ఒక తేటయైన సువార్త సందేశము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   అన్వేషకుడు పునాది సత్యము
Article Body: 

సందేశములో "తిరిగి జన్మించుట" లేక రక్షింపబడుట అనగా ఏమిటో వివరించాలని అనుకొనుచున్నాను.

ఈ అనుభవానికి మారుమనస్సు మొదటి మెట్టు అయితే మారుమనస్సు (పాపము నుండి తిరుగుటకు) ముందు పాపమనగా ఏమిటో నీవు తెలుసుకొనవలెను. పాపమును గూర్చి తప్పుడు అవగాహన ఉండుట వలన, ఈనాడు క్రైస్తవులు మారుమనస్సు గూర్చి చాలా తప్పుడు గ్రహింపు కలిగి యున్నారు.

గత కొద్ది దశాబ్దాలుగా క్రైస్తవ ప్రమాణములు ఎంతగానో క్రిందికి దిగజారి పోయినవి. ఈనాడు అనేక భోధకుల ద్వారా భోధింపబడు "సువార్త" సత్యమును ఎంతగానో పలుచన చేసి చెప్పేదిగా యుంది. యేసు ప్రభువును నమ్ముకొంటే చాలు అని జనులకు చెప్పబడుచున్నది. కాని వారు మారుమనస్సు పొందనట్లయితే, కేవలము యేసు ప్రభువును నమ్ముకొనుట ఎవరిని రక్షించదు.

తిరిగి జన్మించుట అనేది క్రైస్తవ జీవితమునకు పునాది. ఈ పునాది వేయకుండా నీవు మంచిగా జీవిస్తున్నట్లయితే, అప్పుడు నీ క్రైస్తత్వము, జనులను మంచి జీవితము జీవించమని చెప్పే ఈ లోకములో నుండిన అన్ని ఇతర మతములవలె నుండును. మనము తప్పని సరిగా మంచి జీవితము జీవించవలెను. కాని అది క్రైస్తత్వము యొక్క బయటకు కనబడే భవన నిర్మాణము. అది పునాది కాదు. పునాది తిరిగి జన్మించుట. మనమందరము అక్కడ ప్రారంభించవలెను.

యేసు ప్రభువు "తిరిగి జన్మించుట" అను మాటను యోహాను 3:3లో మతనాయకుడు మరియు దేవుని భయము కలిగియుండి న్యాయముగా నడచుకొను నికోదేముతో మాట్లాడునప్పుడు ఉపయోగించారు. అటువంటి వ్యక్తితో కూడా యేసు ప్రభువు "నీవు తిరిగి జన్మించితేనే కాని నీవు దేవుని రాజ్యమును చూడలేవు (యోహాను 3:3) అని చెప్పెను. నీవు ఒక మంచి వ్యక్తివైనా సరే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించుటకు నీకు ఆత్మీయమైన జన్మము కావలసియున్నది! ఆయన (యేసు ప్రభువు) సిలువపై మరణించుటకు ఎత్తబడితేనే ఆయన యందు విశ్వాసముంచినవాడు నిత్యజీవము పొందుదురని యేసు నికోదేముతో చెప్పెను (యోహా 3:14,16).

యేసు ప్రభువు అతడితో ఇంకా, వారి క్రియలు చెడ్డవి కనుక మనుష్యులు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించెదరు అని చెప్పెను (యోహా 3:19). కాని ఎవరైతే నిజాయితీగా యుందురో వారు వెలుగు నొద్దకు వచ్చి రక్షింపబడుదురు. తిరిగి జన్మించుటకు, నీవు వెలుగు నొద్దకు రావలెను. దాని అర్థము దేవునితో నిజాయితీగా యుండి, ఆయనకు నీ పాపములను చెప్పవలెను. నీవు చేసిన పాపములన్నిటిని నీవు జ్ఞాపకము చేసుకొనలేవనునది నిజము. కాని నీవు పాపినని ఒప్పుకొని నీకు జ్ఞాపకముండిన పాపములన్ని దేవుని యొద్ద ఒప్పుకొనవలెను.

పాపము అనేది చాలా పెద్ద విషయము మరియు దాని యొక్క చిన్న భాగమును మాత్రమే నీ జీవితములో నీవు మొదట చూడగలవు. అది నీవు ఒక పెద్ద దేశములో నివసిస్తూ ఉండవచ్చు కాని దానిలో చాలా కొద్ది భాగమును మాత్రమే నీవు చూడగలిగి యుండుట వంటిది. కాని నీకు తెలిసిన పాపముల నుండి నీవు తిరిగినప్పుడు, నీ స్వంత జీవితములో ఇంకా ఇంకా ఎక్కువ పాపపు దేశమును నీవు క్రమేపి చూడగలవు. నీవు వెలుగులో నడిచే కొద్ది, నీవు నీలో మరి ఎక్కువ పాపమును చూడగలవు, అప్పుడు దాని నుండి నిన్ను నీవు మరి ఎక్కువగా కడుగు కొనగలవు. కనుక నీవు దేవుని యొదుట అన్ని వేళలా నిజాయితీగా నడువవలెను.

మరియొక ఉదాహరణ : నీవు ఎన్నో మురికిగా నుండిన గదులు కలిగిన ఒక ఇంటిలో నివసించుచున్నావు. యేసు ప్రభువు వచ్చి నీవు నివసించే ఆ ఇంటిలో నివసించాలని కోరుచున్నావు. కాని ఆయన మురికిగా నుండిన గదులలో నివసించలేరు. కనుక ఒక్కొక్క గదిని శుభ్రపరచుటకు ఆయన నీకు సహాయము చేయును, అది ఒక దాని తరువాత ఒక దానిని కొంచెము కొంచెముగా ఇల్లంతా శుభ్రపర్చబడును. మన క్రైస్తవ జీవితములో పరిశుధ్ధత విషయములో మనము అదే విధముగా ఎదుగుదుము.

