దేవుణ్ణి ఇంకా బాగా తెలుసుకొనుట మన వాంఛగా ఉండవలెను, ఎందుకంటే ఇదే నిత్యజీవమైయున్నది. మనము నిత్యత్వమంతా దేవునిని ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకొనుచు గడిపెదము. అందుచేత దేవున్ని తెలిసికొనుట తమ వాంఛగా కలిగియున్న వారికి నిత్యత్వము విసుగు పుట్టించదు. మన భూలోక జీవితము కూడా ఇక విసుగుపుట్టించేదిగా ఉండదు. ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు ఆదాముతో వ్యవహరించిన విధానములో ఆయన జీవమును గూర్చి మరియు ఆయన మార్గములను గూర్చి మనము కొంత నేర్చుకొందాము. అక్కడ భార్యకొరకు ఆదాము అవసరతను చూచి అతని కొరకు ఒక భార్యను చేసి ఆ అవసరతను తీర్చినది దేవుడేనని మనము చూచెదము. అక్కడ దేవుని స్వభావము ఎటువంటిదో మనము చూచెదము. దేవుడు ప్రజల అవసరతలకు ఎల్లప్పుడు అప్రమత్తముగా (మెళకువగా) ఉండి ఆ అవసరతలను తీర్చుటకు ఆయన చేయగలిగినంతయు చేయును. మనము దేవ స్వభావములో పాలుపొందినప్పుడు, మనము కూడా అలాగే మారుదుము. మన చుట్టూ ఉన్న వారి యొక్క అవసరతలకు సమస్యలకు, మెళకువగా నుండి ఆ అవసరతలను తీర్చుటకు మనము చేయగలిగినదంతయు చేయుదుము. దీనికి చాలాసార్లు మననుండి గొప్ప త్యాగము అవసరము. కాబట్టి దేవ స్వభావములో పాలుపొందుటకు ఈ వెల చెల్లించుటకు మనము సిద్ధముగా ఉన్నామా లేమా? అని మనలను మనము ప్రశ్నించుకోవలసిన అవసరము ఉన్నది.
మన యొక్క ఆదాము స్వభావము ఈ దేవ స్వభావమునకు ఖచ్చితముగా విరుద్ధముగా ఉన్నది. ఆదాము జీవము పూర్తిగా స్వార్థపూరితమైనది మరియు అది మన స్వంత అవసరతలకు మన కుటుంబ సభ్యుల అవసరతలకు మాత్రమే మనలను మెళకువగా చేయును. నిజానికి అది ఎంత స్వార్థముతోను అసూయతోను నిండియున్నదంటే, ఇతరుల అవసరతలను వేరొకరు తీర్చుట కూడా అది ఇష్టపడదు. దానికి బదులు ప్రజలు బాధపడుట చూచి అది ఆనందించును.
మానవుడు పాపము చేసినప్పుడు దేవుడు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటుఅటు తిరుగు ఖడ్గమును కలిగిన కెరూబులను నిలువబెట్టెను. జీవవృక్షము నిత్యజీవమును, అనగా దేవుని యెరుగుటను సూచించుచున్నది. జీవవృక్షము యెదుట ఉంచబడిన ఈ ఖడ్గము ద్వారా, ఎవరైనను ఇప్పుడు జీవవృక్షములో పాల్గొనగోరితే, అతడు మొదట తన స్వార్థపరమైన జీవముపైన ఈ ఖడ్గము పడుటను అనుభవింపవలెనని దేవుడు సాదృశ్యరూపముగా ఆదాముకు చూపించుచుండెను. ఆదికాండము 3:21లో ఆదాము హవ్వ పాపము చేసిన వెంటనే, దేవుడు ఏదేనులో ఒక జంతువును చంపి, వారికి ఆ జంతు చర్మము యొక్క చొక్కాయిలను తొడిగించెను. అక్కడ కూడా దేవుడు వారికి అదే పాఠమును నేర్పించుచుండెను. వారు కప్పబడుటకు ఏకైక మార్గము త్యాగము మరియు మరణము అనే మార్గము అని నేర్పించుచుండెను. ఆదాము మరియు హవ్వ మొదట తమ్మును తాము "మరణము" లేకుండా అంజూరపు ఆకులతో కప్పుకొనుటకు ప్రయత్నించిరి. కాని దేవుడు ఆ ఆకులను పడవేసి, వారు కప్పబడుటకు సరైన మార్గమును వారికి చూపించెను. గనుక మానవుడు ఆయనతో సహవాసము చేయుటకును ఆయనతో సహవాసము ధరించుటకు మార్గము త్యాగమేనని దేవుడు నొక్కిచెప్పుట మనము మొదటినుండే చూచెదము.
