క్రొత్త నిబంధనలోను మరియు యెషయా 40 నుండి 66 అధ్యాయములలోను ఉన్న ఒక ముఖ్యమైన విషయము 'పరిశుద్ధాత్ముడు'.
"ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు"(యెషయా 42:1). ఒక నిజమైన దేవుని సేవకుడు, దేవుని చేతనే ఆదుకొనబడతాడు (సంరక్షించబడతాడు)గాని డబ్బుద్వారాగాని సంస్థద్వారాగాని లేక మనుష్యులద్వారాగాని కాదు. అన్ని సమయములలో మనలను ప్రభువే సంరక్షించాలి. మనుష్యులు మనకు బహుమతులు ఇవ్వవచ్చును. కాని మనము డబ్బు మీదగాని లేక మనుష్యుల మీదగాని ఎప్పుడైనను ఆధారపడకూడదు. మనము దేనిమీద లేక ఎవరిమీద ఆధారపడియున్నామనేది ఇక్కడ 'ఆదుకొనుటగా' చెప్పబడింది. మనము ప్రభువుమీద మాత్రమే ఆధారపడాలి. మనకు మనము ఏమియు చేసుకోలేని బలహీనులమని మనము తెలుసుకొనినప్పుడు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు.
యెషయా 42:2,3లో "అతడు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు". మత్తయి 12:18,19లో ప్రభువైనయేసుని గూర్చి ఈ మాట చెప్పబడింది. "ఈయన జగడమాడడు, కేకలు వేయడు ఈయన నలిగిన రెల్లును విరువడు".
దీని భావము, తన జీవితములో పూర్తిగా ఓడిపోయిన వ్యక్తిని ప్రభువు ఎన్నడైనను నిరాశపరచడుగాని అతనిని ప్రోత్సహించి మరియు అతనిని స్వస్థపరిచి, సమస్తమును బాగుచేయును. మకమకలాడుచున్న జనుపనారవత్తిని ఆయన ఆర్పడు. దానికి బదులుగా, అది బాగా మండునట్లు ఆయన ఊదును. ఓడిపోయిన బలహీన విశ్వాసులకు సహాయపడుటకు దేవుడు ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఎవరైతే నిరాశనిసృహలలో కృంగియున్నారో వారిని పురికొల్పి ఉజ్జీవింపచేయాలని ఆయన ఆసక్తి కలిగియున్నాడు.
అలాగే ఒక నిజమైన సేవకుడు కూడా, ఎవరైతే నిరాశ నిసృహలతో నిరీక్షణ లేకుండా ఉండి, వారి జీవితములలో అలసి, విసిగిపోయారో వారిని ప్రోత్సహించి వారి ఆత్మలను ఉజ్జీవింపచేస్తాడు. అటువంటి పరిచర్య ప్రతిచోట అవసరము గనుక అటువంటి పరిచర్య చేయుటకు మనమందరము ఆసక్తి కలిగియుందాము.
యెషయా 42:6-8లో దేవుడు చెప్పుచున్నాడు, "గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధించబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును.. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచాను". ఇది ఎంతో గొప్ప పరిచర్య. కాని ఒక విషయము ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 'ప్రభువు ఈలాగు చెప్పుచున్నాడు, "ఎవరికిని నామహిమను నేనిచ్చువాడను కాను"' (యెషయా 42:8).
మన పరిచర్యలో మనము ఎటువంటి మహిమ(ఘనత)ను ఎన్నడైనను కోరకూడదు. మనము చేసినదానికి ఘనతనుగాని లేక మహిమనుగాని కోరుట చాలా తీవ్రమైన నేరము. అది డబ్బు దొంగలించుట కంటే ఘోరమైనది. దేవుడు నిన్నును మరియు నీపరిచర్యను ఆశీర్వదించి, నిన్ను బహుగా వాడుకొనవచ్చును. కాని ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు. చాలామంది దేవుని సేవకులు తమ్మును తాము పాడుచేసుకొనినట్లు, నీవుకూడా దేవుని మహిమను ముట్టుటకు ప్రయత్నించినయెడల ఎంతో నష్టపోయెదవు. ఒకసారి నిన్ను నీవు హెచ్చించుకొనుట ఆరంభించి ప్రజలను ప్రభువులోనికి కాక నీవైపు ఆకర్షిస్తూ, నీవు చేసిన దానంతటికీ నీవే ఘనతపొందుటకు ఆరంభించినట్లయితే నీవు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఈ విధముగా అనేకమంది దేవుని అభిషేకమును కోల్పోయారు.
యెషయా 42:19,20లో "నా సేవకుడు తప్ప ఎవరు గ్రుడ్డివాడు? నేను పంపు నాదూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నాభక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరిఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులు చూచుచున్నావు గాని గ్రహించకున్నావు" ఇది ప్రభువైనయేసును గూర్చి చెప్పబడింది. కాబట్టి ఆశ్చర్యముగా ఉన్నది (యెషయా 42:1 చూడండి).
దీని భావము ఏమిటి? ఒక నిజమైన దేవుని సేవకుడు తన చుట్టూ జరిగే విషయములలో గ్రుడ్డివాడుగాను మరియు చెవిటివానిగాను ఉంటాడు. అతడు అనేక సంగతులను చూస్తాడుగాని వాటిని గమనించడు(యెషయా 42:20). వేరే వారిలో ఉన్న పాపములను చూచుటకు అటుఇటు వెళ్ళడు. వేరే వారు మాట్లాడే విషయములలో తప్పులు పట్టుకొనుటకు అతడు ఎవరి దగ్గరకు వెళ్ళడు. పరిసయ్యులు ఆవిధముగా ఉన్నారు - వారు ఎల్లప్పుడు ప్రభువును నిందించుటకు ఏదైనా దొరుకుతుందేమోనని వెదకుతూ ఉండేవారు. వేరే వారి పరిచర్యను చూచి అసూయపడి ఈనాడు కూడా ఆవిధముగా వారిని నిందించుటకు అవకాశము కొరకు అనగా వారిలో ఏదైనా పొరపాట్లను కనుకొనుటకు ఎదురుచూచే క్రైస్తవులనేకులు ఉన్నారు. అలాగుండకూడదు.
నీ చుట్టూ జరిగే సంగతుల విషయములో గ్రుడ్డివాడుగాను, మూగవాడిగాను ఉండుము. నీమీద ఎవరైనా తప్పుడు నిందను వేశారా? నీవు చెవిటివాడవైతే దానిని వినవు. కాబట్టి అట్టి విషయాలలో మూగవాడుగా ఉండుము. అందమైన స్త్రీల విషయములో దేవుని సేవకుడు "గ్రుడ్డి"వాడుగా ఉండుట మంచిది కాదా? నీకు కళ్ళు ఉన్నవి కాని నీవు చూడవు. నీవు "గ్రుడ్డివాడవు". నీకు చెవులు ఉండి కూడా వినవు. ఎందుకనగా నీవు చూచే దానిని బట్టి లేక వినే దానిని బట్టి తీర్పుతీర్చవు. ప్రభువైనయేసు ఈవిధముగా జీవించారు. మనము కూడా అలాగే జీవించాలి(యెషయా 11:3).