అపోస్తలుడైన పౌలు, ఆయన వెల్లిన ప్రతిచోట ప్రతివారికి ఒకే సందేశమును భోధించెనని ఒకమారు చెప్పెను. అది "దేవుని యొదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచవలెనని" భోధించెను (అ.కా. 20:20) ఈ రెండును జీవితములో నీవు మంచి పునాది వేసుకొనుటకు మరియు తిరిగి జన్మించుటకు కావలసిన రెండు ముఖ్యమైన అవసరములు. దేవుడు మారుమనస్సును మరియు విశ్వాసమును కలిపియుంచారు. కాని చాలా మంది క్రైస్తవ భోధకులు వాటిని వేరు చేసి యున్నారు. ఈనాటి చాలా సువార్త భోధలలో మారుమనస్సు అనేది విడిచి పెట్టబడుచున్నది. అనేక భోధకుల చేత కేవలము విశ్వాసమే ప్రకటింపబడుచున్నది.

అయితే నీకు కేవలము విశ్వాసము మత్రమే యుండినట్లయితే, నీవు తిరిగి జన్మించలేవు. అది చెప్పుటకు, ఒక స్త్రీ ఎంత ప్రయత్నించినా, ఆమె ఒంటరిగా బిడ్డను పొందలేనట్లుండును. ఒక పురుషుడు కూడా తనకు తానుగా ఒక బిడ్డను పొందలేడు. ఒక బిడ్డ జన్మించుటకు ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు కలియవలెను. అదే విధముగా మారుమనస్సు మరియు విశ్వాసము కలిసినప్పుడే ఒక అత్మీయమైన బిడ్డ జన్మించును. అనగా నీ ఆత్మలో నూతన జన్మము సంభవించును. ఈ ఆత్మీయమైన జన్మ శారీరకమైన జన్మ అంత సత్యమైనది మరియు అది ఒక్క క్షణములోనే జరుగును. అది క్రమేపి జరిగేది కాదు.

శారీరక జన్మకు నెలల సిద్ధపాటు ఎట్లుండునో, అదే విధముగా నూతన జన్మకు నెలలు సిద్ధపాటు యుండును. కాని నూతన జన్మ (శారీరక జన్మవలె) ఒక్క క్షణము సమయము తీసుకొనును. కొంత మంది క్రైస్తవులకు వారి నూతన జన్మ యొక్క తేదీ తెలియదు. నాకు నా స్వంత నూతన జన్మ తేదీ తెలియదు. అయితే అది ఒకనికి తన శారీరకమైన పుట్టుక దినము ఎప్పుడో తెలియునటువంటిది. ఒకడు జీవించియున్నంతవరకు అది అంత తీవ్రమైన విషయం కాదు. అదే విధముగా ముఖ్యమైన విషయము, నీవు ఈనాడు క్రీస్తులో బ్రతికి యున్నావా లేదా అని ఖచ్చితముగా తెలుసుకొనుట ముఖ్యమైనది.

దేవుని యొద్దకు యేసు ఒక్కడే మార్గము అని మనము చెప్పుట మన సంకుచిత్వమా?

దానికి ఒక ఉదాహరణతో జవాబు చెప్పుదును. నా తండ్రిని ఎప్పుడూ చూడని (చివరకు నా తండ్రి చిత్రమును) ఒకనికి, నా తండ్రి ఎలా ఉండునో తెలియదు. అదే విధముగా, మనము దేవుని ఎప్పుడూ చూడలేదు ఆయన గూర్చి మనకు ఏమీ తెలియదు లేక ఆయన యొద్దకు త్రోవ తెలియదు. అయితే యేసు క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చియుండెను. అందువలన ఆయన మాత్రమే మనకు దేవుని యొద్దకు మార్గమును చూపించగలడు. "నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు" (యోహా 14:6) అని యేసు చెప్పెను.

దేవుని యొద్దకు ఒకే మార్గము నేనే అని యేసు చెప్పిన మాట గూర్చి మనము అలోచించినట్లయితే, ఆయన చెప్పినది యదార్థమైనా అయ్యుండాలి లేక ఆయన ఒక అబద్ధికుడు మరియు మోసగాడు అయ్యుండాలి. ఆయన ఒక అబద్ధికుడు మరియు మోసగాడు అని చెప్పే ధైర్యం ఎవరికుంది? యేసు ప్రభువు ఏదో ఒక మంచివాడు లేక ఒక ప్రవక్త అని చెబితే సరిపోదు. అలా కాదు ఆయన కేవలము మంచి వాడు మాత్రమే కాదు - ఆయన దేవుడై యున్నాడు. ఆయన ఒక అబద్ధికుడు లేక ఒక మోసగాడు అయునట్లయితే ఆయన ఒక మంచి వాడుగా యుండగలిగి యుండేవాడు కాదు! కనుక యేసు తప్పనిసరిగా మానవ రూపములో నుండిన దేవుడు అని మనము నిర్ణయించుకొనవచ్చును.

