వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

క్రైస్తవ్యములోని మొదటి 300 సంవత్సరాలు, దాదాపు క్రైస్తవులందరు వారిని శ్రమలుపెట్టి మరియు వారిలో అనేక మందిని చంపిన క్రైస్తవవిరోధులైన పాలకులచేత పరిపాలింపబడిరి. దేవుడు తన గొప్ప జ్ఞానములో, తన మహిమార్థం తన పిల్లలను శ్రమపెట్టుటకు ప్రజలను అనుమతించాడు. ఈనాడు కూడా దేవుడు తన ప్రియమైన పిల్లలలో కొందరిని హింసించే ప్రభుత్వాల క్రింద ఉండేటట్లు దేవుడు అనుమతించుచున్నాడు. హింసింపబడిన ప్రతిసారి సంఘము బహుగా విస్తరించెను. కాని సంఘము సుఖసౌఖ్యముగా ఉండి, వస్తు వాహనములను సమృద్ధిగా పొందిన అనేక సందర్భాలలో లోకానుసారముగా మారెను. ఈ లోకములో జీవించుచున్నంత వరకు మనకు శ్రమలు, హింసలు మరియు పరీక్షలు కలుగును. కనుక మనము ఈ లోక అంతమునకు సమీపించే కొలది, మనము పనిచేసే స్థలములోగాని మరియు మన వ్యక్తిగత జీవితములోగాని సౌఖ్యముగా(సులభముగా) ఉంటుందని అనుకోకూడదు.

ఆర్థిక ఇబ్బందులు వచ్చును. కాబట్టి మనం సామాన్యముగా జీవించుట ఇప్పుడే నేర్చుకోవాలి. విలాసవంతముగా జీవించేవారికి, రాబోయే రోజులు కష్టముగా ఉండును. భవిష్యత్తులో మనము ఇతరులమీద ఆధారపడకుండా, డబ్బును పొదుపు చేసే విషయములో జ్ఞానం కలిగి ఉండాలి. అయినను మనం దేవుణ్ణే నమ్మెదముగాని మనం పొదుపు చేసిన డబ్బును నమ్మము. మన దేవుడు రోషము గలవాడు గనుక సృష్టించబడిన వాటిని మనం నమ్మునట్లు ఆయన ఎప్పటికి అనుమతించడు. సృష్టించబడిన వస్తువులను నమ్ముచున్నవారు కదిలించబడునట్లు, ఈ లోకములో ఉన్న ఆర్థిక వ్యవస్థలను దేవుడు కదిలించబోవుచున్నాడు. యేసుప్రభువు చెప్పిన రీతిగా, సహోదరుడు సహోదరునికి నమ్మకద్రోహము చేయుట మరియు మన కుటుంబీకులే మనకు శత్రువులగుటకు మనం చూచెదము(మత్తయి 10:21).

ఆఫీసులలోను, ఫ్యాక్టరీలలోను విశ్వాసులు హింసించబడుదురు. ఇవన్నియు మనను పవిత్రపరచి మరియు మంచి క్రైస్తవులుగా చేయును. మనం మంచి విషయములో ఆసక్తి కలిగియున్నట్లయితే మనకు ఎవరు హానిచేయరని 1పేతురు 3:13 చెప్పుచున్నది. కాబట్టి మనం దేవుని కృప ద్వారా, ప్రతి ఒక్కరికి మేలు చేయునట్లు నిర్ణయించుకొనెదము. మనను ద్వేషించువారిని ప్రేమించెదము, శపించువారిని దీవించెదము, బాధించువారి క్షమాపణను గూర్చి ప్రార్థన చేయుదము. అప్పుడు మనకు ఎవరును హానిచేయలేరు. సాతాను మరియు అతని యొక్క దూతలు మనను మోసం చేయవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, వేధించవచ్చు, దోచుకొనవచ్చు, గాయపరచవచ్చు, జైళ్ళలో పెట్టవచ్చును మరియు చివరకు మనలను చంపవచ్చును. కాని ఆత్మీయముగా వారు మనకు ఎటువంటి హాని చేయలేరు.

రాబోయే రోజులలో విశ్వాసమును బట్టి కలిగే హింసలన్నిటి కొరకు, ప్రపంచములోని క్రైస్తవులను మనము సిద్ధపరచాలి. ఆ రోజుల కొరకు ప్రభువు మనకు నాలుగు ఆజ్ఞలను ఇచ్చాడు.

1. "మనము పాములవలె వివేకులము మరియు పావురములవలె నిష్కపటులమై ఉండవలెను " (మత్తయి 10:16).

