తిరుగుబాటు యొక్క పర్యవసానములను అనుభవించునట్లు ఆయన అనుమతించెను. ఎప్పుడైతే ఆ కుమారుడు నిస్సహాయుడై ఏమీ చేయలేక పోయెనో అప్పుడు తిరిగి తన తండ్రి యింటికి తనకు తానుగా తిరిగి వచ్చెను. అతనిని తిరిగి యింటికి ఎవరి భుజాలపై ఎక్కించుకొని తీసుకు వెళ్లలేదు. అతడు మారుమనస్సు పొంది, తన గూర్చి తాను విసిగిపోయి, అలిసిపోయి తనకు తానుగా తిరిగి వచ్చెను. అటువంటి వెనుకకు జారిపోయిన వారియెడల దేవుని ప్రేమ వారి వెనుక వెళ్లుట ద్వారా కాక, వారి శక్తి అంతా పోవువరకు వారు విత్తిన దానిని వారు కోయునట్లు మరియు తిరిగి ఆయన యొద్దకు విరుగ గొట్టబడి మరియు నిజమైన పశ్చాత్తాపముతో వచ్చునట్లు చేయుటలో బయలుపరచబడును.

ప్రతి సంఘములో ఎక్కువ మంది విశ్వాసులు శరీర సంబంధులుగా నుండుట చేత, వారికి జ్ఞానము లేక, ఈ రెండు రకములైన వెనుకకు జారిపోయిన వారి మధ్య వ్యత్యాసమును తెలుసుకో లేకుండా యుందురు. ఒక ప్రక్క తిరుగుబాటు చేసిన కుమారులను భుజములపై ఎక్కించుకొని సంఘములోనికి తీసుకువచ్చుటకు చూచెదరు మరియు అలా చేయనందుకు పెద్దలను విమర్శించుదురు. వేరొక ప్రక్క, తప్పిపోయిన గొఱ్ఱెలను పట్టించుకొనకుండా యుండి వారిని వెనుకకు తీసుకు వచ్చుటకు వారి వెనుక వెళ్లుటకు ఏమీ చేయరు. గద్దింప వలసిన వారిని ఓదార్చుదురు మరియు ఆదరింపవలసిన వారిని గద్దించుదురు.

తిరుగుబాటు చేసిన కుమారులను మరియు కుమార్తెలను (తమ పరలోకపు తండ్రిని మరియు ఆయన ఇంటిని విడిచి పెట్టిన వారు) ఎప్పటికీ తిరిగి దేవుని యొద్దకు రాకుండునట్లు చేయవలెనంటె చేయవలసిన పని ఏమిటనగా వారిని ఆదరించి పోషించుటయే. అటువంటి క్రియలు ఏమిటనగా దయతో కూడుకొన్నవి కావు కాని బుద్ధిహీనతతో కూడుకొనిన క్రియలు. అనేకులు వారి స్వంత ఘనతను మరియు పేరును పొందగోరి తిరుగుబాటు చేసిన విశ్వాసులను గద్దించుటకు బదులు వారితో దయగల మాటలు మాటలాడుదురు. వారి యొక్క మాటలు మరియు క్రియలు ఈ తప్పిపోయిన కుమారులను దూరదేశములో ఇంకా ఎక్కువ కాలముండేటట్లు మరియు కొందరి విషయములోనైతే ఎప్పటికీ అక్కడనే ఉండిపోయేటట్లు చేయును. చివరకు అట్లు దూర దేశములో నాశనమైపోయి నరకమునకు వెళ్లిన అటువంటి తప్పిపోయిన కుమారుల యొక్క రక్తము వారిని ఆదరించి సహాయము చేసిన వారిపై యుండును.

(గమనిక ఈ విషయములో పరిసయ్యతత్వము గల వారికి ఒక హెచ్చరిక: ఒకరు మీ గుంపును విడిచిపెట్టి వేరొక సహవాసములో చేరినంత మాత్రమున అతడు తండ్రి యింటిని విడిచి పెట్టినట్లు కాదు. ఎందుకనగా తండ్రి యిల్లు నీ చిన్న గుంపు కంటె చాలా విశాలమైనది. గనుక ఈ ఉపమానము గాని, పైన చెప్పబడిన పేరాను గాని నీ గుంపును విడిచి వెళ్లిన ఎవరి విషయంలోనో నీ యొక్క పరిసయ్యతత్వమును సమర్థించు కొనుటకు ఉపయోగించు కొనవద్దు. బహుశా ఇక్కడ నీ స్వంత అవసరతను గుర్తించవలసి యున్నది. అది నీవు ఈ ఉపమానములో ఉన్న తండ్రివలె ఏ మాత్రము లేకుండా, అందులోని అన్నగారి వలె యున్నావేమో.)

ఇటువంటి తిరుగుబాటు చేసిన కుమారులు నిజమైన విరిగిన స్థితిలో మరియు మారుమనస్సుతో తిరిగి సంఘమునకు వచ్చినప్పుడు, వారిని ఆహ్వానించుటకు మన హృదయములు విశాలముగా తెరవబడి యుండవలెను. మరియు వారు దౌర్బల్యంలోను, విచారములోను ఉండకుండునట్లు మనము చూడవలెను. దీనిద్వారా ఎవరు దేవునివలె ఉన్నారో మరియు ఎవరు పరిసయ్యుల వలె యున్నారో తేటగా కనబడును. తిరిగి నమ్మకము ఏర్పడుటకు మరియు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారులకు సంఘములో ఏదైనా పరిచర్య యిచ్చుటకు సమయము పట్టినను వారిని అంగీకరించుటకు మరియు సహవాసమునకు సంబంధించి వెంటనే, ప్రేమతో మరియు పూర్ణ హృదయముతో ఉపమానములో ప్రభువు చెప్పిన విధముగా అది విందుతో మరియు ఆనందముతో ఉండవలెను.

రెండింటి మధ్య తేడాను వివేచించుట

మనము జీవించుచున్న ఈ దినాల్లో మనకున్న గొప్ప అవసరత, మన ప్రేమ జ్ఞానము చేత నడిపింపబడుటయే.

''మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను''.....(ఫిలిప్పీ 1:9,10) అని పౌలు ప్రార్దించెను.

మన చుట్టూ ఉన్న ఈ రెండు విధములైన వెనుకకు జారిపోయిన వారిని మనము వేరు పరచుటకు, మనము ఎల్లవేళలా, పరిశుద్ధాత్మ స్వరమును మన ఆత్మలో వినుటకు అలవాటు చేసుకొనవలెను. ఆ విధముగా మనము పరిసయ్యుల నియమముల ప్రకారము లేక లోకపు జాలితో జీవించము. మనము మన స్వంత ఆలోచనలననుసరించి జీవించినట్లయితే, మనము పొరపాట్లు చేయుదుము. మనలను మనము తగ్గించుకొనవలసిన అవసరమున్నది. మరియు మనలో నున్న మానవ పరమైన కరిÄనత్వమును మరియు మన యొక్క స్వంత మానవ ప్రేమను ద్వేషింపవలసిన అవసరమున్నది.

కాపరులు మరియు తండ్రులు

సంఘములో కూడా రెండు విధములైన నాయకులు ఉందురు. అందులో మంచివారు కాపరులవలెను మరియు తండ్రుల వలెను ఉందురు. తమ స్వంత లాభమును చూచుకొనువారు జీతగాళ్లవలెను మరియు ఉపదేశకుల వలెను యుందురు. వెనుకకు జారిపోయిన వారి యెడల మనకున్న వైఖరిని బట్టి మనము ఏ తరగతికి చెందు వారమనేది తెలియును.

సంఘములో యధార్దమైన కాపరులు తక్కువగా యున్నట్లే, నిజమైన తండ్రులు కూడా తక్కువగా యుందురు. జీతగాళ్లు ప్రతిచోట కావలసినంతమంది ఎలా ఉన్నారో అట్లే, వారి స్వంత లాభమును చూచుకొనే ఉపదేశకులు కూడా కావలసినంతమంది యున్నారు. ఎందుచేత? ఒక కాపరిగా ఉండుట కంటె ఒక జీతగాడిగా యుండుట సుళువైనది మరియు సంఘములో ఒక తండ్రిగా యుండుట కంటె ఒక బోధకుడుగా యుండుట సుళువైనది. మనము కాపరులుగా మరియు తండ్రులుగా ఉండవలెనంటె హృదయపు బాధను, భారమును, గర్జించు శత్రువులు మరియు తోడేళ్లకు వ్యతిరేకముగా ప్రార్థనలో పోరాటములను వెలగా చెల్లించవలెను. ప్రభువును సేవించుటకు మరియు సంఘమును కట్టుటకు చాలా మంది అటువంటి వెలను చెల్లించుటకు యిష్టపడరు. చాలా మంది సంఘమును చౌకగా కట్టుటకు ప్రయత్నించుదురు.

పౌలు, పడిపోవు చుండిన, ఐహిక సంబంధులుగా నున్న కొరిందీ¸ క్రైస్తవులతో ఒక తండ్రిగా, ''మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తుయేసునందు సువార్త ద్వారా మిమ్మును కంటిని'' (1 కొరిందీ¸ 4:14,15) అని చెప్పెను.

యేసు ప్రభువు చెప్పిన ఉపమానములో తండ్రి, పశ్చాత్తాపపడి వచ్చిన తన కుమారుని ఆరు నెలలు శిక్షణలో ఉంచలేదు. లేక అతడిని పనివాళ్లు ఉండే యిళ్లలో నివసింప నివ్వలేదు. లేదు, ఆయన అతడిని నమ్మెను మరియు అతడి విషయంలో మంచిని నిరీక్షించెను. ''ప్రేమ అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును'' (1 కొరిందీ¸ 13:7).

ఒక నిజమైన తండ్రి తన బిడ్డలను, చివరకు వారు వెనుకకు జారిపోయినవారైనప్పటికీ వారిని అవమానపర్చడు లేక వారి తప్పులను ఇతరుల దగ్గర బయటపెట్టడు. అయితే కాలేజీలలో మరియు పాఠశాలలో ఉపాధ్యాయులు వారి విద్యార్దుల యొక్క తప్పిదములను బయట పెట్టుటలో ఆనందించెదరు. ఇతరుల తప్పిదము మరియు ఓటముల యెడల మన వైఖరిని బట్టి మనము తండ్రులమో లేక ఉపాధ్యాయులమో మనము తెలుసుకొనవచ్చును.

ప్రభువు సంఘములో నిజమైన తండ్రులు మరియు కాపరుల కొరకు చూచుచున్నాడు!

అధ్యాయము 12
సాతానుపై విజయమొందు సంఘము

యేసు ప్రభువు సంఘము గూర్చి రెండు సందర్భములలో మాత్రమే మాటలాడెను- అది మత్తయి 16:18 మరియు 18:17-20లో. ఈ రెండు సందర్భాలలో ఆయన సాతాను, సంఘమునకు విరోధముగా పోరాడుట గూర్చి మాటలాడెను. మొదటి సందర్భములో ఆత్మీయ మరణపు శక్తుల ద్వారా, దురాత్మల ద్వారా సాతాను ప్రత్యక్షముగా సంఘముపై దాడిచేయుట గూర్చి చెప్పెను. రెండవ సందర్భములో, సాతాను మోసగించి వశపరచుకొనుట వలన తనకు తెలియకుండా సాతానుకు ప్రతినిధిగా మారిన ఒక సహోదరుని ద్వారా సంఘమును పరోక్షముగా మోసగించి పాడుచేయుటను గూర్చి మాటలాడెను.

అయితే సాతాను ఎటువంటి పద్ధతులను ఉపయోగించినా, సాతాను యొక్క క్రియలను బంధించుటకును మరియు అతడిచే బంధింపబడు వారిని విడుదల చేయుటకును ప్రభువు మనకు అధికారమును యిచ్చెను (మత్తయి 16:19, 18:18; 2 తిమోతి 2:16).మనము ఆ అధికారమును సంఘములో ధైర్యముతో ఉపయోగించవలెను.

దైవ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత

''నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు'' (మత్తయి 16:16) అని పేతురు ఒప్పుకొనిన బండపై ఆయన సంఘమును కట్టుదునని యేసు చెప్పెను. పేతురుకు ఆ ప్రత్యక్షత (బయల్పాటు) తండ్రియొద్ద నుండి వచ్చెను (17వ). మనకు కూడా యేసును గూర్చి అటువంటి ప్రత్యక్షత కావలసియున్నది.

కేవలము బైబిలు చదువుట చేతనో లేక వినుట చేతనో క్రీస్తును గూర్చి తెలుసుకొనుట సరిపోదు. ''తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు'' (మత్తయి 11:27). అందుచేత తండ్రి మాత్రమే మనకు ఆయన గూర్చిన ప్రత్యక్షతను ఇవ్వగలడు. అప్పుడు మాత్రమే అపొస్తలులు వారి కాలములో ఏ పునాదిపై సంఘమును నిర్మించిరో అదే పునాదిపై మనమును సంఘమును నిర్మించగలము.

కేవలము తండ్రి మాత్రమే యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు, సాతానుపై సంపూర్ణమైన విజయమును పొందెననియు మరియు ఇప్పుడు పరలోకములోను మరియు భూమిపైనను సమస్త అధికారము పొందుటచేత, ఆయన పాదముల క్రింద అన్నియు లోబడియున్నవనియు మనకు చూపించును.

కేవలము తండ్రి మాత్రమే యేసుక్రీస్తు మనవంటి శరీరములో వచ్చెనని, అన్ని విషయములలో మనవలె శోధింపబడినను పాపము చేయలేదని, లోకమును సంపూర్తిగా జయించి, మనము కూడా ఆయనవలె ఈ లోకములో జీవించగలమను నిరీక్షణ కలుగజేసెనని మనకు ప్రత్యక్షపరచగలడు (1 యోహాను 2:6).

సంఘమును సాతాను ప్రతినిధుల నుండి సంరక్షించుట

యేసు ప్రభువు తాను కట్టుచున్న సంఘమునకు ఒక గుర్తు ''పాతాళలోక ద్వారములు (ఆత్మీయ మరణపు శక్తులు) దాని యెదుట నిలువనేరవు'' అని చెప్పెను. వేరే విధముగా చెప్పవలెనంటె ఒక సంఘము ఆత్మీయ మరణపు శక్తులైన అసూయ లేక తగవులు లేక అవినీతి లేక ధనాశ లేక లోకానుసారత లేక నిష్ఠూరత్వము లేక గర్వము లేక పరిసయ్యతత్వము మొదలైన వాటితో జయింపబడుచుండినట్లయితే, ఆ సంఘము యేసు ప్రభువు నిర్మించేది కాదని మనము రూఢి పర్చుకొనవచ్చును.

ఇటువంటి పాపములకు బానిసలైన శరీర సంబంధులైన విశ్వాసులు ప్రతి సంఘములో నుందురు. అటువంటి వారికి సంఘములో ఏ పరిచర్యను లేక బాధ్యతను లేక అధికారమును ఇవ్వకుండా వారిని సరిహద్దులలోనే (ఆవరణములోనే) ఉంచవలెను.

సాతాను ఎడతెగక సంఘమును నాశనము చేయుటకు చూచుచుండును. దానిని తన ప్రతినిధులను సంఘములోనికి చొప్పించుట ద్వారా చేయుటకు ఎక్కువగా ప్రయత్నించును. ''కొందరు సంఘములోనికి రహస్యముగా జొరబడియున్నారు'' అని యూదా చెప్పుచుండెను (4వ). గిబియోనీయులు యెహోషువాను మోసగించినట్లు (యెహోషువ 9) అనేకులు ఈనాడు పెద్దలను మోసగించి శిష్యులుగా నటించి సంఘములోనికి దొంగతనముగా ప్రవేశించుచున్నారు. అయితే వారు పెద్దలను ఏ విధముగా మోసము చేయగలిగిరి? బహుశా పెద్దలు వారి యొక్క సంపదలను లేక లోకములో వారికున్న స్థానమును బహుగా గౌరవించుట వలన అయ్యుండవచ్చును. బబులోనుకు చెందిన సంఘములన్నిటిలో లోకములో ఉన్నత స్థానములో నుండువారు లేక సంపదలు కలవారు, పెద్దలు కాకపోయినను వారి గుంపులలో తీసుకొను నిర్ణయములను ప్రభావితము చేయుదురు. కాని మన మధ్య ఎప్పుడు అట్లుండరాదు. మనము జాగ్రత్తగా నుండనట్లయితే గిబియోనీయులు మన సంఘములలోనికి కూడా వచ్చి చేరుదురు.

కొన్ని సమయములలో దేవుడు రహస్యముగా ప్రవేశించినవారిని, వారు పశ్చాత్తాపపడుటకు సమయమిచ్చుచు సంఘములో కొంతకాలము ఉండనిచ్చును. అట్లు చొరబడిన వారిని దేవుడు కొన్నిమార్లు యుగములకు పూర్వము సాతాను మూడవ ఆకాశములో నెరవేర్చిన కార్యము వంటి కార్యమును నెరవేర్చునట్లు అనుమతించును. అప్పుడు లూసిఫరు తిరుగుబాటు చేసి పడిపోయినప్పుడు తనతోపాటు మూడవ వంతు దేవదూతలను ఈడ్చుకొనిపోయెను. ఆ విధముగా పరలోకము, తిరుగుబాటు చేయువారు లేకుండా శుభ్రపరచబడెను (ప్రకటన 12:4). గనుక ఈనాడు కూడా ప్రభువు తమ స్వంత ప్రయోజనములను చూచుకొనువారిని సంఘములోనికి వచ్చునట్లు అనుమతించును. దానివలన వారు సంఘమును విడిచి వెళ్లునప్పుడు, వారితోపాటుగా కపటముతో ఉండిన మిగిలిన వారిని కూడా తీసుకుపోవుదురు. ఆ విధముగా సంఘము తిరుగుబాటు చేయువారి నుండి శుభ్రపరచబడును. ఇది దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానములో ఒక భాగము.

దీని గూర్చిన ఉదాహరణను మన మధ్య ప్రభువు వేరువేరు సమయములలో చేసిన వాటిలో చూడవచ్చును. ఆయన చాలా నేర్పుతో పరిస్థితులను కల్పించి, సంఘములో స్థానము కోరు వారిని మరియు వేరు చేయు ఆత్మ కలవారిని (రోమా 16:17 చూడండి) బహిరంగ పరచి మన మధ్యనుండి తొలగించెను. ఆయన మనమధ్యకు వచ్చిన తెలివైన వారిని మరియు పెద్దవారిని ''వారికుయుక్తి''లో (1 కొరిందీ¸ 3:19)లో వారిని పట్టుకొని సంఘమును చెరకొనపోవలెననే వారి ప్రణాళికలను భంగపరచెను. ఇది ఆయన మన గూర్చి జాగ్రత్త తీసుకొనుచుండెనను దానికి మరియు ఈ దేశములో ఆయన నామమునకు ఒక పవిత్రమైన మచ్చలేని సాక్ష్యము కలిగియుండుటకు ఆయన వాంఛకు ఒక గుర్తుగా ఉన్నది.

అటువంటి సాతాను యొక్క దాడుల నుండి మనలను ఎల్లప్పుడు కాపాడుచుండుటకు ఆయన మనలను గమనిస్తున్నందుకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలెను. ''యెహోవా పట్టణమును కాపాడనియెడల కావలియుండువారి ప్రయాస వ్యర్థము'' (కీర్తనలు 127:1). ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగియుందురో అక్కడనే ఆయన ఆశీర్వాదముండును (కీర్తనలు 133:1). కేవలము ఐక్యతతో నుండిన సంఘమే పాతాళలోక ద్వారములపై గెలుచును. గనుక మనము అటువంటి ఐక్యతలో నిలచియుండునట్లు పరిశుద్ధాత్ముడు మన మధ్యను బలముగా పనిచేయు చున్నాడు.

దేవుడు ఈ పనిని భవిష్యత్తులో కూడా కొనసాగించునట్లు మనము ప్రార్థించవలెను. ''ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతోషించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, దు:ఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండనిత్తును'' (జెఫన్యా 3:11,12) అనేది మనకు దేవుని యొక్క మారని వాగ్దానముగా నున్నది. సంఘము ఐక్యతలో కేవలము అణకువగల దీనులచే కట్టబడును.

''నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు'' (యాకోబు 1:20) గనుక మానవపరమైన ఆసక్తితో ఎవరినైనా సంఘములో నుండి తరిమివేయుట మన పనికాదు. మనపని మనయొద్దకు వచ్చిన వారినందరిని చేర్చుకొని, వారికి జీవమార్గమును చూపుటయై యున్నది. కాని ప్రభువు ఆయన సంఘమును పవిత్రముగా నుంచు విషయములో రోషము కలిగినవాడు కాబట్టి ఆయనే తమ స్వార్ధాన్ని చూచుకొను వారిని బహిరంగపరచి, దేవాలయములో రూకలు మార్చువారిని వెళ్ళగొట్టినట్లు ఆయన సమయములో ఆయనకు తోచిన విధముగా వెళ్ళగొట్టును.

మత్తయి 18:17-20లో యేసుప్రభువు, పాపము చేయుట ద్వారా సంఘములోనికి మాలిన్యమును తెచ్చిన ఒక సహోదరుని గూర్చి చెప్పెను. సాతాను యొక్క చేతులలో ఒక పనిముట్టుగా మారెనని అటువంటి సహోదరునికి సాధారణముగా తెలియదని మనము గుర్తుంచుకొనవలెను. అందుచేత మనము అటువంటి సహోదరుని యొద్దకు వెళ్లి అతడిని గెలుచుకొనగలుగునట్లు మొదట ఏకాంతముగా అతనితో మాటలాడమని యేసు ప్రభువు చెప్పెను. మన గురి ఎప్పుడు అతడిని సాతానునుండి విడిపించి దేవుని కొరకు గెలుచుకొనునట్లుగా ఉండవలెను. అతడు వినకపోయినట్లయితే, మరియొకసారి అతడిని గెలుచుకొనుటకు ప్రయత్నించవలెను. ఈసారి ఒకరిద్దరు సహోదరులను వెంటబెట్టుకొని వెళ్లి ప్రయత్నించవలెను. అప్పటికిని అతడు విననట్లయితే సంఘమునకు చెప్పవలెను. అతడు సంఘము మాట కూడా వినకపోయినట్లయితే అతడిని సహవాసము నుండి బయటపెట్టవలెను. దానివలన అతడు తన అవసరమును గుర్తించి పశ్చాత్తాపపడును. దానిని బట్టి అతడి ఆత్మ ద్వారా ఇతరులు మలినపర్చబడరు.

దేవుని కార్యము ఆటంకపర్చబడకుండా కొనసాగునట్లు, సాతానుయొక్క ఇటువంటి కార్యములను బంధించుటకు మనము దేవునిలో బలవంతులుగా నుండవలెను. సాతాను మన జీవితాలపై ఏ విధమైన అవకాశమును తీసుకొనకుండునట్లు మనము ప్రతి సహోదరుని త్వరగా మరియు పూర్తిగా క్షమించుట నేర్చుకొనవలెను (2 కొరిందీ¸ 2:11).

సాతాను యొక్క కుయుక్తులను తెలిసికొనుట

మనము ఆత్మీయ పోరాటమును సమర్థవంతముగా పోరాడాలంటే, మనము సాతాను యొక్క తంత్రములను, పద్ధతులను మరియు కుయుక్తులను తెలుసుకొనకుండా ఉండకూడదు. యేసు ప్రభువును సాతాను అరణ్యములో ఆహారము ద్వారా శోధించిన పద్ధతిని బట్టి, సాతాను మనలను కూడా మన శరీరములకు అవసరమైన న్యాయసమ్మతమైన కోర్కెల ద్వారా శోధించుటకు చూచునని తెలుసుకొనవచ్చును. యేసుప్రభువు తన శిష్యులతో ఆహారము గూర్చి వస్త్రములను గూర్చి ఎక్కువ తాపత్రయ పడుటను గూర్చి హెచ్చరించెను. ఆహారము లేక రకరకములైన దుస్తులు మనకు ఎక్కువ ముఖ్యమైన యెడల, సాతానుకు మనపై తప్పక అధికారముండును. ఎందుకనగా అప్పుడు మన రాజ్యము ఈ లోకమునకు సంబంధించినదై యుండును. మన కుమార్తెలు అందమైన దుస్తుల గూర్చి ఎక్కువగా మనసు పెట్టునట్లు మనము పెంచకూడదు, అట్లయినట్లయితే వారు సాతాను చేత పట్టబడుదురు.

లూసిఫరు దేవదూతలందరిలో తన్నుతాను ఒక ముఖ్యుడుగా తలంచుకొనుట మొదలు పెట్టినప్పుడే అతడు సాతానుగా మారెను (యెహెజ్కేలు 28:11-18; యెషయా 14:12-15). అదే విధముగా సాతాను అనేకమంది విశ్వాసుల హృదయములలో కూడా ప్రవేశించును. ఎప్పుడైతే ఒక సహోదరుడు తాను సంఘములో ఒక ప్రాముఖ్యమైన వాడినని తలంచుకొనుట మొదలు పెట్టునో, అప్పుడు అతడు సాతాను యొక్క ఆత్మతో కల్మషము చెందెనన్న విషయము స్పష్టమగును. అప్పుడు అతడి చుట్టూ ఉన్న వివేచన లేని విశ్వాసులు అతడిని ఎంతో ప్రాముఖ్యమైన వాడుగా ఆలోచింపచేసి అతడి అహంకారమును పెంచినప్పటికీ , అతడు ఆత్మీయ పోరాటములో బలహీనుడగును.

ఒక సహోదరుడు సంఘ కూటములో అతడికి ఉన్న ఆత్మీయ పరిమితికి మించి మాటలాడుట ద్వారా అతడికి గల బైబిలు పరిజ్ఞానాన్ని ఓపికతో కూర్చొని వినుచుండిన సహోదరి సహోదరులపై కక్కికేయుట ద్వారా అతడు ఒక ప్రాముఖ్యమైన వాడినని, మిగిలిన వారికంటే ఉన్నతమైన వానినని అనుకొనుట ప్రారంభించెననుటకు ఒక స్పష్టమైన గుర్తుగా యున్నది. అది సాతాను యొక్క ఆత్మ. అటువంటి సహోదరుని విషయములో తరచుగా చూచే విషయమేమంటే అతడు అభ్యంతరపడుట అనే ప్రాథమికమైన విషయంపై కూడా విజయమును పొందియుండడు. కూటము పూర్తయిన తరువాత ఆ సహోదరునికి ప్రసంగమును క్లుప్తముగా ముగించవలసినదని చెప్పినట్లయితే అతడు దానికి అభ్యంతరపడును. అటువంటి సహోదరులు ఎల్లప్పుడు తమను తీర్పు తీర్చుకొనకుండా యుందురనుటకు ఇది తేటయైన గుర్తుగా యున్నది. వారిని వారు తీర్పు తీర్చుకొనినట్లయితే వారియొక్క గర్వము గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేయుటను వారు తెలిసికొనియుందురు.

అటువంటి సహోదరులనే సాతాను తన ప్రతినిధులుగా చేసికొనును. అయితే మనము సంఘమును పవిత్రతతో కాపాడవలెను గనుక ఆ విధముగా ఎక్కువగా మాటలాడు సహోదరులకు చివరకు మనము తరచు వారిని హెచ్చరిస్తున్నామని వారు బాధపడినా సరే క్లుప్తముగా ముగించమని చెప్పవలసియున్నది. ఎవరి హృదయములలో నిష్ఠూరము మరియు వ్యతిరేకత ఉండునో అటువంటి వారు సంఘకూటములలో ఒక్క నిమిషము కంటే ఎక్కువ మాటలాడ కూడదు. ఆ ఒక్క నిమిషము కూడా వారు వారి యొక్క నిరీక్షణ ఒప్పుకొనినట్లయితే వారిలో ఉండిన పాపపు వైఖరులను పోగొట్టుకొని వారు త్వరగా పూర్ణహృదయముతో దేవునిలో జీవించే వారగుదురు.

యేసు ప్రభువు తన శిష్యులను బిరుదులు పెట్టుకొనవద్దని హెచ్చరించినప్పుడు సంఘములో ఇతరులకంటే ఎక్కువ వానినని చూపించుకొనే సాతాను ఆత్మ గూర్చియే హెచ్చరించారు. ఒక పాస్టరు అను బిరుదు ఇతర సాధారణ సహోదరులకంటే గొప్ప అని చూపించుచున్నది. రెవరెండు అనునది మామూలు సహోదరులకంటే (పాస్టర్ల కంటే) ఇంకా గొప్పది. కాని యేసుప్రభువు మనమందరము సాధారణమైన సహోదరులమని చెప్పారు. బబులోను వారు అటువంటి బిరుదులు వాడుకోనివ్వండి. మనము అటువంటి వాటిని, ఆత్మలో కూడా తప్పించుకొందుము. ఎల్లప్పుడు సంఘములో అందరి కంటే చిన్నవాడిగా ఉండునట్లు, నీ ఆత్మలో చూచుకో. అప్పుడు నీమట్టుకు నీవు భద్రముగా నుండుటయే కాక సాతానుతో పోరాటములో కూడా నీవు బలమైన వాడిగా నుందువు.

లూసిఫరు దేవుడు తనను ఉంచిన పరిస్థితులను బట్టి కూడా అసంతృప్తితో యుండెను. అతడు ఆ విధముగా అపవాదిగా మారెను. అటువంటి అసంతృప్తి గల ఆత్మను సాతాను ఇప్పుడు లోకములో నున్న జనుల హృదయముల లోనికి వ్యాపింప చేయుచున్నాడు. మరియు అనేకమంది విశ్వాసులు ఈ అంటువ్యాధిని సంక్రమింప చేసికొని యున్నారు.

నీకున్న ఈ లోక వస్తు సంబంధమైన పరిస్థితులను అభివృద్ధి చేసుకొనుటలో తప్పేమి లేదు. కాని వేరొక సహోదరునికి నీ కంటె ఎక్కువ ఉండుట నీవు చూచినప్పుడు, అతడిపై అసూయ పడకు, అతడికి ఉన్నవి నీవు కోరుకొనవద్దు, మరియు అతడి నుండి ఏ బహుమతులను ఆశింపవద్దు. దేవుడు నీకు వేటిని సంతోషముగా నిచ్చెనో వాటితో తృప్తి పడుము. బహుమతులను (లంచము) అసహ్యించుకొనువాడు బ్రతుకును (సామెతలు 15:27). సాతాను యొక్క కుయుక్తులను ఎరుగక యుండకుము. నీవు నీ జీతము గూర్చిగాని, నీ యింటిని గూర్చి గాని, నీ చర్మపు రంగు గూర్చిగాని లేక అటువంటి దేని గూర్చి గాని నీవు అసంతృప్తి పొందుట ప్రారంభించినట్లయితే, నీ హృదయపు తలుపును సాతానుకు తెరచుచున్నావు.

మనము రక్త మాంసములతో పోరాడుట లేదు

''ఏలయనగా మనము పోరాడునది రక్త మాంసములతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము'' (ఎఫెసీ 6:12).

3500 సంవత్సరముల క్రితము, మోషే సీనాయి పర్వతము నుండి దిగివచ్చి, ఇశ్రాయేలీయులకు ఈ లోకములో ఒక రాజ్యము గూర్చి దేవుని నుండి వాగ్దానమును తీసుకువచ్చెను. కాని 2000 సంవత్సరముల క్రితము యేసు క్రీస్తు పరలోకము నుండి దిగివచ్చి మనకు పరలోక రాజ్యము గూర్చిన వాగ్దానమును తీసుకువచ్చెను. ఇది పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య నున్న ముఖ్యమైన వ్యత్యాసము. దీనిని మనము అర్ధము చేసికొనక పోయినట్లయితే, మనము సాతానుకు వ్యతిరేకముగా సమర్థవంతముగా యుద్ధము చేయలేము.

మన రాజ్యము ఈ లోకమునకు సంబంధించినది కాదు. గనుక మనము మానవులతో దేని గూర్చియైనను ఎప్పుడు పోరాడకూడదు. ఇది సమర్ధవంతమైన ఆత్మీయ పోరాటములో మొట్టమొదటి అవసరత. విశ్వాసులను వారి పిలుపు నుండి ప్రక్కత్రోవ పట్టించుటకు సాతాను వాడు ముఖ్యమైన పద్ధతులలో ఒకటి వారిని ఇతరులతో అనగా వారి బంధువులతో లేక వారి పొరుగు వారితో లేక వారి సహోదర సహోదరిలతో పోరాడునట్లు చేయుటయై యున్నది. మరియు ఆ పోరాటము తప్పక ఈ లోక సంబంధమైన విషయము గూర్చియై యుండును. ఆ విధముగా అతడు విశ్వాసులను వారుండిన పరలోకపు స్థానము నుండి ఈ భూమి పైకి మరియు వాటి విషయముల లోనికి లాగివేయును. ఆవిధముగా వారు అతడితో పోరాటములో అసమర్ధులగునట్లు చేయును.