సత్యమంతా ఎప్పుడూ ఇరుకైనదిగా ఉంటుంది. గణితములో 2+2 ఎల్లప్పుడూ 4. మనము విశాలమైన మనస్సుతో ఆలోచించి 3 లేక 5 కూడా సరియైన జవాబులే అని అంగీకరించలేము. మనము చివరకు 3.9999 కూడా సరియైన జవాబుగా అంగీకరించలేము. సత్యములో అటువంటి హెచ్చుతగ్గులను అంగీకరించినట్లయితే మన లెక్కలు తప్పుగా ఉండును. అదే విధముగా భూమి, సూర్యుని చుట్టూ తిరిగుచున్నదని మనకు తెలియును. మనము "విశాలమైన మనస్సు" తో ఆలోచించాలనే ఉద్దేశముతో సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుచున్నాడనే సిద్ధాంతమును నమ్మినట్లయితే, మన అంతరిక్ష లెక్కలన్నీ తప్పయి పోవును. అదే విధముగా రసాయన శాస్త్రములో H2O అనగా నీరు మనము H2O ను ఉప్పు అని చెప్పేటంత విశాల హృదయముతో ఉండలేము. కనుక మనము సత్యమును అన్ని విషయములలో సంపూర్ణమైనదిగా మరియు సంకుచిత మైనదిగా చూచుచున్నాము. దేవుని విషయములోనూ అంతే. విశాలమైన మనస్సు లెక్కలలో, గ్రహాల విషయంలో మరియు రసాయన శాస్త్ర విషయంలో మరియు దేవుని గూర్చిన సత్యము తెలుసుకొను విషయములో కూడా తప్పులు జరుగునట్లు చేయును.

మానవులందరు పాపులనియు మరియు యేసు ప్రభువు పాపుల కొరకు మరణించెనని బైబిలు చెప్పుచున్నది. కనుక నీవు యేసు నొద్దకు "క్రైస్తవుడు" గా వచ్చినట్లయితే ఆయన నీ పాపములను క్షమించడు. ఆయన పాపుల కొరకు మరణించెను. "ప్రభువా నేను పాపిని" అని యేసు నొద్దకు వచ్చి చెప్పినవాడు మాత్రమే క్షమాపణ పొందును. ఆయన "పాపుల" కొరకు మరణించెను కాబట్టి నీవు యేసు నొద్దకు ఏదో ఒక మత సభ్యుడుగా వచ్చి క్షమాపణ పొందలేవు. నీవు ఆయన యొద్దకు ఒక పాపిగా వచ్చినట్లయితే, నీ పాపములు వెంటనే క్షమించబడును.

దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చెను కాబట్టి మనము పాపులమని తెలుసుకొనుట మనందరకు సులువు. చిన్న పిల్లలకు చాలా సున్నితమైన మనస్సాక్షి ఉంటుంది. అందువలన వారికి చేసిన తప్పు వెంటనే తెలిసిపోతుంది. కాని వారు ఎదిగిన కొద్ది వారి మనస్సాక్షి కఠినమైపోయి స్పందించడం మానివేస్తుంది. 3 సంవత్సరాల కుర్రవాడు అబద్దం చెప్పినప్పుడు, అతడి మనస్సాక్షి దోషముగా యుండుటచేత అతడి ముఖము దోషముతో కనబడుతుంది. కానీ 15 సంవత్సరముల తరువాత, అతడి ముఖములో మార్పు ఏమీ లేకుండా అబద్ధము చెప్పును, దానికి కారణం అతడు తనకు మరల మరల వచ్చిన హెచ్చరికలను పట్టించు కొనకుండా ఉండుట ద్వారా అతడి మనస్సాక్షిని చంపివేసాడు. ఒక చిన్న బిడ్డ యొక్క పాదములు ఒక పక్షి ఈకతో కొట్టినా తెలియునంత మెత్తగాయుండును. కాని పెద్దవారి పాదములు ఒక సూది గట్టిగా లోపలకు గ్రుచ్చుకొను వరకు తెలియనంత గట్టిగా నుండును. వారు ఎదిగి నప్పుడు వారి మనస్సాక్షి కూడా అట్లే మారిపోవును.

మనము నీతి కలిగి జీవించవలసిన బాధ్యత గలవారమని మనకు చెప్పు దేవుడు మనలో ఉంచిన స్వరమే మనస్సాక్షియైయున్నది. అది తప్పు ఒప్పుల గూర్చి ప్రాథమికమైన గ్రహింపు నిచ్చును. కనుక అది మనకు అద్భుతమైన బహుమతియై యున్నది. యేసు "దీనిని హృదయము యొక్క కన్ను" (లూకా 11:34) అని పిలిచెను. మనము ఆ కంటిని జాగ్రత్తతో చూచుకొనక పోయినట్లయితే, ఒక నాటికి మనము ఆత్మీయముగా గ్రుడ్డివారమై పోవుదుము. మనస్సాక్షి మనలను గ్రుచ్చే సమయములను మనము పట్టించు కొననట్లయితే అది కంటిలో నలుసులు పడినంత ప్రమాదకరమైనంతటిది - ఒకనాటికి నీవు పూర్తిగా గ్రుడ్డివాడివై పోవుదువు, ఆత్మీయంగా.

పసిపిల్లలు పుట్టినప్పుడు వారిలో ఎవరికీ మతము ఉండదు. వీరందరు ఒకేవిధముగా ఉందురు. రెండు సంవత్సరముల తరువాత వారు అదే విధముగా స్వార్థపరులుగా మరియు పోట్లాడేవారిగా యుందురు. కాని కాలము గడుస్తూ ఉండగా వారి యొక్క తల్లితండ్రులు వారిని వేరు వేరు మతములలోనికి నడిపింతురు. ఆ విధముగా వారు వ్యత్యాసమైన మతములలో కొనసాగుదురు. 90% విషయములలో, ఒక వ్యక్తి యొక్క మతము అతడి కొరకు వారి తల్లిదండ్రులు ఎంచినదిగానే యుండును.