మనం సాక్ష్యము చెప్పునప్పుడు బుద్ధిహీనులమై ఉండక జ్ఞానము కలిగియుండాలి. మనము జీవించే స్థలంలోను మరియు మనము పనిచేసే స్థలంలోను మన జీవితములే క్రీస్తును ప్రకటించాలి. మనం ప్రభువు కొరకు సాక్ష్యము చెప్పినప్పుడు, ఇతర మతములకంటె క్రైస్తవమతము గొప్పదని కాక యేసుప్రభువు అనే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నామని స్పష్టపరచాలి. యేసుప్రభువు ఎత్తబడినప్పుడు ఆయన తనవైపుకు అనేకులను ఆకర్షించును (యోహను 12:32). క్రైస్తవ్యము యెడల, ఆసక్తి ఉన్నట్లుగా నటించి మరియు మనము చెప్పిన కొన్ని మాటలను బట్టి నిందించుచు మరియు బలవంతముగా మతమార్పిడి చేయుచున్నామని చెప్పి, కోర్టుకు తీసుకు వెళ్లాలని కోరే క్రైస్తవులు కానివారియెడల మనము జాగ్రత్తగా ఉండవలెను. కాబట్టి యేసుప్రభువువలె మనం జ్ఞానమును మరియు ప్రేమను కలిగియుండాలి:

(a) "యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు." (యోహాను 2:24,25). మనం ప్రతి ఒక్కరిని వివేచించవలెను.

(b) "యూదయలోని యూదులు ఆయనను చంపవలెనని కోరుచున్నారు గనుక అక్కడికి వెళ్ళుటకు యేసుప్రభువు ఇష్టపడలేదు" (యోహాను 7:1). అనవసరమైన అపాయమును మనము తప్పించుకోవాలి.

(c) "మిమ్మును హింసించు వారికొరకు ప్రార్ధన చేయుడి" (మత్తయి 5:44). ప్రజలయెడల మంచివాడవై యుండుము. ఇతరులు చెడ్డవారు గనుక నీవు చెడ్డవానిగా మారకు.

2. "దేవుని నోటిలోనుండి వచ్చు ప్రతి మాటవలన జీవించుము"(మత్తయి 4:4).

మనం హింసించబడుచున్న సమయములలో, దేవుడు మన హృదయములతో మాట్లాడుచున్న మాటలను మనం వినుట ఎంతో ప్రాముఖ్యమైది. మనం రోజంతయు దేవుని నుండి వినే అలవాటును అభివృద్ధి చేసుకొనవలెను. దేవుని నుండి విన్న మాటలను మనం విశ్వసించి లోబడాలి. లేనట్లయితే, దానికి విలువ ఉండదు. దేవుని వాక్యమును (ప్రత్యేకముగా క్రొత్త నిబంధనను) ఎక్కువగా ధ్యానించవలెను. అప్పుడు మాత్రమే దేవుని స్వరమును మనం వివేచించగలము. ఆపై మనం నమ్మి లోబడాలి.

3. "నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను.మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగల వారైనయెడల దీనినిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు"(యోహాను 13:34,35).

మన యింటిలోను మరియు మన సంఘములలోను, ఒకరిని ఒకరు తీర్పు తీర్చుటయు, ఒకరి మీద ఒకరు కొండెములు మరియు చాడీలు చెప్పుటయు, ఒకరిమీద ఒకరు పోట్లాడుటయు మరియు ఒకరిని ఒకరు అనుమానించుటయు పూర్తిగా ఆపివేయవలెను. వివేచన దైవస్వభావము, అనుమానించుట సాతాను స్వభావము. మన జీవితములలోను పాపముమీద మరియు సాతానుమీద పోరాడుట గురించి దృష్టిపెట్టే సమయమిది. మన భాగస్వాములను మరియు మన సహవిశ్వాసులను ప్రేమించుటను చురుగ్గా కొనసాగించాల్సిన సమయమిది.

4. "లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించియున్నాను"(యోహాను 16:33).

దేవుడు సింహాసనాసీనుడైయున్నాడు మరియు ఆయన తన వారిని ఎన్నటికిని విడిచిపెట్టడు. రెండువేల సంవత్సరాల క్రితం సాతాను ఓడించబడియున్నాడు. మనం దేవుని కనుగుడ్డుగా ఉన్నాము కాబట్టి ఆయన మన చుట్టూ అగ్నిప్రాకారముగా ఉన్నాడు (జెకర్యా 2:5,8). మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు (యెషయా 54:17). కాబట్టి మనం, "ధనాపేక్షలేనివారమై కలిగిన వాటితో తృప్తి పొందియుండెదము, ఎందుకనగా 'నిన్ను ఏమాత్రమును విడువను. నిన్ను ఎన్నడును ఎడబాయను'" అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి "ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?"(హెబ్రీ 13:5,6) అని ధైర్యముతో చెప్పుదుము.

"యేసుప్రభువా, త్వరగా రమ్ము" (ప్రకటన 22:20) అని కూడా ప్రార్ధించెదము.