"అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుగూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలనైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తుయేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను" (ఫిలిప్పీ 3:7-14).
ఈ మాటలు క్రైస్తవమార్గములో ఉన్న ఆసక్తికలిగిన యవ్వనస్దుడు వ్రాసిన మాటలు కాదు. దేవుని జీవములోని ఐశ్వర్యములన్నిటితోను మరియు జీవముతోను నింపబడి పరిణితి చెందిన క్రైస్తవుని యొక్క సాక్ష్యమిది. పౌలు రక్షణపొంది 30సంవత్సరాలైనవి. దేవుడు తనపరిచర్యను సూచికక్రియలతోను, మహత్కార్యముచేతను ధృడపరచి మరియు అనేక సంఘములను స్ధాపించుటకు దేవుడు అతనిని వాడుకొనియున్నాడు. మొదటి నుండి పౌలు సువార్త పని చేయుచూ అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తూ, అనేక శ్రమలలో గుండా వెళ్ళాడు. తాను ప్రభువు సారూప్యములోనికి రూపాంతరము పొందేకొలది, పాపము మీద జయముపొందుట అనే సత్యమును తెలుసుకున్నాడు. అతడు పొందిన అనేక సంతోషకరమైన అనుభవాలలో ఒకటి, మూడవఆకాశానికి అతడు ఎత్తబడి అద్భుతమైన ఆత్మీయప్రత్యక్షతలు పొందుకున్నాడు.
ఇవన్నియు పొందుకొని, అనుభవించిన తరువాత కూడా, దేవుని దయాసంకల్పము ప్రకారము ఇంకను పరిపూర్ణుడను కాలేదని చెప్పుచున్నాడు. తాను పరిపూర్ణుడగుటకు ఇంకను సాగిపోవుదునని క్రైస్తవులందరిలోని గొప్పవారిలో ఒకడైన పౌలు చెప్పుచున్నాడు. చాలామంది విశ్వాసులు రక్షణ పొందుట అనగా క్రొత్తగా జన్మించి, దేవుని తీర్పును తప్పించుకొనుట మాత్రమేననుకొనుట ఆశ్చర్యముగా ఉన్నది. కాని అపొస్తులునికి గాని లేక క్రీస్తు యొక్క శిష్యుడుగా ఉండాలని కోరువారుగాని దానితో తృప్తిపడరు. ఒక సంకల్పముతో క్రీస్తు తనను పట్టుకున్నట్టు ధృడవిశ్వాసముతో పౌలు చెప్పుచున్నాడు. దానికి స్పందనగా తాను దేనికొరకైతే పట్టబడ్డాడో దానిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఎంతో నిజమైన సత్యము. మనము రక్షణపొందినప్పుడు ఆయన మనలను పట్టుకొన్నది కేవలము నరకము నుండి రక్షించి పరలోకానికి తీసుకెళ్ళటమే గాక, గొప్ప సంకల్పముతో మనలను పట్టుకున్నాడు. 30సంవత్సరాలు నిరంతరము క్రైస్తవపరిచర్య చేసి ఎంతో పరిణితి చెందిన పౌలు, నేను ఇంకను దేవునిచిత్తప్రకారము సంపూర్ణసిద్ధి పొందలేదంటే, అది ఎంతగొప్ప సంకల్పమైయుండవచ్చును.
పైన ఉన్న వాక్యభాగములో పౌలు ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు. తనయెడల దేవుని యొక్క సంకల్పమును గ్రహించి, పొందుకొనుటకు ఈ లోకములో ఉన్న సమస్తమును పెంటగా యెంచుకొనియున్నాడు. దేవుడు అనుగ్రహించే ఈ బహుమానము కొరకు సమస్తమును విడిచిపెట్టవచ్చునని పౌలు తలంచియున్నాడు (ఫిలిప్పీ 3:14). మనము ఈనాడు విశ్వాసులను చూచినట్లయితే వారు సిరిసంపదలను కోరుచూ మరియు వస్తువాహనములను గట్టిగా పట్టుకొని, దేవుని విషయాలకంటే వీటికి ఎక్కువ విలువనిస్తూ వారు పౌలు కంటే చాలా వేరుగా ఉన్నట్లు నమ్మవలసియుంటుంది.
రక్షణ కేవలము నరకమునుండి తప్పించుకొనుటకు ఒక భీమాపథకము అనుకోవటం ఆత్మీయ పసితనాన్ని చూపిస్తుంది. మనము ఆత్మీయముగా వృద్ధిని పొంది పరిణితి పొందేకొలది, దేవుడు నిత్యత్వానికి మనకొరకు సిద్ధపరచిన మార్గములో నడుచుటకు రక్షించాడని గ్రహిస్తాము(ఎఫెసీ 2:10). ఆ మార్గమునే పౌలు తన యెడల దేవుని సంకల్పమని చెప్పుచున్నాడు. మనము కృపను (రక్షణ) పొందుకొని తృప్తిపడినట్లయితే నిత్యత్వానికి నిలిచేదేదియు చేయకుండానే జీవిస్తాము. క్రీస్తులో ఉన్న దేవుని కృపను పొంది ప్రజలు రక్షణ పొందకుండునట్లు ఏదొకవిధముగా వారికి గ్రుడ్డితనము కలుగచేయుటయే సైతానుయొక్క ముఖ్య ఉద్దేశ్యము (2 కొరంథీ 4:4). ఆ విషయములో అతడు జయముపొందనియెడల, క్రొత్తగా రక్షణపొందిన విశ్వాసికి దేవుని యొక్క పూర్తి సంకల్పము తెలియకుండునట్లు అతనికి గ్రుడ్డితనము కలుగునట్లు చేయును. చాలా వరకు సాతాను ఈ విషయములో జయించాడు. నిజముగా రక్షణపొందిన అనేక వేలమంది విశ్వాసులు, ముఖ్యమైన విషయాలలో కూడా దేవునిని వెదకని వారుగా ఉన్నారు.
ఫిలిప్పీ పత్రికలోని ఈ వాక్యభాగములో ఒక క్రైస్తవుడు సంపూర్ణుడగునట్లు ఏవిధముగా కొనసాగాలో వర్ణించాడు. మనము ఆత్మీయముగా ఎంత వృద్ధిపొందినను, ఈ భూమి మీద సంపూర్ణులము కాలేము. అనేకమంది విశ్వాసులు ఈ విషయాన్ని నిర్లక్ష్యము చేయుటవలన, వారు సజీవసాక్ష్యముగా లేరు. వారికి ఉన్న సాక్ష్యమేమిటంటే, వారు ఒక రోజున కూటములో తీర్మానము తీసుకొని చేతులెత్తుటయే. అది అద్భుతమైన విషయమే గాని తరువాత వారికి ఎటువంటి అనుభవము లేదు. రక్షణపొందిన తరువాత సోమరులుగా ఉండేవారి పరిస్థితి పాడైపోయిన ద్రాక్షతోటతో పోల్చబడినది (సామెతలు 24:30-34). ఒక తోటను ఎల్లప్పుడు కలుపుమొక్కనుండి, ముండ్లతుప్పల నుండి ఏవిధముగా కాపాడాలో అలాగే మనప్రాణము(స్వయం) విషయములో జాగ్రత్తపడాలి.