అయితే దేవుడు మనలను వ్యత్యాసమైన మతముల వారిగా చూచుట లేదు. ఆయన మనందరిని పాపులుగా చూచుచున్నాడు. యేసు దివి నుండి భువికి మానవులందరి పాపముల కొరకు మరణించుటకు వచ్చెను. దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించుటకు తమకు తాము తగిన వారమను కొనువారి కొరకు ఆయన రాలేదు, కాని వారు పాపులమనియు, దేవుని సన్నిధికి వచ్చుటకు అర్హులము కామని ఒప్పుకొను వారి కొరకు ఆయన వచ్చియున్నారు. నీవొక పాపివని నీ మనసాక్షి నీకు చెప్పెను. కనుక యేసు నొద్దకు వచ్చి "ప్రభువా, నేనొక పాపిని, నేను నా జీవితములో ఎన్నో తప్పుడు పనులు చేసియున్నాను", అని చెప్పుటకు కష్టమేమిటి?

కొంతమంది ఇలా ప్రశ్నించవచ్చు, "ఒక మంచి తండ్రి మన పాపములను పట్టించుకొనకుండా, ఒక తండ్రి క్షమించునట్లుగా క్షమించవచ్చు కదా"? అని. ఒక కుమారుడు ఏదొక విలువైన దానిని విరుగగొట్టి (లేక పోగొట్టి) నట్లయితే, అతడి తండ్రి క్షమించును. కాని ఆ విషయములు నీతికి సంబంధించినవి కావు. మన పాపములన్ని ఇటువంటి విషయములైనట్లయితే, దేవుడు మనలను వెంటనే క్షమించి యుండేవాడు. కాని పాపము ఇటువంటి విషయము కాదు. పాపము ఒక నేరము.

ఒకడు న్యాయస్థానములో న్యాయాధికారియై యుండి, అతడి కుమారుడు ఏదొక నేరముపై అతడి ముందు దోషిగా నిలువబడినట్లయితే "కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమించియున్నాను, నిన్ను శిక్షించను" అని చెప్పునా? ఈ లోకములో నుండిన కొంచెము న్యాయముగల ఏ న్యాయాధికారియైనా అటువంటి పని ఎప్పుడూ చేయడు. అటువంటి న్యాయము సంపూర్ణ న్యాయస్థుడైన మహోన్నతుడైన దేవుని యొద్ద నుండి ఆయన రూపములో చేయబడిన మనమందరము కొంత కొంత పొంది యున్నాము. కనుక మనము ఏదైనా తీవ్రమైన తప్పు చేసినప్పుడు, న్యాయాధికారిగా దేవుడు, "నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను కాని నీవు ఈ నేరము చేసియున్నావు, కనుక నేను నిన్ను శిక్షించవలసి యున్నది" అని చెప్పును. ఆ న్యాయస్థానములో ఆ కుమారుడు అతడు చేసిన నేరము కొరకు ఎంతగా విచారపడినా, ఒక న్యాయాధికారిగా, అతడి తండ్రి అతడిని శిక్షించవలసియున్నది. ఆ అబ్బాయి ఒక బ్యాంకును దోచుకున్నాడనుకొందాము. చట్ట ప్రకారము తండ్రి ఒక కోటి రూపాయలను శిక్షగా వేసెనని అనుకొందము. ఆ అబ్బాయి దగ్గర చెల్లించుటకు అంత సొమ్ము లేనందున, అతడు జైలుకు వెళ్ళవలసియుండెను. అప్పుడు అతని తండ్రి తన న్యాయాధికారి ధరించుకొనే పై వస్త్రమును తీసివేసి తన యొక్క న్యాయాధికారి స్థానము నుండి క్రిందకు దిగి వచ్చి తన స్వంత బ్యాంకు చెక్కు పుస్తకమును తీసికొని కోటి రూపాయలకు (తన జీవిత కాలమంతా కూడ బెట్టుకొనినది) చెక్కు వ్రాసి శిక్షగా వేసిన సొమ్ము చెల్లించమని తన కుమారునికి ఇచ్చును. ఇప్పుడు ఆయన కుమారుడు అతడిని ప్రేమించుట లేదని అనగలడా? అనలేడు. అదే సమయములో, ఆయన న్యాయస్థుడైన న్యాయాధికారిగా ఉండలేదని కూడా ఎవరూ అనలేరు, ఎందుకనగా తన కుమారునికి చట్ట ప్రకారముగా వెయ్యవలసిన పూర్తి శిక్షను వేసెను. అదే దేవుడు మన విషయములో కూడా చేసెను. న్యాయధికారిగా మనమందరము మన పాపముల కొరకు మరణించవలసి యుందని తెలియజేసెను. అప్పుడు ఒక మానవునిగా ఆ శిక్షను ఆయనే భరించుటకు వచ్చెను.

దేవుడు ఒక్కడే ఆయనను, ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉందురని బైబిలు చెప్పుచున్నది. వారు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. దేవుడు ఒకే వ్యక్తి అయినచో, ఆయన పరలోకమందలి సింహాసనమును విడిచిపెట్టి ఈ భూమిపైకి యేసు అను మనుష్యునిగా రానవసరము లేదు. ఈ విశ్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు ముగ్గురుగా ఉండబట్టే న్యాయాధిపతి అయిన పరలోకమందుండిన తండ్రి ఎదుట కుమారుడు ఈ లోకమునకు వచ్చి మన పాపముల కొరకు మరణించ గలిగెను. కొంతమంది క్రైస్తవులు బాప్తిస్మమిచ్చునప్పుడు దేవునిలో ఒక వ్యక్తి యేసు మాత్రమే ఉండెనని అందువలన ’యేసు నామములోనే’ బాప్తిస్మమిచ్చెదరు. ఇది చాలా తీవ్రమైన తప్పు. ఎవడైనను తండ్రిని, కుమారుని ఒప్పుకొనకపోయినట్లయితే వాడు క్రీస్తు విరోధి అని 1యోహా. 2:22 లో చెప్పబడి యున్నది. అలా అయినట్లయితే దేవుడైన కుమారుడు మానవ రూపంలో యేసుక్రీస్తుగా వచ్చి, తన స్వంత మానవ ఇష్టాన్ని వదులుకొని తండ్రి చిత్త ప్రకారము చేసెను మరియు తండ్రియైన దేవుని యెదుట మన పాపములకు శిక్ష అనుభవించెను (1యోహా. 4:2,3).