కయీను యొక్క ప్రధానమైన సమస్య అతడు తన సహోదరుని యెడల సరియైన ఉద్దేశ్యము కలిగిలేకపోవుటయేనని దేవుడు అతనితో చెప్పెను (ఆదికాండము 4:7). "కయీను నడచిన మార్గము"న నడచువారిని గూర్చి యూదా చెప్పెను (యూదా 11). వారు ఎవరు? వారి సహోదరుల యెడల మంచి ఉద్దేశ్యములను కలిగియుండని వారు. ఈ విషయములో మనమందరము ఆత్మీయ తనిఖీ చేసుకొనుట మంచిది. మీ స్థానిక సంఘములో ఉన్న సహోదర సహోదరీలకును వారి కుటుంబాలకును అతిశ్రేష్టమైన వాటినే మీరు కోరుకొనుచున్నారని మీరు యధార్థముగా చెప్పగలరా? ఇతర సంఘ శాఖలలో మీకు తెలిసిన ఇతర విశ్వాసులకు అతి శ్రేష్టమైన వాటిని మీరు కోరుకొనుచున్నారని మీరు చెప్పగలరా? తరువాత ఈ వృత్తమును ఇంకా పెద్దది చేసి మీరు తెలిసిన వారందరికీ, మీ బంధువులకు, మీ శత్రువులకు, మీకు ఏ విధముగానైనా హాని చేసిన వారికి మీరు అతిశ్రేష్టమైన వాటినే కోరుకొనుచున్నారేమో అని మిమ్ములను మీరు ప్రశ్నించుకొనుడి. వేరొక వ్యక్తికిగాని అతని పిల్లలకు గాని ఏదైనా మంచి జరిగినప్పుడు మీరు మీ హృదయములో (ఆనందమునకు బదులు) అలజడిని కనుగొన్న యెడల లేక అతనికి గాని అతని పిల్లలకు గాని ఏదైనా చెడు జరిగినప్పుడు మీ హృదయములో(దుఃఖమునకు బదులు) సంతోషమును కనుగొన్న యెడల, ఇటువంటి వైఖరులు దేనిని సూచించుచున్నవి? ఆదాము జీవము మీలో సజీవముగాను చురుకుగాను ఉన్నదని సూచిస్తున్నది.
మీతో మీరు యధార్థముగా ఉన్నయెడల, మీరు కయీను నడచిన మార్గమున నడచుచున్నారో లేదో అని మీరు వెంటనే కనుగొనవచ్చును. మీలో ఈ దుష్ట ఆదాము జీవమును మీరు చూచినప్పుడు, మీరు దేవుని అగ్నిని ఆయన అభిషేకమును నిరంతరము మీ మీద నిలిచియుండగోరిన యెడల, దానిని మీరు వెంటనే చంపవలెను.
గోధుమగింజ భూమిలో పడి పూర్తిగా చచ్చిపోయినప్పుడు మాత్రమే అది విస్తారముగా ఫలించును. తన అహము విషయములో పూర్తిగా చనిపోయిన వ్యక్తి ఇతరులు ఏమి చేసినా చేయకపోయినా ఎప్పుడు అభ్యంతరపడడు. అతడు అందరియెడల మంచి ఉద్దేశ్యము కలిగియుండును. తనకు సంబంధించిన ఏ విషయములోనైనను అతడు ఎప్పుడు కోపపడడు మరియు అతడు ఎవరితోను గొడవపడడు. తన కొరకు తాను జాలిపడుచు ఒక్క కన్నీటి చుక్కను కూడా కార్చడు - ఎందుకంటే మృతులు తమ సమాధులలో నిశ్చయముగా ఏడ్వరు.
కయీను తన సహోదరుడి పట్ల మంచి ఉద్దేశ్యమును కలిగియుండనందున అతని ముఖము వ్యాకులపడినట్టుగా ఉండెను (ఆదికాండము 4:6). మనము గ్రహించకపోవచ్చు గాని, మన హృదయాలలో ఉన్న వైఖరి మన ముఖముల మీద ప్రతిబింబించును. మీరు అందరి యెడల మంచి ఉద్దేశ్యములను కలిగియుంటే, మీ ముఖము దేవునియొక్క ఆనందముతో ఎల్లప్పుడు ప్రకాశించును. అనేకమంది విశ్వాసులు కయీను నడచిన మార్గమున నడుచుచున్నారు. వారి నీరసముగా ఉండే చిరునవ్వులు మరియు వారి పెదవులనుండి వచ్చు "దేవునికి స్తోత్రము" అను మాటల వెనుక, వారి సహ-విశ్వాసుల పట్ల తప్పు వైఖరులు కనబడును. ప్రజలు మిమ్ములను వ్యతిరేకించి మీకు చెడుచేసినప్పుడు, మీ హృదయము యొక్క నిజస్థితిని మీకు చూపించుటకు దేవుడు వారిని వాడుకొనును. మీరు వారిని ప్రేమింపలేని యెడల, మీ హృదయమును పరీక్షించుకున్నప్పుడు మీరు దేవుని స్వభావములో పాలుపొందలేదని చూపిస్తుంది. ఎందుకనగా తమ దేవుని స్వభావము శత్రువులను సహితము ప్రేమించు స్వభావము. యేసు, ఇస్కరియోతు యూదా పట్ల కూడా మంచి ఉద్దేశ్యమును కలిగియుండెను.
దేవుడు ప్రజలందరి కొరకు అతిశ్రేష్టమైన దానినే కోరుకొనును. ఈ స్వభావములో మనము కూడా పాలివారము కాగలము అనునదియే సువార్త యొక్క సందేశము. దీనిని అర్థము చేసుకొనని వారు సువార్తను ఏ మాత్రము అర్థము చేసుకోలేదు.