"నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది" (మత్తయి 5:10). "ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది" అని ఇంతకు ముందు మనం చూశాము. మనం వినయం, శాంతిని అనుసరించడం, నీతి కోసం ఆకలిదప్పులతో ఉండే స్థానాన్ని తీసుకున్నప్పుడు మరియు మనం సౌమ్యతను అనుసరించి మన హక్కుల కోసం పోరాడనప్పుడు, లోకంలో దుష్టులు హింసకులైన వ్యక్తులను మనం ఎదుర్కొంటాము. దైవిక మార్గంలో జీవించడానికి ప్రయత్నించే వారందరూ హింసించబడతారు. కాబట్టి మనం నీతితో జీవించడానికి ప్రయత్నిస్తే, మనం హింసించబడతాము.
2 తిమోతి 3:12వ వచనం పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన ఒక ఖచ్చితమైన ప్రకటన. పౌలు ఇలా అంటున్నాడు, "క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు". అది "కొందరు" అని చెప్పలేదు; అది "చాలామంది" అని చెప్పలేదు; అది "అనేకులు" అని చెప్పలేదు. అది కొందరు, చాలామంది, అనేకులు లేదా అందరూ ఏదైనా కావచ్చు. అది "అందరూ" అని చెబుతోంది. అందరూ అంటే క్రీస్తు యేసులోని ప్రతి విశ్వాసి (తనను తాను విశ్వాసి అని పిలుచుకునే ప్రతి ఒక్క వ్యక్తి కాదు కానీ దైవిక జీవితాన్ని గడపాలని కోరుకునే ప్రతి ఒక్కరూ).
నీతి కోసం హింసించబడటం అంటే ఏమిటి? నీతి కోసం నిలబడటం అంటే ఏమిటో మనం పరిగణించాలి. అంటే మీ పని ప్రదేశంలో లేదా ఏదైనా పరిస్థితిలో, "నేను ఆ తప్పు చేయను" అని మీరు చెప్పటం. ప్రజలు రాజీపడే అనేక ఉద్యోగాలు ఉన్నాయి - వారు అబద్ధాలు చెబుతారు, మోసం చేస్తారు మరియు అన్యాయమైన పనిని పూర్తి చేయడానికి లంచాలు ఇస్తారు. క్రైస్తవులు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు, వారు హింసను ఎదుర్కోరు; కానీ వారు ఆ మార్గంలో వెళ్ళడానికి నిరాకరిస్తే, వారు లంచం తీసుకోవడానికి లేదా అన్యాయమైన పనిని చేయడానికి నిరాకరిస్తే, ఆ లంచంలో వాటా లేదా మరేదైనా కోరుకునే పైన ఉన్న వ్యక్తుల నుండి వారు బెదిరింపులను ఎదుర్కోవచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు నీతి కోసం నిలబడినప్పుడు, మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు లేదా మీ యజమానుల నుండి అయిష్టతను ఎదుర్కొనవచ్చు, కానీ పరలోక రాజ్యం మీకు చెందినది. ఈ ప్రక్రియలో మీరు భూమిపై ఏదైనా కోల్పోవచ్చు - బహుశా మీ స్థానం, బహుశా పదోన్నతి - కానీ బదులుగా మీరు పరలోకానికి సంబంధించిన దాన్ని పొందుతారు. అది తగినదేనా?
ఏదైనా పరిస్థితిలో ప్రవేశం(అడ్మిషన్) పొందడానికి లేదా ఉద్యోగం పొందడానికి ఒక వ్యక్తి అబద్ధం చెప్పడం సరైనదేనా? సరియైన కాదు! ఒక క్రైస్తవుడికి అది ఎప్పటికీ కాదు. అతను దేవుని చిత్తానికి దూరంగా ఉంటాడు కాబట్టి అతను అలా చేయకపోవడమే చాలా మంచిది. మీరు అబద్ధం చెప్పడం ద్వారా ఏదైనా పరిస్థితిలోకి ప్రవేశిస్తే, దేవుడు మిమ్మల్ని అక్కడికి నడిపించలేదని మీరు ఖచ్చితంగా నిర్దారించు కోవచ్చు. మీరు ఒక ఇరుకైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, అపవాది మీతో, "ఇక్కడ అబద్ధం చెప్పు ఎందుకంటే అబద్ధం సర్వశక్తిమంతమైంది, అది నీకు ఏదైనా సాధించి పెట్టగలదు" అని చెప్పవచ్చు. పరిశుద్ధాత్ముడు ఇలా చెప్తాడు, "లేదు, అది అబద్ధం; దేవుడు సర్వశక్తిమంతుడు. మీరు కోరుకున్నది పొందడానికి అబద్ధం చెప్పడం అత్యంత శక్తివంతమైన మార్గం కాదు. దేవుని కోసం నిలబడు. దేవుడు నీకు ఏమి కావాలో అది ఇవ్వగలడు." అప్పుడు మీరు పొందవలసినది దేవుడు మీకు ఇస్తాడని మీరు కనుగొంటారు.
