హగ్గయి 1:7,8 లో దేవునిమందిరము(సంఘము)ను పూర్తిచేయుటకు ప్రజలను బ్రతిమాలుచున్నాడు. అనేక సం||ల క్రితమే పునాది వేయబడినది. కాని వారు అంతటితో ఆపియున్నారు.
ఒక గోపురము కట్టింపగోరి పునాదివేసి, కొనసాగింపలేని వాని గురించి ప్రభువైనయేసు లూకా 14:28-30 లో చెప్పారు. తనకు శిష్యుడుగా ఉండుట గురించి ప్రభువు చెప్పిన సందర్భములో ప్రభువు ఈ ఉపమానము చెప్పియున్నారు. పునాదివేసి మందిరమును కట్టకుండుటను, సువార్త చెప్పుట ద్వారా ఇతరులను రక్షణలోనికి నడిపించి వారిని శిష్యులుగా మార్చకుండుటతో ప్రభువు పోల్చియున్నారు. పునాది అవసరమేనా? అవును తప్పకుండా పునాది అవసరము. ఒక మందిరమును కట్టునప్పుడు మొదటిగా పునాది వేయబడును. మనము ఇతరులను రక్షణలోనికి నడిపించి మరియు వారు శిష్యులుగా మారనియెడల - అది ఎలా ఉంటుందనగా కేవలము పునాదివేసి, మందిరము కట్టనట్టుగా ఉంటుంది.
హెబ్రీ 6:1-2లో ఈలాగు హెచ్చరించబడియున్నాము: "కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు,హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము". ఇదంతయు పునాదియైయున్నది. మనము ఆత్మసంబంధమైన మందిరము(సంఘము)గా కట్టబడుటకు సంపూర్ణలమగుటకు సాగిపోవాలి. సువార్త ద్వారా ఇతరులను క్రీస్తుయొద్దకు నడిపించిన తరువాత వారు క్రీస్తును వెంబడించే శిష్యులుగా మారి, సంపూర్ణునులగునట్లుగా వారిని మనము ప్రోత్సహించాలి.
కాబట్టి పునాదివేయుట గురించి హగ్గయి చెప్పుటలేదు. సంపూర్ణులమగుట గురించి అనగా క్రీస్తు శరీరముగా, ఆత్మీయమందిరముగా కట్టబడుటయైయున్నది. ఒక సమాజమునకు మరియు జీవముగల దేవునిమందిరమునకు భేదమేమిటి? సువార్తీకరణ అనగా రాళ్లగని నుండి 50వేల రాళ్లను కొట్టి, మందిరము కట్టు స్థలమునకు తెచ్చుటయైయున్నది. ఈ రాళ్లు నూతనజన్మను పొంది సజీవమైన రాళ్లుగా మారిన ప్రజలకు సాదృశ్యముగా ఉన్నవి. కాని వారు ఇంకా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడలేదు. వారు కేవలము సజీవమైన రాళ్లుగా(కుప్పగా) ఉన్నారు. ఈనాడు వీరు సౌవార్తిక సమాజములుగా ఉన్నారు. వీరు క్రీస్తుశరీరముగా వ్యక్తపరచబడుటకు వారు ఒకరికిఒకరు అవయవములవలె అతుకబడి మందిరముగా కట్టబడాలి. వారందరినీ దేవుని మందిరముగా కట్టుట, కష్టమైనపని.
ఈనాడు అనేక సంఘములు కేవలము సమాజములుగా ఉన్నవి. ఆ "రాళ్లను" ఎవరూ ఎత్తుకొని పోకుండా ఒక మనష్యుడు(పాస్టరు) కావలివానిగా ఉంటాడు. ఆ "రాళ్లలో" ఒకరు తాను మరియెక్కువగా ఆత్మీయసహయము పొందునట్లు వేరే సంఘమునకు వెళ్ళినయెడల, ఆ కావలివాడు తన "సజీవమైన రాళ్లను" వేరే వారు దొంగిలించియున్నారని ఫిర్యాదుచేస్తాడు. కాని అతడు ఆ రాయిని మందిరములో యిమిడ్చి కట్టినట్లయితే, దానిని దొంగలించుటకు ఎవరికైనను అసాధ్యము. నీవు క్రీస్తు శరీరమును కట్టినయెడల, ఇతరులు నీ సభ్యులను దొంగిలించెదరన్న భయము నీలో ఉండదు. రాళ్లకు పైన, క్రింద, కుడిప్రక్కన, ఎడమప్రక్కన వేరే రాళ్లను అమర్చి, అతికించినయెడల, వాటిని ఎవరు దొంగలించగలరు?