యేసుప్రభువు పూర్తిగా దేవుడు మరియు ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు పూర్తిగా మానవుడు ఆయన సిలువపై మరణించినప్పుడు, ఆయన మానవజాతి పాపములన్నిటి కొరకు శిక్ష అనుభవించెను. మన పాపము యొక్క శిక్ష నిత్యత్వమంతా దేవుని నుండి మనలను వేరు చేయును. యేసుప్రభువు సిలువపై వేలాడినప్పుడు, ఆయన పరలోకమందున్న తండ్రి యొద్ద వేరు చేయబడెను. అటువంటి వేరుపడుట ఏ మానవుడైనా భరించు అతి గొప్ప బాధగా యుండును.

విశ్వంలో దేవుడు విడిచిపెట్టిన ప్రదేశమే నరకము. దేవుడు అక్కడ ఉండడు. కనుక నరకములో, సైతానులో నుండిన దుష్టత్వమంతా బయటపడ్తుంది. ఆ దుష్టత్వము నరకములోనికి వెళ్ళిన వారికి పరిస్థితులను మరింత ఘోరముగా చేయును. యేసు ప్రభువు సిలువపై వ్రేలాడి ఆ శిక్షను అనుభవించెను. ఆయన 6 గంటల పాటు సిలువపై వ్రేలాడెను. కాని ఆఖరి 3 గంటలు దేవుని చేత ఆయన విడిచి పెట్టబడెను. సూర్యుడు చీకటి కమ్మెను, భూమి కంపించెను. పరలోకమందున్న ఆయన తండ్రితో ఆయన కుండిన సంబంధము త్రెగిపోయెను. తండ్రి క్రీస్తుకు శిరస్సుగా యుండెను (1కొరి 11:3). మరియు క్రీస్తు విడిచి పెట్టబడినప్పుడు, అది ఆయన తలను త్రెంపి వేసినట్లుండెను. అది ఆయనకు ఎటువంటి బాధాకరమైనదో మన ఊహకు అందదు.

యేసుప్రభువు కేవలము సృష్టింపబడిన వాడైనట్లయితే, ఆయన ఆదాము నుండి జీవించిన మానవులందరి యొక్క శిక్షను భరించగలిగి యుండేవాడు కాడు. ఎందుచేతనంటే కోట్లకొలదిగా నుండిన నరహంతకుల స్థానములో ఒక్క మానవుడు ఉరివేయబడుట చాలదు. అయితే ఆ శిక్షను యేసుప్రభువు పరిమితిలేని దేవుడు కాబట్టి తీసుకొనగలిగెను.

ఇంకా, ఆయన పరిమితిలేని వాడు కాబట్టి, ఆయన నిత్యముండే శిక్షను మూడు గంటలలో తీసుకొనగలిగెను. యేసుక్రీస్తు దేవుడు కాకపోయినట్లయితే, తండ్రియైన దేవుడు మన పాపముల కొరకు ఆయనను శిక్షించుట ఒక గొప్ప అన్యాయముగా యుండును. దేవుడు ఒకరు చేసిన నేరము కొరకు వేరొకరిని, చివరకు అతడు అది తీసుకొనుటకు ఇష్టపడినా కూడా శిక్షించడు. నీ స్నేహితుడు నీవు పొందవలసిన శిక్షను తీసుకొని నీ స్థానములో ఉరికంభము ఎక్కడు. అది అన్యాయము. కనుక యేసు కేవలము సృష్టింపబడిన వాడైనట్లయితే, మరియు ఆయన మన పాపముల కొరకు శిక్షింపబడినట్లయితే, అది గొప్ప అన్యాయముగా నుండును.

కనుక సృష్టింపబడినది ఏది కూడా మన పాపముల గూర్చిన శిక్షను తీసుకొనుటకు అవకాశము లేదు. దేవుడు విశ్వమంతటికి న్యాయాధిపతి కాబట్టి ఆయన మాత్రమే మన శిక్షను తీసుకొనగలడు. మనలను శిక్షించుటకు ఆయనకు హక్కు ఉన్నది మరియు ఆయన పై మన యొక్క శిక్షను వేసుకొనుటకు హక్కు ఉన్నది. ఆయన ఈ భూమిపై యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు అదే ఆయన చేసారు.

క్రైస్తవ సత్యము యొక్క పునాది రెండు గొప్ప సత్యములపై ఆధారపడి యున్నది. మొదటిది, క్రీస్తు మానవజాతి పాపములకొరకు మరణించెను. రెండవదిగా ఆయన మూడు దినముల తరువాత మరణము నుండి లేచెను అనునది.

క్రీస్తు మరణము నుండి లేవకపోయినట్లయితే, ఆయన దేవుడనే ఋజువు లేదు. ఆయన మరణము నుండి లేచుట ఆయన చెప్పినవన్ని యదార్థమనుటకు రుజువుగా యున్నది. ఏ మత నాయకుడు కూడా ఎప్పుడూ లోకము యొక్క పాపముల గూర్చి చనిపోవుదునని ఎప్పుడూ చెప్పలేదు. మరియు ఏ మతనాయకుడు ఎప్పుడూ మరణము నుండి లేవలేదు. ఈ రెండు విషయములు యేసుక్రీస్తును ప్రత్యేకమైన వానిగా చేసినవి.

