లూకా 17:21-30 వచనములలో నోవాహు మరియు లోతు దినములలో వలెనే ప్రజలు తినుచు, త్రాగుచూ, అమ్ముచు, కొనుచు, నారునాటుచు మరియు ఇండ్లు కట్టుచు కడవరి దినములలో ఉందురని ప్రభువైనయేసు చెప్పారు. వీటిలో ఏదియు పాపము కాదని మీరు గుర్తించియున్నారా? అవన్నియు చేయదగినవే. అయితే ప్రభువైనయేసు ఎందుకు అవి అపాయకరమైన దినములని అంటున్నాడు? ఎందుకంటే ప్రజలు దేవుని కొరకు కొంచెం కూడా సమయము లేకుండునట్లు వారు ఇట్టి పనులలో నిమగ్నమైయుంటారు. ఆ విధముగా ప్రజల జీవితములలో నుండి దేవుణ్ణి పూర్తిగా లేకుండా చేయుటలో సాతాను జయించాడు. అయితే ఎల్లప్పుడు జరిగినట్లు చివరికిది పతనానికి మరియు భష్టత్వానికి నడిపించును.
ఇటువంటి వైఖరి గలవారి జీవితములలో ఆ విధముగానే జరుగుచున్నట్లు ఈ లోకములో ఇప్పుడు కూడా మనము చూచుచున్నాము. ప్రార్ధించుటకు సమయము లేనంతగా స్త్రీ, పురుషులు చాలా పని కలిగియుంటున్నారు. నీ జీవితమును పరీక్షించుకొని, నీ జీవితములో ఇది నిజామో కాదో చూడుము. విశ్వాసి హృదయములోనికి లోకపుఆత్మ వచ్చింది. మన పితరులకు అందుబాటులో లేని సమయాన్ని పొదుపుచేసే అనేక యంత్రాలను ఇప్పుడు కలిగియున్నను, మనుష్యులకు సమయము సరిపోవుటలేదు. ఆ కాలములో వారు కాలినడకన మరియు జంతువుల మీద ప్రయాణించేవారు. అయితే ఈనాడు విమానములోను, కారులోను మరియు రైలులోను ప్రయాణించవచ్చును. ఆ కాలములో ఇంటిలో పనిచేసుకొనుటకు చాలా సమయం పట్టేది కాని ఇప్పుడు యంత్రముల సహాయముతో చాలా తక్కువ సమయములో చేయవచ్చును. అయినను ఇప్పటి ప్రజలకంటే, ఆ కాలములో ప్రజలే ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపేవారు. ఎందుకని? ఎందుకంటే వారి ప్రాధాన్యతలు సరిగా ఉన్నవి. వారు మొదటివాటిని మొదటిగా ఉంచేవారు.
మనము ప్రభువుకు ఫలభరితమైన సాక్షులముగా ఉండాలంటే, ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఉండి ప్రభువు స్వరాన్ని వినాలి. ప్రతిరోజు దేవుని నుండి వినే అలవాటు లేని అనేకులు ఈనాడు బోధకులు కావాలనే కోరికను కలిగియున్నారు. అందువలన దేవుని వాక్యము చాలాకొరతగా ఉన్నది మరియు కేవలము మనుష్యులు తమ హృదయములోనుండి మాట్లాడెదరు. "దేవుని వాక్యము ఇతనితో ఉన్నది" (2 రాజులు 3:12) అని ఈనాడు కొంతమంది బోధకుల గూర్చి మాత్రమే చెప్పగలము. అయితే ఇది బైబిలులో ఉన్న ప్రతి దేవుని సేవకుని యొక్క లక్షణమైయున్నది. దేవుడు చేప్పే దానిని ఎవరైతే ఆయన దగ్గర నుండి వినరో, వారు వ్యక్తిగతముగా గాని లేక కూటాలలోగాని మాట్లాడకూడదు. "మోషే దేవుని సన్నిధికి వెళ్ళి వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞపించిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెనని" వ్రాయబడింది (నిర్గమకాండము 34:34). దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తేనే అతడు వర్ధిల్లుతాడని" యెహోషువాకు చెప్పబడింది (యెహోషువ 1:8). సమూయేలు కూడా దేవునియొద్ద సహనముతో కనిపెట్టిన తరువాత మాట్లాడెనని చెప్పబడింది. అందువలన "అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు" (I సమూయేలు 3:19).
శిష్యులు వినునట్లుగా తాను వినుటకై ఆయన ప్రతి ఉదయమున తనకు వినుబుద్ది పుట్టించియున్నాడని ప్రభువైనయేసును గూర్చియెషయా 50:4లో చెప్పబడింది. దాని ఫలితమేమిటంటే, అదేవచనములో చెప్పిన రీతిగా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిఒక్కరి అవసరానికి సరిపడే వాక్యము ఆయన దగ్గర ఉండేది. ఆయన నిజముగా తండ్రియొక్క పరిపూర్ణమైన నోరుగా ఉండి యున్నాడు. ప్రభువైనయేసే ప్రతిదినము తండ్రి స్వరాన్ని వినవలసియుంటే, అది మనకు మరిఎంత అవసరము? ఇది మనము చేయలేనట్లయితే, దేవుని వాక్యాన్ని (జీవాన్ని) ఇతరులుకు సరిగా పరిచర్య చేయలేము. మనకు శిష్యులు వినునట్లుగా వినే చెవులు ఉంటే తప్ప శిష్యునికి తగిన నోటిని కలిగియుండలేము. "ఈ విషయాన్ని" అనేకులు అశ్రద్ద చేయుటవలనగాని లేక నిర్లక్ష్యము చేయుటవలనగాని బోధకులైయుండవలసిన వారు ఆత్మీయ పసిబిడ్డలవలె ఉన్నారు.