నీవు సాతానుతో సమర్ధవంతముగా పోరాడి సంఘమును కట్టవలెనంటె, నీవు ఎప్పుడైనను మానవులతో గొడవపడనని నిశ్చయించుకొనుము. మనము ఇతరులతో మన ఆలోచనలలో కూడా ఊహల యుద్ధములు చేయకూడదు. మనకు ఏ ఒక్కరిపై కూడా ఒక్క ఫిర్యాదు కూడా యుండకూడదు. మరియు మనకు అంతరంగములో కూడా ఇతరులు ఫలానా విధముగా చేస్తే బాగుండును అను కోర్కె ఉండకూడదు. ఉదాహరణకు: ఇతరులు మనలను గౌరవముగా చూడవలెనని లేక మన గూర్చి వారు పట్టించు కొనవలెనని, లేక మన యెడల ప్రేమ చూపవలెనని లేక వారు మన నెప్పుడు మోసగించకూడదని కోర్కెలు ఉండకూడదు. మనము మన వివాహ భాగస్వామినుండి కూడా అటువంటివి ఎదురు చూడకూడదు. అటువంటి గొడవలు మరియు ఫిర్యాదులు మరియు కోర్కెలన్నియు ఒక వ్యక్తి యొక్క రాజ్యము ఈ లోకమునకు సంబంధించినదని మరియు అతడు సాతానుకు తన హృదయములో చోటు ఇచ్చెనని సూచించుచున్నవి. మరియు అటువంటి వారు చాలా నికృష్టమైన జీవితమును జీవించుదురు.

మనము దేవునికే లెక్క అప్పజెప్పవలసి యున్నది (హెబ్రీ 4:13). మన పరిస్థితులన్నీ (ఇతరులు మనలను చూచు విషయము కూడా) మన మేలు కొరకు ఆయన కుమారుని సారూప్యము లోనికి మారుట కొరకు మన ప్రేమగల తండ్రిచేత నియమింపబడెను. గనుక ఎవరిపైన కూడా దేని గూర్చియైనను పిర్యాదు చేయుటకు మనకు అవకాశము లేదు. కాని అన్ని వేళలా ఆయనను స్తుతించుటకే అవకాశమున్నది.

స్తుతించు ఆత్మ

ప్రకటన గ్రంథములో పరలోకము గూర్చి 7 మార్లు మనకు ఇవ్వబడిన కొసమెరుపులలో, పరలోక వాసులు దేవుని ఎడతెగక గొప్ప స్వరముతో స్తుతిస్తూ ఉండుటను మనము చూచెదము. కొన్ని సార్లు ఉరుముల శబ్దమువలె మరియు జల ప్రవాహముల శబ్దమువలె స్తుతించుటను మనము చూచుదుము. ఇది పరలోకపు వాతావరణము. అది ఫిర్యాదులు మరియు కోర్కెలు లేని ఎడతెగని స్తుతులతో నున్న వాతావరణము. మరియు అటువంటి వాతావరణమును పరిశుద్ధాత్ముడు మన హృదయముల లోనికి, మన ఇండ్ల లోనికి మరియు మన సంఘముల లోనికి తీసుకురావలెనని ఆశించుచున్నాడు. ఆ విధముగా ఈ ప్రదేశములన్నిటి నుండి సాతాను తరిమి వేయబడును.

పెద్ద స్వరముతో ''హల్లెలూయా'' చెప్పుచూ తరచు దేవుని స్తుతించు (గత శతాబ్దములో జీవించిన) ఒక సహోదరుని గూర్చి నేను చదివాను. ఒక రోజున అతడికి దగ్గర్లో ఉండిన ఒక గంభీరముగా ఉండే మృత క్రైస్తవుడు, ఇతడిలో ఉండిన స్తుతించు ఆత్మను బట్టి చిరాకు చెంది, ఒకవేళ దేవుడు అతడిని చివర్లో నరకమునకు పంపితే ఏమి చేయుదువు అని అడిగెను.అందుకు ఆ సహోదరుడు ''నేను నరకమునకు వెళ్ళినట్లయితే, నరకంలో నుండిన ఇతరులకు నేను ఈ స్తుతించు ఆత్మను అంటించి వేయుదునేమో అని భయపడి సాతాను నన్ను నరకంలో నుండి తరిమి వేయువరకు నేను అక్కడ హల్లెలూయా అని చెప్పుచూ దేవుని స్తుతించుదును'' అని చెప్పెను!!

స్తుతించు ఆత్మ ఉండిన వారికి నరకములో స్థలము లేదు! ఎవరైతే ఇతరులపై పూర్తిగా ఫిర్యాదులతోను మరియు ఇతరులు వారికేమో చెయ్యవలెనను కోర్కెలతో ఉందురో అటువంటి వారే నరకమునకు వెళ్ళుదురు. వారు భూమిపై నుండినప్పుడు అలాగు ఉండిరి. మరియు వారు భూమిని విడిచినప్పుడు కూడా వారితో వారి దుష్టస్వభావమును తీసుకు వెళ్లుదురు.

క్రైస్తవులలో ఎంతోమంది వారి సహోదర సహోదరీలకు వ్యతిరేకముగా, వారి బంధువులకు మరియు పొరుగువారికి వ్యతిరేకముగా, పరిస్థితులకు వ్యతిరేకముగా మరియు చివరకు దేవునికి కూడా వ్యతిరేకముగా సణుగుకొను మరియు ఫిర్యాదు చేయు ఆత్మను సంక్రమించుకొనునట్లు సాతాను చేయుట వలన, వారు సాతానుకు వ్యతిరేకముగా చేయు పోరాటములో పనికిరాకుండా పోయిరి.

మనము క్రింద నున్న హెచ్చరికలకు విధేయత చూపినట్లయితే, మనము సాతానును జయించగలము.

''క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి"(కొలస్సీ 3:15).

"అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెనని కోరుచున్నాను" (1 తిమోతి 2:1,2).

"మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను'' (ఎఫెసీ 5:20).

ఇక్కడ మనము అన్నింటికంటె ముందు దేవుడు క్రీస్తుయొక్క శరీరములోనికి పిలిచిన వారి గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని చూచుదుము. ఈ విషయములో మన ఇష్టమునకు వదిలినట్లయితే దేవుడు పిలిచిన ఎంతో మందిని మనము పిలువము, ముఖ్యముగా మన సంఘము కాని వారిని పిలవము. కాని భూమికంటె ఆకాశము ఎంత ఎత్తుగానున్నదో దేవుని జ్ఞానము మన జ్ఞానము కంటే అంత గొప్పది గనుక వారిపై మనకున్న అభిప్రాయము కంటె తప్పక వేరైన అభిప్రాయమును ఆయన కలిగియుండును. మరియు మనము జ్ఞానము గలవారమైతే మన ఆలోచనలను దేవుని ఆలోచనలతో సమానముగా నుండునట్లు వాటిని మార్చుకొందుము.

ఒకమారు మనము క్రీస్తు శరీరములో నున్న సహోదర సహోదరీల కొరకు కృతజ్ఞత చెల్లించుట నేర్చుకొనినట్లయితే, అప్పుడు మనము మనుష్యులందరి కొరకు మరియు అన్ని పరిస్థితుల కొరకు కృతజ్ఞత చెల్లించుట నేర్చుకొందుము. మన పరలోకపు తండ్రియైన దేవుడు మనుష్యులందరిని మరియు పరిస్థితులన్నిటిని తన సర్వాధికారముతో అదుపు చేయుచున్నాడని మనకు తెలియును. మనము దీనిని నిజముగా నమ్మినట్లయితే, మనము తప్పక అన్నివేళలా దేవుని స్తుతించుదుము మరియు ఆ విధముగా మన రాజ్యము పరలోక సంబంధమైనదే కాని ఈ లోక సంబంధమైనది కాదని ఋజువు చేయుదుము. అప్పుడు మనపై సాతాను తన శక్తిని కోల్పోవును. అప్పుడు మాత్రమే మనము సాతానుతో సమర్ధవంతమైన పోరాటము చేయగలము.

ప్రకటన గ్రంధములో 12:8 లో ఒక అద్భుతమైన మాట వ్రాయబడినది, అది ''సాతానుకును మరియు అతడి దూతలకును పరలోకమందు స్థానము లేకపోయెను'' అనునది. మన జీవితములలో కూడా అట్లే ఉండవలెను. మన హృదయములలో, మన గృహములలో మరియు మన సంఘములలో సాతాను మరియు అతడి దూతలు ఏమాత్రము స్థలమును పొందుకొనకూడదు.

అధ్యాయము 13
దేవుని సన్నిధిలో ఏ మానవుడు అతిశయపడ లేడు

''ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు....అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది'' (1 కొరిందీ¸ 1:29,31).

ఎవరు కూడా తాను నెరవేర్చిన దాని గూర్చి లేక చేసినదాని గూర్చి నిత్యత్వములో అతిశయపడుటకు వీలులేని విధముగా దేవుడు ప్రతి పని చేయును. దేవుడు రోషము గలవాడు మరియు ఆయన మహిమను ఎవ్వరికి యిచ్చువాడుకాడు (యెషయా 42:8).

ధనవంతుడైన యౌవన అధికారి తన కుండిన ఆస్తిని వదులుకొనలేక ప్రభువు యొద్ద నుండి వెళ్లిపోవునప్పుడు, ఒంటె సూదిబెజ్జములో దూరుట కంటె ఒక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కష్టమని యేసు తన శిష్యులకు చెప్పెను. అట్లయితే ఎవరు రక్షింపబడుదురు అని శిష్యులు ప్రభువును అడిగినప్పుడు, మనుష్యుడు తనను తాను రక్షించుకొనుట అసాధ్యము కాని దేవుడు మాత్రమే మనుష్యుని రక్షింపగలడని చెప్పెను (మార్కు 10:24-27).

ఎక్కువ డబ్బు కలిగిన వాడే ధనికుడు కాడు. ఒకడు అనేక విధములుగా ధనికుడై యుండవచ్చును. అది తన కుండిన సామర్థ్యములను బట్టి, బైబిలు పరిజ్ఞానమునుబట్టి, తన దృష్టిలో తనకుండిన ఆత్మీయతనుబట్టి మరియు అట్లు అనేక విధములుగా కావచ్చును.

దేవుని రాజ్యము చాలా చాలా పెద్దది. కాని దాని లోనికి వెళ్ళు మార్గము సూది బెజ్జము అంతచిన్నది. ఒక ఒంటె దానిలో ప్రవేశించుట అసాధ్యము, కాని ఒంటెకు ఏది కష్టమో అది ఈ లోకములో అమీబా (సృష్టింపబడిన వాటిలో అతి చిన్న జీవి) కు అతి సుళువైన విషయము. అదంతా ఎంత పరిమాణములో ఉన్నదను దానిపై ఆధారపడియున్నది.

గర్వము మానవుని ధనికునిగా చేసి దేవుని రాజ్యములో ప్రవేశింపకుండా చేయును. మరియు గర్వము ఎంత కుయుక్తి కలదీ మరియు దుష్టమైనదంటే దాని నుండి మానవుడు తనను తాను రక్షించుకొనుట అసాధ్యము. మనము అనేక పాపముల నుండి పశ్చాత్తాప పడవచ్చును మరియు కోపముపై, నేత్రాశపై మరియు ధనాశపై మరియు ఇతర అనేకమైన వాటిపై జయము పొందవచ్చును. కాని వీటన్నిటి అడుగున మన యొక్క రక్షణ గూర్చి మరియు మన యొక్క విజయము గూర్చి గర్వము కలిగి యుండుటకు అవకాశమున్నది. మన ఆత్మ అంతరంగమున,

''దేవా నేను ఇతరులవలె ఇతర సంఘ శాఖలలో నున్న క్రైస్తవులవలె లేనందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను'' (లూకా 18:11)

అని చెప్పు వైఖరిని కలిగి యుండుటకు అవకాశమున్నది.

ఈ దుష్టుమైన గర్వము నుండి మనలను మనము రక్షించుకొనుట అసాధ్యము. కేవలము దేవుడే మనలను రక్షించగలడు. దీనిని మనము గుర్తించి దీనతతో మనము ఆయనకు లోబడి మనలను రక్షించుమని దేవుని అడుగవలెను. అలా కానట్లయితే మన జీవితముల చివరన మన ''విజయము'' గూర్చి మరియు ''క్రీస్తు శరీరములో ఉండుట'' గూర్చి సాక్ష్యమిచ్చినను, మనము మొదటి రకపు పరిసయ్యులుగా మిగిలిపోవుదుము.

గనుక అటువంటప్పుడు ఎవరు రక్షింపబడుదురు అని మనము ప్రశ్నించవచ్చును. మానవునికి అసాధ్యమైనది దేవునికి అసాధ్యము కాదు అని ప్రభువు సమాధానమిచ్చును. (మార్కు 10:26,27).

రక్షణ క్రొత్త నిబంధనలో మూడు కాలములలో చెప్పబడినది. అవి వర్తమాన, భూత, భవిష్యత్కాలములు. మనము తిరిగి జన్మించిన వారమైతే, మనము పాపము మొక్క శిక్షనుండి రక్షింపబడినాము. ఇప్పుడు మనము పాపపు శక్తి నుండి రక్షింపబడవలసియున్నది. మరియు ప్రభువు ఆయన మహిమతో తిరిగి వచ్చునప్పుడు మనము పాపపు సమక్షము నుండి కూడా రక్షింపబడుదుము.

రక్షణలో నున్న ఈ ఒక్కొక్క అంశము దేవుని యొక్క పనియై యున్నది. ''మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి యున్నారు. ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు'' (ఎఫెసీ 2:8,9) అని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టముగా చెప్పుచున్నది.

యోనా చేప కడుపులో ''యెహోవా యొద్దనే రక్షణ దొరుకును'' (యోనా 2:9) అని చివరగా ఒప్పుకొనిన వెంటనే విడుదల కలిగెను. దాని తరువాత వచనము ''అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను'' అని చెప్పుచున్నది. యోనా తనను తాను రక్షించు కొనలేడని ఒప్పుకొనువరకు దేవుడు ఎదురు చూచెను.

మనలను మనము ఏ పాపమునుండి లేక ఏ విధమైన క్లిష్ట పరిస్థితులనుండి రక్షించుకొనలేమని మనము కూడా ఒప్పుకొనే వరకు ఆయన వేచియుండును. అప్పుడు ఆయన యోనా కొరకు చేసినట్లు మన కొరకు విడుదలను ఆజ్ఞాపించును. యోనా వలే మనలను మనము ఒక క్లిష్టమైన పరిస్థితిలో కనుగొన్నప్పుడు, ఫిర్యాదులు చేసి గొణుగుకొనుటకు బదులు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుట మరియు రక్షణ ప్రభవు యొద్దనుండే వచ్చునని ఒప్పుకొనుట నేర్చుకొనిన యెడల, విడుదల త్వరగా వచ్చునని మనము కనుగొనెదము.

రక్షణ అనేది ఒక ఆత్మాభివృద్ది పథకము కాదు. అటువంటిది మనలను కేవలము బాహ్యముగానే మార్చగలదు. దేవుని పని మన అంతరంగమును మార్చును.

మానవుడు దేని గూర్చియు గర్వపడుటకు వీలులేని విధముగా దేవుడు పనిచేయును. మనము పాపము నుండి సంపూర్తిగా రక్షణను అనుభవించవలెనంటె, దేవుడు మనకు చేసిన దేని గూర్చి కూడా చివరకు ఆయన మనకు యిచ్చిన పాపముపై విజయము గూర్చి కూడా అతిశయపడకూడదు.

మన దృష్టిలో మనము ఎంత తక్కువగా ఉంటే దేవుని రాజ్యములోనికి మనకు అంత సమృద్ధియైన ప్రవేశము (సూది బెజ్జము గుండా) కలుగును (2పేతురు 1:11). మన దృష్టిలో మనము నిజముగా తక్కువగా ఉన్నామనుటకు ఒక ఋజువు మనము ఏ మనుష్యుని, అతని మతము, సంఘ శాఖ లేక వెలుగు లేక పోవుట, మనకు తెలిసిన సత్యాలు తెలియకపోవుటను బట్టి అతనిని తృణీకరించకుండా ఉండుట. మనుష్యులలో మనము అతి నీచులను చూచినప్పుడు: ''దేవుని కృపలేనిదే నేను అటువంటి వాడినే'' అని మనతో మనము చెప్పుకొనెదము.

యేసు తన్నుతాను ''మనుష్యకుమారునిగా'' సంబోధించుకొనెను- వేరే మాటలలో చెప్పాలంటే ''ఒక సాధారణమైన మనుష్యుడను'' అని చెప్పుకొనెను. మనము కూడా అన్నివేళల అటువలెనే ఉన్నామని గుర్తించాలి. మనము పాపము యొక్క శిక్షనుండి రక్షింపబడినామంటే దేవుని కనికరమే ఆ రక్షణను మనకిచ్చెను. మనము ఇప్పుడు పాపము యొక్క శక్తినుండి రక్షింపబడుచున్నామంటే అది కూడా దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన కృప మరియు కనికరము యొక్క ఫలితము. గనుక మనము దేనిని బట్టి అతిశయింపగలము? దేనిని బట్టి అతిశయింపలేము.

ఒక ఉదాహరణను చూడండి: మీరు వేసిన ఒక అందమైన చిత్రమును ఇతరులు మెచ్చుకొనిన యెడల, మీరు సాధించిన దానిని బట్టి మీరు అతిశయించుటకు శోధింపబడుదురు. కాని వారు వేరొకరు వేసిన చిత్రమును మెచ్చుకొనిన యెడల, మీరు అతిశయపడుటకు ఎలా శోధింపబడగలరు? దేవుడు మన జీవితాలలో నెరవేర్చే రక్షణ ప్రక్రియకు ఈ ఉదాహరణను వాడవచ్చును. మనలను అభివృద్ధి పరచినది లేక పరిశుద్ధ పరచినది మనమే అయితే దానిని బట్టి మనము గర్వించవచ్చును. కాని మనలో ఈ కార్యమును చేసినది దేవుడైతే మనము దానిని బట్టి ఎలా గర్వించగలము?

మనము ప్రత్యేక పరచబడుట యొక్క నాణ్యత ఎటువంటిది? అది కేవలం నైతికపరమైన కొంత అభివృద్ధా? అలా అయినట్లయితే మనము దైవికమైన లేక మానవాతీతమైన దానిని మన జీవితాలలో అనుభవించలేదు కాని ఏ మానవుడైనా కొద్దిగా పట్టుదలతో చేయగలిగినదే మనము చేసియున్నాము. అయితే దేవుని యొక్క నిజమైన కార్యము మనలో జరిగినట్లయితే, మనకు నిత్యజీవము (దేవుని స్వభావము) ఇవ్వబడును. అది దేవునినుండి వచ్చిన ఉచిత బహుమానము(రోమా 6:23).

(దేవుని స్వభావమును మనము తయారుచేయలేము). మనలో వచ్చిన మార్పు దేవుడిచ్చిన ఉచితమైన బహుమానము యొక్క ఫలితమైన యెడల అతిశయించుటకు అసలు అవకాశము లేదు. కాబట్టి పాపము మీద నీకున్న జయమును బట్టి నీవు గర్వించిన యెడల, దానిని నీకు నీవే తయారు చేసుకొని యున్నావు!! అలా అయిన యెడల, నీ విజయము పనికిరానిది మరియు అది నిశ్చయముగా నిజమైనది కాదు. దానిని నీవు ఎంత వెంటనే పారవేస్తే అంత మంచిది. దానికి బదులు దేవుని స్వభావములో పాలు పొందుటకు ప్రయాసపడుము. ధర్మశాస్త్రము మూలముగా ఉన్న తన స్వంత నీతితో కాక దేవుని యొద్దనుండి వచ్చిన నీతి (దేవుని నీతి), క్రీస్తు యందు విశ్వాసము ద్వారా వచ్చు నీతితో కనబడగోరుచున్నానని పౌలు చెప్పెను (ఫిలిప్పీ 3:9).

రోమా పత్రికలో, సువార్త సందేశము యొక్క ప్రగతిని అధ్యాయము తరువాత అధ్యాయములో మనము చూచుదుము. ఇక్కడ మొదటి అధ్యాయములలో నున్న విషయములు:

  • 1 నుండి 3 అధ్యాయములు- మానవుడి యొక్క అపరాధము తేటగా చూపబడినది.
  • 4వ అధ్యాయము- విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట.(దేవుని చేత నీతిమంతులమని ప్రకటింపబడుట).
  • 5వ అధ్యాయము- ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా మనకు దేవుని యొద్దకు వెళ్లుటకు స్వేచ్చవచ్చియున్నది.
  • 6వ అధ్యాయము- మన ప్రాచీన పురుషుడు క్రీస్తుతో సిలువ వేయబడెను గనుక మనము ఇకపై పాపము చేయనవసరము లేదు.
  • 7వ అధ్యాయము - మనము క్రైస్తవ జీవితము విషయంలో ధర్మశాస్త్రము నుండి మరియు అక్షరానుసారమైన వైఖరి నుండి విడుదల పొందియున్నాము.
  • 8వ అధ్యాయము- ఇప్పుడు మనము ఆత్మానుసారముగా జీవించి మన కోర్కెలను ప్రతిదినము మరణింప చేయగలము.

అటువంటి రక్షణ ఫలితమేమనగా ''మనము క్రీస్తునందు అత్యధిక విజయము పొందుచున్నాము'' (రోమా 8:37). అయితే వీటన్నిటి చివర, ఈ రక్షణను మనము స్వంతగా సాధించుకొన్నామనుకొనే ప్రమాదమున్నది. అందుచేత మనకు రోమా 8వ అధ్యాయము తరువాత 9 నుండి 11 అధ్యాయములు ఇవ్వబడినవి.

ఈ మూడు అద్భుతమైన అధ్యాయాలలో, రక్షణ ఆదినుండి అంతము వరకు దేవుని కార్యమేనని వివరింపబడెను. ఈ మూడు అధ్యాయములు ప్రాథమికముగా పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుతో ఎలా వ్యవహరించెనో చెప్పినప్పటికీ, పరిశుద్ధాత్ముడు ఈ సత్యములను ఈ రోజున మన జీవితాలకు అన్వయించాలని చూచుచున్నాడు.

రోమా 9 - దేవుని యొక్క సర్వాధికారము

అబ్రాహాము ఇద్దరు కుమారులైన ఇష్మాయేలు మరియు ఇస్సాకు ఒకే గృహములో ఒకే తండ్రితో పెరిగిరి. అయినప్పటికి దేవుడు వారిలో ఒక్కరినే, ఇస్సాకునే ఎన్నుకొనెను (రోమా 9:7). దానికి కారణము దేవుడు పక్షపాతము కలవాడని కాదు గాని ఆయన సర్వాధికారి. ఈ విశ్వము యొక్క సృష్టికర్తగా ఆయనకు ఇష్టమైనది చేయుటకును, ఏ పనికైనా ఆయనకు ఇష్టమైనవారిని ఏర్పరచుకొనుటకు ఆయనకు హక్కు ఉన్నది. ఆయన అన్నిటిని తన సంతోషము కొరకు సృష్టించెను గనుక ఆయన హక్కును ఎవరు ప్రశ్నించలేరు. పౌలు ఈ మూడు అధ్యాయాల చివరిలో చెప్పినట్లు, ''ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి'' (రోమా 11:36).

ఇస్సాకు యొక్క ఇద్దరు మగపిల్లలైన ఏశావు, యాకోబు ఒకే గృహములో ఒకే తల్లితండ్రులతో పెరిగిరి. అయినప్పటికి దేవుడు చిన్నవాడైన యాకోబునే ఎంచుకొనెను. ''ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను'' (రోమా 9:11,12). ఆయన ఈ విశ్వానికి సర్వాధికారి గనుక ఆయన చేెసిన ఈ పనిలో అన్యాయమనేది లేదు.

మోషే మరియు ఫరో ఐగుప్తులో ఒకే సమయమందు ఒకే రాజ భవనములో నివసించిరి. అయినప్పటికీ దేవుడు మోషేను తన ప్రవక్తగా నుండుటకు లేవనెత్తెను. ''అతనిలో దేవుని బలము ప్రదర్శింపబడుటకు అతని ద్వారా భూలోకమందంతట దేవుని నామము ప్రచురమగుటకు'' ఫరో లేవనెత్తబడెను (రోమా 9:17). ఫరో హృదయ కారిÄన్యము ద్వారా మరియు దానికి ప్రతిఫలముగా దేవుడు అతని మీదకు పంపించు తీర్పుల ద్వారా ఇది జరిగెను.

ఈ మూడు ఉదాహరణలలో, జనులను ఎంచుకొనుటలో దేవునియొక్క సర్వాధికారమును మనము చూడవచ్చును. మన రక్షణ విషయములో కూడా దేవుని యొక్క సర్వాధికారమును అట్లే చూడవలసియున్నది. దేవుడు నిన్ను ఎంపిక చేసికొని నీతోటి బంధువులైన నీ అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, ఇతర బంధువులను ఎందుకు వదిలివేసెను? నీవు వారి కంటె ఏ విధముగానైనా శ్రేష్టమైన వాడివనా? నిశ్చయముగా కాదు. యాకోబు వలే నీవు వారి కంటె గొప్ప దుష్టుడవు మరియు వేషధారివియై యుండవచ్చును. అయినప్పటికి దేవుడు నిన్ను ఎన్నుకొనెను అది కేవలము దేవుని యొక్క కృప మరియు కనికరము మాత్రమే.

దీనంతటిని బట్టి మనమేమి చెప్పగలము? మనము ఇటువంటి మహోన్నతుడు, సర్వాధికారియైన దేవుని యెదుట మోకరిల్లి, మన పూర్ణహృదయములతో ఆరాధించి, ఆయన మాత్రమే యోగ్యుడనియు మరియు మనరక్షణ పూర్తిగా (100%) ఆయన యొక్క కృపవలన అని ఒప్పుకొనవలెను. ఆయన మనకు ఇచ్చిన దానిని మనము అందుకొన్నామన్న విషయము సత్యమే. కాని కార్యమంతా ఆయనది. దేవుడు తన బిడ్డలను తన సర్వాధికారమును బట్టి ఎన్నుకొనుట కంటే ఒక మనుష్యుని దీనుడుగా చేయునది మరేదియు లేదు.

అందువలననే దీనిని అంగీకరించుట వివేకవంతులకు క్లిష్టముగా ఉండును. మరియు వారు వాక్యము చెప్పుదానిని వారి యొక్క ఉద్దేశ్యానుసారముగా మార్చుటకు వారు దానికి వ్యతిరేకముగా పోరాడుదురు మరియు దానిని వక్రీకరించుదురు.

ఒక మనుష్యుడు దేవుని బిడ్డగా ఉండాలని (లేక పరిశుద్ధముగా ఉండాలని) నిశ్చయించు కొనుటవలన లేక అతడు నమ్మకముగా పరిగెత్తుటకు నిర్ణయించుకొనుట వలన అతడు రక్షింపబడలేదు. అది కేవలము దేవుడు కనికరము చూపించుట వలన మాత్రమే. దేవుడు మనకు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యుండెను. మరియు అయనే మనము యిచ్ఛయించుటకును, కార్యసిద్ధి కలుగజేయుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మనలో కార్యసిద్ధి కలుగజేసెను (అపొ.కా. 11:18; ఫిలిప్పీ 2:3). అటువంటప్పుడు దేనిని బట్టి మనము అతిశయపడుదుము?

రోమా 9:16 ''కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును'' అని చెప్పుచున్నది. మరియు 1 కొరిందీ¸ 4:7 ''నీవు ఇతరుల వలన పొందనిది ఏది? పొందియుండియు పొందనట్లు అతిశయ పడనేల?'' అని చెప్పుచున్నది.

ఆ రెండు వచనములను కంఠస్త పెట్టి హృదయములో ఉంచుకొనినచో అవి నిన్ను ఎప్పుడు నీ కన్నుల యెదుట చిన్నవానిగా ఉంచును. నూతన జన్మ శరీరేచ్ఛల వలన (మానవ పట్టుదల వలన) రాదు కాని దేవుని చిత్తము వలన (ఆయన పట్టుదల వలన) వచ్చును (యోహాను 1:13). ''మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కాని నేను మిమ్మును ఏర్పరచుకొంటిని'' అని యేసు తన శిష్యులతో చెప్పెను (యోహాను 15:16). ఈ సత్యమును మనము గ్రహించితిమా?

చాలాసార్లు మనమే ప్రభువును రక్షకునిగా అంగీకరించామని అందువలన మన జీవితము అవిశ్వాసుల జీవితము కంటే వ్యత్యాసమైనదిగా నున్నదని అనుకొనుచుందుము. కాబట్టి మనలను దేవుడు ఎన్నుకొనెను అని గుర్తుంచుకొనుట మనకు మంచిది. ఇంకా చెప్పవలెనంటె జగత్తుపునాది వేయబడకమునుపే, మనము జన్మించక మునుపే ఆయన మనలను ఏర్పాటుచేసికొనెను (ఎఫెసీ 1:14). గనుక ప్రారంభము నుండి చివరి వరకు రక్షణ 100% దేవుని నుండి వచ్చినది. గనుక ఏ మానవుడు ఎప్పుడు దేవుని సన్నిధిలో అతిశయించుటకు వీలు లేదు.

నీవు దేవుని కొరకు మరియు ఆయన రాజ్యము కొరకు ఏమైనా చేసావా? అలా అయినట్లయితే దానిని మరచిపోవుటకు నీవు చేయగలిగినదంతా చేయుము. నీకు దేవుడు ఆరోగ్యము, బలము, తెలివితేటలు, వరములు, సామర్ద్యము, అవకాశము, ఆయన వాక్యము గూర్చి మరియు ఆయన గూర్చి జ్ఞానము మొదలైనవి ఇవ్వకుంటే నీవు ఏమీ చేయలేకుండా యుండేవాడివని గుర్తించు. అటువంటప్పుడు నీవు ఏ విధముగా అతిశయపడగలవు?

మనము ఎంత ఆత్మీయముగా తయారయ్యాము? లేక ప్రభువు కొరకు ఎంత చేసాము? అని వాటిని మనము ఆలోచించుకొని గొప్పగా అనుకున్నట్లయితే మనము పరిసయ్యులుగా అయిపోయినట్లే. ఒక నిజమైన శిష్యుడు అన్ని వేళలా ప్రభువు విషయమై ఆలోచనలలో నుండును.

దేవుడు చేసిన అనేక విషయముల గూర్చి ఆయన మనకు వివరణ ఇవ్వరు. అనేక ప్రార్ధనలకు ఆయన జవాబు ''లేదు'' అని ఉండును. దానికి కారణము మనకు అర్ధము కాదు. దేవుని యొక్క జ్ఞానము ఒక సముద్రము వంటిది. కాని మన మనసులు చిన్న గిన్నెవంటివి. ఒక చిన్న గిన్నెలో సముద్రమునంతా నింపుట ఎట్లు అసాధ్యమో అట్లే మన యెడల దేవుని యొక్క పనులన్నిటిని మనకు వివరించుట అసాధ్యము. ''దేవుని విమర్శించుటకు నీవెవడవు'' అని వాక్యము చెప్పుచున్నది. మన దృష్టిలో మనము తక్కువగా ఉన్నప్పుడు దేవుని పద్ధతులను బట్టి మనము ఏ ఫిర్యాదులు కలిగియుండము. మనకు ఆయన చేసే పనులు అర్థము కాకపోయినా, ఆయన యొక్క సర్వాధికారమును మనము అంగీకరిస్తున్నాము కాబట్టి మనము దేవునికి లోబడవలెను.

రోమా 10 - దేవుని యొక్క నీతి

ఇశ్రాయేలీయులకు దేవుని గూర్చిన ఆసక్తి యుండెను (రోమా 10:2). కాని అది దేవుని గూర్చి తెలియని ఆసక్తి, ఎందుకనగావారి యొక్క స్వంత ప్రయత్నముల వలన దేవుని యొక్క నీతిని పొందు కొనలేరని వారు తెలుసుకొనలేదు. వారు విఫలమగుటకు ఇదే ముఖ్య కారణము మరియు అనేకమంది క్రైస్తవులు ఈనాడు నీతిని అట్లే వెదుకుచున్నారు. వీరు పరిశుద్ధులుగా ఉండవలెనని అనుకొనుచున్నారు. కాని వారి యొక్క వెదుకులాట మానవపరమైన ఆసక్తితో ఉండి, వారిని గర్విష్టులుగా మరియు ఇతరుల యెడల అహంకారులుగా చేయుచున్నది. ''ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు'' (రోమా 10:3).

మన స్వనీతి (మన శ్రేష్టమైన క్రియలు) దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. అవి దేవుని దృష్టికి హేయమైనవి-కాబట్టి అవి పారవేయబడవలెను. తప్పిపోయిన కుమారుని ఉపమానములో అన్న యొక్క స్వనీతి అతనిని పరిసయ్యునిగా చేసెను. ఈ ఉపమానము యొక్క మొదటి భాగములో తండ్రి ఇంటి బయట ఉన్నది తమ్ముడు కాని ఆ కథ చివరిలో, తమ్ముడు లోపల ఉండి ఆనందించుచుండగా, అన్న బయట ఉండెను. స్వనీతి పాపములన్నిటికంటే నీచమైనదిగా యేసు ప్రభువు దానిని ఎల్లప్పుడు బయటపెట్టెను. అది వ్యభిచారము కంటెను, నరహత్య కంటెను ఘోరమైనది. అయినప్పటికీ చాలా కొద్దిమంది క్రైస్తవులే ఈ పాపము యొక్క తీవ్రతను గ్రహింపగలరు. ఇతర క్రైస్తవులను చిన్న చూపు చూచుటకు, తమ్మును తాము విమర్శించుకొనకుండా ఇతరులకు బోధకులు బోధించుటకును చేయునది స్వనీతియే. అటువంటి వైఖరులు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి. తన స్వభావములోపాలు పొందునట్లు చేయుట ద్వారా, దేవుడు నీలో నీతిని కలుగజేసెనా లేక దానిని నీవు నీ పళ్లు నూరుతూ, ప్రతి రోజు ఉదయాన్నే లేచుట ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మరియు యోగులవలే ఆత్మ నిగ్రహము ద్వారా సంపాదించితివా? దీనత్వము అను పరీక్ష ద్వారా దీనికి జవాబు నీవు తెలుసుకోగలవు.