మతములన్ని కూడా ఇతరులకు మేలు చేయవలెనని మరియు సమాధానముతో జీవించవలెనని బోధించుచుండవచ్చును. కాని క్రైస్తవ విశ్వాసమునకు ఒక ప్రత్యేకమైన పునాది ఉన్నది. క్రీస్తు మన పాపముల కొరకు మరణించెను. మరియు మరణము నుండి తిరిగి లేచెను. అనునది ఈ రెండు సత్యములను క్రైస్తత్వము నుండి తీసివేసినట్లయితే, క్రైస్తవ్యము కూడా ఏ ఇతర మతము వలె మారును. ఈ రెండు సత్యములను క్రైస్తవ్యమును ప్రత్యేకముగా నిలిపినవి.

మనమందరము దేవునిని ప్రేమించునట్లు ఆయన చేత సృష్టింపబడినాము. కాని మనమందరము మన కొరకు మనమే జీవించియున్నాము. కనుక మనము దేవుని యొద్దకు వచ్చునప్పుడు దేవునికి సంబంధించిన వాటిని సంవత్సరములుగా దొంగిలించిన దొంగలవలె పశ్చాత్తాపముతో రావలెను. క్రీస్తు మనకొరకు మరణించినందున కృతజ్ఞతతో ఆయన యొద్దకు రావలెను, మరియు ఆయన మరణము నుండి లేచి ఈనాడు సజీవుడై యున్నాడని నమ్మవలెను. యేసుప్రభువు ఈనాడు జీవించి యుండకపోయినట్లయితే మనము ఆయనను ప్రార్థించగలిగియుండలేము - ఎందుకనగా నీవు ఒక మరణించిన వ్యక్తికి ప్రార్థించలేవు. కాని యేసు మరణము నుండి లేచెను. కాబట్టి, మనము ఆయనతో సంభాషిస్తున్నాము.

క్రీస్తు మరణము నుండి లేచిన తరువాత, ఆయన ఎత్తబడి పరలోకమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు దైవత్వములో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు భూమిపైకి వచ్చెను. మనము మనలను పరిశుద్ధాత్మకు లోబరుచుకొంటే ఆయన మనలను పరిశుద్ధులుగా చేయును. పరిశుద్ధాత్ముడు నీలో నింపబడినప్పుడు, నీవు పాపముపై విజయమొందే జీవితమును జీవించగలవు. పరిశుద్ధాత్ముడు మానవులలో నివసించుటకు పెంతెకొస్తను దినమున రాక మునుపు అటువంటి జీవితమును ఎవరు కూడా జీవించలేదు. అంతకు ముందు జనులు వారి బాహ్య జీవితములను మంచిగా అభివృద్ది చేసుకొనేవారు. వారి యొక్క అంతరంగ జీవితములలో పాపము చేత ఓడింపబడి మార్పు లేకుండా యుండేవారు. పరిశుద్ధాత్మ నీలో నింపబడినప్పుడు, దేవుడే నీ లోపల జీవించి నీవు దైవికమైన జీవితమును అంతరంగములో కూడా జీవించగలుగునట్లు చేయును.

దేవుడు నిన్ను క్షమించినప్పుడు నీ హృదయము సంపూర్తిగా శుభ్రపడును మరియు క్రీస్తు నీలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జీవించి నీ శరీరమును దేవుని యొక్క శరీరముగా చేయును.

నేనొకసారి సిగరెట్లు కాలుస్తున్న ఒక క్రైస్తవునితో మాట్లాడాను. అతడెప్పుడైనా చర్చిలో సిగరెట్టు కాల్చాడా అని అడిగాను. చర్చి భవనము దేవుని యొక్క ఇల్లు కాబట్టి అటువంటి పని ఎప్పుడూ చెయ్యను అని అన్నాడు. దేవుని యొక్క ఇల్లు అతడి శరీరమే కాని ఏదో ఒక చర్చి భవనము కాదని చెప్పాను. నీవు ఒక చర్చి భవనములో వ్యభిచారము చేయుదువా? చెయ్యవు. అలాగే నీవు ఇంటర్నెట్ లో చూచే బూతు చిత్రాలను చర్చిలో చూడవు. క్రీస్తు నీలో నివసించుచున్నప్పుడు, నీ శరీరము దేవుని యొక్క ఇల్లుగా యున్నది. కనుక నీవు నీ శరీర అవయవములతో ఏమి చేయుదువో జాగ్రత్తగా ఉండు. పొగత్రాగుట, త్రాగుడు, ప్రమాదకరమైన మందులను తీసుకొనుట మరియు చెడు తలంపులను నీ మనస్సులోనికి రానిచ్చుట వంటివి క్రమక్రమముగా నీ శరీరమును మరియు మనస్సును పాడుచేయును.

క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెము వంటిది. మనము పాపమునకు మన వీపును చూపినప్పుడు మరియు తిరిగి జన్మించినప్పుడు, మనము పరుగు పందెము యొక్క ప్రారంభపు గీత యొద్దకు వచ్చుదుము. అప్పుడు ఒక మారథాను పరుగు పందెము మొదలగును, అది మన జీవితాంతము వరకు ఉండును. మనము పరిగెట్టుదుము ఇంకా పరిగెట్టుదుము, ఇంకా ఇంకా పరిగెట్టుదుము. ఆ విధముగా మనము ఒక్కొక్క రోజు చివరి గీతకు దగ్గరగా దగ్గరగా వచ్చుచుందుము. కాని మనము పరిగెత్తుట మానకూడదు. ఇంకొక ఉదాహరణ : మనము తిరిగి జన్మించినప్పుడు, మనము మన ఇంటికి పునాది వేయుదుము. దాని తరువాత మనము నెమ్మదిగా పై నిర్మాణము కట్టుదుము. ఆ ఇంటికి ఎన్నో అంతస్తులుండును.

