వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు శిష్యులు పురుషులు
WFTW Body: 

"నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు" (మత్తయి 5:11). ఈ వచనం "నీతి నిమిత్తం హింసించబడినవారు ధన్యులు..." అనే మునుపటి వచనాన్ని పోలి ఉంటుంది. కానీ యేసుప్రభు ఒక ముఖ్యమైన తేడాను చెప్తున్నారు.

10వ వచనం మరియు 11వ వచనం మధ్య వ్యత్యాసం ఏమిటంటే, 10వ వచనంలో, మీరు సరైన దాని కోసం నిలబడుతున్నారు. కొన్నిసార్లు సరైన దాని కోసం క్రైస్తవేతరులు కూడా నిలబడుతారు. ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు, సరైన తీర్పు ఇచ్చినందుకు చంపబడిన న్యాయమూర్తులు మరియు సరైన దాని కోసం నిలబడినందుకు శత్రువులచే చంపబడిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు ఇతరులు ఉన్నారు. ఇలా చేసేది కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవులు అని చెప్పుకునే అనేక మంది కంటే క్రైస్తవేతరులు కొన్నిసార్లు నీతి కోసం నిలబడటానికి ఇష్టపడటం సిగ్గుచేటు. తీర్పు దినాన మీరు చాలా ఆశ్చర్యకరమైన విషయాలను ఎదుర్కోబోతున్నారని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నామని ఊహించుకున్న క్రైస్తవులు రాజీపడేవారు మరియు వెనక్కు దిగజారినవారు అని బహిర్గతపరచబడతారు. మీరు నీతిమంతులైతే మరియు నీతి కోసం హింసించబడటానికి సిద్ధంగా ఉంటే, పరలోక రాజ్యం మీదే; లేకపోతే కాదు.

మత్తయి 5:11 యేసు కోసం హింసించబడటం గురించి మాట్లాడుతుంది. మీరు యేసుక్రీస్తు శిష్యుడనే వాస్తవం గురించి మీరు మౌనంగా ఉంటే, మీరు మీ పనిచేసే చోట కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. బహుశా మీరు నీతిమంతులు కావచ్చు మరియు అది ఇతరులచే ప్రశంసించబడవచ్చు, కానీ మీరు పదోన్నతి పొందలేరని భయపడి యేసుక్రీస్తును రక్షణ మార్గంగా నమ్ముతున్నారనే వాస్తవం గురించి మీరు మౌనంగా ఉండవచ్చు. బహుశా మీరు మీ యజమానుల మాదిరిగానే క్రైస్తవులు కారని ఇతరులు నమ్మడానికి మీరు ఇష్టపడవచ్చు మరియు క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి సిగ్గుపడవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు మరియు బ్యాంకులలో క్రైస్తవులు కానివారు తమ అభిమాన విగ్రహం పోటోతో క్యాలెండర్‌ను వేలాడదీయడం నేను చూశాను, కానీ దేవుని వాక్యం ఉన్న క్యాలెండర్‌ను వేలాడదీయడానికి ఇష్టపడే క్రైస్తవుడిని మీరు కనుగొనడం చాలా అరుదు, ఇది అతను క్రైస్తవుడనే వాస్తవాన్ని ప్రకటిస్తుంది. ఎందుకంటే అతను తన గురించి ప్రజలు ఏమనుకుంటారో అని భయపడతాడు. "నా యజమాని దానిని చూసి నాకు పదోన్నతి రాకుండా అడ్డుకుంటాడా లేదా ఏదో ఒక విధంగా నన్ను వేధిస్తాడా?"

"నా కారణంగా హింసించబడే వారు ధన్యులు, నా గురించి సిగ్గుపడని వారు ధన్యులు." మీరు మీ పనిచేసే ప్రదేశంలో యేసు గురించి సిగ్గుపడుతున్నారా? మీరు బాహ్యంగా నీతిమంతులు అని గొప్పలు చెప్పుకోకండి ఎందుకంటే చాలా మంది క్రైస్తవేతరులు కూడా బాహ్యంగా నీతిమంతులు. దానికి మించి ఒక అడుగు ముందుకు వేయండి: "నేను క్రైస్తవుడిని. నేను యేసుక్రీస్తు శిష్యుడిని" అని ప్రకటించండి. మీరు దేవుని కొరకు మరియు ఆయన వాక్యము కొరకు నిలబడితే (కేవలం పనిచేసే ప్రదేశంలోనే కాదు, ఒక బోధకుడిగా కూడా దేవుని వాక్యంలో బోధించబడిన ప్రతిదాని కొరకు నిలబడితే), నేటి క్రైస్తవ గుంపులలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టాలని మీరు ఆసక్తిగా ఉంటే, మీరు సత్యం కొరకు నిలబడుతున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని అవమానిస్తారు, హింసిస్తారు మరియు మీ గురించి అన్ని రకాల చెడు కథలు చెబుతారు.