నిత్యత్వములో తన సన్నిధిలో ఏ శరీరియు అతిశయింపకూడదని దేవుడు నిశ్చయించెను. గనుక చివరి దినమున నీ స్వంత ప్రయత్నాల ద్వారా తయారైన నీతి విలువలేనిదిగా నుండును. దానిని నీవు ఇప్పుడే గ్రహించుట మంచిది.

మన క్రైస్తవ జీవిత ప్రారంభములో క్రీస్తునందలి మన విశ్వాసమును బట్టి దేవుడు మనలను నీతిమంతులుగా ప్రకటించెను. అలా కానట్లయితే మనము కనీసము ఆయన యెదుట కూడా నిలువబడలేము. తరువాత మనము ఆయన స్వభావవములో క్రమక్రమముగా పాలివారగునట్లు చేసి మనలను పవిత్రపర్చెను. ఆయనే మనము శోధన సమయంలో నమ్మకముగా నుండునట్లును, శోధనకు లోబడకుండునట్లును కృప నిచ్చును గనుక మనము పాపము చేయము. ఆయన ద్రాక్షతోటలో ఉపయోగకరముగా నుండునట్లు మరియు ఆయనకు సేవ చేయునట్లు మనకు సామర్ద్యములను మరియు ఆత్మ యొక్క వరములను ఆయనే యిచ్చును. గనుక రక్షణ ప్రారంభము నుండి చివరి వరకు 100% దేవుని నుండి కలిగినదని చూచుదుము.

''నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని'' (రోమా 10:20). ఈ మాటలు క్రొత్త నిబంధనలో ఉన్నవని కూడా చాలా మంది క్రైస్తవులకు తెలియదు. అటువంటి వ్యాఖ్య చేయుటకు యెషయా తెగించెనని పౌలు చెప్పుచున్నాడు. యెషయా తెగించెనని మనము నిశ్చయముగా నమ్మవచ్చును ఎందుకనగా ఆ వ్యాఖ్య అన్ని కాలములలో నున్న స్వనీతిపరులైన పరిసయ్యులకు వ్యతిరేకముగా నున్నది. దీనులైన వారికి ఈ సత్యములను నమ్ముటకు సమస్య ఏమీ ఉండదు. ఎందుకనగా వారి రక్షణ, ప్రారంభము మరియు అంతము దేవునిలోనే అని గుర్తించెదరు. వారి విశ్వాసమునకు కర్త (వారి జీవితాలలో విశ్వాసమును మొదలు పెట్టినవాడు) మరియు విశ్వాసమును కొనసాగించువాడు (దానిని పూర్తి చేయువాడు) ఆయనే. కాబట్టి అతిశయించుటకు వారికి ఏ కారణము లేదు.

రోమా 11 - దేవుని యొక్క నమ్మకత్వము

ఆది క్రైస్తవులకు దేవుడు ఇశ్రాయేలీయులను చివరకు తిరస్కరించెనని మరియు దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానములన్ని రద్దు పరిచెనని అనిపించెను. కాని పరిశుద్ధాత్ముడు అపొస్తలుడైన పౌలు ద్వారా చాలా తేటగా ''తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు'' (రోమా 11:2) అని చెప్పెను. ''కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా?'' (రోమా 3:3).

దేవుడు ఆయన వాగ్దానముల విషయములలో నమ్మదగినవాడు, అందుచేత దేవుడు అబ్రాహాము సంతానము అనేక దేశములలో 25 శతాబ్ధములపాటు తిరిగిన తరువాత ఈ శతాబ్దములో తిరిగి ఇశ్రాయేలు దేశమునకు వారిని తీసుకు వచ్చెను.

''అలాగుననే అప్పటి కాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది'' (రోమా 11:5). దేవుడు ఆయన వాగ్దానముల విషయములో నమ్మకముగా నుండుట చేత అట్లు జరిగినది. ఇశ్రాయేలునకు ఈ సమయములో కరిÄన మనస్సు కలిగినను, ఒకనాడు ఇశ్రాయేలు జనులందరు రక్షింపబడుదురు (రోమా 11:25-27). తన కుమారుని సిలువ వేసిన వారి యెడల కూడా దేవుడు కనికరము కలిగియుండెను.

క్రొత్త నిబంధన క్రింద ఉన్న మనము దాని నుండి నేర్చుకొనిన దానిని బట్టి దేవుని యొక్క వాగ్దానముల యెడల ఆయన నమ్మకత్వము యందు మనము ఆదరణ పొందవచ్చును. అబ్రాహాము సంతానము గూర్చి దేవుడు చేసిన వాగ్దానములలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. తప్పిపోడు. మరియు అట్లే ఆయన బిడ్డలమైన మన గూర్చి చేసిన వాగ్దానములలో ఒక్కటి కూడా ఎప్పటికీ తప్పిపోదు. దేవుని యొక్క నమ్మకత్వము మన జీవితాంతముల వరకు మరియు యేసుతిరిగి వచ్చు వరకు మనతో నుండును.

''మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను'' (ఫిలిప్పీ 1:6).

''నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను'' ( 2 తిమోతి 1:12).

రోమా 12 - మనము స్పందించవలసిన ఒకే ఒక విధానము

ఇంతవరకు దేవుని కుండిన ప్రత్యేక లక్షణములను మనము ఆలోచించిన తరువాత మరియు ఆయన మన యెడల చూపిన గొప్ప కనికరమును చూచిన మీదట మనము ఏమి చేయగలము? ఆయన యొక్క మంచితనమును అవకాశముగా తీసుకొని, వెళ్ళి ఇంకా ఎక్కువ పాపము చేయుదుమా? ఆ విధముగా దేవుని యొక్క మంచితనమును మరియు కనికరమును అవకాశముగా తీసుకొనుట మనకు దూరమగు గాక.

దేవుడు మన యెడల చూపించిన కనికరముకు బదులుగా మనము స్పందించవలసిన ఒకే ఒక పద్ధతి ఇదే:

  1. మన శరీరమును దేవునికి సజీవయాగముగా అర్పించుట
  2. మనము ప్రతిదినము ఈ లోకానుసారముగా కాక ఆయన వలె ఆలోచించునట్లు మన మనసులను నూతన పర్చుకొనుటకు అర్పించుట.

ఆ విధముగా మనము మన జీవితముల కొరకు దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును పరీక్షించి తెలుసుకొని దానిని నెరవేర్చగలము. (రోమా 12:1,2). ఎప్పుడు ఉన్నట్లే దేవుని మంచితనమును కృపను అవకాశముగా తీసుకొని, దాని కారణముగా పాపమును తేలికగా తీసుకొనే నీచమైన, స్వార్థపరులైన క్రైస్తవులున్నారు. దేవుడు ఎంతో కనికరము గలవాడు, క్షమించువాడని ఎరిగి అట్లు చేయుదురు.

కాని ఏ కొంచెమైనా కృతజ్ఞత కలగియున్న ఏ విశ్వాసియైనా మరల ఎప్పుడు పాపము చేయకూడదని మరియు తన జీవితమంతా ప్రభువు కొరకే జీవించాలని ఈ క్రింది కారణములను బట్టి అనుకొనును.

  1. ప్రభువు అతడు రక్షింపబడక ముందు చేసిన పాపములన్నిటిని క్షమించెను.
  2. ప్రభువు అతడు రక్షింపబడిన తరువాత చేసిన అనేక పాపములను (అవి తెలిసిచేసినా సరే) మరి ఎక్కువ కనికరము చూపి క్షమించెను.
  3. ప్రభువు అతని యొక్క గత పాపములను తప్పిదములను ఇక ఎన్నడు జ్ఞాపకముంచుకొననని చెప్పెను.
  4. ప్రభువు అతని పాపములను ఇతరులకు కనబడకుండా చేసి, అతడి మర్యాదను కాపాడుచుండెను.
  5. ప్రభువు సాతాను లేక సాతాను యొక్క దూతలు (అతడి గతములో తప్పిపోయిన విషయములు తెలిసినవారు) అతడిపై చేసే నేరారోపణలను ఆలకించడు.
  6. ప్రభువు ఏ యోగ్యత లేని అతడిని మరల మరల దీవించెను.
  7. ప్రభువు సాతానుకు వ్యతిరేకముగా ఎప్పుడు అతడి పక్షమున ఉండును.

అటువంటి ప్రేమ ఎటువంటి కరిÄన హృదయమునైనను విరుగగొట్టి, అప్పటి నుండి అది సంపూర్తిగా మరియు కేవలము దేవుని కొరకు జీవించుటకు యిష్టపడునట్లు చేయును.

ఆయన మనలను అగ్నితోను తీర్పుతోను బెదిరించును గనుక ప్రభువుకు మనలను మనము అర్పించుకొనము. లేదు. దేవుని యొక్క గొప్ప అనుగ్రహమే మన హృదయాలను గెలచును. అదే దేవుని విధానము. ఒక్క తలాంతు కలిగిన వ్యక్తి, తన యాజమానుడు కరిÄనమైన వాడని తలంచినందున, ఆ తలాంతును దాచిపెట్టెను (లూకా 19:21). అది సత్యము కాదు గాని దానిని అతడు నమ్మెను గనుక తన జీవితమును వృథాచేసుకొనెను. దేవుడు కరిÄనమైనవాడని ఎంచే అనేకమంది విశ్వాసుల పరిస్థితి అలాగే ఉన్నది. వారు తమ భూసంబంధమైన జీవితాలను వృథా చేసెదరు. తీర్పు దినమున, వారు వారి వ్యర్థమైన జీవితాలను తలాంతులను తెచ్చి దేవునికి చూపించుదురు.

దేవుడు మన సంతోషమును పోగొట్టేవాడు కాడు. ''ఆయన బహు ఆనందముతో మన యందు సంతోషించును'' (జెఫన్యా 3:17). ఆయన మన యెడల కృపతో మరియు కనికరముతో ఉండాలని మరియు మనకు జీవితములో శ్రేష్టమైనది యివ్వాలని ఆశపడుచున్నాడు. ఆయన కేవలము శ్రేష్టమైన మంచి ఈవులను మాత్రమే యిచ్చును మరియు ఆయన ఈ లోకములో నున్న ఏ మంచి తండ్రి కంటె కూడా దయకలిగినవాడు మరియు ప్రేమ కలిగినవాడు. ఆయన తన బిడ్డలకు మంచి ఈవులను యిచ్చును. అన్నింటికంటె ముఖ్యముగా ఆయన పరిశుద్ధాత్మ వరమును యిచ్చును. మన జీవితములను అన్నివిధములగాను మహిమకరముగా చేయవలెనని ఆయన కోరుచున్నాడు.

మనకు దేవుని తప్పుగా చిత్రీకరించుటకు మనము సాతానును అనుమతించకూడదు లేక మన ద్వారా ఇతరులకు దేవుని తప్పుగా చిత్రీకరించుటకు మనము సాతానును అనుమతించకూడదు. దేవుడు కరిÄనమైన వాడని తలంచువారు చివరకు తమ వివాహ భాగస్వాముల యెడల, తమ పిల్లల యెడల, ఇతర మనుష్యుల యెడల కరిÄనముగానుందురు. సాతాను మనపై ఇక నేరారోపణ చేయకుండునట్లు లేక మనలను శిక్షావిధికి గురిచేయకుండునట్లు మనము దేవుని యొక్క క్షమాపణ గూర్చి ఒప్పింపబడవలసి యున్నది. ప్రకటన గ్రంథములో మరల మరల పేర్కొనబడిన జయించువారి యొక్క రహస్యము ప్రకటన 12:11లో వివరింపబడెను:

''వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు సాతానును అతని నేరారోపణలను'' (12:10,11) జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.

ఇక్కడ క్రయమును గమనించండి: క్రీస్తు రక్తము వారిని పవిత్రపరచెనని వారు మొదట ఒప్పింపబడిరి. ఆ తరువాత క్రీస్తు రక్తము వారికి ఏమి చేసెనో వారు సాతానుతో చెప్పిరి. అది వారి సాక్ష్యము. ఆ తరువాత మాత్రమే వారు తమ సిలువనెత్తికొని యేసును వెంబడించిరి. (వారు మరణమువరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు). ఈ క్రమము ఎప్పుడు తప్పిపోకూడదు. మనము మొదట శిక్షావిధినుండి పూర్తిగా విడుదల పొందనియెడల, యేసును వెంబడించుట అసాధ్యము.

సమయమంతా మనలోకి మనము చూచుకొనుచు మనము ఎంత క్రుళ్లిపోయామో చూచుట ద్వారా మనము ఎక్కువ పరిశుద్ధులము కాలేము. లేదు. మనము మనలోకి కాక ''యేసువైపు చూచుచు'' ఈ పరుగును పరుగెత్త వలెను (హెబ్రీ 12:2).

దేవుని వాక్యము అద్దము వంటిది (యాకోబు 1:23). దాని ద్వారా పరిశుద్ధాత్మ, మొదట యేసు మహిమను కనుపరచుటకు దేవుడు ఆ అద్దమునిచ్చెను- అంతేకాని మన కుళ్లిన స్థితిని కాదు (2కొరిందీ¸ 3:18 చూడండి). మనము యేసుయొక్క మహిమను చూచినకొలదీ, ప్రతి విషయములో మనము ఆయన వలే ఎలా లేమో మనము సహజముగానే చూడగలము. కాని అది మనలను నిరుత్సాహపరచదు, ఎందుకనగా మనలను క్రీస్తును పోలినవారిగా చేయుటకు కూడా ఆత్మవచ్చెను. గనుక దేవుని కొరకు పది తలాంతులను సంపాదించుటకు ఆయన మనకిచ్చిన ఆ ఒక్క తలాంతును (జీవితమును) మనము వాడెదము.

అధ్యాయము 14
సంఘమునకు చివరి దినముల కొరకు హెచ్చరికలు

''అతని (క్రీస్తువిరోధి)పక్షమున శూరులు లేచి, పరిశుద్ద స్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి.....నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధననతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు''.

''జనములో బుద్దిమంతులు అనేకులకు భోదించుదురు గాని వారు బహుదినములు ఖడ్గమువలనను,అగ్నివలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును''.

''అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయకాలం ఇంకా రాలేదు. గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్ర పరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు''. (దానియేలు 11:31-35).

ఈ వాక్యభాగము కడవరి దినముల గూర్చి చెప్పబడినది. కనుక దీనిలో సంఘమునకు అనేక హెచ్చరికలున్నవి-ఎందుకంటే క్రీస్తువిరోధిఆత్మ సంఘములో కూడా కనబడును. (1 యోహాను 2:18,19).

సంఘమును కల్మషముతో అపవిత్రపరచుట

క్రీస్తువిరోధి యొక్క ఆత్మ ''పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచును''(దానియేలు 11:31). పరిశుద్ధత మరియు నీతిని గూర్చిన సందేశమునకు సాతాను నుండి గొప్ప వ్యతిరేకత ఉన్నది. ''నిబంధనను అతిక్రమించు''మని కూడా క్రీస్తువిరోధిఆత్మ ప్రోత్సహించును. (32వ) క్రొత్త నిబంధన పాపముపై జయ జీవితమును వాగ్దానము చేయుచున్నది. కాని అటువంటి జీవితము జీవించుట అసాధ్యమని క్రీస్తువిరోధి విశ్వాసులకు చెప్పును.

గత రెండు దశాబ్ధాలుగా భారతదేశములో సంఘముగా మాయొక్క పరిచర్యకు వ్యతిరేకత యుండుటకు ముఖ్యకారణం మేము పరిశుద్ధతను గూర్చి, నీతిని గూర్చి బోధించుటయే. మేము ప్రకటించు సత్యములు ''పాపము మన మీద ప్రభుత్వము చేయదు''(రోమా 6:14), ''సిరిని ప్రేమించువారు దేవునిని ప్రేమింపలేరు'' (లూకా 16:13), ''ఇతరులను తృణీకరించి వారిపై కోపపడువారు నరకాగ్నికి లోనవుదురు'' (మత్తయి 5:22), ''ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు నరకములో పడవేయబడు ప్రమాదములో నున్నాడు'' (మత్తయి 5:28,29)మొదలైనవి. యేసు ప్రభువు యొక్క ఈ మాటలు విశ్వాసులలో ఎక్కువమందికి ఇంపుగా నుండవు. కాబట్టి వారు మమ్ములను వ్యతిరేకించిరి.

మేము వాక్యానుసారము కాని జీతము కొరకు పని చేసే క్రైస్తవ సేవకుల పద్ధతికిని (మొదట శతాబ్దములో ఇటువంటి దాని గూర్చి వినలేదు) మరియు మన దేశములో క్రైస్తవ పని విషయములో ఒక లక్షణంగా కనబడే వాక్యానుసారము కాని ధనమును యాచించు పద్దతికిని వ్యతిరేకముగా నిలబడితిమి. ఇది మాకు వాక్యమును బోధించుట జీవనముగా చేసుకొని దాని ద్వారా స్వంత సామ్రాజ్యములను నిర్మించుకొను వారి ఉగ్రతను సంపాదించిపెట్టెను.

మేము సంఘములో వ్యక్తులను పైకెత్తు వ్యవస్థలను, మత శాఖల సంఘవ్యవస్థను, భారతదేశపు సంఘములలో పాశ్చాత్య ఆదిపత్యాన్ని మరియు ఇక్కడి సంఘాభివృద్దికి ఆటంకముగా నుండే పాశ్చాత్య నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించాము. ఇది మత సాంప్రదాయ వాదులకు ఎంతో కోపాన్ని తెప్పించెను.

దేవుని పరిశుద్ధ స్థలమును ఏదో ఒక విధముగా అపవిత్రపరుచుటయే సాతాను యొక్క గురి. అతడి పక్షము నుండిన ''శూరులు'' (దానియేలు 11:31) సంఘములో దేవునియొక్క పనిని లోపలనుండి నాశనము చేయునట్లు అతడు వారిని సంఘములో ప్రవేశపెట్టును. ఈ శూరులు గత 20 శతాబ్దాలుగా ఎట్లు ఒక గుంపు తర్వాత మరొక గుంపును, ఒక ఉద్యమము తర్వాత మరొక ఉద్యమమును పాడుచేసిరో క్రైస్తవ సంఘ చరిత్ర మనకు తెలియజేస్తుంది.

సంఘము యొక్క వైఫల్యముకు గల ముఖ్య కారణము సంఘమునకు దేవుడు ఏర్పాటు చేసిన కావలివారు సంసిద్దతతోను మరియు మెళకువగాను లేకపోవుటయే. ఈ కావలివారు నిద్రించునట్లు సాతాను ఏ విధముగా చేసెను? కొన్ని సందర్భాలలో సత్యము చెప్పుట వలన ప్రజలకు అభ్యంతరం కలుగజేస్తామేమో (ముఖ్యముగా ధనికులకు, పలుకుబడి గలవారికి అభ్యంతరం కలుగజేస్తామేమో) అను భయమును వారిలో కలుగజేయుటద్వారా దానిని చేసెను. కొన్ని ఇతర సంధర్భాలలో వారిని భార్యలను సంతోషపెట్టునట్లు చేయుటద్వారా, మరియు ధనమును, మంచి భోజనమును ప్రేమించునట్లు చేయుటద్వారా దానిని చేసెను.

మరికొన్ని సంధర్భాలలో కావలివారు సంఘములో దేవుని యొక్క ప్రమాణములను కొనసాగించాలని చూచినప్పుడు దాని గూర్చిన వారి బోధలకు ఎడతెగని వ్యతిరేకత వచ్చుట చూచి వారు అలసిపోయి వారి బోధలను ప్రజలను సంతోషపెట్టు స్థాయికి తగ్గించుకొనిరి.

హెబ్రీ 12:3లో ''అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి'' అని మనకు చెప్పబడెను. యేసును వ్యతిరేకించిన ఈ పాపులు ఎవరు?వారు ఇశ్రాయేలు దేశములో నుండిన వ్యభిచారులు, దొంగలు లేక హంతకులు కారు. లేక రోమనులు, గ్రీకులు కాదు. యేసు ప్రభువును ఎప్పుడూ వ్యతిరేకించిన పాపులు ఎవరనగా బైబిలును బ్రహ్మాండంగా బోధించినవారు మరియు ఇశ్రాయేలులో నుండిన మత నాయకులు. వారు యేసును గూర్చి అసూయపడి చివరకు ఆయనను చంపిరి.

మనము యేసును వెంబడించినట్లయితే ఇప్పుడు కూడా అదే గుంపుకు చెందిన ప్రజల యొద్దనుండి మనము వ్యతిరేకతను ఎదుర్కొందుము. మనకు వచ్చు అతి గొప్ప వ్యతిరేకత దేవుని ప్రమాణములను తగ్గించి సంఘమును అపవిత్ర పరచిన వారియొద్ద నుండియే వచ్చును. అటువంటి వారు మనలను వ్యతిరేకించే సాతాను యొక్క ముఖ్య అనుచరులై యున్నారు. అటువంటి యెడతెగని వ్యతిరేకతను ఎదుర్కొనుటలో మనము అలసిపోయి చాలా సుళువుగా నిరుత్సాహపడిపోయే అవకాశమున్నది.

సాతాను ''మహోన్నతుని భక్తులను హింస ద్వారా నలుగగొట్టును'' (దానియేలు 7:25). దానిని జయించుటకుండిన ఒకే ఒక మార్గము శత్రువుల చేత చంపబడువరకు ఎడతెగని వ్యతిరేకతను ఎదుర్కొనిన యేసు యొక్క మాదిరిని చూచుటయై ఉన్నది. మనము కూడా ''మరణము వరకు నమ్మకముగా యుండుటకు'' ఇష్టపడవలెను. తన జీవితాంతము వరకు వ్యతిరేకతను ఎదుర్కొనుటకు ఇష్టపడని ఏ బోధకుడైనా చివరకు వినువారి చెవులకు ఇంపు కల్గించు బోధకుడుగా మారి, ''ప్రజలను వశపరచుకొనే'' (దానియేలు11:32) వానిగా మిగిలిపోయి, బిలాము వలే చివరకు రాజీ పడిపోయిన వానిగా యుండును.

సంఘముగా మనకున్న పిలుపు ఎటువంటి వెల చెల్లించవలసి వచ్చినా మన మధ్య దేవుని ప్రమాణములను కాపాడుటైయున్నది. అన్ని వేళలయందు క్రీస్తువిరోధి యొక్క సైన్యము గూర్చి మనము సిద్దపాటు కలిగి యుండవలసి యున్నది. పౌలు అక్కడున్న మూడు సంవత్సరములలోను, దేవుని కృపచేత ఎఫెసులో నున్న సంఘమును పవిత్రతలో కాపాడెను. కాని అతడు వెళ్లిపోయే సమయములో, నిశ్చయముగా భ్రష్టత్వము లోనికి వచ్చునని అక్కడి పెద్దలతో చెప్పెను (అపొ.కా.20:29-31). మరియు ఎఫెసీయులకు వ్రాయబడిన రెండవ పత్రికలో (ప్రకటన 2:1-5) మనము చదువునట్లుగా నిజముగానే అలా జరిగెను.

అనుదినబలి

దానియేలు 11:31లో క్రీస్తువిరోధి నిలిపి వేయువాటిలో ''అనుదినబలి'' ఒకటని మనము చదివెదము.

యేసుప్రభువు ఆయన శిష్యులకు ఎల్లప్పుడు అనుదిన బలి గూర్చి చెప్పెను. అది ఆయన జీవితములో ఆయన కూడా దానిని కలిగియుండెను. అది ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను''(లూకా 9:23) అనునది.

ఈ సందేశమును క్రైస్తవ లోకములో నుండి సాతాను తొలగించివేసెను. ఆ విధముగా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడెను. ఏ సంఘములో నుండియైన సిలువను గూర్చిన వార్త అదృశ్యమైనట్లయితే దానిని పాపము, లోకానుసారత త్వరలోనే ఆక్రమించును. అతిపరిశుద్ధ స్థలములోనికి మార్గము, పైనుండి క్రిందికి చినిగిన తెరద్వారా మాత్రమే (అది సిలువ వేయబడిన శరీరము ద్వారా) (హెబ్రీ 10:20). అతి పరిశుద్ధుడైన దేవునితో నివసించుటకు మనకు వేరొక మార్గమేమి లేదు.

యేసుకు అదే మార్గముగా నుండెను. మరియు మనకు కూడా వేరొక మార్గము లేదు. నిన్న నీవు నీ సిలునెత్తుకొన్నావా? ఒకవేళ నిన్న నీవు సిలువను ఎత్తుకొని యుండవచ్చును. అది నిన్ను నీకు నియమింపబడిన కీడును ఎదుర్కొనుటకు నీకు సరిపోయెను (మత్తయి 6:34). ఈ రోజు వేరొక రోజు మరియు ఈ రోజు కూడా నీవు నీ శరీరాన్ని నీ స్వంతయిష్టాన్ని బలిగా అర్పించవలసి యున్నది. ఈ రోజు నీవు నీ దురాశలకు, నీ కోపానికి, నీ గర్వానికి నీ ధనాశకు, మనుష్యులలో ఘనత పొందాలనే కోర్కెకు, నీకున్న నిష్ఠూర స్వభావము మొదలైన వాటికి నీవు మరణించవలసియున్నది. ఈ దురాశలు నీ శరీరములో ఇప్పటికీ ఉన్నవి మరియు అవి నీవు జీవించునంత కాలము నీలో ఉండును. అందువలన నీవు జీవించి యున్నంత కాలము నీకు ఈ ''అనుదినబలి'' అవసరమైయున్నది.

నీ జీవితములో ఈ అనుదిన బలియున్నదా?

లేనట్లయితే క్రీస్తువిరోధిఆత్మ నిశ్చయముగా నిన్ను మోసము చేసెను. యేసు నీటి బాప్తీస్మము పొందిన సమయమందే ఆత్మచేత అభిషేకింపబడెను. యేసు యోర్దాను నదిలో ముంచబడుట ఆయన మరణమును పాతిపెట్టబడుటను అంగీకరించుటను సూచించుచున్నది. మన స్వంతచిత్తమును మరణమునకు అప్పగించుట ద్వారా మనము ఆత్మ యొక్క అభిషేకము క్రింద జీవించవచ్చునని ఇది మనకు నేర్పించుచున్నది.

మనము బాప్తీస్మము పొందినప్పుడు, మనము దేవుని నామమునందు నీటిలో ముంచబడినప్పుడు, మనలను నీటిలో ముంచినవాడు మనలను వాటినుండి తిరిగిపైకి లేపునని నమ్ముచు మనము దానిని అంగీకరించెదము. మనము జీవితములో క్రిందకు నెట్టబడి ఏ విధముగానైనను అణచివేయబడ్డ పరిస్థితులలో కూడా ఆ విధముగానే ఉండవలెను. అటువంటి పరిస్థితులలో దేవుడు ''యేసు నిమిత్తము మనలను మరణమునకు అప్పగించుచున్నాడు'' అని మనము గ్రహింపవలెను (2కొరిందీ¸ 4:10,11). మన స్వజీవమునకు మనము మరణమును అంగీకరించినప్పుడు, ఆ మరణములోనికి మనలను నడిపించిన దేవుడే మనలను లేవనెత్తునని నిశ్చయత కలిగియుండవచ్చును.

గత దశాబ్దాలలో పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందిన వారు తమ జీవితాలలో మరియు తమ సంఘాలలో ఈ అనుదిన బలిని కొనసాగించియెడల వారు మన దేశములో దేవుని కొరకు బ్రహ్మాండమైన శక్తిని, ప్రభావమును కలిగియుండెడివారు. కాని సిలువ మార్గమునకు బదులు భాషలు, స్వస్థత, భావోద్వేగాలను రేకెత్తించుట, మత పరమైన కార్యాచరణకు ప్రాముఖ్యత నిచ్చుటకు నడిపించుట ద్వారా సాతాను వారిలో ఎక్కువ మందిని దారి మళ్లించుటలో సఫలమాయెను.

ఎంత వెల చెల్లించవలసి వచ్చినా సరే, ఎటువంటి సయోధ్య లేకుండా అనుదిన బలిని కొనసాగించుటయే సాతానును జయించుటకును, దేవుని శక్తిని మన జీవితాలలో, గృహాలలో, సంఘాలలో కాపాడుకొనుటకు ఉన్న ఏకైక మార్గము.

విసుగు పుట్టించే పరిసయ్యుల వలె కాక యోహాను వినుటకు ఆసక్తికరమైన మండే బోధకుడు కాబట్టి, హేరోదు ''బాప్తీస్మమిచ్చు యోహాను మాటలను సంతోషముతో వినుచుండెను'' (మార్కు 6:20). అనేకులు అదే కారణము చేత మంచి క్రైస్తవ పుస్తకాలను చదువుటకును మరియు అభిషేకించబడిన బోధకులను వినుటకును సంతోషించెదరు. కాని వారు రాజైన హేరోదు కంటే ఎక్కువ ఆత్మానుసారులు కాలేరు.

తమ ప్రసంగాల కొరకు అంశాలను పొందుటకు మాత్రమే క్రైస్తవ పుస్తకాలు చదివే కొందరున్నారు. ఇతరుల నుండి ఆయన మాటలను దొంగిలించు వారికి ఆయన విరోధినని దేవుడు చెప్పెను (యిర్మీయా 23:30). ప్రసంగాల కొరకు అంశాలు పొందుటకు చూచే బదులు, మిమ్ములను మీరు విమర్శించుకొని మొదట దేవుడు మీ స్వంత అవసరతకు మాట్లాడుటకు అనుమతించుడి. ఉదాహరణకు, మీరు ఆశించిన గౌరవమును మీకు ఎవరైనా ఇవ్వలేదని లేక సంఘములో బాధ్యతతో కూడిన ఒక పదవిని మీకు ఇవ్వలేదని మీరు అభ్యంతరపడిన యెడల మీ జీవితములో నుండి అనుదిన బలి తొలగిపోయెననుటకు ఇది ఒక స్పష్టమైన ఆనవాలు. మీరు స్వజీవమునకు (స్వంత చిత్తమునకు) మరణించిన యెడల, మీరు దేనివలనను, ఎవరితోను ఏ సమయమందును అభ్యంతరపడరు.

నిజమైన ప్రవక్తలు మరియు అబద్ద ప్రవక్తలు

మనము దానియేలు 11:32 లో క్రీస్తువిరోధి ఆత్మచేత ఆకర్షింపబడినవారు ఇచ్ఛకపు మాటలు చెప్పి జనులను లోబరుచుకొందురు అని చదువుదుము. చరిత్రలో అబద్ద ప్రవక్తల యొక్క పొరబడరాని గుర్తు ఎప్పుడు ఇచ్ఛకపు మాటలు చెప్పుటయే. అదే విధముగా ప్రతి నిజమైన ప్రవక్తల యొక్క పొరబడరాని గుర్తు గద్దింపుయై యున్నది.

అబద్దపు ప్రవక్తలు వారి గుంపులోనికి జనులను చేర్చుకొనుటకు, లేక వారి స్వంత సామ్రాజ్యమును నిర్మించుకొనుటకు లేక ఘనతను లేక ధనము మొదలైన వాటిని సంపాదించుకొనుటకు జనులతో మాటలు చెప్పెదరు. ఈ అబద్ధ ప్రవక్తలలో అనేకులు ప్రజలపై పట్టును కలిగియుండుటకు నమ్మకముగా వారితో సంప్రదించుదురు. అయితే వారి ఉత్తరాలలో (ప్రభువు మరియు అపొస్తలుల ఉత్తరాల వలే, మనము ప్రకటన 2,3 అధ్యాయాలలో మరియు పత్రికలలో చదువునట్లు) గద్దింపుకు లేక దిద్దుబాటుకు సంబంధించిన మాటలుండవు. దానికి బదులు అవి పొగడ్తతో కూడి ఇచ్ఛకపు మాటలనే కలిగియుండును.

మెత్తని మాటలు మీ హృదయములను కేవలము గర్వముతోను ఆత్మ-సంతృప్తితోను అపవిత్రపరచును. దానికి వేరుగా గద్దింపుమాటలు మీ హృదయమును కడిగి పవిత్రపరచును. ''నేను ప్రేమించువారిని గద్దించి శిక్షించుచున్నాను'' (ప్రకటన 3:19) అని యేసు ప్రభువు చెప్పెను. గద్దింపు దైవికమైన ప్రేమ యొక్క ఒక గుర్తు.

ఎప్పుడైతే దేవుడు ఒక ప్రవక్తను మన మధ్యకు మనలను గద్దించుటకు పంపునో అది దేవుడు మనలను ప్రేమిస్తున్నాడను సత్యమునకు గుర్తు. దేవుడు ఒక సంఘమును విడిచిపెట్టినప్పుడు దానిని గద్దించుటకు ''ప్రవక్త లేకుండా పోవును'' (కీర్తనలు 74:1,9) దానికి బదులు అక్కడ మెత్తని మాటలు బోధించు బోధకులుందురు (2 తిమోతి 4:3,4). దేవుని ప్రజలలో ఎవరైనను అటువంటి స్థితిలో నుండుట విషాదకరము.

