దీనత్వము :
ఎఫెసీయులకు 4:1-3 లో "కాబట్టి...ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను" అని చదువుతాము. క్రైస్తవజీవితంలోని మూడు రహస్యముల గురించి అప్పుడప్పుడు నేను చెపుతుంటాను. అవి దీనత్వము, దీనత్వము మరియు దీనత్వము. ఇక్కడే సమస్తము ఆరంభమవుతుంది. ప్రభువైన యేసు తన్నుతాను తగ్గించుకొని మరియు మత్తయి 11:29లో ఇలా అన్నారు, "నేను సాత్వీకుడను, దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి". దీనత్వము మరియు సాత్వీకము అను రెండు విషయములలో మాత్రమే ప్రభువు తన యొద్దనుండి మనలను నేర్చుకోనమని అన్నారు. ఎందుకని? ఎందుకనగా ఆదాము పిల్లలముగా మనము అందరమును గర్విష్టులమును మరియు కఠినులమైయున్నాము. కాబట్టి ఈ భూమి మీద పరలోక జీవితాన్ని చూపించాలి అంటే, అది సువార్త చెప్పుటద్వారా గాని, ప్రసంగించుటద్వారా గాని, బైబిలు బోధించుటద్వారా గాని, సమాజసేవ చేయుటద్వారా గాని కాదు. మొదటిగా దీనత్వము, సాత్వీకముతో కూడిన వైఖరి ద్వారానే వ్యక్తపరచబడుతుంది. దేవుడు దీనత్వము, దీర్ఘశాంతము మరియు సాత్వీకము కొరకు చూస్తున్నాడు. ఎఫెసీ 4:2(లివింగ్ బైబిల్)లో "ప్రేమతో ఒకరి తప్పిదములు మరొకరు సహించవలెనని" చెప్పబడింది. ఏ సంఘములోనైనను ఎవరును పరిపూర్ణులు కాదు. ప్రతిఒక్కరు పొరపాట్లు చేస్తారు. కాబట్టి సంఘములో ఒకరి పొరపాట్లు ఒకరు క్షమించుకుంటూ ఒకరినొకరు సహించాలి. మనము ఒకరినొకరము ప్రేమించుచున్నాము కనుక ఇతరుల పొరపాట్లను సహించాలి. "నీవు పొరపాటు చేసినట్లయితే నేను దానిని కప్పుతాను. నీవు ఏదైనను చేయకుండా విడిచిపెట్టినట్లయితే, దానిని నేను చేస్తాను". క్రీస్తు శరీరమైన సంఘము ఆవిధంగా పనిచేస్తుంది.
ఐక్యత :
ఎఫెసీ 4:1లో "మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనటయందు శ్రద్ధకలిగిన వారై..". పౌలు యొక్క చాలా పత్రికలలో మనము ఏకమై ఐక్యత కలిగియుండాలనునది ముఖ్యమైన అంశమైయున్నది. ఆయన సంఘము విషయంలో కూడా ప్రభువు ఆ భారాన్ని కలిగియున్నాడు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని శరీరము విడిపోయి కుళ్ళిపోతుంది. మన శరీరము దుమ్ముతో చేయబడింది మరియు మన శరీరములో ఉన్న జీవముచేత దుమ్ము (మట్టి) పదార్థములన్నిటిని కలిపి ఏకముగా చేయబడుతుంది. ప్రాణం పోయినప్పుడు శరీరమంతయు విడిపోతుంది మరియు తరువాత కొంతకాలానికి అది మరల దుమ్ముగా మారిపోతుంది. అలాగే విశ్వాసుల సహవాసములో కూడా ఉంటుంది. స్థానిక సంఘములో సహోదరుల మధ్య ఐక్యతలేనప్పుడు, నిశ్చయముగా ఆ సంఘములోనికి మరణం వచ్చిందని చెప్పవచ్చును. భార్యభర్తల మధ్య ఐక్యతలేనప్పుడు, వారు విడాకులు తీసుకొనకపోయినప్పటికీ మరణం ప్రవేశించినట్లవుతుంది. వివాహమైన మరుసటి రోజునుండి అపార్థముల ద్వారా ఉద్రేకముల ద్వారా పొట్లాటల ద్వారా విడిపోవుట ఆరంభమవ్వవచ్చును. సంఘములో కూడా ఆవిధంగా జరుగవచ్చును. ప్రభువు దేహముగా సంఘము పవిత్రముగా కట్టబడాలనే ఆసక్తి కలిగిన ఇద్దరు లేక ముగ్గురు సహోదరులతో సంఘ నిర్మాణము ఆరంభమవ్వవచ్చును. ఐక్యత లేకపోవుట వలన త్వరలోనే అక్కడ మరణం రావచ్చును. వివాహములోను మరియు సంఘములోను పరిశుద్ధాత్ముడు మనలో కలిగించే ఐక్యతను కాపాడుకొనుటకు పోరాడాలి.
స్వతంత్రంగా(ఎవరికి వారే) ఉండే పరిశుద్ధులను దేవుడు నిర్మించడంలేదు. ఆయన ఒక దేహాన్ని నిర్మిస్తున్నాడు. దీనినే పౌలు ఎఫెసీ 4:1-3లో చెప్పుచున్నాడు. "అది ఒకే శరీరమైయున్నది కనుక పరిశుద్ధాత్మ మనలో అంతకంతకు కలుగజేసే ఐక్యతను కాపాడుకొనమని" పౌలు చెప్పుచున్నాడు. ఒక స్థానిక సంఘములో ఐక్యత ఉన్నదని ఎప్పుడు చెప్పగలము? "సమాధానమనే బంధాన్ని బట్టి చెప్పగలము" (ఎఫెసీ 4:1). ఆత్మానుసారమైన మనస్సే సమాధానమైయున్నది (రోమా 8:6).