వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

ప్రభువైనయేసు దేవుడైయుండి మనవంటివాడై, ఆయన మనతో ఐక్యపరచుకొన్నాడు. ఆయన శరీరధారియై, మనిషిగా మారుటకు సిగ్గుపడలేదు. మనలను ఆయన తన సహోదరులని పిలచుటకు సిగ్గుపడలేదని బైబిలు చెప్పుచున్నది. కొన్నిసార్లు మనము ఇతరులకంటే యోగ్యులమని అనుకుంటాము. మనము ఎక్కువ విద్యావంతులమనియు మరియు మనము ఉన్నతమైన వారమనియు అనుకుంటాము. ఆదాము పాపము చేసినందువలన గర్వము మనలో ప్రవేశించింది. మనది ఏ జాతియైనను, ఏ కుటుంబమైనను, ఎంత చదివినను, ఎంత తెలివైనవారమైనను, ఏ పదవిలో ఉన్నను మనమందరము సమానమే అని చూపించుటకు ప్రభువైనయేసు వచ్చారు. ఆ దినములలో ఇశ్రాయేలులోనికి దాసుని స్వరూపము ధరించుకొని ఒక దాసుడుగా, పరిచర్య చేసేవాడిగా ఆయన వచ్చారు. మనుష్యులందరికి ఆయన దాసుడగు నిమిత్తము తన్ను తాను తగ్గించుకొని అందరికంటే క్రిందకు వెళ్ళారు. నిన్ను నీవు తగ్గించుకొని ఒక వ్యక్తి క్రింద ఉండుటకు ఇష్టపడనియెడల, నీవు అతనికి దాసుడవు కాలేవు. ఒక వ్యక్తిని నీవు పైకి లేవనెత్తుటకు నీవు అతని క్రిందకు వెళ్ళాలి. ఆవిధముగా ప్రభువైన యేసు వచ్చారు.

మన మనస్సును క్రీస్తువంటి మనస్సుగా మార్చుటకు అనగా ప్రభువైన యేసు ఎలా ఆలోచిస్తారో మనము కూడా అలాగే ఆలోచించునట్లు మనలను చేయుటకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నీవు ఒక్కడివే ఉన్నప్పుడు నీ గురించి నీవేమాలోచిస్తావు? ఒకవేళ నీవు అందముగా ఉన్నావని గాని, చాలా తెలివైన వాడివని గాని లేక ధనికుల కుటుంబములో పుట్టావుకాబట్టి అదృష్టవంతుడువని గాని లేక అలాంటి తలంపులు కలిగియుంటున్నావా? అప్పుడు నీవు క్రీస్తులాగా ఎంత ఆలోచిస్తున్నావో లేక అపవాదిలాగ ఎంత ఆలోచిస్తున్నావో నీకు తెలుస్తుంది. నీవు ఇతరులతో పోల్చుకొని గొప్పవాడివని అనుకుంటున్నట్లయితే, అంటే లూసిఫరు అపవాదిగా మారకముందు తలంచినట్లే నీవు కూడా తలంచుచున్నావన్నమాట. ఫిలిప్పీ 2:3 ప్రకారము, మనము వినయమైన మనస్సు గలవారమై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచాలి. ఈ విషయములో ప్రభువైన యేసే మనకు మాదిరి అని పౌలు చెప్పుచున్నాడు. పరిశుద్ధులందరిలో తాను అత్యల్పుడనని ఎఫెసీ 3:8 లో పౌలు చెప్పియున్నాడు. క్రీస్తు దీనత్వముచేత పౌలు ఎంతగా పట్టబడ్డాడంటే, విశ్వాసులందరిలో తనను తాను అత్యల్పుడుగా చూచియున్నాడు.