ఇది నీవు ఎప్పుడైనా శ్రేష్టముగా జీవించు జీవితము ఎందుకనగా నీవు నీ జీవితములో చెడును పూర్తిగా తీసివేసి ఒక్కొక్క సంవత్సరము గడిచేకొద్ది మరి ఎక్కువగా దేవుని వలె మారుదువు.

కనుక తిరిగి జన్మించుటకు ఏమి చేయవలెను?

మొట్టమొదటగా నీవు పాపివని ఒప్పుకో. ఇతరులతో నిన్ను నీవు పోల్చుకోవద్దు మరియు వారి కంటె నీవు మెరుగుగా నున్నావని ఊహించుకొనుచు ఆదరణ పొందకు. పాపము మరణింపజేసే విషము వంటిది. నీవు ఆ విషమును ఒక చుక్క త్రాగినా వంద చుక్కలు త్రాగినా నీవు మరణించుదువు. కనుక, నీవు నీ క్రైస్తవ జీవితములో మంచి ప్రారంభము ప్రారంభించాలంటే, ఈ లోకములో నుండిన ఘోరమైన పాపికంటె నీవు ఏ మాత్రము మంచి వాడవు కాదని ఒప్పుకో. అప్పుడు నీ జీవితములో నీకు తెలిసిన ప్రతి పాపము నుండి వెనుకకు తిరుగుటకు నిర్ణయము తీసుకో.

అప్పుడు క్రీస్తు నందు విశ్వాసముంచు, దాని అర్థము నిన్ను నీవు క్రీస్తుకు అప్పగించుకొనుచున్నావు, ఆయన గూర్చి నీ మనస్సులో ఏదో ఒకటి నమ్మడం కాదు. నిన్ను నీవు ఒకరికి అప్పగించుకొనకుండా అతడిని నమ్మవచ్చును. ఒక పెండ్లికుమార్తె ఆమె వివాహ సమయంలో "ఈ వ్యక్తికి నీవు అప్పగించుకొనుటకు ఇష్టపడుచున్నావా? అని ప్రశ్నింపబడింది. ఆమె ఈ మనుష్యుడు మంచి వాడని నమ్ముచున్నాను. కాని నా జీవితము మరియు భవిష్యత్తు అతడికి అప్పగించవచ్చో లేదో తేల్చుకోలేక పోవుచున్నాను", అని చెప్పినదనుకోండి. అప్పుడు ఆమెకు అతడిపై విశ్వాసము లేనందున ఆమె అతడిని వివాహము చేసికొనలేదు. ఒక స్త్రీ వివాహము చేసికొనినప్పుడు ఆమె జీవితపు దిశ మారును. ఆమె ఇంటిపేరు భర్త ఇంటి పేరుగా మారును. ఆమె తన తల్లి దండ్రుల ఇల్లు వదిలి తన భర్తతో పాటుగా నివసించుటకు వెళ్ళును.

ఎక్కడ నివసించుచున్నాడో తెలియక పోయినా, ఆమె భవిష్యత్తు అంత అతడిపై వేసి నమ్ముతుంది. ఆమెకు అతడిపై విశ్వాసముంటుంది. క్రీస్తుయందు విశ్వాసముంచుట గూర్చి ఇది యొక దృశ్యం.

"క్రైస్తవుడు" అను మాటకు (గౌరవ సూచకముగా చెప్పవలెనంటే) అర్థము "శ్రీమతి క్రీస్తు"! నా భార్య నన్ను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె నా పేరు మాత్రమే పెట్టుకొనును. అదే విధముగా నీవు క్రీస్తును వివాహము చేసుకొనినట్లయితే నీవు క్రీస్తు నామమును తీసుకొని నిన్ను నీవు "క్రైస్తవుడు" అని పిలుచు కొనవచ్చును. ఏదొక స్త్రీ నన్ను వివాహము చేసుకొనకుండా ఆమె "శ్రీమతి జాక్ పూనెన్", అని పిలుచుకొని నట్లయితే అది ఒక అబద్ధమై యుండును. అదే విధముగా, ఎవరైనా క్రీస్తును వివాహము చేసుకొనకుండా క్రైస్తవుడని పిలుచుకొని నట్లయితే అతడు అబద్ధము చెప్పుచున్నాడు.

ఒక వివాహము కొద్దిరోజులు కాక ఎప్పటికీ ఉంటుంది. అదే విధముగా క్రైస్తవుడుగా ఉండుట కూడా జీవితకాల పర్యంతము ఉండే బంధము. క్రీస్తుకు నిన్ను నీవు అప్పగించుకొనుట, నీవు సంపూర్ణుడైనట్లు కాదు. ఒక స్త్రీని వివాహము చేసుకొనినప్పుడు, ఆమె జీవితములో ఇంకెప్పుడూ ఏ పొరపాటు చేయనని వాగ్ధానము చేయదు. ఆమె అనేక పొరపాట్లు చేయును, కాని ఆమె భర్త ఆమెను క్షమించును. ఆమె తన భర్తతో ఎప్పటికిని కలిసి జీవించుదునని వాగ్ధానము చేయును. క్రీస్తుతో మన ఐక్యత గూర్చిన దృశ్యము ఇది.