ప్రకటన 2,3 అధ్యాయములలో చూచినప్పుడు ఏడు సంఘములలో ఐదు విషాదకరమైన పరిస్థితిలో ఉండెను. అయినప్పటికి ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. దానికి ఋజువు దేవుడు తన ప్రవక్తను (అపొస్తలుడైన యోహానును) వారిని ఉత్తరముల ద్వారా గద్దించి సరిచేయుటకు పంపుటయే. పెద్దలకు కూడా యోహాను కరిÄనమైన మాటలు కలిగియుండెను. అవి ''నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి...నీవు ఆత్మీయముగా మృతుడువి....నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై యున్నావు'' అను మాటలు. ఆ పెద్దలు మరియు ఆ సంఘములు ఈ గద్దింపుతో కూడిన మాటలకు స్పందించి మారుమనస్సు పొందనియెడల వారు విడిచిపెట్టబడుదురు. అయితే ఒకసారి దేవుడు దీపస్తంభమును (ప్రకటన 2:5) తీసివేసినట్లయితే ఈ సంఘమును గద్దించుటకు ఆయన ఎవ్వరినీ పంపడు. అప్పుడు అబద్ద ప్రవక్తలు బాధ్యత తీసుకొని ప్రతి ఆదివారపు కూటములలో మెత్తని మాటలు క్రమము తప్పకుండా వినునట్లు చేయుదురు. ఇది ఒక సంఘము తరువాత మరియొక సంఘములోను, తరము వెంబడి తరములోను గత ఇరవై శతాబ్దాలుగా జరుగుచుండెను. మరియు ఈ రోజు మన చుట్టూ ఇది జరుగుచున్నది.

అటువంటి సమయములలో ''దేవుని నెరిగి బలము గలిగి గొప్ప కార్యములు చేయువారి'' (32వ) అవసరత ఎంతో ఉన్నది. కాని, దేవుని తెలుసుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది అది అనుదిన బలి ద్వారానే. అయితే దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలమునకు మనము ప్రవేశించవలెనంటే తెర చినగవలసి యున్నది. గనుక నీ జీవితము నుండి ఆ అనుదిన బలి తీసివేయబడకుండునట్లు నీవు చూచుకొనవలెను.

నీ భర్తకాని లేక భార్యకాని నిన్ను ఎంతో యిబ్బంది పెడుతూ ఉంటే చనిపో(నిన్ను నీవు ఉపేక్షించుకో). నీవు అన్యాయముగా బాధపడ్తున్నట్లయితే చనిపో. నీ సహోదరులు నీకు నమ్మక ద్రోహము చేసి నిన్ను ద్వేషిస్తున్నట్లయితే చనిపో. ఆ విధముగా నీ స్వంత జీవితములో నీవు చనిపోతూ ఉండినట్లయితే నీవు దేవునిని మరియు యేసుక్రీస్తును మరి ఎక్కువగా తెలుసుకొందువు.

మన శత్రువుల యెడల సరియైన వైఖరి

జనులు నీకు హాని చేయుటకు పన్నాగము పన్నినప్పుడు నీవు చింతపడనక్కర్లేదు. దేవుడు నీ గూర్చి జాగ్రత్త తీసుకొనుటయే కాక నీ శత్రువుల విషయం కూడా ఆయన చూచుకొనును. ''నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు'' (కీర్తనలు 121:3,4). దేవుడు ఆ విధముగా ఎల్లప్పుడు మెళకువగా యుండుట చేత మనము ధైర్యముగా నిద్రించవచ్చును.

ఎస్తేరు గ్రంథములో హామాను మరియు అతడి భార్య రాత్రంతా మేల్కొని మొర్దెకైను 75 అడుగుల ఎత్తైన ఉరికంబము మీద ఉరి తీయుటకు పన్నాగము పన్నుచుండుటను చదివెదము. (ఒక మనిషిని ఉరి తీయుటకు 10 అడుగుల ఉరికంబము సరిపోవును. కాని ఆ పట్టణములో నున్న వారందరు ఆ ఉరి తీయుటను చూచునట్లు, ఆ విధంగా మొర్దెకై ఇంకా అవమానపరచబడునట్లు వారు 75 అడుగుల ఉరికంబము చేసిరి). కాని మొర్దెకై హాయిగా నిద్రపోయెను. దేవుడు అతడి విషయమై జాగ్రత్త తీసుకొనెను. మొర్దెకై కొరకు హామాను సిద్ధపరచిన ఉరికంబముపై చివరకు అతడే(హామానును) ఉరితీయబడెను (ఎస్తేరు 5:14, 7:10). సాతాను యొక్క ప్రణాళికలను తలక్రిందులు చెయ్యుటలో దేవుడు నిపుణుడు.

నీ శతృవులు ఇంటింటికీ వెళ్ళి నీ గూర్చి చెడుగా చెప్తూ, నీకు హాని చెయ్యాలని, అవకాశము దొరికితే నిన్ను ''ఉరి'' తీయాలని చూస్తుండవచ్చు. నీవు భయపడాల్సిన పనిలేదు. నీ కొరకు వారు సిద్ధపరచిన కొయ్యపై వారే ఉరి తీయబడుదురు. సంఘములో మాకు వ్యతిరేకముగా పన్నాగములు పన్నినవారి ఎత్తులు ఎల్లప్పుడు చిత్తగునని మేము మరల మరల చూచియున్నాము. వారు మా కొరకు సిద్ధపరచిన ఉరికంబములపై వారు వ్రేలాడుటను చూచినప్పుడు మేమానందించలేదు. మేము వారిని ఎల్లప్పుడు క్షమించి దీవించితిమి మరియు వారు మారుమనస్సు పొంది తిరిగి సంఘమునకు వత్తురని ఆశించితిమి. కాని దేవుని నియమములను మనము మార్చలేము. ''ఇతరుల కొరకు గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగివచ్చును. జ్ఞానులను వారి కుయుక్తిలో ప్రభువు పట్టుకొనును'' (సామెతలు 26:27; 1కొరిందీ¸ 3:20).

ఎవ్వరు కూడా వారు విత్తిన దానిని కోయకుండా తప్పించుకొనలేరు. గనుక జనులు మనలను ఉరికొయ్యకు వ్రేలాడదీయవలెనని ప్రణాళిక వేస్తున్నప్పుడు మనమేం చెయ్యాలి? నిద్రించాలి. ఎందుకంటే ''దేవుడు తన ప్రియులు నిద్రించినప్పుడు... వారికిచ్చును'' (కీర్తనలు 127:2).

మరుసటి రోజున పేతురును చంపాలని యోచించుచు, హేరోదు అతనిని చెరసాలలో నుంచుటను గూర్చి మనము అపొ.కా. 12వ అధ్యాయములో చదివెదము. కాని ఆ రాత్రి దేవుడు పేతురుకు సుఖమైన నిద్రనిచ్చెను (6వ వచనము). ప్రభువు యొక్క దూత పేతురును మేల్కొలిపి, అతనిని విడిపించి, ఇంటికి పంపించెను (7వ వచనము). అంతటితో కథ అయిపోలేదు. ప్రభువు యొక్క దూత భూమి మీదకు రెండవసారి వచ్చినప్పుడు, అతడు హేరోదును మొత్తి చంపివేసెను (23వ వచనము). దేవుడు సాతాను యొక్క ఎత్తులను మరల మరల చిత్తు చేయును.

ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును అప్పగించెను. కాని అతనికి ఏమైయ్యెను? యేసుప్రభువు కంటే అతడే ముందు చనిపోయెను(మత్తయి 27:5). నీవు దేవునికి భయపడినట్లయితే, నీవు హామానులకు గాని, హేరోదులకు గాని లేక చివరకు ఇస్కరియోతు యూదాలకు కాని నీకు హాని తలపెట్టిన ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. ఎవరు దేవునికి విరోధముగా లేక ఆయన సంఘమునకు విరోధముగా పోరాడి విజయము సాధించలేరు. గత సంవత్సరాలలో అనేకులు అలా చేయుటకు ప్రయత్నించిరి గాని ఒక్క మినహాయింపు లేకుండా అందరు విఫలమైరి. మనము జయించిన వాని పక్షమున నున్నాము.

హింస అనివార్యమైనది

దాని అర్ధము మనమెప్పుడు హింసింపబడమని లేక చంపబడమని కాదు. దానియేలు 11:33 లో చివరి దినములలో దేవుని ప్రజలు దాడి చేయబడి, ఖైదు చేయబడి చంపబడుదురు అని మనము చదువుదుము. నిజమైన దేవుని సేవకులు ఎల్లప్పుడు హింసింపబడుదురు.

యాకోబు హేరోదు రాజు చేత చంపబడెను (అపొ.కా.12:2). అతడిని విడిపించుటకు ఏ దేవదూత రాలేదు. హేబెలు చంపబడెను. పాతనిబంధనలో ప్రతి నిజమైన ప్రవక్త హింసింపబడెను (అపొ.కా.7:52). బాప్తిస్మమిచ్చు యోహాను తల నరకబడెను. యేసుప్రభువు సిలువ వేయబడెను. స్తెఫను రాళ్ళతో కొట్టి చంపబడెను. పౌలు తల నరకబడెను. పేతురు కూడా చివరకు సిలువ వేయబడెనని చరిత్ర చెప్తుంది. అప్పుడు ఏ దేవదూత అతడిని రక్షించుటకు రాలేదు. మనకు తెలిసినంత వరకు యోహాను తప్ప అపొస్తలులందరు చంపబడిరి. అనేకమంది దైవ భయము కలిగిన మిషనరీలు అన్య దేశములలో చంపబడిరి.

యేసుప్రభువు రాకమునుపు సంఘము గొప్ప శ్రమల గుండా వెళ్లవలసి వస్తుందని మరియు ఆ కాలములో అనేకమంది దేవుని యొక్క శ్రేష్ఠమైన పరిశుద్ధులు చంపబడుదురని బైబిలు తేటగా బోధిస్తుంది (ప్రకటన 13:7). మన కాలములో కూడా కొంతమంది దేవుని యొక్క శ్రేష్ఠమైన పరిశుద్ధులు కమ్యూనిస్టు దేశములలో చంపబడిరి.

ఒక్కొక్కరి విషయములో దేవుని ఉద్దేశ్యములు వేరు వేరుగా యుండును. కాని ఒక విషయం నిజం. అది నీవు ఈ భూమిపై జీవించు జీవితములో దేవునిని మహిమ పర్చవలెననే ఒకే ఒక కోర్కె నీకు యుండినట్లయితే మరియు దేవుని చిత్తములో నీవు నడిచినట్లయితే నీ జీవితము యొక్క ఉద్దేశ్యము నెరవేరు వరకు నీవు మరణము లేనివాడవుగా యుందువు.

''చివరి దినములలో ఆత్మీయ జ్ఞానము కలిగియున్న వారు విస్తృతమైన బోధనా పరిచర్యను కలిగియుందురు. దేవుని ప్రజల యొక్క జ్ఞానముగల నాయకులు వారి జ్ఞానమును అనేకులతో పంచుకొనెదరు'' (దానియేలు 11:33 లివింగు బైబిలు).

మరొక ప్రక్క, చివరి దినములలో ''సహోదరుల మధ్య జగడములు పుట్టించుచు యెహోవా చేత ద్వేషింపబడువారు'' అనేకులుందురు(సామెతలు 6:16-19). మనము శరీరులతో పోరాడుటకు నిరాకరించెదము గనుక మనము అటువంటి వారితో పోరాడము (ఎఫెసీ 6:12). మనము సాతానుతో మాత్రమే పోరాడుదుము మరియు మన మానవ ప్రత్యర్థుల విషయము ప్రభువు యొక్క దూతకు విడచిపెట్టుదము.

అనేక సంవత్సరాల క్రితము నేను ఏ మనుష్యునితోను, ఏ విషయములోను పోరాడనని నిర్ణయించుకొంటిని. నేను ఆ నిర్ణయమును బట్టి ఎన్నడు పశ్చాత్తాప పడలేదు. నాతో గొడవ పడుటకు ఎవరైనా వచ్చినప్పుడు నేను నెమ్మదిగా నుందును లేక లేచి వెళ్లిపోవుదును. అటువంటివారు ఒక ఉత్తరము ద్వారా నాపై నేరారోపణ చేసినప్పుడు నేను దానికి జవాబు ఇవ్వను. అటువంటి వారికి జవాబు ఇచ్చుట సమయమును వృథా చేసుకొనుటయే. నేను వారిని క్షమించి, దీవించి, ప్రేమించి వారికి దూరముగా నుందును. నేను నా శక్తి సామర్థ్యములను సాతానుతో పోరాడుటకు వాడాలనుకొనుచున్నాను. నేరారోపణ చేయువాని (సాతానుని) యొక్క ఈ ప్రతినిధులతో నాకంటే దేవుడే బాగా వ్యవహరించగలడని నేను గ్రహించియున్నాను. పగ తీర్చుట దేవుని పని (రోమా 12:19). ''అనేకలు ఈ దుష్టులతో వారి వేషధారణలో కూడుదురు'' అని మనము దానియేలు 11:34లో చదివెదము. హింస పొందే సమయమందు అనేకులు వేషదారులుగా మారుదురు. వారు సంఘము మధ్యన పూర్ణ హృదయులైన సహోదరులవలె నటించుదురు. మరియు తమ్మును తాము విమర్శించుకొనుటను గూర్చియు, సిలువ నెత్తుకొనుటను గూర్చియు మాట్లాడుదురు. కాని వారు తమ లోకస్థులైన స్నేహితుల మధ్య, రక్షింపబడని బంధువుల మధ్య ఉన్నప్పుడు వారు మనుష్యుల ఘనతను కోరుకొందురు. మరియు వారి చేత అంగీకరించబడే రీతిగా మాట్లాడుదురు.

తమలో చేదైన వేరును కలిగియుండి దానిచేత సంఘములో ఇతరులను అపవిత్రపరచిన అనేకమంది విశ్వాసులున్నారు (హెబ్రీ 12:15). కాని దేవుడు వారందరి యెడల దీర్ఘశాంతముతో నున్నాడు గనుక వారు ఇంకను సంఘములో నున్నారు. కాని తగిన సమయమందు (వారు మారుమనస్సు పొందనియెడల), వారు బయట పెట్టబడుదురు మరియు వారి ముందున్న వారి వలే వారు కూడా విశ్వాస బ్రష్టులగుదురు. మనము దేవుని ఎరిగిన యెడల మనము ''ప్రేమలో వేరుపారి స్థిరపడియుందుము'' (ఎఫెసీ 3:17)-మరియు సంఘములో కూడా వేరు పారియుందుము. ఇతరులు మనలను ద్వేషించి మనలను అప్పగించి, మనలను వారి ఇండ్లనుండి వెళ్లగొట్టినప్పుడు, మనము వారిని ప్రేమించి, క్షమించి వారికి సేవచేయుటకు మరియొక అవకాశము కొరకు చూచెదము మరియు అటువంటి అవకాశము వచ్చినప్పుడు మనము దానిని తీసుకొనుటకు త్వరపడి, వారిని దీవించుటకును మన శాయశక్తుల ప్రయత్నించెదము. మనలను ఎవరు కూడా చెడ్డవారిగా చేయలేరు. ఇతర వ్యక్తుల చెడు ప్రవర్తన మనలను చెడ్డవారిగా చేసిన యెడల అప్పుడు మనము కూడా వారివలే సాతాను దాసులమగుదుము.

చివరి దినాలలో ''బుద్ధిమంతులు కూడా కొందరు కూలుదురు'' అని మనకు చెప్పబడెను (దానియేలు 11:35). కాని వారు తమ్మును తాము తగ్గించుకొని, విమర్శించుకొన్న యెడల వారికి కూడా నిరీక్షణయుండును. వారిప్పుడు ''పరిశీలించబడి, పవిత్రపరచబడుదురు'' (35వ వచనము). వారు ఒకప్పుడు దేవుని మార్గములయందు వివేచన మరియు జ్ఞానము గలవారైనప్పటికీ వారు తమ్మును తాము విమర్శించుకొనని యెడల, వారు సాతాను చేతులలో పడిపోవుదురు. ఆ దినము కృపాదినము కాబట్టి మారుమనస్సు పొంది తమ్మును తాము విమర్శించుకొన్నవారు ఇంకా ఆత్మానుసారముగా గొప్ప ఎత్తులకు ఎదుగగలరు. కాని మీరు యదార్థులుగా ఉండి వెలుగులో నుండవలెను.

ఈ పరిశీలించబడుట మరియు పవిత్రపరచబడుట ''అంత్యకాలము'' వరకు కొనసాగును (దానియేలు 11:35). ఆ విధముగా మనలను క్రీస్తు స్వరూపములోనికి మార్చే గురిని దేవుడు నెరవేర్చగలడు. కాబట్టి యేసు వచ్చువరకు మనము భూమి మీద ఒక సుఖవంతమైన సమయమును ఆశించకూడదు. లోకములో మనకు నిత్యము శ్రమ కలుగును.

దానియేలు పరిచర్య మరియు లూసిఫరు పరిచర్య

దానియేలు (ఈ ప్రవచనములను వ్రాసినవాడు) అతడి తరములో దేవుడు వాడుకొన్న వారిలో ఒకడు. అతడు 17 సంవత్సరముల యౌవనుడుగా నుండినప్పుడు తన్ను అపవిత్ర పరచుకొనకూడదని ఉద్దేశించాడు (దానియేలు 1:8). ఎప్పుడైతే హనన్యా, మిషాయేలు మరియు అజర్యా తమతోటి యౌవనుడైన దానియేలు దేవుని కొరకు నిలబడుటను చూచిరో (దానియేలు 1:11), వారు కూడా దేవుని కొరకు నిలువబడుటకు ధైర్యము తెచ్చుకొనిరి. వారు స్వంతగా నిలబడుటకు ధైర్యము లేకుండెను కాని వారు దానియేలు నిలబడుట చూచినప్పుడు వారు ధైర్యము తెచ్చుకొనిరి. ఈనాడు దేవుని కొరకు వారికి వారుగా ధైర్యముగా నిలువబడలేని అనేకమంది, దానియేలు వంటివారు నిర్ణయము తీసుకొని నిలువబడుట కొరకు చూచుచున్నారు. అప్పుడు వారు కూడా అతడితో ఏకమౌదురు.

నీవు అటువంటి దానియేలుగా యుందువా? ''నన్ను నేను అపవిత్ర పరచుకొనను, రాజును లేక ఏ వెనక్కు జారిపోయిన పెద్దను లేక ఎవరినైనా సంతోషపర్చుటకు నేను చూడను. నేనే 100% దేవుని వాక్యము ఏమి చెప్తుందో అది చేయుటకు నిలువబడుదును'' అని నీవు చెప్పగలవా?

''అనేకులను నీతి మార్గములోనికి త్రిప్పు'' (దానియేలు 12:3) దానియేలు పరిచర్యకు స్త్రీ పురుషుల అవసరత ఈనాడు మన దేశములో ఎంతో ఉన్నది. ఈ వచనము నీతి గూర్చి బోధించే బోధకులగూర్చి చెప్పుటలేదు. కాని, వారి జీవితముతో మరియు మాదిరితో ఇతరులను నీతి మార్గములోనికి త్రిప్పు వారి గూర్చి చెప్పుచున్నది.మనము లేఖనములలో మరియొక పరిచర్యను గూర్చి చదువుదుము. అది ''దానియేలు పరిచర్య''కు సరిగ్గా వ్యతిరేకమైన ''లూసిఫరు పరిచర్య''.

దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయుటలో తనను వెంబడించుటకు కోటానుకోట్ల దేవదూతలను త్రిప్పుటలో లూసిఫరు సఫలమాయెనని మనము ప్రకటన 12:4లో చదివెదము. అంతమంది దేవదూతలను తప్పుదారి పట్టించుటకు లూసిఫరును దేవుడు ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే దానిద్వారా తిరుగుబాటు మరియు అసంతృప్తి కలిగిన దేవదూతల నుండి పరలోకము పవిత్ర పర్చబడినది. వారి మధ్య లూసిఫరు లేచి వారిని దేవునికి విరోధముగా తిరుగుబాటుకు రేపక పోయినట్లయితే వారి దుష్ట హృదయములు బయటపడి యుండేవికాదు.

అందుచేత ఈనాడు కూడా సహోదర సహోదరిలు సంఘములో లూసిఫరు పరిచర్య కలిగియుండునట్లు దేవుడు అనుమతించును. వారు ఇంటింటికి వెళ్లి నేరారోపణ చేయునట్లును, కొండెములాడునట్లును, అబద్దములాడి చెడు మాట్లాడునట్లు దేవుడు అనుమతించును. దానిని బట్టి సంఘములో నుండిన తిరుగుబాటు, అసంతృప్తి మరియు లోకానుసారత కలిగిన విశ్వాసులు గుర్తింపబడి, బయట పెట్టబడి, అటువంటి వారందరు ఏకమై సంఘము నుండి బయటకు వెళ్లిపోవుట ద్వారా క్రీస్తు శరీరమైన సంఘము పవిత్రపరచబడును.

దేవుడు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం పరలోకములో మొదట లూసిఫరును ఆపనట్లుగానే, సంఘములో తిరుగుతూ లూసిఫరు పరిచర్య చేయుచుండు వారిని ఆపడు. అది దైవికమైన జ్ఞానము.

అటువంటి సహోదర సహోదరిలతో మనమెప్పుడు పోరాడకూడదు. దేవుడే సంఘమును భద్రపర్చును. తగిన సమయమందు సంఘమును అపవిత్ర పరచువారిని ఆయన నాశనము చేయును (1కొరిందీ¸ 3:17). ఎవ్వరు నశించిపోవుట ఆయన కిష్టముండకపోవుటచేత ఆయన దీర్ఘశాంతము చూపించి తీర్పు తీర్చేముందు అనేక సంవత్సరములు వేచియుండును. నోవహు కాలములో ఆయన 120 సంవత్సరములు వేచియుండెను. కాని దేవుడు తీర్పు తీర్చునప్పుడు ఆయన తీర్పు తీవ్రముగా ఉండును.

అందువలన సంఘము ఎప్పుడు చీలిపోలేదని అతిశయించుట బుద్ధిహీనతయై యున్నది. ప్రారంభములో పరలోకములోనే దేవదూతలలోనే చీలికవచ్చినది. అటువంటి చీలికలు అవసరము. ఎందుకంటే ''మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు'' (1కొరిందీ¸ 11:19).

వెలుగు చీకటి నుండి వేరుపర్చబడవలసియున్నది. దానిని నీవు చీలిక అని పిలువలేవు. అది శుభ్రపరచు ప్రక్రియ. అది లేనట్లయితే ఈ భూమిపై దేవుని యొక్క సాక్ష్యము అపవిత్రపర్చబడును.

మనమందరము దానియేలు పరిచర్య కలిగియుండి సంఘములో ఐకమత్యమును మరియు సహవాసమును కట్టవచ్చును లేక లూసిఫరు పరిచర్య కలిగి విభేధమును విత్తవచ్చును.

మనము తటస్థముగా యుండలేము. ఆయనతో కలసి సమకూర్చనివాడు చెదరగొట్టు వాడని యేసు ప్రభువు చెప్పెను. సంఘములో రెండు పరిచర్యలేయున్నవి. సమకూర్చుట మరియు చెదర గొట్టుట (మత్తయి 12:30).

ప్రతిచోట స్వచ్ఛమైన సాక్ష్యము కలిగి దేవుని నామమునకు మహిమ తెచ్చు సంఘము కట్టబడునట్లు ఈ కడవరి దినములలో దేవుడు మనలను ఎలా జీవించాలని కోరుతున్నారో అట్లు జీవించుటకు మనము కృపను జ్ఞానమును పొందుదుము గాక!

అధ్యాయము 15
అది ఎటువంటి సంతోషకరమైన సంవత్సరమో!

''విశ్రాంతిదినము (అదే విధముగా దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ కూడా) మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినము కొరకు నియమింపబడలేదు''(మార్కు 2:27)

దేవుని ఆజ్ఞలన్నియు మనలను సంతోషపరచుటకొరకు ఉద్దేశింపబడినవి. దేవుడు చేసిన ఆజ్ఞలను పాటించుట కొరకు జీవులు కావలసి వచ్చి ఆయన మానవులను సృష్టించలేదు. అలా కాకుండా, ఆయన మానవులను సృష్టించిన తరువాత మానవుడు ఎంతో సంతోషముగా నుండుటకు మరియు స్థిరమైన ఆనందములో నుండుటకు ఆయన ఆజ్ఞలను తయారు చేసెను.

దేవుడు ఆదామును ఆరవరోజు రెండవ పూటలో చేసెను. ఆ విధముగా ఏడవ రోజు (సబ్బాతు దినము), మానవుని ఉనికి యొక్క మొదటి దినమాయెను. సబ్బాతు అనుభవించుటకు ఆదాము ఆరు రోజులు పని చేయవలసిన అవసరము లేకుండెను. దేవుడు ఆయన మంచితనముతో అతడికి ఆరు రోజులు పనిచేయుమని అడుగుటకు ముందు ఒక రోజు విశ్రాంతి నిచ్చెను. ఆ మొదటి రోజు విశ్రాంతిలో దేవునితో సహవాసముతో గడపవలసిన దినము. తన యొక్క సృష్టికర్తతో గడిపిన అటువంటి సహవాసములో నుండి, తరువాత ఆరు రోజులు దేవుని కొరకు ఆదాము చేయు పరిచర్య ప్రవహించవలసియున్నది. ఈ పద్ధతినే మనము పాటించుటకు పిలువబడినాము ఎందుకనగా ప్రారంభము నుండి దేవుడు మానవుని గూర్చి ఉద్ధేశించిన పద్ధతి యిదియే.

బైబిలు...''ఆదియందు దేవుడు ...'' అను మాటలతో ప్రారంభమైయున్నది. అది మన జీవితములో మనము చేయు ప్రతి పనిలో నిజమై ఉండాలి. మనము చేయు ప్రతి పనికి దేవుడు ముందుగా ఉండాలి. ఆదాము చేసినట్లే మనము ప్రతీది ప్రారంభించవలసి యున్నది - అది దేవునిని సేవించుటకు ముందు ఆయనతో విశ్రాంతితో కూడిన సహవాసములో ప్రవేశించుట.

మార్త ప్రభువుని సేవించింది. కాని ఆమె అలజడి చెందిన ఆత్మతో ఆయనను సేవించినందున ప్రభువు ఆమెను గద్దించెను (లూకా 10: 38-42). అయితే మరియ విశ్రాంతిలో నుండెను. దీని గూర్చియే ప్రభువు ''అవసరమైనది ఒక్కటే'' అని చెప్పెను.

ఈనాడు అనేకులు ప్రభువుకు సేవ చేయుచున్నారు, కాని వారి అంతరంగములో వారు సబ్బాతు విశ్రాంతిని మరియు దేవునితో సహవాసమును ఎరుగక యున్నారు. ఆ విధముగా వారు దేవునిని అక్షరానుసారమైన ఆత్మతో సేవించుచు ''వారి స్వంత కార్యముల నుండి విశ్రమించక యున్నారు'' (హెబ్రీ 4:10).

క్రొత్త నిబంధన ''దేవుని ప్రజల కొరకైన సబ్బాతు విశ్రాంతి'' గూర్చి చెప్పుచున్నది (హెబ్రీ 4:9). ఈ క్రొత్త నిబంధన సబ్బాతు దేనిని సూచిస్తున్నది?

పాత నిబంధన క్రింద దేవుడు యూదులకు అనేక విధములైన సబ్బాతు దినముల నిచ్చెను. ప్రతి వారము వచ్చే సబ్బాతు బాగుగా తెలిసినదే. అయితే అంతగా తెలియబడని సబ్బాతులు కూడా కలవు. ఒకటి ప్రతి ఆరు సంవత్సరముల చివర వచ్చు సబ్బాతు సంవత్సరము (లేవీయ 25:2-4). ఇంకొకటి ప్రతి ఏడు సబ్బాతు సంవత్సరముల పిదప వచ్చు (7X7=49సంవత్సరముల తరువాత) ఏబైయవ సంవత్సరపు సబ్బాతు. ఈ ఏబైయవ సంవత్సరపు సబ్బాతును ''సునాద సంవత్సరము'' (లేవీయ 25:8-12) అందురు.

సునాద సంవత్సరములో ఇశ్రాయేలీయులు ''దేశ వాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను'', మరియు అది ''అప్పులను రద్దుపరిచే కాలము'' (లేవీయ 25:10).

దేవుడు ప్రతి ఏడవ సంవత్సరాంతమున కూడా అప్పులన్ని రద్దుపరచుటకు ఆజ్ఞ యిచ్చెను. ''అప్పిచ్చు ప్రతివాడు తన యొద్దనున్న ప్రతి వాగ్దాన పత్రముపైన, పూర్తిగా చెల్లించబడెను'' అని వ్రాయవలెను. ''అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగు వానినైనను తన సహోదరునినైనను నిర్బంధించకూడదు'' (ద్వితీయో. 15:1-10 ను జాగ్రత్తగా చదవండి).

జనులను వారి అప్పుల నుండి విడిపించుటకు దేవుడు గొప్ప ఆసక్తి కలిగియుండెను. అందుచేతనే ఆయన రెండు విశ్రాంతి సంవత్సరములను ఒకటి ప్రతి ఏడవ సంవత్సరాంతమున మరియు ప్రతి ఏబది సంవత్సరాంతమున ఏర్పరచెను. ఆ సంవత్సరములలో అప్పున్న ప్రతివారు విడుదల పొందుదురు.

ఆ విశ్రాంతి సంవత్సరములు గొప్ప ఆశీర్వాదకరమైనవి మరియు సంతోషకరమైనవి. ''సునాదము'' అను మాటకు ''సంతోషకరమైనకేక'' అని అర్దము. సునాద సంవత్సరములో ప్రతి బాకీదారుడి యొక్క అప్పు క్షమింపబడును మరియు ప్రతి బాకీదారుడు విడుదల పొందును. కావున ఆ సంవత్సరమంతా సంతోషకరమైన కేకలతో నుండు సంవత్సరముగా నుండును. అందుచేత ఇశ్రాయేలీయులతో దేవుడు ఆ సంవత్సరము గూర్చి ''ఈ సంవత్సరము మీకు ఎటువంటి సంతోషకరమైనది'' అని చెప్పెను (లేవీయ 25:11).

మనము ఇప్పుడు నూతన నిబంధన క్రింద వారములో ప్రతిరోజును విశ్రాంతి దినముగా ఆచరించుదుము, ఎందుకనగా ప్రతిదినము దేవునికి పరిశుద్ధమైనది. మరియు మనము ప్రతి సంవత్సరమును సబ్బాతు సంవత్సరముగా ఆచరించుచున్నాము. ప్రతి సంవత్సరము సునాద సంవత్సరము. ఎందుకనగా మనకు హాని చేసిన వారిని మరియు మోసగించిన వారిని క్షమించి విడుదల చేసితిమి కాబట్టి ఇది సంతోషించే సంవత్సరము. ఆ విధముగా మన జీవితాల్లో ప్రతి ఒక్క సంవత్సరము సంతోషకరమైనదిగా ఉండవచ్చును. ఆ విధముగా ప్రతి సంవత్సరము మనకు సునాద సంవత్సరముగా నున్నది.

సునాద సంవత్సరములో ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను (లేవీయ 25:10) అని ప్రభువు ఆజ్ఞాపించారు. క్రీస్తు శరీరములో ఎవరైతే వారి వారి సహోదరుల సహోదరీల నుండి (ఏ కారణముల వలనైనా) దూరమగుదురో వారు ఇప్పుడు తిరిగి దేవుని కుటుంబములోనికి రావలెను. ఇది నూతన నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞయైయున్నది. ప్రతి అప్పు (పాపము) క్షమింపబడవలెను. మరియు ప్రతి ఒక్క బానిస (ఎవని గూర్చి మనము వారు ఫలానా విధముగా చెయ్యాలని ఉద్ధేశించుదుమో) విడుదల పొందవలెను. ఇది కూడా దేవునియొక్క ఆజ్ఞ. అప్పుడు మాత్రమే ప్రతి సంవత్సరము మనకు సంతోషకరమైన సంవత్సరముగా నుండును.

దేవుడు మనలను ఎంతగానో క్షమించి మనలను ప్రేమించి మన కొరకు తనను తాను యిచ్చుకొనినందుకు బదులుగా కృతజ్ఞత తెలుపుకొనుటకు కనీసము మనము ఇతరులను మన హృదయముల నుండి క్షమించుదుము.

రాజైన హిజ్కియా, తీవ్రమైన రోగము నుండి దేవుని వలన అద్భుతముగా స్వస్థపరచబడిన తరువాత తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపలేదని (2 దిన 32:24,25) వ్రాయబడెను. అతడు దేవుడు తనను దీవించిన పరిమాణమునకు తగినట్లుగా తిరిగి దేవునికి ఇవ్వలేదు.

మన విషయములో ఎట్లున్నది? మనము దేవునిచేత దీవింపబడిన దానికి తగినట్లుగా తిరిగి దేవునికి చెల్లించుచున్నామా? దేవుడు మనను క్షమించినంత ధారాళముగా మనము ఇతరులను క్షమించుచున్నామా? ప్రతి ఒక్కరిని? లేక ఏ ఒక్కరైనా ఇంకా క్షమింపబడకుండా ఉన్నారా?

రాజైన హిజ్కియా గర్వముతోను మరియు కృతఘ్నతతోను ప్రవర్తించినందున అతడి తదుపరి పదిహేను సంవత్సరముల జీవితము అతడి జీవితకాలమంతటిలో చెడ్డదిగా నుండెను. ఆ కాలములో అతనికి ఒక కుమారుడు కలిగెను (మనష్షే). అతడు యూదా రాజులందరిలో చెడ్డవాడిగా నుండెను (2 రాజులు 21:11). హిజ్కియా తన పరిపాలనను ఉజ్జీవపు ఆత్మతో ప్రారంభించి, విషాదకరమైన స్థితితో ముగించెను.

మనము ఇతరులను క్షమించి విడుదల చెయ్యక పోయినట్లయితే ఈ భూమిపై మన మిగిలిన జీవితకాలము నిజముగా బాధాకరముగా యుండును.