నేను నౌకాదళంలో పనిచేస్తున్నప్పుడు, నా సీనియర్ అధికారుల ముందు నిలబడి, "క్షమించండి సార్, నా మనస్సాక్షి నన్ను అనుమతించదు కాబట్టి నేను అలా చేయలేను. నేను క్రైస్తవుడిని" అని చెప్పాల్సిన అనేక సందర్భాలు నాకు గుర్తున్నాయి. అలా సైన్యంలో చెప్పడం చాలా ప్రమాదకరమైన విషయం. లౌకిక ఉద్యోగంలో అలా చెబితే, మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించి బయటకు పంపుతారు. కానీ సైన్యంలో అలా చెప్తే, మీరు కోర్టు మార్షల్ చేయబడే ప్రమాదం ఉంది, అంటే కోర్టుకు తీసుకెళ్లి జైలులో పెడతారు. ఎందుకంటే సైన్యంలో ఆదేశాలను పాటించకపోవడం చాలా తీవ్రమైన విషయం. అలా జరిగిన అనేక సందర్భాలు నాకు గుర్తున్నాయి, దేవుడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని నేను నమ్మాను. వారు నా మనస్సాక్షికి విరుద్ధంగా ఏదైనా చేయమని అడిగితే, నేను, "క్షమించండి సార్, నేను క్రైస్తవుడిని, నేను అలా చేయలేను" అని అన్నాను. అధికారిది ఎంత పెద్ద స్థానం అయినా సరే.
దాని వల్ల నేను ఏదో ఒక విధంగా బాధపడే అవకాశం ఉంది, అంటే పై అధికారి నాకు పదోన్నతి కోసం మంచి సిఫార్సు ఇవ్వకపోవచ్చు. ఒకసారి నన్ను అరగంటలోపు వేరే స్థానానికి బదిలీ చేశారు. నాకు అసౌకర్యం కలగవచ్చు, కానీ అది పర్వాలేదు. మీరు దీన్ని అస్సలు హింస అని పిలవలేరు; ఇవి తొలి క్రైస్తవులను తిన్న సింహాలతో పోలిస్తే చిన్న దోమ కాటు లాంటివి. కానీ తొలి క్రైస్తవులు కూడా వీటిని ఎదుర్కొన్నారు.
దేవుడు మిమ్మల్ని ఇందులో పరీక్షిస్తాడు. దేవుడు నన్ను వేర్వేరు సమయాల్లో పరీక్షించాడని నాకు తెలుసు మరియు నేను ఆ ప్రదేశాలలో ఆ పరీక్షలో విఫలమై ఉంటే, నేను ఈ రోజు ఉన్న స్థితిలో ఉండేవాడిని కాదని మరియు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నాకు ఉండేది కాదని నేను నమ్ముతున్నాను. మీరు నిజాయితీగా ఉండి, నీతి కోసం కొన్ని చోట్ల భూసంబంధమైన నష్టాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉంటే బహుశా మీకు పరిచర్య ఉండేది. పరలోక రాజ్యం కొంతవరకు మీదే అయ్యేది, కానీ మీరు దానిలో కొంత కోల్పోయారు. గతం గురించి మీరు ఏమీ చేయలేరు; మీరు కోల్పోయిన దానిని తిరిగి పొందలేరు. కానీ భవిష్యత్తు గురించి మీరు ఏదైనా చేయగలరు. "ప్రభువా, కనీసం రాబోయే రోజుల్లో, నేను నీతి కోసం, యథార్థత కోసం నిలబడాలనుకుంటున్నాను" అని చెప్పండి. ఒక క్రైస్తవుడు ఏ విషయంలోనూ వక్రంగా ఉండకూడదు. ఒక క్రైస్తవుడు ఏ విధమైన లాభం కోసం అబద్ధం చెప్పకూడదు లేదా మోసం చేయకూడదు. దేవుడు వారికి గొప్ప పరిచర్యను అప్పగించగలిగేలా దృఢంగా నిలబడే వారి కోసం చూస్తున్నాడు.