నేను 1975 సం||ము నుండి బెంగుళూరులో సంఘమును నడిపించాను. కాని మా సంఘమునుండి ఎవరినైనను ఇతరులు దొంగలించారని నేనెప్పుడైనను ఫిర్యాదు చేయలేదు. క్రీస్తుశరీరములో అవయవములవలె మనము కట్టబడినయెడల, అప్పుడు ఎవరైనను మనలను దొంగలించలేరు. కాబట్టి మనము కేవలము పునాదివేసి అనగా సజీవమైన రాళ్లను కుప్పగా సమకూర్చటమే కాకుండా, వారిని దేవుని మందిరముగా కట్టెదము గాక.
హగ్గయి 1:9-11 లో ప్రభువు ఇచ్చిన గద్దింపును గమనించెదము. ప్రేమతో గద్దించుటను ఎరిగిన బోధకుల అవసరము ఈనాడు సంఘములలో ఎంతో ఉన్నది. ఈనాడు విస్తారమైన బోధ ఉన్నదికాని కొద్దిగా మాత్రమే దిద్దుబాటు చేయుట మరియు గద్దించుట ఉన్నవి. నీ జీవితములో నీవు ఎల్లప్పుడు ఓడిపోవునట్లుగా దేవుడు అనుమతించినట్లయితే నీవు నెమ్మదిగా దేవుడు నీతో ఏమిచెప్పుటకు ప్రయత్నించుచున్నాడో దానిని వినుటకు ప్రయత్నించుము. నిన్ను నీవు ఈలాగు ప్రశ్నించుకొనుము. నా జీవితములో ఆత్మఫలమెందుకు లేదు? నా కుటుంబ జీవితమెందుకు గందరగోళముగా ఉన్నది? పరలోకము నుండి నామీద వర్షమెందుకులేదు? నా జీవితము ఎందుకు ఎండినదిగా ఉన్నది (హగ్గయి 1:9-11). బహుశా నీకు ప్రభువుతో నడచుటకంటే, ఎక్కువగా భూసంబంధమైన విషయాలు మరియు నీ బ్యాంకులో ఉన్న డబ్బు గురించి ఎక్కువగా నీవు చింతిస్తుండవచ్చును.
అప్పుడు జెరుబ్బాబెలును మరియు ప్రధానయాజకుడగు యెహోషువయును హగ్గయి వర్తమానము విని ఈలాగు స్పందించారు. "వెంటనే మేము దేవుని మందిరము కట్టుటను ఆరంభించెదము". సాదృశ్యముగా ఇట్లన్నారు, "మేము సువార్తీకరణ చేయుటయే కాక ఇతరులను శిష్యులనుగా కూడా చేయుదుము. ఒకమనిషిమీద ఆధారపడే సంఘముకాకుండా క్రీస్తుశరీరమనే సంఘమును కట్టుదుము". సంఘము ఒక పనిచేసే శరీరముగా ఉన్నది గాని లెబోలెటరీ(ల్యాబ్)లో విడివిడిగా ఉండి, ఒకదానితో ఒకటి సంబంధము లేకుండా ఉన్న చేతులు, కాళ్ళు, కళ్ళు మరియు ముక్కులాగా ఉండదు. ఈ అవయవములు ఏవికూడా జీవముతో గూడిన సంబంధములేనివిగా ఉన్నవి. గనుక ఆ అవయవములు కలసి పనిచేయలేవు. ఈనాడు అనేక సంఘములు అలాగే ఉన్నాయి.