మీరు వినయమైన మనస్సు గలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుకొనవలెనని ఫిలిప్పీ 2:3లో బైబిలు చెప్పుచున్నది. ప్రభువైనయేసు ఎల్లప్పుడు ఇతరులను తనకంటే యోగ్యులని తలంచేవారు. అందుకే ఆయన కడరాత్రి భోజనమునకు ముందుగా బక్కెట్‍లో నీళ్ళు తీసుకొని శిష్యుల పాదములు కడిగియున్నారు. ఆ రోజులలో బానిసలు మాత్రమే పాదములు కడిగేవారు. మీరు ధనవంతుని ఇంటికి వెళ్ళినచో, ఆ యజమాని అనేకమంది బానిసలను కలిగియుండేవాడు. ఆ కాలములో ఒక బానిసను కొనుక్కునేవారు. అతనికి జీతము ఇవ్వబడదు. దాసులకంటే కూడా బానిసలు తక్కువ స్థాయిలో ఉండేవారు. ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు, అతని చెప్పులు తీసివేసి, అతని పాదములు కడుగుట బానిసయొక్క బాధ్యత. ఎప్పుడైనను విందు ఉన్నట్లయితే, అక్కడ ఎల్లప్పుడు నీరు సిద్ధముగా ఉండెడిది. ప్రభువైన యేసు మరియు శిష్యులు గదిలోనికి వచ్చినప్పుడు, అక్కడ ఆతిధ్యమిచ్చేవారు ఎవరూ లేరు. కాని నీరు మాత్రము అక్కడ సిద్ధపరచబడింది. కాని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వారి పాదములు ఎవరు కడగాలి? మరియు శిష్యులందరు ఈలాగు అనుకొనియుండవచ్చును, “మంచిది, నేనైతే ఆ పని చేయను”. “యేసు ప్రభువు వెళ్ళిన తరువాత నేనే నాయకుడుగా ఉంటాను, కాబట్టి ఆ పని నేనెలా చేస్తాను? అని పేతురు అనుకొని ఉంటాడు. “మంచిది, నేను బాగా చదువుకున్న అకౌంటెంటును కాబట్టి నేను శిష్యుల పాదాలు కడుగలేను” అని మత్తయి అనుకొనియుండవచ్చును. కాబట్టి ప్రతి శిష్యుడు తాను ఏదొక విషయములో ఇతరుల కంటె యోగ్యుడను గనుక బానిస చేసే పని నేను చేయలేనని అనుకొనియుండవచ్చును. ఆ పని జరుగక పోయినా పర్వాలేదు. అప్పుడు యేసుప్రభువు పళ్ళెములో నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుటకు మొదలుపెట్టారు. ఎందుకని? “మీరు నాకంటే యోగ్యులని” ఆయన చెప్పారు. వీరు ఆయన కంటే ఏ మాత్రము ఆత్మీయులు కాదు మరియు ఆయన అలా భావించలేదు. అయినప్పటికీ వారు యోగ్యులని ఆయన యెంచారు. ఆయన నిజముగా వారికంటే తాను ప్రాముఖ్యము గలవాడిగా అనుకొనలేదు. ఆయన తనను తాను దీనుడిగా చూపించుటకు అలాగున చేయలేదు. కొందరు తాము దీనదాసులని ఇతరులకు చూపించుకొనుటకు చేస్తారు. అది వేషధారణ. దేవుడు దానిని ద్వేషిస్తారు. యేసు ప్రభువు యదార్ధముగా ఉన్నారు. తన పరలోకతండ్రి యెదుట ఏమీకాని వాడిగా ఆయన ఉన్నారు. అదే నిజమైన దీనత్వము: దేవుని ఎదుట ఏమికాని ఒట్టివారముగా ఉండుట. నేను ఒట్టివాడను, నేనేమైయున్నానో అదంతయు నీవే చేశావు. నిన్ను తెలివైనవాడుగా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మానసిక ఎదుగుదల లేకుండా అనేకమంది పిల్లలు లోకములో పుట్టుచున్నారు. నీవు కూడా అలాగున జన్మించే అవకాశమున్నది. అటువంటి పిల్లలవలే నీవు కూడా లోపము కలిగిన మెదడుతోనో లేక అంగహీనుడౌగానో, ఏదైనా జబ్బుతోగాని లేక పోలియోతోనో నీవుకూడా పుట్టే అవకాశమున్నది. అప్పుడు నీవు ఎలా ఉండేవాడివి? మన స్థితినిబట్టి నిజముగా మనమెంతో దీనులము కావలసియున్నది: ఓ ప్రభువా! నీ యొద్దనుండి నేను పొందనిది ఏమున్నది? బుద్దిహీనుడు మాత్రమే గర్విస్తాడు.