దేవుడు మనయెడల కనికరముతో నుండినట్లు మనమును ఇతరుల యెడల కనికరము కలిగియుండుట మనయొక్క పిలుపై యున్నది. ''దేవుడు మనయెడల యుండినట్లు'' అను నినాదము మన మనసుల్లో అన్నివేళలా మనకు ఇతరులతో కలిగియున్న లావాదేవీలలో యుండవలెను.

మనము దేవునియొద్ద నుండి ఎంతో ఉచితముగా పొందాము. అటువంటప్పుడు ఇతరులకు మనము ఉచితముగా ఇచ్చుదుము(మత్తయి 10:8)-ఒక లోభివలే పిసినారితనముగా కాక ధారాళముగా పెద్ద హృదయముతో నిచ్చెదము.

మనము ఇతరుల విషయములో పిసినారితనముగా, ఇతరులు ఖచ్చితముగా మనకు యిష్టమైన విధముగా ఉండవలెనని కోరినట్లయితే దేవుడు కూడా పిసినారితనముగా, మనము ఆయన కోరిన విధముగా ఖచ్చితముగా ఉండాలని చూచును (కీర్తనలు 18:25-26).

మనమెప్పుడు ప్రభువు మనకు ఉచితముగా యిచ్చిన క్షమాపణ యొక్క అద్భుతమును మరచిపోకూడదు. ఇప్పుడు మనము జీవించే జీవితమంతా మన ప్రభువు మన కొరకు కల్వరి సిలువపై చేసిన దానికి కృతజ్ఞత తెలుపుకొనుట కొరకే జీవించవలెను.

ధర్మశాస్త్రము క్రింద జనులు తీర్పును గూర్చి బెదిరింపువలన దేవుని సేవించేవారు. కాని కృప క్రింద అది కృతజ్ఞత యొక్క శక్తితో అయి ఉన్నది. మత్తయి 18:23-35లో, యేసు ప్రభువు తన శిష్యులకు తన సేవకుడు అచ్చియున్న సుమారు ముప్పై కోట్ల రూపాయల అప్పును క్షమించిన ఒక దయగల రాజు గూర్చి చెప్పెను. ఆ సేవకుని యొక్క జీవితమంతటిలో గాని లేక అతడి తరువాత తరములలో గాని ఆ అప్పు తీర్చుకొన లేనంతటిది. గనుక అతడు పొందిన క్షమాపణ గూర్చి అతడు ఎంతో కృతజ్ఞత కలిగి యుండవలసి యుండెను.

అయితే అతడు ఇతరులను అతడు పొందిన దానికి తగినట్లు చూడలేదు. అతడు తన యజమాని యొద్దనుండి బయటకు వెళ్ళి వెంటనే అతడికి అరవై వేలు అచ్చియున్న ఇంకొకని యింటికి వెళ్ళెను. అరవైవేలు రూపాయలు పట్టించుకోలేనంత చిన్న మొత్తము కాదు. కాని అతడు క్షమింపబడిన ముప్పైకొట్లతో పోల్చిచూచితే అది సముద్రములో ఒక నీటి బొట్టు వంటిది. అయితే ఈ మనుష్యుడు ఏమి చేసాడు? అతడు ''అచ్చియున్న వాని గొంతు పట్టుకొని అప్పు వెంటనే తీర్చమని అడిగాడు''. అతడు అప్పు తీర్చనందున ఖైదులో వేయించెను. ఈ విషయం రాజుకు తెలియగా ఆయన ఈ కనికరము లేని సేవకుని ''దుష్టహృదయము గల దౌర్భాగ్యుడా'' అని పిలిచి ఆఖరు కాసు చెల్లించు వరకు బాధపరచువారికి వానిని అప్పగించెను.

''మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయ పూర్వకముగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయును'' అని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 18:35).

మనము ఇతరులను క్షమింపని యెడల దేవుడు మనకు యిచ్చిన క్షమాపణను తిరిగి తీసుకొనునని ఇది బోధించుచున్నది మరియు ఏ పాపములనైతే ఆయన మరల జ్ఞాపకముంచుకొననని తన దృష్టి నుండి తుడిచి వేసెనో వాటి విషయము మనము తిరిగి శిక్ష చెల్లించునట్లు చేయునని తెలియజేయుచున్నది. దేవుడు మన పాపములకు యిచ్చిన క్షమాపణ ఎల్లప్పుడు మనము యితరులను క్షమించుచు ఉండెదమన్న షరతుతో కూడియున్నది.

ప్రభువు తన శిష్యులకు మత్తయి 6:9-13 లో నేర్పిన ప్రార్ధనలో మన అనుదినాహారము గూర్చి ప్రార్ధించమని యుండినందున అది రోజు చెయ్యవలసిన ప్రార్థనయై యున్నది. అలా అయినట్లయితే, మా ఋణస్థులను (మా యెడల పాపము చేసిన వారిని) మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను (పాపములను) క్షమింపుము అను భాగము కూడ మనము ప్రతి దినము చేయవలసి యున్నది. మనలను ప్రతి దినము ఎవరో ఒకరు ఏదొక విధముగా (తెలిసి కాని తెలియక కాని) బాధించుదురు కాబట్టి మనము ప్రతి దినము ఇతరులను క్షమింపవలసి యున్నది.

యేసుప్రభువు కల్వరి సిలువపై మరణించినప్పుడు ధర్మశాస్త్రము మనకు వ్యతిరేకముగా నేరారోపణ చేస్తూ వ్రాయించిన ఉత్తరాలను నాశనము చేసి, దేవునికి మనము బాకీగా యుండిన ఋణపత్రాన్ని రద్దుపరిచెను (కొలస్సీ 2:14). మనము మనకు బాకీ ఉన్నవారి యెడల అదే చేసామా? లేక ఇతరులపై నేరము ఆరోపించునట్లు ఉత్తరాలను, మరియు గతములో వారు మనయెడల చేసిన తప్పుల తాలూకు జ్ఞాపకాలను ఉంచుకొనుచున్నామా? అలా అయినట్లయితే క్షమించుట నేర్చుకొనేంతవరకు మనలను మరియు మన కుటుంబాలను బాధించుటకు బాధించువారికి (దురాత్మలకు) అప్పగించుట తప్ప దేవునికి వేరొక మార్గము లేదు.

ఈ ఉపమానములో ఆ రాజు తన సేవకుడు కృతజ్ఞతతో కనికరము చూపవలెనని ఉద్ధేశించెను. ఎప్పుడైతే ఆ సేవకుడు అతడు పొందిన కనికరమును బట్టి కృతజ్ఞతతో ఇతరులను చూడలేదో అప్పుడు ఆ రాజు రెండవ పద్దతి ప్రయోగించెను. అది బాధించుట. దేవుడు కూడా అట్లే చేయును. ఆయన మన యెడల చేసిన దానికి ప్రతిగా కృతజ్ఞతతో, మనము యితరులను క్షమింపవలెనని ఉద్దేశించెను. మనము ఎప్పుడైతే ఈ కృప యొక్క పిలుపునకు స్పందించమో, అప్పుడు దేవుడు కనీసము ధర్మశాస్త్రానుసారమైన శిక్షకు భయపడియైనా సరిగా ప్రవర్తించుదమను ఉద్దేశ్యముతో మనలను ధర్మశాస్త్రము క్రింద నుంచును. అప్పుడు మనలను బాధించు వారికి అప్పగించుట ద్వారా, మనము ఇతరులను క్షమించుటను నేర్చుకొనునట్లు ఆయన చేయును.

అనేకమంది విశ్వాసులు దేవునియొక్క సబ్బాతు విశ్రాంతి లోనికి ప్రవేశించకుండాయుండి, దానికి బదులుగా నిలకడ లేకుండా, ఎప్పుడు ఏమి చేయుదురో తెలియనట్లు ప్రవర్తించుచు, తరచు విచారములో, ముఖము వ్రేలాడదీసుకొని, నిరాశ మరియు చిరాకుతో యుండుటకు కారణము వారు ఇతరులను క్షమించకపోవుటయే. బాధించువారు వారి ఆత్మలపై పని చేయుచున్నారు.

మనము ఇతరులపై నేరారోపణ చేయుటకు దాచి యుంచిన నేరారోపణతో కూడిన ఉత్తరాలతో చలి మంట వేయవలెను. మనము ఉల్లంఘించనటువంటి నిశ్చయతతో, ఎటువంటి రెచ్చగొట్టే పరిస్థితులు వచ్చినా, ఇతరులపై నేరము ఆరోపించే పాత పత్రములను బయటకు తీయమని నిశ్చయించు కొనవలెను.

పాతని బంధనలో వారికి ప్రతి ఏభై సంవత్సరములకు ఒక మారే సునాద సంవత్సరము (సంతోషకరమైన సంవత్సరము) ఉండెను. ఈ క్రొత్త నిబంధనలో మనకు ఇంకెంత మెరుగుగా ఉన్నది. ఎందుకనగా మన జీవితములలో ప్రతి సంవత్సరము ఒక సంతోషకరమైన సంవత్సరముగా నుండవచ్చును.

ఒక క్షమింపని హృదయము తాను క్షమింపని వారి విషయములో చెడు జరగాలని క్రమేణా కోరుకొనుట ప్రారంభించును. మనము వేరొకరికి చెడు జరుగవలెనని కోరుకొనినట్లయితే అది వారిని శపించుటతో సమానమైనది. మనము గలతీ 3:13లో యేసు ప్రభువు లోకమంతటి యొక్క శాపమును ఆయనపై వేసుకొనినట్లు చదువుదుము. గనుక మనము వేరొకరిని శపిస్తున్నట్లయితే నిజానికి మనము ప్రతి ఒక్కరి శాపమును తీసుకొనిన యేసు ప్రభువునే శపిస్తున్నట్లే. ఇంకెప్పుడైనా నీవు ఎవరికైనా లేక వారి పిల్లలకైనా చెడు జరగాలని కోరుకొనునట్లు సైతాను నిన్ను శోధించి పురికొల్పినట్లయితే దీనిని జ్ఞాపకముంచుకొనుము.

పరిసయ్యులు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసునొద్దకు తీసుకువచ్చి, ఆ స్త్రీపై రాళ్ళు వేయుట ప్రారంభించినయెడల, యేసు ప్రభువు ఆమె ముందు నిలచి ఆ రాళ్లను తనపై స్వీకరిస్తూ ''ముందు నన్ను చంపండి'' అని చెప్పి యుండును. ఆయన మన కొరకు కల్వరి సిలువపై చేసింది అదే. ఆయన మన ముందు నిలిచి మనపై పడవలసిన ''రాళ్ళ''ను ఆయనపై వేసుకొనెను. క్రీస్తు యొక్క ఆత్మ క్రొత్త నిబంధన ఆత్మయై యున్నది మరియు అది పరిసయ్యుల ఆత్మకు ఖచ్చితముగా వ్యతిరేకమై యున్నది. క్రీస్తుఆత్మ కలిగి యున్నవారే జీవితకాలమంతా సంపూర్ణ సంతోషములోనికి ప్రవేశించగలరు.

కొరియాలో నుండిన దైవభక్తి కలిగిన ఒక క్రైస్తవుని గూర్చిన కథను నేనొకసారి విన్నాను. అతడి యౌవన కుమారుని ఒక కమ్యూనిస్టు యౌవనుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆ దైవభక్తి కలిగిన తండ్రి తన కుమారుని చంపిన వానిని వెదకి అతడిని క్షమించుట మాత్రమే కాక అతడిని తన స్వంత కుమారునిగా దత్తత చేసుకొని పెంచెను. అటువంటి వ్యక్తికి సిలువమార్గము అనేకులకు దాని గూర్చి తెలిసిన సిద్ధాంతము కంటే బాగుగా తెలియును! యేసుప్రభువు సిలువ మార్గాన్ని ఒక సిద్ధాంతముగా బోధించలేదు. ఆయన తన జీవితకాలమంతా దాని ప్రకారము నడిచెను. ఆయనను ద్వేషించిన వారిని ఎంతగా ప్రేమించెనంటే వారు రక్షింపబడుట కొరకు ఆయన తన జీవరక్తాన్ని ధారపోసాడు. మనము నడచుట కొరకు ఆయన ప్రారంభించిన నూతనమైనదియు జీవము గలదియునైన మార్గము యిదే.

మనము యిప్పుడు యేసుప్రభువు యొక్క అడుగు జాడలలో నడచుటకు పిలువబడినాము. అది ఇతరులకు చెడుకలగాలని వారిని శపించుట కాక, మనలను శపించు వారిని దీవించు చుండుటయై యున్నది. ఈ లోకము ఇతరులకు చెడు కలగాలని ఆశిస్తూ యుండే వారితోను మరియు ఇటు అటు తిరుగుచూ ఇతరులను శపిస్తూ ఫిర్యాదు చేస్తూ ఇతరుల గూర్చి చెడు మాటలాడు వారితో నిండియున్నది. దానికి బదులు మనము ఎక్కడికి వెళ్ళినా మంచిచేస్తూ దీవిస్తూ మరియు జనులను విడుదల చేస్తూ యుండెదము.

గలతీ 3:13,14లో క్రీస్తు మన శాపమును తీసుకొనెను గనుక, మనము ''అబ్రాహాము యొక్క ఆశీర్వాదము''ను ఇప్పుడు పొందవచ్చునని చదువుదుము. ఇది మనము ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా సాధ్యము.

యోహాను సువార్తలో, యేసు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మూడు స్థాయిల ఆత్మీయ అభివృద్ధి సాధ్యమని తెలుపుటకు నీటిని సాదృశ్యముగా వాడెను.

మొదటి స్థాయి: యోహాను 3:5లో ''నీటితోను మరియు ఆత్మతోను'' జన్మించుట గూర్చి ఆయన చెప్పెను. ఇది మన క్రైస్తవ జీవితములను ప్రారంభించే రక్షణపాత్రయై (కీర్తనలు 116:13) యున్నది. ఈ పాత్రలోని నీటితో మనము కడుగబడి దేవుని రాజ్యములోనికి ఆయన బిడ్డలుగా తీసుకురాబడుదము.

రెండవ స్థాయి: యోహాను 4:14 లో యేసు ప్రభువు కొద్దిగా ముందుకు వెళ్ళి ఆ పాత్ర నీటితో నుండిన బావి (ఊట) గా మారుట గూర్చి చెప్పిరి. ఇది పరిశుద్ధాత్మలో లోతైన అనుభవము. ఇక్కడ మన అంతరంగ ఆశలన్ని(అవసరమంతా) ఆయన ద్వారా తీర్చబడును. గనుక మనము నిత్యము విజయము మరియు సంతోషముతో జీవిస్తూ కొదువేమీ లేక యుందుము. ఒకనికి తన పెరటిలోనే బావి యుండినట్లయితే అతడు కార్పోరేషన్‌ నీటిపై ఆధారపడి యుండనక్కర్లేదు. ఇతరులెవరు తన నీటి సరఫరాను ఆటంకపరచలేరు. ఎందుకనగా తన సొంత నీటి సదుపాయము పెరటిలోనే కలదు. క్రీస్తులో స్థిరమైన సర్వసమృద్ధి యొక్క రహస్యమును కనుగొనిన క్రైస్తవుని యొక్క జీవితము అలా ఉండును. అతడికి బయట నున్న వారెవరు అతడి యొక్క సంతోషము, సమాధానము, విజయము యొక్క సరఫరాను ఆటంకపరచలేరు (యోహాను 16:22).

మూడవ స్థాయి: యోహాను 7:38 లో యేసు ప్రభువు ఇంకా ముందుకువెళ్ళి ఆ బావి ఇప్పుడు నదిగా మరియు అనేక నదులుగా ఒక విశ్వాసిలోనుండి బయటకు ప్రవహిస్తుందని చెప్పారు. ఇది పొంగి పొరలుచున్న సమృద్ధికి సాదృశ్యముగా నున్నది. అటువంటి విశ్వాసి తనచుట్టూ అవసరములో నున్న అనేకుల దాహము తీర్చగలిగి యుండును. ఒక బావి కేవలము మన ఆశలను మాత్రమే తీర్చగలదు. కాని జీవజల నదులు మనమెక్కడకు వెళ్లినా అనేకులకు మనలను ఆశీర్వాదకరముగా చేయును.

దేవుడు అబ్రాహామును దీవించిన దీవెన ''నేను నిన్ను ఆశీర్వదించెదను ....మరియు భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును'' (ఆది 12:2,3). ఈ ఆశీర్వాదము పరిశుద్ధాత్మ ద్వారా మనదిగా కాగలదు (గలతీ 3:14).

దేవుడు మనలో నుండి నదులు ప్రవహించునట్లుగా మనలను దీవించినట్లయితే, మన ద్వారా అనేక కుటుంబములు దేశములోను వేరువేరు చోట్ల మరియు చివరకు ప్రపంచమంతటిలోను కూడా దీవింప బడవచ్చును.

కేవలము ఒకశాపగ్రస్తుడైన వ్యక్తి మాత్రమే అతడు వెళ్ళిన చోటెల్లా జనులను బాధించి గాయపరచును. ఎక్కువ మంది ఆదాముయొక్క సంతానము అట్లే జీవించుదురు. వారికి ఇతరుల గూర్చి చెడు కోరుట, వారి కరిÄనమైన మాటలతో ఇతరులను బాధపెట్టి కొండెములతో వారిని అపవిత్రపరచుట మాత్రమే తెలియును. దురదృష్టవశాత్తూ చాలా మంది ''విశ్వాసులు'' కూడా అట్లే జీవించుట ద్వారా వారి యొక్క రక్షణ అసత్యమైనదని గాని లేక వారు వారి రక్షణను కోల్పోయినంతగా వెనుకకు జారిపోయారని గాని రుజువు చేయుదురు.

సువార్తయొక్క శుభవార్త ఏమంటే మనము అటువంటి దౌర్భాగ్యమైన స్థితి నుండి కూడా రక్షణ పొందవచ్చును. మనము ఇప్పుడు మనలో నుండి జీవజలనదులు ఎడతెగక ప్రవహించునట్లు మరియు మనము కలుసుకొనిన ప్రతి కుటుంబమునకు మనమొక దీవెన కరముగా నుండవచ్చును.

దేవుడు మన యెడల కనికరము చూపినట్లు మనము ఇతరుల యెడల కనికరము చూపగలము.
దేవుడు మనలను విడుదల చేసినట్లు మనము ఇతరులను విడుదల చేయగలము.
దేవుడు మనలను దీవించినట్లు మనము ఇతరులను దీవించగలము.
దేవుడు మనకు ఉచితముగా యిచ్చినట్లు మనము యితరులకు ఉచితముగా యివ్వగలము.
దేవుడు మన యెడల ఉన్నట్లు మనము కూడా యితరుల యెడల విశాల హృదయముతో నుండగలము.

ఇతరులకు బాధ కలిగించేది లేక వారికి చెడ్డ పేరు తెచ్చేదానిని నేనెవ్వరికీ చెప్పను అని మనమందరము నిర్ణయించుకొని దానిని ఈ సంవత్సరములో మిగిలిన కాలమేకాక మన జీవితాల్లో మిగిలిన కాలమంతా పాటించినట్లయితే అది ఎంతో మంచిది. గత సంవత్సరాలలో ఆ నిర్ణయము ప్రకారము జీవించిన వారు వారి అనుదిన సంభాషణలో పనికిరాని మాటలను విసర్జించి కేవలము క్షేమాభివృద్ధి మరియు లాభకరమైన మాటలనే మాట్లాడుటను కనుగొనిరి. తన వంతుగా దేవుడు తన వాగ్దానమును నెరవేర్చి వారిని తన ప్రతినిధులుగా (తన నోటిగా) చేసెను (యిర్మీయా 15-19).

ఇస్కరియోతు యూదా ఒక మోసగాడు మరియు ద్రోహియైనప్పటికి ఆయన శిష్యులతో ఉన్న మూడు సంవత్సరాలలో అతని గూర్చి మిగతా పదకొండు శిష్యులతో చెప్పలేదు. ఆ కారణము చేతనే చివరి భోజనమందు అప్పగించువాడెవడో ఎవరికి తెలియకుండెను. యేసు ఎన్నడు వదరబోతు వలే మాట్లాడలేదు. ఆయన యూదాతో వ్యక్తిగతముగా మాట్లాడియుండవచ్చును. కాని దేవుడే యూదాను బయటపెట్టనంత వరకు ఆయన అతని గూర్చి అతని వెనుక మాట్లాడలేదు. దుష్టులను దేవుడు బయటపెట్టు వరకు మనము సహనముతో నుండవలెను. మనము కొండెములాడుట ద్వారా ఆయనకు సహాయపడకుండానే ఆయన దానిని చేయగలడు. మనము పాపులతోను వెనుకకు జారిపోయిన వారితోను వ్యవహరించునప్పుడు, మనము వారి యెడల తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రివలే ప్రవర్తించవచ్చును లేక అతని అన్న వలె ప్రవర్తించవచ్చును (లూకా 15-11-32).

ఆ ఉపమానములో, ఆ గృహము సంఘమునకు సాదృశ్యముగా నున్నది. ఆ తండ్రి దేవునికే కాక, సంఘములో ఒక నిజమైన తండ్రికి సాదృశ్యముగా నున్నాడు. మరియు భూమియంతటిలోను ఉన్న ప్రతి సంఘములోనుండే పరిసయ్యులకు ఆ అన్న సాదృశ్యముగా నున్నాడు. దేవుడు సంఘములోనున్న పరిసయ్యులను బయటపెట్టుటకు పాపులను, తప్పిపోయిన కుమారుని వంటి దిగజారిపోయిన వారిని వాడుకొనును.

పరిసయ్యులకు నీతి యుండవచ్చేమో కాని వారు మంచితనమును కాని దీనత్వమును కాని కలిగియుండరు. ఒక వెనుకకు జారిపోయిన వ్యక్తిని తమతో సమానుడిగా అంగీకరించుట వారికి కష్టముగా నుండును. అతడు పశ్చాత్తాపముతో తిరిగి వచ్చునప్పుడు అతడిని కొద్ది నెలలు శిక్షణలో దాసులు ఉండే ఇళ్లలో ఉంచవలెనని భావించుదురు. అయితే దేవుడు పరిసయ్యుడు కాదు గనుక అలా చేయడు. ఆయన ఆ మారుమనస్సు పొందిన పాపికి క్రీస్తు యొక్క నీతియను వస్త్రమును అతడు తిరిగి వచ్చిన వెంటనే ధరింపజేయును. ఆయన ఆత్మ అభిషేకము అను ఉంగరము అతడు తిరిగి వచ్చిన వెంటనే అనుగ్రహించును. ఆయన వెంటనే తన కుడి పార్శమున ఆ పాపికి చోటిచ్చును.

తన జీవితమంతటిలో ఒక్కసారి కూడా పాపము చేయని యేసు కలువరిలో తన మరణము తరువాత భూమిమీద తన జీవితమంతయు పాపములో జీవించిన ఒక మారుమనస్సు పొందిన పాపితో పాటు పరదైసులో ప్రవేశించెను. కృప మాత్రమే అటువంటి అద్భుతకరమైన దానిని సాధించగలదు. కాని అటువంటి కృపను పరిసయ్యులు గ్రహింపలేరు గనుక వారు కరిÄనులుగా మరియు క్షమింపలేని వారుగా మారిపోవుదురు. ఆ విధముగా వారు తమ్మును తాము నాశనము చేసుకొందురు. ఆ ఉపమానము చివరిలో, తన తమ్ముడిపట్ల కనికరము లేని వైఖరి వలన తన రక్షణను పోగొట్టుకొని ఆ అన్న తండ్రి ఇంటి బయట నిలచెనని గుర్తుంచుకొనుడి. ఇతరులను తృణీకరించే వారందరి గతి చివరకు అలాగే నుండును.

చిన్న కుమారుడు, తన బుద్ధిహీనత మరియు పాపము ద్వారా చివరకు తన స్వంత అవసరతను గుర్తించి, ఆత్మ విషయములో దీనుడై, తన తండ్రి రాజ్యమును వారసత్వముగా పొందెను. అయితే ఆ పెద్ద కుమారుడు, తన స్వంత అవసరతను ఎప్పుడు గుర్తించనందున, ఆత్మ విషయములో ఆ విధముగా ఎప్పుడు దీనుడు కాలేక పోయెను. అతడు కేవలము ఇతరుల పాపములనే చూచెను. తన తండ్రి ఆజ్ఞలన్నిటిని గైకొనినానని అతడు చెప్పుకొన్నప్పటికి అతడు తప్పిపోయెను (లూకా 15:29). ఒక అక్షరానుసారమైన విధేయత విశ్వాసులను ఎంత పరిసయతత్వములోనికి నడిపించగలదంటే వారి మొదటి స్థితి కంటే వారి కడపటి స్థితి ఎంతో ఘోరముగా నుండును.

మనము మనకు ఏదైనా బాకీ ఉన్నవారిని లేక మనలను గాయపరచి లేక ఏదోక విధముగా హానిచేసిన వారిని విడుదల చేసినట్లయితే ఈ సంవత్సరము మరియు ప్రతి సంవత్సరము మనందరకు సంతోషకరమైన సంవత్సరముగా నుండును. పాత కక్షలను శాశ్వతంగా పాతి పెట్టి మరియు మనుష్యులందరి యెడల కనికరము కలిగి యుండుడి. ఆ విధముగా దేవునితో ఒక నూతన ప్రారంభాన్ని ఈ రోజు ప్రారంభించండి.

అధ్యాయము 16
ప్రభువు తిరిగి వచ్చునప్పుడు సిగ్గుపడి వెనుకకు పోవుదువా?

''ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి'' (1 యోహాను 2:28).

విశ్వాసులందరు గొప్ప సంతోషముతో ఎదురుచూచు ఒక సంఘటన ప్రభువు యొక్క రాకడ. అటువంటప్పుడు ఆయన తిరిగి వచ్చునప్పుడు కొందరు విశ్వాసులు ఎందుచేత ప్రభువు యొక్క సన్నిధి నుండి సిగ్గుపడి వెనుకకు వెళ్ళిపోవుదురు ? దానికి ఎన్నో కారణములు ఉండవచ్చును. కాని నేను ఒక విషయమును ఎత్తి చూపించెదను. యోహాను 8:1-12 లో పరిసయ్యులు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీపై నేరము మోపుతూ యేసుప్రభువు నొద్దకు ఆమెను తీసుకొనివచ్చి, అటు తరువాత ఆయన యొద్ద నుండి సిగ్గుతో వెనుకకు వెళ్ళిపోయిన సంఘటనను మనము చదువుదుము.

వారు ప్రభువు యొక్క సన్నిధి నుండి ఎందుకు వెనుకకు తగ్గి వెళ్ళిపోయిరి? దానికి కారణము పాపము లేనివాడు మొదట ఆమెపై రాయిని వేయవచ్చని ఆయన చెప్పుటయే. యేసు ప్రభువు యొక్క ప్రకాశవంతమైన సన్నిధి వెలుగులో వారందరు అదే పాపము విషయములో దోషులని వారు అకస్మాత్తుగా గ్రహించిరి.

దేవుడు ఎప్పుడైనను పాపులపై రాళ్ళు వేయడు, మనము దానిని ఎల్లప్పుడు మరచిపోకూడదు. పాపముపై విజయము గూర్చి బోధించుటలో రెండు పద్ధతులున్నవి. ఒకటి జనులపై రాళ్ళు వేయకుండా యేసు ప్రభువు బోధించినట్లు బోధించుట. రెండవది పరిసయ్యులవలె జనులను ఖండించుచు బోధించుట.

పాపముపై విజయము గూర్చి బోధించు అనేక బోధకుల మాటలలో యేసు యొక్క సాత్వికత్వము ఉండుటలేదు. వారు ఇతరులను పాపము చేయవద్దని చెప్పుదురు. కాని, వారు విమర్శించుదురు, నేరారోపణ చేయుదురు మరియు కొన్ని యిబ్బందికరమైన పేర్లతో పిలుచుదురు. పరిసయ్యులు అలా ఉండిరి. వారు నీతిని గూర్చి బోధించిరి, కాని వారు వారి గుంపుకు చెందని ప్రతి ఒక్కరిని ''శాపగ్రస్తులు'' గా చూచిరి (యోహాను 7:49). మనము అటువంటి వైఖరి కలిగిన అనేక విశ్వాసులను ఈ రోజు చూచుదుము.

యేసుప్రభువైతే పరిసయ్యులు ఎల్లప్పుడు బోధించిన దానికంటే ఉన్నతమైన నీతి ప్రమాణములను బోధించారు. కాని ఆయన ఏ పాపిని చెడ్డ పేర్లతో పిలువలేదు. ఆయన వారిని ప్రేమించి తన యొక్క సాత్వికముతో వారిని దైవిక జీవితములోనికి రాబట్టుకొనెను.

వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ, పరిసయ్యులు కేవలము తన పాపమును ఎత్తిచూపి, నిందమోపి మరియు తనను బహిరంగ పరచవలెనని చూచినప్పుడు, యేసు ప్రభువు తనను రక్షించుటకు ఉద్దేశించెనని గ్రహించినది. మరియు ఆ సంఘటన తరువాత, ఆమె తప్పకుండా రక్షింపబడి యేసు యొక్క శిష్యులలో ఒకరిగా మారియుండి యుండవచ్చును.

రోమా 2:1 లో ''కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?'' అని మనము చదువుదుము.

మనము ప్రభువు యెదుట నిలిచినప్పుడు, మనము ఇతరుల విషయములో వ్రేలు ఎత్తిచూపిన ప్రతి ఒక్క విషయమునకు, మన జీవితములలో ఏదొక సమయములో, ఎంతో కొంత మనము కూడా దోషులము అను నిజమును తెలిసికొందుము. ఆ రోజున దేవుని యొక్క వెలుగు ఎంతో ప్రకాశవంతముగా నుండుటచేత, ఇతరులు వేటినో చేసారని దోషారోపణ చేసిన మనము కూడా అవే కార్యములు చేసితిమని చాలా తేటగా చూచుదుము. ఈ విషయమే ఇతరులపై దోషారోపణ చేసిన ప్రతి విశ్వాసి ప్రభువు సన్నిధి నుండి సిగ్గుతో బయటకు వెళ్లునట్లు చేయును. అటువంటి విశ్వాసులు కూడా పరిసయ్యులని అప్పుడు ఋజువగును.

చాలా మంది విశ్వాసులు ఎంత తీక్షణమైన కనుదృష్టిని కలిగియుందురంటే వారు ఇతరుల మాటలలో ప్రతి చిన్న విషయమును మరియు ప్రతి చిన్న పని గూర్చి తీర్పు చేయుచు మాటలాడుదురు. వారు ఇతరులు ప్రార్దించిన విధానమును, సాక్ష్యమిచ్చిన విధానమును మరియు బోధించిన విధానమును కూడా విమర్శింతురు. మనందరకు మంచిది ఏదియు నివసింపని శరీరమున్నది కాబట్టి, ఎవరు ఎంత శ్రేష్టమైన పనిని చేసినా అందులో ఎల్లప్పుడు కొంత అసంపూర్ణత యుండును. కాని నేరారోపణ చేయు ఆత్మ కలవాడు తనలో ఏ తప్పును కనుగొనడు గాని, కేవలము ఇతరులలోనే తప్పులు కనుగొనును.

మనము మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మనలో ఎంతవరకు స్వార్థము మరియు గర్వము ఉన్నదో మనలను గూర్చి మనము సంపూర్ణముగా దేవుని యొక్క సంపూర్ణమైన వెలుగులో తెలిసికొందుము (1 కొరిందీ¸ 13:12). మనలను మనము ఇప్పుడు ఇంకా పూర్తిగా గమనించుకొనినట్లయితే మనము ఎప్పుడైనను ఇతరులలో నున్న దేనిని గూర్చి తీర్పు గాని లేక విమర్శ గాని చేయము. ఎందుకనగా మనలో అదే లోపము ఉన్నదని మనము చూచుదుము. మనము మనలో నుండిన భ్రష్టత్వమును ఎంత ఎక్కువగా చూచెదమో, మనచుట్టూ ఉండిన ఇతరులలో తప్పులను అంత తక్కువగా చూచుదుము.

రెండు ఉదాహరణలను చూడండి. నీవు అదే ఉదయకాలమున వ్యభిచారము చేసియున్నట్లయితే, నీవు ఇతరులను వ్యభిచారము గూర్చి విమర్శించుట వలన నీవు ఒక వేషధారివై యుండలేవా? ఒక తండ్రి రెండు నిమిషముల క్రితము కాఫీని క్రింద ఒలకబోసి, తన బిడ్డ పాలు క్రింద ఒలకబోసినందుకు విమర్శించినట్లయితే ఆ తండ్రి కరిÄనుడు మరియు మనస్సాక్షి లేనివాడుగా ఉండడా? అటువంటప్పుడు మనమెందుకు ఇతరులను విమర్శించవలెను? దానికి కారణం మనము అటువంటి పనులు ఎప్పుడు చేయలేమని అనుకొనుటవలననే గదా.

అందువలననే వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని పట్టుకొని పరిసయ్యులు యేసునొద్దకు వచ్చుటకు అంత ధైర్యము కలిగియుండిరి. అయితే వారు ప్రభువైన యేసుయొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన యొక్క వెలుగు వారి హృదయములలో అదే పాపమును బయట పెట్టెను. అప్పుడు ''వారు ఆయన యొద్ద నుండి సిగ్గుపడి బయటకు వెళ్ళిపోయిరి''.

యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఇతరులను తీర్పుతీర్చి, విమర్శించిన వారి అందరి పరిస్థితి అంతే. వారు వారి స్వంత శరీరములో నున్న భ్రష్టత్వము యొక్క తీవ్రతను చూచినప్పుడు మరియు వారు అవే విషయములను ఇతరులలో తీర్పుచేసి విమర్శించిన విషయములను తమలో చూచినప్పుడు వారు సిగ్గుపడి ప్రభువు యొద్ద నుండి వెళ్ళిపోవుదురు.

వేరొక వ్యక్తి స్వార్థముతో ప్రవర్తించుట లేక మొండిగా యుండుట లేక గర్వముతో యుండుట చూచుట మనలో ఎవరికైనా చాలా సుళువు. బహుశా నీవు తరచుగా, ఫలాన వ్యక్తి చాలా స్వార్దపరుడు లేక ఫలానా వ్యక్తి చాలా మొండివాడు, తన యిష్టాన్ని జరిగించుకొనే వ్యక్తి లేక ఫలానా వ్యక్తి చాలా గర్విష్టి అని చెప్పుచూ ఉండవచ్చును మరియు నీవు చెప్పేది పూర్తిగా నిజమై యుండవచ్చును. కాని నీవు అటువంటి మాటలు ఇతరుల గూర్చి చెప్పినప్పుడు, క్రీస్తు తిరిగి భూమిపైకి వచ్చినప్పుడు, దేవుడు నీ జీవితములో నుండిన అంతకంటె ఎక్కువైన స్వార్థమును, మొండితనమును, స్వంత యిష్టమును మరియు గర్వమును నీకు చూపును. ఆ రోజున దానిని నీవు చూసినప్పుడు నీవు కూడా (పరిసయ్యుల వలె) ప్రభువు సన్నిధి నుండి సిగ్గుతో బయటకు వెళ్ళిపోవలసి యుండును. దానికి కారణము ఇతరులలో కొంచెముగా నుండిన ఈ పాపులను నీవు స్వనీతితో తీర్పు తీర్చుటయై యున్నది.

నీలో నీవు చూడలేని ఈ దుష్టత్వములు ఏదో ఒక రూపములో నున్నవని నీవు గ్రహించావా? నీవు అది గ్రహించినట్లయితే, ఈ విషయముల గూర్చి నీవు ఇతరులను తీర్పుతీర్చుటకు తొందరపడవు. నీవు ఎవరినైతే తీర్పు తీర్చుచున్నావో వారు కూడా (నీవలె) వారిలో నున్న స్వార్థమును, మొండితనమును మరియు గర్వమును చూచుకొనలేక పోవుచున్నారని అనుకొందువు. కాని దురరృష్టవశాత్తు మన శరీరము ఇతరుల విషయంలో అటువంటి కనికరముతో కూడిన వెసులుబాటు ఇవ్వదు, మనకొరకైతే కావలసినంత వెసులుబాటు ఇస్తుంది. అందువలననే దేవుని వాక్యము ''కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును'' (యాకోబు 2:13 ) అని చెప్పుచున్నది. అందువలననే యేసు ప్రభువు ''తీర్పు తీర్చకుడి'' (మత్తయి 7:1) అని చెప్పారు.

''నాకు హాని చేసిన వారినందరిని నేను క్షమించాను'' అని చెప్పినప్పుడు కూడా మనము జాగ్రత్త కలిగి యుండవలెను. ఎందుకనగా ఇతరులు మనకు హాని చేశారని అనుకొనుటలో కూడా గర్వము మరియు అహంభావము యుండును.

''మీకు హాని చేయువాడెవడు?'' (1 పేతురు 3:13) అని పేతురు అడుగుచున్నాడు. దానికి స్పష్టమైన జవాబు ''ఎవరూ కాదు'' అనేది ఎందుకనగా ''దేవుని ప్రేమించువారికి అన్ని విషయములు మేలు కలుగుటకై సమకూడి జరుగును'' (రోమా 8:28) అని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు.

ఎవరైనా నీకు హాని చేశారని నీవు తలంచినట్లయితే, అది నీవు దేవుని ప్రేమించుట లేదని ఋజువు చేయుచున్నది. ఎందుకనగా రోమా 8:28 దేవుని ప్రేమించు వారికందరికి ఒక తేటయైన వాగ్దానము . నీవు దేవుని ప్రేమించినట్లయితే, ప్రతి విషయము నీ మేలు కొరకు సమకూడి జరుగును. అటువంటప్పుడు నీకు ఎవరైనా ఎలా హాని చేయగలరు?

అయినప్పటికి ఈ రోజున అనేకులైన విశ్వాసులు వారికి వారి కుటుంమములకు కొందరు హాని చేశారని అనుకొనుచుందురు. దేవుని వాక్యము యొక్క తేటయైన వెలుగులో అటువంటి విశ్వాసులకు మనము ఏమని చెప్పగలము? '' నీతో సహా ప్రతి మనుష్యుడును అబద్దికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు'' (రోమా 3:3 ) అని మాత్రము చెప్పగలము.

ఇతరులు తమకు తమ పిల్లలకు హానిజేసినా వారిని క్షమించినట్లుగా స్వనీతిపరులైన విశ్వాసులు సంఘములో సాక్ష్యము చెప్పుటను నేను వినియుంటిని. అంటే వారిని వారు క్రీస్తు సారూప్యములో నుండినట్లు అభినందించుకొనుచుండిరి. అయితే అటువంటి సాక్ష్యములో అపారమైన గర్వమున్నది. అటువంటివారు నిజానికి చెప్పేదేమంటే (వారి భావాలను మాటలలో పెట్టి చెప్పినట్లయితే) ''నా యెడల దయ్యాలవలె ప్రవర్తించు వారు నా చుట్టూ చివరకు సంఘములో కూడా ఉన్నారు. కాని నేను (ఒక ఆత్మీయమైన స్త్రీ,పురుషుడైన నేనే) వారి యొడల యేసుక్రీస్తు వలె ప్రవర్తించి వారిని క్షమించితిని. నేనెంత ఉదారమైన వాడినో, మంచివాడినో చూడండి!'' దేవుడు అటువంటి పరిసయ్యుల నుండి సంఘమును కాపాడును గాక!

పరిశుద్ధాత్మ యిచ్చే ప్రవచనము ఎప్పుడు యేసుప్రభువును మహిమపరచును ( ప్రకటన 19:10). సాతాను యొక్క ఆత్మయే ఇతరులలో చెడుగా కన్పించే వాటికి వ్యతిరేకముగా ఒకరి యొక్క స్వంత మంచితనమును గొప్పగా ఎత్తి చూపించును.

అటువంటి విశ్వాసులు వారికి హాని చేసినవారిని వారు క్షమించితిమి అని చెప్పినప్పుడు వారు అబద్దము చెప్పకపోవచ్చును. కాని వారు ఇతరులు వారికి చేసినది తెలియక చేసి యుండవచ్చునేమో అను దానికి అవకాశమిచ్చుట లేదు. మరియు వారు ఇతరులకు ఇంకా ఎన్ని విధములుగా బాధ కలిగించిరో అను విషయంలో వెలుగు లేకుండా యున్నారు. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు, వారి యొక్క నేరారోపణ చేయు ఆత్మతో వారే సాతాను వలె ప్రవర్తించిరని చూచుదురు. మరియు ఎవరైనా వారికి హాని చేసిన దానికంటె వారే ఎంతగానో ఇతరులకు హానిచేసినట్లు కూడా చూచుదురు.

కాని అటువంటి విశ్వాసులు వారి స్వనీతి యొక్క దుర్వాసనను ఇప్పుడు గ్రహించరు! ఎందుకనగా పరిసయ్యతత్వము అనునది ఇతరుల యెడల కనికరము చూపు వైఖరిలో కూడా మారువేషము వేసికొనును. మన శరీరము అంతటి మోసకరమైనది.

నీవు అలాగుండినట్లయితే కనీసము ఇప్పుడైనను నీకు నీలో నుండిన స్వనీతి మరియు గర్వము గూర్చి కొంత వెలుగు వచ్చునని ఆశించుచున్నాను. అందువలన నీవు ఇతరులను తీర్పు తీర్చుటలో, విమర్శించుటలో నీ ప్రవర్తన ఎంతగా అపవాది యొక్క ప్రవర్తనవలె యుండెనో నీవు చూడవచ్చును.

నీవు ఈ విషయములో నున్న దుష్టత్వమును ఇప్పటి వరకు చూడలేక పోయావంటే దానికి కారణాన్ని ఆలోచించావా?

దానికి జవాబు: నీవు సంపూర్ణత లోనికి సాగిపోవుట లేదు. నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిలేవు. నీవు ప్రభువైన యేసు పవిత్రుడుగా ఉండినట్లు నిన్ను నీవు పవిత్ర పర్చుకొనుట లేదు. అందువలన నీవు నిజముగా ప్రభువు రాకడకు సిద్దపడి లేవు.( 1 యోహాను 3:2,3 ప్రకారము). అకస్మాత్తుగా ప్రభువు వచ్చినప్పుడు, నీవు ఆయన సన్నిధి నుండి సిగ్గుపడి బయటకు వెళ్ళవలసి యుండును.

ఇంకా ఆలస్యం కాక ముందే మన గూర్చి మనకు ఇంకా వెలుగు యిమ్మనమని దేవుని అడుగుట మంచిది.

ఆత్మీయ ప్రగతికి ఒక ఋజువు మనము గతములో చేసిన వాటిని బట్టి చివరకు గత సంవత్సరములో చేసిన వాటి గూర్చి కూడా మనము విచారించుట. అది మనము జ్ఞానములో ఎదుగుచున్నామనుటకు ఒక సూచన. మనము చెడు ఏమీ చేసి యుండకపోవచ్చును. కాని మనము అప్పుడు చేసిన పనులను ఇంకా సంపూర్ణముగా, మరికాస్త క్రీస్తు సారూప్యములో చేసి యుండవలసినదని మనము ఇప్పుడు గ్రహించుదుము. మనము తెలిసి పాపము చేసి యుండకపోవచ్చు, కాని మనము తెలియకుండానే పాపము చేసాము. క్రీస్తు సారూప్యములో లేనిది ఏదైనా పాపమే.

అందువలన ఎవరైతే వారి జీవితాలలో వెనుకకు చూచుకొనినప్పుడు విచారించాల్సింది ఏమీ లేదని చెప్పుదురో వారు ఏమాత్రము ఎదిగి యుండని వారైయుందురు. వారు రక్షణలోనికి వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు అదే ఆత్మీయ స్థితిలో ఉండి యుందురు. వారు అప్పుడు ధనాన్ని ప్రేమిస్తూ యుండిరి. ఇప్పుడు కూడా వారు ధనాన్ని ప్రేమిస్తూ యున్నారు. వారు అప్పుడు నిగ్రహాన్ని కోల్పోతూ యుండిరి ఇప్పుడు కూడా అలాగే యున్నారు. అయినప్పటికీ వారి పనులను బట్టి గాని వారి జీవిత విధానములను బట్టిగాని వారికి బాధకాని లేక విచారముకాని లేదు. అటువంటి వారు ఎంత గ్రుడ్డివారో! అయినప్పటికి వారు ఇతరులపై తీర్పు తీర్చుటకు ఎంతో వేగిర పడుదురు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు వారికి ఎంత విచారముండునో!

సంఘములో దేవునియొక్క వాక్యము బోధించుచున్న వ్యక్తి ఆత్మానుసారముగా ఎదుగుచున్నట్లయితే అతడు ప్రతి సంవత్సరం మరి ఎక్కువగా క్రీస్తువలె బోధించును. అయితే అతడు కూటములో బోధించిన తరువాత ప్రతిసారి తన ఉద్దేశ్యములను, మాటలను, పద్ధతి మొదలగు వాటిని తీర్పు తీర్చుకొన్నప్పుడే అది జరుగును. చాలా, చాలా కొద్దిమంది మాత్రమే దేవుని వాక్యమును బోధించిన తరువాత తమ్మును తాము తీర్పు తీర్చుకొందురు. గనుక వారు వారి జీవితాలపై అభిషేకము, కృప, ఆత్మయొక్కశక్తి లేకుండా, సంవత్సరం తరువాత సంవత్సరం విసుగు పుట్టించేలా ఎటువంటి ఆసక్తి కలుగని విధముగా బోధించుటలో కొనసాగుదురు.

బాప్తిస్మమిచ్చు యోహాను మాటలు వినుటకు జన సమూహములు యూదయ అరణ్య ప్రాంతములకు వెళ్ళినట్లు, ఇశ్రాయేలు దేశపు నలుమూలల నుండి యేసు ప్రభువు మాటలు వినుటకు వారు వెళ్ళినట్లు, అనేక పట్టణాలలో జనులు పౌలు మాటలు వినుటకు దూర ప్రయాణములు చేసినట్లు, ఆకలిగొనిన ఆత్మలు తన పరిచర్యపై పరలోకపు తాకిడి కలిగి యుండి వినదగిన వానిగా యుండిన దైవజనుని ఎక్కడైనను కనుగొనినట్లయితే వారు వందల కొద్ది మైళ్ళు ప్రయాణము చేయుదురు.

మనలో ఎంత మందిమి మనకు తెలియకనే ఇతరులను గాయ పరచి బాధపరచి యున్నామని, ఇతరులు ఇది చెయ్యాలని అది చెయ్యాలని వారిపై ఒత్తిడి తెచ్చి యున్నామని, ఇతరుల గురించి పట్టించుకొనకుండా ప్రవర్తించామని, ఇతరులు మనకు ఇచ్చిన ఆతిధ్యాన్ని అవకాశముగా తీసుకొంటిమని, ఇతరులను బాధపరచునట్లు ఉత్తరాలు వ్రాశామని గ్రహించాము? ఆ ఇతరులు వాటి గూర్చి ఒక్కమాట కూడా మాటలాడకుండా వాటన్నిటిని భరించారు మరియు మనలను సహించారు.

మనకు సంఘములో స్థానము లేకపోయినట్లయితే మనము ఎప్పుడో పడిపోవలసిన పాపమునుండి సంఘములో చెప్పబడిన మరియు వ్రాయబడిన పరిచర్య ద్వారా మనము కాపాడబడిన విషయం గురించి మనలో ఎంతమందిమి కృతజ్ఞత కలిగియున్నాము?

మనలో ఎంతమందిమి మన భార్యలు రాత్రింబవళ్ళు మన ఇళ్ళలో అనేక విధములుగా మనకు సేవచేసిన దానిగూర్చి దేవునికి కృతజ్ఞత కలిగియున్నాము? మనము ఎన్నో విషయములను దానికవే జరిగిపోవుచున్నట్లు తీసుకొన్నాము. మనము భర్తలుగా మన భార్యల గూర్చి కృతజ్ఞత కలిగి లేకపోయినట్లయితే, మన బిడ్డలు మనగూర్చి కృతజ్ఞత కలిగియుండాలని ఎలా ఆశించగలము? మన బిడ్డలు మననుండి అటువంటి అలవాట్లు నేర్చుకొనవలసియ్నుది! అనేక మంది భర్తలు వారి భార్యల ఎడల ఎంత చెడుగా ప్రవర్తించిరో మరియు ఎంత కృతజ్ఞత లేకుండా యుండిరో క్రీస్తు రాకడ రోజున తెలుసుకొందురు. మరియు అనేకమంది భార్యలు వారిభర్తల యెడల ఎంతచెడుగా కృతజ్ఞత లేకుండా యుండిరో ఆ రోజున తెలుసుకొందురు.

ఒక మాష్టారు తన తరగతిలో నుండిన పిల్లల యెదుట ఒక మూలన ఒక చిన్న నల్లమచ్చ యుండిన ఒక పెద్ద తెల్లని కాగితమును పరచి చూపిన ఒక కథను గూర్చి నేను జ్ఞాపకము తెచ్చుకొనుచున్నాను. వారేమి చూచుచున్నారని ఆయన విద్యార్థులను అడిగెను. అందుకు వాళ్ళందరు ఒక మూలన ఒక చిన్న నల్లని మచ్చను చూచుచున్నామని చెప్పిరి. ఎవ్వరు కూడా వారు పెద్ద తెల్లని కాగితమును చూచినట్లు చెప్పలేదు. మానవ నైజము అలా ఉంటుంది- ఇతరులలో ఉండిన మంచి విషయములో గ్రుడ్డిగా యుండును. మనము ఇతరులలో నుండిన నల్లని చుక్కలనే చూచుదుము.

ఇది కేవలము గర్వము వలననే కలుగును. దీనులైన వారికి తమ తోటి విశ్వాసులను గూర్చి దేవునికి కృతజ్ఞత కలిగి యుండుట కష్టమనిపించదు. కేవలము సాతానుకు సంబంధించిన గర్వమే వారి సహోదర సహోదరీల గూర్చి కృతజ్ఞత లేకుండా చేయును.

నీవు ఇతరులపై రాళ్ళు వేయుచున్నావా? ఇతరులపై నేరారోపణ చేస్తూ వ్రేలిని ఎత్తి చూపిస్తున్నావా? అలా అయినట్లయితే నీవు దేవునిలా కాకుండా ఎక్కువగా సాతాను వలె యున్నావు. ఎందుకంటే నేరారోపణ చేయువాడు సాతాను. దేవుడు ఎప్పుడైనను నేరారోపణ చేయడు. ''ఆయన నీ యందున్న ప్రేమను బట్టి శాంతము వహించును'' (జెఫన్యా 3:17) అని బైబిలులో స్పష్టముగా చెప్పబడినది.

తీర్పు ఆయన యొక్క ''అసాధారణమైన క్రియ''యని బైబిలు చెప్పుచున్నది (యెషయా 28:21). అది దేవుడు సాధారణంగా లేక సామాన్యముగా చేసేది కాదు. కాని మానవుని విషయంలో అది వేరు. ఇతరులను తీర్పుతీర్చుట అతడికి సర్వ సాధారణమైన పని. ఇక్కడనే సాతాను యొక్క విషము మానవునిలోనికి సోకినదని తేటగా కనబడుచున్నది. ప్రభువైన యేసు ''హితవత్సరము ప్రకటించుటకును (365 రోజులు) దేవుని ప్రతిదండన దినమును (1 రోజు) ప్రకటించుటకు''ను అభిషేకింపబడెనని మనము యెషయా 61:2 లో చదువుదుము.

దేవుడు అనుగ్రహమునే కాకుండా కారిÄన్యమును కలవాడని రోమా 11:22 నుండి మనకు తెలియును. కాని యెషయా 61 లోనే దేవుని అనుగ్రహమునకును ఆయన కారిÄన్యమునకును మధ్యగల నిష్పత్తుల భాగములు 50:50 కాదని అది 365:1 అని చదువుదుము. దేవుని యొక్క ఆ సాత్విక స్వభావములో పాలు పొందుటకు మనము పిలువబడితిమి.

మనము ఇటువంటి సందేశమును చదివిన తరువాత మనగూర్చి కొంత వెలుగు పొందియుండినట్లయితే, యేసుప్రభువు తిరిగి వచ్చినప్పుడు, ప్రకాశవంతమైన వెలుతురు మనపై ప్రసరించినప్పుడు మనలో నుండిన స్వార్థము గూర్చి మరియు గర్వము గూర్చి ఇంకెంత వెలుగు మనము పొందుదుమో ఊహించుకొనగలమా?

ఏశావు ''తరువాత'' కన్నీళ్ళు విడిచినా అతడు మారు మనస్సు పొందుటకు అవకాశము లేక పోయినది (హెబ్రీ 12:17). మనందరి జీవితాల్లో మనము ప్రభువు యెదుట నిలుచు రోజున ఒక ''తరువాత'' అనేది యుండును. ఆ రోజున, మనము కృతజ్ఞత కలిగియుండుట నేర్చుకొనుటకు చాలా ఆలస్యమై పోయినదని తెలుసుకొందుము. అప్పుడు దు:ఖించుటకు కూడా సమయము మించిపోవును. అప్పుడు మనము పశ్చాత్తాప పడకుండా యుండునట్లు మనలను మనము తీర్పు తీర్చుకొనుటకును దు:ఖించి యేడ్చుటకును ఇదియే సమయము.

యేసు ప్రభువు యొక్క మహిమను గూర్చి క్రొత్తగా ప్రత్యక్షత యిమ్మనమని మనము దేవుని అడుగుదాం. ఆ వెలుగులో మనము మన శరీరములో ఉండే స్వార్దము, కరిÄనత్వము, స్వంత యిష్టము మరియు గర్వము యొక్క తీవ్రతను చూచుకొనెదము. మరియు మనము ఆయన యెదుట పశ్చాత్తాపముతో మరియు విచారముతో మన ముఖములు నేలపై నుండునట్లు పడుదుము. అప్పుడు ఇతరులను తీర్పుచేయుట మరియు విమర్శించుట పూర్తిగా మానివేయుట సుళువుగా నుండును.

మనము ''యేసు యొక్క పవిత్రత ప్రమాణమునకు'' (1 యోహాను 3:3 ) చేరు వరకు మనము సంతృప్తి చెందకుండా యుండెదము. అది మన గమ్యమైనట్లయితే, అప్పుడు ప్రభువు వచ్చినప్పుడు సిగ్గుపడి బయటకు వెళ్ళనక్కర్లేదు.

అధ్యాయము 17
ఒక్క మనుష్యుని ప్రభావము

''నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును.....తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు'' (యెహెజ్కేలు 22:30). ఈ లోకములో నెరవేర్చుటకు దేవునికి అనేక కార్యములున్నవి కాని వాటన్నిటికి సమానమైన ప్రాముఖ్యత లేదు. ప్రాముఖ్యత లేని కార్యములకు ఆయన ఎవరినైనా వాడుకొనును. కాని నిజముగా ప్రాముఖ్యమైన కార్యములకు ఎవరు పడితే వారు సరిపోరు. అటువంటి ముఖ్యమైన కార్యములకు అనేకమైన శోధనలు పరీక్షలద్వారా పరీక్షింపబడి నిరూపించబడిన వాడు దేవునికి కావలెను. అటువంటి ఒకవ్యక్తి వెంటనే అందుబాటులో లేనప్పుడు, అటువంటి వ్యక్తి దొరికేవరకు ఆయన వేచియుండును. మనుష్యులు చేసినట్లు, అందుబాటులో ఉన్నవారిలో శ్రేష్టమైన వ్యక్తితో దేవుడు తన పనిని చేయడు.

నిప్పును పుట్టించుటకు మనము ఒక అగ్గి పుల్లను వాడుదుము. కాని ఆ తరువాత అగ్గిపుల్ల మనకు విలువలేనిది గనుక దానిని పారవేయుదుము. కొందరిని దేవుడు అలా వాడుకొనును. వారిని వాడుకొన్న తరువాత, వారాయనకు విలువలేని వారు గనుక వారిని వదిలివేయును. కాబట్టి మనము కేవలము దేవుని చేత వాడబడుటకు ఆశ కలిగియుండకూడదు. మనము ఆయనకు విలువైన వారిగా యుండుటకు కోరుకొనవలెను.

గొప్ప యింటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలును మాత్రమే కాక కఱ్ఱవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను తన్నుతాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగానుండును (2తిమోతి 2:20,21).

ఒక వ్యక్తి తన పనిలో వేర్వేరు పదార్థములలో చేయబడిన పాత్రలను వాడుకొనవచ్చును. కాని అతడు బంగారు మరియు వెండి పాత్రలకు ఇచ్చినంత విలువ, మట్టి కుండలకు, చెక్క పెట్టెలకు ఇవ్వడు. అదేవిధముగా తిరిగి జన్మించిన వారందరు దేవుని యొక్క సమానమైన బిడ్డలైనప్పటికీ, ఆయన పనిలో దేవుని ప్రతిబిడ్డ ఒకే విధమైన ప్రయోజనమును కలిగియుండడు. దేవునికి పక్షపాతము లేనప్పటికీ, ప్రతి పాత్ర పవిత్రపరచబడిన, ప్రయోజనకరమైన పాత్రకాదు. దేవుడు బహు కొద్ది మందికే విలువనిచ్చును. ఎందుకనగా వారు మాత్రమే ఆయన చిత్తమును, మహిమను పూర్ణహృదయముతో వెదకుదురు. అందుచేత మనము దేవునికి విలువగల పాత్రలుగా ఉండగోరిన యెడల, ''శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము'' నుండి మనలను మనము ఎల్లప్పుడు పవిత్రపరచుకొనవలెను (2కొరిందీ¸ 7:1). ఒకవ్యక్తి విలువగల పాత్రయైన తరువాత దేవుడు తన పని నిమిత్తము అతడిపై ఎంతగానో ఆధారపడును. అటువంటి వ్యక్తి దేవునికి నమ్మకముగా లేనియెడల దేవుని పని తాత్కాలికముగా ఆగిపోవును. ఆయన వాడుకొన గలిగిన మరో వ్యక్తిని ఆయన కనుగొనే వరకు అది ఆగిపోవును. ప్రపంచ చరిత్రలో, ఇశ్రాయేలు మరియు సంఘచరిత్రలో తన సంకల్పములను నెరవేర్చుటకు దేవుడు ఏవిధముగా ఒక పరిస్థితిలో కేవలము ఒక వ్యక్తి మీద ఆధారపడెనో అనుదానికి ఎన్నో ఉదాహరణలు మనము చూచెదము.

నోవహు

లోకమంతయు దుర్మార్గతతోను, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటుతోను నిండియున్నప్పుడు భూమి మీద దైవ భక్తి కలిగిన ఎనిమిది మంది వ్యక్తులున్నప్పటికీ, దేవుని ఉద్దేశ్యము యొక్క నెరవేర్పు కేవలము ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వము పైన పూర్తిగా ఆధారపడియుండెను. ఆ వ్యక్తి నోవహు. ఆ కాలములో దేవుని దృష్టిలో కృపపొందిన ఏకైక వ్యక్తి నోవహు (ఆదికాండము 6:8). ఒకవ్యక్తి దేవునికి నమ్మకముగా లేనియెడల మానవజాతి అంతయు తుడిచిపెట్టబడియుండెడిది మరియు మనలో ఏ ఒక్కరు ఈ రోజున సజీవముగా ఉండేవారిమి కాము. నోవహు నమ్మకముగా ఉన్నందుకు మనము నిశ్చయముగా దేవునికి వందనాలు చెప్పవలెను. చివరి దినములు నోవహు దినముల వలె ఉండునని యేసు చెప్పెను. నోవహు దినములలో ఉండిన లైంగికపరమైన విపరీతత్వము మరియు బలాత్కారము చివరి దినములలో కూడా ఉండును. ఈ రోజున కూడా మనము అటువంటి కాలములో నివసించుచున్నాము. కాబట్టి దేవునికి ఈ రోజున కూడా కావలసినది నోవహు వంటి రాజీపడని వ్యక్తులు.

మోషే

ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయనకు ప్రాతినిథ్యం వహించుటకు తగిన వ్యక్తి కనుగొనే వరకు దేవుడు వారిని వారి బానిసత్వము నుండి విడిపించలేకపోయెను. అటువంటి వ్యక్తి సిద్ధమయ్యేవరకు దేవుడు వేచియుండుటకు సిద్ధపడెను. ఇశ్రాయేలు ఐగుప్తులో 400 సంవత్సరములు ఉండుటకు దేవుడు ప్రణాళిక వేసెను (ఆదికాండము 15:13). కాని చివరికి వారు అక్కడ 430 ఏండ్లు ఉండిరి (నిర్గమకాండము 12:40). దేవుడు వారికొరకు కలిగియున్న పరిపూర్ణమైన ప్రణాళిక కంటె వారు 30 ఏళ్ళు ఎక్కువ ఎందుకు ఉండవలసి వచ్చింది? అది నిశ్చయముగా దేవుని పొరపాటు కాదు. దేవుడు ఎప్పుడు పొరపాట్లు చేయడు. కాని వారికి నాయకుడిగా ఉండబోవువాడు సిద్ధముగా లేకుండెను. మోషే అరణ్యములోనికి వెళ్ళిన తరువాత 10 సంవత్సరముల లోపే మోషే సిద్ధముగా ఉండేటందుకు దేవుడు బహుశా యోచించియుండవచ్చును. దానికి బదులు దేవుని చేతి క్రింద తన ఆత్మీయ విద్యను పూర్తి చేయుటకు మోషే 40 సంవత్సరములు తీసుకొనెను. గనుక ఇశ్రాయేలు బానిసత్వములో మరో 30 సంవత్సరములు ఉండవలసివచ్చెను.

ఒకసారి మోషే ఇశ్రాయేలీయుల యొద్ద నుండి కేవలము 40 రోజుల పాటు వెళ్ళిపోయినప్పుడు, వారి 20 లక్షల జనాభా దారితప్పిపోయెను (నిర్గమకాండము 32). ఒకసారి దైవజనుడు అక్కడనుండి వెళ్లినప్పుడు, నిజమైన దేవున్ని విడిచిపెట్టి, విగ్రహారాధనలో తప్పిపోవుటకు ఒక దేశమునకు కేవలము కొద్ది రోజులే పట్టెను. ఆ ఇశ్రాయేలీయులు తమ స్వంత కళ్లతో ఆశ్చర్యకరమైన అద్భుతములను చూచిరి. కాని ఆ అద్భుతముల యొక్క స్మృతి వారిని విగ్రహారాధన నుండి కాపాడలేకపోయెను. ఒక్క దైవజనుని యొక్క ఖచ్చితమైన నాయకత్వమే దానిని చేయగలిగెను! మోషే పర్వతముపైన ఉండగా, అహరోను వారి తాత్కాలికమైన నాయకునిగా ఉండెను. అహరోను ఒక మంచి దైవభక్తి కలిగిన వ్యక్తియైనప్పటికి, అతడు ప్రజలను భక్తిపరులుగా ఉంచలేకపోయెను. నిశ్చయముగా అతడు ప్రజలను సంతోషపెట్టువానిగా ఉండెను గనుక ప్రజలు అతనిని వశపరచుకొనిరి.

అహరోను వంటి క్రైస్తవ నాయకులు అనేకమంది, ఈ రోజున ప్రభువును సేవించుచున్నామని ఊహించుకొనుచున్నారు. వారు మంచివారు, నీతిమంతులు మరియు దేవుని భయము కలిగి జీవించుదురు. కాని సంఘమును పవిత్రముగా ఉంచుటకు దేవుడు వారిని వాడుకొనలేదు. ఎందుకనగా వారు సుళువుగా ప్రజల యొక్క చిత్తమునకు లొంగిపోవుదురు. సాతానుకు వ్యతిరేకముగా తన సంఘమును నడిపించుటకు దేవుడు ఈ రోజున కూడా మోషే వంటి వ్యక్తుల కొరకు చూచుచున్నాడు.

యెహోషువ

ప్రభువు హెచ్చించి తోడుగా నిలబడిన మరొక వ్యక్తి యెహోషువ. ఇశ్రాయేలు కానాను దేశపు సరిహద్దును చేరుకొన్నప్పుడు ప్రభువు యెహోషువతో ఇట్లనెను, ''నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలుపెట్టెదను'' (యెహోషువ 3:7). 40 ఏళ్ల అరణ్య ప్రయాణములో దేవుడు అప్పటికే యెహోషువకు తర్ఫీదు నిచ్చెను. ఇప్పుడు ఆయన అతనిని నాయకత్వమునకు హెచ్చించి మోషేకు తోడైయున్నట్లే అతనికి తోడైయుండెను. ఒకసారి యెహోషువకు మద్దతు ఇచ్చుటకు, ప్రభువు భూమి దాని చుట్టూ అది తిరుగకుండా కొన్ని గంటలు ఆపుచేసెను. ''యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందేగాని, తరువాతనే గాని లేదని'' బైబిలు చెప్పుచున్నది (యెహోషువ 10:14).

ఆయనకు ప్రాతినిద్యము వహించుటకు దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకొన్న తరువాత, ఆయన అతనితో తోడైయున్నానని ఇతరులకు తెలియజేయుటకు ఆయన ఎటువంటి అద్భుతములు చేయునన్నది ఆశ్చర్యకరమైన విషయము. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రదికిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించిరి అని మనము చదివెదము (న్యాయాధిపతులు 2:7). ఇశ్రాయేలీయులపైన యెహోషువ ప్రభావము ఎంత శక్తివంతమైనదంటే, అతని జీవితకాలములోను అతని తోటి పెద్దల యొక్క జీవిత కాలములోను ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయుటకు సాహసించలేదు. కాని యెహోషువ మరణించిన తరువాత, ఇశ్రాయేలు ఘోరముగా దిగజారిపోయెను. ఒక్క దైవజనుడి యొక్క జీవిత ప్రభావము అటువంటిది.

ఏలియా

ఇశ్రాయేలు చరిత్రలో మరియొక కాలమును గూర్చి ఆలోచించండి. అప్పుడు ఆహాబు ప్రజలందరు బయలును పూజించునట్లు చేసెను. ఆ కాలములో ఇశ్రాయేలులో, బయలు దేవతను పూజించుటకు నిరాకరించిన 7000 మంది ఉండిరి (1రాజులు 19:18). అలా ఉండుట, నిస్సందేహముగా ఒక ధైర్యముగల మెచ్చుకోదగ్గ విషయము. కాని అటువంటి సాక్ష్యము వ్యతిరేకమైనది. వారు విగ్రహారాధన చేయలేదు. ఇది ఈరోజున అనేక మంది విశ్వాసులు కలిగియున్న వ్యతిరేకమైన సాక్ష్యమువలే యున్నది. వారు పొగత్రాగరు, జూదమాడరు మొదలగునవి.