దేవుని నుండి వినుట అంటే కేవలము బైబిలు చదువటముకాదు. బైబిలును మాములుగా చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని నుండి వినుట అనగా దానికంటే శ్రేష్టమైనది. దేవుని వాక్యాన్ని మనము పొందుకొని, మన అనుభవముగా మారి, దేవుని సందేశాన్ని పొందుకొనేవరకు ధ్యానించాలి. అప్పుడే మన మనసులు మారి రూపంతరపరచబడి క్రీస్తుయొక్క మనస్సు మనలో ఏర్పడేవరకు వృద్ధిపొందును. కాని బైబిలు చదివే వారనేకులు ఈ విధముగా వాక్యాన్ని ధ్యానించటాన్ని నేర్చుకోలేదు.
మరియ, ప్రభువైనయేసు పాదములయొద్ద కూర్చొన్న వాక్యభాగమునుండి మూడు ఆత్మీయ సత్యములను నేర్చుకొనవచ్చును.
నడచుట, పరిగెత్తుట మరియు నిలుచొనుటకు వేరుగా కూర్చోనుట అనునది ప్రభువులో ఉన్న విశ్రాంతికి సూచనగా ఉన్నది. అనగా మనము దేవుని స్వరాన్ని వినాలంటే, మన హృదయములు విశ్రాంతిలో ఉండాలి మరియు మన మనస్సులు ప్రశాంతముగా ఉండాలి. ఒప్పుకొనని పాపము మనలో పరిపూర్ణ విశ్రాంతి లేకుండా చేస్తుంది మరియు విస్తారమైన పనులు, ధనమోసము మనస్సులో నెమ్మది లేకుండా చేయును. మనము చింత లేక భయము కలిగియుండి, మంచి మనస్సాక్షి లేకుండా దేవుని మెల్లనైన స్వరాన్ని ఎట్లు వినగలము? కీర్తన 46:10 ప్రకారము దేవుని తెలుసుకోవాలంటే ఆయనయొద్ద కనిపెట్టాలి. ప్రభువు యొక్క పాదముల దగ్గర కూర్చోనుట దీనత్వాన్ని చూపిస్తుంది. ప్రభువు కూర్చున్నట్లు ఆమె కూర్చీలో కూర్చోలేదు కాని క్రింద కూర్చున్నది. తీర్పుదినమందు తప్ప గర్విష్టియైన మనిషితో దేవుడు మాట్లాడడు. ఆయితే ఆయన యెదుట పసిబిడ్డలవలే తగ్గించుకొను వారితో ఆయన మాట్లాడి మరియు వారికి కృపనిచ్చును (మత్తయి 11:25).
మరియవలే కూర్చొనుట లోబడుటను చూపిస్తుంది. ఇది యజమానుని యెదుట శిష్యుని యొక్క వైఖరి. దేవుని వాక్యానికి విధేయత చూపుటయే లోబడుటను బయలుపరుస్తుంది. కేవలము తెలుసుకొనవలెనననే కోరికను తీర్చుటకుగాని లేక వర్తమానమిచ్చుటకుగాని దేవుడు తన వాక్యములో మాట్లాడలేదు. వాక్యము ఆయన హృదయ వాంఛను వ్యక్తపరుస్తుంది. మనము విధేయులమగుటకు ఆయన మాట్లాడును. ఎవరైతే ఆయన చిత్తము చొప్పున చేయాలని నిశ్చయించుకుంటారో వారే వాక్యాన్ని గ్రహిస్తారని ప్రభువు చెప్పారు (యెహాను 7:17).
దేవుడు తన వాక్యము ద్వారా తమతో మాట్లాడాలని ప్రార్ధించకుండా చాలామంది క్రైస్తవులు అనేక నెలలు మరియు సంవత్సరములు బైబిలు చదువుతారు. వారు దానితోనే తృప్తిపడతారు. నీవు దేవుని స్వరాన్ని ప్రతిరోజు వింటున్నావా? లేనట్లతే దానికి కారణమేమిటి? వినే వారితోనే ఆయన మాట్లాడతాడు. మీ ఆత్మీయ చెవులను అభ్యంతరపరుస్తున్నదేమిటి? విశ్రాంతిని, నెమ్మదిని కలిగియుడకుండుటయా, దీనాత్మ లేకపోవుటయా లేక ఆయన బయలుపరచిన దానికి లోబడక పోవుటయా? లేక నీకు కొంచెం కూడా ఆసక్తి లేదా? దానికి కారణమేదైనప్పటికీ సమూయేలులాగా ప్రార్ధించండి. "ప్రభువా! నీ సేవకునితో మాట్లడుము". అప్పుడు దేవుడు ఒక్కసారిగా దానిని బాగుచేస్తాడు. అప్పుడు బైబిలు తెరచి వాక్యము చదివి దానినే ప్రార్ధనగా చేయండి. నీవుకూడా ఆయన స్వరాన్ని వింటావు.