ఆయన వారితోకూడా బయలుదేరి నజరేతుకు వచ్చి, మరియ యోసేపులకు లోబడి ఉన్నట్లుగా లూకా 1:51 లో వ్రాయబడియున్నది. అలాగున 30 సం||లు జరిగింది. మరియ, యోసేపులు పరిపూర్ణులా? కాదు. ఈనాడు భార్యాభర్తలవలే వారు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు పోట్లాడుకొనే ఒక సామాన్య క్రైస్తవ కుటుంబము గురించి ఆలోచించండి. మరియ, యోసేపులు అలాగే ఉన్నారు. వారు ఎన్నడూ పాపముచేయని పరిపూర్ణులు కారు. అక్కడ పరిపూర్ణులు ఎవ్వరూ లేరు. వారు సంపూర్ణులు కాదుకాని పాపులు. వారికి సమస్తము తెలియదు. అయితే వారిఇంటిలో పాపరహితుడు, సంపూర్ణుడు మరియు ఎన్నడైననూ ఒక్క తప్పుకూడా చేయని యేసు ఉన్నాడు. కాబట్టి ఎవరు ఎవరికి లోబడాలి? యేసుప్రభువుకే మరియ, యోసేపులు లోబడాలని మనమనుకుంటాము కదా! పరిపూర్ణులుకాని మరియ, యోసేపులు పరిపూర్ణుడైన యేసుకు లోబడాలని మనమనుకుంటాము. కాని అది అలాగున లేదు. పరిపూర్ణులు కాని తల్లిదండ్రులకు ఆయన లోబడియున్నాడు. మనకంటే పరిపూర్ణులు కానివారికి లోబడుట ఎంత కష్టమో మనకు తెలియును. నీకంటే పరిపూర్ణత లేనివారికి నీవు లోబడగలవా? కాని నీవు నిజముగా దీనుడవైతే నీకు సమస్య ఉండదు. నీవు ఒట్టివాడవని గుర్తించావు కాబట్టి నీవు ఎవరికైనను లోబడెదవు. దీనత్వమే రహస్యము. మనము దీనులమైతే, ఎవరి విషయములోకూడా మనకు సమస్య ఉండదు. యేసుప్రభువు ఒడ్రంగిగా ఉండుటకు సంతోషముగా ఇష్టపడ్డాడు. ఆయన పరిచర్యకు వెళ్లినప్పుడు ఎటువంటి బిరుదు పెట్టుకోలేదు. ఆయన ఎప్పుడైననూ రెవరెండ్ యేసు అని పిలిపించుకోలేదు. ఆయన సేవించుటకు వచ్చిన ప్రజలమీద పదవినిగాని లేక ప్రజలనుండి బిరుదునుగాని ఆయన కోరలేదు. అన్నివిషయములలో ఆయన తన సహోదరులవంటివాడయ్యారు. వారు ఆయనను రాజుగా చెయ్యాలనుకున్నప్పుడు, అక్కడనుండి వెళ్లిపోయాడు. మనుష్యులనుండి ఘనతను పొందుటకు ఆయన ఏమియు చేయలేదు. ఆయన ఎవరినైననూ స్వస్థపరిచినప్పుడు, దానిని ఎవరికీ చెప్పవద్దని చెప్పేవాడు. ఆయన దీనత్వాన్ని చూస్తున్నారా? మహిమంతయూ తండ్రికే చెందాలని ఆయన కోరాడు. ఎవరినీ తనవైపు ఆకర్షించుకోవాలని ఆయన కోరలేదు. పేరు ప్రతిష్టలకొరకు ఆయన స్వస్థతలు చేయలేదు. మనుష్యుడు ఏవిధముగా జీవించాలో అనేదానికి ఎంత మంచి మాదిరి కలిగియున్నాము.