కాని దేవుడు ఆ కాలములో ఇశ్రాయేలులో తన ఉద్దేశ్యములను నెరవేర్చుటకు ఆ 7000 మందిలో ఒక్కరిని కూడా వాడుకోలేకపోయెను. దానికొరకు దేవునికి ఒక ఏలియా అవసరమాయెను. ఆ 7000 మందికి (విశ్వాసులకు) ఆహాబు భయపడలేదు. కాని అతడు ఏలియాకు భయపడెను. ఆ 7000 మంది దేవునికి ప్రార్థన చేసిరిగాని వారి ప్రార్థనలు ఆకాశమునుండి అగ్నిని క్రిందకు తేలేకపోయెను. ఏలియా ప్రార్థన దానిని చేసెను.

దేవుని సన్నిధిలో విశ్వాసులందరి ప్రార్థనలు ఒకే రకమైన ప్రభావమును కలిగియుండవు. ''నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై యుండును'' అని బైబిలు ఏలియా విషయములో చెప్పెను (యాకోబు 5:16,17). ఒక్క వ్యక్తి ఒంటరిగా దుష్టశక్తులను ఓడించి, బయలు ప్రవక్తలందరిని హతమార్చి, ఒక దేశమంతటిని తిరిగి దేవుని వైపుకు త్రిప్పెను. ఈరోజున కూడా, ఒక జనసమూహము ద్వారా కాక ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చబడును.

ఎలీషా

ఏలియా కాలములో, ఒక రోజు ఇశ్రాయేలులో ప్రవక్తలవుదామని ఆశించిన 50 మంది ''ప్రవక్తలశిష్యులు'' (బైబిలు కళాశాల విద్యార్థులు) ఉండిరి. కాని దేవుని ఆత్మ వారినందరిని దాటవేసి ''ప్రవక్తశిష్యుడు''కాని ఎలీషా మీదికి వచ్చెను (2రాజులు 2:7,15). ఎలీషా ఇశ్రాయేలులో కేవలము ఒక దాసునిగా ''ఏలియా చేతులమీద నీళ్ళు పోయువాడుగా'' పేరు నొందెను (2రాజులు 3:11). ఆరాము రాజు యొక్క సైన్యము ఇశ్రాయేలు పైన దాడిచేసినప్పుడు ఈ 50 బైబిలు పండితులలో ఎవరూ ఇశ్రాయేలును కాపాడలేకపోయిరి, ఎందుకనగా వారు వారి బైబిలు కళాశాలలో మోషే ధర్మశాస్త్రమును చదివినప్పటికీ, వారు దేవుణ్ణి ఎరుగలేదు. ఇశ్రాయేలు దేశములో దేవునితో సంబంధము కలిగిన ఒక్క వ్యక్తి ఎలీషా మాత్రమే శత్రువు ఎక్కడ దాడిచేయునో అనే విషయాన్ని ముందుగా హెచ్చరించగలిగెను.

ఈనాడు కూడా ఒక ప్రవక్తయొక్క పని అటువంటిదే: సాతాను వారిపై ఎక్కడ దాడిచేయునో అని దేవుని ప్రజలను ముందుగా హెచ్చరించుట. ఈనాడు ఒక సంఘములో, ఎలీషా వంటి ఒక ప్రవక్త 50 బోధకుల కంటే (ప్రవక్తల శిష్యులకంటే) ఎక్కువగా దేవుని ప్రజలను ఆత్మీయ విపత్తునుండి రక్షించగలడు. ఒక వ్యక్తి ఆత్మ స్వరమును వినలేనప్పుడు, బైబిలు జ్ఞానము వల్ల ఉపయోగము లేదు. దేవుని స్వరము వినగలిగిన వ్యక్తి మాత్రమే ఒక సంఘమును సాతాను తంత్రములనుండియు, దాడులనుండియు కాపాడగలడు.

పాత కాలము ప్రవక్తలు దీర్ఘదర్శులని పిలువబడిరి (వారు దేవుడు ఇచ్చిన దృష్టితో భవిష్యత్తులోకి చూడగలిగేవారు - 1సమూయేలు 9:9). శత్రువు ఎక్కడ దాడిచేయునో వారు ఎరిగియుండిరి. మరియు ఒక పనిచేయుట వలన వచ్చే ప్రమాదములను ముందుగా చూడగలిగిరి. ఈనాడు సంఘమునకు అటువంటి దీర్ఘదర్శులు ఎంతగానో అవసరము.

దానియేలు

దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి కానానుకు తీసుకురావాలనుకొన్నప్పుడు, ఆయనకు ఒక మనుష్యుడు అవసరమాయెను. ఆయన మోషేను కనుగొనెను. ఆయన యూదులను బబులోనునుండి యెరూషలేమునకు తీసుకురావానుకొన్నప్పుడు ఆయనకు మరొక మనుష్యుడు అవసరమాయెను. ఆయన దానియేలును కనుగొనెను. ఐగుప్తులో బానిసత్వము యొక్క వ్యవధి ముందు చెప్పబడినట్లే బబులోనులో చెరయొక్క వ్యవధి ముందుగా చెప్పబడెను. ఇది 70 సంవత్సరములు. కాని (మోషే కాలము వలే కాకుండా) ఈసారి దేవుని ప్రణాళిక నెరవేర్పులో ఒక రోజు ఆలస్యము కూడా కాలేదు, ఎందుకనగా దైవజనుడు సమయానికి సిద్ధపడియుండెను. దానియేలు తన యౌవన కాలమునుండి నమ్మకముగా ఉండి ప్రతి పరీక్షలో ఉత్తీర్ణుడాయెను. బబులోనులో 20 ఏళ్ళ వయస్సు గల యువకునిగా అతడు ప్రభువు కొరకు ఒక గట్టి తీర్మాణమును తీసుకొనెను. ''తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని తన హృదయములో తీర్మాణించుకొనెను'' (దానియేలు 1:8). ఇది యౌవనస్థులందరు గుర్తుంచుకొనుటకు ఒక మంచి వచనము.

రాజుకు భయపడి మిగిలిన యౌవన యూదులందరు రాజు భోజన బల్లపై వడ్డింపబడిన ఆహారమును (అది దేవుని లేవీయకాండములో నిషేధించిన ఆహారము) వెంటనే తినగా, దానియేలు మాత్రము దానిని తినుటకు నిరాకరించెను. ఆ బల్ల యొద్ద ఆ దినమున ఇంకా ముగ్గురు యౌవనస్థులుండిరి. వారు దానియేలు తీర్మాణము చేసుకొనుట చూచి అతనితో కలసిరి. దానియేలు మరియు ఆ ముగ్గురు వ్యక్తులు దేవుని కొరకు బబులోనులో ఒక శక్తివంతమైన ప్రభావముగా మారిరి.

70 ఏళ్ళ తరువాత దానియేలు దాదాపు 90 ఏళ్ళ వాడైనప్పుడు అతని ప్రార్థనలు యూదులు బబులోనునుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లుటకు ప్రేరేపించెను. ఈనాడు కూడా దేవుని ప్రజలు ఆత్మీయపరమైన బబులోను (నకిలీ సంఘము)నుండి ఆత్మీయ పరమైన యెరూషలేము(క్రీస్తు శరీరము) నకు వెళ్ళే ఉద్యమమున్నది. అటువంటి ఉద్యమానికి కూడా దేవునికి మనుష్యులు అవసరము.

ఈనాడు హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారు అనేకమంది ఉన్నారు (దానియేలు 1:11). వారు ప్రభువు కొరకు నిలబడుటకు ఆత్రుత కలిగియున్నారు కాని స్వంతగా అలా చేయుటకు వారికి ధైర్యము లేదు. వారిని నడిపించుటకు వారు ఒక దానియేలు కొరకు ఎదురుచూచుచున్నారు. కాబట్టి దేవుడు మరలా దానియేలుల కొరకు చూచుచున్నాడు.

పౌలు

క్రొత్త నిబంధనలో ఒకరిద్దరిని మాత్రమే కాక దేవుడు తన బిడ్డలందరిని వాడుకోవాలని ఆశించుచున్నాడు. అయితే ప్రతి విశ్వాసి క్రొత్త నిబంధనలో జీవిస్తేనే ఇది సాధ్యము. కాని అపొస్తలుల కాలమునుండి మనము చూచేదేమనగా, బహు కొద్ది మంది విశ్వాసులే క్రొత్త నిబంధనలోకి ప్రవేశించుదురు. ఎక్కువ మంది విశ్వాసులు పాపముచేత ఓడిపోయిన జీవితాలను జీవించుదురు, ''ఆరోగ్యము సంపదలతో కూడిన సువార్త'' ను విందురు, వారికి క్రీస్తుకు మధ్యవర్తిగా ఒక కాపరిని కోరుకుందురు. వారు అనేక విధాలుగా సరిగ్గా పాత నిబంధన ఇశ్రాయేలీయుల వలే జీవించుదురు. కాబట్టి పాత నిబంధన కాలమువలే తన సంఘమునుండి సాతానును బయట ఉంచుటకు దేవుడు మరలా ఒక్క మనిషిపైనే అనేక పరిస్థితులలో ఆధారపడును.

ఎఫెసులో ఏమైయ్యిందో ఆలోచించండి: ఇతర సంఘములలో కంటే పౌలు అక్కడ ఎక్కువ సమయము గడిపెను. మూడు సంవత్సరముల పాటు అతడు ప్రతి దినము దేవుని సంకల్పమంతటిని అక్కడ బోధించెను (అపొ.కా. 20:31). సంఘములన్నిటిలో అది ఎక్కువ ఆధిక్యత గలదిగా ఉండెను. పౌలు వారికి వ్రాసిన పత్రికలో ఉన్న బోధనలయొక్క ఉన్నత ప్రమాణములు అది ఒక ఆత్మానుసారమైన సంఘమని కూడా సూచించుచున్నది. గనుక క్రొత్త నిబంధన జీవితములోనికి అనేకమంది విశ్వాసులు ప్రవేశించగలిగిన ఒక సంఘమున్నదంటే అది ఎఫెసులో ఉన్న ఈ సంఘమే. అయ్యో, కాని అలా కాలేదు. అక్కడున్న పెద్దలు కూడా అటువంటి జీవితములోకి ప్రవేశింపలేదు. వారిని విడిచి వెళ్లుచున్నప్పుడు పౌలు ఆ పెద్దలతో ఇట్లనెను, ''నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకు పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు''. ఎఫెసులో ఉన్న సంఘములో పౌలు వ్యక్తిగతముగా ఉన్నంతకాలము, ఏ తోడేలు దానిలోకి ప్రవేశింపలేకుండెను, ఎందుకనగా పౌలు మందయొక్క జాగ్రత్త వహించే కాపరిగా మరియు ప్రభువు మందిరము యొక్క మెలకువగల ద్వారపాలకునిగా ఉండెను. పౌలు అక్కడ ఉన్నంతకాలము, తమ స్వప్రయోజనాలను చూచుకొనే పెద్దలు శిష్యులను తమవెంట ఈడ్చుకొని వెళ్ళలేకపోయిరి. ఎందుకనగా, వారు పౌలు సమక్షములో శక్తిహీనులుగా ఉండిరి.

పౌలు ఆ పెద్దలయొక్క ఆత్మీయ స్థితిని ఎరిగియుండెను. గనుక అతడు ఎఫెసును వదిలి వెళ్ళినవెంటనే, ఆ సంఘము తోడేళ్ళచేతను, స్వప్రయోజనమును చూచుకొను పెద్దలచేత ఆక్రమింపబడునని దాని సాక్ష్యము చెరుపబడునని అతడు యెరిగియుండెను. ఎఫెసీయులకు వ్రాసిన రెండవ పత్రికను మనము చదివినప్పుడు (ప్రకటన 2:1-7), పౌలు ముందుగా చెప్పినట్లుగానే అక్కడి సంఘము దిగజారిపోయెనని మనము చూచెదము.

అయితే ఎఫెసులోని సంఘమును మూడేళ్ళపాటు పవిత్రతలో కాపాడినది ఎవరు? ఒక్క పౌలు మాత్రమే. సాతానుకు పౌలు మీద ఏ అధికారము లేకుండెను. మరియు అతనికి భయపడెను ఎందుకనగా పౌలు దేవుని సముఖము నందు నివసించెనని సాతాను ఎరిగియుండెను. కాని ఎఫెసులో ఉన్న ఇతర పెద్దలను చాలా సుళువుగా మోసగించవచ్చునని కూడా సాతాను ఎరిగియుండెను!

గత ఇరవై శతాబ్దాలుగా దేవుడు క్రైస్తవ లోకములో సత్యమును పునరుద్ధరించుటకు మొదలు పెట్టిన ఉద్యమాలన్నిటి కథ ఇదే విధముగా ఉండెను. దేవుడు పలానా సమయములో పలానా ప్రదేశములో, శతాబ్దాలుగా పాతిపెట్టబడియున్న తన వాక్యములోని సత్యములను సంఘమునకు పునరుద్ధరించుటకు ఒక వ్యక్తిని లేవనెత్తెను. దేవుడు ఆ వ్యక్తికి రహస్యముగా తర్ఫీదునిచ్చి అతనిని ఒక బహిరంగ పరిచర్య చేయుటకు ముందుకు తీసుకువచ్చును. ఎక్కువమంది విశ్వాసులు అతనిని ద్వేషించి, అతనిని మతభ్రష్టుడని పిలిచి, అతడు ఒక అబద్ధ ప్రవక్తయని తృణీకరించుదురు. కాని సత్యమును వినుటకు చెవులు గల కొందరు, దేవుని అభిషేకము ఎక్కడ ఉన్నదో గుర్తుపట్టగల కన్నులున్న కొందరు, ఆ వ్యక్తి దేవుడు ఏర్పరచుకొన్న వ్యక్తియని గుర్తించి అతనితో చేరుదురు. ఆ విధముగా ఆ కొద్దిమంది ద్వారా ఆ తరములో ప్రభువు కొరకు ఒక సాక్ష్యము లేవనెత్తబడును. ఆ మనుష్యుడు బ్రతికియున్నంతవరకు అంతా బాగానే ఉండును. కాని అతడు చనిపోయిన తరువాత, పరిస్థితులు క్షీణించుట మొదలగును. మరియు అతని సన్నిహితులైన సహపరిచారకులు కూడా మరణించిన తరువాత, ఆ గుంపు కొట్టుకొనిపోయి, మిగతా మత శాఖలవలే బబులోనులో ఒక భాగమైపోవును.

క్రైస్తవ చరిత్రలో ఒక్క నాయకుడు కూడా తాను ఎరిగినట్లు దేవుణ్ణి ఎరిగిన రెండవ తరము నాయకులను తయారు చేయలేక పోయెను. ఈ నాయకులలో ప్రతి ఒక్కరు తన తరములో దేవుడు తనకిచ్చిన తోటి పరిచారకులతో దేవుని కొరకు గొప్ప పని చేసారు (అపొ.కా. 13:36). కాని తరువాత తరములో, దేవుడు తన నామము కొరకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యమును నెలకొల్పుటకు ఎల్లప్పుడు ఒక నూతన ఆరంభమును చేయవలసివచ్చెను. ఇది క్రైస్తవ చరిత్ర అంతటిలో ప్రతి గుంపుకు జరిగెను.

కాని దేవునికి తన నామము కొరకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యము ప్రతి తరములోను కావలెను. ఆయన మన తరములో కూడా తన కొరకు ఒక సాక్ష్యము లేకుండా ఉండడు. ఈ తరములో దేవునికి పూర్తిగా అందుబాటులో ఉండుటకు నీవు వెల చెల్లించెదవా?

అధ్యాయము 19
నీవు తీసుకొనిన నిర్ణయాలే నీవు ఏ మగుదువో నిర్ణయించును

''నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని'' (యోహాను 6:38).

ప్రభువైన యేసు భూమి మీదకు ఎందుకు వచ్చెనో ఆయన మాటలలోనే ఇక్కడ చెప్పారు. మరియు ఈ ఒక్క వాక్యములోనే ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ప్రతి ఒక్క దినము ఎలా జీవించెనో వివరించబడియున్నది.

ప్రభువైన యేసు నజరేతులో జీవించిన ముప్పై సంవత్సరాల కాలమును మరుగుపరచబడిన సంవత్సరాలుగా చెప్తుంటారు.అయితే ఇక్కడ ఆయన ఆ ముప్పై సంవత్సరాలలో ప్రతిదినము ఏమి చేసెనో యేసు మనతో చెప్పుచున్నారు. అది ఆయన తన స్వంత చిత్తమును ఉపేక్షించుకొని తన తండ్రి చిత్తాన్ని చేసారు.

యేసుప్రభువు శాశ్వతకాలము నుండి పరలోకములో తన తండ్రితో కలసి ఉన్నప్పుడు ఎప్పుడైనను ఆయన చిత్తమును ఉపేక్షించుకోవాల్సిన అవసరం లేకుండెను. ఎందుకంటే ఆయన చిత్తము మరియు తండ్రి చిత్తము ఒక్కటిగా నుండెను. కాని, ఆయన మన శరీరము వంటి శరీరముతో ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆ శరీరము ప్రతి విషయంలో తండ్రి చిత్తమునకు సంపూర్తిగా వ్యతిరేకమైన స్వంత చిత్తమును కలిగియుండెను. అందువలన యేసు తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తన స్వంత చిత్తమును అన్ని వేళలా ఉపేక్షించుకొనుట ఒక్కటే మార్గము. ఈ సిలువను యేసు తాను ఈ లోకములో జీవించినంత కాలము భరించెను. అది ఆయన స్వంత చిత్తమును సిలువవేయుట. మనము ఆయనను వెంబడించాలంటే, మనము కూడా దీనిని ప్రతిదినము భరించవలసియున్నదని ఇప్పుడు ఆయన మనలను అడుగుచున్నాడు.

ఎల్లప్పుడు తన చిత్తమును ఉపేక్షించుకొనుట అనునది యేసును ఒక ఆత్మానుసారమైన వ్యక్తిగా చేసెను. మరియు మనము ఎల్లప్పుడు మన స్వంత చిత్తమును ఉపేక్షించుకొనుట అనునది మనలను కూడా ఆత్మానుసారమైన వారలనుగా చేయును.

ప్రతి దినము మనము వేరు వేరు విషయాలను గూర్చి నిర్ణయములు తీసుకొనెదము. మన ధనాన్ని ఎలా ఖర్చుచేయాలని లేక మన ఖాళీ సమయాన్ని ఎలా వాడుకోవాలని లేక ఎవరితోనైనా లేక ఎవరి గూర్చియైనా ఎలా మాట్లాడాలని లేక ఒక ఉత్తరం ఎలా వ్రాయాలని లేక వేరొకరి ప్రవర్తన విషయంలో ఎలా స్పందించాలని లేక ప్రార్దనలో కాని, వాక్యము ధ్యానించడంలో కాని ఎంత సమయం వినియోగించాలని లేక సంఘానికి పరిచర్య చేయుటలో ఎంత సమయం వినియోగించాలని మొదలైన విషయాలలో మనము నిర్ణయాలు తీసుకొంటు ఉంటాము. మనము మనచుట్టూ ఉన్న ప్రజల యొక్క చర్యలకు మరియు మాటలకు మరియు ప్రవర్తనలకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రతిస్పందిస్తూ ఉంటాము. మనము గ్రహించకపోయినా, మనము ప్రతి దినము కనీసం ఒక వంద నిర్ణయాలైనా తీసుకొంటూ ఉంటాము. మనము తీసుకొనే ప్రతి నిర్ణయములో మనము దేవునినైనా లేక మనలను మనమైనా సంతోషపరచుటకు నిర్ణయించుకొందుము.

మనము చేసే అనేక చర్యలు మనము తెలిసి తీసుకొన్న నిర్ణయాల యొక్క ఫలితముకాదు. అయినా వాటిని ఈ రెండు విధాలుగా చేయుదము. మనలను మనము సంతోషపర్చుకోవటానికైనా చేయుదము లేక దేవుని సంతోషపర్చుటకైనా చేయుదము. మనము అనుకోకుండా చేసే పనులు మనము అనుకొని చేసుకొన్న నిర్ణయాలచేత నిర్ణయించబడును. చివరకు మనము తీసుకొనిన ఆ నిర్ణయాలు అన్నీ కలసి మనము ఆత్మానుసారమైన వారిగా తయారౌదుమో లేక లోకానుసారమైన వారిగా తయారగుదుమో అను దానిని నిర్ణయించును.

మనము మొదట క్రీస్తులోనికి మారినప్పటి నుండి మనము తీసుకొనిన లక్షల కొలదీ నిర్ణయాలను గూర్చి ఆలోచించండి. ఎవరైతే తెలిసి ఎల్లప్పుడు మానక ప్రతిదినము అనేకమార్లు వారి స్వంతచిత్తమును వదులుకొని దేవుని చిత్తమును చేసిరో, వారు ఆత్మానుసారమైన వారుగా మారిరి. దానికి బదులు వేరొక ప్రక్క ఎవరైతే కేవలం వారి పాపములు క్షమింపబడుట యందు మాత్రమే ఆనందించుదురో, దానిని బట్టి ఎవరైతే ఎక్కువగా వారిని వారు సంతోషపర్చుకొనుటకు యిష్టపడుదురో వారు శరీరసంబంధులుగానే ఉండిపోవుదురు. ప్రతి వ్యక్తి నిర్ణయాలు చివరికి అతడేమయ్యెనో నిర్ణయించెను.

నీవు ఈ రోజున ఇంత వినయముతో, పరిశుద్ధతతో, ప్రేమతో ఉన్నావంటే అది గత సంవత్సరాలలో వేరు వేరు పరిస్థితులలో నీవు తీసుకొనిన వేలకొలది నిర్ణయాల ఫలితమే.

ఆత్మానుసారముగా ఉండుట అనేది ఒక్కసారి దేవుని ఎదుర్కొనుట వలన వచ్చునది కాదు. అది మన స్వంత చిత్తమును వదులుకుంటూ మరియు దినదినము వారం తరువాత వారం మరియు సంవత్సరం తరువాత సంవత్సరం మానక ఎల్లప్పుడు దేవుని చిత్తమును చేయుట యొక్క ఫలితము.

క్రీస్తులోనికి ఒకే దినమున మారిన ఇద్దరు సహోదరులు పది సంవత్సరాల తరువాత ఎలా ఉన్నారనే విషయమును ఆలోచించండి. ఒకడు ఆత్మీయ వివేచన కలిగి పరిపక్వత చెందినవాడై సంఘములో దేవుని చేత భాధ్యత అప్పగింపబడిన వానిగా ఉన్నాడు మరియొకడు వివేచన లేకుండాయుండి, ఇంకా ఒక చిన్న బిడ్డ వలె, ఎల్లప్పుడు ఇతరులచే పోషింపబడుతు, ఇతరులచే ప్రోత్సాహము పొందువాడుగా ఉన్నాడు. వీరిరువురిలో అటువంటి వ్యత్యాసాన్ని తీసుకువచ్చినదేమిటి? దానికి జవాబు వారు గత పది సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ప్రతి దినము వారు తీసుకొనిన చిన్న చిన్న నిర్ణయములే. వారు అలాగే కొనసాగినట్లయితే, మరొక పది సంవత్సరాల కాలంలో వారి మధ్య నున్న వ్యత్యాసము ఇంకా తేటపర్చబడుతుంది. మరియు నిత్యత్వములో వారి మహిమ యొక్క వ్యత్యాసము రెండువేల వాట్ల బల్బుకు ఐదు వాట్ల బల్బుకు మధ్య ఉన్న తేడాగా ఉండును. ''మహిమను బట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదము కలదు'' (1కొరిందీ¸ 15:41).

నీవు ఒక ఇంటిని దర్శించి అక్కడ మాట్లాడుచున్నప్పుడు, అక్కడ లేని ఒక సహోదరుని (నీవు ఇష్టపడని వానిని)గురించి వ్యతిరేకముగా మాట్లాడటానికి నీవు శోధింపబడ్డావనుకో, నీవు ఏమి చేయుదువు? నీవు ఆ శోధనకు లోబడిపోయి అతడి గూర్చి కొండెములు మాట్లాడుదువా? లేక నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ నోటిని మూసుకొని ఉందువా? ఎవ్వరు కూడా చెడు మాట్లాడినంత మాత్రాన దేవుడు వారిని కుష్టురోగముతోనో, క్యాన్సరు రోగముతోనో మొత్తలేదు. గనుక అటువంటి పాపము వారి జీవితాలను నాశనము చేయదని చాలా మంది అనుకొందురు. అయ్యో! కేవలము నిత్యత్వములోనే అనేకులైన సహోదరులు మరియు సహోదరీలు, ఏవిధముగా వారిని వారు సంతోషపర్చుకొన్న ప్రతిసారి, వారిని వారు మరికొంచెం నాశన పర్చుకొన్నారో తెలిసికొందురు. వారు భూమిపై వారి జీవితములను వ్యర్థపరచుకొనిన వైనాన్ని బట్టి వారు విచారించెదరు. ప్రభువైన యేసు కూడా అటువంటి పరిస్థితులలోనే నజరేతులో 30 సం.లు శోధింపబడెను. ఆ మరుగు పరచబడిన సంవత్సరాల గూర్చి ఆయన ఎప్పుడూ ''తన్ను తాను సంతోషపరచుకొనలేదు''అని వ్రాయబడెను ( రోమా 15:3). ఆయన ఎల్లప్పుడు తన్నుతాను ఉపేక్షించుకొనెను. ఆవిధముగా ఆయన తండ్రిని అన్ని సమయములయందు సంతోషపరచెను.

ఒకరి జీవితములో తననుతాను సంతోషపరచుకొనుట అనేది అనేక విషయములలో జరుగును. ఉదాహరణకు తినుట విషయము. నీకు ఆకలి లేకపోయినా, కొంత సొమ్మును రుచిగల పదార్థముల తినుటకొరకు ఖర్చుపెట్టు పరిస్థితిని ఆలోచించుము. అలా చేయుటలో నిజానికి పాపముకాని తప్పుకాని లేదు. కాని అది ఒకవిధమైన జీవిత విధానమును సూచిస్తున్నది. నీకు డబ్బు ఉంది కాబట్టి, నీకు అవసరముండినా లేకపోయినా నీకిష్టమైన వాటిని నీవు కొనుక్కొనెదవు. నిన్ను సంతోషపరచు వాటిని నీవు చేయుదువు. నీకు ఎక్కడికో వెళ్ళాలనిపిస్తే నీవు వెళ్ళెదవు. నీవు ఆలస్యంగా నిద్ర పోవాలనుకుంటే నీవు ఆలస్యంగా నిద్రించెదవు. నీవు క్రమముగా క్రైస్తవకూటములకు వెళ్ళినా, నీ బైబిలు ప్రతి దినము చదివినా, అటువంటి జీవితము యొక్క చివరి ఫలితమేమిటి? నీవు నీ రక్షణను పోగొట్టుకొనక పోవచ్చును. కాని, దేవుడు ఆయన కొరకు జీవించటానికి నీకిచ్చిన ఒకే ఒక జీవితాన్ని నీవు తప్పనిసరిగా వ్యర్థపుచ్చుకొందువు.

అయితే వేరొక సహోదరుడు వేరొక విధముగా జీవించును. అతడు తన శరీరమును క్రమశిక్షణ చేసుకొనుటకు నిర్ణయించుకొనును. అతడు ఆకలి గొననప్పుడు ఏమియు అనవసరముగా తినకూడదని నిర్ణయించుకొనును. ఎల్లప్పుడు తన కొరకు అనవసరమైన వస్తువులు కొనకూడదని నిర్ణయించుకొనును. అతడు ప్రతిదినము దేవునితో గడుపుటకై 15 నిమిషములు ముందుగా నిద్రనుండి లేవాలని నిర్ణయించుకొనును. ఎవరైనా తనతో కోపముగా మాట్లాడినపుడు వారితో నెమ్మదిగా మాట్లాడాలని నిర్ణయించుకొనును. అతడు ఎల్లప్పుడూ ప్రేమ, మంచితనములోనే నిలిచి యుండాలని నిర్ణయించుకొనును. అతడు వార్తాపత్రికలలో తన శరీర కోర్కెలను రేకెత్తించే కొన్ని వార్తలను చదువకూడదని నిర్ణయించుకొనును. అతడు ప్రతి పరిస్థితిలో తనను తాను తగ్గించుకొని యుండుటకును మరియు తనను తాను సమర్ధించుకొనకుండుటకును నిర్ణయించుకొనును. అతడు తనను లోకము వైపు ఆకర్షించే కొన్ని స్నేహాలను విడిచిపెట్టుటకు నిర్ణయించుకొనును. అదే సమయములో వీటన్నింటినీ చేయువారిని చూచి వారిని తీర్పు తీర్చకూడదని అతడు నిర్ణయించుకొనును. ఎల్లప్పుడు తన స్వంత చిత్తమును(తనను సంతోషపెట్టువాటిని) ఉపేక్షించుకొనుట వలన దేవుని మాత్రమే సంతోషపెట్టవలెనన్న తన కోరికను బలపరచుకొనును.

అతడు ఆ అనవసరమైన వస్తువులు కొనుట మానుట ద్వారా లేక నిద్రనుండి 15 నిమిషములు ముందు లేచుట ద్వారా లేక మానవ పరమైన ఆత్మగౌరవాన్ని వదులుకొని క్షమాపణ అడుగుట ద్వారా ఏమి పోగొట్టుకొనెను? ఏమీలేదు. కాని, వాటి వలన అతడు పొందుకొన్నదేమిటో ఆలోచించండి. అటువంటి వ్యక్తి చిన్న విషయాలలో ఎల్లప్పుడు నమ్మకముగా ఉండుట ద్వారా కొద్ది సంవత్సరాల కాలములో నమ్మదగిన దైవజనుడిగా మారును. అది అతనికున్న బైబిలు జ్ఞానము వలన కాదుగాని తన్నుతాను సంతోషపెట్టుకొనక దేవుని సంతోషపరచవలెనని అతడు చిన్న విషయాలలో నమ్మకముగా నిర్ణయములను తీసుకొనుట వలననే. అందువలన బలహీన మనస్కులు కాకుండుడి. అన్ని సమయాల్లో దేవునిని సంతోషపరచువారిగా మీ మనస్సును అభ్యాసము చేయండి. ''అభ్యాసము చేత (వారి యిష్టాలను ఎన్నో సంవత్సరాల నుండి సరియైన దిశగా ఉంచుటకు అభ్యాసము చేసికొన్నవారు) మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నవారు'' (హెబ్రీ 5:14), ఎవరో వారే పరిపక్వత చెందిన క్రైస్తవులు.

ఒక దృష్టాంతమును ఆలోచించుడి: ఇద్దరు బరువైన వ్యక్తులు తమ బరువు తగ్గించుకొనుటకు ఒక వైద్యుని యొద్దకు వెళ్లిరి. తరువాత 12 నెలలు చేయవలసిన వ్యాయామములను ఆ వైద్యుడు వారికిచ్చెను. ఒక వ్యక్తి ప్రతి రోజు ఆ వ్యాయామములను క్రమం తప్పకుండా చేసి బరువు తగ్గి బలమైన వానిగా మారెను. వేరొక వ్యక్తి ఆ వ్యాయామములను మొదటి కొద్ది రోజులు చేసి తరువాత బద్దకించి వాటిని చేయుట పూర్తిగా మానివేసెను. అతని క్రమశిక్షణ లేని విధానముల వలన అతడు బరువు పెరుగుతూ పొయి చివరకు అకాలముగా మరణించెను. దేవుని చిత్తమును చేయుటకు మన చిత్తములను ఎలా బలపరచుకోగలమో లేక వాటిని అపవాది పీడించుటకు ఎలా బలహీనపరచుకోగలమో అనుదానికి ఇది ఒక దృష్టాంతముగా నున్నది.

ఒకసారి ఒక యౌవనస్తుడైన దైవసేవకుడు ఎక్కువగా టి.వి. చూస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. (నిజానికి అతడు కేవలం మంచి కార్యక్రమములే చూసేవాడు). అందువలన అతడు ఆ టి.వి.ని అమ్మివేయాలని మాత్రమే కాక, ఆ టి.వి. చూసే సమయాన్ని ప్రార్థనలో గడపాలని ఒక రోజున నిర్ణయించుకొన్నాడు. అతడు తీసుకొన్న ఆ చిన్న నిర్ణయము వలన మరియు దానిని కొనసాగించుటవలన అనేక వేల మంది ఆశీర్వదింపబడిన పరిచర్యను దేవుడు అతడికిచ్చినట్లుగా నేను చదివాను.

టి.వి. చూస్తు సమయాన్ని ఏమి వ్యర్థపుచ్చుట లేదు అనుకొనేవారికి దేవుడు గొప్ప విషయాలను అప్పగింపడు. ఎందుచేతనంటే ఆయనను ఆసక్తిగా వేదికే వారికి ఆయన బహుమానమిచ్చును మరియు ఆయనలో పక్షపాతమేమి లేదు. అవును, ఈనాడు నీవు ఉన్నస్థితి గతములో నీవు తిండి, ఖర్చు, నిద్ర, చదువుట మొదలైన వాటి విషయాలలో నీ యిష్టాన్ని నీవు వదులుకొనుటకు లేక నిన్ను నీవు సంతోషపర్చుకొనుటకు నీవు తీసుకొన్న అనేకమైన చిన్న చిన్న నిర్ణయాలే కారణము.

కాలం చాలా వేగముగా గతించి పోతున్నది. ఇప్పటివరకు తమను తాము సంతోషపరచుకొనుచూ జీవించిన 40 సంవత్సరములు దాటిన వారు ఇప్పుడు దేవుని కొరకు ఎక్కువ ఏమి చేయుటకు ఆశించలేరు. ఎందుకంటే వారి జీవితాల్లో శ్రేష్టమైన సంవత్సరాలను వారు వ్యర్థపరచిరి. సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా వాటిని నీకు తిరిగి ఇవ్వలేడు. ఆ గతించిన సంవత్సరాలన్ని వెళ్ళిపోయాయి. అవి ఎప్పటికీ వెళ్ళిపోయినట్లే. కాని ఇప్పటికైనా నీవు పశ్చాత్తాపపడితే, నీకు మిగిలిన సగము జీవితములోనైనా దేవునికి ఉపయోగకరముగా ఏదైనా నీవు చేయగలుగుదువు.