అలా జరిగినప్పుడు మీరు ఏమి చేయాలి? మనమీద మనం జాలిపడాలా? కానే కాదు! "సంతోషించండి మరియు ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ ప్రతిఫలం ఎక్కువవుతుంది" అని చెప్పబడింది (మత్తయి 5:12). మీరు భూమిపై ప్రతిఫలం పొందరు - మీరు హింసించబడి వెళ్లగొట్టబడవచ్చు - కానీ పరలోకంలో మీ ప్రతిఫలం గొప్పది ఎందుకంటే వారు మీ ముందు ఉన్న ప్రవక్తలందరినీ అలాగే హింసించారు. మీరు పాత నిబంధన ప్రవక్తలను చూస్తే, దేవుని నిజమైన ప్రవక్తలు హింసించబడ్డారని మీరు చూస్తారు. అయితే, వారు ఎదుర్కొన్న హింసలు ఎల్లప్పుడూ ప్రస్తావించబడలేదు. ఉదాహరణకు, ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని కఠినమైన మాటలు మాట్లాడిన యెషయా లాంటి వ్యక్తిని తీసుకోండి. అతను ఎలా చనిపోయాడో మనకు యెషయా పుస్తకంలో చెప్పబడలేదు, కానీ అతను ఖాళీ బోలు చెక్కదుంగ లోపల ఉంచి అతనికి శిక్షవిధించిన వారు అతన్ని రెండు ముక్కలుగా కోసారని చరిత్ర చెబుతుంది.

హెబ్రీయులు 11లో ప్రస్తావించబడిన రంపంతో కోయబడిన వ్యక్తులలో అతను ఒకడు. క్రీస్తు కోసం నిలబడే వారందరూ హింసించబడతారు. అపొస్తలుల కార్యములు 7లో ప్రధాన యాజకుల ముందు నిలబడి ఉన్నప్పుడు స్తెఫను తన సుదీర్ఘ సందేశం చివరలో జనసమూహాన్ని చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు: అపొస్తలుల కార్యములు 7:52లో అతను ఇలా అంటున్నాడు, "మీ పితరులు ఏ ప్రవక్తలను హింసించలేదు? నీతిమంతుడైన యేసు రాకను ముందుగా ప్రకటించిన వారిని మీ పితరులు చంపారు. ఇశ్రాయేలులోని ప్రవక్తలలో మీ పితరులు ఎవరిని హింసించలేదు? మీరు ఒకరి పేరు చెప్పగలరా?" స్టెఫను ఇశ్రాయేలు చరిత్రను వివరిస్తున్నాడు. అతను ఇశ్రాయేలు చరిత్రను అధ్యయనం చేశాడు మరియు ఇశ్రాయేలు మొత్తం చరిత్రలో హింసించబడని ఒక్క ప్రవక్త కూడా లేడని అతను నిర్ధారించాడు. పాత నిబంధనలో లేదా కొత్త నిబంధనలో నిజమైన ఏ ప్రవక్త కూడా ప్రజాదరణ పొందలేదు.

పాస్టర్లు ప్రజాదరణ పొందవచ్చు, సువార్తికులు ప్రజాదరణ పొందవచ్చు మరియు కొన్నిసార్లు అపొస్తలులు కూడా ప్రజాదరణ పొందవచ్చు. బోధకులు ఎక్కువగా ప్రజాదరణ పొందవచ్చు, కానీ ఒక ప్రవక్త దాదాపు ఎప్పుడూ ప్రజాదరణ పొందడు ఎందుకంటే అతను సంఘంలో లేదా ప్రజలలోని లోపాలను నిర్ధారించడానికి మరియు బహిర్గతం చేయడానికి వస్తాడు. వారు వినడానికి ఇష్టపడే వాటిని కాకుండా వారు వినవలసిన వాటిని మాట్లాడటానికి అతను సంఘంలోనికి వస్తాడు. దేవుని వాక్యంలో వారు విస్మరిస్తున్న విషయాలను అతను వారికి చూపిస్తాడు. వారి జీవితాల్లో దేవుని ప్రమాణాలకు వారు ఎక్కడ లోపిస్తున్నారో అతను వారికి చూపిస్తాడు, ఆపై అతను హింసించబడతాడు. అది నేటికీ జరుగుతుంది. యేసు తరపున నిలబడటం అంటే ఇదే, "నా నిమిత్తము మరియు నా వాక్యము నిమిత్తము". మీరు హింసించబడితే, మీరు ఆశీర్వదించబడతారు మరియు మిమ్మును చూచి అసూయపడేలా ఉంటారు. మరొక తర్జుమా ఇలా చెబుతోంది, "ఆనందంతో గంతులు వేయండి!" మీరు ప్రవక్తల అడుగుజాడల్లో మరియు యేసుక్రీస్తు అడుగుజాడల్లో ఉన్నందున మీరు ఉత్సాహంగా ఉండాలి