"అ యినను ఏవేవి లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ముఖ్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగుపడు నిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణవిషయములో సమానానుభవము గలవాడనై; ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో యెరుగునిమిత్తమును, సమస్తమును నష్టపరచు కొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితిననియైనను నేను అనుకొనుట లేదు గాని, దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టుబడితినో దాని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను.
"సహోదరులారా! నేను ఇదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను" (ఫిలి 4:7-14).
అపోస్తలుడు వ్రాసిన ఈ వచనములు ఏదో యౌవ్వన ఉద్రేకముతోను, ఆతురతతోను వ్రాసిన వచనములు కావని ముందు మనము జ్ఞాపకముంచుకొనవలసిన విషయమై యున్నది.
పౌలు మార్పు పొంది ముప్పై సంవత్సరములైయున్నది. ఆ సంవత్సరాలన్నిటిలోను అనేక సంఘములను స్థాపించడానికి, సూచకక్రియల ద్వారాను, మహాత్కార్యముల ద్వారాను తన సేవ, బలమైన సాక్ష్యముగా ఉండుటకు దేవుడు పౌలును వాడుకొనియున్నాడు. మొదట పౌలు తన సువార్త సేవలో అపరిమితముగా గడిపియున్నాడు. అపాయకరమైన ప్రయాణములెన్నో చేసియున్నాడు. ఎన్నో కష్టనష్టములు సహించెను. తన ప్రభువు పోలికగా తాను ఎదిగి పాపముపై విజయము యొక్క సత్యమును తెలిసికొనియున్నాడు. అతనికున్న సంతోషాలన్నిటిలోను సాటిలేని ఓ మహత్తరానుభవము కూడా ఉన్నది. అదేమిటనగా, సహజాతీతమైన ఆత్మీయ సత్యాల సంబంధాల్ని స్వీకరించడానికి మూడవఆకాశమునకు కొనిపోబడెను.
అయినప్పటికిని చివరిగా పౌలు చెప్పేదేమిటంటే తనజీవితము కొరకు దేవుడు ఉద్దేశించినవన్నీ పొందలేదని చెప్పుచున్నాడు. అన్నికాలాములలోకి గొప్పక్రైస్తవుడుగావున్నవాడే యింకా చివరి గమ్యాన్ని చేరేవరకు సాగిపోవుట అవసరమని చెప్పుచున్నాడు. అయ్యో! చాలామంది విశ్వాసుల జీవితాలు రక్షణతో ప్రారంభించి నూతనజన్మతో మురిసిపోతున్నాయి. అంతటితో దేవుని తీర్పు తప్పించుకొనగలమని నమ్మకముతో ఉండెదరు. అపోస్తలులుగా పిలువబడినవారుగాని, లేక పౌలువలె ఉండగోరి యేసు ప్రభువుకు నిజమైన శిష్యులుగా ఉండగోరువారెవరైనను ఈవిధముగా తలంచరు.
యేసుప్రభువు ఒక ఉద్దేశ్యము కలిగియుండి అతడిని పట్టుకొనియున్నాడని, పౌలుకు యేసు ప్రభువుపై ఉన్న స్థిరమైన విశ్వాసమును గురించి ఈ వాక్యభాగములో చెప్పుచున్నాడు. ఏమైనప్పటికి ఆ ఉద్దేశ్యాన్ని పట్టుకొనుటకు నిశ్చయించుకొనియున్నాడు. ప్రభువు మనలను మార్చివేసి, నరకం నుండి పరలోకానికి చేర్చడమే కాకుండా ఇంకెంతో అతీతమైన ఉద్దేశ్యము కలిగిఉండడము అనునది ఎంతోగంభీరమైన సత్యమైయున్నది. పరిపూర్ణతగల పౌలు అలసిపోనటువంటి తన ముప్పైసంవత్సరముల క్రైస్తవసేవ తుది సమయములో ఈవిధముగా చెప్పుచున్నాడు. నేను ఇంకా ఆ దేవుని ఉద్దేశ్యమును నా జీవితములో పరిపూర్ణము చేయలేదు. దేవునిఉద్దేశ్యమును నా జీవితములో పరిపూర్ణము చేయడానికి ఎంతో శ్రమపడుచున్నాను. ఈ పరిపూర్ణుడైన పౌలే ఈ విధముగా చెప్పియుండగా ఆ దైవోద్దేశ్యము అనునది ఎంత అతీతమైనదో కదా!
ఈ వాక్య భాగములోనే పౌలు ఇంకా ముందుకు సాగిపోవుచున్నాడు. దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చడమనే సర్వోత్కృష్టమైనవిషయమును, లోకములో ఉన్న అమూల్యమైన విషయములతో పోల్చుకొని వాటిని పెంటగాను, అయోగ్యముగాను ఎంచుకొనెను.
ఈ లోకములో ఉన్నవాటన్నిటికంటే ఆ పరలోకబహుమానమే మహా విలువైనదిగా అభిప్రాయపడుచున్నాడు. మన చుట్టుప్రక్కల మరియు మనప్రాంగణములలో ఉన్న విశ్వాసులను చూసినచో వారు లోకసంపదలను ఆశిస్తూ, నిలువరముకాని లోకసంబంధమైన వాటిని హత్తుకొంటూ దేవునివిషయములకంటే వీటికే వారిజీవితములలో ప్రధమస్థానాన్ని ఇచ్చుచున్నారు.