అయితే నేను ప్రధానంగా ఎవరైతే యుక్తవయస్సులో, 13-29 సంవత్సరాల మధ్య ఉన్నారో వారితో మాట్లాడాలనుకొనుచున్నాను. మీరు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండేలా దేవుడు మిమ్ములను దీవించాలని ఆశిస్తున్నాడు. మీకు 30-35 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి ఆయన సంఘములో మీకు ఒక ప్రాముఖ్యమైన పరిచర్యను అప్పగించాలని ఆయన ఆశిస్తున్నాడు. కాని, ఆయన యిష్టాన్ని నీ జీవితములో నెరవేర్చునట్లు రాబోవు సుమారు 10 సంవత్సరాల కాలములో నీ జీవితములో ఆయన నిన్ను నమ్మకమైన వానిగా కనుగొనునా?

ఇప్పటి వరకు నీ గత జీవితములో ఎంతగా విఫలమైనా నీవు ఇప్పటినుండి నమ్మకముగా నుండుటకు నిశ్చయించుకొనినట్లయితే నిత్యత్వములో నీకు విచారించాల్సిన అవసరముండదు. అందువలన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. యేసు నజరేతులో శరీరధారియై యున్నప్పుడు ఎలా జీవించారో ఆలోచించుకొని, ఆ మాదిరిని అనుసరించు. ''నేను ఈ లోకములో పుట్టినది నా స్వంత యిష్టాన్ని వదులుకొనుటకు మరియు పరలోకపు తండ్రి చిత్తమును చేయుటకు'' అని నీకు నీవు చెప్పుకొనుము.

ఇప్పుడు నేను మీకు చెప్పేది మీరు తీవ్రముగా తీసుకొనుటకు సాతాను అనుమతించునని అనుకొంటున్నారా? లేదు. ఇంకా చాలా సమయముందని అతడు మీకు చెప్పును. నీ స్వంత యిష్టాలను వదులుకొని జీవించే అటువంటి జీవితం గొప్ప భారముతో కూడినదని అతడు మీతో చెప్పును. మీరు సంతోషముగా జీవిస్తూ ఉంటే, ఇక్కడా,అక్కడా కొంచెంగా మీ కోర్కెలను తీర్చుకొంటుంటే దేవుడు పెద్దగా పట్టించుకొనడని అతడు మీతో చెప్పును. ఇటువంటి విషయాలను తేలిగ్గా తీసుకొనుడి అను విషయాలను అతడు మీతో చెప్పును. ఎందుకు ఇలా చెప్పును? రాబోవు 20 సంవత్సరాలు నీకు ఒక గురి లేకుండా అటూ ఇటూ తిరిగి, అంతా అయిపోయిన తరువాత నీవు నిద్రలోనుండి లేచినట్లు లేవాలని అతడి ఉద్దేశ్యం.యౌవనస్తులారా, సాతాను వలన మోసపోకండి. దేవుడు మీకు ఒకే ఒక జీవితాన్నిచ్చాడు. మరియు కాలము చాలా వేగంగా గడిచిపోతున్నది. దానిని వ్యర్థపరచకుడి.

నీ చుట్టు అటువంటి క్రమశిక్షణ మరియు పూర్ణహృదయముతో జీవించే జీవితము యెడల ఆసక్తిలేని వారు కావల్సినంత మంది విశ్వాసులు నీకు కనబడుదురు. వారిని తీర్పు తీర్చవద్దు. నీవు ఒక పరిసయ్యుడుగా మారి వారిని తృణీకరించవద్దు. నీ స్వంత విషయాలను నీవు చూసుకొంటూ ఇతరుల విషయాలలో జోక్యం చేసుకొనకుము. వారి గూర్చి శ్రేష్టమైన వాటిని ఆలోచించుము మరియు వారి మట్టుకు వారిని ఉండనీయుము. అదే సమయములో వారి మాదిరిని అనుసరించకుము. నీవు వేరుగా ఉండుము. యేసు మాత్రమే నీకు మాదిరిగా ఉండనిమ్ము. నీ జీవితములో నీకు ఒక పిలుపు ఉన్నది. మరియు నీవు దానిని పోగొట్టుకొనకూడదు. దానికి బదులుగా ఈ లోకానికి సంబంధించినది ఏది పోయినా పర్వాలేదు. క్రీస్తు తీర్పు సింహాసనము యెదుట నీ జీవితము గూర్చి లెక్క అప్పగించవలసిన ఆ తీర్పు దినము గూర్చి తరచు ఆలోచిస్తూ ఉండుము.

గనుక ఇంతవరకు నీ జీవితములో చేసిన తప్పిదాలన్నిటిని మర్చిపొమ్ము. నీ పాపముల గూర్చి సంపూర్తిగా పశ్చాత్తాపము చెందుము. మరియు రాబోవు దినాలలో పూర్ణ హృదయముతో నుండుము. దేవుడు నిన్ను క్షమించి నీ గతాన్ని తుడిచివేయును. నీ గత వైఫల్యాల గూర్చి ఇప్పుడు ఉదాసీనముగా ఉండకుము, అలా ఉండినట్లయితే నీవు భవిష్యత్తులో కూడా ఇంకా ప్రక్కకు తొలగిపోదువు. నీ గత వైఫల్యాల యొక్క జ్ఞాపకములు, ఇప్పుడు నీవు ఏమయి వున్నావో ఆ జీవితము కేవలము దేవుని కృప వలన మాత్రమే జీవించగలుగుతున్నావని నీవు గుర్తించేలా చేయును. అంతే కాకుండ అవి నీ ముఖాన్ని దేవుని యెదుట ఎల్లప్పుడు దూళిలో ఉంచుకొనేలా చేయును. నీవు నిజమైన దైవజనునిగా లేక దైవజనురాలిగా మారాలని నిశ్చయించుకొనుము.

అధ్యాయము 21
దేవునికి సహాయపడుట

మనము మానవరీతిగా అర్థము చేసికొనిన దానినిబట్టి మానవ ఆలోచనను ఉపయోగించి దేవునికి సహాయము చేయుటకు ప్రయత్నించునప్పుడు దేవుని యొక్క పనిలోను మరియు మన స్వంత జీవితములలో ఎంతో గలిబిలిని సృష్టించుకొందుము.

దేవుడు అబ్రాహాముతో ''నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము, నీ సంతానము అలాగవును....అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు....శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను...హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనెను...అబ్రాహాము- ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకనను గ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు- నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును...అతని తరువాత అతని సంతానము కొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను'' (ఆది 15:5; 16:1,3,16;17:18,19) అని చెప్పెను.

అబ్రాహాము సంతానము నక్షత్రముల వలె లెక్కింపజాలనంతగా నుండునని దేవుడు వాగ్దానము చేసెను. అయినప్పటికి శారా గొడ్రాలుగా నుండెను. వాగ్దానము నెరవేరనట్లయితే దేవుని యొక్క నామమునకు అవమానము కలుగునని అబ్రాహాము మరియు శారా కూడా భయపడియుందురు. గనుక శారా సలహాతో అబ్రాహాము మరియొక భార్యను తీసుకొనెను. మరియు దేవునిని యిబ్బందికరమైన పరిస్థితి నుండి తప్పించుట కొరకు ఆమె ద్వారా ఒక కుమారుని కనెను.

అక్కడ అబ్రాహాము అర్ధము చేసికొనినదేమంటే, దేవునికి అతడి యొక్క సహాయము అక్కర్లేదనే విషయము. దేవునికి అతడు చేశాననుకొనిన సహాయము (ఇష్మాయేలును కనుట) చివరకు తన భార్యకే కాక, తన కుమారుడైన ఇస్సాకునకు మరియు అతని సంతానమునకు సమస్య కలుగజేసాడు.

మన సహాయము లేకుండా దేవుని వాగ్దానములు నెరవేరవని ఎంత తరచుగా మనమను కొందుము. గనుక మనలను ఏదైనా చెయ్యమని దేవుడు చెప్పకపోయినా మనము చేయుదుము. మనము దేవుని పని చేయుటకు మనము మానవ నిర్మితమైన ప్రణాళికలు మరియు ప్రయత్నములపై నమ్మిక యుంచుదుము. మరియు దేవుని యొద్ద మనము వేచియున్నట్లయితే, ఆయన మనలను నడిపించును అని తగినంతగా నమ్మలేకపోవుచున్నాము.

యేసుప్రభువు ఆయన జీవితములో ఎప్పుడు తన తండ్రియొక్క చిత్తమును మరియు నడిపింపును వెదకకుండా ఏమియు చేయలేదు (యోహాను 5:19,30). అనేకమంది విశ్వాసులు దేవుని నడిపింపుకంటె తమపై తమకే నమ్మకముండుట చేత దేవునియొక్కచిత్తమును మరియు నడిపింపును ఆ విధముగా వెదకరు.

మనము తీసుకొనే నిర్ణయములో ప్రార్ధనా జీవితపు లోటు మరియు మన స్వంత జ్ఞానముపై ఆధారపడుట (లేక అబ్రాహాము విషయములోవలె మన భార్య యొక్క వివేకముపై ఆధారపడుట) అనునవే మన కుటుంబములలో మరియు దేవుని యొక్క పనిలోను గలిబిలిని కల్పించును.

''యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను...నీవు ఆ బండతో మాటలాడుము. అది నీళ్ళనిచ్చును....అప్పుడు మోషే తనచెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా......అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను'' (సంఖ్యా 20:7-13).

దేవుడు ఈసారి ఆ రాతితో కేవలము మాట్లాడమని మాత్రమే మోషేను అడిగెను. కాని మోషే రాతిని రెండుమారులు కొట్టుట ద్వారా దేవునికి సహాయము చేయవలెనని అనుకొనెను. ఒకసారి మృదువుగా మాటలాడుట కంటె మన శరీరము రెండుసార్లు గట్టిగా కొట్టును అను మాట ఎంత సత్యమైన విషయము. దేవుడు మనలను సాత్వికముతో నుండుమని ఆజ్ఞాపించినా సరే (మత్తయి 11:28), కొంచెము మానవపరమైన కరిÄనత చూపినట్లయితే దేవుని పని మరికొంచెము త్వరగా జరుగునని మనమనుకొందుము. కాని ఆయన యొక్క అనుగ్రహము ద్వారా దేవుడు జనులను మారుమనస్సు లోనికి నడిపించును(రోమా 2:4).

దేవుడు అంతకు మునుపు ఒకమారు రాతిని కొట్టమని అడుగుట వలన (నిర్గమకాండము 17:6), ప్రతిమారు అట్లే చేయవలెనని కూడా మోషే అనుకొని యుండవచ్చును. పరిశుద్ధాత్ముడు ఇంతకుముందు లేక వేరొకచోట చేసినట్లే ఆయన ఎప్పుడు పని చెయ్యాలని అనేకులు అనుకొందురు. గనుక వారు ఉజ్జీవము తెచ్చుటకు, స్వస్ధతలు కలుగుటకు మరియు జనులు అన్యభాషలలో మాటలాడుటకు మానసిక చిట్కాల ద్వారా ఆయనకు సహాయపడవలెనని అనుకొందురు. వారు అర్ధము చేసికొననిదేమంటే, పరిశుద్ధాత్మ వేరు వేరు సమయములలో వ్యత్యాసముగా పనిచేయును అను విషయము మరియు ఆయన యొక్క వరములను కనపరచుటకు ఏ విధమైన మానసిక సహాయము అవసరములేదను విషయము.

''ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను'' (2 సమూయేలు 6:6,7).

ఉజ్జా ఉద్దేశ్యములు మంచివే. అతడు దేవుని యొక్క సాక్ష్యపు మందసము జారిపడకుండా కాపాడవలెనని నిజముగా ఆశించెను కాని అతడు లేవీయుడు కాడు, గనుక మందసమును తాకుటకు అతడికి హక్కులేదు. అతడు తన పరిధి దాటి బయటకు వెళ్లెను. ఇది దేవుడు మొత్తేటంతటి తీవ్రమైన విషయం. దేవుని యొక్క ఆజ్ఞలను మనము చిన్న విషయముగా తీసుకొనకూడదు.

సంఘములో కూడా దేవుడు వేరు వేరు బాధ్యతలను వేరు వేరు వ్యక్తులకిచ్చి ఒక్కొక్కరి చుట్టూ గిరిగీయును, మనము ఒక విషయములో ఒకలోటును చూచినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుట ద్వారా దేవునికి సహాయపడవలెనని చూచినట్లయితే మొదట అట్లు చేయుటకు ఆత్మ మనలను ప్రేరేపించు చున్నడా లేక మన మానవ పరమైన ఆలోచన దానిగూర్చి ఏదోఒకటి చేయునట్లు ప్రేరేపించుచున్నాడా అనునది చూచుకొనవలెను. మనము గౌరవించక పోయినా దేవుడు ప్రతివారి చుట్టూ ఉండిన పరిధులను గౌరవించును. ఆయన మనచుట్టూ గీసిన పరిధిని మించి మననుండి దేవునికి ఏ సహాయము అక్కర్లేదు. కేవలము ఆ పరిధులలోనే మనము దేవునిని కనుగొనగలము (అపొ.కా.17:26,27 చూడండి). వాటికి బయట మనము సాతానును మాత్రమే కనుగొనగలము (ప్రసంగి 10:8 చూడండి).

పైన చూచిన ఉదాహరణలలో నున్న సూత్రములను మన జీవితములకు అనేక విధములుగా అన్వయించుకొనవచ్చును. మన స్వంత జీవితములకు మరియు పరిచర్యకు సంబంధించి ఈ విషయములో వెలుగు నిమ్మనమని మనము దేవుని అడుగుదుము.

అధ్యాయము 22
మెల్కీసెదెకు యొక్క పరిచర్య

''నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు'' (హెబ్రీ 7:17).

మెల్కీసెదెకు ఒక అజ్ఞాత వ్యక్తి-కాని దేవునిని సన్నిహితముగా ఎరిగిన వ్యక్తి. అబ్రాహాము యుద్ధము నుండి తిరిగి వచ్చుచున్నప్పుడు అతడు అబ్రాహామును కలుసుకొని అతనిని ఆహారముతోను, దేవుని నుండి ఒక మాటతోను దీవించెను (ఆదికాండము 14:14-20). అబ్రాహాము అలసియుండెను మరియు జయము సాధించిన తరువాత ఉప్పొంగిపోయే గొప్ప ప్రమాదములో నుండెను. అతడు యుద్ధములో చెరపట్టిన సొదొమ రాజు యొక్క ఆస్థిని ఆశించే ప్రమాదములో కూడా నుండెను. కాని దేవుడు తన అలసిపోయిన శరీరమునకు విశ్రాంతి కలుగజేయుటకు ఆహారముతోను, తన ఆత్మ గర్వముతోను దురాశతోను అపవిత్రపరచబడకుండా ఉండుటకు ఒక మాటతోను మెల్కీసెదెకును పంపెను. మెల్కీసెదకు అబ్రాహాముతో ''ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు దేవుడు నీ శతృవుల మీద నీకు జయము నిచ్చెను, ఆయన స్తుతింపబడును గాక'' అని చెప్పెను. అతడు ఒక సుదీర్ఘమైన 7 అంశాలు గల ప్రసంగమును అతనికి బోధించలేదు. లేదు అతడు ఒక్క వాక్యమునే మాట్లాడెను కాని అది అబ్రాహాము యొక్క అవసరతను తీర్చిన ప్రవచనాత్మకమైన వాక్యము.

ఆ ఒక్క వాక్యము ద్వారా, దేవుడే అతనికి విజయమునిచ్చినందున అతడు తన్నుతాను ఘనపరచుకోకూడదని అబ్రాహాముకు గుర్తుచేసెను. తన దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. గనుక, విజేతలు సాధారణముగా చేసినట్లు అతడు యుద్ధములో కొల్లగొన్న వస్తువులలో వేటిని తీసుకోవలసిన అవసరము లేదని కూడా గుర్తుచేసెను. కొద్ది నిమిషాల తరువాత, అబ్రాహాము సొదొమ యొక్క రాజును కలిసినప్పుడు, మెల్కీసెదెకు చెప్పిన ఆ మాటలు సరియైన దానిని చేయుటకు అతనికి సహాయపడెను. తన దేవుడు ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయైనందున కొల్లగొన్న వాటిలో నుండి ఒక నూలు పోగునైనను తీసుకొననని అతడు సొదొమ రాజుతో చెప్పెను (ఆదికాండము 14:22-24). యేసు ఇప్పుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకునిగా నియమింపబడెను. మనము అదే క్రమము చొప్పున యాజకులుగా ఉండి-ఈ మెల్కీసెదెకు పరిచర్యను నెరవేర్చవలెను.

మెల్కీసెదెకు ఏ విధముగా ఎటువంటి ప్రదర్శన, ఆర్భాటము, ప్రచారము, ప్రకటన లేకుండా నెమ్మదిగా కనబడి అబ్రాహాముకు అవసరమైనవే అతనికిచ్చెనో ఆలోచించండి. అవి తన శరీర అవసరతలు కొరకు ఆహారమును, అబ్రాహామును గర్వమునుండి, దురాశనుండి రక్షించుటకు తగిన వాక్యము. అబ్రాహాము యొక్క అవసరతను తీర్చిన తరువాత, అతడు వచ్చినంత నెమ్మదిగానే వెళ్లిపోయెను. మనమందరము ఆశించవలసిన పరిచర్య ఇదే- అవసరతలోనున్న వారిని నెమ్మదిగా దీవించి మనకొరకు మనము ఎటువంటి ఘనత, ప్రశంస, కృతజ్ఞత, ప్రచారము వంటివి ఆశించకుండా వెళ్లిపోవుట.

ప్రజలు, వారు జీవించి పనిచేయు లోకములో ఉన్న పోరాటములలో అలసిపోయి, శోసించిన స్థితిలో సంఘము యొక్క కూటములకు వచ్చెదరు. విశ్వాసులకు విశ్రాంతి నిచ్చి వారిని సేద దీర్చేడి ఆత్మీయ ఆహారము, పోషణ వారు పొందునట్లు సంఘములో మెల్కీసెదకు వలే ప్రవచించుట ఎంత అద్భుతమైన విషయము. వారి జీవితమును సుఖవంతముగా చేయుటకు వారికి అవసరమైనప్పుడు వారికి ఆచరణాత్మకమైన, భూసంబంధమైన విషయాలలో సహాయపడగలుగుట ఎంత ధన్యకరమైన విషయము. కొంత మంది సహోదరులు తమ గురించి తాము గొప్ప అభిప్రాయములు కలిగియుండి తమ సంఘ కూడికలలో సుదీర్ఘ సమయములు మాట్లాడిచెప్పుటకు బహు తక్కువ సారాంశమును కలిగియుండుట విషాదకరము. అటువంటి సుదీర్ఘమైన విసుగు పుట్టించే ప్రసంగములు కూటములోనికి మరణమును తెచ్చును. అయితే మరోప్రక్క ప్రతి కూటములోను సహోదరులకు, సహోదరీలకు సరియైన వాక్యమును ప్రవచనాత్మకమైన వాక్యమును కలిగియుండుట ఎంత అద్భుతమైన విషయము. కాని ఇలా మనము ప్రవచించాలంటే మనము రహస్యముగా దేవునికి బలులు అర్పించిన యాజకులుగా మరియు నిర్మలమైన మనస్సాక్షితో అన్ని సమయములయందు దేవునితో సంబంధముకలిగిన వారుగా ఉండవలెను. దేవునికి పక్షపాతము లేదు. సంఘములో ప్రతి సహోదరుడు, సహోదరి మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకులుగా ఉండి ప్రవచింపవలెనని ఆయన కోరుకొనుచున్నాడు (అపొ.కా. 2:17,18; 1కొరిందీ¸ 14:31).

మీరు ఒక యాజకునిగా మీకున్నదంతయు బలిపీఠము మీద పెట్టుటకు సిద్ధపడిన యెడల ప్రవచించుటకు వాంఛ కలిగిన యెడల మీ సహోదరుల, సహోదరీల మేలు విషయములో మీకు చింతయుండిన యెడల దేవుడు ప్రతి కూటములోను సహోదరుల, సహోదరీల అవసరత నిమిత్తము మీ నోటిలో ఒక మాటను ఉంచును- అది ఒక్క వాక్యమే కావచ్చును. మెల్కీసెదెకు యొక్క యాజకత్వములో ఎవరు ప్రత్యేకమైనవారు కాదు. మీకున్న వరములను బట్టి ప్రసిద్ధి పొందుటకు ఆశింపకుడి. ఏమీ కానివారిగా ఉండుటకు ఆశించుడి. మీరు మెల్కీసెదెకు పరిచర్యను నిజముగా కోరుకొన్న యెడల అనామకులుగా ఉండుటకు ఆశించుడి.

కొద్ది మంది ఆత్మలను క్రీస్తు యొద్దకు తీసుకువచ్చానని దయ్యములను వెళ్లగొట్టానని, రోగుల కొరకు ప్రార్థన చేసానని, కూటములను నడిపించానని లేక ఏదో ఒకటి చేసానన్న తలంపులను కలిగియుండవద్దు. ఎటువంటి పేరు, బిరుదు, గుర్తింపు లేని సాధారణమైన సహోదరునిగా ఉండుటకు తృప్తిపడుము. ఇతరులను దీవించి వెళ్లిపొమ్ము. అనామకునిగా ఉండుటకు కోరుకొనుము.

మన పరిచర్యలు, వరములు వేరైనప్పటికీ మనమందరము సమానమేనని ఆనందించవలెను. ఆయన నామములో దయ్యములు వారికి లోబడినందుకు సంతోషించవద్దని యేసు ఒకసారి తన శిష్యులకు చెప్పెను. వేరే మాటలలో చెప్పాలంటే వారు తమ పరిచర్యను బట్టి, వారు ఏమి చేయగలరో లేక చేసియుండిరో అనుదానిని బట్టి వారానందించకూడదు. దేవుడు వారికొరకు చేసిన దానిని బట్టి, వారి పేర్లను జీవగ్రంధములో వ్రాసిన దానిని బట్టి వారానందించవలెను (లూకా 10:20). అటువంటి వైఖరి క్రొత్త నిబంధన పరిచర్య అంతటికి మూలమైనది.

దేవుని స్వభావము యొక్క ఒక లక్షణమేమిటంటే ఆయన ప్రదర్శనను ప్రకటించుకొనుటను ద్వేషించును. ''నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరచుకొను దైవుడవైయున్నావు'' అని ఆయన గురించి యెషయా గ్రంథములో వ్రాయబడియున్నది (యెషయా 45:15). దేవుడు మనలను ఆయన వలే చేయాలని కోరుకొనుచున్నాడు-ఇతరులు గమనించకుండా పనులు చేయుటకు ఇష్టపడి, చేసినదానికి ఘనత పొందాలని ఆశించని ఆయన స్వభావములో మనము పాలు పొందాలని ఆయన ఆశించుచున్నాడు.

మనము కూడా మెల్కీసెదెకు వలె ఇతరులను దీవించి వెళ్లిపోవుట నేర్చుకొనునట్లు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యమును చేయాలని చూచుచున్నాడు. మనము చేసిన దాని కొరకు మనుష్యులనుండి ఘనతను పేరును పొందాలన్న సాతాను సంబంధమైన దుష్టత్వము నుండి మనలను పూర్తిగా విడుదల చేయాలని ఆయన కోరుకొనుచున్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకులుగా ఉండువారు మన మధ్య అనేకులు ఉందురు గాక.

అధ్యాయము 23
వివేచన యొక్క రహస్యము

''మతాధికారులు యేసును అపహసించిరి....సైనికులు కూడా ఆయనను ఎగతాళి చేసిరి.....అక్కడ సిలువ వేయబడిన ఒక నేరస్థుడు ఆయనను దూషించెను. అయితే రెండవవాడు వానిని గద్దించి, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పెను'' (లూకా 23:35-41).

ఇశ్రాయేలులో వయస్సులో పెద్దవారైన బైబిలు పండితులు, తెలివిగల చదువుకున్న రోమా సైనికులు యేసు ఎవరైయుండునో వివేచింపలేనప్పుడు, బైబిలు గురించి ఏమి తెలియని ఒక దొంగ మరియు నరహంతకుడు భూమి మీద తన చివరి క్షణాలలో వివేచింపగలుగుట నిజముగా అద్భుతమైన విషయము. దీనికి కారణమేమిటి?

వివేచన అనేది తెలివితేటల ద్వారా గాని, బైబిలు జ్ఞానము ద్వారా గాని, అనుభవము ద్వారా గాని రాదు. దీనిని యథార్థహృదయము గలవారికి దేవుడు అనుగ్రహించును. ఇశ్రాయేలులోనున్న మతాధికారులు, యాజకులు, బైబిలు పండితులు ఆ దినమున సిలువ చెంత నిలబడి యేసు మీద ఏదో ఒక నేరారోపణను చేశారు (మత్తయి 27:41). ఆ దారిని వెళ్లుచున్న ఆ దేశము యొక్క ప్రధాన పౌరులు కూడా కనికరము లేకుండా యేసును దూషించుచు ఆయన దేవాలయమును నాశనము చేతునని చెప్పెనని నేరారోపణ చేసిరి (ఇది తప్పుడు ఆరోపణ, ఎందుకనగా యేసు అటువంటి వాక్యమును ఎప్పుడు చెప్పలేదు) (మత్తయి 27:39). ఈ ఆరోపణల చేత ఆ ఇద్దరు దొంగలు ఎంతగా ఒప్పించబడిరంటే వారు కూడా యేసును దూషించుట ప్రారంభించిరి (మత్తయి 27:44).

కాని అకస్మాత్తుగా వారిలో ఒకడు ఆగి ''ఈయన ఏ తప్పిదమును చేయలేదు'' అని యేసును గూర్చి చెప్పాడు (లూకా 23:41). అతనికి అది ఎలా తెలిసెను? యేసు చెప్పుకొన్నట్లుగా ఆయనే మెస్సియ అని అతడు ఎలా వివేచింపగలిగాడు? యేసు కొరకు ఎవడు నిలబడని సమయములో ప్రజలు చేసిన ఆరోపణలన్నియు అబద్ధములని అతడు ఎలా వాటిని తిరస్కరించాడు? మెట్టుకు ''నిప్పు లేకుండా పొగ ఉండదు కదా?'' ఈ సామెత యొక్క లోకానుసారమైన జ్ఞానము చొప్పున చూచినట్లయితే వందల కొలది ప్రజలు ఆయనపై నేరారోపణ చేయుటకు ఏదో ఒక చిన్న కారణమైనా ఉండకపోవునా అని ఆ దొంగ అనుకొనెడివాడు. అయినప్పటికి యేసు ఏ తప్పిదమును చేయలేదని ఆ దొంగ చెప్పాడు.

తాను వినిన దానిని తిరస్కరించునంతగా (యెషయా 11:3) ఆత్మానుసారుడైన వ్యక్తిగా ఆ దొంగ ఎలా మారెను? ఎందుకనగా ''తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము'' అని యేసు చెప్పుటను ఆయన వినెను (లూకా 23:34). ఒకప్రక్క ఆ దొంగ ఆ బైబిలు పండితుల అలజడిని, ఆందోళనను, ద్వేషమును, పగను చూచెను. మరొకప్రక్క యేసులో ఉన్న క్షమించే ఆత్మను ఫిర్యాదులు చేయని ఆత్మను విశ్రాంతిని, తన్నుతాను సమర్థించుకొనకపోవుటను అతడు చూచెను. ఆ విధముగా ఎవరు సరియైనవారో, ఎవరు కాదో అతడు వివేచంపగలిగెను. సంఘములో కూడా మనము ఈ విధముగానే వివేచనను ఉపయోగించవలెను. ఇద్దరు సహోదరుల మధ్య లేక సహోదరీల మధ్య వివాదమున్నప్పుడు మీరు ఈ దొంగ యొక్క కొలబద్దను వాడిన యెడల ఎవరు తప్పో ఎవరు కాదో మీరు వెంటనే కనుగొనెదరు. ''భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు'' (యెషయా 57:20,21). దేవుని దృష్టిలో తప్పైన వారు నిత్యము అలజడి, అవిశ్రాంతితో కూడిన జీవితమునకు అప్పగింపబడుదురు. వారు వారి నోళ్లనుండి భక్తిపరులైన సహోదరులకు, సహోదరీలకు వ్యతిరేకముగా చెత్తను, మైలను (పుకారులను, ఆరోపణలను, ఫిర్యాదులను, దూషణను) బయటకు వేయుచూనుందురు. మీరు అటువంటి సహోదరునిగాని, సహోదరీని గాని కలసిన యెడల మీరు సంకోచించకుండా ఆ వ్యక్తినే ఒక భక్తి హీనునిగా వర్గీకరించవచ్చును. ఎందుకనగా దేవుడు ఆ వ్యక్తిని అలాగే పిలచును (యెషయా 57:20,21). ఆ విషయము యొక్క వాస్తవాలను చూచుటకు లేక ఇంకా ఏ ఆధారాల అవసరమును లేదు. ఆ వ్యక్తిలోనున్న అలజడి మరియు అవిశ్రాంతి అన్నిటికంటే స్పష్టమైన ఆధారము. లోకములోనున్న న్యాయస్థానాలలో తీర్పు తీర్చేముందు న్యాయాధికారులు ఆధారాలన్నిటిని పరిశీలించుటకు అనేక సంవత్సరాలు తీసుకోవచ్చును. అయినప్పటికీ వారు తప్పు చేయవచ్చును. సంఘములో ఉన్న వాదముల విషయములో మనము ఈ పద్ధతిని అవలంబించిన యెడల ఒక నిర్ణయానికి వచ్చేముందు మన జీవిత కాలమంతయు రెండు ప్రక్కల వాదమును వినవలసియుండును. అయినప్పటికి మనము తప్పు చేయవచ్చును. కాని దేవుడు మనకు ఒక మెరుగైన విధానమునిచ్చెను: ఎవరు విశ్రాంతిలోనున్నారో ఎవరు లేరో అనే విషయమును మాత్రము పరీక్షించుడి. ఎవరు ఫిర్యాదులతో నిండియున్నారో, ఎవరు తన్ను తాను సమర్థించుకొనుట లేదో పరీక్షించుడి. ఎవరు నీతిమంతులో, ఎవరు కాదో అన్న విషయము మీకు తక్షణము తెలియును. సిలువపై నున్న దొంగ మనకు వివేచనయొక్క రహస్యమును చూపించెను.

అధ్యాయము 26
దేవుని సంపూర్ణ చిత్తమును పరీక్షించుకొనుట

ఏదైనా విషయములో మనము అనిశ్చిత స్థితిలో నుండి, అది దేవుని చిత్తమా, కాదా అని తెలుసుకొనుటకు క్రింది పండ్రెండు ప్రశ్నలు మనకు మనము వేసికొని వాటికి నిజాయితీగా జవాబిచ్చుటకు ప్రయత్నించినట్లయితే దేవుని చిత్తమేదో క్రమేణా విశదమగును.

  1. నేనెరిగినంతవరకు ఇది యేసు క్రీస్తు మరియు అపొస్తలుల బోధలకు, క్రొత్త నిబంధన ఉద్దేశ్యములకు వ్యతిరేకముగా నున్నదా? (2 తిమోతి 3:16,17)
  2. నేను పవిత్రమైన మనస్సాక్షితో దానిని చేయగలనా? (1 యోహాను 3:20)
  3. నేను దేవుని మహిమార్థమై దానిని చేయగలనా? (1 కొరిందీ¸ 10:31)
  4. నేను క్రీస్తుతో సహవాసము కలిగియుండి దానిని చేయగలనా? (కొలస్సీ 3:17)
  5. నేను ఆ పనిని చేయునప్పుడు నన్ను దీవించమని దేవుని అడుగగలనా? (2 కొరిందీ¸ 9:8)
  6. నేను దానిని చేస్తే పదునైన నా ఆత్మీయ స్థితి ఏ విధముగానైనా మొద్దు బారునా? (2 తిమోతి 2:15)
  7. నేనెరిగినంతవరకు అది ఆత్మీయముగా లాభకరము మరియు క్షేమాభివృద్ధి కరమైనదా? (1 కొరిందీ¸ 6:12;10:23)
  8. నేను ఆ కార్యము చేయుచున్న క్షణములో యేసుక్రీస్తు భూమి మీదికి తిరిగివచ్చినచో నేను సంతోషింపగలనా? (1 యోహాను 2:28)
  9. వివేకులైన, ఆత్మీయముగా పరిణితి చెందిన సహోదరులు దాని విషయమై ఏమి తలంచెదరు? (సామెతలు 11:14; 15:22; 24:6).
  10. నేను దానిని చేయుట ఇతరులు ఎరిగినప్పుడు దేవుని నామమునకు అవమానము కలుగునా? లేక నా సాక్ష్యమును అది పాడుచేయునా? (రోమా 2:24; 2 కొరిందీ¸ 8:21)
  11. నేను దానిని చేయుట ఇతరులు ఎరిగినప్పుడు అది వారికి ఆటంకముగా,అభ్యంతరముగా నుండునా? ( రోమా 14:13;1 కొరిందీ¸ 8:9 ).
  12. దానిని చేయుటకు నా యొక్క ఆత్మ స్వేచ్ఛను కలిగియున్నదా? (1 యోహాను 2:27 ).

(వాక్య భాగముల యొక్క రిఫరెన్సులను చూచి, వాటిని ధ్యానించండి).