తరువాత మెట్టు నీవు తీసుకొనవలసినది నీటి బాప్తిస్మము. బాప్తిస్మము తీసుకొనుట వివాహ నిర్ధారణ పత్రము తీసుకొనుటవంటిది. కేవలము సర్టిఫికేట్ పొందుట వలన నీవు వివాహము చేసుకొనలేవు. నీవు వివాహము చేసుకొనిన తరువాత మాత్రమే నీకు వివాహ సర్టిఫికేట్ వచ్చును. అదే విధముగా, నిన్ను నీవు క్రీస్తుకు ఇచ్చుకొనిన తరువాత నీవు బాప్తిస్మము తీసుకొనవచ్చును. బాప్తిస్మములో, నీవు నీ యొక్క పాత జీవితమునకు ముగింపు పలికావని మరియు యేసుక్రీస్తును నీ జీవితమునకు ప్రభువుగా చేసుకొంటివని నీవు సాక్ష్యమిచ్చుచున్నావు.

మంచి భర్తలు మరియు భార్యలు ఒకరితో ఒకరు చాలా మాట్లాడుకొందురు. కనుక నీవు యేసుతో మాట్లాడవలెను మరియు ప్రతిరోజు బైబిలు ద్వారా ఆయన నీతో మాట్లాడుచున్నప్పుడు వినవలెను.

ఒక మంచి భార్య తన భర్తకు ఇష్టము కానిది ఏదీ చేయదు. ఆమె ప్రతిది అతడితో కలిసి చేయుటకు ఇష్టపడును. ఒక నిజమైన క్రైస్తవుడు కూడా క్రీస్తుకు ఇష్టము కాని - యేసు చూచుటకు ఇష్టపడని సినిమాలు చూచుట వంటి వాటిని చేయడు. యేసుతో కలిసి చేయలేని దానిని అతడు చేయడు.

నీవు తిరిగి జన్మించావనే నిశ్చయత నీకున్నదా? అవును నీవు తిరిగి జన్మించినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ ఆత్మతో కలిసి నీవు దేవుని బిడ్డవని సాక్ష్యమిచ్చును అని రోమా 8:16 చెప్పుచున్నది.

ఇది అద్భుతమైన జీవితము ఎందుకనగా ఎవ్వరైనా ఎప్పుడైనా పొందగలిగే మంచి స్నేహితునితో జీవించుచున్నావు. యేసు ఎల్లప్పుడు మరియు ప్రతి చోటా మనలో ఉండును కాబట్టి మనము ఒంటరిగా ఉండము. మన సమస్యలను ఆయనతో పంచుకొని వాటిని పరిష్కరించుటకు సహాయము ఆయనను అడుగవచ్చును. మన భవిష్యత్తు యేసు ప్రభువు చేతులలో ఉన్నది కాబట్టి ఆందోళన మరియు భయము నుండి విడుదల పొందిన సంపూర్తియైన సంతోషముతో జీవించే జీవితము అది.

నీవు తిరిగి జన్మించాలని అనుకొంటే, నీ హృదయము నుండి నిష్కపటముగా ఈ క్రింది మాటలను ఇప్పుడే చెప్పు.

"ప్రభువైన యేసూ, నీవు దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను. నేను నరకమునకు పోవుటకు అర్హుడను. నన్ను ప్రేమించి నా పాపముల కొరకు సిలువపై మరణించినందుకు కృతజ్ఞతలు. నీవు మరణము నుండి లేచి ఈనాడు సజీవుడవుగా ఉన్నావని నమ్ముచున్నాను. నా యొక్క పాప జీవితము నుండి ఇప్పుడే మారాలని కోరుకొనుచున్నాను. దయచేసి నా పాపములన్నిటిని క్షమించి పాపము యెడల నాకు ద్వేషమును కలిగించుము. నాకు ఏ విధముగా నైనా హాని చేసిన ప్రతి ఒక్కరిని నేను క్షమించుచున్నాను. ప్రభువైన యేసూ, నా జీవితములోనికిరా, మరియు నా జీవితమునకు ఈనాటి నుండి ప్రభువుగా ఉండుము. ఇప్పుడే నన్ను దేవుని యొక్క బిడ్డగా చేయుము."

"తన్ను ఎందరంగీకరించిరో వారి కందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను" (యోహా 1:12) అని దేవుని వాక్యము చెప్పుచున్నది. ప్రభువైన యేసు నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను (యోహా 6:37) అని చెప్పెను.

కనుక ఆయన నిన్ను అంగీకరించెను అని నిశ్చయత కలిగి యుండవచ్చును.

అప్పుడు నీవు ఆయనకు "ప్రభువైన యేసూ నీవు నన్ను క్షమించి నన్ను స్వీకరించినందుకు వందనములు. దయతో నీ పరిశుద్ధాత్మతో నింపి నీ కొరకు జీవించుటకు శక్తి నిమ్ము. ఈ రోజు నుండి నిన్ను మాత్రమే సంతోష పర్చవలెనని కోరుకొనుచున్నాను". అని కృతజ్ఞతలు చెల్లిస్తూ చెప్పుము.

ఇప్పుడు నీవు ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుతూ ప్రతి దినము ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపుమని అడుగుము. నీకు ఇతర తిరిగి జన్మించిన క్రైస్తవులతో సహవాసము చెయ్యవలసిన అవసరమున్నది. కేవలము ఆ విధముగా మాత్రమే నీవు నీ క్రైస్తవ జీవితములో ఎదుగుదువు మరియు ప్రభువును వెంబడించుట కొనసాగించుటకు శక్తి పొందుదువు. కనుక ఒక మంచి సంఘమునకు నడిపించుమని ప్రభువును అడుగుము.

దేవుడు నిన్ను అధికముగా దీవించును గాక!