వీరి క్రైస్తత్వము, పౌలు క్రైస్తత్వము నుండి బహుదూరముగా వేరుచేయబడినదని తీర్మానించుటకు మనము బలవంతము చేయబడుచున్నాము. జీవితభీమా పథకములాంటి పథకముగా రక్షణఅనునది కేవలము అగ్ని జ్వాలలనుండి తప్పించుకోవడమే అని తలంచినట్లయితే అది కేవలం మనఆత్మీయ పసితనానికి చిహ్నము. మనము ఆత్మీయముగా పరిపూర్ణత పొందినపుడు నిత్యత్వమునుండి ప్రతిఒక్కరి కొరకు, తాను ముందే ఏర్పాటుచేసిన మార్గములో అనుదినము నడవడానికే దేవుడు మనలను రక్షించెనని తెలుసుకొనవలెను (ఎఫెసీ. 2:10) .
ఆ మార్గమే తనజీవితము కొరకైన దేవుని ఉద్దేశ్యము అని పౌలు పిలిచియున్నాడు. ఆయన కృపను పొందికొని తృప్తిపడినట్లయితే, మన జీవితములలో ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడకపోయినట్లయితే, ఎంత క్షుణ్ణంగా సువార్త తెలిసినవారమైనా, జీవితకాలమంతయు దేవునికి శాస్వతముగా నిలుచునది ఏ ఒక్కటీ నెరవేర్చకుండానే ఉండెదము. ఏదో ఒక విధముగా దేవుని సత్యవాక్యవిషయమైన అనుభవజ్ఞానము కలిగిఉండకుండా ఈ లోక నాయకుడైన అపవాది మనుష్యుల మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగచేయుచున్నాడు (2 కొరింథీ 4:4).
ఒకవేళ విశ్వాసులు దీనికిగాని లొంగకపోయినట్లయితే విశ్వాసులైనవారియెడల దేవునికి ఉన్న ఉద్దేశ్యము అనే సత్యమును గ్రహించకుండా గ్రుడ్డితనము కలిగించడానికి అపవాది మరొక ఏర్పాటుచేయును. చాలావరకు సాతాను ఈ విషయంలోనే జయము పొందియున్నాడు. నిజమైనవిశ్వాసులై ఉండి కూడా తమజీవితములలో దేవుని చిత్తమును తెలిసికొననివాళ్ళు వేలకొలది ఉన్నారు. ఫిలిప్పీపత్రికలో ఈ భాగమందు క్రైస్తవజీవితము ఒకే ఒక దానిమీద సక్రమముగా ముందుకు సాగిపోవలెనని చెప్పబడియున్నది. ఈలోకములో ఆత్మీయఅభివృద్ది ఎంతో సంపాదించవలసిన అత్యవసరాన్ని మరచిపోరాదు. ఎల్లప్పుడు ఎదుగుచు ఉండవలెను. ఎందుకనగా చాలామంది విశ్వాసుల జీవితములలో జీవముగల సాక్ష్యము లేకపోవడముచేత, ఈ పాఠమును నిర్లక్ష్యము చేశియున్నారు. ఇలాంటి విశ్వాసులసాక్ష్యము ఎప్పుడో ఒకసారి జరిగిన సువార్తకూటములలో ఒక ధన్యకరమైన దినమును, బహుశా చెయ్యిపైకెత్తి లేక తీర్మానపత్రముపై సంతకము చేసిన తీర్మానముతోనో సంబంధము కలిగిఉండును. ఇది చాలా అద్భుతమైనదే. కాని అప్పటినుండి ఎటువంటి మార్పులేదు (సామెతలు 24:30-34).
రక్షణపొందిన తరువాత విరామము తీసికొనిన మనుష్యునిస్థితి, ముండ్లపొదలు మొలచి, నిష్ప్రయోజనమైన తోటతో పోల్చి వర్ణించవచ్చు. ఈ తోటకు నిత్యము త్రవ్వకము కావలెను. కలుపు మొక్కలు గాని, దూలగొండి చెట్లు గాని, పనికిరానిది ఏది మొలవకుండా నిత్యము జాగ్రత్త తీసుకొనవలెను. అదేవిధముగా మానవుని ఆత్మీయజీవితాన్ని గురించి జాగ్రత్త వహించాలి.
ఒకప్పుడు మెథడిస్ట్ సాక్ష కూటములు జరిగాయి. అవి ప్రారంభించి వారమురోజులైనతరువాతకూడా, ఎవ్వరు ఏ సాక్ష్యము చెప్పలేదు. అప్పుడు జాన్వెస్లీ అనే భక్తుడు ఈలాగు చెప్పెను. ఈ ఏడు దినములల్లోను యేసుప్రభువు మీలో ఎవ్వరితోను మాట్లాడినట్లు చెప్పడానికి ఏ ఆధారము లేనట్లయితే మీరందరును వెనక్కి దిగజారిపోయిన వారుగా తలంచుకొనుడని చెప్పెను.
అటువంటిపరీక్షకు మనలో ఎంతమంది నిలబడగలము? అటువంటి కూటములలో మనము మూతి ముడుచుకొని, మౌనముగా కూర్చుంటున్నామా? 13, 14 వచనాల్లో పౌలు మాటలను గమనించుడి. “అయితే ఒకటి చేయుచున్నాను వెనుక నున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కల్గు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను”.
క్రైస్తవునికి ఇక్కడ మరొక ఆధిక్యతఉన్నది. దేవుని ఉద్దేశ్యాన్ని అర్ధము చేసికొని దానిని పొందడానికి సాగిపోవడము అనునది గొప్పవిషయము. ప్రతి నిజమైన దేవునిబిడ్డ తన జీవితములో ఈ దైవోద్దేశ్యాన్ని చేపట్టవలెను.